Wednesday, December 30, 2009

శాంభవి కేసు లో మేము సాధించిన విజయం

Great news in child Sambhavi case where she was projecred as a goddess.The Chairperson Human Rights Commission  Justice Subhashan reddy  reserved judgment for 4 days but has said Usha Rani   has lied and sambhavi's rights have been violeted,she has been exploited in the name of spirituality and he also said Usha rani tried to take advantage of Potuluri veerabrahmendra swamyis supposed predictions.Ths judge also said that he will order the child to be sent to school and the collector will be asked to ensure this.

Wednesday, December 9, 2009

యాసిడ్‌ ఆయుధంగా మారిన వేళ మన కర్తవ్యమేంటి?

డిశంబరు 13 దగ్గరకొస్తోంది. ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ గుండెల్లో అలజడి.. వెన్నులోంచి జరజరాపాకి మెదడును కంపింపచేసిన ఉద్వేగం. వరంగల్‌లో స్వప్నిక, ప్రణీతల మీద యాసిడ్‌ దాడి జరిగిన రోజు. యావత్తు ఆంధ్రరాష్ట్రం నివ్వెరపోయిన రోజు. ఎన్నో స్వప్నాలతో ఇంజనీరింగు వరకు ఎదిగి, యాసిడ్‌కి బలైన స్వప్నిక గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిల్లని నయనం ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కానే కాదు. ఒక సామూహిక దు:ఖం అందర్ని కమ్ముకున్న సందర్భం. ఆనాటి అరాచక, అమానుష దాడికి సాక్షిగా తన రూపాన్ని కోల్పోయి, గుండె నిబ్బరంతో అనూషలాంటి తనలాంటి బాధితులకు ఆత్మవిశ్వాసం కల్గిస్తున్న ప్రణీత మన కళ్ళెదుట తిరుగుతూ మనకి కర్తవ్యబోధ చేస్తూనే వుంది. సభ్య సమాజం, పౌర సమాజం ఈ విషయమై ఏం చెయ్యాలో చెప్పక చెబుతూనే వుంది. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది? యాసిడ్‌ దాడులు తగ్గాయా? స్వప్నిక మీద దాడి చేసిన ముగ్గురు యువకుల్ని ఎన్‌కౌంటర్‌ చేసేసి చేతులు దులిపేసుకున్న పోలీసులు మరిన్ని యాసిడ్‌ దాడులు జరక్కుండా చర్యలేమైనా తీసుకున్నారా? ఎన్‌కౌంటర్‌లో నిందితుల్ని చంపేయడంవల్ల ఈ దాడులేమైనా తగ్గిపోయాయా? లేదు. తగ్గలేదు. మరింత పెరిగాయి. ఈ రోజు యాసిడ్‌ ప్రేమోన్మాదులకే కాదు స్త్రీల మీద దాడి చెయ్యడానికి ఆయుధంగా మారిన వైనం మనం గమనించొచ్చు.

నిన్నటికి నిన్న ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ (నిజమాబాద్‌లో) తన భార్య మీద యాసిడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రెండో పెళ్ళి చేసుకుని మొదటి భార్య మనోవర్తి అడిగినందుకు అతను ఈ దాడికి తెగబడ్డాడు. ‘రక్షకభటులే’ యాసిడ్‌ను ఆయుధంగా వాడ్డం మొదలుపెడితే స్త్రీలు రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి? వరంగల్‌ ఘటన తర్వాత మన రాష్ట్రంలో వరుసగా ఎన్నో దాడులు జరిగాయి. ఒక్క గుంటూరులోనే ఏడు యాసిడ్‌ దాడులు జరిగాయి. నిజానికి ఈ దాడులు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితమవ్వలేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13 యాసిడ్‌ దాడుల కేసులు, ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇవి రోజు రోజుకూ పెరిగే దిశలోనే వున్నాయిగాని తగ్గడం లేదు.

యాసిడ్‌ దాడి జరిగిన తర్వాత ఆ స్త్రీల పరిస్థితి గురించి, వారి మానసిక వేదన, శారీరక వైకల్యం గురించి ఎవరూ ఆలోచిస్తున్న దాఖలాలు కనపడ్డం లేదు. ఒక్కసారిగా జీవితం తల్లకిందులైపోయి, ఉన్నరూపం కోల్పోయి, కాలిన గాయాల మచ్చలే తోడుగా మిగిలిపోతున్న బాధితుల బాధాతృప్త హృదయాలకు ఊరటనందించే లేపనాలేమీ మనమివ్వడం లేదు. వారి మానసిక ఘర్షణ, షాక్‌, తీవ్రమైన వత్తిడిని గురించి పట్టించుకోవడం లేదు. ఘటన జరిగిన వెంటనే పెను సంచలనం సృష్టించి, హడావుడి చేసే ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా ఆ తర్వాత మహామౌనంలోకి జారిపోతోంది.ఘటనానంతరం బాధితురాలికి అన్ని విధాలా అండగా వుండాల్సిన ప్రభుత్వం నియమాల, నిర్లక్ష్యాల చట్రంలో ఇరుక్కు పోతుంది. ‘చట్టం తన పని’ తాను చేసుకుంటూ పోతుంది’ లాంటి చవకబారు ప్రకటనలతో కాలం గడుపుతుంది. అందువల్లనే కదా ప్రణీత దాతల దయాదాక్షిణ్యాల మీద తన వైద్యం చేయించుకోవలసి వస్తోంది. బాధితులను నూటికి నూరు శాతం ఆర్ధికంగా, సామాజికంగా, వైద్యపరంగా ఆదుకోవలసిన బాధ్యత నిర్ద్వంద్వంగా ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఆ పని చెయ్యనపుడు సభ్య సమాజం ప్రభుత్వం మీద వత్తిడి తేవాల్సిన అవసరం వుంది. రాజమండ్రిలో అనూష ప్రేమ పేరిట జరిగిన దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి, మెడ మీది నరాల్ని కోల్పోయి నిస్సహాయంగా పరాయివాళ్ళ పంచన బతుకుతున్న వైనాన్ని ఒక ఛానల్‌ ఇరవై నాలుగు గంటలపాటు చూపించినా బండబారిన మన చర్మాలు, ఘనత వహించిన ప్రభుత్వం వారి చర్మాలు ఒకింత కూడా చలించలేదు. ఇదెంత బాధాకరం? ఇదెంత దు:ఖ కారకం?

యాసిడ్‌ దాడుల నివారణ కోసం ప్రభుత్వం ఒక ముసాయిదా తయారు చేసిందని, నేడో రేపో ఆర్డినెన్స్‌ రాబోతుందని వార్తలొస్తున్నాయి. మంచిదే. స్త్రీల మీద హింసల్ని నిరోధించడానికి ఒక దాని తర్వాత ఒకటి చట్టాలు చేసుకుంటూ పోదాం. మరింత కఠినమైన శిక్షలు ప్రవేశపెట్టుకుందాం. ఎన్‌కౌంటర్లు చేసి చంపేయ్యాలని, మరణశిక్షలు వేసి వీళ్ళని ఏరెయ్యాలని కూడా చాలామంది సెలవిస్తున్నారు. కొత్త చట్టాలు తేవడం ద్వారాను, కఠినమైన శిక్షల్ని అమలు పరచడం ద్వారాను స్త్రీలపై దాడుల్ని, హింసల్ని అరికట్టలేమని చరిత్ర చెబుతూనే వుంది. కొత్త చట్టాన్ని చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అమలులో ప్రదర్శించే నిర్లక్ష్యం సంగతేంటి? గృహహింస నిరోధక చట్టం 2005, వచ్చి మూడేళ్ళయిపోయింది. ఈ చట్టం వల్ల గృహహింస తగ్గిపోయిందా? తగ్గలేదు సరి కదా ఎక్కువైంది. దీనిక్కారణం చట్టం గురించిన ప్రచారలోపం, అమలులో నిర్లక్ష్యం, జుడీషియరీ నిరాసక్తత. అమలులో చిత్తశుద్ధి లోపిస్తే ఎన్ని కొత్త చట్టాలొచ్చి లాభామేంటి??

అలాగని చట్టాలే వొద్దని అనడం లేదు. కఠినంగా శిక్షించే చట్టంతో పాటు, స్త్రీల పరంగా శిలాసదృశ్యంగా, మహాకఠినంగా మారిపోతున్న మానసిక స్థితి, దృక్పధాల మాటేంటి? కత్తులతో కుత్తుకలు కోయడం, యాసిడ్‌తో శరీరాన్ని దహించేయడం, కిరోసిన్‌ మంటల్లో కాల్చేయడంలాంటి శారీరక హింసలు, ఈటెల్లాంటి మాటలు, చర్యలతో మనసును మెలిపెట్టే, మానసికంగా కుంగదీసే మానసిక హింసల్ని అంతంచేసే చర్యలేవీ మనం చేపట్టడం లేదు. హింస స్త్రీల మనశ్శరీరాలను ఎలా ఛిద్రం చేస్తుందో తెలియచెప్పే పాఠాలని మనం తరగతి గదుల్లోగానీ, తల్లిదండ్రుల మాటల్లోగానీ వినడం లేదు. కత్తులదాడిలో మెడలు తెగి రక్తం స్రవిస్తున్న దుర్మార్గవార్తని ఓ ఛానల్‌ ”కోతల సీజన్‌” అని వ్యాఖ్యానించగలిగిందంటే మీడియా ఈ అంశమై ఎంత మొద్దుబారిపోయిందో అర్ధమౌతోంది కదా! మరి మనమేం చెయ్యాలి?

సంస్కారవంతమైన చదువులు, విలువలతో కూడిన సాహిత్యం, మానవీయ కోణాలని ఆవిష్కరించగలిగిన మీడియా, తక్షణం స్పందించే పరిపాలన, సత్వర న్యాయమివ్వగలిగిన న్యాయవ్యవస్థ ఈనాటి తక్షణావసరం. వీటన్నింటి గురించి గొంతు విప్పే సివిల్‌ సొసైటీ కావాలిప్పుడు. అన్నింటిని మించి అహరహమూ స్త్రీని అణిచివేసి, ఆమె మానవ హక్కుల్ని కాలరాస్తున్న పితృస్వామ్య భావజాలం మీద మనమందరం మన బాణాలనెక్కుపెట్టాలి. అది మాట ద్వారానా, పాట ద్వారానా, సాహిత్యం ద్వారానా, చదువు ద్వారానా, ఉద్యమం ద్వారానా, ఉక్కు లాగా చెక్కు చెదరని ఐక్య ఆచరణ ద్వారానా అన్నది ఎవరి సంస్కారాన్ని బట్టి, ఎవరి దృక్పధాల్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన సమయమిది.

Sunday, November 29, 2009

భూమిక ఆధ్వర్యంలో మహిళలపై యాసిడ్ దాడుల మీద ఒక రోజు సదస్సు

Online edition of India's National Newspaper
Sunday, Nov 29, 2009 The Hindu

‘Sure punishment works better’

Meet on prevention of acid attacks on women comes up with recommendations

Bhumika Women’s Collective and Oxfam India organise day-long meeting

The recommendations will be forwarded to Home Minister P. Sabitha Indra Reddy

HYDERABAD: Fast track courts to expedite cases, compensation to victims through the Collector within stipulated time, special fund for immediate financial help, timely treatment to the victim, cancellation of recognition to the educational institutions that do not constitute committees against sexual harassment, and laws against the gender harassment to be included in the school curriculum are some of the recommendations by the Bhumika Women’s Collective in view of the amendments proposed to the Indian Penal Code as part of the A.P. Criminal Law (Amendment) Act, 2009 to curb acid attacks on women.

The organisation, along with Oxfam India, organised a daylong meeting on ‘Prevention of acid attacks on women’ here on Saturday.

The recommendations resulted from group discussions on the proposed changes to the Act, and the modalities of care and support for survivors.

A sure punishment works better than a stringent punishment, the recommendations read.

Compensation


They also found fault with the proposed link between the compensation and the progress of the case in the court.

The recommendations will be forwarded to the Home Minister P. Sabitha Indra Reddy, said M. Satyavathi from Bhumika.

Vidya Prasad, former Secretary of Legal Services Authority, while making concluding remarks, felt that a comprehensive legislation to curb violence against women on the lines of Domestic Violence Act, with provisions for rehabilitation, and economic and employment support could work better than the proposed amendments to IPC.

Inspector General of Police (CID) S. Umapathi suggested that the recommendations, along with rehabilitation measures may be included in a government order instead of formulating a special legislation.

Fine


Amendments to the IPC propose, among others, a fine between Rs.2 lakh and Rs. 5 lakh for grievous hurt by fire, heated substance acid, or explosive substance, imprisonment of seven years or more, and immediate interim compensation to be paid to the victim.

Saturday, November 21, 2009

శాంభవి ఉండాల్సింది గుడి లో కాదు బడిలో


శాంభవిని గుడి నుంచి రక్షించి బడిలో చేర్చాలని మానవ హక్కుల కమీషన్ ని కోరిన వార్తను మీరంతా టివీల్లో,పేపర్లలో చూసే ఉంటారు. ఇవిగో ఆ ఫోటోలు

Friday, November 6, 2009

వందేళ్ళయినా వన్నెతగ్గని కొ.కు రచనలు

భూమిక November 2009

1980-81 మధ్యకాలం. నేను పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న రోజులు. దిల్‌సుక్‌నగర్‌లో రూ. 150 లకు అద్దె ఇంట్లో వుంటూ రోజూ ఓ కిలోమీటర్‌ నడిచి, బస్సు డిపోకి వచ్చి, ఓ అరగంట క్యూలో నిలబడి, ఆర్‌టిసి బస్సులో సీటు సంపాదించి ఆఫీసుకెళ్ళేదాన్ని. ఓ రోజు విశాలాంధ్ర పుస్తకాల షాపుకెళ్ళి కొ.కు పుస్తకాలు కొన్నాను. ఆ సంకలనంలోని ఓ చిన్న గల్పిక నా మీద పెను ప్రభావాన్ని చూపింది. దాని పేరేమిటో నాకిపుడు గుర్తు లేదు. అందులో ఆఫీసులకి బస్సుల మీద వెళ్లే వాళ్ళ మీద ఆయన ఇలా రాస్తారు. ”పది పదిహేను నిమిషాల బస్సు ప్రయాణానికి సీటు కోసం ఈ ఉద్యోగస్తులు అరగంట ముందొచ్చి క్యూలో నిలబడతారు. అదో అలవాటుగా చేసేస్తారు గాని, ఆ అరగంట బస్సులో నిలబడిపోదామని ఆలోచించరు. పడీ పడీ, ఇంట్లో వాళ్ళని తొందర పెట్టి వచ్చి క్యూలో నిలబడతారు. కాళ్ళు పీక్కుతున్నా క్యూలోంచి కదలరు”. ఆ గల్పికలో ఇలా అర్ధం వచ్చేట్టు వుంటుంది. ఈ చిన్న గల్పిక చదివిన తర్వాత నేను ఏ రోజూ క్యూలో నిలబడలేదు. ఆ మూసని తోసిరాజని రద్దీ బస్సుల్లో ఎక్కడంటే అక్కడ, ఆఖరికి ఫుట్‌బోర్డింగు కూడా చేసేదాన్ని. మనుష్యులు ఒక యాంత్రికతకి ఎలా అలవాటు పడిపోయారో, కొత్త దారుల్ని వెతక్కుండా ఎలా దానిలోనే కొట్టుకు పోతుంటారో ఈ బుల్లి గల్పికలో చెప్పిన కొకు రచనల్ని ఎంతో ఇష్టంగా, ప్రేమగా చదవడం మొదలుపెట్టాను. కొ.కు శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మీద ప్రత్యేక సంచిక తేవాలనే ఆలోచన మొదలైన దగ్గర నుండి ఈ గల్పిక నాకు పదే పదే గుర్తుకు రాసాగింది.
ఈ ప్రత్యేక సంచికకు బీజం పడింది శ్రీకాకుళంలో. ఆగష్టు పదహారున కేంద్ర సాహిత్య అకాడమీ, కథానిలయం సంయుక్తంగా కొ.కు రచనల మీద సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో నేను వైజాగులో వున్నాను. నాయుడుపేట నుంచి ప్రతిమ ఫోన్‌ చేసి శ్రీకాకుళం మీటింగుకి వెళుతున్నావా అని అడగడం, ఆవిషయం నాకు తెలియదని చెప్పడంతో, తనే వివరాలన్నీ చెప్పింది. శ్రీకాకుళం వెళ్ళాలనే తపన మొదలైంది. అప్పటికీి టైమ్‌ ఎనిమిది. మీటింగు 10 కి. నేనేమో ఒక అవసరమైన వ్యక్తిగత పని మీద వైజాగులో వున్నాను. ఇంకేమీ ఆలోచించలేదు. టాక్సీి తెప్పించుకుని అప్పటికప్పుడు బయలుదేరి ఆ సమావేశానికి వెళ్ళాను. సింగమనేని నారాయణగారు, కాళీపట్నం రామారావు మాస్టారు, చాగంటి తులసి ఇంకా ఎందరినో కలిసాను. రామమోహనరాయ్‌గారు ‘కొ. కు చారిత్రక దృక్పధం” మీద అద్భుతమైన ప్రసంగం చేసారు.నేను టాక్సీ మీద ఖర్చు చేసిన రెండున్న వేలు ఈ సమావేశంలో పాల్గొన్న ఆనందం ముందు ఎందుకూ కొరగానివయ్యాయి. అంతే కాదు కొ.కు మీద నేనెందుకు భూమిక ప్రత్యేక సంచిక వెయ్యకూడదు. వేసి తీరాలి అనే నిర్ణయానికి రావడం జరిగింది.
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఉదయమే శాంతసుందరిగారికి ఫోన్‌ చేసి, కొ. కు గారి ప్రత్యేక సంచిక తీసుకొద్దాం. మీరు సహసంపాదకురాలిగా బాధ్యత తీసుకుంటారా? అని అడిగిందే తడవు ఆవిడ ఒప్పుకోవడం, ప్రత్యేక సంచికకి రూపకల్పనా జరిగిపోయాయి. ఆవిడ వెంటనే రచనల సేకరణ పని మొదలు పెట్టేసారు. నిజానికి ఈ ప్రత్యేక సంచిక వెనుక కృషింతా శాంతగారిదే. అందరికీ ఫోన్‌లు చేసి మాట్లాడటం, వాళ్ళ వెంటబడి రచనలు రప్పించడం అంతా ఆవిడే చేసారు. ఆవిడ ఒప్పుకోక పోయి వుంటే అసలు ఈ ప్రత్యేక సంచిక సాధ్యమయ్యేది కాదు. ఆవిడకి ‘థాంక్స్‌’లాంటి పడికట్టు పదాలతో కృతజ్ఞతలు తెలపడం నా కిష్టం లేదు. స్నేహంలో ఇలాంటి పదాలు ఇమడవు. ఇక కొ.కు.గారి రచనలకు సంబంధించి వివిధ కోణాలు ఈ సంచికలో ఆవిషృతమయ్యాయనే నేను భావిస్తున్నాను. ఈ అన్ని కోణాలను ఒకేసారి చదివే ‘అదృష్టం’ (దీనికేదైనా ప్రత్యామ్నాయ పదం వెదకాలి) నాకు కలగడం నన్ను ఆనందోద్వేగాల్లో ముంచేసింది. వందేళ్ళ క్రితం పుట్టిన ఈ మనిషికి ఇంత విశాల దృక్పధం, శాస్త్రీయ భావజాలం అన్నింటిని మించి స్త్రీ సమస్య మీద ఇంత సంస్కారవంతమైన ఆలోచనలు ఎలా వంటబడ్డాయి? అక్టోబరు 28న అంటే నేను ఈ ఎడిటోరియల్‌ రాస్తున్న రోజుకు సరిగ్గా వందేళ్ళ ముందు ఆయన పుట్టారు.
”ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన తెలుగు సాహిత్య పరిణామం విషయంలో కొ.కు కొంత కాలం ద్రష్టగాను, ఆ తరువాత స్రష్టగాను కూడా పని చేసారు. ముఖ్యంగా రాయప్రోలు అభినవ కవితకు, కృష్ణశాస్త్రి భావకవితకు కొ.కు ద్రష్ట. శ్రీ శ్రీ కంటే కాస్త ముందు పుట్టినా కొ.కు భావ కవితా ప్రవాహంలో దూకలేదు. శ్రీ శ్రీ దూకి తిరిగి ఒడ్డుకెక్కి తన త్రోవ తాను చూసుకొంటున్న కాలందాకా కొ.కు ప్రపంచాన్ని చూస్తూ, తెలుసుకుంటూ, చదువు , ఆలోచించుకుంటూ వచ్చాడు. చలం సాహిత్యం కొ.కును ఎంతగానో ఆలోచనలకు, కలవరానికి గురి చేసింది. ” అంటుంది కాత్యాయనీ విద్మహే కొ.కు వాజ్మయ జీవితం గురించిన వ్యాసంలో.
గురజాడ, శ్రీశ్రీ, చలం, వీరేశలింగంలాంటి వారి ఆలోచనాధోరణి యువకుడైన కొ.కు మీద బలంగానే వుండింది. ఆ తరువాత దాస్‌ కాపిటల్‌ చదవడంతో కొ.కు కు మార్కి ్సస్టు ప్రాపంచిక దృక్పధం ఏర్పడడం, అభ్యుదయ రచయితల సంఘంలో భాగస్వామి కావడం జరిగాయి. ఉద్యోగాల వేటలో ఊళ్ళు తిరుగుతూ, వివిధ ఉద్యోగాలు చేయడంతో విస్తృతమైన జీవితానుభవం సంపాదించాడు. భిన్నమైన అనుభవాలను పొందాడు. ఈ అనుభవాలన్నింటిని విశ్లేషించుకుంటూ వాటినన్నింటిని తన రచనల్లో పొందుపరిచాడు. అసంఖ్యాకంగా వ్యాసాలు, కథలూ రాస్తూ పోయాడు. నిజానికి ఒక్క కవిత్వం తప్ప ఆయన రాయని ఆధునిక సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు.
ఆయన రచనల్లోని సూటిదనం, వ్యంగ్యం, నిర్మోహమాటం పాఠకుల గుండెలకు నేరుగా తాకుతాయి. మారదలుచుకున్న వాళ్ళకు చుక్కానిలాగా పనిచేస్తాయి. బండబారిన వాళ్ళకు కొరడా దెబ్బల్లా తాకుతాయి. మన సాహిత్యం అనే వ్యాసంలో ”ఆత్మగౌరవం కల జాతి తన కళలను ఎంతో అభిమానంతో చూసుకుంటుంది. మన కళల మీద మనకున్న అభిమానం చూస్తే మనకు ఆత్మగౌరవం ఏమీ లేదని స్పష్టమౌతుంది” అంటారు.
స్త్రీల మానసిక సంఘర్షణలను, ఆనాటి సమాజంలో స్త్రీలు పడుతున్న ఆగచాట్లను చాలా ఆర్తితో, గుండెలోతుల్లోంచి కొ. కు. రాయడం కన్పిస్తుంది. ‘ఆడజన్మ’ నవల్లో ”నువ్వు మా జీతం లేని నౌకరువు. నీది ఇరవై నాలుగ్గంటల నౌకరీ, శలవుల్లేవు నీకు, ఫిించను లేదు. నువ్వు చేతులు మారినా నీ నౌకరీ మారదు.” అంటారు. ఇంకోచోట ”నీకు ఆత్మజ్ఞానం లేకుండా, చదువూ విజ్ఞానమూ లేకుండా చేసి ఉంచింది దేనికనుకున్నావు. నీకు అడుగడుగునా అంకుశాలు దేనికనుకున్నావు? నిన్ను అబలగాను నీ కీర్తి లేత తమలపాకులకంటే సుకుమారంగానూ, నీ మార్గం కంటక భూయిష్టంగాను, నీ జీవితం ఒక అంతులేని అగ్ని పరీక్షగాను ఉంచింది దేనికనుకున్నావు” అంటారు కోపస్వరంతో. అలాగే సౖౖెరంధ్రి కథలో జానకి పాత్ర చిత్రణ, ఆ పాత్రను మలిచిన తీరు అమోఘం. ”నాలుగేళ్ళ భరించాను. ఇక చాలనిపించింది. ఒక రోజు చెప్పేసాను. నన్ను మీరు మెదడులేని ఆడగాడిద అనుకుంటున్నారో, ఊరందరితోను రంకు పోగల సాహసికురాలిననుకుంటున్నారో నాకు తెలియడం లేదు. నేను చిన్నతనంలో కుర్రాళ్ళతో మొగుడూ, పెళ్ళాం ఆటలు ఆడినదాన్నే” అంటూ మొగుడి ముఖంతోపాటు సమాజ ముఖాన్ని ఫెెడేల్మని తన్నినట్లు సమాధానం చెప్పింది. ‘యావజ్జీవ స్నేహం’ అనే అందమైన వాక్యాన్ని ఈ కధలోనే రాసారు.
అలాగే 1955 లో రాసిన ‘దాలిగుంటలో కుక్కలు’ ఆశయాలు వల్లిస్తూ, తనవరకు వస్తే ఆచరణలో ముఖం చాటేసే వాళ్ళ గురించిన కథ. సమ్మె చేస్తున్న ఒక కథలోని కూలీల పట్ల సానుభూతి వర్షం కురిపించి ”యజమానులను చంపినా పాపం లేదు” అంటూ రంకెలు పెట్టె మనుష్యులు, తమ బంధువుల పొలంలో పనిచేసే కూలీలు సమ్మె కడితే ”కూలీ లంజా కొడుకులు సమ్మె చేస్తున్నారు.” అంటూ విరుచుకు పడుతూ ”పోలీసుల్ని పిలిపించి, పికెటింగు చేసేవాళ్ళని మిల్లు ముందు నుంచి వెళ్ళగొట్టించి, కొత్త కూలీల్ని తెచ్చుకోలేకపోయావా” అంటూ సలహాలిస్తారు. ఒకటిన్నర పేజీల ఈ కథలో ఆశయాలకి, ఆచరణకి మధ్య వున్న అగాధాన్ని, మనుష్యులు ఎంత తేలికగా ఆశయాలు వల్లించి తనదాకా వస్తే ఎలా జారిపోతారో అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది.
చివరగా ‘ఆడ బ్రతుకే మధురం’ కధలోని ఓ పదునైన వాక్యంతో నేను ముగిస్తాను. 1947లో రాసిన ఈ చిన్న కథ ఆనాటి స్త్రీలకే కాదు ఈనాటి స్త్రీలకి కర్తవ్య బోధ చేయడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ని మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయే. ఎవరు పడతారమ్మా దెబ్బలూ, తిట్లూను.” చిన్నపిల్ల అంతరంగంలోంచి వుబికి వచ్చిన ఈ మాటలు, తిట్లూ, తన్నులూ తింటూ హింసాయుత జీవితాల్లో మగ్గుతున్న ఈనాటి స్త్రీల చెవిన పడితే ఎంత బావుండు.
ఆత్మగౌరవాన్ని ప్రోది చేసే, ఆత్మవిశ్వాసాన్ని అంతరంగం నిండా నింపే కొ.కు రచనలు ఈనాటి సమాజానికి ఎంత అవసరమో ఆయన రచనల్ని మళ్ళీ చదువుతున్నపుడు మరింతగా అర్ధమైంది. కొ.కు ప్రత్యేక సంచికను తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.
మా ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ, ఈ సంచిక రూపకల్పనలో, రచనలు సేకరణలో సహకరించిన సహసంపాదకురాలు శాంతసుందరికి అభినందనలు చెబుతూ అలాగే విరసం ప్రచురించిన సంకలనాల్లోంచి కొన్ని రచనలను పునర్ముృదించుకోవడానికి అంగీకరించిన కృష్ణాబాయిగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్‌వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రత్యేక సంచికపై స్పందించాల్సిందిగా పాఠకుల్ని అభ్యర్ధిస్తూ…

Tuesday, October 20, 2009

''బెల్‌ బజావో''-గంటకొట్టండి


కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3' నివేదిక ప్రకటించింది. ఈ రిపోర్టు వెల్లడించిన కొన్ని అంశాలు -ముఖ్యంగా దేశంలో గృహహింస బాధిత స్త్రీల సంఖ్యను చూస్తే చాలా బాధాకరంగా, ప్రమాదకరంగా వుంది. నిరక్షరాస్యత, అభివృద్ధి లేమికి ొమారుపేరైన బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. బీహార్‌లో 50 శాతం మందికి పైగా నిత్యం భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే -3 నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి. బీహార్‌లో 59 శాతం మంది కుటుంబ హింసకు గురవుతున్నారు. 19 శాతం మంది లైంగిక హింసకు బలవుతున్నారు.
మహిళలపై గృహహింసలో జాతీయ సగటు 37శాతం
ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే 14శాతం మంది భౌతిక హింస, 35 శాతం మంది లైంగిక హింసను అనుభవిస్తున్నారు.
గృహహింసలో అగ్రస్థానం బీహార్‌ అయితే అట్టడుగు స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ (6%)వుంది. నిరక్షరాస్యతకు, హింసకు దగ్గర సంబంధముందని ఈ నివేదిక పేర్కొంటూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న పురుషులలో 60శాతం మంది అక్షర జ్ఞానం లేనివారేనని తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంొటూ స్త్రీలు బతుకులు వెళ్ళదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. కోట్ల సంఖ్యలో స్త్రీలు, గృహహింసనుండి రక్షణ చట్టం వచ్చిన తరువాత కూడా హింసకు గురవ్వడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతాయె అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో అగ్రస్థానం సంపాదించిన బీహార్‌లో ఈ రోజుకీ రక్షణాధికారుల నియామకం జరగలేదు. గృహహింస చట్టం అమలు చేయమని, రక్షణాధికారులను నియమించమని ఒక న్యాయవాది శృతిసింగు పాట్నా హైకోర్ట్‌లో ప్రజా ప్రయెజనాల వ్యాజ్యం దాఖలు చెయ్యల్సి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో వుంది. వివిధ ఎన్‌.జి.వోలు ఈ చట్టం అమలు విషయమై పట్టుదలతో పనిచేయడంవల్ల పూర్తిస్థాయి రక్షణాధికారుల నియమకం జరిగింది. బాధిత స్త్రీలు వీరి ద్వారా కోర్టులో కేసులు వేయగలుగుతున్నారు. హింసాయుత జీవితాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టం గురించిన అవగాహన, చైతన్యం ఇంకా చాలా మందికి లేదు. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్నయితే తెచ్చింది కానీ ఎలాటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేపట్టి వుంటే కొంతమంది మహిళలైనా చట్ట సహాయంతో హింసాయుత బతుకుల్లోంచి బయటపడగలిగేవారు.
నిజానికి భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కన్నా గృహహింస వల్ల ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికీ హెచ్‌ఐవి నిరోధక ప్రచారం కోసం ప్రభుత్వాలు కోట్లాది రపాయలు ఖర్చు చేస్తున్నాయి. గృహహింస అంశాన్ని ప్రభుత్వం హెచ్‌ఐవి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేయల్సి వుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రచారం ప్రారంభమౌతున్న సూచనలు కన్పించడం సంతోషదాయకం. అలాంటి ఒక ప్రచారానికి సంబంధించినదే ''బెల్‌ బజావో'' కార్యక్రమం. నాకు తెలిసి మొట్ట మొదటి సారిగా కేంద్ర శిశు సంక్షేమశాఖ, బ్రేక్‌ త్ర అనే అంతర్జాతీయంగా పనిచేసే ొమానవ హక్కుల సంస్థ కలిసి బెల్‌ బజావో ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టాయి.
ఈ ప్రోగ్రామ్‌ కింద రెండు వీడియెలను వీరు రూపొందించారు. వీటి ద్వారా గృహహింస మీద మౌనంగా వుండొద్దు అని చెప్పదలిచారు. ముఖ్యంగా ఈ రెండు వీడియెలు బాలురను, పురుషులను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఒక దానిలో ఒక మొహల్లాలో క్రికెట్‌ ఆడుకుంటున్న మగపిల్లలు, ఒక ఇంట్లో భర్త తలుపులు మూసి భార్యను కొట్టడం, ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఏడ్వడం వింటారు. వెంటనే వారు ఆట ఆపేసి, ఆ ఇంటికెళ్ళి, కాలింగు బెల్‌ కొడతారు. హింసిస్తున్న భర్త బయటకొచ్చి ఏంటి అని అడుగుతారు. బాల్‌ పడింది మీ ఇంట్లో అంటారు పిల్లలు. నిజానికి బాల్‌ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. అప్పటికి ఆ ఇంట్లో హింస ఆగుతుంది. ఇంకో వీడియెలో పక్కింట్లో, భార్యను కొడుతున్న భర్త, బిగ్గరగా ఏడుస్తున్న భార్య. పక్కింటాయన లేచి వెళ్ళి బెల్‌ కొట్టి కొన్ని పాలు ఇస్తారా అని అడుగుతాడు. భర్త లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కూడా అప్పటికి తాత్కాలికంగా హింస ఆగుతుంది.
ఈ చిన్న వీడియెలు అందిస్తున్న సందేశం అద్భుతంగా వుంది. ఇంతకాలం గృహహింస అనేది వ్యక్తిగత వ్యవహారమని, బయటవాళ్ళు కల్గించుకూడదనే అపోహని ఇవి బద్దలు కొట్టాయి. ముఖ్యంగా పురుషుల్ని, మగపిల్లల్ని చైతన్యవంతం చేయడం ద్వారా గృహహంసను ఆపొచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. గృహ హింస సామాజికమైందని, ఇది వ్యక్తిగతంకాదని చెప్పడం ద్వారా సమాజం మొత్తం దీన్ని ఆపడానికి ఉద్యమించాలని చెప్పక చెప్పారు ఇందులో. ఈ సందేశాన్ని అంటే 'బెల్‌ బజావో' గంట కొట్టండి, లేదా ''మూసిన తలుపుల్ని కొట్టండి'' అంట ఒక వాహనం రూపొందించి దేశవ్యాప్త ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నమని చెప్పాలి. అందుకే నేను మీ అందర్ని కోరుతున్నాను మిత్రులారా? గృహహింసను ఆపడానికి మూసిన తలుపుల్ని తెరిపించండి. గంటకొట్టండి హింసను ఆపడంలో మీొరూ భాగస్వాములు కండి.

Wednesday, October 14, 2009

భూమిక స్నేహ హస్తం


ఈనాడు ఆదివారం లో వచ్చిన వ్యాసం.

భర్త సాధింపులు, అత్తమామల వేధింపులు, ఉద్యోగంలో ఒడుదొడుకులు...సమస్య ఏదైనా కానీ పరిష్కార దిశలో మహిళలకు ఆసరాగా నిలుస్తోంది 'భూమిక' హెల్ప్‌లైన్.

1800 425 2908


స్త్రీవాద పత్రిక 'భూమిక' నిర్వహిస్తోన్న హెల్ప్‌లైన్ నెంబర్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది టోల్‌ఫ్రీ నెంబరు. ఒక్క ఫోన్‌కాల్‌తో మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు వీరు. చదువు, ఉద్యోగం, గృహహింస, చట్టపరమైన చిక్కులు, మానసిక ఇబ్బందులు... ఇలా అన్ని రకాల సమస్యల నుంచి స్త్రీలకు విముక్తి కలిగించేందుకు ఈ హెల్ప్‌లైన్ సాయపడుతోంది.

15 ఏళ్లుగా స్త్రీ అభ్యుదయానికి అక్షరసాయం చేస్తున్న భూమిక 2006లో ఈ హెల్ప్‌లైన్‌ను వెుదలుపెట్టింది. 'చాలా మంది మహిళలు తమ సమస్యల్ని ఉత్తరాల ద్వారా భూమికకు తెలియజేసి సరైన దారి చూపమని అర్థించేవారు. అలాంటి వారికి సమాచారం లేదా పరిష్కారం దొరికే మార్గం చూపేవాళ్లం. ఎక్కువ మందిని ఆదుకోడానికి హెల్ప్‌లైనే సరైన మార్గమని భావించి ప్రారంభించాం' అని చెబుతారు భూమిక సంపాదకులు
కె.సత్యవతి. హెల్ప్‌లైన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం 'ఆక్స్‌ఫామ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది.

మాటే మంత్రం ఆమెది అత్తవారింట్లో నచ్చని పెళ్లి. భర్త లేని సమయంలో అత్తమామలు మానసికంగా శారీరకంగా హింసించేవారు. మూడేళ్లు అదే పరిస్థితి. కానీ ఒక్కసారైనా ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఓరోజు తలపై కట్టెతో కొట్టారు. రక్తం కారుతుండగా బయటకు పరుగుతీసింది. ఓ ఇంటి ముంగిట స్పృహతప్పి పడిపోయింది. ఆ సమాచారం భూమికకు అందింది... నిమిషాల్లో 108తో పాటూ ప్రొటెక్షన్ ఆఫీసర్ అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పూర్తయిన తర్వాత రక్షణ గృహంలో ఆశ్రయం కల్పించారు. కొన్నాళ్లకు అత్తమామలతోపాటు భర్తకు కౌన్సిలింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి భార్యాభర్తలు సుఖంగా జీవించడం వెుదలుపెట్టారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. కాస్త అటూ ఇటుగా ఇలాంటి నేపథ్యంతో భూమిక దృష్టికి వచ్చే కేసులు నెలలో అయిదు వరకూ ఉంటాయి.

ఆలుమగల మనస్పర్థల పరిష్కారానికీ భూమిక వేదికగా నిలుస్తోంది. తమ బాధలు పంచుకోడానికి ఎవరూ లేరని ఫోన్ చేసేవారూ, ఉన్న వాళ్లెవరూ తమని పట్టించుకోవడం లేదని చెప్పేవారూ... రోజులో పది మందైనా ఉంటారు. సమస్యను చెప్పుకోడానికీ, బాధను పంచుకోడానికీ ఓ ఆత్మీయ నేస్తం కావాలి... అది భూమిక రూపంలో వాళ్లకి దొరికింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలపాటు గొంతులో దాచుకున్న బాధ
ఒక్కసారి బయటకు వస్తుంది. 'ఫోన్ చేసినవారి మాటల్ని చాలా ఓపికతో వింటాం. ఒక్కోసారి గంటకు పైగానే మాట్లాడతారు. అయినా మేం విసుగుచెందం. అన్నీ విన్నాక సలహా లేదా సూచన చెబుతాం. తుది నిర్ణయం వారిదే. ఒక నిర్ణయానికి వచ్చాక సమస్య పరిష్కారానికి మా వంతు సాయం చేస్తాం' అని చెబుతారు భూమిక ప్రతినిధులు.

ఎల్లలు దాటి


రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి వీరికి ఫోన్‌లు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళల సమస్యల పరిష్కారానికి వీరిని ఆశ్రయించేవారు ఎక్కువ. అమెరికాలోని దక్షిణాసియా దేశాల మహిళల బాగోగులు చూసే 'మానవి' స్వచ్ఛంద సంస్థ తెలుగువారి సమస్యల పరిష్కారానికి భూమిక సాయం తీసుకుంటోంది. ఉద్యోగాల ఆశతో వెళ్లి విదేశాల్లో వోసపోయిన వారు స్వదేశం చేరుకోడానికీ వీరే దిక్కు. హెల్ప్‌లైన్ సేవలు జిల్లాలకూ విస్తరించాలనే భూమిక లక్ష్యం ఇపుడు నెరవేరింది. భూమిక స్ఫూర్తిగా ప్రభుత్వం ఇందిర క్రాంతిపథం సభ్యులచేత ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తోంది. వీరంతా భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపు పది జిల్లాల్లో ఇప్పటికే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాలకు చెందిన వారు శిక్షణలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకూ అధికారుల ఫోన్ నెంబర్లూ వారి దగ్గర సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రంలో ఏ మూలనుంచి సమస్య వినిపించినా తక్షణ పరిష్కారం కోసమే

ఈ ఏర్పాట్లు. బాధితులు ఆయా జిల్లాల్లో ఉండే మానవహక్కుల సంఘాలు, లోక్ అదాలత్, మహిళా కమిషన్ ద్వారా లబ్ధిపొందడానికీ సాయపడతారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100 మంది వరకూ భూమిక వాలంటీర్లు ఉన్నారు. వీరిలో మహిళా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలకి చెందిన వారు ఎక్కువ. న్యాయ సంబంధ సలహాల కోసం ప్రతి శనివారం న్యాయవాదితో ఫోన్‌లో ప్రత్యక్షంగా మాట్లాడే వెసులుబాటు ఇటీవల ప్రారంభించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిత్యం ఉండనే ఉంటుంది. సమస్యల వలయంలో చిక్కుకుపోయి అల్లాడే మహిళలను అందులోంచి బయటపడేలా చేయడంలో 'భూమిక' హెల్ప్‌లైన్ కీలక భూమిక వహిస్తోందనడంలో సందేహం లేదు.

Wednesday, September 9, 2009

యూ ఎన్ ఎఫ్ పి ఎ -లాడ్లీ మీడియా అవార్డ్ ఫర్ జన్డర్ సేన్సిటివిటి 2009-10 In Southern Region


ఈనాడు 9-9-09

పాపాయిల సంక్షేమానికి పురస్కారాలు

ఆడ శిశువులను అంతమొందించే
విష సంస్కృతిని... కూకటి వేళ్లతో పెకిలించేందుకు... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌, పాపులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు నడుం బిగించాయి. ఆ దిశగా కృషి చేసే వారిని సత్కరించేందుకు... జాతీయ స్థాయిలో 'లాడ్లీ మీడియా అవార్డు'లను నెలకొల్పాయి. ఆ స్ఫూర్తిని అందుకున్న మన రాష్ట్రంలోని... ప్రముఖ హెల్ప్‌లైన్‌ 'భూమిక' వారితో కలిసి అడుగులేస్తూ... దక్షిణ భారతంలో లాడ్లీ అవార్డుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. ఆ అవార్డులకు సంబంధించి మరిన్ని వివరాలు...
చందమామ మీద చిందులేసే రోజులొస్తున్నా.. మహిళా సమస్యలు మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. భ్రూణహత్యలు, చదువుకి దూరంగా ఉంచడం, యాసిడ్‌ దాడులు, ఈవ్‌ టీజింగ్‌, పెళ్లయ్యాక అత్తింటి చిత్రహింసలు... వృద్ధాప్యంలో పిల్లల నిరాదరణ... ఇలా జీవితం ప్రతి దశలోనూ మహిళలకు సమస్యలే. వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? మహిళల చైతన్యానికి ఏ మార్గాలు అనుసరించాలి? సామాజిక మార్పుకి ఎలా శ్రీకారం చుట్టాలి? ఈ దిశలోనే ఆలోచించిన ఐరాస పాపులేషన్‌ ఫండ్‌, పాపులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు భ్రూణ హత్యల నివారణకు పాటుపడే వారిని ప్రోత్సహించాలనుకున్నాయి. దానిలో భాగంగా కిందటేడాది నుంచి 'లాడ్లీ మీడియా' అవార్డులు ఇవ్వడం ఆరంభించాయి. మహిళల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 'భూమిక హెల్ప్‌లైన్‌' వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి కిందటేడు లాడ్లీ మీడియా అవార్డు గెలుచుకున్నారు. 'భూమిక'లో ఆవిడ సంపాదకీయానికి ఆ అవార్డు లభించింది. ఆ గుర్తింపుతో ఆగిపోకూడదు, భ్రూణ హత్యల నివారణకు ముందుండి సేవలందించాలనుకున్న భూమిక ఈసారి పై రెండు సంస్థలతో కలిసి నడుస్తోంది. దక్షిణ భారతంలో 'లాడ్లీ మీడియా అవార్డు'ల నిర్వహణకు నేతృత్వం వహిస్తోంది.
అవార్డులకు ఆహ్వానం
'లాడ్లీ' అంటే ప్రియమైన అనీ... నవ్వుల పాపాయి అనీ అర్థం. అలాంటి అమ్మాయిని, గారాలపట్టిని పుట్టకముందే చంపేయకుండా... ఆనందమైన జీవితాన్ని అందించమంటూ... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌ కొన్నేళ్లుగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా చైతన్యం తెచ్చే దిశలో వడివడిగా నడక సాగిస్తోంది. 'స్త్రీ సమస్యలపై ప్రతిఘటించాలి.. పోరాడాలి.. బాలికల సంఖ్య పెంచాలి' అంటూ పిలుపునిస్తోంది. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాల్లో పొట్టలో ఉన్నది అమ్మాయా లేదా అబ్బాయా అని చెప్పడం నేరమంటూ బోర్డులు పెట్టడమే కాదు... వైద్యుల నుంచి నర్సుల దాకా ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆడయినా, మగయినా... అమ్మానాన్నలకు ముద్దుబిడ్డలే అంటూ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ స్ఫూర్తిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, వాటిల్లో పనిచేసే విలేకరులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఆ క్రమంలో ఏర్పాటు చేసినవే లాడ్లీ మీడియా అవార్డులు. 'కేవలం మీడియా వారే కాదు, భ్రూణ హత్యల నివారణకు ఆడ శిశువుల సంరక్షణకు కృషిచేసే సంస్థలు సైతం దరఖాస్తులు పంపుకోవచ్చు...' అంటూ సూచించారు సత్యవతి.

Saturday, August 29, 2009

రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుక



నిన్న అంటే 28 న ప్రముఖ లలిత,సినీ సంగీత గాయకురాలు రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ లోని తాజ్ త్రీ స్టార్ హోటల్ ల్లో ఉత్సాహంగా,సరదగా జరిగాయి. ఆమెకు ఆత్మీయులైన అతికొద్ది మందినే ఆవిడ ఆహ్వానించారు."నువ్వు రాకపోతే చూడు దొంగా" అంటూ నన్ను ప్రేమగా పిలిచారు.ఆవిడ పాటలంటే ప్రాణం కాబట్టి నేను సంతోషంగానే వెళ్ళేను.నా ఫ్రెండ్ గీత నాతో వచ్చింది. మూర్తి,విజయలక్ష్మి,చైత్ర వంటి గాయకులు వచ్చారు. సురేఖా మూర్తి బాలసరస్వతిగారు గానం చేసిన,అత్యంత ఆదరణ పొందిన "ఆ తొటలోనొకటి ఆరాధానాలయము ఆ ఆలయములోని అందగాడెవరే" పాటని అద్భుతంగా పాడారు.విజయలక్ష్మి దేవదాసు లోని పాటను పాడి వినిపించారు.చైత్ర "ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు నీ చక్కని మోము చూడ తనివి తీరదు" పాటని చక్కగా పాడింది. ఆ తర్వాత బాలసరస్వతి గారు కేక్ కట్ చేసి మా అందరి బలవంతం మీద "రెల్లు పూల పానుపుపై జల్లు జల్లు గా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా"పాటని ఆ హోటల్ హాల్లో వెన్నెల్ని కురిపిస్తూ,అత్యంత మాధుర్యంగా పాడారు. ఆ తర్వాత అందరం భోజనాలు చేసాం. 81 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో ఉత్సాహంగా,జోకులు పేలుస్తూ గల నవ్వే ఆమెని చూస్తే ఎంత సంతోషం వేస్తుందో. భూమిక కోసం ఆమెని ఇంటర్వ్యూ చేసినపుడు ఆమె చెప్పిన జోకులకి మా కడుపు చెక్కలయ్యింది.ఆమె ప్రత్యేకత ఏమిటంటే జోకు పేల్చినపుడు ఆమె నవ్వదు మనల్ని తెగ నవ్విస్తుంది. ఇటీవల నేను నందలూరు కధానిలయం వారి ఉత్తమ సంపాదక అవార్డును తిరుపతిలో తీ సుకున్నపుడు ఆ మీటింగ్ లో ప్రత్యక్షమై నాకు గొప్ప సంతోషాన్ని కలిగించారు. తన గానం ద్వారా అనిర్వచనీయమైన,అద్భుతమైన ఆనందాన్ని పంచే బాలసరస్వతిగారు నిండు నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ....కొన్ని పోటోలు,వీడియో మీకోసం.

Thursday, August 20, 2009

గర్భసంచుల్ని కోల్పోయిన 100 మంది ఆడవాళ్ళు


నేను ఈ మధ్య ఒక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరవ్వడం కోసం మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నేను చెప్పైన సంస్తకు చెందిన ఒక డాక్టర్ ఆ గ్రామంలో హిస్ట్రెక్టమి (గర్భ సంచుల తీసివేత)చేయించుకున్న స్త్రీలతో పని చేస్తున్నారు. ఆ సమావేశానికి దాదాపు 100 మంది మహిళలు హాజరయ్యారు. అందరూ హిస్ట్రెక్టమి చేయించుకున్న వాళ్ళే. తప్పు తప్పు చేయించుకున్న వాళ్ళు కాదు.భయానో నయానో ఒప్పించి ఒక విధంగా బలవంతపు ఆపరేషన్లకి గురిచేయబడినవాళ్ళు. కాన్సర్ వస్తుందని,పిల్లలు పుట్టాక దాని అవరంలేదు అని చెప్పి,ఇంకా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ గర్భసంచుల్ని కోసేసారట. ఒక్కొక్కళ్ళు తమ కధల్ని మాకు వినిపించారు. ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే తీసేసారు. ప్రస్తుతం వాళ్ళందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు. నేను చెప్పిన డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. నేను వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పాను.

Monday, August 10, 2009

తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి సభ



మొన్న ఆదివారం నేను ఓ అద్భుతమైన సమావేశానికి వెళ్ళేను.ఎక్కడనుకున్నారు?చండ్ర రాజేశ్వరరావ్ ఫౌండేషన్ కి.అక్కడ తాపీ ధర్మారావు గారి కోడలు తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి జరిగింది.రాజమ్మ గారి కొడుకు,కూతురు ఈ సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ కొండపల్లి కోటేస్వరమ్మ గారిని,వి.హనుమంతరావు గారిని,వేములపల్లి సత్యవతి గారిని,లీలావతి గారిని,సరళా దేవిగారిని,మల్లు స్వరాజ్యం గారినీ కలవడమే కాదు వారితో కలిసి భోజనం చేసాను.ఉద్యమాల కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులను ఆ రోజు కలిసాను. తాపీ రాజమ్మ గారి గురించి, వారి జీవితం గురించి ఎన్నో అపురూపమైన విషయాలు విన్నాను. నిజంగా ఆ ఆదివారం నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే అనుభవాన్నిచ్చింది.

Friday, August 7, 2009

చేనేతకి చేయూత నిద్దాం






ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు పీపుల్స్ ప్లాజా నుండి లుంబినీ పార్క్ వరకు చేనేత కోసం నడక కార్యక్రమం జరిగింది. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను."ఈభూమి" లో నేను ఒరవడి పేరుతో కాలం రాస్తున్నను.ఆగస్ట్ నెల సంచిక లో వచ్చిన ఆ వ్యాసం మీ కోసం.

నేను ఇటీవల మా ఊరు సీతారామపురం వెళ్ళాను. నర్సాపురానికి దగ్గరగా ఒక పక్క గోదావరి, మరో పక్క సముద్రం చుట్టి వుండే మా ఊరు వెళ్ళడమంటే నాకెప్పుడూ సంబరమే. సంతోషంగా వెళ్ళిన నేను ఒక విషాద వార్తని వినాల్సివచ్చింది. ఆ వార్త నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయింది. అది సూర్యనారాయణ మరణ వార్త. ఆయన వయసు మీద పడే చనిపోయాడు కానీ ఆయనతో వున్న ఒకానొక అనుబంధం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చివరిదశలో దీనాతిదీనంగా, దుర్భర దారిద్య్రంతో వాళ్ళ కుటుంబం చితికిపోయిందని విన్నపుడు నాకు ఈ దేశంలోని కోట్లాది చేనేత కళాకారులు, చేనేత కార్మికులు గుర్తొచ్చారు.
సూర్యనారాయణ చేనేత కళాకారుడు. వాళ్ళ కుటుంబమంతా మగ్గం మీద పనిచేసేవాళ్ళు. మా కుటుంబం మహా పెద్దది. దాదాపు వందమంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం. మా తాత, మామ్మలకి తొమ్మిది మంది సంతానం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కలిసి మా ఇల్లొక సత్రంలాగా వుండేది. మా కుటుంబానికి కావలసిన బట్టల్లో అధిక భాగం సూర్యనారాయణ కుటుంబం చేతుల్లోంచే వచ్చేవి. చీరలు, లుంగీలు, తువ్వాళ్ళు చేతి రుమాళ్ళులాంటి రోజువారీ దుస్తుల్ని నేసి సూర్యనారాయణ తీసుకొచ్చేవాడు. మా నాన్న, పెదనాన్న, చిన్నాన్నలు ఆ రోజుల్లో పాంట్‌లు వేసుకోవడం నేను చూళ్ళేదు. సూర్యనారాయణ నేసుకొచ్చిన పంచెలు, లుంగీలు మాత్రమే కట్టుకునేవాళ్ళు. చొక్కాలు వేసుకోవడం చాలా తక్కువ. మానాన్న రైతు కాబట్టి పొలానికెళ్ళేపుడు ఏ రోజు చొక్కా వేసుకునేవాడు కాదు. మా అమ్మకి చేనేత చీరలంటే చాలా ఇష్టం. ఆవిడ రకరకాల ఊళ్ళ నుంచి చీరలు తెప్పించేది. బొబ్బిలి, మాధవరం, ఉప్పాడ, వెంకటగిరి - ఈ ఊళ్ళ పేర్లన్ని నేను చేనేత ద్వారానే చిన్నప్పుడే విన్నాను.
బహుశ మా అమ్మ నుంచే నాకు చేనేత చీరల వారసత్వం వచ్చి వుంటుంది. నేను చేనేత తప్ప వేరేదీ కట్టను. నాకు మంగళగిరి, పేటేరు, గుంటూరు, కొయ్యలగూడెం, నారాయణపేట, వెంకటగిరి చీరలంటే చాలా ఇష్టం. ఈ చీరలు కట్టుకుంటే వుంటే హాయిని వర్ణించాలంటే ఇక్కడ సాధ్యం కాదు సరే! మళ్ళీ సూర్యనారాయణ గురించి మాట్లాడాలి. ఆయన ముఖం ఎంతో అమాయకంగా, కోమలంగా వుండేది. బట్టల మూట సైకిల్‌కి కట్టుకుని తెచ్చి మా వీధి అరుగు మీద రంగు రంగుల చీరల్ని, తెల్లటి పంచెల్ని వెదజల్లేవాడు. మేము పిల్లల మూకంతా వాటి చుట్టూ చేరేవాళ్ళం. ఆడపిల్లల కోసం దళసరి, తక్కువ కౌంట్‌లో రంగు రంగుల బట్టముక్కల్ని తెచ్చేవాడు. మాకు వాటితో గౌన్లు కుట్టించేవాళ్ళు. మా కుటుంబానికి కావలసిన బట్టలన్నీ తీసుకుని అతనికావ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేవాడు మా తాత. కొన్ని సార్లు అంతా ఇచ్చేవాడు కాదు. సూర్యనారాయణ మళ్ళీ వచ్చినపుడు మిగతాది ఇచ్చేసేవాడు. అలా సూర్యనారాయణతో మాకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది. అతని దగ్గర చాలా మంది బట్టలు కొనేవాళ్ళు, నేసినవన్నీ అమ్ముడుపోవడంతో, మళ్ళీ నేయడం, అమ్మడం, ఇలా ఆ కుటుంబానికి కావలసిన పని పుష్కలంగా వుండేది. ఆదాయం కూడా అదే స్థాయిలో వుండేది.
క్రమంగా ఈ చేనేత సంబంధం తెగిపోవడం మొదలై చాలా కాలమే అయ్యింది. సిల్క్‌ బట్టలు వెల్లువెత్తి చేనేతను పక్కకు తోసేసాయి. సిల్క్‌ బట్ట మెయింటెనెన్స్‌ తేలిక కాబట్టి జనం వాటి వేపు మొగ్గడం మొదలైంది. స్వయం పోషకులుగా, తమ హస్తాల్లోంచి వస్త్రాలను రూపొందించే చేనేత కళాకారులు, కార్మికులు క్రమంగా పని కోల్పోవడం, నేసిన వాటిని అమ్ముకోలేక పోవడం, ఆదాయం తగ్గిపోవడం, ఆఖరికి ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవ్వడం ఈనాటి నగ్నసత్యం. పరమ విషాదం. ప్రభుత్వం ఏదో చేస్తున్నానంటోంది. చేనేత సహకార సంఘాలకి రాజకీయ చీడపట్టి మొదలంటా కుళ్ళిపోయాయి. చేనేత పనివారు పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయారు. వారికి ఆ పని తప్ప వేరేది రాదు. పని కల్పిస్తే కుటుంబం మొత్తం కష్టపడి పనిచేసుకుంటారు. అద్భుతమైన వస్త్రాలని అందిస్తారు. వారికి కావలసింది పని. వారు నేసింది అమ్ముడై ఆదాయం రావడం. అంతే పని చెయ్యకుండా పింఛన్‌లిమ్మని, విరాళాలు ఇమ్మని వారు కోరడం లేదు. మేం కష్టించి సృష్టిించే బట్టల్ని కొనండి. మాకు ఆదాయం వస్తుంది. మేం గౌరవ ప్రదంగా బతుకుతాం అనేదే వారి కోరిక.
సూర్యనారాయణ మరణవార్త నాలో రేసిన ఆలోచనలు ఇవి. ఆయనెంత ధైర్యంగా, నిబ్బరంగా వుండేవాడో గుర్తొచ్చి ఆ ధైర్యం వెనుక వున్న బలం ఏమిటో అర్ధమై నేను ఈ కాలమ్‌ ద్వారా ఒక విషయం చెప్పదలిచాను. మనం కూడా చేనేతని ప్రేమిద్దాం. చేనేత వస్త్రాలని కొందాం అనే నిర్ణయం చేసుకోవడంతో పాటు నాది మరో కోరిక వుంది.
మన రాష్ట్రంలో వేలాది ఆలయాలున్నాయి. ప్రతి రోజు లక్షలాది భక్తులు ఈ ఆలయాలను దర్శిస్తుంటారు. ఒక్క తిరుపతికి వచ్చే భక్తులే లక్షలలో వుంటారు. హుండీలో కోట్లాది రూపాయలు సమర్పించుకుంటూ వుంటారు. భక్తజనకోటికి నాదో విన్నపం. గుళ్ళకొచ్చే వాళ్ళంతా చేనేత వస్త్రాలను ధరించి వస్తే... ఊహించుకోవడానికే నాకు పరమానందంగా వుంది.మీ భక్తి రసానికి మానవీయ కోణాన్ని అద్ది చూడండి. కోట్లాది చేనేత పనివారలకి చేతినిండా పని. పనికి తగిన ఆదాయం, కేవలం తిరుపతికి వచ్చే భక్తులు ఒక్క రోజు చేనేత వస్త్రం కట్టి గుళ్ళో కెళ్ళండి. మీకు మానసిక తృప్తితో పాటు, మానవత్వం కూడా పరిమళిస్తుంది. చేనేత పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లకపోతే నన్నడగండి. మా సూర్యనారాయణకి నేనిచ్చే నివాళి ఇదే. చేనేత జిందాబాద్‌.

Thursday, August 6, 2009

భారతీయ శిక్షాస్మృతి లోని ఆర్టికల్‌ 377- డిల్లీ హైకోర్ట్ జడ్జిమెంట్

భారతీయ శిక్షాస్మృతిలోని ఆర్టికల్‌ 377 కి 149 సంవత్సరాల చరిత్ర వుంది. లార్డ్‌  మెకాలే 1860లో ఈ ఆర్టికల్‌ని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో చేర్చారు.  ఈ ఆర్టికల్‌ ప్రకారం అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడే స్త్రీ పురుషులు పది సంవత్సరాల జైలు శిక్షకి, పెనాల్టీకి గురవుతారు. వారిని శిక్షించడానికి ఈ ఆర్టికల్‌ రూపొందించబడింది.  నూట నలభై సంవత్సరాలుగా  ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి హోమోసెక్సువల్స్‌ని నేరస్తులుగా ముద్రవేసి హింసించడం, బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం జరుగుతూ వస్తోంది. కేసులు పెట్టడం కాక ఆయా వ్యక్తులను, కుటుంబ సభ్యులను బెదిరించే పనికి పోలీసులు పూనుకోవడంతో హోమోలు భయం భయంగా బతకడం, తీవ్ర మానసిక ఆందోళనకి లోనవ్వడం జరుగుతోంది.
377కి వ్యతిరేకంగాను, ఈ ఆర్టికల్‌కి మొత్తంగా  భారతీయ శిక్షాస్మృతిలోనుంచి తీసెయ్యాలని చాలా కాలంగా నిశ్శబ్ద ఉద్యమం జరుగుతోంది. చివరికి జూలై రెండు 2009 లో ఈ ఉద్యమం బహిరంగంగా రోడ్డెక్కింది. ఆర్టికల్‌ 377 భారత రాజ్యాంగంలోని సమానత్వ భావనకి విరుద్ధమని, చట్టం దృష్టిిలో అందరూ సమానమేనని ఢిల్లీ హైకోర్టు ప్రకటించడంతో వందల సంఖ్యలో హోమోసెక్సువల్స్‌, లెస్బియన్స్‌ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. బెంగుళూరు, ముంబయ్‌, కలకత్తాలో కూడా ఇలాంటి ర్యాలీలు జరిగాయి. మొట్ట మొదటి సారి పెద్ద సంఖ్యలో వీరు ప్రదర్శనల్లో పాల్గొని నినాదాలతో కదం తొక్కారు.
ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు మీద దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 377 రద్దుచేయాలని, రద్దు చేయకూడదనే వాదనలు జరుగుతున్నాయి. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే భారతీయ మీడియా (ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌) మొత్తం ఈ తీర్పుకు అనుకూలంగా స్పందించడంతో పాటు మొదటి పేజీల్లో పతాక శీర్షిక కథనాలను ప్రచురించాయి. పాజిటివ్‌ దృష్టిికోణంతో ఆర్టికల్స్‌ ప్రచురిస్తున్నాయి. దీనివల్ల జరిగిన మేలు ఏమిటంటే -ఇంతకాలం-మొదటి దశలో వున్న హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ పట్ల ప్రజల్లో వున్న 'స్టిగ్మా' లాంటిది ఈ అంశంలోనూ మెల్లగా కరగడం మొదలైంది. ఒక ఆరోగ్య కరమైన చర్చకు ఇది తెరతీసింది.
 అయితే మత నాయకులు, సంప్రదాయవాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఇది భారతీయ సంస్కృతి కాదని, దీనివల్లరభారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతాయని గగ్గోలు పెడుతున్నారు. సుప్రీమ్‌ కోర్టులో ఈ తీర్పును నిలిపివేయాలంటూ అప్పీల్‌ కూడా చేసారు. అయితే సుప్రీమ్‌ కోర్టు స్టే ఇవ్వలేదు. ఒక వ్యక్తి హోమోగానో, లెస్బియన్‌గానో వుంటే కుటుంబ వ్యవస్థ ఎందుకు నాశనమౌతుంది? వారి వారి పుట్టుకతో భిన్న లైంగిక ధోరణులను కలిగి వుండే వ్యక్తులు నేరస్థులు ఎలా అవుతారు? వారి భిన్నమైన లైంగికత వల్ల వారు మొత్తంగా నేరం చేసినట్లు 377 కింద కేసులు బుక్‌ చేయడం లేదా చేస్తామని బెదిరించడం ఎంతవరకు న్యాయం అంటూ ఈ రోజున ప్రశ్నలు చెలరేగుతున్నాయి. అంతే కాకుండా భారతీయ కుటుంబాల నాశనం అంటూ జరిగితే అది పురుషుల హింసాయుత ప్రవృత్తులవల్లే జరుగుతుంది. ఇటీవల కాలంలో స్త్రీల పట్ల పెరిగిపోతున్న హింసా ధోరణులు, తాగుడు, కుటుంబ హింస, కట్నం హత్యలు, పిల్లలపై దాడులు వీటిని గురించి మాట్లాడని వారంతా ఇపుడు సంస్కృతి పేరుతో 'గే'ల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. స్త్రీలపై అమలవుతున్న భయానక హింస భారతీయ సంస్కృతిలో భాగమా? దీన్ని మన  సంస్కృతికి వ్యతిరేకమని వీళ్ళు ఎందుకు  మాట్లాడరు?  భారతీయ సంస్కృతికి, కుటుంబానికి, వివాహ వ్యవస్థకి ముప్పు వాటిల్లబోయేది పురుషుల  ఆధిపత్య, అహంకార, హింసాయుత ధోరణుల వల్లనే  తప్ప తమ మానాన తాము బతికే ''ఎల్‌జిబిటి''ల వల్ల కాదు అనేది స్పష్టం.
ఇటీవల ఒక సర్వే ప్రకారం 10% మంది భిన్న లైంగిక ధోరణులను కలిగివున్నారని, వీరినెవ్వరూ తయారు చెయ్యలేదని, వీరంతా పుట్టుకతోనే, బయలాజికల్‌గా ఈ ధోరణులను కల్గి వున్నారని తెలుస్తోంది. అమ్మాయిలు, అబ్బాయిలు హాస్టల్స్‌లో వుండేటపుడు 'గే' లుగా తయారవుతారని, కౌన్సిలింగుద్వారాను, సైకియాట్రిక్‌ చికిత్స ద్వారాను వీరిని నయం చేయవచ్చుననే వాదన కూడా విన్పిస్తోంది. అయితే గేలుగా బతికే పురుషులు స్త్రీలతో లైంగిక సంబంధాలని ఇష్టపడరని, అలాగే లెస్బియన్‌లుగా బతికే స్త్రీలు పురుష సంపర్కాన్ని  ఒప్పుకోరనేది కూడా విదితమే. సైకియాట్రిక్‌ కౌన్సిలింగుద్వారా  వీరిని నయం చేయవచ్చనే వాదం పై విధంగా వీగిపోతుంది.
ఢిల్లీ హైకోర్టు 377 మీ ఇచ్చిన తీర్పు 'గే' హక్కులపై ఒక విస్పష్టమైన, విస్తృతమైన చర్చకి దారితీయడం సంతోషించాల్సిన  అంశం. ఎందుకంటే ఒక అంశాన్ని కార్పెట్‌ కింద దాచేసినట్లు దాచేస్తే ఆ అంశం ఉనికి లేకుండా పోదు. దాని పట్ల  నిగూఢతను, స్టిగ్మాను కొనసాగించడం కాక బహిరంగంగా ఒక చర్చను లేవనెత్తడం అవసరం. మంచి, చెడ్డలను చర్చించడం అవసరం.
రాజ్యాంగ విరుద్ధమైన ఒక ఐపిసి ఆర్టికల్‌ (377) 149 సంవత్సరాలుగా కొనసాగడం చాలా అన్యాయమైన విషయం.. వ్యక్తి స్వేచ్ఛకు, ఛాయిస్‌కు సంబంధించిన భిన్నమైన లైంగిక జీవన విధానం నేరమని చెబుతూ వారిని హింసించడం అమానుషమే అవుతుంది. ప్రజలు తమ కిష్టమైన, నచ్చిన విధానంలో (ఎదుటి వారికి కష్టం, నష్టం కల్గించకుండా) బతికే తీరును, బతుకుతున్న విధానాన్ని అర్ధం చేసుకోలేకపోతే ఆ సమాజం అభివృద్ధి చెందిందే కాదు.
దీనిమీద చెలరేగుతున్న వాదోపవాదాలను గమనిస్తే. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్‌ ఎల్‌జిబిటి (లెస్బియన్‌ , గే, బైసెక్సువల్‌ మరియు ట్రాన్స్‌ జెండర్‌)లుగా జీవనం సాగిస్తున్న వారికి లీగల్‌ సపోర్ట్‌ నిచ్చింది గానీ సామాజిక సమ్మతి చాలా దూరంలో వుందనిపిస్తోంది.

Thursday, July 30, 2009

నిన్న అర్ధరాత్రి మళ్ళీ మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసిందోచ్.







నిన్న అర్ధరాత్రి మళ్ళీ మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసిందోచ్.
ఇంకో మూడు మొగ్గలున్నాయి.శనివారం రాత్రి గాని ఆదివారం రాత్రి గానీ విచ్చుకోబుతున్నయ్.
ఇంతకు ముందు ఒక రోజు ఐదు ఇంకో రోజు తొమ్మిది బ్రహ్మ కమలాలు పూసాస్ మీ కోసం కొన్ని పాత ఫోటోలు.



Thursday, July 23, 2009

కేవలం ముద్ద సంపెంగపువ్వులు మీ కోసం

ముద్ద సంపెంగ పూలని మీరెవరైనా చూసారా



ముద్ద సంపెంగ పూలని మీరెవరైనా చూసారా?
చూసి ఉండకపోతే ఇవిగో మీ కోసం.
నా ప్రియ నేస్తం గీత
చేతుల్లో ఉంచి నేను తీసిన ఫోటో.
ఎక్కడున్నయి అంటారా.
తిరుపతి కొండ మీద సంపెంగ వనాలున్నాయి కదా!
అక్కడ వెతకండి దొరుకుతాయి.
ఈ పువ్వుల్ని నా నేస్తానికి చూపించడానికే  కొండ మీదికెళ్ళేను కాని నాకేమీ భక్తి వగైరా లేమీ లేవు సుమండి.

Tuesday, July 21, 2009

ఓ సంతోష సందర్భం






మీతో ఒక సంతోషాన్ని పంచుకుందామని ఇది రాస్తున్నాను.
నేను మార్చి నెలలో ఒకటి జూలై నెలలో ఒకటి 2009 లో రెండు అవార్డులు తీసుకున్నను.
ఒకటి ప్రముఖ సామాజిక సేవకురాలు బాదం సరోజా దేవి గారి పేరు మీద వారి భర్త ఏర్పాటు చేసిన "మహిళారత్న"
అవార్డు,రెండోది జూలై 13 న నందలూరు కధా నిలయం వారు
కేతు విశ్వనాధ రెడ్డి గారి పేరు మీద ఏర్పాటు చేసిన"ఉత్తమ సాహిత్య సంపాదకురాలు" అవార్డ్.ఈ అవార్డును తిరుపతిలో ప్రదానం చేసారు.
మీకోసం ఆ రెండు ఫోటోలు అప్ లోడ్ చేసాను.

Thursday, July 9, 2009

హం చలేంగే సాత్ సాత్


చుట్టూ అనంత జలరాశి. నౌక నడుస్తున్న శబ్దంతప్ప మహా నిశ్శబ్దం అలుముకుని వుంది. పున్నమి రేయి. వెండి వెన్నెల బంగాళాఖాతం మీద తెల్లటి కాంతుల్ని పరుస్తోంది. అంత వెన్నెల్లోను ఆకాశం నిండా చుక్కలు.
అవని తదేకంగా మెరుస్తున్న నీళ్ళకేసి చూస్తోంది.
''ఏంటి అంత దీక్షగా చూస్తున్నావ్‌?''
''ఈ రాత్రి ఎంత అందంగా వుంది. మెరుస్తున్న నీళ్ళలోకి దూకాలన్పిస్తోందోయ్‌.''
''అదేం పిచ్చి కోరిక''
''ఇవాళెందుకో పిచ్చి కోరికలు కలుగుతున్నాయ్‌''
''అవనీ''
''ఊ... చెప్పు''
''ఇంకేం కోరికలు కలుగుతున్నాయేం'' అన్నాడు ఆమెని ఆనుకుంటూ.
'' ఈ నిశ్శబ్దపు రేయి, ఈ పండు వెన్నెల, చుట్టూ అపార జలాలు, ఎగిసిపడుతున్న కెరటాలు...''
''అబ్బ! ఏంటోయ్‌ కవిత్వం చెబుతున్నావ్‌?''
''కవిత్వం కాదోయ్‌ గురూ! ప్రకృతి ప్రేమ''
''నామీద ప్రేమ కలగడం లేదా?''
''అదేం పిచ్చి ప్రశ్న. నీ మీద ప్రేమ ఇపుడు కొత్తగా కలగడమేమిటి? ప్రేమ లేకుండానే నీతో ఇలా వచ్చానా? నిన్ను పెళ్ళిచేసుకున్నానా?''
''మరి నా మీద ప్రేమ వ్యక్తం చెయ్యవేం''
''నా మనస్సంతా నీ ప్రేమతో పొంగిపొర్లుతుండడం వల్లనే కదా! ప్రకృతి అంత రమణీయంగా వుంది.''
''ప్రేమలేని వాళ్ళకి ప్రకృతి అందంగా కనబడదా?''
''ఆ విషయం నాకు తెలియదు గానీ నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి?''
''ప్రేమంటే... ఐ లవ్‌ యూ అని చెప్పడమే కదా''.
''అంతేనా''
''నువ్వు అందంగా వుంటావ్‌. అందుకేగా నిన్ను ప్రేమించాను''
''అందంగా వున్నందుకే నన్ను ప్రేమించావా?''
''అంతే కదా! అది వేరే చెప్పాలా? ఈ కళ్ళిష్టం ఈ పెదవులిష్టం. ఈ ముక్కు ఇష్టం. తెల్లగా మెరుస్తున్న ఈ శరీరమంతా ఇష్టం నాకు.''
''ఇంకా... ఇంకేమిష్టం''
''నీలో వున్నవన్నీ నా కిష్టమే''
''నాలో వున్నవన్నీ అంటే...''
''చెప్పాను కదోయ్‌. ఎన్ని సార్లు చెప్పించుకుంటావ్‌?''
''ఇంకా ఏదో మిగిలి పోయిందని పిస్తోంది. నా శరీరంలోని అవయవాలన్నీ ఇష్టమని చెప్పావ్‌ గానీ, నా మనసు, ఆలోచనలు, ఆశ యాలు వీటి గురించి ఏమీ మాట్లాడలేదే!
''నీ మనస్సు నాదేగా! నా మీద కాక నీకు వేరే ఆలో చనలు, ఆశలు ఏముంటాయ్‌?''
''నా మనస్సు నీదెలా అవుతంది గురూ''
''అదేంటి?''
''ఎందుకలా ఆశ్చర్యపోతావ్‌. నా మనస్సు నాదే. నీ మనస్సు నీదే. నా ఆలోచనలు, ఆశయాలు నావే. నీవెలా అవుతాయోయ్‌.''
''ఒకరి హృదయాన్ని ఇంకొకరం ఇచ్చిపుచ్చుకోవడమేగా ప్రేమంటే''
''నా ఉద్దేశ్యంలో ప్రేమంటే అది కాదు. మనస్సును ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఒకరికి ఇంకొకరం ఫోటో స్టాట్‌ కాపీలంగా మారడం కాదు''.
''మరి''
''అరె. చూడు చూడు ఆకాశం నుంచి తెగిపడిన చుక్క మనవేపే వస్తోంది''. దోసిళ్ళు పట్టింది.
''ఏదీ చూడనీయ్‌'' అంటూ అవని దోసిల్లోకి వంగాడు. తన దోసిట్లో ముఖాన్నుంచిన గురూని గుండెకి హత్తుకుంది అవని.
''లెటజ్‌ ఎంజాయ్‌ దిస్‌ వండర్‌ఫుల్‌ నైట్‌''.
''ఎంజాయ్‌ చేస్తున్నాంగా. ఇంతకంటే ఏం కావాలి?''
''చాలా చాలా కావాలన్పిస్తోంది. నువ్వేమో కబుర్లు మాత్రమే చెబుతున్నావ్‌''.
''కబుర్లు చెప్పొద్దంటే మానేస్తా. ఇంతటి హాయైనవేళ మనిద్దరికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోక పోతే ఎలాగోయ్‌''
''ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావ్‌. అసలు సంగతిలోకి రావేంటి?''
''అసలు సంగతా ఏంటది?''
''నీకు తెలియదా? ఆకాశపందిరి కింద, చుక్కల తోరణాల మధ్య, లక్ష నియోన్‌ లైట్లకి సమానంగా వెల్గుతున్న చంద్రుడి సాక్షిగా....''
''వాహ్‌! క్యాగజల్‌ హై.... చెప్పు.... చెప్పు''.
''నిన్నిపుడు ముద్దుపెట్టుకోవాల నుంది''.
''పెట్టుకో. నాకూ నిన్ను ముద్దు పెట్టుకోవాలన్పిస్తోంది.''
గురూని దగ్గరికి లాక్కుని గాఢంగా ముద్దుపెట్టింది. కెరటాల సంగీతంలో వాళ్ళిద్దరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలగలిసి పోయాయి. చంద్రుడు ఓ క్షణం సేపు మబ్బుల్లో దాక్కున్నాడు.
'గురూ'
''ఊ... ఇపుడేమీ మాట్లాడకు''
''నాకు చాలా చాలా మాట్లాడాల న్పిస్తోంది''
గురు వెల్లికిలా పడుకుని ఆకాశంకేసి చూస్తున్నాడు.
అవని అతని గుండెమీద తలానించి తనూ వెల్లికిలా పడుకుంది.
''మనం తొందరలోనే మన సహజీవ నం మొదలెట్టబోతున్నాం. దాని గురించి ప్లాన్‌ చేద్దామా గురూ!''
''దాంట్లో అంత ప్లానింగు అవసరమేముంది, అందరూ చేస్తున్నదేగా?''
''మనం భిన్నంగా ప్లాన్‌ చేద్దామోయ్‌. ఇంతకు ముందుకూడా మాట్లాడుకున్నాం కదా!''
''అవనీ! ప్లీజ్‌ ఇంత చక్కనివేళ సంసారం గోలా''
''సంసారం గోలా? అదేంటి గురూ! అంత మాటన్నావ్‌?''
''నా ఉద్దేశ్యం అది కాదు అవనీ''
''మా నాన్న సంసారం సాగరం అనేవాడు. మా అన్న మా వదినతో నీతో సంసారం నరకం అనేవాడు. ఈ సాగరాలు, నరకాలు చూసి భయపడే నేను పెళ్ళి చేసుకోకూడదనుకున్నాను. నువ్వు కూడా.....''
''ఛ.... ఛ.... అదికాదు, ఇంత రమ్యమైన చోట ఎంజాయ్‌ చెయ్యకుండా అవన్నీ ఇపుడే మాట్లాడుకోవాలా? అనే నా ఉద్దేశ్యం, అంతేనోయ్‌.''
''మన సహజీవనానికి సంబంధించిన విషయాలేగా ఇవి కూడా.మనం తల్చుకుంటే ప్రతిరోజు రమ్యంగానే ఉంచుకోవచ్చు''.
''నిజమే. అవనీ! అవన్నీ మాట్లాడు కుంటేనే బావుంటుంది. అయామ్‌ సారీ''
''సారీలెందుకు లేవోయ్‌. అది సరే గాని. మన పురోహితులు చదివే మంత్రాలు నీకేమైనా అర్థమయ్యాయా?''
''వాటె జోక్‌ యార్‌. అవన్నీ సంస్కృతం. మనకు తెలుగే సరిగ్గా రాదు.'' గట్టిగా నవ్వాడు.
''కదా! మరెందుకవన్నీ చదువుతారో నాకూ అర్థంకాదు. ఆ మంత్రాల సంగతి వదిలేద్దాం గానీ నీ లైఫ్‌ పార్టనర్‌గా నానుంచి ఏమాశిస్తున్నావ్‌?''
''నాకిష్టమైనట్టు నువ్వుండడం''
''నీకేమిష్టమసలు?''
''నన్ను ప్రేమించాలి. నాకేది నచ్చుతుందో నీకూ అదేనచ్చితే బావుంటుంది నాకు''.
''అదెలా. నీకు బంగాళాదుంపంటే బోలెడిష్టం. నాకు అది పడదు. నాకు కాకరకాయ ఇష్టం. నీకు ఎక్కదు''.
''అబ్బ! అదో పెద్ద సమస్యా ఏంటి?''
''ఉదాహరణ చెప్పాను లేవోయ్‌''
''నువ్వెప్పుడూ నాతోనే వుండాలన్పిస్తుంది''
''ఇరవై నాలుగ్గంటలూ నీతోనే వుంటే నా ఉద్యోగం, నాఫ్రెండ్స్‌, నా స్పేస్‌ ఏమవ్వాలి?''
''అంటే నీకు నాతో వుండడం బావుండదా?''
''దివ్యంగా వుంటుంది. అలాగని నాకు వేరే ప్రపంచం లేకుండా పోదుగా''.
''ఎందుకుండదు? ఎవరి ప్రపంచం వాళ్ళకుండాల్సిందే. సరే నానుంచి నువ్వేం ఆశిస్తున్నావో చెప్పవా మరి''
''చెబితే కోపమొస్తుందేమో నీకు''
''కోపమెందుకు చెప్పు. నువ్వేం చెప్పినా వినడానికి రెడీ''
''మీ అమ్మలాగా, మా అమ్మలాగా వుండాలని నాకు లేదు''.
''అంటే...''
''నాకు కొన్ని ఆశలు, అభిరుచులు వున్నాయి. నీకు నచ్చకపోతే వాటిని నేనెందుకు వదిలేసుకోవాలి? పెళ్ళయితే ఆడవాళ్లు అన్ని అభిరుచులూ వదలిలేసు కోవాలని మనవాళ్లు బోధిస్తారు కదా!''
''నేను నిన్ను ఏమీ మానేయమనలేదే. నీ ఇష్టం నీది. నేనెందుకు అడ్డుకుంటాను''.
''నువ్వడ్డుకున్నా నేను లెక్కచేయను అని ఈరోజు నీతో చెప్పాలనుకుంటున్నాను. నన్ను కేవలం ఓ ఆడదానిగా కాక మనిషిగా. నీలాగే రక్తమాంసాలు, ఆత్మగౌరవం వున్న తోటి మనిషిగా అంగీకరించి, అర్థం చేసు కోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందు కంటే నేను చూసిన సంసారాల్లో మగవాళ్ళు ఎంతెంత అహంకారంతో ప్రవర్తిస్తారో చాలా మందిని చూసాను. నువ్వలా ప్రవర్తించిన మరుక్షణం నీకూ నాకూ ఏమీ మిగలదు''.
''అలా మాట్లాడకు అవనీ. పెద్దవాళ్ళు మన సంప్రదాయం ప్రకారమే కదా మనకు చెబుతారు''
''అంటే అవన్నీ నీకు ఆమోదమేనా?''
''నా ఇష్టాయిష్టాలతో ఏమవుతుంది? మనం వీటికి వ్యతిరేకంగా వెళితే మన అమ్మలూరుకోరు కదా!''
 ''నాకు నీ సంగతి కావాలి?''
''వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా!''
''తప్పకుండా వినాలి. కానీ మన వ్యక్తిత్వానికి, జీవన విధానానికి సంబంధించిన నిర్ణయాలు మనమేగా చేసుకోవాలి. మన అమ్మల జీవన విధానానికి, మన జీవన విధానానికి చాలా తేడా వుంది. ఒప్పుకుంటావ్‌ కదా!''
''ఎందుకు ఒప్పుకోను? నువ్వు నాలాగే ఇంజనీరింగు చదివావ్‌. నా స్థాయి ఉద్యోగం చేస్తున్నావ్‌. అందుకే కదా ఇంత లెక్చరిస్తున్నావ్‌. పండు వెన్నెల్ని బంగాళా ఖాతం పాలు చేస్తున్నావ్‌''.
''లెక్చరిస్తున్నానంటావా? వెన్నెల మనమీదేగా కురుస్తోంది. ఇపుడు మనకొచ్చిన లోటేమిటోయ్‌''
''లోటు కాదా మరి. పిల్లలొద్దంటూ కండిషన్లు పెట్టడం''
''ఇపుడే పిల్లలొద్దని ముందే అనుకున్నాం కదా!''
''ఏమో! పిల్లలొద్దనుకున్నాం గానీ ఇలాగా.... మా అమ్మకి ఇంకా చెప్పలేదు''.
''ఏ విషయం...''
''పిల్లల విషయం''
''ఇది మన స్వంత విషయం. మనిద్దరి వెసులుబాటుకి సంబంధించింది. వాళ్ళకు చెబుతాం గానీ వాళ్ళ ఆమోదం కోసం మాత్రం కాదు కదా!''
''మా అమ్మ చాలా బాధపడు తుంది''
''అయితే నా కెరీర్‌ విషయం నీకు బాధకల్గించదా?''
''అదేం మాట. పెద్దవాళ్ళ బాధపడతా రంటున్నాను అంతే''
''మనకు ఖచ్చితమైన అభిప్రాయం వుంటే వాళ్ళకి సర్దిచెప్పడం కష్టం కాదు.
''నువ్వన్నది నిజమే. సాధారణంగా మగవాళ్ళ, నాతో సహ ఏదీ మీదేసుకోకుండా పెద్దవాళ్ళ మీద తోసేస్తారు. కొత్తగా ఆలోచించడానికి బద్ధకం. అమ్మల వెనక దాక్కుంటే సరిపోతుందనుకుంటాం''.
''గురూ! మనం కొత్తదారిలో నడుద్దాం. అలాగని పెద్దవాళ్ళని అస్సలు పట్టించుకోవద్దని కాదు. చూడు చూడు మళ్ళీ తెగిన నక్షత్రం మనవేపే వస్తోంది. దోసిళ్లు పట్టు''.
''నక్షత్ర శకలాలు మెరుస్తూ... నీకోసమే చూడు ''దోసిలి అవని ముఖానికి దగ్గరగా తెచ్చాడు''. నీ కోసం ఓ పాట పాడతా వింటావా?''
''వింటావా? ఏంటోయ్‌. నీపాట వినేకదా నీ ప్రేమలో పడ్డాను''.
''అవును కదా! మన కల్చరల్‌ ప్రోగ్రామ్‌ జిందాబాద్‌''
''ఈ నిశ్శబ్దంలో, పండు వెన్నెల్లో నీ పాట వినడం గొప్ప అనుభూతోయ్‌'' అంది అవని గురుని చుట్టేస్తూ.
''అవనీ! మర్చిపోయాను. మా అమ్మ ఏమందో తెలుసా?''
''ఏ విషయం''.
''నేను నా ఫ్లాట్‌ అద్దె కిచ్చే విషయం. నువ్వేంటిరా ఆవనింటికి వెళ్ళడం. అవనియే మనింటికి రావాలి అంది. నేను అమ్మకి అంత వివరించి చెప్పానులే. మనిద్దరం ఎందుకలా నిర్ణయించుకున్నామో కూడా చెప్పాను, ఒ.కే అంది''
''యు ఆర్‌ ఏ గుడ్‌ గై. మనం స్పష్టంగా, దృఢంగా చెపితే తప్పక అర్థం చేసుకుంటారు. మా అమ్మకూడా ముందు గొడవ చేసింది కదా! మన పెళ్ళి విషయంలో''.
''ఆ విషయం ఎలా మర్చిపోతాను. కులాలు వేరని, ప్రాంతాలు వేరని అమ్మో! ఎన్ని గొడవలు చేసారు''.
''అన్నీ దాటేసాంలే. వెన్నెలవేళ సంసారం ముచ్చట్లు విసుగొచ్చాయి కదూ''
''అలా ఏంలేదు. నిజానికి మన జనరేషన్‌ కపుల్స్‌ ఇవన్నీ తప్పని సరిగా మాట్లాడుకోవాలి. మనం అమ్మ నాన్నల్లాగా ఉండలేం కదా! మన సమస్యలు, సవాళ్ళు వేరు. మనకు టైమ్‌ దొరకడమే కష్టం. ఇప్పుడు మాట్లాడుకోవడం, మనస్సులు విప్పుకోవడం అవసరం''
''గురూ! మనం కొత్తతరం ప్రతినిధులం. మన జీవనశైలి మరింత కొత్తగా, మనకు అనుగుణంగా మనమే మలుచుకోవాలి. పోర్ట్‌బ్లెయిర్‌ కనిపిస్తోంది''.
''అవును. మనం మరో అరగంటలో పోర్ట్‌బ్లెయిర్‌ వెళ్ళిపోతాం''
ఇద్దరూ డెక్‌ మీంచి కిందికి దిగు తుండగానే నౌక పోర్ట్‌బ్లెయిర్‌లో ఆగింది.
 ??????
రెండేళ్ళ తర్వాత
???
''గురూ! మనం రెండేళ్ళ క్రితం అండమాన్‌ అఖండ జలరాశి మీద, పండు వెన్నెల్లో ఎన్నో బాసలు చేసుకున్నాం. ఇప్పుడు ఈ కాశ్మీర మంచు శిఖరాల మీద మళ్ళీ వాటిని మననం చేసుకుంటున్నాం''.
కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో విపరీతంగా మంచు కురుస్తున్న వేళ ఓ హోటల్‌ రూమ్‌లోంచి కురుస్తున్న మంచును చూస్తూ నిలబడి వున్నారు. రూమ్‌లో హీటర్‌ వున్నా విపరీతంగా చలిగా వుంది. ఒకరి వొంటి వెచ్చదనాన్ని మరొకరు ఆస్వాదిస్తూ రెండేళ్ళ నాటి కబుర్లను తవ్విపోసుకుంటున్నారు.
''అవనీ! నిజం చెప్పనా? ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే చాలా విసుగొచ్చింది నాకు. హాయిగా హానీమూన్‌ కొచ్చి ఎంజాయ్‌ చెయ్యకుండా ఈ కబుర్లేమిటిరా అని కూడా అనుకున్నాను.
''విసుగొచ్చిందన్నమాట. బాగా తిట్టుకుని వుంటావ్‌''
''ఒప్పుకుంటున్నాను కదా! కానీ ఆ రోజు మనం అంత వివరంగా చర్చించుకోక పోయివుంటే ఆ తర్వాత చాలా గొడవలయ్యేవి. ముఖ్యంగా మా అమ్మతో. సరేగానీ రెండేళ్ళయ్యాక కదా! పిల్లల్ని కనేద్దామా?''
''ఇంక అడ్డేముంది. నా ప్రాజెక్ట్‌ పూర్తయిందిగా. వి. విల్‌ ప్లానిట్‌''.
''మల్లె మొగ్గలు ఆకాశంలోంచి రాలుతున్నట్లు మంచు ఎలా కురుస్తోందో చూడు. ఇంత చలిలో కూడా నువ్వింత వెచ్చగా వున్నావేంటోయ్‌''
''రగ్గులు పెట్టమంటే, బయలు దేరేటపుడు అదేగా అన్నావ్‌. నువ్వుంటే చలేంటని. మర్చిపోయావా బుద్ధూ!! మీ నాన్నకి నువ్వు వంట చేస్తే ఎందుకంత బాధ. నేను నిన్ను కొంగుకి కట్టేసుకున్నానని మా మావయ్యతో అన్నాడంట''.
''నిజమే కదా! నన్ను కొంగుకు కట్టుకున్నావో కొప్పులో ముడేసుకున్నావో నీకు తెలియదా''.
''అంటే....''
''ఛ.... ఊరికే.... సరదాకి అన్నా. నువ్వు ఎవరికీ లొంగవని. ఎవరిని లొంగదీసుకోవని పాపం! ఆయనకు తెలియదు కదా! సంసారమంటే సహజీవన మని, ఇద్దరూ అన్నింటిని సమంగా పంచుకోవడమని ఆయన అర్థం చేసుకోవ డానికి చాలా సమయం పడుతుందిలే''
''నిన్ను నా ఫ్లాట్‌కి రమ్మన్నానని మా అమ్మ నన్నెంత తిట్టిందో తెలుసుగా. అదేంటే. అల్లుడు గారింటికి నువ్వెళ్ళాలి. ఎంత సంపాదిస్తే మాత్రం ఇలాగా ప్రవర్తించేది అంటూ చివాట్లేసింది''.
''మనం వాళ్ళని తప్పు పట్టలేం. వాళ్ళు బతికిన పరిస్థితుల్లోంచి వాళ్ళు మాట్లాడతారు. మారాల్సింది మనమే. మన పరిస్థితులు వేరు. వాళ్లు బతికిన తీరు లేరు''.
''గురూ! నీ ఆలోచనల్లోని స్పష్టత చూస్తుంటే ముచ్చటేస్తోందోయ్‌. మనం మన ఫ్రెండ్సందరినీ చూస్తున్నాం. వాళ్ళ సంసా రాలు ఎలా వున్నాయో చూస్తున్నాం. చిన్న చిన్న విషయాల్లో సైతం సర్దుకోలేక ఎలా గొడవలు పడుతున్నారో మనకు తెలుసు. నీ ఫ్రెండ్‌ రమణ ఏంటి అలా తయారయ్యాడు''.
''రమణొక్కడే కాదు. మా చుట్టాల్లో చాలా మందిని చూస్తున్నాను. మా మేనత్తని మా మావయ్య ఎంత ఘోరంగా హింసిస్తాడో నాకు తెలుసు. అయితే ఓ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా వుంటూ, సంపాదిస్తూ కూడా ఆవిడ ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కాదు''.
''అదే నాకూ అర్థం కాదు. అంత ఆత్మగౌరవం లేకుండా ఎలా బతుకుతారా అన్పిస్తుంది. నా ఫ్రెండ్‌ అనిత తెలుసు కదా! ఒక హెల్ప్‌లైన్‌లో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. వాళ్ళ హెల్ప్‌లైన్‌కి ఎలాంటి కేసులు వస్తాయో, ఈ జనరేషన్‌ వాళ్ళు ఎంత అసహనంతో ప్రవర్తిస్తారో కథలు కథలుగా చెబుతుంటుంది''
''అవునా. మా రమణగాడి వైఫ్‌కి ఆ హెల్ప్‌లైన్‌ నెంబరు ఇస్తే సరిపోతుందిగా. వాడి తిక్కకుదర్చాల్సిందే''
''ఇచ్చానోయ్‌! అనితతో మాట్లాడింది కూడా. అనిత ఎపుడూ ఓ మాటంటుంది. ఈ కాలం మగవాళ్ళకి పెళ్ళాం అందంగా వుండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి మోడరన్‌గా కనబడాలి అదే సమయంలో వాళ్ళ అమ్మలాగా, అమ్మమ్మలాగా ఒదిగి, అణిగి చాకిరీ చేస్తూండాలి. అబ్బాయిలు సర్వసాధార ణంగా ఇలాగే ఆలోచిస్తారు అంటుంది''.
''అనిత అన్న దాంట్లో అతిశయోక్తి ఏంలేదు. నాకు తెలుసుగా నా ఫ్రెెండ్స్‌ సర్కిల్‌ ఆలోచనలెలా వుంటాయో! రిడిక్యు లస్‌. బహుశ నీ పరిచయం లేకపోతే నేనూ అంతే సంకుచితంగా ఆలోచించే వాడినేమో! నిజానికి నీ సాహచర్యంలో నేను చాలా సంస్కారాన్ని సంపాదించుకున్నాను. ఈ దేశంలోని మగవాళ్ళకు వాళ్ళ తండ్రుల ఆస్తితో పాటు అహంకారం కూడా వారసత్వంగా సంక్రమిస్తుంది. నాకలాంటి వారసత్వం వొద్దు అవనీ!''
''అందుకే గురూ! నీ మీద నాకు ఎనలేని ప్రేమ. నీ సంస్కారం, నీ ఆలోచన ల్లోని విశాలత్వం నాకెంతో ఇష్టం''
''అవనీ! నువ్వెపుడూ అంటూంటావే ఓ వాక్యం. అదంటే నాకు చాలా ఇష్టం. ప్రేమలో స్నేహం వుండాలి అంటే నాకు అర్థం కాలేదు మొదట్లో. అవును. ప్రేమలో ఇరుకు వుండకూడదు. స్నేహం వుండి తీరాలి. నేను అహంకారంతో ప్రవర్తించి, నిన్ను కట్టడి చేసి, హింసిస్తే నీ దృష్టిలో నేను అథఃపాతాళానికి జారిపోతాను. అపుడు మన మధ్య ప్రేమేంటి నా ముఖం''
''ఈ విషయాన్ని మగవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేరో కదా! పెళ్ళయిన క్షణం నుండి పెళ్ళాన్ని అదుపు ఆజ్ఞల్లో పెట్టాలనే ఆలోచన స్థానంలో ఇద్దరం ప్రేమగా, స్నేహంగా అన్నీ పంచుకుందాం, పెళ్ళినాడు చేసిన ప్రమాణాలు అవేకదా అని ఎందుకనుకోరు?''
''వాళ్ళకు నీలాంటి పెళ్ళాం లేదుగా'' నవ్వాడు గురు.
''అది సరేగాని నాకో ఐడియా వుంది చెప్పమంటావా''
''చెప్పవోయ్‌''
''మన ఫ్రెండ్స్‌లో చాలా మంది పెళ్ళిళ్ళాయ్యాక చాలా ప్రాబ్లమ్స్‌ ఎదుర్కొంటు న్నారు కదా. అందరూ బాగా చదువుకుని సంపాదిస్తున్న వాళ్ళే. డబ్బుకి కొదవలేదు. కొరవడింది మనశ్శాంతి''.
''నిజమే కానీ మనమేం చెయ్యగలం?''
''చాలా చెయ్యొచ్చు. మనింటి తలుపులు అందరికోసం బార్లా తెరిచేద్దాం. పూనాలో ఓ జంట గురించి చదివినపుడు నాకు చాలా ముచ్చటేసింది. వాళ్ళు మనలాగే ఓ ఆదర్శవంతమైన జీవితాన్ని సాధించు కున్నారు. సమస్యల్లో వున్న వాళ్ళెవరైనా వాళ్ళింటికెళ్ళిపోవచ్చు. వాళ్ళతో కలిసి వుండొచ్చు. తమ కష్టాలను, సమస్యల్ని పంచుకోవచ్చు. ఇంకో అద్భుతమైన విషయమేమిటంటే వాళ్ళు వాళ్ళింటి తాళం బయట గూట్లోనే వదిలేసి వెళ్ళిపోతారట.
ఎవరైనా ఫోన్‌ చేసి మీ యింట ికొస్తున్నామంటే, తాళం ఫలానా చోట వుంది తీసుకుని లోపలికెళ్ళండి. మేం సాయంత్రమో, రేపో వస్తామని చెబుతారట. గురూ! నాకు కూడా అలాంటిది ప్లాన్‌ చెయ్యాలని వుంది. మనం ఎంత హాయిగా వున్నామో, దాన్ని ఎలా సాధించుకున్నామో ప్రత్యక్షంగా చూపిద్దామోయ్‌''
అవని వేపు అలాగే చూస్తుండి పోయాడు గురు. స్వచ్ఛంగా మెరుస్తున్న కళ్ళమీద ముద్దు పెట్టి
''వండర్‌ఫుల్‌ ఐడియా! యు ఆర్‌ సో డిఫరెంట్‌. ఐ లవ్‌ యూ'' అంటూ అవనిని ఉక్కిరి బిక్కిరి చేసాడు.
''మనం ఒకసారి పూనా వెళ్ళొచ్చి వాళ్ళతో మాట్లాడాక వచ్చే న్యూ యియర్‌ నుంచే మన ప్రాజెక్ట్‌ మొదలు పెట్టేద్దాం''.
''మన సంతోషాన్ని అందరికీ పంచుతానంటే నేనొద్దంటానా''
''దీనికి ఓ మంచి పేరు పెట్టాలి ఏమని పెడదాం''
''పేరా? ఉండు. నాకేదో గొప్ప ఆలోచన వచ్చేస్తోంది. నీ ఫేవరేట్‌ వాక్యం. ప్రేమంటే స్నేహం. స్నేహముంటేనే ప్రేమ వికసిస్తుంది. ఎలా వుంది?''
''బావుంది. ఇంకొంచం ఆలోచించ వోయ్‌ గురుదేవా?''
''ఉండు శిష్యా. కాస్త ఆలోచించు కోనీ''
''సరే ఆ విషయం ఆలోచిద్దాం లే గురూ! నాకు నిజంగా ఈ రోజు ఎంతో సంతోషంగా వుంది''.
''అవనీ. నాకు సంతోషంగా... చాలా సంతోషంగా వుంది. మొగుడూ పెళ్ళాలు స్నేహంగా వుంటే, అన్నీ పంచుకుంటే ఎంత బావుంటుందో అర్థమౌతోంది. సహజీవనం అంటే ఇలాగే వుండాలి అని చాలా బలంగా అందరికీ చెప్పాలన్పిస్తోంది''.
''మనం ఆ పనేగా చెయ్యబోతున్నాం. మంచులోకి వెళదామా గురూ''
''సరంజామా అంతా వుందిగా. పద పోదాం''
కోట్లూ, బూట్లూ తగిలించుకుని జోరుగా కురుస్తున్న మంచులోకి నడిచారిద్దరూ. మంచుపూల వానలో తడుస్తూ, స్వచ్ఛమైన ఆలోచనల్ని, సంస్కార వంతమైన ఆచరణని స్వప్నిస్తూ వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఇంకొకరు చెయ్యేసి అలా మంచుమీద నడుస్తూ ముందుకెళ్ళసాగారు. ప్రేమలో స్నేహాన్ని సాధించిన వాళ్ళిద్దరూ రేపటితరం ఆకాంక్షల్లా అన్పిస్తున్నా

Wednesday, July 8, 2009

నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి - కమలాదాస్

నేను డిగ్రీ పూర్తి చేసి నాకొక ఉనికిని, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ
హైదరాబాద్ చేరిన తొలిరోజులు. చదువుకున్నది తెలుగు మాధ్యమంలోనే అయినా మా
హిస్టరీ లెక్చరర్ నాకు ఆంగ్ల సాహిత్యం పట్ల ఎంతో ఇష్టాన్ని, ఆసక్తిని
రేకెత్తించారు. ఆవిడ ప్రేరణతోనే డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ సబ్జక్టుగా
తీసుకున్నాను. టెంత్ క్లాసులో సంస్కృతం, ఇంటర్ లో స్పెషల్ తెలుగు,
డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీషు చదవడం వల్ల సాహిత్యం పట్ల ఎనలేని ప్రేమ
ఏర్పడింది. నా కుటుంబ నేపధ్యం సాహిత్యాను రక్తిని కల్గించేది కాదు. నాకు
నేనుగా సాహిత్యంలో మునగడం, తేలడం నేర్చుకున్నాను. కంటబడిన ప్రతి
పుస్తకాన్ని చదవడం, ఆ పుస్తకం కల్గించే ప్రభావానికి లోనవ్వడం, జీవితానికి
అన్వయించుకోవడం ఓ క్రమపద్ధతిలో జరిగాయి. రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా
నుండి గంగా వరకు చదివి నేను తీవ్రమైన ప్రభావానికి గురయ్యాను. అలాగే
సి.వి.రాసిన “సత్యకామ జాబాలి”. ప్రేమ్ చంద్ “గోదాన్” మహాశ్వేతాదేవి
పుస్తకాలు. ఇలా ఎన్నో వేల పుస్తకాలు జీవితాన్ని సుసంపన్నం చేసాయి.

నేను 1976 లో హైదరాబాదు వచ్చాను. అదే సంవత్సరం కమలాదాస్ ఆత్మకథ “మై
స్టోరి” రిలీజ్ అయ్యింది. ఆ రోజుల్లో నేను కొని చదివిన “మై స్టోరీ”
పుస్తకం ఖరీదు ఆరు రూపాయలు. చిన్న ఫాంట్ లో వుంటుంది. కమలాదాస్ మరణ వార్త
విన్నాక దాన్ని తీసి చదవబోతే ఎర్రగా మారిపోయిన పేజీలు, ఈ వయస్సులో అంత
చిన్న ఫాంట్ చదవడం చాలా కష్టమైంది. పేజీలో పేరుకుపోయిన “డష్ట్ మైట్స్”
విజృంభించి నా మీద దాడి చేసి తుమ్మల మీద తుమ్మలొచ్చి కళ్ళలోంచి బొటాబొటా కమలా దాస్ మరణం కల్గించిన దుఖం వల్ల
నీళ్ళొచ్చాయో, పాతపుస్తకం ముట్టుకోవడం వల్ల వచ్చాయో నేను నిర్ణయించుకోలేక
పోయాను. ఎందుకంటే కమలాదాస్ భౌతికంగా వేల మైళ్ళ దూరంలో వున్న తన రచనల
ద్వారా, జీవన విధానం ద్వారా నా మీద విపరీతమైన ప్రభావం వేసిన రచయిత్రి.
సంచలనాలకు పెట్టింది పేరైన కమలాదాస్ పనిగట్టుకొని సంచలనాలను
సృష్టించలేదు. తను నమ్మిన దాన్ని ఆచరించడాన్ని జనం సంచలనాలుగా పిలవడం
జరిగింది. ఆమె ఏం మాట్లాడినా, రాసినా, ఆచరించినా తను నూటికి నూరు శాతం
నమ్ముతూ చేసిందే. ఎవరైనా కొత్త సంచలనం ఏం సృష్టించబోతున్నారని అడిగితే,
“నేను నమ్మిన దాన్ని మాట్లాడుతున్నాను. వివాదాస్పదంగా బతకడం నా కేమీ సరదా
కాదే. జనం ఎందుకలా అనుకుంటారు?” అంటూ ప్రశ్నించేది కమలాదాస్.

కమలాదాస్, నిజానికి మరణ శయ్య మీద హాస్పిటల్ లో ఉండి, హాస్పిటల్ బిల్లులు
చెల్లించడానికి “మై స్టోరీ” రాసింది. నేను ఈ లోకంలోంచి నిష్క్రమించే
ముందు, ఆ సమయం ఆసన్నమయ్యేసరికి నాలో ఉన్న అన్ని రహస్యాలను నాలోంచి బయటకు
పంపెయ్యాలనుకున్నాను. అందుకే ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. అయితే
అనూహ్యంగా నేనుకోలుకున్నాను. నా కుటుంబం గురించి బంధువుల గురించి నేను
రాసిన అంశాలు వాళ్ళల్లో తీవ్రమైన కోపాన్ని కల్గించాయి. చట్టబద్ధంగా ఒక
వ్యక్తిని వివాహమాడి అతనితో వుంటూనే నేను వివాహం బయట వ్యక్తులతో ప్రేమలో
పడ్డానని రాయడం పెను వివాదానికి దారి తీసింది. నేను నా స్వంత ఊరు
వెళ్ళినపుడు ఆ కోపాల మంట నన్ను తాకింది. నేను బొంబాయి పారిపోవలసి
వచ్చింది.” అంటుంది “మైస్టోరీ” కి రాసిన ముందు మాటలో.

1932 లో మలబార్ తీరంలో సంప్రదాయ నాయర్ల కుటుంబంలో పుట్టింది. తండ్రి
వి.యం.నాయక్ “మాతృభూమి” అనే మళయాల పత్రికకు మానేజింగ్ ఎడిటర్ గా
పనిచేసేవాడు. తల్లి బాలామణి అమ్మ కవయిత్రి. తల్లి తండ్రులిద్దరూ తమ
వ్యాపకాల్లో మునిగి తేలుతుండడం వల్ల కమలాదాస్ బాల్యం ఒంటరితనంలోనే
గడిచింది. అయితే తల్లి, మేన మామ నారాయణ మీనన్ లు రచయితలుగా
ప్రసిద్ధులవ్వడం వల్ల ఇంటి నిండా సాహిత్య వాతావరణం వుండేది. చిన్నప్పటి
నుండే కవిత్వం చదవడం అలవాటైంది కమలకు. తనూ కవితలల్లడం అలవరుచుకోవడంతో
పాటు తన దైన ఊహల్లో విహరిస్తూండేది. బాల్యంలో ఎదుర్కొన్న ఒంటరితనానికి
తోడు స్కూల్ వాతావరణం, అక్కడి యాంత్రికత ఆమెను తీవ్రమైన నిరాశను
మిగిల్చాయి. అందుకే ఆమెకు ఆరేళ్ళ వయసప్పుడు రాసిన కవిత్వంలో ఎంతో
విషాదముండేది.

“నేను ఆరేళ్ల వయసప్పుడే చాలా సెంటిమెంటల్ గా ఉండేదాన్ని. విషాదభరితమైన
కవితలు రాసేదాన్ని. తలలు తెగిపోయి, ఎప్పటికీ తలలేకుండా వుండే బొమ్మల
గురించి కవితలు రాసేదాన్ని. అలాంటి ప్రతి కవిత నన్ను ఏడిపించేది” అంటుంది
తన ఆత్మకథలో.

అలాంటి ఒంటరితనపు, విషాదపు బాల్యం గడవక ముందే 15 సంవత్సరాలకే తన కంటే
చాలా పెద్దవాడయిన మాధవ దాస్ తో పెళ్ళి జరగడం ఆమెను మరింత నైరాశ్యంలోకి
తోసేసింది. మాధవ్ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక తొలిసారి ఆమెని కలవడానికి
కలకత్తా వొచ్చినప్పుడు అతని ప్రవర్తన ఆమెను తీవ్రంగా గాయపరచడతో పాటు అతని
పట్ల విముఖతను ప్రోదచేసింది. అతని మొరటుతనం ఆమెను భయపెట్టింది. తన
ఒంటరితనాన్ని దూరం చేస్తాడని భావించిన ఆమె అతన్ని వెకిలి చేష్టలని
అసహ్యించుకుంది.”

“అతను నన్ను సున్నితంగా తన చేతుల్లోకి తీసుకోవాలని, నా చెవుల్లో ప్రేమ
భాష్యాలు చెప్పాలని ఆశించాను. నాతో ప్రేమగా సంభాషించాలని, స్నేహం
కురిపించాలని, వెచ్చటి స్పర్శని పంచాలని కోరుకున్నాను. తన చేతులతో నా
ఒంటరితనాన్ని దూరం చేస్తాడని నేను గాఢంగా ఆశించాను.”

అలా జరగక పోగా ఆమె ఒంటరిగా వున్నప్పుడు అతని మొరటు శృంగార చేష్టలు ఆమె
సున్నితమైన శరీరం మీద నల్లటి, ఎర్రటి మచ్చల్ని మిగిల్చాయి. వివాహం జరిగాక
తన తొలి రాత్రి అనుభవాన్ని ఇలా వర్ణిస్తుంది.

“తొలి రాత్రి ఎలాంటి హెచ్చరికా లేకుండా అతను నా మీద పడ్డాడు. అతన్నుంచి
తప్పించుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను. నా గుండె వేగంగా
కొట్టుకోవడంతో నన్ను వదలమని ఎంతో బతిమాలాను. వినలేదు. ఆ రాత్రి అతని
అత్యాచార పర్వం అసంపూర్తిగానే మిగిలింది. ఆ రాత్రి పదే పదే అతను నన్ను
గాయపరుస్తూనే వున్నాడు.”

కమలాదాస్ “మారిటల్ రేప్” గురించి, తన తొలిరాత్రి అనుభవం గురించి వివరంగా
తన ఆత్మకథలో “wedding night:” అనే చాప్టర్ లో ఎంతో ధైర్యంగా రాసింది.

పెళ్ళి, భర్త లాంటి ఆలోచనలు కలగని వయస్సులోనే పెళ్ళవడం, వివాహ జీవితంలో
కుదురుకోక ముందే 16 ఏళ్ళకే తల్లవడం జరిగిపోయాయి. కమలాదాస్ పెద్దకొడుకు
నల్లప్పన్ ఆమెకు పదహారేళ్ళకే పుట్టాడు. వెంట వెంటనే ఇద్దరు కొడుకులు
పుట్టడంతో చిన్నారి కమల చిన్నపిల్లలాగే తన కొడుకులతో కలిసి ఆడేది,
పాడేది. పెద్దకొడుకు పుట్టాక, ఆమె భర్త కనపరిచిన విసుగు, నిర్లక్ష్యం
ఆమెను ఎంతో బాధపెట్టేవి. అతనికి సెక్స్ తప్ప ఇంకేది పట్టేది కాదు. ఫక్తు
వ్యాపారి లాగా ప్రవర్తించేవాడని రాస్తుంది ఒకచోట. తను ఊహించుకున్న
జీవితానికి, వాస్తవంతో తను బతుకుతున్న జీవితానికి ఎక్కడా పొంతన కుదరక
తీవ్రమనస్తాపం పొందేది. ఈ సంఘర్షణంతో ఆమె కవిత్వంలో పొంగిపొర్లేది.
సమ్మర్ ఇన్ కలకత్తా, ది దిసెండెంట్స్ కవితా సంపుటిల్లో తన మానసిక
కల్లోలాన్ని, కలవరాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే భర్త నిర్లక్షాన్ని,
తిరుగుబోతు తనాన్ని ధిక్కరిస్తూ, తాను కూడా అతని లాగానే విశ్వాస
రాహిత్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటుంది.

I made up my mind to be unfaithful to him, at least physically.” ఒక
భవన నిర్మాణ కార్మికుడితో ప్రేమకలాపాలు సాగించడానికి ఎలా ప్రయత్నించింది
ఎంతో వివరంగా, ధైర్యంగా “మైస్టోరీ”లో రాస్తుంది.

ఈ సాహసం, తిరుగుబాటు తత్వం బతుకు పొడుగునా కలుపుకోవడం కమలాదాస్
ప్రత్యేకత. సంసార జీవితం లోని మొనాటనీని అత్త, భర్తల సాధింపులను
తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి సైతం సిద్ధపడుతుంది. అక్కడ కూడా
విఫలమై రాజీ పడుతుంది. భర్తకు చాకిరీ చెయ్యడం అతని చొక్కాలకు బటన్లు
కుట్టడం, వొళ్ళు నలిగేదాకే చాకిరీ చేయడం అలవాటు చేసుకున్నా ఆమెలోపలి ఆత్మ
అనుక్షణం ఆమెను ధిక్కరించేవి. తను కలలు కన్న జీవితానికి, తాను బతుకుతున్న
జీవితానికి ఎక్కడా పొంతన కుదరక మానసిక సంఘర్షణని అనుభవిస్తూ, ఆ సంఘర్షణని
కవితలుగా మలచడం అలవాటు చేసుకుంది.

ఒక రోజు కమలాదాస్ భర్త మాధవ్, తన పురుష ప్రేమికుడుతో కలిసి తమ పడకగది
తలుపులు బిగించుకున్నపుడు, (అదీ తన పుట్టిన రోజు నాడు) కమల భరించలేక
భోరున ఏడ్చింది. తన భర్త ప్రేమ తనది కాదని అర్ధమై అర్ధరాత్రిళ్ళు ఒంటరిగా
దుఃఖంతో సతమతమయ్యేది. అలాంటి ఓ రాత్రి, కొత్త జీవితాన్ని, కొత్త
భవిష్యత్తునూ ఆశిస్తూ
“wipeout the paints, unmould the clay,
Let nothing remain of that yesterday”

అంటూ రాసిన కవితని అప్పటికప్పుడు పత్రికకు పంపించింది. ఇంట్లో పనంతా
అయ్యాక, అందరూ తిని నిద్రపొయ్యాక, అర్ధరాత్రి వేళ డైనింగ్ టేబుల్ ని
శుభ్రం చేసుకొని అక్కడే రాయడానికి కూర్చునేది. గంటలు అలా గడిచిపోతుండేవి.
ఒక్కోసారి తెల్లారి పోయేది. రాత్రంతామేలుకొని రాస్తూ వుండడం, పగలు మళ్ళీ
కుటుంబ బాధ్యతలు వీటన్నింటితో ఆమే ఆరోగ్యం పాడవడం మొదలైంది.రచయిత్రి
కావాలనుకునే స్త్రీకి ఈనాటికీ తనకంటూ ఓగది, ఓ టేబుల్, కుర్చీ, సరిపడిన
సమయం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కమలాదాస్ ఇలా అంటుంది.

“నేను మామూలు మధ్యతరగతి స్త్రీ గురించి ముఖ్యంగా ఎవరైతే రచయిత
కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నా విషయానికొస్తే
వంటింట్లో కూరగాయలు తరుక్కునే బల్ల, భోజనాలు తినే బల్ల ఇవే నా రచనా
స్థలాలు. అదంతా శుభ్రం చేసుకుని రాసుకోవడానికి కూర్చోవాలి. అదే నేను
పనిచేసుకునే స్థలం. అందరూ నిద్రపోయాక నేనూ, నా టైప్ రైటర్ మాత్రమే
మేలుకొని వుంటాం. అలాంటి సమయంలోనే నేను నా కుటుంబాన్ని పూర్తిగా
మర్చిపోయి స్వతంత్ర వ్యక్తిగా మిగులుతాను. ఆ నిశ్శబ్ద నిశిరాత్రి నన్ను
నేను కనుగొంటాను.” అంటుంది. 1921 లో వర్జీనియా వుల్ఫ్ “ఏ రూమ్ ఆఫ్ ఒన్స్
ఒన్” లో “ప్రతి స్త్రీ తనకంటూ ఓ గది, తనదంటూ కొంత సొమ్ము తప్పకుండా
కలిగి ఉండాలి. రచయిత్రి కావాలనుకునే స్త్రీలకి ఇవి ఖచ్చితంగా వుండాలి”
అంటుంది. కమలాదాస్ లాంటి ప్రసిద్ధ రచయిత్రులు కూడా డైనింగ్ టేబుల్ మీదే
తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం నిజంగా విషాదమే కదా!

కమలాదాస్ కథలు, నవలలు రాసినప్పటికీ ఆమె రాసిన కవిత్వం బహుళ ప్రజాదరణ
పొందింది. తనలో చెలరేగే సంఘర్షణలను, భావోద్వేగాలను, కల్లోలాలను
వ్యక్తీకరించడానికి కథ, నవల కన్న కవిత్వానికే ఎక్కువగా ఎంచుకున్నది. ఆమె
భావాల తీవ్రత, స్వేచ్చా కాంక్ష కవిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతుంది.
“పునీల్” అనే కవితలో

నిజం,
ఒకటి రెండు కట్టుబాట్లని నేను మీరాను
అయినప్పటికీ దైవాన్ని కాని, సమాజాన్ని కాని క్షమాభిక్ష కోసం అర్ధించను.
అతిక్రమణలోనే ఆనందాన్ని అనుభవించాను
నిజంగా, నన్ను నేను పునీతురాలిగానే భావిస్తాను.
పుణ్యం కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు
పరిత్యాగంలోని నిజమైన స్వేచ్ఛా సమయాల కోసం మాత్రమే!”

( - అనువాదం పసుపులేటి గీత)

“నాలో సుడులు తిరిగే బాధే కవితలుగ రూపెత్తాయ్. ప్రతి కవిత బాధలోంచే
పుట్టింది.” అంటుంది ఒకచోట. ఒంటరితనం, భార్యాభర్తల సంబంధంలోని బోలుతనం,
యాంత్రికత,ప్రేమ రాహిత్యం కమలాదాస్ ని నిరంతర అన్వేషణలోకి నడిపాయి.
సంతోషం కోసం, నిజమైన ప్రేమ కోసం ఈ అన్వేషణ కొనసాగింది. సూటి బాణాల్లాంటి
కవితల్లో తన భావోద్వేగాలను వ్యక్తీకరించడం, జనాలను షాక్ చెయ్యడం ఆమెకు
వెన్నతో పెట్టిన విద్య.

“స్టాక్ వెరిఫికేషన్” అనే కవితలో ………….

మునుల తాళపత్ర గ్రంధాలు, సాధువుల ప్రవచనాలు నన్ను శాంత పరిచే వేదాంతాలు,
ఏవీ నా మీద రుద్దకండి కాళ్ళ మధ్య ఓ మనిషిని బిగబట్టి ముగ్గురు
కొడుకుల్ని బయటకు తెచ్చాను” అని రాయగలిగిన సత్తా కమలాదాస్ లో మాత్రమే
చూడగలం.

కమలాదాస్ కవిత్వం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న వేళ, ఆమె భర్తకి కవిత్వ
రచన లాభసాటి వ్యాపారంగా కనబడలేదు. రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసే మాధవ్
దాస్ ఇంటా బయటా ఎప్పుడూ డబ్బులెక్కల్లోనే మునిగి తేలుతుండడం, ఆమె ఏం
రాస్తే డబ్బులు రాలతాయో ఆలోచించడం, ఆమెను కవిత్వం రాయడం మానేసి కథలు
రాయమని నిర్దేశించడంతో కమల నవలలూ, కాలమ్స్ రాయడం మొదలుపెట్టింది.” అతను
చెప్పిన దాన్ని నేను ఏనాడూ వ్యతిరేకించలేదు. దీనివల్ల నాలో కవిత్వం ఎండి
పోయింది కానీ మా దాంపత్యం మాత్రం విజయవంతంగా నడిచింది.” అంటుంది.
అందులోని వ్యంగ్యాన్ని, పదునును అర్ధం చేసుకుంటే తప్ప కమలాదాస్ వేదనని
అర్ధం చేసుకోలేం.

కమలాదాస్ మళయాళ సాహిత్యాన్ని “మాధవకుట్టి “,ఆంగ్ల సాహిత్యాన్ని” కమలాదాస్
“పేరుతోను రాసేది. ఆమె రాసిన ఆంగ్ల రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
ప్రాచుర్యం పొందాయి. నోబుల్ సాహిత్య పురస్కారానికి కూడా! కమలాదాస్
ఆంగ్లంలో అయిదు కవితాసంపుటులు ఒక నవల ” అల్ఫాబెట్ ఆఫ్ లష్ట్” “పద్మావతి
ది హర్లెట్ అండ్ అదర్ స్టోరీస్” పేరుతో కథల సంపుటి, “మైస్టొరీ” ఆత్మకథ
ప్రచురించింది.

కమలాదాస్ కథల నిండా కలకత్తాలో ఆమె బాల్యం తాలూకు అమాయికత్వం, జ్ఞాపకాలు
నిండి వుంటాయి. ఆమె కవిత్వం ఎలాంటి దాపరికాలు లేకుండా, కుండ బద్దలు
కొట్టినట్టు వుంటుంది. “ఇల్లాలినంటూ నాకో పేరుపెట్టావ్/ నీకు టీ
కాచడానికి పటిక బెల్లం దంచడం/ వేళ తప్పకుండా విటమిన్ గోలీలివ్వడం/ ఇదీ
నేను నేర్చుకున్న చదువంతా” కమలాదాస్ ఇంటి చాకిరీ, భర్తకి సేవలు చేయడం
గురించి ఇంత సూటిగా రాయడం ఇపుడూ పెద్ద గొప్పగా, కొత్తగా అన్పించకపోవచ్చు.
80 దశకంలో తెలుగు సాహిత్యంలోకి స్త్రీవాద ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి వొచ్చి
చేరినపుడు తెలుగు కవయిత్రులు ఇంతకంటే సూటిగ, ఘాటుగా కవిత్వం రాసారు. కానీ
కమలాదాస్ రాసిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆమె ఎంత విప్లవాత్మకంగా,
స్త్రీవాద దృష్టి కోణంతో రాసిందో అర్ధం చేసుకోవచ్చు. సహజంగానే ఆమె రచనలు
సంప్రదాయ వాదాల్లో గగ్గోలు పుట్టించాయి. 1976 లో ఆమె ప్రచురించిన
“మైస్టోరీ” జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గొప్ప కీర్తిని
సంపాదించిపెట్టినా అంతే స్థాయిలో ఆమె మీద విమర్శల జడివాన కూడా కురిసింది.
అందులో ఆమె వర్ణించిన అనుభవాలు, వివాహేతర సంబంధాల వర్ణనలు, ఆడస్నేహితులతో
ఎదురైన అనుభవాలు భర్త కొనసాగించిన హోమోసెక్సువల్ సంబంధాలు -
వీటిన్నింటిని నదురు బెదురు లేకుండా తన ఆత్మకథలో రాసిన కమలాదాస్
సంప్రదయవాదులతో పాటు బంధువుల ఆగ్రహానికి కూడా గురైంది. లెస్బియన్ రిలేషన్
షిప్ గురించి ఆమె రాసిన అంశాలు చాలా మందిని షాక్ చేసాయి. 18 సంవత్సరాల
అమ్మాయి తన పట్ల వ్యవహరించిన విధాన్ని

“ఆమె నా పెదాల మీద ముద్దు పెట్టింది. నా చెవుల్లొ నువ్వు చాలా స్వీట్ గా
వున్నావ్ అంటూ గుసగుసలాడింది. నా జీవితంలో నేననుభవించిన మొదటి ముద్దు
ఇదే. మా అమ్మ నేను పసిదానిగా వున్నపుడు ముద్దు పెట్టిందేమో గాని ఆ తర్వాత
ఎవ్వరూ నాకు ముద్దివ్వలేదు” అంటుంది.

కమలాదాస్ రాసిన విషయాలు ఆనాటి మళయాళీ సమాజాన్ని ఓ కుదుపు కుదిపాయి.
నిర్భయంగా ఆమె వెల్లడించిన అంశాలను చూసి గగ్గోలు పెట్టే సమాజాన్ని మరింత
ఏడిపించాలనే అల్లరి ఆలోచనలు కూడా ఆమె చేసిందా అన్పించేలా ఆమె ఆత్మకథలో
ఒక్కో చాప్టర్ కి ఆమె పెట్టిన శీర్షికలు వున్నాయి. బహుశా ఆమె ఆత్మకథను
సీరియలైజ్ చేసిన పత్రిక కూడా రెచ్చగొట్టే విధంగ శీర్షికలు పెట్టినట్టు
అన్పిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో అవన్నీ ఉత్తుత్తి సంఘటనలే అని
ప్రకటించింది కూడా!

కమలాదాస్ తన జీవితమంతా ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం
అన్వేషించింది. “ప్రేమతోను, నమ్మకంతోను నిండీన సంబంధాలను స్త్రీ పురుషులు
ఇద్దరూ కోరుకుంటారని, అని ఇంట్లో దొరకనప్పుడు బయట వెతుక్కుంటారని” ఒక
ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె. వివాహం బయటి ప్రేమ ను వెదుక్కొవడం అనే
ఆలోచననే సహించని సంప్రదాయ సమాజం, ఆమె భావాలను విని వొదిలేస్తుందని
భావించడం వెర్రితనమే అవుతుంది. అందుకే మాట్లాడిన ప్రతి మాట, రాసిన ప్రతి
అక్షరం వివాదాస్పదమైంది. ఆమె మనస్ఫూర్తిగ నమ్మిన దాన్ని చెప్పింది తప్ప
సెన్షేషన్ కోసమో, వివాదం కోసమో చెప్పలేదు. ఆమె దృష్టీలో శారీరక, మానసిక
సౌందర్యాల మధ్యన భేదం లేదు. శరీర సౌందర్యాన్ని వర్గించడంలో ఆమె ఎలాంటి
శషబిషలు పాటీంచలేదు. “డాన్స్ ఆఫ్ యూనక్స్”, “యాన్ ఇంట్రడక్షన్” లాంటి
కవితల్లో దీనిని మనం చూడొచ్చు. “యాన్ ఇంట్రడక్షన్” కవితలో

“I am every/ woman who love” అంటుంది. 70 దశకంలో కొత్తగా రాస్తున్న
రచయిత్రులకు ప్రతినిధిగా కమలాదాస్ “వ్యక్తిగతంగా సమాజం భావించే అన్ని
అంశాల మీద రాస్తూ, ఆయా అంశాలను బహిరంగపరచడానికి ఎలాంటి సంకోచం లేకుండా
రాస్తూ పోయింది. అప్పటికే ఇస్మత్ చుంగ్తాయ్ రాసిన “రిహాయి”కథ సంప్రదాయ
సాహిత్యలోకంలో పెను సంచలనాలను కలిగించింది. కమలాదాస్ తన అనుభవాలుగా
అంగీకరిస్తూ, శరీరం గురించి, కోరికల గురించి, ప్రేమ గురించి, మానవీయ
స్త్రీ పురుష సంబంధాల గురించి ధైర్యంగా రాయడం ద్వారా కొత్తగా రాస్తున్న
రచయిత్రులకు ఎంతో స్ఫూర్తిని, నిబ్బరాన్ని ఇచ్చింది. ఎనభై దశకంలో
వెల్లువెత్తిన స్త్రీవాద సాహిత్యానికి, స్త్రీ వాద కవయిత్రులకు
స్ఫూర్తిగానూ కమలాదాస్ రచనలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

కమలాదాస్ ఏది రాసినా సంచలనమే. ఏది ఆచరించినా సంచలనమే. డిశంబరు 16, 1999
సంవత్సరంలో 65 ఏళ్ళ వయస్సులొ ఇస్లామ్ మతాన్ని స్వీకరించింది. ఆమె రచనలు
ఎంత సంచలనం కల్గించాయో ఆమె ఇస్లామ్ మత స్వీకరణ కూడా వేడి వేడి చర్చల్ని
లేవనెత్తింది. అంతే కాదు బురఖా ధరిస్తూ, స్త్రీలను అణిచివేసే హిందూ మతంలో
కన్నా ఇస్లామ్ లోనే స్త్రీలకు రక్షణ వుందనే ప్రకటన కూడా చేసింది.
సహజంగానే ఇలాంటి ప్రకటనలు జనంలో ఆమె పట్ల ఆగ్రహాన్ని వెల్లుబికిస్తాయి.
అయితే కమలాదాస్ తాను నమ్మిన దాన్ని ఆచరించడానికి, రాయడానికి, బహిరంగంగా
ప్రకటించడానికి ఏనాడు జంక లేదు. ఒక సంప్రదాయ హిందూ నాయర్ కుటుంబానికి
చెందిన కమలాదాస్, భర్త మరణానంతరం ఇస్లాం స్వీకరించి, పేరు మార్చుకుని
తుదివరకు అలాగే బతికింది.

కమలాదాస్ రాజకీయాలను కూడా వొంటబట్టించుకుని “లోక్ సేవా పార్టీ” ని
స్థాపించి 1984 పార్లమెంటు అభ్యర్ధిగా పోటి చేసి ఓడిపోయింది.

తనని తాను ఫెమినిష్ట్ గా చెప్పుకోక పోయినా, తన జీవితంలోని అనుభవానలను,
తాను నమ్మిన వాటిని గురించి రాస్తూ స్త్రీల జీవితాల్లోని అణిచి వేత
గురించి రాసింది. తన గురించి రాసుకున్నా, వారెవ్వరి గురించి రాసినా ఆమె
ఎక్కడా ఏ ముసుగులూ వేసుకోలేదు. జీవితమంతా ప్రేమకోసం వెదుకులాటే అయ్యింది
ఆమెకి. “నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు. ప్రేమకోసం వెదుకులాటే నా జీవితమంతా”
అంటుంది ఒకచోట.

కమలాదాస్ తన రచనల ద్వారా ఇంగ్లీషు, మళయాళ సాహిత్యాల్లో అజరామరంగా
నిలిచిపోతుంది. నిరంతర అన్వేషిగా జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆ
ప్రయోగాల పర్యవసానంగా ప్రజల ఆగ్రహాలను చవి చూసింది. తన అన్వేషణలో భాగంగా
పెయింటింగ్స్ వేసింది. రాజకీయాల్లోకి నడిచింది. మతం మార్చుకుంది. నిరంతర
అన్వేషణలో భాగమే ఇవన్నీ కూడా. ప్రేమతో నిండిన స్త్రీ పురుష సంబంధాల కోసం
జీవితమంతా అన్వేషించింది. మనుష్యుల మధ్య మానవీయ సంబంధాల కోసం ఆరాటపడింది.

2006 లో కమలాదాస్ చిట్టచివరి సారి కేరళను సందర్శించింది. తన తాతల నాటి
ఇంటిని, స్థలాన్ని కేరళ సాహిత్య అకాడమీకి దానం చేసింది. తను బతికుండగా
మళ్ళీ కేరళకు రాలేననే విషయం ఆమెకు అర్ధమైనట్టే వుంది. అందుకే ఇలా
అంటుంది.

“నేను మళ్ళీ నా మరణం తర్వాత ఇక్కడికి వస్తాను. మానవాకృతిలో మాత్రం కాదు.
ఒక పక్షిగానో, ఒక లేడిగానో మాత్రమే వస్తాను. నేను ఈ భూభాగంలో మమేకమై
వుంటాను.”

కమలాదాస్ తుది శ్వాస విడిచింది పూనాలో తన రెండో కొడుకు ఇంట్లో. 75
సంవత్సరాల తన అన్వేషణకు ఫుల్ స్టాప్ పెడుతూ 31 మే కమలాదాస్ మరణించింది.
చనిపోయేందుకు రెండు సంవత్సరాల ముందు తనను దర్శించవచ్చిన మిత్రుడు విజయ్
నంబీశన్ తో నేను ముసలి దాన్ని అయిపోతున్నాను” అంటుంది. 72 ఏళ్ళ వయస్సులో
తను ముసలితనంలోకి వెళ్ళినట్టు కొత్తగా చెప్పడం, గమనించడం అంటే తనలోని
పసిప్రాయం లేకుండా పోయిందని అంగీకరించడమే. అలాంటి చిన్నపిల్లలతత్వం ఆమెలో
తుదిదాక బతికుండడమే ఆమెలో గొప్పతనం.

నిరంతరాన్వేషి,, సంచలనాల చిరునామా, ప్రేమ పిపాసి, సాహసి కమలాదాస్ కు ఇదే
నా అక్షరాంజలి. తన ఆత్మకథ ద్వారా నా మీద ఎంతో ప్రభావం చూపిన కమలకు నా
అశ్రు నివాళి

Tuesday, June 30, 2009

భూమిక హెల్ప్‌లైన్‌ : మూడేళ్ళ ప్రయాణం


భూమిక హెల్ప్‌లైన్‌ ఆక్స్‌ఫామ్‌ వారి ఆర్థిక సహాయంతో ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడుతున్న విషయం అందరికీ విదితమే. అయితే ఆక్స్‌ఫామ్‌ వారు ఈమధ్య కొత్తగా చేపట్టిన DFID ప్రాజెక్ట్‌ కింద ”సివిల్‌ సొసైటీ రిసోర్స్‌ ఫెసిలిటీ” గా బాధ్యతలు నిర్వహించేందుకు భూమిక హెల్ప్‌లైన్‌ను ఎంచుకొనడం జరిగింది. ఇది గత మూడు సంవత్సరాలుగా భూమిక చేస్తున్న కృషికి గుర్తింపుగా మనం భావించవచ్చు. ఈ ప్రాజెక్టుపై భాగస్వాములతో అవగాహనా సదస్సు మరియు గడిచిన మూడు సంవత్సరాలలో భూమిక హెల్ప్‌లైన్‌పై విశ్లేషణా సదస్సు ఏప్రిల్‌ 27న సెలెబ్రిటీ క్లబ్‌లో నిర్వహించడం జరిగింది.

భూమిక హెల్ప్‌లైన్‌ కో-ఆర్డినేటర్‌ కొండవీటి సత్యవతి సమావేశం ప్రారంభిస్తూ ప్రాజెక్టు గురించి కొద్దిగా వివరించారు. ఆక్స్‌ఫామ్‌ వారు చేపట్టిన Stop violence against women (VAW) (మహిళలపై హింసను నిర్మూలిద్దాం) కార్యక్రమంలో భాగంగానే భూమిక హెల్ప్‌లైన్‌ నిర్వహించబడుతోంది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలు మరింతగా పెరగటం మనం చూస్తూనే వున్నాం. పూర్వంలా కాక నేటి స్త్రీలు తమ మనోభావా లను స్పష్టంగా తెలియజేయటం, అణిగి మణిగి వుండకపోవటం అనేవి ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇది ఎంతవరకు నిజం అనేవి కూడా మనం లోతుగా చర్చించవలసి వుంది. ప్రస్తుతం మనం ప్రస్తావిస్తున్న DFID ప్రాజెక్టు ముఖ్య వుద్దేశ్యం (”Promoting violence free lives for women from marginalized communities in India) సమాజంలో అంచులను నెట్టివేయబడిన వర్గాల స్త్రీలకు హింసలేని జీవితం అందజేయడం. ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలను సత్యవతిగారు పరిచయాల తరువాత తెలియజేశారు.
దళిత స్త్రీ శకి, హైదరాబాదు, ఎ.పి.వుమెన్స్‌ నెట్‌వర్క్‌ హైదరాబాదు, రెడ్స్‌ తూర్పుగోదావరి, కృషి కరీంనగర్‌, ఎస్‌వైఓ వరంగల్‌, అస్మిత హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, పీస్‌ వరంగల్‌, షహీన్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ పాతబస్తీ, హైదరాబాదు, సెర్ప్‌ ఇందిరా (కాంతి పథం)ఎస్‌విఎఎస్‌ తూర్పుగోదావరి మొదలగు సంస్థల ప్రతినిధులు, ప్రముఖ రచయిత్రులు, లాయర్లు ఇంకా హెల్ప్‌లైన్‌ వాలంటీర్లు మొత్తం కలిపి సుమారు 75-80 మంది ఈ సమావేశాలకు హజరయ్యారు.
పరిచయాల సమయంలో సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సునీతారాణిగారు మాట్లాడుతూ విద్యార్ధులలో ”స్త్రీలపై హింస” అనే అంశంపై అవగాహన కలిగించేలా కృషి చేయాల్సిన అవసరం చాలా వుందని వుద్ఘాటించారు. తమ యూనివర్సిటీలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఆడపిల్లలు మగపిల్లలు రెండు వేర్వేరు గ్రూపులుగా ఏర్పడి జరుగుతున్న చర్చా గోష్టిలో భాగంగా ఎంతమంది తమ తల్లులు హింస లేదా వివక్షను ఎదుర్కొనడం గమనించారని ప్రశ్నించడం జరిగింది. ఇందుకు సమాధానంగా దాదాపు 90% మగపిల్లలు తమ తల్లులు ఇంట్లో హింస ఎదుర్కొంటు న్నారని తమ భార్యలను కొట్టో, భయపెట్టో తమ అదుపాజ్ఞ లలో వుంచుకొనడం అనేది సమాజంలో భర్తల బాధ్యతగా భావిస్తున్నట్లు వారు చెప్పు కొచ్చారు. ఉన్నత చదువులు చదువుతున్న నేటి యువతలో కూడా ఇటువంటి ఆలోచనా ధోరణి ఇంకా ప్రబలుతూ వుందంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మహిళలపై హింస మూలాలు ఎంత లోతుగా వేళ్ళూనుకొని వున్నాయో.
SWARD సంస్థ నిర్వాహకురాలు శివకుమారి మాట్లాడుతూ ప్రత్యక్ష కౌన్సిలింగు అనేది ఒక్కొక్కసారి కౌన్సిలర్లను కూడా ఒత్తిడికి గురిచేస్తుందని చెప్పారు. SWARD కంట్రోల్‌రూమ్‌ లోని మహిళా పోలీస్‌ స్టేషన్లో ఒక కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ నుండి వచ్చిన పి. దామోదర్‌ గారు మాట్లాడుతూ తమ సంస్థ వినియోగదారుల హక్కులు, ఇంకా గిరిజన హక్కుల అంశాలపై పనిచేస్తుందని తెలియజేశారు. ఎ.పి. వుమెన్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా ష్ట్రజూఈఐ సంస్థనుండి వచ్చిన శ్యామల గారు మాట్లాడుతూ తామొక కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీరితో పాటు ఇంకా సమావేశాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ గురించి, తమ సంస్థల గురించి వివరించారు. పరిచయాలు, టీ విరామం తరువాత కొండవీటి సత్యవతి DFID ప్రాజెక్టు నేపధ్యం గురించి మరింత స్పష్టంగా వివరించారు.
భారతీయ స్త్రీలు అని ప్రస్తావించినప్పుడు వీరిని ఒకే గ్రూపుగా మనం వర్గీకరించకూడదు. ఎందుకంటే వివిధ సామాజిక వర్గాలనుండి, కులాల నుండి వచ్చే స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, వివక్ష విభిన్న కోణాలలో, స్థాయిల్లో వుంటుంది. ఇది సాహితీ వర్గాల్లోనే కాక మామూలు సామాజిక పోకడలో కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందువల్ల ప్రస్తుత D FID ప్రాజెక్టు సమాజంలో అంచులకు నెట్టివేయబడ్డ వర్గాల స్త్రీలకు హింసలేని జీవితం అందించడం అనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ వర్గాలకు చెందిన స్త్రీలకు హింసను ఎదిరించటానికి గాని, వివక్షను ప్రశ్నించడానికి కాని అనుకూలించే సౌకర్యాలు, న్యాయ సహాయం, ఇంకా చేయూతనందించే సదుపాయాలు అందుబాటులో లేవనేది నగ్న సత్యం.
DFID రిపోర్టు ప్రకారం జీవన ప్రమాణాల స్థాయిలో మనదేశానిది 137వ ర్యాంకు. మనదేశంలో పేద ప్రజలలో 70% మంది స్త్రీలే. స్త్రీల జీవనకాలం 44% కాగా, స్త్రీ అక్షరాస్యత కేవలం 46% మాత్రమే. నేటి సైంటిఫిక్‌ యుగంలో వివిధ రంగాలలో మేధోపరంగా, ఆర్థికపరంగా మనదేశం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ప్రసవ సమయంలో మనదేశంలో మరణిస్తున్న స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ. నోబెల్‌ బహుమతి గ్రహీత డా. అమర్త్యసేన్‌ చెప్పిన ప్రకారం 39.76% స్త్రీలు మనదేశంలో జన్మించకుండానే తప్పిపోతున్నారు. భారతదేశంలో పురుషుల, స్త్రీల సెక్స్‌ రేషియో 1000 :927 గా వుంది. ప్రసవ సమయంలో స్త్రీల మరణాలు, ఇంకా శిశు మరణాలు లింగ నిర్ధారణ పరీక్షలు ఈ సెక్స్‌ రేషియో పడిపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. లైంగిక అత్యాచారం, వావి వరుసలు మరిచి కూతుర్లు, చెల్లెళ్లపై లైంగిక అత్యాచారం, ఆడపిల్లలు కరువై ఒకే స్త్రీని పదిమంది పెళ్ళాడటం, చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి లైంగిక వృత్తిలోకి బలవంతంగా దింపడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో లైంగిక నేరాలు పెచ్చరిల్లడానికి ఈ పడిపోతున్న సెక్స్‌రేషియో ఒక ప్రధాన కారణం.
ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలన్నీ మన రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఎంతో ఆశావహంగా చూపిస్తున్నా వాస్తవం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వుంది. మనదేశం మొత్తం మీద హింసలో ఆంధ్రప్రదేశ్‌ ప్రధమస్థానంలో వుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ మొదటిస్థానంలో వుంది. పట్టణాల్లోనే కాక పల్లెల్లో కూడా స్త్రీలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. ఇటువంటి పరిస్థితులలో హింసను మనం ఎలా తగ్గించగలం. ఈ DFID ప్రోగ్రాం ఏ విధంగా వుపయోగకర మార్పును తీసుకు రాగలదో చూద్దాం.
21వ శతాబ్దంలో, అరవై ఏళ్ళ స్వాతంత్య్ర చరిత్రలో నేటికీ మన పార్లమెంట్లో స్త్రీల ప్రాతినిధ్యం 9% మాత్రమే. ఇది స్త్రీల సమస్యలపై పాలకుల, రాజకీయ నాయకుల నిజాయితీ లేని తనాన్ని సూచిస్తుంది. స్త్రీల సమస్యల విషయానికొచ్చేసరికి మహిళా నాయకులు కూడా మగవారిలా ఆలోచించడం మొదలుపెట్టి స్త్రీలకు బదులుగా కేవలం వారి వారి పార్టీ ప్రతినిధులుగా మాత్రమే మిగిలిపోతున్నారు. ఒక ప్రణాళికను లేదా ప్రతిపాదనను ప్రభావితం చేయాలంటే దానికి తగిన ప్రాతినిధ్యం పార్లమెంటులో వుండాలి. పార్లమెంటులో 33% మహిళా ప్రాతినిధ్యం కొరకు కూడా ప్రాజెక్టు ద్వారా కృషి చేయడం జరుగుతుంది.
ముందుగా చెప్పుకున్నట్టు ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అంచులకు నెట్టివేయబడిన వర్గాల స్త్రీలు. సమాజం వల్ల, సామాజిక వర్గీకరణ వల్ల, రాజ్యం వల్ల, వివక్షకు గురౌతున్న మహిళలను అంచులకు నెట్టివేయబడిన స్త్రీలుగా గుర్తించడం జరుగుతుంది. హింసను భరించడం అనేది ఈ స్త్రీల జీవితాలలో ఆనవాయితీగా మారింది. ఈ స్త్రీలను సామాజికంగా, వివక్ష పూరితంగా పక్కకు నెట్టివేయడం (Social Exclusion) అనే దురాచారాన్ని రూపుమాపటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
మౌనంగా హింసను భరించడం, జెండర్‌ సమానత్వం పట్ల ప్రభుత్వ, ప్రయివేట్‌ వ్యవస్థలలో నెలకొన్న నిర్లక్ష్య వైఖరి, న్యాయవ్యవస్థ పట్ల మహిళల్లో కరువవుతున్న భరోసా, సరైన ప్రత్యామ్నాయ సహాయ సదుపాయాలు లేకపోవటం మొదలైన మహిళల పట్ల పెరుగుతున్న హింసకు దానిని బాధితులు మౌనంగా భరించటానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేనపుడు, ఒక వేళ ఎవరైనా హింసను ఎదిరించి నిలబడ్డా తగిన ప్రత్యామ్నాయ సదుపాయాలు లేక భవిష్యత్తు పట్ల భయం అనిశ్చితి వల్ల స్త్రీలు హింసను, వివక్షను మౌనంగా సహిస్తూ, భరిస్తూ వుంటారు. ఇటీవలి రికార్డులు ప్రకారం మహిళలపై హింస కారణంగా నమోదైన మొత్తం కేసులలో కేవలం ఒక శాతం కన్నా తక్కువ కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయంటే దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మన న్యాయవ్యవస్థ బాధిత మహిళలకు కల్పిస్తున్న భరోసా ఏపాటిదో.
హింస, లేక వివక్షకు బాధితులైన మహిళల సహాయార్థం ప్రభుత్వం ఏర్పరచిరని సహాయ సదుపాయాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో వున్న కొన్ని సహాయ కేంద్రాలు సరైన నిర్వహణ లేక దయనీయ స్థితిలో నిరుపయోగంగా వున్నాయి. ఆది నుంచీ స్త్రీలపై కుటుంబం, కులం, మతం, రాజ్యం యొక్క ఆధిపత్య ధోరణి రాజ్యమేలుతోంది. ఇంతటి ఆంక్షల మధ్య, మరొకరి పెత్తనంలో జీవించే స్త్రీల జీవితాలు సహజంగానే ఒత్తిడికి గురౌతూ వుంటాయి. అందువల్లనే హింసకు గురెన స్త్రీలు హింసను ఎదిరించడానికి భయపడుతూ వుంటారు. ఇంట్లో స్త్రీలు ఎంత హింసకు గురైనా కూడా అది బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కుటుంబ పరువు పోతుందని ఒకవేళ ఏ స్త్రీ అయినా చెప్పుకున్నా కుటుంబ పరువు తీస్తోందని సమాజం కూడా ఆమె పట్ల చిన్నచూపు చూసే పరిస్థితులే మనకు ఎక్కువగా కనపడతాయి. ఇలా కుటుంబ పరువు అనే భారం స్త్రీలు మాత్రమే ఎందుకు మోయాలి? అలాగే హింస చేసే వారిని తప్పు పట్టకుండా హింసను భరించే వారికే హింసను కప్పిపుచ్చే భారం కూడా ఎందుకు ఉండాలి?
సామాజిక పరంగా, కుటుంబ పరంగా స్త్రీలపై హింస/వివక్ష కొనసాగుతున్న అసమానతలను చెరిపివేసే దిశగా ఈఓ|ఈ ప్రోగ్రాం కృషి చేస్తుంది. ఇందుకు ముందుగా స్త్రీలపై హింసను అంగీకరించకుండా వుండే విధంగా ముందుగా కుటుంబ సభ్యులను చైతన్యపరుస్తుంది. ఆపై సమాజంలో ప్రతి ఒక్కరు స్త్రీలపై జరుగుతున్న హింసను గుర్తించి, ప్రశ్నించే విధంగా కూడా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు కలింగించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే హింసను ఎదిరించి, వ్యతిరేకించి న్యాయపరంగా, సామాజిక పరంగా పోరాడాలనుకునే, లేదా మరో దారి లేక హింస నుండి బయట పడాలనుకునే స్త్రీల కొరకు వారికి కావలసిన తగు ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించేలా, అలాగే అవి సక్రమంగా పనిచేసి, బాధితులకు అందుబాటులో వుండే విధంగా చూడటం అనేది ఈ ప్రోగాంలో ఒక ముఖ్య భాగం. అలాగే, స్త్రీల శ్రేయస్సు కోరే, సహకారం అందించే చట్టాలు చాలా వున్నాయి. కాని వాటిని వుపయోగించుకునే విధంగా నేటి పరిస్థితులు లేవు. చాలా సందర్భాలలో తమకు ఫలానా అధికారం లేదా హక్కు ఫలానా చట్టం ద్వారా అందుబాటులో వుంది అనే విషయాలు చాలా మందికి స్త్రీలకు తెలియదు. ఉదాహరణకు గృహహింస చట్టం క్రింద భర్త ఇంట్లో వుండే పూర్తి అధికారం హక్కు భార్యకు వుంది, అది అద్దె ఇల్లయినా సరే ఆ ఇంట్లో నుంచి ఆమెను వెళ్ళగొట్టే హక్కు అత్తమామలకే కాదు భర్త కూడా లేదు. కాని చట్టంలో వున్న ఈ సదుపాయం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇలా స్త్రీలకు ఉపయోగకరంగా వుండే చట్టాలను మరింత సమర్థవంతంగా ప్రజలలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం ఈ ప్రోగ్రాం ద్వారా జరుగుతుంది.
కుటుంబ స్థాయిలో మొదలుకొని, వర్గ స్థాయికి, గ్రామ స్థాయికి, ఆపై సామాజిక స్థాయిలో స్త్రీలపై హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా భాగస్వామి సంస్థలు (Partner Organization) పని చేయవలసి వుంటుంది. వారు పనిచేసేచోట స్థానికంగా స్త్రీలపై హింస వివక్షకు సంబంధించిన ప్రధాన అంశాలను గుర్తించి తగు విధంగా సమస్య పరిష్కారం కోసం కృషి చేయవలసి వుంటుంది. ఆ క్రమంలో ఎదురయ్యే ఆటుపోటులను గుర్తించి అవి అధిగమించటంలో అందరూ కలిసి చర్చించి సమన్వయపరచుకొనే విధంగా అలాగే భాగస్వాములకు అవసరమైన సహాయ సహకారాలను అందించటం ”సివిల్‌ సొసైటీ రిసోర్స్‌ ఫెసిలిటీ” ప్రధాన బాధ్యత అని ముగిస్తూ సత్యవతి భాగస్వామి సంస్థల ప్రతినిధులను మాట్లాడవలసిందిగా కోరారు.
ముందుగా SWARD సంస్థ ప్రతినిధి శివకుమారి గారు మాట్లాడుతూ హింసకు బాధితులైన 80% స్త్రీలు చివరి ఆశగా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తారు. చాలా సందర్భాలలో వీరికి తగు విధమైన దిశానిర్దేశం, సహాయ సహకారాలు పోలీసుల నుండి అందవు. చాలా చోట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ఒకసారి కార్యక్రమంలో భాగంగా జైపూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించడం జరిగింది. అక్కడ పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానంగా ఒక కౌన్సిలింగు సెంటర్‌, ఒక తాత్కాలిక వసతి గృహం (Short stay home) నిర్వహించబడుతున్నవి. ఈ విధమైన ఏర్పాటు ప్రతి పోలీస్‌ స్టేషనుకు వుంటే బాధిత స్త్రీలకు చాలా వుపయోగకరంగా వుంటుంది అని చెప్పారు. ఈ దిశగా కృషి చేసేటప్పుడు అధికారులను కూడా కలుపుకుని పనిచేయగలిగితే మంచి ఫలితాలను సాధించవచ్చు అని చెప్పారు.
షహీన్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ అనే సంస్థ హైదరాబాద్‌ పాత బస్తీలోని ముస్లిం మహిళల సమస్యల పరిష్కారం అభివృద్ధి కోసం పనిచేస్తోంది. పాత బస్తీలోని నిరుపేద ముస్లిం కుటుంబాలలోని బాలికలు కుటుంబ సభ్యులవల్ల కూడా లైంగిక అత్యాచారాలకు గురౌతున్నారు. ఆర్ధిక ఇబ్బందులలో కూరుకు పోయి అప్పులు తీర్చుకొనడం కోసం కన్న బిడ్డలను అరబ్‌ షేకులకు అమ్ముకోవటం అనేది కూడా ఇక్కడ సామాన్య విషయమే. అందువల్లే ఇక్కడ బాల్యవివాహాలు, చిన్నపిల్లలను బలవంతంగా లైంగిక వృత్తిలోకి దింపడం అనేవి సాధారణ విషయాలు. షహీన్‌ సంస్థ ఇక్కడి ముస్లిం మహిళల సమస్యలను గుర్తించి వారికి తగిన సహాయం అందించడం, బాధిత మహిళలలో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థికంగా స్వతంత్రులుగా జీవించే అవకాశం కల్పించటం కోసం వారికి అనువైన వృత్తి విద్యలు నేర్పటం, వంటి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రస్తుతం తమ సంస్థ 14, 15 ఏళ్ళ బాలికలకు ట్రాఫికింగు గురించి తెలియచేసి, ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై సమ్మర్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు, షహీన్‌ ప్రతినిధి సుల్తానా తెలియజేశారు.
రెడ్స్‌ (REDS) సంస్థవారు అనంతపూర్‌లో మహిళల కోసం కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నారు. సంస్థ నిర్వాహకురాలు భానుజ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ST, ముస్లిం మహిళల ట్రాఫికింగు చాలా పెరిగిందన్నారు. పేదరికం, తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణకు లోనై డబ్బు, వ్యామోహాల మోజుతో ఆడప్లిలలు ట్రాఫికింగు బారిన పడుతున్నారు. ప్రభుత్వ నిర్వహణలోని తాత్కాలిక వసతి గృహాల పనితీరు విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని భానుజ సభికులతో పంచుకున్నారు. ఒకసారి పూనేలోని వ్యభిచార గృహాల నుండి జిల్లాకు చెందిన 60 మందికి పైగా బాలికలను రక్షించటం జరిగింది. ఇలా తీసుకువచ్చిన బాలికలను ప్రభుత్వ తాత్కాలిక వసతి గృహాలకు పంపటం జరిగింది. తర్వాత ఒకసారి ఈ బాలికలను చూడటానికి భానుజ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక తెలిసింది కొంతమంది గోడ దూకి పారిపోయారని మిగతావారి మాటల బట్టి తెలిసిందేంటంటే అక్కడ ఆ వసతి గృహంలో వారు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సరిగ్గా ఒక మనిషి కూర్చోటానికి కూడా వీలులేని స్థలంలో వుంటూ మరుగుదొడ్డి పక్కనే తిండి, పడక రెండూ. చాలీచాలని భోజనం ఒక పూట మాత్రమే. ఆకలి బాధ తట్టుకోలేక తమలో కొంతమంది పారిపోయారని మిగిలినవారు తెలియజేశారు. ఇటువంటి దైన్యజీవితాలను ప్రతి రోజూ చూస్తూ మతి చలించకుండా, ధైర్యంగా సమస్యను పరిష్కరించటానికి చాలా రాటుదేలాలని భానుజ తెలియజేశారు. భానుజ మాటలు చాలామందిని కన్నీరు పెట్టించాయి.
చట్టాల అమలులో జాప్యం వల్ల కలిగే పరిణామాల గురించి ఒక ఉదాహరణతో మరో ప్రతినిధి శ్యామల తెలియజేశారు. గృహహింస చట్టం ప్రకారం రెండు నెలలలో కేసు పరిష్కారం కావాలి. ఒక కేసు 6వ నెల గర్భవతి అయిన బాధిత మహిళ గృహహింస చట్టం కింద తన ప్రసవానికి వైద్య ఖర్చులు, భర్తనుండి భరణం కోరుతూ కేసు వేసింది. ప్రస్తుతం ఆమె బిడ్డకు ఏడవ నెల, ఇంకా ఆమె కేసు పరిష్కారం కాలేదు. మరొక కేసు ట్రాఫికింగు నుంచి రక్షింపబడ్డ మహిళలకు ప్రత్యామ్నాయ వృత్తులు చేపట్టడం కోసం ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 5000/- పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే దీనికి ప్రొటెక్షన్‌ ఆఫీసరు అనుమతి ఇవ్వాలి. కాని ఒక రక్షణాధికారి 5000/- తనకు లంచం ఇస్తే కాని కాగితం ఇవ్వనన్నాడు. ఇలా చట్టాలు, ప్రభుత్వ పథకాలు నిర్వీర్యమౌతున్న సంఘటనలే ఎక్కువగా వున్నాయన్నారు శ్యామల. వీరితో పాటు ఇంకా చాలా మంది ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే స్త్రీలకు వుద్దేశించబడి చేసిన చట్టాలు, ప్రభుత్వ పథకాలు సరైన విధంగా అమలయ్యేలా చూడటం మనందరి కర్తవ్యం అన్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ, తాత్కాలిక వసతి గృహాల విస్తృత ఏర్పాటు అవి సక్రమంగా పనిజేసి అందులో ఏ మహిళైనా సరే కనీసం ఒకరోజన్నా వుండగలిగే సదుపాయం కల్పించేలా కృషి చేయాలని కూడా అందరూ అంగీకరించడంతో కార్యక్రమం ముగిసింది. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు, ప్రముఖ రచయిత్రులెందరో ఈ సమావేశంలో పాల్గొన్నారు.అబ్బూరి ఛాయాదేవి, ఘంటశాల నిర్మల, శిలాలోలిత, తురగా జానకీరాణి, దేవకీదేవి, ఆర్‌.శాంతసుందరి, వారణాసి నాగాలక్ష్మి తదితర రచయిత్రులు ఎంతో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.
భోజనాల అనంతరం భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగు ప్రారంభమైంది.
భూమిక హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ కొండవీటి సత్యవతి సభను ప్రారంభించారు. ముందుగా హెల్ప్‌లైన్‌ మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు. ఒకసారి భూమిక హెల్ప్‌లైన్‌ ప్రారంభ దినాలని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సందేహాలు, అనుమానాల, మధ్య ఒకింత ఉత్కంఠతోనే హెల్ప్‌లైన్‌ ప్రారంభించడం జరిగిందన్నారు. కేవలం ఫోన్‌ ద్వారా సలహాలందించటం వల్ల ఎంత వరకు బాధితులకు వుపయోగపడు తుందనే అనుమానాలు ఎక్కువగానే వుండేవన్నారు. కానీ ప్రారంభ సంవత్సరంలోనే వెయ్యికి పైగా కాల్స్‌ రావడంతో హెల్ప్‌లైన్‌ అవసరం, ఆవశ్యకతలపై మరింత నమ్మకం కుదిరింది. సమాజంలో వివిధ స్థాయిలలో హింస, వివక్షకు బలౌతున్న నిస్సహాయ మహిళలకు తగిన చేయూత నందించడం కోసం ఉద్దేశించబడిన హెల్ప్‌లైన్‌ పరిధులు గత మూడు సంవత్సరాలలో మరింతగా విస్తరించాయి. మహిళలపై అమలవుతున్న గృహహింస వికృత పార్శ్వాలు ఎంత లోతుగా వేళ్లూనుకుపోయాయో అవగతమౌతూ వచ్చాయి.
మొదటి సంవత్సరంలో ఎక్కుగా పట్టణ ప్రాంతాలనుండి మాత్రమే కాల్స్‌ వచ్చేవి. ఎక్కువగా విజయవాడ, హైద్రాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌ వంటి చోట్ల నుండి మాత్రమే స్పందన లభించింది. ఇది గమనించి హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 2908 ప్రచారం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగా హెల్ప్‌లైను నంబరు, వివరాలతో కూడిన స్టిక్కర్లు, పోస్టర్లు వాలంటీర్ల సాయంతో పంచడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సులపై, టీవీ9, ఈటీవీ2 లలో ప్రచారం కల్పించడం ద్వారా భూమిక హెల్ప్‌లైను గురించి మరింత మందికి తెలిసే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి కాల్స్‌ వస్తున్నాయి.
మొదట్లో ఎక్కువగా అత్తమామల వేధింపులు, కట్నం కోసం వేధింపులు, కోర్టు కేసులకు సంబంధించిన సలహాల కోసం కాల్స్‌ వస్తుండేవి. హెల్ప్‌లైను గురించి మరింత ప్రచారం లభించే కొద్దీ హెల్ప్‌లైనుకు వచ్చే కాల్స్‌లో వైవిధ్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం న్యాయ సంబంధిత కేసులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు, లైంగిక వేధింపుల కేసులు, కట్నం కోసం వేధింపుల కేసులు, బాల్య వివాహాలకు సంబంధించిన ఫిర్యాదులు, వైద్య సలహాలు ఇంకా కెరీర్‌ కౌన్సిలింగుతో పాటు ఒక మంచి సమాచార కేంద్రంగా కూడా భూమిక హెల్ప్‌లైను పనిచేస్తోంది. హెల్ప్‌లైను ప్రచారం కోసం అప్పుడప్పుడు వివిధ ప్రసార మాధ్యమాలలో కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, జరుగుతూంటుంది. అటువంటప్పుడు ఒక్కోసారి రోజుకు 200లకు పైగా కాల్స్‌ అటెండ్‌ అవ్వాల్సి వస్తుంది.
ప్రస్తుతం భూమిక హెల్ప్‌లైను ఉ|| 8 గం|| నుండి రా|| 11గం|| వరకు పనిచేస్తోంది. మూడు షిఫ్టులలో ముగ్గురు కౌన్సిలర్లు పనిచేస్తున్నారు. సోమ, శని వారాలలో ప్రత్యేకంగా న్యాయసలహా, సంప్రదింపుల కోసం నేరుగా లాయర్లతోనే మాట్లాడే అవకాశం కూడా వుంది. కొన్ని సందర్భాలలో సహాయం కోసం కాల్‌ చేసేవారు తీవ్రమైన మానసిక ఒత్తిడితో మాట్లాడలేని స్థితిలో ఏమీ చెప్పకుండా ఏడుస్తూ వుండిపోతారు. అటువంటి సందర్భాలలో, కౌన్సిలరు చాలా ఓపికగా (అటునుండి స్పందన లేకపోయినా) ధైర్యం చెప్పి, భరోసా యిచ్చి మెల్లగా బాధిత స్త్రీలచేత మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఇందు కోసం ఒక్కోసారి 15-20 నిముషాలు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టే సందర్భాలుంటాయి. కాని ఒకసారి మాట్లాడటం మొదలుపెట్టాక బాధితులు ఒక్కొక్కటిగా తమ సమస్యలను చెప్పుకొస్తారు. కొన్ని సందర్భాలలో కేవలం తమ బాధలను మరొకరికి చెప్పుకొని సాంత్వన పొందటం కోసమే కాల్‌ చేస్తారు.
అటువంటి సమయాలలో కౌన్సిలరు వారు చెప్పిందంతా విని వారికి కావలసిన మానసిక ధైర్యాన్ని అందించడంలో తోడ్పతారు. ఇలా చాలా సందర్భాలలో కాల్స్‌ కోసం అరగంట పైగా కూడా మాట్లాడవలసి వస్తుంది. అటువంటప్పుడు సహజంగానే మిగతావారికి ఫోను ఎంగేజ్‌లో వుండటం జరుగుతుంది. హెల్ప్‌లైన్‌ కాలర్స్‌ అవసరాలకు అనుగుణంగా వుండేందుకు కాల్‌ సమయంపై పరిమితులుండవు. సహాయం కోరే ఏ స్త్రీ అయినా ఎంతసేపైనా మాట్లాడే అవకాశం బహుశా భూమిక హెల్ప్‌లైను మాత్రమే కల్పిస్తూ వుండవచ్చు. ప్రభుత్వ హెల్ప్‌లైను మాత్రం మూడు నిముషాల తర్వాత దానంతటదే కట్‌ అయిపోతుంది. భూమిక హెల్ప్‌లైనుకు కాల్‌ చేసే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచబడుతాయి. అలాగే వివరాలు ఇవ్వటం ఇష్టంలేని వారిపై ఎటువంటి బలవంతం వుండదు. అవసరాన్ని బట్టి ఫాలో అప్‌ కోసం మాత్రం పేరు, వూరు వంటి కొన్ని ప్రాథమిక వివరాలు మాత్రమే అడగటం జరుగుతుంది.
భూమిక హెల్ప్‌లైను ద్వారా సహాయం పొందిన చాలా మంది మళ్ళీ ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కొంతమంది వ్యక్తిగతంగా వచ్చి ధన్యవాదాలు తెలుపుతామని అడుగుతూ వుంటారు. అది హెల్ప్‌లైను సిద్ధాంతాలకు వ్యతిరేకం కాబట్టి అందుకు మేం అంగీకరించం అని సత్యవతిగారు వివరించారు. సమావేశాలలో పాల్గొన్న మేరీ కుమారి మాదిగ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు చెందిన మహిళలకు హెల్ప్‌లైను నంబరు గుర్తు పెట్టుకోవటం, ఫోనులో మాట్లాడి సలహా పొందటం అనేది చాలా కష్టమైన పని అని, మరేదైనా విధంగా ఆ వర్గాలకు సంబంధించిన మహిళలకు కూడా హెల్ప్‌లైను సదుపాయాలు అందించగలిగితే బావుంటుందని ఆ విధంగా ఆలోచించవలసిందిగా సూచించారు. ఈ విషయాన్ని సత్యవతిగారు అంగీకరించారు. అలాగే కార్పోరేట్‌ రంగంలో కూడా చదువుకుని ఉన్నత ఉద్యోగాలలో వున్న స్త్రీలు కూడా తీవ్రమైన గృహహింసకు, వివక్షకు గురౌతూ సహిస్తున్న సందర్భాలు తమ దృష్టికి వచ్చాయని. అణగారిన వర్గాల స్త్రీలు, అలాగే కార్పోరేట్‌ రంగంలో వివక్షను ఎదుర్కొంటున్న స్త్రీలకు కూడా హెల్ప్‌లైను ద్వారా సహాయ సహకారాలు అందేలా చూడవలసిన అవసరం ఎంతో వుందంటూ సత్యవతిగారు కార్యక్రమాన్ని ముగించారు.
భూమిక హెల్ప్‌లైను ద్వారా నేటి వరకు ఎంతో మంది స్త్రీలు తమ సమస్యలకు పరిష్కారం పొందగలిగారు. సమస్య క్లిష్టతను బట్టి హెల్ప్‌లైను ద్వారా అందించబడే సహాయం ఆధారపడి వుంటుంది. భూమిక పాఠకుల అవగాహన కోసం హెల్ప్‌లైను ద్వారా పరిష్కరించబడిన కొన్ని కేసులను పేర్లు మార్చి వివరిస్తున్నాం.

విదేశాలలో వేధింపులకు గురిచేస్తున్న భర్త నుండి విముక్తి
మంచి ఆలోచన వుండి దారి చూపగలిగే వారైతే పరోక్షంగా కూడా క్లిష్ట సమస్యకు పరిష్కారం చూపవచ్చనే దానికి భాగ్యలక్ష్మి గారి కథే మంచి ఉదాహరణ. పొన్నూరు నుండి భాగ్యలక్ష్మి గారు ఒకరోజు భూమిక హెల్ప్‌లైనుకు ఫోను చేసి విదేశాలలో వుంటున్న తన కూతురి దుర్భర జీవితం గురించి వివరించారు. విదేశాలలో మంచి వుద్యోగం, మంచి చదువు, సాంప్రదాయ కుటుంబం అని అబ్బాయి తల్లిదండ్రులు చెప్పగానే ఏమీ ఆలోచించకుండా డాక్టరు చదువుకున్న కూతురు శశిరేఖనిచ్చి పెళ్ళి చేసారు. పెళ్ళైన కొద్ది రోజులకే రేఖ భర్తతో కలిసి కోటి ఆశలతో కన్నవారినీ, స్వదేశాన్ని వీడి వెళ్ళింది. రోజులు గడుస్తున్నా భర్త ఉద్యోగానికి వెళ్ళకపోవడం, పైగా వ్యసనాలకి బానిసగా మారిపోవడంతో రేఖ ఆశలన్నీ అడియాసలయ్యాయి. కఠిన వాస్తవాలను అంగీకరించిన రేఖ తన భర్తను మంచిగా మార్చుకోవటానికి విఫల ప్రయత్నము చేసింది. అతను ఆమె మాట వినకపోవటమే కాక తిరిగి మరింతగా హింసించేవాడు. ఇది కాకుండా అతను డ్రగ్సుకు బానిసయ్యాడని తెలిసి మరింత కృంగిపోయింది. ఇంట్లో ఆర్థికపరిస్థితి క్షీణించడంతో ఒక హాస్పిటల్లో డాక్టరుగా జాయినయ్యింది.
రేఖ సంపాదనను ఆమె భర్త పూర్తిగా అనుభవించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు ఇతరులతో లైంగిక సంబంధాలు కూడా మొదలయ్యాయి. ఎప్పటికైనా భర్తలో మార్పు వస్తుందనే నమ్మకంతో వున్న రేఖకు యిది మరో పెద్ద ఎదురుదెబ్బ. భర్తనుండి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆర్థికంగా, లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తూనేవున్నాడు. జరుగుతున్న విషయాలన్నీ రేఖ తన తల్లిదండ్రుల నుంచి కూడా దాచిపెట్టింది. అయితే స్నేహితుల ద్వారా రేఖ పరిస్థితిని తెలుసుకున్న భాగ్యలక్ష్మిగారు వెంటనే కూతురుకు ఫోన్‌చేసి అన్ని వివరాలు కనుక్కున్నారు. తన కూతురు ఊరు కాని ఊరులో నా అనేవారు లేని విదేశాలలో జీవన్మరణ పరిస్థితిలో చిక్కుకున్నదని భాగ్యలక్ష్మిగారికి అర్థం అయ్యింది.
కూతుర్ని రక్షించుకోవటానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే సందిగ్ధావస్థలో వుండగా టీవి9 నవీన కార్యక్రమంలో భూమిక హెల్ప్‌లైను టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 2908 చూసి ఒకసారి ప్రయత్నించి చూద్దాం తనకు ఎటువంటి సహాయం అందించగలరో అనే ఉద్దేశ్యంతో హెల్ప్‌లైనుకు కాల్‌ చేసారు. మొదటిసారి ఫోన్‌ చేసినపుడు హెల్ప్‌లైన్‌ ఆశయాలు, వుద్దేశ్యాలు, పనిచేసే విధానం, ఏవిధంగా సహాయం పొందవచ్చు వంటి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. సమస్యల్లో వున్న స్త్రీలకోసం భూమిక హెల్ప్‌లైను పనిచేస్తుందని బాధిత స్త్రీల వివరాలు గోప్యంగా వుంచడమే కాక వారి వ్యక్తిగత భావాలు, అభిప్రాయాలు, అవసరాలకు అనుగుణంగా సలహాలు, సూచనలు, అందజేస్తామని కౌన్సిలరు భాగ్యలక్ష్మిగారికి వివరించారు.
మర్నాడు భాగ్యలక్ష్మిగారు హెల్ప్‌లైనుకు ఫోనుచేసి తన అల్లుడి వల్ల కూతురు పడుతున్న కష్టాల గురించి వివరించారు. అయితే కూతురి స్థితి వల్ల తల్లడిల్లిపోయిన భాగ్యలక్ష్మిగారు భావోద్వేగానికి గురౌతున్నట్లు గ్రహించిన కౌన్సిలర్‌ ముందుగా భాగ్యలక్ష్మి గారికి ధైర్యం చెపుతూ మానసిన స్థైర్యాన్ని అందించారు. ఆపై సమస్య పట్ల రేఖ అభిప్రాయం కనుక్కోమని, వీలైతే ఆమె చేత హెల్ప్‌లైనుకు కాల్‌ చేయించమని సలహా యిచ్చారు. మరుసటిరోజు భాగ్యలక్ష్మిగారు కొంత ధైర్యంగా మాట్లాడారు. తాను రేఖతో మాట్లాడానని, తను భర్త నుండి విడిపోవాలని కోరుకుంటున్నట్లు, ఇకనైనా తన జీవితం సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని తను కోరుతున్నట్లు భాగ్యలక్ష్మిగారు తెలియజేశారు. అయితే విడాకులు తీసుకుంటారా, తాత్కాలికంగా విడిపోతారా లేక మారిటల్‌ కౌన్సిలింగు తీసుకున్న తరువాత ఆలోచిస్తారా అనే కొన్ని సూచనలు ఆమెకు తెలియజేశారు హెల్ప్‌లైను కౌన్సిలర్‌. ఈ విషయాన్ని కూతుర్నడిగి చెప్తానన్నారు భాగ్యలక్ష్మిగారు.
తమ సంసార జీవితంలో ఎదురౌతున్న ఒడిదుడుకులను అధిగమించటానికి పోస్ట్‌ మారిటల్‌ కౌన్సిలింగు తీసుకుందామన్న రేఖ సూచనకు తీవ్రంగా స్పందించిన ఆమె భర్త ఆమెను చాలా క్రూరంగా కొట్టి తిట్టడం ప్రారంభించాడని భాగ్యలక్ష్మిగారు రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసి చెప్పారు. సమస్య మరింత తీవ్రరూపం దాల్చడంతో ఈ కేసును హెల్ప్‌లైను ప్యానల్‌ అడ్వకేటు కాంతి గారిని సంప్రదించి వారి సలహా సూచనలు తీసుకోవటం జరిగింది. కాంతి గారి సలహా మేరకు భాగ్యలక్ష్మిగారు మళ్ళీ కాల్‌ చేసినపుడు లోక్‌ అదాలత్‌లో రేఖ పేరున కేసు వెయ్యమని అలాగే అక్కడ తను ఎదుర్కొంటున్న సమస్యలను కాగితంపై వ్రాసి ముందుగా కౌన్సిలింగు అడిగి ఆపై డైవర్స్‌ కోసం అప్లై చేయమని కౌన్సిలరు సూచించారు. కేసు ఫైల్‌ చేసిన తరువాత 4 వారాలుగా కోర్టుకు వెళ్ళడం కొన్ని ఇబ్బందులు రావడం మళ్ళీ హెల్ప్‌లైనుకు ఫోన్‌ చేసి అడ్వకేటు సలహా తీసుకోవడం యిలా కొంతకాలం గడిచింది.
అయితే జూన్‌లో రేఖ కోర్టుకు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడడంతో హెల్ప్‌లైను అడ్వకేటు సలహా మేరకు రేఖ జులైలో ఇండియా రాగలదని కావున కేసు అప్పటికి వాయిదా వెయ్యమని లోక్‌ అదాలత్‌ సెక్రటరీ గారికి వుత్తరం రాశారు. వారి కోరిక మేరకు కోర్టు జులై 22కి వాయిదా వేసింది. జులై 22న భార్యాభర్తలను ముందుగా కౌన్సిలింగుకు పంపారు. దాని వల్ల ఏ విధమైన ప్రయోజనం లేకపోయేసరికి ఇరువురి అంగీకారంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. తన భర్త పెట్టే ఎన్నో వేధింపుల నుండి బయటకు రాగల్గినందుకు రేఖ చాలా సంతోషించింది. యికనైనా జీవితం సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తానని తనకు అన్ని విధాలా సాయపడిన, అన్ని సమయాల్లో సలహాలందించి తొందరగా సమస్య పరిష్కారమయ్యేలా చేసినందుకు హెల్ప్‌లైనుకు ధన్యవాదాలు తెలిపింది. ఇది భూమిక హెల్ప్‌లైను ద్వారా పరిష్కృతమైన మొట్టమొదటి కేసు.
కన్నతండ్రి వల్ల లైంగిక వేధింపుల నుండి కూతుర్లను రక్షించిన తల్లి

ఆగస్టు 2006లో సీతమ్మ హెల్ప్‌లైనుకు ఫోను చేసారు. తనకు పెళ్ళై 20 సంవత్సరాలైందని, 18, 17 సం|| వయస్సు గల ఇద్దరాడ పిల్లలున్నాని తన భర్త గవర్నమెంటు ఉద్యోగస్తుడని, అతని లైంగిక వేధింపుల నుండి తన ఇద్దరు కూతుర్లను ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చానని, కాని ఇలా ఎంతకాలం వారిని రక్షించగలనో తెలియకుండా వుంది, అందుకే ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లోనించి పారిపోయి వచ్చేశానని, కాని తన భర్త ఎలాగైన తమను పట్టుకుంటాడు కాబట్టి, అతని నుంచి తప్పించుకునేందుకు ఏదైనా షార్ట్‌ స్టే హోమ్‌ (తాత్కాలిక వసతి గృహం)లో చేర్పించాల్సిందిగా కోరారు. వెంటనే కౌన్సిలరు ఆమెకు తగిన మానసిక స్థైర్యాన్ని అందిస్తూనే వారికి వుపయోగకరంగా వుండే కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌ల ఫోన్‌ నంబర్స్‌ యిచ్చి మళ్లీ కాల్‌ చేయమని కౌన్సిలర్‌ సూచించారు. ఇంతలో కౌన్సిలరే కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌లకు ఫోన్‌ చేసి షెల్టర్‌ కోసం అడిగారు. అప్పుడు ఒక షార్ట్‌ స్టే హోమ్‌ వారు వెంటనే స్పందించి ఆశ్రయం యివ్వడానికి అంగీకరించారు. ఆ విధంగా సీతమ్మగారిని, వారి యద్దరు పిల్లలతో సహా షార్ట్‌ స్టే హోమ్‌కు పంపడం జరిగింది. ఆ తరువాత ఆమె భర్తపై కేసు ఫైల్‌ చేసింది. ఆపదలో ఆదుకున్నందుకు ఆమె భూమికకు ధన్యవాదాలు తెలియజేశారు.
గృహ నిర్భంధం నుండి విముక్తి పొందిన మహిళ

ఆగస్టు 2006లో శ్రీశైలం నుండి రమణి ఫోన్‌ చేసి భర్త మామల వల్ల తన కూతురు పడుతున్న అగచాట్ల గురించి యిలా వివరించారు.
రమణి పెళ్ళై ఆరు నెలలయ్యింది. అత్తగారు లేరు. భర్త, మామ మాత్రమే వుంటున్నారు. తండ్రి మాటలు విని రమ భర్త ఎప్పుడూ రమను కొడుతూ తిడుతూ వుంటారు. చివరికి ఒక రోజు రమని రూంలో పెట్టి బంధించి తిండికూడా పెట్టడం మానేశారు. ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వటం లేదని రమణి కన్నీళ్ళ మధ్య తన బాధను వ్యక్తం చేశారు. వారి మీద కేసు పెట్టాలంటే ఆ వూర్లో వారు చాలా పలుకుబడి వున్నవారిని అందుకే భయంగా వుందని చెప్పారు. కౌన్సిలర్‌ రమణి గురించి మరికొన్ని వివరాలు అంటే రమి ఎంత వరకు చదువుకుంది, పెళ్ళికి ముందు ఎలావుండేది, ఏం చేసేది ఇలాంటి చిన్న చిన్న విషయాలు అడిగి తెల్సుకున్నారు. అలాగే వీలైతే రమ చేత మాట్లాడించవలసిందిగా రమణిగారికి సూచించారు. రెండు రోజుల్లో రమణి ఫోన్‌ చేసి కౌన్సిలరుకు తన సమస్యను వివరించింది. భార్య భర్తల మధ్య ఎటువంటి సంబంధం వుంది, అందులో మామగారి ప్రమేయం ఎంతవరకు వుంది అన్న అంశాలు కౌన్సిలర్‌ రమను అడిగి తెల్సుకున్నారు.రమ చెప్పిన దాన్ని బట్టి మామగారి అనుమతి లేకుండా రమ భర్త ఏ పనీ చేయడు. ఆఖరికి భార్యతో మాట్లాడలన్నా మామగారి అనుమతి తప్పనిసరి. ఇప్పుడు కొత్తగా భార్యాభర్తల మధ్య ఉన్న లైంగిక సంబంధ అంశాలను కూడా మామగారు అడిగి తెల్సుకోవడంతో రమ చాలా భయపడింది. తన భర్తకు ఉద్యోగం లేదు. మామగారు ఏం చెపితే అవి చేయాలి. గత 8 వారాలుగా తాను అత్తవారింట్లో గృహ నిర్భంధంలో వున్నానని రమ తెలియజేసింది. కౌన్సిలరు రమకు ధైర్యం చెప్పి మానసిక స్థైర్యం కలుగజేస్తూ తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలను తెలియజేసి తను ఏం చేయాలనుకుంటుందో నిర్ణయించుకోమని కౌన్సిలరు చెప్పారు. తనను గృహనిర్భంధం చేసి హింసిస్తున్న భర్త, మామగారిపై కేసు పెట్టాలని ఆ రమ నిర్ణయించుకుంది. అప్పుడు వెంటనే దగ్గరలో వున్న పోలీస్‌ స్టేషను నెంబరు యిచ్చి వారికి ఫోన్‌ చేయమని సలహా యిచ్చారు.
కౌన్సిలరు యిచ్చిన ధైర్యంతో రమ పోలీస్‌ వారికి ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే పోలీస్‌ వారు చొరవ తీసుకుని రమ వున్న ఇంటికి వెళ్ళి అక్కడున్న ఆమె భర్త మామలను అరెస్టు చేసి రమను తన తల్లిదండ్రుల దగ్గరకు పంపించారు. గృహనిర్భంధం నుండి బయటపడిన (గృహహింస చట్టం)తో పాటు విడాకులకు కూడా అప్లై చేసుకుంది. తన కూతురిని గృహనిర్భంధం నుండి బయటకు తీసుకురావడమే కాక హింసించే భర్త, మామల బారి నుండి బయట పడే మార్గం చూపినందుకు రమణిగారు ఎంతో సంతోషంగా తన కృతజ్ఞతలు తెలియజేశారు.
పొరుగు రాష్ట్రంలో చిక్కుకున్న మహిళకు సహాయం

భూమిక హెల్ప్‌లైనుకు మన రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా తమిళనాడు, కేరళ నుండి కూడా కాల్స్‌ వస్తూ వుంటాయి. మన రాష్ట్రానికి చెందిన పేద మహిళలు ఇతర రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు పనిని వెతుక్కుంటూ వెళతారు. వీరిలో ఎక్కువ శాతం మంది దళారుల మోసాలకు గురౌతూ వుంటారు. అటువంటి కేసు ఒకటి కేరళ రాజధాని త్రివేండ్రం నుండి వచ్చింది.
ఆగస్టు 2007లో త్రివేండ్రంలోని ”అభయ” షార్ట్‌ స్టే హోమ్‌ నుండి శోభ అనే కౌన్సిలరు ఫోన్‌ చేసి విజయవాడలో వున్న షార్ట్‌ స్టే హోమ్‌ల వివరాలు అడిగి వాటి ఫోన్‌ నంబర్లు తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె మళ్ళీ కాల్‌ చేశారు. అప్పుడు భూమిక కౌన్సిలరు కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళ గవర్నమెంటు హాస్పిటలు వారు ఒక అమ్మాయిని తీసుకువచ్చి అభయ షార్ట్‌ స్టే హోమ్‌లో జాయిన్‌ చేశారని, ఆమె నాలుగు రోజుల క్రితం ఒక బిడ్డను ప్రసవించినట్టు చెప్పారు. భాష తెలియక పోవడంవల్ల ఏ వివరాలు తెల్సుకోలేక పోయినట్లు చెప్పారు. అప్పుడు భూమిక కౌన్సిలరు ఆ అమ్మాయితో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు.
భర్తతో గొడవ పడి విడిపోయిన రేణుక ఆరునెలల క్రితం తన అన్నగారితో కలిసి కేరళ వెళ్ళింది. రేణుక వాళ్ళ అక్క తిరువూరులో వుందని, అన్న తనను హాస్పిటల్లో వదలి పెట్టి మరలా వస్తానని చెప్పి వెళ్ళాడని చెప్పింది. కాని ఆమె మాటలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వున్నాయి. తన యింటి అడ్రస్సు కూడా చెప్పలేకపోయింది. వెంటనే కౌన్సిలరు అభయ వారితో మాట్లాడి రేణుకను ఎక్కడకు పంపాలో మరలా తెలియ జేస్తామని చెప్పారు. తరువాత ఈ కేసు గురించి కౌన్సిలరు కో-ఆర్డినేటరుతో చర్చించి వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ వారి సహాయం కోరారు. ఎస్‌ఐతో మాట్లాడినపుడు వారినుండి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు.
పరిస్థితి తెల్సుకున్న కోఆర్డినేటరు ఆక్స్‌ఫామ్‌ గిరిజ గారితో మాట్లాడారు. త్రివేండ్రం కాల్‌ చేసి కేసు వివరాలు కనుక్కున్నారు. ఆపై వారు రేణుకను మేజిస్ట్రేట్‌ ముందు హజరు పరచి, హెల్త్‌ చెకప్‌కి పంపించి ఆ తర్వాత ఎ.పి. పంపిస్తామని చెప్పారు. మర్నాడు కోఆర్డినేటరు మరలా త్రివేండ్రంకు కాల్‌ చేసినపుడు రేణుక తన పాపను చూడటానికి తీసుకు వెళ్ళారని చెప్పారు. ఆ తర్వాత రోజు కోఆర్డినేటర్‌ వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ డి.ఐ.జి. ఉమాపతి గారితో స్వయంగా మాట్లాడి కేసును వివరించారు. డి.ఐ.జి. గారు వెంటనే స్పందించి తగిన చర్య తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మర్నాడు కోఆర్డినేటరు డి.ఐ.జి. గారికి కాల్‌ చేసి కేసు పురోగతి గురించి అడిగి తెల్సుకున్నారు. ఎ.పి. పోలీస్‌ ద్వారా కేరళ పోలీస్‌ వారికి రేణుక వివరాలు ఫాక్స్‌ ద్వారా తెలియజేశారు. అలాగే ఒక లేడీ కానిస్టేబుల్‌నిచ్చి ఎ.పి.లోని విజయవాడకు పంపించమని కోరుతూ మరో ఫాక్స్‌ పంపుతున్నట్టు తెలియజేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని త్రివేండ్రం వారికి కాల్‌ చేసి ఈ విషయాన్ని వివరించారు భూమిక కౌన్సిలరు. వారు కూడా దానికి అంగీకరించారు. అయితే రేణుక ఆరోగ్య పరిస్థితి కుదుట పడేవరకూ ఆగవలసిందిగా సూచించారు. ఒక నెల తరువాత భూమిక కౌన్సిలరు, త్రివేండ్రం కాల్‌ చేసినపుడు రేణుకను వాళ్ళ అన్నగారు వచ్చి తీసుకువెళ్ళినట్లుగా తెలియజేశారు.
108 రిఫరెన్సు ద్వారా పరిష్కరించిన కేసు

భూమిక హెల్ప్‌లైనుకు అనేక మంది రిఫరెన్స్‌ ద్వారా కాల్‌ చేస్తారు. ప్రస్తుత కేసు 108 జూఖష్ట్ర| ఎమర్జెన్సీ సర్వ్వీసు ద్వారా హెల్ప్‌లైనుకు రిఫర్‌ చేసిన కేసు. సెప్టెంబర్‌ 2007లో ఒకనాటి మధ్యాహ్నం 108లో పోలీస్‌ డిస్‌పాచ్‌ ఆఫీసరుగా పనిచేసే జాన్‌సన్‌గారు ఫోన్‌ చేసి తమకు రాజమండ్రి నుంచి కేసు వచ్చిందని బాధితురాలితో కాన్ఫరెన్స్‌ కాల్‌ ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతున్నపుడు ఆమెకు తెలుగు రాదని కౌన్సిలరుకు అర్థమైంది. తాను ఒరిస్సా నుండి వచ్చానని తనకు తెలుగు రాదని, కొద్దిగా హిందీ మాట్లాడగలనని స్వప్న చెప్పింది. స్వప్న యిచ్చిన వివరాల ప్రకారం ఆమెది ప్రేమ వివాహం తన భర్త పనికి వెళ్ళినప్పుడు అత్త మామలు తనను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది. ఆ రోజు ఇద్దరూ కలిసి తన మీద దాడిచేసి ఇంట్లో నుండి బయటకు తరిమేశారని, గాయాలతో పరిగెత్తుకు వచ్చి పక్కింట్లో పడిపోయినట్లు చెప్పింది. అక్కడ వున్న ఒక పత్రికా విలేఖరి 108 వారి ఫోన్‌ చేశారు. వెంటనే కౌన్సిలరు కోఆర్డినేటరుకు లైన్‌ కనెక్ట్‌ చేశారు. అప్పుడు కోఆర్డినేటరు 108 సహాయంతో ఆ అమ్మాయి భర్తతో కాన్ఫరెన్సులో మాట్లాడి విషయం తెలియజేసి ఫోన్‌ ద్వారానే కౌన్సిలింగు యిచ్చారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడవలసిందిగా అతనిని హెచ్చరించారు. అతనుకూడా సానుకూలంగా స్పందించాడు. ఆ తర్వాత దంపతులిద్దరూ హెల్ప్‌లైనుకు కాల్‌ చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
అర్థరాత్రి దారితప్పిన మహిళలకు చేయూత

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చైల్డ్‌ లైన్‌ (1098) వారి నుండి భూమిక హెల్ప్‌లైనుకు ఒక కాల్‌ వచ్చింది. పంజగుట్ట పోలీస్‌ స్టేషను వారు ఆశ్రయం కల్పించవలసిందంటూ ఒక మహిళను తమ వద్దకు పంపారని చెప్పారు. ఆ మహిళ వయస్సు 30 సంవత్సరాలు కాగా చైల్డ్‌ లైను నియమాల ప్రకారం 18 సం||లు మించిన వారికి ఆశ్రయం కల్పించడం కుదరదు. అందువల్ల వారు భూమిక హెల్ప్‌లైను సహాయం కోరారు. ఆమెను ఏదైనా షార్ట్‌ స్టే హోమ్‌కు పంపించడానిక హెల్ప్‌లైను సహాయం కోరారు. మరిన్ని వివరాల కోసం కౌన్సిలరు బాధిత మహిళతో మాట్లాడటానికి ప్రయత్నించారు. 30 ఏళ్ళ సవిత వరంగల్‌ నుండి ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్‌ వచ్చింది. కొన్ని నెలలు హాస్టల్స్‌లో వుంది. అక్కడి వారితో ఇబ్బందులు ఏర్పడి హాస్టల్‌ వీడి బయటకు వచ్చేసింది. రాత్రి పూట సూట్‌కేసుతో పంజగుట్ట పోలీస్‌ వారికి అనుమానాస్పదంగా కనబడింది. విషయం ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవటంతో వారు ఆమెను చైల్డ్‌లైనుకు పంపించారు. కౌన్సిలరు సవితతో మాట్లాడటానికి ప్రయత్నించగా మానసిక స్థితిమతం లేని కారణంగా ఆమె మాటల్లో తడబాటును గమనించారు.
తన దగ్గర అందుబాటులో వున్న అన్ని షార్ట్‌ స్టే హోమ్స్‌కు కౌన్సిలరు ఫోన్‌ చేసి సవితకు ఆశ్రయం కల్పించటానికి ప్రయత్నం చేశారు. చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌ వారు ఆశ్రయమివ్వటానికి ముందుకొచ్చారు. కాని సవిత అక్కడికెళ్లటానికి ఒప్పుకోలేదు. తనను మానసికంగా ఆందోళన చెందుతున్న కారణంగా ఆ రాత్రికి చైల్డ్‌లైనులోనే వుంచాల్సివచ్చింది. మరుసటి రోజు ఉదయమే కౌన్సిలరు ఛైల్డ్‌లైన్‌ వారిని సంప్రదించగా సవిత ఉదయం ఆరు గంటలకే బయటకు వెళ్ళిపోయిందని తెలిపారు. కౌన్సిలరు చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌తో మాట్లాడి తన సెల్‌ నెంబరు తీసుకున్నారు. సవిత సెల్‌కు కాల్‌ చేసి మాట్లాడగా అంతకు ముందు రోజు హెల్ప్‌లైను నుండి పొందిన సమాచారం ఆధారంగా కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌లను సంప్రదిస్తున్నానని చెప్పింది. చివరకు వుమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్‌ఫేర్‌ శాఖ వారిని కలిసి వారి ద్వారా ఒక హోమ్‌లో ఆశ్రయం పొందానని చెప్పింది. అప్పటికీ సాయంత్రం 6:30 అయ్యింది. ఆ హోమ్‌ ఇన్‌చార్జ్‌ హేమంత్‌గారి నంబరు తీసుకుని ఆయనతో మాట్లాడారు. కౌన్సిలరు ఈ విషయాన్ని చైల్డ్‌లైను వారికి కూడా తెలియజేశారు. అయితే సవితకు సాయంగా ఎవరినైనా పంపవలసిందిగా కోరారు. చైల్డ్‌లైను ఉద్యోగి శుభానీ గారు రాత్రి 8:30 గం|| సవితను మనో చైతన్య హ్యూమన్‌ సర్వీస్‌ సొసైటీ షెల్టర్‌ హోమ్‌కు తీసుకువెళ్ళారు. ఈ షెల్టరు హోమ్‌ వారి నియమాల ప్రకారం బాధితులకు సంబంధించి ఎవరైనా బంధువులు వచ్చేవరకు బయటకు పంపరని తెలిసింది. ఇది తెలిసిన సవిత పొద్దున్నే ఇంటర్వూకెళ్ళాలి ఇక్కడ వుండలేనంటూ బయటికి వచ్చేసింది. రాత్రి 10:30 గం|| శుభానీగారు హెల్ప్‌లైనుకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. కౌన్సిలరు ద్వారా పరిస్థితి గ్రహించిన కోఆర్డినేటరు రాత్రి 12 గం|| వరకూ సవితకు ఆశ్రయం కోసం ప్రయత్నించారు. ఈ మధ్యలో హెల్ప్‌లైను వాలంటీరు లక్ష్మిగారిని సంప్రదించగా ఆ రాత్రికి సవితకు ఆశ్రయం కల్పించడానికి ఒప్పుకుని స్వయంగా వెళ్ళి ఆమెను తీసుకు రావటానికి ముందుకొచ్చారు. అదే సమయంలో 100 నంబరుకు ఫోన్‌ చేసి విషయం తెలియజేసి రాత్రికి ఆశ్రయం కోసం పోలీస్‌ వారితో కూడా మాట్లాడారు. పెట్రోలింగు పోలీసులు వెళ్ళి ఆ రాత్రికి ఆమెను వుమెన్‌ పోలీస్‌ స్టేషనులో వుంచారు. చివరకు ఆ రాత్రివేళ ఆమెను భద్రంగా ఒక చోటకు చేర్చగలిగాం.
మర్నాడు ఉదయమేముంబొయ్‌లో వుండే సవిత తల్లిదండ్రులను సంప్రదించి విషయం తెలియజేశారు హెల్ప్‌లైన్‌ కౌన్సిలరు. అప్పటికి వారు ముంబయిలో వున్నారని వెంటనే బయలుదేరి హైద్రాబాద్‌ వచ్చేస్తామని చెప్పారు. ఈ లోగా మళ్ళీ సుభానీ గారిని సంప్రదించి సవిత అడ్రసు చెప్పి వాళ్ళ యింటికి పంపే ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. అదే రోజు సవితకు కౌన్సిలింగు చేసి వరంగల్‌ వెళ్ళిపోవలసిందిగా సలహా యిచ్చారు. సవిత ఒప్పుకోవడంతో ఆమెను సురక్షితంగా తన యింటికి పంపేయగలిగాం. ప్రస్తుతం తాను సంతోషంగా, ప్రశాంతంగా వున్నానని సవిత కాల్‌చేసి చెప్పింది. చైల్డ్‌లైను సభ్యుడు సుభానీ గారికి హెల్ప్‌లైను ద్వారా ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరింది.
ఢిల్లీ నుండి హైద్రాబాద్‌ వరకూ….

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ నుండి మమత ఫోన్‌ చేశారు. భర్త నుండి వేధింపులు భరించలేక యింటినుండి వచ్చేశానని ఈ విషయం కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియదని చెప్పారు. ఢిల్లీనుండి హైద్రాబాద్‌ ఎలా రావాలి. ఎక్కడ ఉండాలి అని భయపడుతూ కంగారుగా అడిగారు. ముందుగా ఆమెకు ధైర్యాన్నిచ్చి కంగారు పడవద్దని కౌన్సిలింగు చేసి హైద్రాబాద్‌ రావటానికి కావల్సిన ఏర్పాట్లు చేస్తాం ఒక అరగంట తరువాత ఫోన్‌ చేయవలసిందిగా హెల్ప్‌లైన్‌ కౌన్సిలరు సూచించారు. విషయాన్ని కౌన్సిలరు వెంటనే కోఆర్డినేటరు దృష్టికి తీసుకెళ్ళారు. కోఆర్డినేటరు సూచన మేరకు ఆన్‌లైన్‌ బుకింగు ద్వారా న్యూఢిల్లీ నుండి సికింద్రాబాద్‌కు ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ బుక్‌ చేసి మమత కాల్‌కోసం ఎదురు చూశారు.
అరగంటం తరువాత మమత మళ్ళీ ఫోన్‌ చేసారు. టికెట్‌ వివరాలు తెలియజేసి భూమిక ఐ.డి. వుపయోగించి టికెట్‌ తీసుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. అలాగే హైద్రాబాద్‌లో ఎక్కడ వుండాలనుకుంటున్నారని కౌన్సిలరు ప్రశ్నించారు. తనకు ఎవరి దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేదని, కొంతకాలం ఏదైనా హోమ్‌లో వుంటానని చెప్పింది. మమత కోరిక మేరకు హెల్ప్‌లైను కౌన్సిలరు అంకురం, చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌, స్పందన షార్ట్‌ స్టే హోమ్‌లను సంప్రదించి వారి అనుమతి తీసుకుని వుంచారు. మర్నాడు సాయంత్రం మమత ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌లో హైద్రాబాద్‌ చేరుకుంది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో హెల్ప్‌లైనుకు కాల్‌చేసి మమత వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయమని కోరుతూ వచ్చారు. అయితే మమత మాత్రం తన గురించి తన కుటుంబ సభ్యులకు ఏ వివరాలు ఇవ్వవద్దని కోరింది. అందువల్ల మమత కుటుంబీకులకు ఆమె క్షేమంగా వుందని మాత్రమే చెప్పవలసి వచ్చింది. హెల్ప్‌లైను కౌన్సిలరు కూడా ట్రైను వచ్చే సమయానికి స్టేషనుకెళ్ళి మమతను రిసీవ్‌ చేసుకున్నారు. ఆ సమయంలో కౌన్సిలరు తనకోసం రావడంతో మమత ఎంతో సంతోషించింది. అయితే ఇంటికి వెళ్ళకుండా షార్ట్‌ స్టే హోమ్‌లో వుండటానికే ఆమె మొగ్గు చూపింది. అప్పుడు కౌన్సిలరు ఆమెను అంకురం తీసుకెళ్తానని చెప్పారు. అయితే తాను ఒకసారి తల్లితో మాట్లాడిన తర్వాత మమత మనసు మార్చుకుని తాను ఇంటికి వెళ్తానని అమ్మను, అక్కను చూడాలని వుందని అనడంతో కౌన్సిలరు అందుకంగీకరించి ఆమెను ఆటోలో ఇంటికి పంపించారు. రెండురోజుల తర్వాత మమత ఫోన్‌ చేసి షార్ట్‌ స్టే హోమ్‌ల వివరాలు అడిగి తెల్సుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్‌ చేసి తను స్పందన షార్ట్‌ స్టే హోమ్‌కి వెళ్తున్నట్లు చెప్పింది. ఢిల్లీ నుండి తనను హైద్రాబాదుకు తీసుకొచ్చినందుకు హెల్ప్‌లైనుకు కృతజ్ఞతలు తెలియజేసింది.
అర్థరాత్రి ఒంటరి మహిళ

ఫిబ్రవరి 2009లో ఒకసారి అఫ్‌జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషనునుండి ఎస్‌ఐ మోహనరావుగారు కాల్‌ చేసారు. నైట్‌ డ్యూటీలో వుండగా రోడ్డు మీద ఒక 30 సం||ల వయస్సున్న కొద్దిగా మతిస్థిమితం లేని యువతి కనపడితే పోలీస్‌ స్టేషనుకు తీసుకు వచ్చామని చెప్పారు. ఆమెను ఏదైనా షెల్టరు హోమ్‌కు పంపడానికి భూమిక హెల్ప్‌లైను సహాయం కోరారు. కౌన్సిలరు కోరిక మేరకు ఆ అమ్మాయి చేత ఫోన్‌లో మాట్లాడించారు.
కడప నుండి వచ్చిన లక్ష్మికి 18 సం|| క్రితం పెళ్ళైంది. ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. తన తల్లి, భర్త వల్ల తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని అవి తప్పించుకోటానికే తాను యింటి నుండి పారిపోయినట్లు చెప్పింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి ముందుగానే పోలీసులు హెచ్చరించడం వల్ల కౌన్సిలరు ఆ దిశగా ఆమెకు కౌన్సిలింగు యిచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. అలాగే పోలీస్‌ స్టేషను నంబర్లు తీసుకుని మళ్ళీ ఫోన్‌ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత స్నేహసదన్‌, స్టేట్‌ హోమ్‌ కౌన్సిలరు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ సమయంలో తమ వాహనం రిపేరులో వున్నందున ఎవరైనా ఆ అమ్మాయిని తీసుకు రావల్సిందిగా కోరారు. విషయం కోఆర్డినేటర్‌కు తెలియజేసి వారి అనుమతితో కౌన్సిలరు అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషనుకెళ్ళి అక్కడినుండి లక్ష్మిని చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌కు తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆమె ఇంకా అక్కడే ఆశ్రయం పొందుతోంది. ఇలా లెక్కలేనన్ని కేసుల్లో ఎంతోమంది బాధిత మహిళలకు హెల్ప్‌లైన్‌ అండగా, ఆసరాగా వుంది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...