Tuesday, June 30, 2009

భూమిక హెల్ప్‌లైన్‌ : మూడేళ్ళ ప్రయాణం


భూమిక హెల్ప్‌లైన్‌ ఆక్స్‌ఫామ్‌ వారి ఆర్థిక సహాయంతో ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడుతున్న విషయం అందరికీ విదితమే. అయితే ఆక్స్‌ఫామ్‌ వారు ఈమధ్య కొత్తగా చేపట్టిన DFID ప్రాజెక్ట్‌ కింద ”సివిల్‌ సొసైటీ రిసోర్స్‌ ఫెసిలిటీ” గా బాధ్యతలు నిర్వహించేందుకు భూమిక హెల్ప్‌లైన్‌ను ఎంచుకొనడం జరిగింది. ఇది గత మూడు సంవత్సరాలుగా భూమిక చేస్తున్న కృషికి గుర్తింపుగా మనం భావించవచ్చు. ఈ ప్రాజెక్టుపై భాగస్వాములతో అవగాహనా సదస్సు మరియు గడిచిన మూడు సంవత్సరాలలో భూమిక హెల్ప్‌లైన్‌పై విశ్లేషణా సదస్సు ఏప్రిల్‌ 27న సెలెబ్రిటీ క్లబ్‌లో నిర్వహించడం జరిగింది.

భూమిక హెల్ప్‌లైన్‌ కో-ఆర్డినేటర్‌ కొండవీటి సత్యవతి సమావేశం ప్రారంభిస్తూ ప్రాజెక్టు గురించి కొద్దిగా వివరించారు. ఆక్స్‌ఫామ్‌ వారు చేపట్టిన Stop violence against women (VAW) (మహిళలపై హింసను నిర్మూలిద్దాం) కార్యక్రమంలో భాగంగానే భూమిక హెల్ప్‌లైన్‌ నిర్వహించబడుతోంది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలు మరింతగా పెరగటం మనం చూస్తూనే వున్నాం. పూర్వంలా కాక నేటి స్త్రీలు తమ మనోభావా లను స్పష్టంగా తెలియజేయటం, అణిగి మణిగి వుండకపోవటం అనేవి ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇది ఎంతవరకు నిజం అనేవి కూడా మనం లోతుగా చర్చించవలసి వుంది. ప్రస్తుతం మనం ప్రస్తావిస్తున్న DFID ప్రాజెక్టు ముఖ్య వుద్దేశ్యం (”Promoting violence free lives for women from marginalized communities in India) సమాజంలో అంచులను నెట్టివేయబడిన వర్గాల స్త్రీలకు హింసలేని జీవితం అందజేయడం. ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలను సత్యవతిగారు పరిచయాల తరువాత తెలియజేశారు.
దళిత స్త్రీ శకి, హైదరాబాదు, ఎ.పి.వుమెన్స్‌ నెట్‌వర్క్‌ హైదరాబాదు, రెడ్స్‌ తూర్పుగోదావరి, కృషి కరీంనగర్‌, ఎస్‌వైఓ వరంగల్‌, అస్మిత హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, పీస్‌ వరంగల్‌, షహీన్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ పాతబస్తీ, హైదరాబాదు, సెర్ప్‌ ఇందిరా (కాంతి పథం)ఎస్‌విఎఎస్‌ తూర్పుగోదావరి మొదలగు సంస్థల ప్రతినిధులు, ప్రముఖ రచయిత్రులు, లాయర్లు ఇంకా హెల్ప్‌లైన్‌ వాలంటీర్లు మొత్తం కలిపి సుమారు 75-80 మంది ఈ సమావేశాలకు హజరయ్యారు.
పరిచయాల సమయంలో సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సునీతారాణిగారు మాట్లాడుతూ విద్యార్ధులలో ”స్త్రీలపై హింస” అనే అంశంపై అవగాహన కలిగించేలా కృషి చేయాల్సిన అవసరం చాలా వుందని వుద్ఘాటించారు. తమ యూనివర్సిటీలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఆడపిల్లలు మగపిల్లలు రెండు వేర్వేరు గ్రూపులుగా ఏర్పడి జరుగుతున్న చర్చా గోష్టిలో భాగంగా ఎంతమంది తమ తల్లులు హింస లేదా వివక్షను ఎదుర్కొనడం గమనించారని ప్రశ్నించడం జరిగింది. ఇందుకు సమాధానంగా దాదాపు 90% మగపిల్లలు తమ తల్లులు ఇంట్లో హింస ఎదుర్కొంటు న్నారని తమ భార్యలను కొట్టో, భయపెట్టో తమ అదుపాజ్ఞ లలో వుంచుకొనడం అనేది సమాజంలో భర్తల బాధ్యతగా భావిస్తున్నట్లు వారు చెప్పు కొచ్చారు. ఉన్నత చదువులు చదువుతున్న నేటి యువతలో కూడా ఇటువంటి ఆలోచనా ధోరణి ఇంకా ప్రబలుతూ వుందంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మహిళలపై హింస మూలాలు ఎంత లోతుగా వేళ్ళూనుకొని వున్నాయో.
SWARD సంస్థ నిర్వాహకురాలు శివకుమారి మాట్లాడుతూ ప్రత్యక్ష కౌన్సిలింగు అనేది ఒక్కొక్కసారి కౌన్సిలర్లను కూడా ఒత్తిడికి గురిచేస్తుందని చెప్పారు. SWARD కంట్రోల్‌రూమ్‌ లోని మహిళా పోలీస్‌ స్టేషన్లో ఒక కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ నుండి వచ్చిన పి. దామోదర్‌ గారు మాట్లాడుతూ తమ సంస్థ వినియోగదారుల హక్కులు, ఇంకా గిరిజన హక్కుల అంశాలపై పనిచేస్తుందని తెలియజేశారు. ఎ.పి. వుమెన్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా ష్ట్రజూఈఐ సంస్థనుండి వచ్చిన శ్యామల గారు మాట్లాడుతూ తామొక కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీరితో పాటు ఇంకా సమావేశాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ గురించి, తమ సంస్థల గురించి వివరించారు. పరిచయాలు, టీ విరామం తరువాత కొండవీటి సత్యవతి DFID ప్రాజెక్టు నేపధ్యం గురించి మరింత స్పష్టంగా వివరించారు.
భారతీయ స్త్రీలు అని ప్రస్తావించినప్పుడు వీరిని ఒకే గ్రూపుగా మనం వర్గీకరించకూడదు. ఎందుకంటే వివిధ సామాజిక వర్గాలనుండి, కులాల నుండి వచ్చే స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, వివక్ష విభిన్న కోణాలలో, స్థాయిల్లో వుంటుంది. ఇది సాహితీ వర్గాల్లోనే కాక మామూలు సామాజిక పోకడలో కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందువల్ల ప్రస్తుత D FID ప్రాజెక్టు సమాజంలో అంచులకు నెట్టివేయబడ్డ వర్గాల స్త్రీలకు హింసలేని జీవితం అందించడం అనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ వర్గాలకు చెందిన స్త్రీలకు హింసను ఎదిరించటానికి గాని, వివక్షను ప్రశ్నించడానికి కాని అనుకూలించే సౌకర్యాలు, న్యాయ సహాయం, ఇంకా చేయూతనందించే సదుపాయాలు అందుబాటులో లేవనేది నగ్న సత్యం.
DFID రిపోర్టు ప్రకారం జీవన ప్రమాణాల స్థాయిలో మనదేశానిది 137వ ర్యాంకు. మనదేశంలో పేద ప్రజలలో 70% మంది స్త్రీలే. స్త్రీల జీవనకాలం 44% కాగా, స్త్రీ అక్షరాస్యత కేవలం 46% మాత్రమే. నేటి సైంటిఫిక్‌ యుగంలో వివిధ రంగాలలో మేధోపరంగా, ఆర్థికపరంగా మనదేశం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ప్రసవ సమయంలో మనదేశంలో మరణిస్తున్న స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ. నోబెల్‌ బహుమతి గ్రహీత డా. అమర్త్యసేన్‌ చెప్పిన ప్రకారం 39.76% స్త్రీలు మనదేశంలో జన్మించకుండానే తప్పిపోతున్నారు. భారతదేశంలో పురుషుల, స్త్రీల సెక్స్‌ రేషియో 1000 :927 గా వుంది. ప్రసవ సమయంలో స్త్రీల మరణాలు, ఇంకా శిశు మరణాలు లింగ నిర్ధారణ పరీక్షలు ఈ సెక్స్‌ రేషియో పడిపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. లైంగిక అత్యాచారం, వావి వరుసలు మరిచి కూతుర్లు, చెల్లెళ్లపై లైంగిక అత్యాచారం, ఆడపిల్లలు కరువై ఒకే స్త్రీని పదిమంది పెళ్ళాడటం, చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి లైంగిక వృత్తిలోకి బలవంతంగా దింపడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో లైంగిక నేరాలు పెచ్చరిల్లడానికి ఈ పడిపోతున్న సెక్స్‌రేషియో ఒక ప్రధాన కారణం.
ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలన్నీ మన రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఎంతో ఆశావహంగా చూపిస్తున్నా వాస్తవం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వుంది. మనదేశం మొత్తం మీద హింసలో ఆంధ్రప్రదేశ్‌ ప్రధమస్థానంలో వుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ మొదటిస్థానంలో వుంది. పట్టణాల్లోనే కాక పల్లెల్లో కూడా స్త్రీలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. ఇటువంటి పరిస్థితులలో హింసను మనం ఎలా తగ్గించగలం. ఈ DFID ప్రోగ్రాం ఏ విధంగా వుపయోగకర మార్పును తీసుకు రాగలదో చూద్దాం.
21వ శతాబ్దంలో, అరవై ఏళ్ళ స్వాతంత్య్ర చరిత్రలో నేటికీ మన పార్లమెంట్లో స్త్రీల ప్రాతినిధ్యం 9% మాత్రమే. ఇది స్త్రీల సమస్యలపై పాలకుల, రాజకీయ నాయకుల నిజాయితీ లేని తనాన్ని సూచిస్తుంది. స్త్రీల సమస్యల విషయానికొచ్చేసరికి మహిళా నాయకులు కూడా మగవారిలా ఆలోచించడం మొదలుపెట్టి స్త్రీలకు బదులుగా కేవలం వారి వారి పార్టీ ప్రతినిధులుగా మాత్రమే మిగిలిపోతున్నారు. ఒక ప్రణాళికను లేదా ప్రతిపాదనను ప్రభావితం చేయాలంటే దానికి తగిన ప్రాతినిధ్యం పార్లమెంటులో వుండాలి. పార్లమెంటులో 33% మహిళా ప్రాతినిధ్యం కొరకు కూడా ప్రాజెక్టు ద్వారా కృషి చేయడం జరుగుతుంది.
ముందుగా చెప్పుకున్నట్టు ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అంచులకు నెట్టివేయబడిన వర్గాల స్త్రీలు. సమాజం వల్ల, సామాజిక వర్గీకరణ వల్ల, రాజ్యం వల్ల, వివక్షకు గురౌతున్న మహిళలను అంచులకు నెట్టివేయబడిన స్త్రీలుగా గుర్తించడం జరుగుతుంది. హింసను భరించడం అనేది ఈ స్త్రీల జీవితాలలో ఆనవాయితీగా మారింది. ఈ స్త్రీలను సామాజికంగా, వివక్ష పూరితంగా పక్కకు నెట్టివేయడం (Social Exclusion) అనే దురాచారాన్ని రూపుమాపటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
మౌనంగా హింసను భరించడం, జెండర్‌ సమానత్వం పట్ల ప్రభుత్వ, ప్రయివేట్‌ వ్యవస్థలలో నెలకొన్న నిర్లక్ష్య వైఖరి, న్యాయవ్యవస్థ పట్ల మహిళల్లో కరువవుతున్న భరోసా, సరైన ప్రత్యామ్నాయ సహాయ సదుపాయాలు లేకపోవటం మొదలైన మహిళల పట్ల పెరుగుతున్న హింసకు దానిని బాధితులు మౌనంగా భరించటానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేనపుడు, ఒక వేళ ఎవరైనా హింసను ఎదిరించి నిలబడ్డా తగిన ప్రత్యామ్నాయ సదుపాయాలు లేక భవిష్యత్తు పట్ల భయం అనిశ్చితి వల్ల స్త్రీలు హింసను, వివక్షను మౌనంగా సహిస్తూ, భరిస్తూ వుంటారు. ఇటీవలి రికార్డులు ప్రకారం మహిళలపై హింస కారణంగా నమోదైన మొత్తం కేసులలో కేవలం ఒక శాతం కన్నా తక్కువ కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయంటే దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మన న్యాయవ్యవస్థ బాధిత మహిళలకు కల్పిస్తున్న భరోసా ఏపాటిదో.
హింస, లేక వివక్షకు బాధితులైన మహిళల సహాయార్థం ప్రభుత్వం ఏర్పరచిరని సహాయ సదుపాయాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో వున్న కొన్ని సహాయ కేంద్రాలు సరైన నిర్వహణ లేక దయనీయ స్థితిలో నిరుపయోగంగా వున్నాయి. ఆది నుంచీ స్త్రీలపై కుటుంబం, కులం, మతం, రాజ్యం యొక్క ఆధిపత్య ధోరణి రాజ్యమేలుతోంది. ఇంతటి ఆంక్షల మధ్య, మరొకరి పెత్తనంలో జీవించే స్త్రీల జీవితాలు సహజంగానే ఒత్తిడికి గురౌతూ వుంటాయి. అందువల్లనే హింసకు గురెన స్త్రీలు హింసను ఎదిరించడానికి భయపడుతూ వుంటారు. ఇంట్లో స్త్రీలు ఎంత హింసకు గురైనా కూడా అది బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కుటుంబ పరువు పోతుందని ఒకవేళ ఏ స్త్రీ అయినా చెప్పుకున్నా కుటుంబ పరువు తీస్తోందని సమాజం కూడా ఆమె పట్ల చిన్నచూపు చూసే పరిస్థితులే మనకు ఎక్కువగా కనపడతాయి. ఇలా కుటుంబ పరువు అనే భారం స్త్రీలు మాత్రమే ఎందుకు మోయాలి? అలాగే హింస చేసే వారిని తప్పు పట్టకుండా హింసను భరించే వారికే హింసను కప్పిపుచ్చే భారం కూడా ఎందుకు ఉండాలి?
సామాజిక పరంగా, కుటుంబ పరంగా స్త్రీలపై హింస/వివక్ష కొనసాగుతున్న అసమానతలను చెరిపివేసే దిశగా ఈఓ|ఈ ప్రోగ్రాం కృషి చేస్తుంది. ఇందుకు ముందుగా స్త్రీలపై హింసను అంగీకరించకుండా వుండే విధంగా ముందుగా కుటుంబ సభ్యులను చైతన్యపరుస్తుంది. ఆపై సమాజంలో ప్రతి ఒక్కరు స్త్రీలపై జరుగుతున్న హింసను గుర్తించి, ప్రశ్నించే విధంగా కూడా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు కలింగించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే హింసను ఎదిరించి, వ్యతిరేకించి న్యాయపరంగా, సామాజిక పరంగా పోరాడాలనుకునే, లేదా మరో దారి లేక హింస నుండి బయట పడాలనుకునే స్త్రీల కొరకు వారికి కావలసిన తగు ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించేలా, అలాగే అవి సక్రమంగా పనిచేసి, బాధితులకు అందుబాటులో వుండే విధంగా చూడటం అనేది ఈ ప్రోగాంలో ఒక ముఖ్య భాగం. అలాగే, స్త్రీల శ్రేయస్సు కోరే, సహకారం అందించే చట్టాలు చాలా వున్నాయి. కాని వాటిని వుపయోగించుకునే విధంగా నేటి పరిస్థితులు లేవు. చాలా సందర్భాలలో తమకు ఫలానా అధికారం లేదా హక్కు ఫలానా చట్టం ద్వారా అందుబాటులో వుంది అనే విషయాలు చాలా మందికి స్త్రీలకు తెలియదు. ఉదాహరణకు గృహహింస చట్టం క్రింద భర్త ఇంట్లో వుండే పూర్తి అధికారం హక్కు భార్యకు వుంది, అది అద్దె ఇల్లయినా సరే ఆ ఇంట్లో నుంచి ఆమెను వెళ్ళగొట్టే హక్కు అత్తమామలకే కాదు భర్త కూడా లేదు. కాని చట్టంలో వున్న ఈ సదుపాయం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇలా స్త్రీలకు ఉపయోగకరంగా వుండే చట్టాలను మరింత సమర్థవంతంగా ప్రజలలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం ఈ ప్రోగ్రాం ద్వారా జరుగుతుంది.
కుటుంబ స్థాయిలో మొదలుకొని, వర్గ స్థాయికి, గ్రామ స్థాయికి, ఆపై సామాజిక స్థాయిలో స్త్రీలపై హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా భాగస్వామి సంస్థలు (Partner Organization) పని చేయవలసి వుంటుంది. వారు పనిచేసేచోట స్థానికంగా స్త్రీలపై హింస వివక్షకు సంబంధించిన ప్రధాన అంశాలను గుర్తించి తగు విధంగా సమస్య పరిష్కారం కోసం కృషి చేయవలసి వుంటుంది. ఆ క్రమంలో ఎదురయ్యే ఆటుపోటులను గుర్తించి అవి అధిగమించటంలో అందరూ కలిసి చర్చించి సమన్వయపరచుకొనే విధంగా అలాగే భాగస్వాములకు అవసరమైన సహాయ సహకారాలను అందించటం ”సివిల్‌ సొసైటీ రిసోర్స్‌ ఫెసిలిటీ” ప్రధాన బాధ్యత అని ముగిస్తూ సత్యవతి భాగస్వామి సంస్థల ప్రతినిధులను మాట్లాడవలసిందిగా కోరారు.
ముందుగా SWARD సంస్థ ప్రతినిధి శివకుమారి గారు మాట్లాడుతూ హింసకు బాధితులైన 80% స్త్రీలు చివరి ఆశగా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తారు. చాలా సందర్భాలలో వీరికి తగు విధమైన దిశానిర్దేశం, సహాయ సహకారాలు పోలీసుల నుండి అందవు. చాలా చోట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ఒకసారి కార్యక్రమంలో భాగంగా జైపూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించడం జరిగింది. అక్కడ పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానంగా ఒక కౌన్సిలింగు సెంటర్‌, ఒక తాత్కాలిక వసతి గృహం (Short stay home) నిర్వహించబడుతున్నవి. ఈ విధమైన ఏర్పాటు ప్రతి పోలీస్‌ స్టేషనుకు వుంటే బాధిత స్త్రీలకు చాలా వుపయోగకరంగా వుంటుంది అని చెప్పారు. ఈ దిశగా కృషి చేసేటప్పుడు అధికారులను కూడా కలుపుకుని పనిచేయగలిగితే మంచి ఫలితాలను సాధించవచ్చు అని చెప్పారు.
షహీన్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ అనే సంస్థ హైదరాబాద్‌ పాత బస్తీలోని ముస్లిం మహిళల సమస్యల పరిష్కారం అభివృద్ధి కోసం పనిచేస్తోంది. పాత బస్తీలోని నిరుపేద ముస్లిం కుటుంబాలలోని బాలికలు కుటుంబ సభ్యులవల్ల కూడా లైంగిక అత్యాచారాలకు గురౌతున్నారు. ఆర్ధిక ఇబ్బందులలో కూరుకు పోయి అప్పులు తీర్చుకొనడం కోసం కన్న బిడ్డలను అరబ్‌ షేకులకు అమ్ముకోవటం అనేది కూడా ఇక్కడ సామాన్య విషయమే. అందువల్లే ఇక్కడ బాల్యవివాహాలు, చిన్నపిల్లలను బలవంతంగా లైంగిక వృత్తిలోకి దింపడం అనేవి సాధారణ విషయాలు. షహీన్‌ సంస్థ ఇక్కడి ముస్లిం మహిళల సమస్యలను గుర్తించి వారికి తగిన సహాయం అందించడం, బాధిత మహిళలలో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థికంగా స్వతంత్రులుగా జీవించే అవకాశం కల్పించటం కోసం వారికి అనువైన వృత్తి విద్యలు నేర్పటం, వంటి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రస్తుతం తమ సంస్థ 14, 15 ఏళ్ళ బాలికలకు ట్రాఫికింగు గురించి తెలియచేసి, ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై సమ్మర్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు, షహీన్‌ ప్రతినిధి సుల్తానా తెలియజేశారు.
రెడ్స్‌ (REDS) సంస్థవారు అనంతపూర్‌లో మహిళల కోసం కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నారు. సంస్థ నిర్వాహకురాలు భానుజ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ST, ముస్లిం మహిళల ట్రాఫికింగు చాలా పెరిగిందన్నారు. పేదరికం, తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణకు లోనై డబ్బు, వ్యామోహాల మోజుతో ఆడప్లిలలు ట్రాఫికింగు బారిన పడుతున్నారు. ప్రభుత్వ నిర్వహణలోని తాత్కాలిక వసతి గృహాల పనితీరు విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని భానుజ సభికులతో పంచుకున్నారు. ఒకసారి పూనేలోని వ్యభిచార గృహాల నుండి జిల్లాకు చెందిన 60 మందికి పైగా బాలికలను రక్షించటం జరిగింది. ఇలా తీసుకువచ్చిన బాలికలను ప్రభుత్వ తాత్కాలిక వసతి గృహాలకు పంపటం జరిగింది. తర్వాత ఒకసారి ఈ బాలికలను చూడటానికి భానుజ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక తెలిసింది కొంతమంది గోడ దూకి పారిపోయారని మిగతావారి మాటల బట్టి తెలిసిందేంటంటే అక్కడ ఆ వసతి గృహంలో వారు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సరిగ్గా ఒక మనిషి కూర్చోటానికి కూడా వీలులేని స్థలంలో వుంటూ మరుగుదొడ్డి పక్కనే తిండి, పడక రెండూ. చాలీచాలని భోజనం ఒక పూట మాత్రమే. ఆకలి బాధ తట్టుకోలేక తమలో కొంతమంది పారిపోయారని మిగిలినవారు తెలియజేశారు. ఇటువంటి దైన్యజీవితాలను ప్రతి రోజూ చూస్తూ మతి చలించకుండా, ధైర్యంగా సమస్యను పరిష్కరించటానికి చాలా రాటుదేలాలని భానుజ తెలియజేశారు. భానుజ మాటలు చాలామందిని కన్నీరు పెట్టించాయి.
చట్టాల అమలులో జాప్యం వల్ల కలిగే పరిణామాల గురించి ఒక ఉదాహరణతో మరో ప్రతినిధి శ్యామల తెలియజేశారు. గృహహింస చట్టం ప్రకారం రెండు నెలలలో కేసు పరిష్కారం కావాలి. ఒక కేసు 6వ నెల గర్భవతి అయిన బాధిత మహిళ గృహహింస చట్టం కింద తన ప్రసవానికి వైద్య ఖర్చులు, భర్తనుండి భరణం కోరుతూ కేసు వేసింది. ప్రస్తుతం ఆమె బిడ్డకు ఏడవ నెల, ఇంకా ఆమె కేసు పరిష్కారం కాలేదు. మరొక కేసు ట్రాఫికింగు నుంచి రక్షింపబడ్డ మహిళలకు ప్రత్యామ్నాయ వృత్తులు చేపట్టడం కోసం ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 5000/- పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే దీనికి ప్రొటెక్షన్‌ ఆఫీసరు అనుమతి ఇవ్వాలి. కాని ఒక రక్షణాధికారి 5000/- తనకు లంచం ఇస్తే కాని కాగితం ఇవ్వనన్నాడు. ఇలా చట్టాలు, ప్రభుత్వ పథకాలు నిర్వీర్యమౌతున్న సంఘటనలే ఎక్కువగా వున్నాయన్నారు శ్యామల. వీరితో పాటు ఇంకా చాలా మంది ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే స్త్రీలకు వుద్దేశించబడి చేసిన చట్టాలు, ప్రభుత్వ పథకాలు సరైన విధంగా అమలయ్యేలా చూడటం మనందరి కర్తవ్యం అన్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ, తాత్కాలిక వసతి గృహాల విస్తృత ఏర్పాటు అవి సక్రమంగా పనిజేసి అందులో ఏ మహిళైనా సరే కనీసం ఒకరోజన్నా వుండగలిగే సదుపాయం కల్పించేలా కృషి చేయాలని కూడా అందరూ అంగీకరించడంతో కార్యక్రమం ముగిసింది. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు, ప్రముఖ రచయిత్రులెందరో ఈ సమావేశంలో పాల్గొన్నారు.అబ్బూరి ఛాయాదేవి, ఘంటశాల నిర్మల, శిలాలోలిత, తురగా జానకీరాణి, దేవకీదేవి, ఆర్‌.శాంతసుందరి, వారణాసి నాగాలక్ష్మి తదితర రచయిత్రులు ఎంతో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.
భోజనాల అనంతరం భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగు ప్రారంభమైంది.
భూమిక హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ కొండవీటి సత్యవతి సభను ప్రారంభించారు. ముందుగా హెల్ప్‌లైన్‌ మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు. ఒకసారి భూమిక హెల్ప్‌లైన్‌ ప్రారంభ దినాలని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సందేహాలు, అనుమానాల, మధ్య ఒకింత ఉత్కంఠతోనే హెల్ప్‌లైన్‌ ప్రారంభించడం జరిగిందన్నారు. కేవలం ఫోన్‌ ద్వారా సలహాలందించటం వల్ల ఎంత వరకు బాధితులకు వుపయోగపడు తుందనే అనుమానాలు ఎక్కువగానే వుండేవన్నారు. కానీ ప్రారంభ సంవత్సరంలోనే వెయ్యికి పైగా కాల్స్‌ రావడంతో హెల్ప్‌లైన్‌ అవసరం, ఆవశ్యకతలపై మరింత నమ్మకం కుదిరింది. సమాజంలో వివిధ స్థాయిలలో హింస, వివక్షకు బలౌతున్న నిస్సహాయ మహిళలకు తగిన చేయూత నందించడం కోసం ఉద్దేశించబడిన హెల్ప్‌లైన్‌ పరిధులు గత మూడు సంవత్సరాలలో మరింతగా విస్తరించాయి. మహిళలపై అమలవుతున్న గృహహింస వికృత పార్శ్వాలు ఎంత లోతుగా వేళ్లూనుకుపోయాయో అవగతమౌతూ వచ్చాయి.
మొదటి సంవత్సరంలో ఎక్కుగా పట్టణ ప్రాంతాలనుండి మాత్రమే కాల్స్‌ వచ్చేవి. ఎక్కువగా విజయవాడ, హైద్రాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌ వంటి చోట్ల నుండి మాత్రమే స్పందన లభించింది. ఇది గమనించి హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 2908 ప్రచారం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగా హెల్ప్‌లైను నంబరు, వివరాలతో కూడిన స్టిక్కర్లు, పోస్టర్లు వాలంటీర్ల సాయంతో పంచడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సులపై, టీవీ9, ఈటీవీ2 లలో ప్రచారం కల్పించడం ద్వారా భూమిక హెల్ప్‌లైను గురించి మరింత మందికి తెలిసే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి కాల్స్‌ వస్తున్నాయి.
మొదట్లో ఎక్కువగా అత్తమామల వేధింపులు, కట్నం కోసం వేధింపులు, కోర్టు కేసులకు సంబంధించిన సలహాల కోసం కాల్స్‌ వస్తుండేవి. హెల్ప్‌లైను గురించి మరింత ప్రచారం లభించే కొద్దీ హెల్ప్‌లైనుకు వచ్చే కాల్స్‌లో వైవిధ్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం న్యాయ సంబంధిత కేసులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు, లైంగిక వేధింపుల కేసులు, కట్నం కోసం వేధింపుల కేసులు, బాల్య వివాహాలకు సంబంధించిన ఫిర్యాదులు, వైద్య సలహాలు ఇంకా కెరీర్‌ కౌన్సిలింగుతో పాటు ఒక మంచి సమాచార కేంద్రంగా కూడా భూమిక హెల్ప్‌లైను పనిచేస్తోంది. హెల్ప్‌లైను ప్రచారం కోసం అప్పుడప్పుడు వివిధ ప్రసార మాధ్యమాలలో కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, జరుగుతూంటుంది. అటువంటప్పుడు ఒక్కోసారి రోజుకు 200లకు పైగా కాల్స్‌ అటెండ్‌ అవ్వాల్సి వస్తుంది.
ప్రస్తుతం భూమిక హెల్ప్‌లైను ఉ|| 8 గం|| నుండి రా|| 11గం|| వరకు పనిచేస్తోంది. మూడు షిఫ్టులలో ముగ్గురు కౌన్సిలర్లు పనిచేస్తున్నారు. సోమ, శని వారాలలో ప్రత్యేకంగా న్యాయసలహా, సంప్రదింపుల కోసం నేరుగా లాయర్లతోనే మాట్లాడే అవకాశం కూడా వుంది. కొన్ని సందర్భాలలో సహాయం కోసం కాల్‌ చేసేవారు తీవ్రమైన మానసిక ఒత్తిడితో మాట్లాడలేని స్థితిలో ఏమీ చెప్పకుండా ఏడుస్తూ వుండిపోతారు. అటువంటి సందర్భాలలో, కౌన్సిలరు చాలా ఓపికగా (అటునుండి స్పందన లేకపోయినా) ధైర్యం చెప్పి, భరోసా యిచ్చి మెల్లగా బాధిత స్త్రీలచేత మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఇందు కోసం ఒక్కోసారి 15-20 నిముషాలు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టే సందర్భాలుంటాయి. కాని ఒకసారి మాట్లాడటం మొదలుపెట్టాక బాధితులు ఒక్కొక్కటిగా తమ సమస్యలను చెప్పుకొస్తారు. కొన్ని సందర్భాలలో కేవలం తమ బాధలను మరొకరికి చెప్పుకొని సాంత్వన పొందటం కోసమే కాల్‌ చేస్తారు.
అటువంటి సమయాలలో కౌన్సిలరు వారు చెప్పిందంతా విని వారికి కావలసిన మానసిక ధైర్యాన్ని అందించడంలో తోడ్పతారు. ఇలా చాలా సందర్భాలలో కాల్స్‌ కోసం అరగంట పైగా కూడా మాట్లాడవలసి వస్తుంది. అటువంటప్పుడు సహజంగానే మిగతావారికి ఫోను ఎంగేజ్‌లో వుండటం జరుగుతుంది. హెల్ప్‌లైన్‌ కాలర్స్‌ అవసరాలకు అనుగుణంగా వుండేందుకు కాల్‌ సమయంపై పరిమితులుండవు. సహాయం కోరే ఏ స్త్రీ అయినా ఎంతసేపైనా మాట్లాడే అవకాశం బహుశా భూమిక హెల్ప్‌లైను మాత్రమే కల్పిస్తూ వుండవచ్చు. ప్రభుత్వ హెల్ప్‌లైను మాత్రం మూడు నిముషాల తర్వాత దానంతటదే కట్‌ అయిపోతుంది. భూమిక హెల్ప్‌లైనుకు కాల్‌ చేసే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచబడుతాయి. అలాగే వివరాలు ఇవ్వటం ఇష్టంలేని వారిపై ఎటువంటి బలవంతం వుండదు. అవసరాన్ని బట్టి ఫాలో అప్‌ కోసం మాత్రం పేరు, వూరు వంటి కొన్ని ప్రాథమిక వివరాలు మాత్రమే అడగటం జరుగుతుంది.
భూమిక హెల్ప్‌లైను ద్వారా సహాయం పొందిన చాలా మంది మళ్ళీ ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కొంతమంది వ్యక్తిగతంగా వచ్చి ధన్యవాదాలు తెలుపుతామని అడుగుతూ వుంటారు. అది హెల్ప్‌లైను సిద్ధాంతాలకు వ్యతిరేకం కాబట్టి అందుకు మేం అంగీకరించం అని సత్యవతిగారు వివరించారు. సమావేశాలలో పాల్గొన్న మేరీ కుమారి మాదిగ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు చెందిన మహిళలకు హెల్ప్‌లైను నంబరు గుర్తు పెట్టుకోవటం, ఫోనులో మాట్లాడి సలహా పొందటం అనేది చాలా కష్టమైన పని అని, మరేదైనా విధంగా ఆ వర్గాలకు సంబంధించిన మహిళలకు కూడా హెల్ప్‌లైను సదుపాయాలు అందించగలిగితే బావుంటుందని ఆ విధంగా ఆలోచించవలసిందిగా సూచించారు. ఈ విషయాన్ని సత్యవతిగారు అంగీకరించారు. అలాగే కార్పోరేట్‌ రంగంలో కూడా చదువుకుని ఉన్నత ఉద్యోగాలలో వున్న స్త్రీలు కూడా తీవ్రమైన గృహహింసకు, వివక్షకు గురౌతూ సహిస్తున్న సందర్భాలు తమ దృష్టికి వచ్చాయని. అణగారిన వర్గాల స్త్రీలు, అలాగే కార్పోరేట్‌ రంగంలో వివక్షను ఎదుర్కొంటున్న స్త్రీలకు కూడా హెల్ప్‌లైను ద్వారా సహాయ సహకారాలు అందేలా చూడవలసిన అవసరం ఎంతో వుందంటూ సత్యవతిగారు కార్యక్రమాన్ని ముగించారు.
భూమిక హెల్ప్‌లైను ద్వారా నేటి వరకు ఎంతో మంది స్త్రీలు తమ సమస్యలకు పరిష్కారం పొందగలిగారు. సమస్య క్లిష్టతను బట్టి హెల్ప్‌లైను ద్వారా అందించబడే సహాయం ఆధారపడి వుంటుంది. భూమిక పాఠకుల అవగాహన కోసం హెల్ప్‌లైను ద్వారా పరిష్కరించబడిన కొన్ని కేసులను పేర్లు మార్చి వివరిస్తున్నాం.

విదేశాలలో వేధింపులకు గురిచేస్తున్న భర్త నుండి విముక్తి
మంచి ఆలోచన వుండి దారి చూపగలిగే వారైతే పరోక్షంగా కూడా క్లిష్ట సమస్యకు పరిష్కారం చూపవచ్చనే దానికి భాగ్యలక్ష్మి గారి కథే మంచి ఉదాహరణ. పొన్నూరు నుండి భాగ్యలక్ష్మి గారు ఒకరోజు భూమిక హెల్ప్‌లైనుకు ఫోను చేసి విదేశాలలో వుంటున్న తన కూతురి దుర్భర జీవితం గురించి వివరించారు. విదేశాలలో మంచి వుద్యోగం, మంచి చదువు, సాంప్రదాయ కుటుంబం అని అబ్బాయి తల్లిదండ్రులు చెప్పగానే ఏమీ ఆలోచించకుండా డాక్టరు చదువుకున్న కూతురు శశిరేఖనిచ్చి పెళ్ళి చేసారు. పెళ్ళైన కొద్ది రోజులకే రేఖ భర్తతో కలిసి కోటి ఆశలతో కన్నవారినీ, స్వదేశాన్ని వీడి వెళ్ళింది. రోజులు గడుస్తున్నా భర్త ఉద్యోగానికి వెళ్ళకపోవడం, పైగా వ్యసనాలకి బానిసగా మారిపోవడంతో రేఖ ఆశలన్నీ అడియాసలయ్యాయి. కఠిన వాస్తవాలను అంగీకరించిన రేఖ తన భర్తను మంచిగా మార్చుకోవటానికి విఫల ప్రయత్నము చేసింది. అతను ఆమె మాట వినకపోవటమే కాక తిరిగి మరింతగా హింసించేవాడు. ఇది కాకుండా అతను డ్రగ్సుకు బానిసయ్యాడని తెలిసి మరింత కృంగిపోయింది. ఇంట్లో ఆర్థికపరిస్థితి క్షీణించడంతో ఒక హాస్పిటల్లో డాక్టరుగా జాయినయ్యింది.
రేఖ సంపాదనను ఆమె భర్త పూర్తిగా అనుభవించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు ఇతరులతో లైంగిక సంబంధాలు కూడా మొదలయ్యాయి. ఎప్పటికైనా భర్తలో మార్పు వస్తుందనే నమ్మకంతో వున్న రేఖకు యిది మరో పెద్ద ఎదురుదెబ్బ. భర్తనుండి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆర్థికంగా, లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తూనేవున్నాడు. జరుగుతున్న విషయాలన్నీ రేఖ తన తల్లిదండ్రుల నుంచి కూడా దాచిపెట్టింది. అయితే స్నేహితుల ద్వారా రేఖ పరిస్థితిని తెలుసుకున్న భాగ్యలక్ష్మిగారు వెంటనే కూతురుకు ఫోన్‌చేసి అన్ని వివరాలు కనుక్కున్నారు. తన కూతురు ఊరు కాని ఊరులో నా అనేవారు లేని విదేశాలలో జీవన్మరణ పరిస్థితిలో చిక్కుకున్నదని భాగ్యలక్ష్మిగారికి అర్థం అయ్యింది.
కూతుర్ని రక్షించుకోవటానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే సందిగ్ధావస్థలో వుండగా టీవి9 నవీన కార్యక్రమంలో భూమిక హెల్ప్‌లైను టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 2908 చూసి ఒకసారి ప్రయత్నించి చూద్దాం తనకు ఎటువంటి సహాయం అందించగలరో అనే ఉద్దేశ్యంతో హెల్ప్‌లైనుకు కాల్‌ చేసారు. మొదటిసారి ఫోన్‌ చేసినపుడు హెల్ప్‌లైన్‌ ఆశయాలు, వుద్దేశ్యాలు, పనిచేసే విధానం, ఏవిధంగా సహాయం పొందవచ్చు వంటి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. సమస్యల్లో వున్న స్త్రీలకోసం భూమిక హెల్ప్‌లైను పనిచేస్తుందని బాధిత స్త్రీల వివరాలు గోప్యంగా వుంచడమే కాక వారి వ్యక్తిగత భావాలు, అభిప్రాయాలు, అవసరాలకు అనుగుణంగా సలహాలు, సూచనలు, అందజేస్తామని కౌన్సిలరు భాగ్యలక్ష్మిగారికి వివరించారు.
మర్నాడు భాగ్యలక్ష్మిగారు హెల్ప్‌లైనుకు ఫోనుచేసి తన అల్లుడి వల్ల కూతురు పడుతున్న కష్టాల గురించి వివరించారు. అయితే కూతురి స్థితి వల్ల తల్లడిల్లిపోయిన భాగ్యలక్ష్మిగారు భావోద్వేగానికి గురౌతున్నట్లు గ్రహించిన కౌన్సిలర్‌ ముందుగా భాగ్యలక్ష్మి గారికి ధైర్యం చెపుతూ మానసిన స్థైర్యాన్ని అందించారు. ఆపై సమస్య పట్ల రేఖ అభిప్రాయం కనుక్కోమని, వీలైతే ఆమె చేత హెల్ప్‌లైనుకు కాల్‌ చేయించమని సలహా యిచ్చారు. మరుసటిరోజు భాగ్యలక్ష్మిగారు కొంత ధైర్యంగా మాట్లాడారు. తాను రేఖతో మాట్లాడానని, తను భర్త నుండి విడిపోవాలని కోరుకుంటున్నట్లు, ఇకనైనా తన జీవితం సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని తను కోరుతున్నట్లు భాగ్యలక్ష్మిగారు తెలియజేశారు. అయితే విడాకులు తీసుకుంటారా, తాత్కాలికంగా విడిపోతారా లేక మారిటల్‌ కౌన్సిలింగు తీసుకున్న తరువాత ఆలోచిస్తారా అనే కొన్ని సూచనలు ఆమెకు తెలియజేశారు హెల్ప్‌లైను కౌన్సిలర్‌. ఈ విషయాన్ని కూతుర్నడిగి చెప్తానన్నారు భాగ్యలక్ష్మిగారు.
తమ సంసార జీవితంలో ఎదురౌతున్న ఒడిదుడుకులను అధిగమించటానికి పోస్ట్‌ మారిటల్‌ కౌన్సిలింగు తీసుకుందామన్న రేఖ సూచనకు తీవ్రంగా స్పందించిన ఆమె భర్త ఆమెను చాలా క్రూరంగా కొట్టి తిట్టడం ప్రారంభించాడని భాగ్యలక్ష్మిగారు రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసి చెప్పారు. సమస్య మరింత తీవ్రరూపం దాల్చడంతో ఈ కేసును హెల్ప్‌లైను ప్యానల్‌ అడ్వకేటు కాంతి గారిని సంప్రదించి వారి సలహా సూచనలు తీసుకోవటం జరిగింది. కాంతి గారి సలహా మేరకు భాగ్యలక్ష్మిగారు మళ్ళీ కాల్‌ చేసినపుడు లోక్‌ అదాలత్‌లో రేఖ పేరున కేసు వెయ్యమని అలాగే అక్కడ తను ఎదుర్కొంటున్న సమస్యలను కాగితంపై వ్రాసి ముందుగా కౌన్సిలింగు అడిగి ఆపై డైవర్స్‌ కోసం అప్లై చేయమని కౌన్సిలరు సూచించారు. కేసు ఫైల్‌ చేసిన తరువాత 4 వారాలుగా కోర్టుకు వెళ్ళడం కొన్ని ఇబ్బందులు రావడం మళ్ళీ హెల్ప్‌లైనుకు ఫోన్‌ చేసి అడ్వకేటు సలహా తీసుకోవడం యిలా కొంతకాలం గడిచింది.
అయితే జూన్‌లో రేఖ కోర్టుకు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడడంతో హెల్ప్‌లైను అడ్వకేటు సలహా మేరకు రేఖ జులైలో ఇండియా రాగలదని కావున కేసు అప్పటికి వాయిదా వెయ్యమని లోక్‌ అదాలత్‌ సెక్రటరీ గారికి వుత్తరం రాశారు. వారి కోరిక మేరకు కోర్టు జులై 22కి వాయిదా వేసింది. జులై 22న భార్యాభర్తలను ముందుగా కౌన్సిలింగుకు పంపారు. దాని వల్ల ఏ విధమైన ప్రయోజనం లేకపోయేసరికి ఇరువురి అంగీకారంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. తన భర్త పెట్టే ఎన్నో వేధింపుల నుండి బయటకు రాగల్గినందుకు రేఖ చాలా సంతోషించింది. యికనైనా జీవితం సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తానని తనకు అన్ని విధాలా సాయపడిన, అన్ని సమయాల్లో సలహాలందించి తొందరగా సమస్య పరిష్కారమయ్యేలా చేసినందుకు హెల్ప్‌లైనుకు ధన్యవాదాలు తెలిపింది. ఇది భూమిక హెల్ప్‌లైను ద్వారా పరిష్కృతమైన మొట్టమొదటి కేసు.
కన్నతండ్రి వల్ల లైంగిక వేధింపుల నుండి కూతుర్లను రక్షించిన తల్లి

ఆగస్టు 2006లో సీతమ్మ హెల్ప్‌లైనుకు ఫోను చేసారు. తనకు పెళ్ళై 20 సంవత్సరాలైందని, 18, 17 సం|| వయస్సు గల ఇద్దరాడ పిల్లలున్నాని తన భర్త గవర్నమెంటు ఉద్యోగస్తుడని, అతని లైంగిక వేధింపుల నుండి తన ఇద్దరు కూతుర్లను ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చానని, కాని ఇలా ఎంతకాలం వారిని రక్షించగలనో తెలియకుండా వుంది, అందుకే ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లోనించి పారిపోయి వచ్చేశానని, కాని తన భర్త ఎలాగైన తమను పట్టుకుంటాడు కాబట్టి, అతని నుంచి తప్పించుకునేందుకు ఏదైనా షార్ట్‌ స్టే హోమ్‌ (తాత్కాలిక వసతి గృహం)లో చేర్పించాల్సిందిగా కోరారు. వెంటనే కౌన్సిలరు ఆమెకు తగిన మానసిక స్థైర్యాన్ని అందిస్తూనే వారికి వుపయోగకరంగా వుండే కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌ల ఫోన్‌ నంబర్స్‌ యిచ్చి మళ్లీ కాల్‌ చేయమని కౌన్సిలర్‌ సూచించారు. ఇంతలో కౌన్సిలరే కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌లకు ఫోన్‌ చేసి షెల్టర్‌ కోసం అడిగారు. అప్పుడు ఒక షార్ట్‌ స్టే హోమ్‌ వారు వెంటనే స్పందించి ఆశ్రయం యివ్వడానికి అంగీకరించారు. ఆ విధంగా సీతమ్మగారిని, వారి యద్దరు పిల్లలతో సహా షార్ట్‌ స్టే హోమ్‌కు పంపడం జరిగింది. ఆ తరువాత ఆమె భర్తపై కేసు ఫైల్‌ చేసింది. ఆపదలో ఆదుకున్నందుకు ఆమె భూమికకు ధన్యవాదాలు తెలియజేశారు.
గృహ నిర్భంధం నుండి విముక్తి పొందిన మహిళ

ఆగస్టు 2006లో శ్రీశైలం నుండి రమణి ఫోన్‌ చేసి భర్త మామల వల్ల తన కూతురు పడుతున్న అగచాట్ల గురించి యిలా వివరించారు.
రమణి పెళ్ళై ఆరు నెలలయ్యింది. అత్తగారు లేరు. భర్త, మామ మాత్రమే వుంటున్నారు. తండ్రి మాటలు విని రమ భర్త ఎప్పుడూ రమను కొడుతూ తిడుతూ వుంటారు. చివరికి ఒక రోజు రమని రూంలో పెట్టి బంధించి తిండికూడా పెట్టడం మానేశారు. ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వటం లేదని రమణి కన్నీళ్ళ మధ్య తన బాధను వ్యక్తం చేశారు. వారి మీద కేసు పెట్టాలంటే ఆ వూర్లో వారు చాలా పలుకుబడి వున్నవారిని అందుకే భయంగా వుందని చెప్పారు. కౌన్సిలర్‌ రమణి గురించి మరికొన్ని వివరాలు అంటే రమి ఎంత వరకు చదువుకుంది, పెళ్ళికి ముందు ఎలావుండేది, ఏం చేసేది ఇలాంటి చిన్న చిన్న విషయాలు అడిగి తెల్సుకున్నారు. అలాగే వీలైతే రమ చేత మాట్లాడించవలసిందిగా రమణిగారికి సూచించారు. రెండు రోజుల్లో రమణి ఫోన్‌ చేసి కౌన్సిలరుకు తన సమస్యను వివరించింది. భార్య భర్తల మధ్య ఎటువంటి సంబంధం వుంది, అందులో మామగారి ప్రమేయం ఎంతవరకు వుంది అన్న అంశాలు కౌన్సిలర్‌ రమను అడిగి తెల్సుకున్నారు.రమ చెప్పిన దాన్ని బట్టి మామగారి అనుమతి లేకుండా రమ భర్త ఏ పనీ చేయడు. ఆఖరికి భార్యతో మాట్లాడలన్నా మామగారి అనుమతి తప్పనిసరి. ఇప్పుడు కొత్తగా భార్యాభర్తల మధ్య ఉన్న లైంగిక సంబంధ అంశాలను కూడా మామగారు అడిగి తెల్సుకోవడంతో రమ చాలా భయపడింది. తన భర్తకు ఉద్యోగం లేదు. మామగారు ఏం చెపితే అవి చేయాలి. గత 8 వారాలుగా తాను అత్తవారింట్లో గృహ నిర్భంధంలో వున్నానని రమ తెలియజేసింది. కౌన్సిలరు రమకు ధైర్యం చెప్పి మానసిక స్థైర్యం కలుగజేస్తూ తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలను తెలియజేసి తను ఏం చేయాలనుకుంటుందో నిర్ణయించుకోమని కౌన్సిలరు చెప్పారు. తనను గృహనిర్భంధం చేసి హింసిస్తున్న భర్త, మామగారిపై కేసు పెట్టాలని ఆ రమ నిర్ణయించుకుంది. అప్పుడు వెంటనే దగ్గరలో వున్న పోలీస్‌ స్టేషను నెంబరు యిచ్చి వారికి ఫోన్‌ చేయమని సలహా యిచ్చారు.
కౌన్సిలరు యిచ్చిన ధైర్యంతో రమ పోలీస్‌ వారికి ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే పోలీస్‌ వారు చొరవ తీసుకుని రమ వున్న ఇంటికి వెళ్ళి అక్కడున్న ఆమె భర్త మామలను అరెస్టు చేసి రమను తన తల్లిదండ్రుల దగ్గరకు పంపించారు. గృహనిర్భంధం నుండి బయటపడిన (గృహహింస చట్టం)తో పాటు విడాకులకు కూడా అప్లై చేసుకుంది. తన కూతురిని గృహనిర్భంధం నుండి బయటకు తీసుకురావడమే కాక హింసించే భర్త, మామల బారి నుండి బయట పడే మార్గం చూపినందుకు రమణిగారు ఎంతో సంతోషంగా తన కృతజ్ఞతలు తెలియజేశారు.
పొరుగు రాష్ట్రంలో చిక్కుకున్న మహిళకు సహాయం

భూమిక హెల్ప్‌లైనుకు మన రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా తమిళనాడు, కేరళ నుండి కూడా కాల్స్‌ వస్తూ వుంటాయి. మన రాష్ట్రానికి చెందిన పేద మహిళలు ఇతర రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు పనిని వెతుక్కుంటూ వెళతారు. వీరిలో ఎక్కువ శాతం మంది దళారుల మోసాలకు గురౌతూ వుంటారు. అటువంటి కేసు ఒకటి కేరళ రాజధాని త్రివేండ్రం నుండి వచ్చింది.
ఆగస్టు 2007లో త్రివేండ్రంలోని ”అభయ” షార్ట్‌ స్టే హోమ్‌ నుండి శోభ అనే కౌన్సిలరు ఫోన్‌ చేసి విజయవాడలో వున్న షార్ట్‌ స్టే హోమ్‌ల వివరాలు అడిగి వాటి ఫోన్‌ నంబర్లు తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె మళ్ళీ కాల్‌ చేశారు. అప్పుడు భూమిక కౌన్సిలరు కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళ గవర్నమెంటు హాస్పిటలు వారు ఒక అమ్మాయిని తీసుకువచ్చి అభయ షార్ట్‌ స్టే హోమ్‌లో జాయిన్‌ చేశారని, ఆమె నాలుగు రోజుల క్రితం ఒక బిడ్డను ప్రసవించినట్టు చెప్పారు. భాష తెలియక పోవడంవల్ల ఏ వివరాలు తెల్సుకోలేక పోయినట్లు చెప్పారు. అప్పుడు భూమిక కౌన్సిలరు ఆ అమ్మాయితో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు.
భర్తతో గొడవ పడి విడిపోయిన రేణుక ఆరునెలల క్రితం తన అన్నగారితో కలిసి కేరళ వెళ్ళింది. రేణుక వాళ్ళ అక్క తిరువూరులో వుందని, అన్న తనను హాస్పిటల్లో వదలి పెట్టి మరలా వస్తానని చెప్పి వెళ్ళాడని చెప్పింది. కాని ఆమె మాటలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వున్నాయి. తన యింటి అడ్రస్సు కూడా చెప్పలేకపోయింది. వెంటనే కౌన్సిలరు అభయ వారితో మాట్లాడి రేణుకను ఎక్కడకు పంపాలో మరలా తెలియ జేస్తామని చెప్పారు. తరువాత ఈ కేసు గురించి కౌన్సిలరు కో-ఆర్డినేటరుతో చర్చించి వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ వారి సహాయం కోరారు. ఎస్‌ఐతో మాట్లాడినపుడు వారినుండి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు.
పరిస్థితి తెల్సుకున్న కోఆర్డినేటరు ఆక్స్‌ఫామ్‌ గిరిజ గారితో మాట్లాడారు. త్రివేండ్రం కాల్‌ చేసి కేసు వివరాలు కనుక్కున్నారు. ఆపై వారు రేణుకను మేజిస్ట్రేట్‌ ముందు హజరు పరచి, హెల్త్‌ చెకప్‌కి పంపించి ఆ తర్వాత ఎ.పి. పంపిస్తామని చెప్పారు. మర్నాడు కోఆర్డినేటరు మరలా త్రివేండ్రంకు కాల్‌ చేసినపుడు రేణుక తన పాపను చూడటానికి తీసుకు వెళ్ళారని చెప్పారు. ఆ తర్వాత రోజు కోఆర్డినేటర్‌ వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ డి.ఐ.జి. ఉమాపతి గారితో స్వయంగా మాట్లాడి కేసును వివరించారు. డి.ఐ.జి. గారు వెంటనే స్పందించి తగిన చర్య తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మర్నాడు కోఆర్డినేటరు డి.ఐ.జి. గారికి కాల్‌ చేసి కేసు పురోగతి గురించి అడిగి తెల్సుకున్నారు. ఎ.పి. పోలీస్‌ ద్వారా కేరళ పోలీస్‌ వారికి రేణుక వివరాలు ఫాక్స్‌ ద్వారా తెలియజేశారు. అలాగే ఒక లేడీ కానిస్టేబుల్‌నిచ్చి ఎ.పి.లోని విజయవాడకు పంపించమని కోరుతూ మరో ఫాక్స్‌ పంపుతున్నట్టు తెలియజేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని త్రివేండ్రం వారికి కాల్‌ చేసి ఈ విషయాన్ని వివరించారు భూమిక కౌన్సిలరు. వారు కూడా దానికి అంగీకరించారు. అయితే రేణుక ఆరోగ్య పరిస్థితి కుదుట పడేవరకూ ఆగవలసిందిగా సూచించారు. ఒక నెల తరువాత భూమిక కౌన్సిలరు, త్రివేండ్రం కాల్‌ చేసినపుడు రేణుకను వాళ్ళ అన్నగారు వచ్చి తీసుకువెళ్ళినట్లుగా తెలియజేశారు.
108 రిఫరెన్సు ద్వారా పరిష్కరించిన కేసు

భూమిక హెల్ప్‌లైనుకు అనేక మంది రిఫరెన్స్‌ ద్వారా కాల్‌ చేస్తారు. ప్రస్తుత కేసు 108 జూఖష్ట్ర| ఎమర్జెన్సీ సర్వ్వీసు ద్వారా హెల్ప్‌లైనుకు రిఫర్‌ చేసిన కేసు. సెప్టెంబర్‌ 2007లో ఒకనాటి మధ్యాహ్నం 108లో పోలీస్‌ డిస్‌పాచ్‌ ఆఫీసరుగా పనిచేసే జాన్‌సన్‌గారు ఫోన్‌ చేసి తమకు రాజమండ్రి నుంచి కేసు వచ్చిందని బాధితురాలితో కాన్ఫరెన్స్‌ కాల్‌ ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతున్నపుడు ఆమెకు తెలుగు రాదని కౌన్సిలరుకు అర్థమైంది. తాను ఒరిస్సా నుండి వచ్చానని తనకు తెలుగు రాదని, కొద్దిగా హిందీ మాట్లాడగలనని స్వప్న చెప్పింది. స్వప్న యిచ్చిన వివరాల ప్రకారం ఆమెది ప్రేమ వివాహం తన భర్త పనికి వెళ్ళినప్పుడు అత్త మామలు తనను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది. ఆ రోజు ఇద్దరూ కలిసి తన మీద దాడిచేసి ఇంట్లో నుండి బయటకు తరిమేశారని, గాయాలతో పరిగెత్తుకు వచ్చి పక్కింట్లో పడిపోయినట్లు చెప్పింది. అక్కడ వున్న ఒక పత్రికా విలేఖరి 108 వారి ఫోన్‌ చేశారు. వెంటనే కౌన్సిలరు కోఆర్డినేటరుకు లైన్‌ కనెక్ట్‌ చేశారు. అప్పుడు కోఆర్డినేటరు 108 సహాయంతో ఆ అమ్మాయి భర్తతో కాన్ఫరెన్సులో మాట్లాడి విషయం తెలియజేసి ఫోన్‌ ద్వారానే కౌన్సిలింగు యిచ్చారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడవలసిందిగా అతనిని హెచ్చరించారు. అతనుకూడా సానుకూలంగా స్పందించాడు. ఆ తర్వాత దంపతులిద్దరూ హెల్ప్‌లైనుకు కాల్‌ చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
అర్థరాత్రి దారితప్పిన మహిళలకు చేయూత

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చైల్డ్‌ లైన్‌ (1098) వారి నుండి భూమిక హెల్ప్‌లైనుకు ఒక కాల్‌ వచ్చింది. పంజగుట్ట పోలీస్‌ స్టేషను వారు ఆశ్రయం కల్పించవలసిందంటూ ఒక మహిళను తమ వద్దకు పంపారని చెప్పారు. ఆ మహిళ వయస్సు 30 సంవత్సరాలు కాగా చైల్డ్‌ లైను నియమాల ప్రకారం 18 సం||లు మించిన వారికి ఆశ్రయం కల్పించడం కుదరదు. అందువల్ల వారు భూమిక హెల్ప్‌లైను సహాయం కోరారు. ఆమెను ఏదైనా షార్ట్‌ స్టే హోమ్‌కు పంపించడానిక హెల్ప్‌లైను సహాయం కోరారు. మరిన్ని వివరాల కోసం కౌన్సిలరు బాధిత మహిళతో మాట్లాడటానికి ప్రయత్నించారు. 30 ఏళ్ళ సవిత వరంగల్‌ నుండి ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్‌ వచ్చింది. కొన్ని నెలలు హాస్టల్స్‌లో వుంది. అక్కడి వారితో ఇబ్బందులు ఏర్పడి హాస్టల్‌ వీడి బయటకు వచ్చేసింది. రాత్రి పూట సూట్‌కేసుతో పంజగుట్ట పోలీస్‌ వారికి అనుమానాస్పదంగా కనబడింది. విషయం ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవటంతో వారు ఆమెను చైల్డ్‌లైనుకు పంపించారు. కౌన్సిలరు సవితతో మాట్లాడటానికి ప్రయత్నించగా మానసిక స్థితిమతం లేని కారణంగా ఆమె మాటల్లో తడబాటును గమనించారు.
తన దగ్గర అందుబాటులో వున్న అన్ని షార్ట్‌ స్టే హోమ్స్‌కు కౌన్సిలరు ఫోన్‌ చేసి సవితకు ఆశ్రయం కల్పించటానికి ప్రయత్నం చేశారు. చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌ వారు ఆశ్రయమివ్వటానికి ముందుకొచ్చారు. కాని సవిత అక్కడికెళ్లటానికి ఒప్పుకోలేదు. తనను మానసికంగా ఆందోళన చెందుతున్న కారణంగా ఆ రాత్రికి చైల్డ్‌లైనులోనే వుంచాల్సివచ్చింది. మరుసటి రోజు ఉదయమే కౌన్సిలరు ఛైల్డ్‌లైన్‌ వారిని సంప్రదించగా సవిత ఉదయం ఆరు గంటలకే బయటకు వెళ్ళిపోయిందని తెలిపారు. కౌన్సిలరు చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌తో మాట్లాడి తన సెల్‌ నెంబరు తీసుకున్నారు. సవిత సెల్‌కు కాల్‌ చేసి మాట్లాడగా అంతకు ముందు రోజు హెల్ప్‌లైను నుండి పొందిన సమాచారం ఆధారంగా కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌లను సంప్రదిస్తున్నానని చెప్పింది. చివరకు వుమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్‌ఫేర్‌ శాఖ వారిని కలిసి వారి ద్వారా ఒక హోమ్‌లో ఆశ్రయం పొందానని చెప్పింది. అప్పటికీ సాయంత్రం 6:30 అయ్యింది. ఆ హోమ్‌ ఇన్‌చార్జ్‌ హేమంత్‌గారి నంబరు తీసుకుని ఆయనతో మాట్లాడారు. కౌన్సిలరు ఈ విషయాన్ని చైల్డ్‌లైను వారికి కూడా తెలియజేశారు. అయితే సవితకు సాయంగా ఎవరినైనా పంపవలసిందిగా కోరారు. చైల్డ్‌లైను ఉద్యోగి శుభానీ గారు రాత్రి 8:30 గం|| సవితను మనో చైతన్య హ్యూమన్‌ సర్వీస్‌ సొసైటీ షెల్టర్‌ హోమ్‌కు తీసుకువెళ్ళారు. ఈ షెల్టరు హోమ్‌ వారి నియమాల ప్రకారం బాధితులకు సంబంధించి ఎవరైనా బంధువులు వచ్చేవరకు బయటకు పంపరని తెలిసింది. ఇది తెలిసిన సవిత పొద్దున్నే ఇంటర్వూకెళ్ళాలి ఇక్కడ వుండలేనంటూ బయటికి వచ్చేసింది. రాత్రి 10:30 గం|| శుభానీగారు హెల్ప్‌లైనుకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. కౌన్సిలరు ద్వారా పరిస్థితి గ్రహించిన కోఆర్డినేటరు రాత్రి 12 గం|| వరకూ సవితకు ఆశ్రయం కోసం ప్రయత్నించారు. ఈ మధ్యలో హెల్ప్‌లైను వాలంటీరు లక్ష్మిగారిని సంప్రదించగా ఆ రాత్రికి సవితకు ఆశ్రయం కల్పించడానికి ఒప్పుకుని స్వయంగా వెళ్ళి ఆమెను తీసుకు రావటానికి ముందుకొచ్చారు. అదే సమయంలో 100 నంబరుకు ఫోన్‌ చేసి విషయం తెలియజేసి రాత్రికి ఆశ్రయం కోసం పోలీస్‌ వారితో కూడా మాట్లాడారు. పెట్రోలింగు పోలీసులు వెళ్ళి ఆ రాత్రికి ఆమెను వుమెన్‌ పోలీస్‌ స్టేషనులో వుంచారు. చివరకు ఆ రాత్రివేళ ఆమెను భద్రంగా ఒక చోటకు చేర్చగలిగాం.
మర్నాడు ఉదయమేముంబొయ్‌లో వుండే సవిత తల్లిదండ్రులను సంప్రదించి విషయం తెలియజేశారు హెల్ప్‌లైన్‌ కౌన్సిలరు. అప్పటికి వారు ముంబయిలో వున్నారని వెంటనే బయలుదేరి హైద్రాబాద్‌ వచ్చేస్తామని చెప్పారు. ఈ లోగా మళ్ళీ సుభానీ గారిని సంప్రదించి సవిత అడ్రసు చెప్పి వాళ్ళ యింటికి పంపే ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. అదే రోజు సవితకు కౌన్సిలింగు చేసి వరంగల్‌ వెళ్ళిపోవలసిందిగా సలహా యిచ్చారు. సవిత ఒప్పుకోవడంతో ఆమెను సురక్షితంగా తన యింటికి పంపేయగలిగాం. ప్రస్తుతం తాను సంతోషంగా, ప్రశాంతంగా వున్నానని సవిత కాల్‌చేసి చెప్పింది. చైల్డ్‌లైను సభ్యుడు సుభానీ గారికి హెల్ప్‌లైను ద్వారా ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరింది.
ఢిల్లీ నుండి హైద్రాబాద్‌ వరకూ….

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ నుండి మమత ఫోన్‌ చేశారు. భర్త నుండి వేధింపులు భరించలేక యింటినుండి వచ్చేశానని ఈ విషయం కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియదని చెప్పారు. ఢిల్లీనుండి హైద్రాబాద్‌ ఎలా రావాలి. ఎక్కడ ఉండాలి అని భయపడుతూ కంగారుగా అడిగారు. ముందుగా ఆమెకు ధైర్యాన్నిచ్చి కంగారు పడవద్దని కౌన్సిలింగు చేసి హైద్రాబాద్‌ రావటానికి కావల్సిన ఏర్పాట్లు చేస్తాం ఒక అరగంట తరువాత ఫోన్‌ చేయవలసిందిగా హెల్ప్‌లైన్‌ కౌన్సిలరు సూచించారు. విషయాన్ని కౌన్సిలరు వెంటనే కోఆర్డినేటరు దృష్టికి తీసుకెళ్ళారు. కోఆర్డినేటరు సూచన మేరకు ఆన్‌లైన్‌ బుకింగు ద్వారా న్యూఢిల్లీ నుండి సికింద్రాబాద్‌కు ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ బుక్‌ చేసి మమత కాల్‌కోసం ఎదురు చూశారు.
అరగంటం తరువాత మమత మళ్ళీ ఫోన్‌ చేసారు. టికెట్‌ వివరాలు తెలియజేసి భూమిక ఐ.డి. వుపయోగించి టికెట్‌ తీసుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. అలాగే హైద్రాబాద్‌లో ఎక్కడ వుండాలనుకుంటున్నారని కౌన్సిలరు ప్రశ్నించారు. తనకు ఎవరి దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేదని, కొంతకాలం ఏదైనా హోమ్‌లో వుంటానని చెప్పింది. మమత కోరిక మేరకు హెల్ప్‌లైను కౌన్సిలరు అంకురం, చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌, స్పందన షార్ట్‌ స్టే హోమ్‌లను సంప్రదించి వారి అనుమతి తీసుకుని వుంచారు. మర్నాడు సాయంత్రం మమత ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌లో హైద్రాబాద్‌ చేరుకుంది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో హెల్ప్‌లైనుకు కాల్‌చేసి మమత వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయమని కోరుతూ వచ్చారు. అయితే మమత మాత్రం తన గురించి తన కుటుంబ సభ్యులకు ఏ వివరాలు ఇవ్వవద్దని కోరింది. అందువల్ల మమత కుటుంబీకులకు ఆమె క్షేమంగా వుందని మాత్రమే చెప్పవలసి వచ్చింది. హెల్ప్‌లైను కౌన్సిలరు కూడా ట్రైను వచ్చే సమయానికి స్టేషనుకెళ్ళి మమతను రిసీవ్‌ చేసుకున్నారు. ఆ సమయంలో కౌన్సిలరు తనకోసం రావడంతో మమత ఎంతో సంతోషించింది. అయితే ఇంటికి వెళ్ళకుండా షార్ట్‌ స్టే హోమ్‌లో వుండటానికే ఆమె మొగ్గు చూపింది. అప్పుడు కౌన్సిలరు ఆమెను అంకురం తీసుకెళ్తానని చెప్పారు. అయితే తాను ఒకసారి తల్లితో మాట్లాడిన తర్వాత మమత మనసు మార్చుకుని తాను ఇంటికి వెళ్తానని అమ్మను, అక్కను చూడాలని వుందని అనడంతో కౌన్సిలరు అందుకంగీకరించి ఆమెను ఆటోలో ఇంటికి పంపించారు. రెండురోజుల తర్వాత మమత ఫోన్‌ చేసి షార్ట్‌ స్టే హోమ్‌ల వివరాలు అడిగి తెల్సుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్‌ చేసి తను స్పందన షార్ట్‌ స్టే హోమ్‌కి వెళ్తున్నట్లు చెప్పింది. ఢిల్లీ నుండి తనను హైద్రాబాదుకు తీసుకొచ్చినందుకు హెల్ప్‌లైనుకు కృతజ్ఞతలు తెలియజేసింది.
అర్థరాత్రి ఒంటరి మహిళ

ఫిబ్రవరి 2009లో ఒకసారి అఫ్‌జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషనునుండి ఎస్‌ఐ మోహనరావుగారు కాల్‌ చేసారు. నైట్‌ డ్యూటీలో వుండగా రోడ్డు మీద ఒక 30 సం||ల వయస్సున్న కొద్దిగా మతిస్థిమితం లేని యువతి కనపడితే పోలీస్‌ స్టేషనుకు తీసుకు వచ్చామని చెప్పారు. ఆమెను ఏదైనా షెల్టరు హోమ్‌కు పంపడానికి భూమిక హెల్ప్‌లైను సహాయం కోరారు. కౌన్సిలరు కోరిక మేరకు ఆ అమ్మాయి చేత ఫోన్‌లో మాట్లాడించారు.
కడప నుండి వచ్చిన లక్ష్మికి 18 సం|| క్రితం పెళ్ళైంది. ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. తన తల్లి, భర్త వల్ల తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని అవి తప్పించుకోటానికే తాను యింటి నుండి పారిపోయినట్లు చెప్పింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి ముందుగానే పోలీసులు హెచ్చరించడం వల్ల కౌన్సిలరు ఆ దిశగా ఆమెకు కౌన్సిలింగు యిచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. అలాగే పోలీస్‌ స్టేషను నంబర్లు తీసుకుని మళ్ళీ ఫోన్‌ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత స్నేహసదన్‌, స్టేట్‌ హోమ్‌ కౌన్సిలరు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ సమయంలో తమ వాహనం రిపేరులో వున్నందున ఎవరైనా ఆ అమ్మాయిని తీసుకు రావల్సిందిగా కోరారు. విషయం కోఆర్డినేటర్‌కు తెలియజేసి వారి అనుమతితో కౌన్సిలరు అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషనుకెళ్ళి అక్కడినుండి లక్ష్మిని చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌కు తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆమె ఇంకా అక్కడే ఆశ్రయం పొందుతోంది. ఇలా లెక్కలేనన్ని కేసుల్లో ఎంతోమంది బాధిత మహిళలకు హెల్ప్‌లైన్‌ అండగా, ఆసరాగా వుంది.

Monday, June 29, 2009

మా గోదావరి కధలు




మా మేనత్త గారి వూరు పేరు బూరుగులంక.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి ప్రవహించినత మేరా బోలెడన్ని లంకలున్నాయి.కనక్కాయల లంక,యలమంచిలి లంక,బూరుగు లంక,పుచ్చల్లంక ఇలా ఎన్నో అందమైన లంకలున్నాయి.నేను పైన చెప్పిన బూరుగు లంక మా మేనత్త అత్తగారి వూరు.ఈ వూరు వెల్లడానికి రెండు దారులున్నాయి. ఒకటి నరసాపురంలో పడవెక్కి గోదావరి దాటి దాటి సఖినేటిపల్లిలో బస్సెక్కి వెళ్ళడం. రెండోది పెనుగొండ మీదుగా సిద్ధాంతం బ్రిడ్జి దాటి వెళ్ళడం.సిద్ధాంతం బ్రిడ్జి మీద నిలబడి చూస్తే కుడి వేపు,బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుక తిన్నెల మధ్య చిన్న పాయలాగా పారే గోదావరి మలుపు తిరిగే చోట మా మేనత్త గారి బూరుగు లంక కనపడుతుంది.అచ్చమైన, అందమైన లంక.బూరుగు లంక మెడచుట్టూ నెక్లెస్ లా మెరుస్తుంటుంది గోదావరి.ఆ లంకలోకి వెళ్ళలంటే ఎవ్వరైనా సరే గోదావరిలో దిగి నడవాల్సిందే.ఎక్కువ లోతుండదు.ఆ చిన్న పాయలో పాదాలుంచి నడుస్తున్నపుడు చెప్పలేని ఉద్వేగం మనసును కమ్మేస్తుంది.తల్లి గోగారిని కాళ్ళతో తన్నుతూ నడవడం బాధగా అనిపిస్తున్నప్ప్టికి, నీళ్ళలో కాళ్ళు పెట్టగానే ఒళ్ళు జిల్లుమంటుంది.ఆ బుల్లి పాయను ధైర్యంగా దాటేసి, అఖండ గోదావరిని దాటేసినంత ఆనందంతో మా మేనత్త గారి వూరి వేపు నడక సాగిస్తాం.ఎంతో సారవంతమైన భూములు.కొబ్బరి తోటలు,అరటి,మొక్కజొన్న,తమలపాకు తోటలు.లంకంతా పరుచుకున్న పచ్చదనం గుండెను ఉప్పొంగిస్తుంది.గోదారమ్మ ఒడిలో కూర్చున్నట్ట్లుగా వుండే ఆ లంక అంటే నాకు ప్రాణం. వరద గోదారమ్మ ఉగ్రరూపంతో ఒరుసుకుంటూ ఆ లంకను తాకినపుడు లంకలో జనం విలవిల్లడిపోతారు.ప్రతి సంవత్సరం కొంత భూమిని తనలో కలిపేసుకున్నా మరో చోట సారవంతమైన భూమిని కూడ పసాదిన్స్తుంది.భద్రాచలం దగ్గర పెర్గే వరద సూచి పయింట్లు, ఈ లంక ప్రజల గెండె వేగాన్ని విపరీతంగా పెంచుతాయి.ఎతైన ప్రదేశాలు చూసుకుకి ఆ సురఖ్సిత ప్రాంతాలకు తరలిపోతారు.వరద తాకిడి, విధ్వంశం స్రుషిటించినా,వరదతో పాటు వచ్చే ఒంద్రు మట్టి ఆ సంవత్స్రం ఇబ్బడి ముబ్బడిగా పంటలిస్తుందని లంక జనానికి తెలుసు కాబట్టి వరద వేళ సుఖ దుఖాలను సమానంగానే అనుభవిస్తారు.ప్రతి సంవత్సరం వరద ఎంత ఎత్తు వచ్చింది,అని కొలుచుకోవడానికి ఇంటి గోడల మీద గుర్తులు పెడతారు.ఈ సంవత్సరం ఇంత ఎత్తు,క్రితం సంవత్సరం ఇంత ఎత్తు.అలాంటి గుర్తులు ప్రతి ఇంటి గోడ మీద వుంటాయి.వరద కధల్ని మా మేనత్త రసరమ్యంగా మా మేనత్త మాకు చెప్పేది. మేము ముగ్ధులమై వినేవాళ్ళం.

Friday, June 19, 2009

నువ్వు నేను- ఆ ఫోటో




సంతోషాన్ని నిర్వచించగలమా
ఆనందానికి అర్ధం చెప్పగలమా
అదొక మానసిక స్థితి
ఈ మానసిక స్థితి శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పరవశంలో పొంగి పొర్లుతున్న మనసు
ముఖంలోనే కాదు
మొత్తం శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పాపికొండల పారవశ్యం ఒకవేపు
గోదారమ్మ గలగలలు మరోవైపు
నీ స్నేహ మాధుర్యం మరోవైపు
ముప్పేటలా నన్ను ముంచెత్తిన వేళ
నా ముఖంలో వెయ్యి మతాబుల కాంతి
వెలుతురు విరజిమ్మతున్న పరిసరాల్లో
నిన్ను చుట్టుకున్న చేతుల్లో
పూసిన కాంతి పుంజరాలు
సంతోషాన్ని మనస్సే కాదు
శరీరం కూడా వ్యక్తం చేస్తుందని
ప్రక్రుతి పచ్చదనమే కాదు
ప్రియ నెచ్చలి వెచ్చని స్పర్శ కూడా
ఒళ్ళంతా విద్యుత్తరంగాలు పుట్టిస్తుందని
మన చాయాచిత్రం చూసాకే అర్ధమైంది.

Monday, June 15, 2009

తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ

స్త్రీల సాహిత్య చరిత్రను తవ్వుకుంటూ పోతే ఎన్నెన్నో మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. ఇంత కాలం మట్టిలో కూరుకు పోయి ఉన్న వజ్రాల్ని సాన పెడితే వాటి ధగ ధగలముందు మిగిలినవన్నీ వెల వెలా పోవాల్సిందే. భండారు అచ్చమాంబలాంటి ప్రతిభావంతులెందరో చరిత్ర చీకటిలో మినుకు మినుకు మంటున్నారు. స్త్రీవాద చైతన్యంతో, స్త్రీల దృష్టికోణంతో మనం ఈ రోజు స్త్రీలను అంచులకు నెట్టేసిన సాహిత్య చరిత్రను తిరిగిరాయాల్సి వుంది. ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే ''ఆధునిక మహిళ స్త్రీల చరిత్రను తిరగ రాస్తుంది.'' అని చెప్పిన గురజాడే తొలి కథకురాలు అచ్చమాంబకి పోటీగా నిలవడం. గురజాడ మీద అత్యంత గౌరంవంతోనే నేను తొలి తెలుగు కథా రచయిత్రి అచ్చమాంబే అని సగర్వంగా, సాధికారంగా ప్రకటిస్తున్నాను.

అచ్చమాంబ రాసిన మొదటి కథ 'ధన త్రయోదశి'. దీనిని 1902 నవంబరు నెలలో 'హిందూ సుందరి' లో ప్రచురించారు. ఈ కథలో ఇతి వృత్తం ఆధునికమైనదే. కథా నాయకి విజయలక్ష్మమ్మ. కథా స్థలం బొంబాయి. దీపావళి రోజు సాయంత్రం ఒక్కర్తీ కూర్చుని ఆలోచనల్లో మునిగిన విజయలక్ష్మమ్మ పేదరికంవల్ల కనీసం దీపాలు కూడా వెలిగించలేక పోయానే, పిల్లలకి టపాసులు కొనియ్య లేకపోయానే అని తలుస్తూ బాధపడుతూ వుంటుంది. ఆమె భర్త ఒక బట్టల కొట్టులో పని చేస్తూ వుంటాడు. నెలకు పది రూపాయల జీతంతో ఆ కుటుంబం చాలా కష్టాలు పడుతుంటుంది. ఆ బట్టల కొట్టులోని పెద్ద గుమాస్తా విజయలక్ష్మమ్మ భర్త వెంకటరత్నాన్ని ప్రలోభ పెట్టి షాపు ఇనప్పెట్టేలోంచి సొమ్ము సంగ్రహిద్దామని చెబుతాడు. వెంకటరత్నం మొదట ఒప్పుకోడు. ఆలోచించి చెబుతానంటాడు. ఈ విషయం కనిపెట్టిన విజయలక్ష్మి భర్తను మందలిస్తుంది. దొంగతనం చేసిన సొమ్ము నాకు వద్దంటుంది. పెద్ద గుమాస్తా ఇచ్చిన వంద నోటును తిరిగి ఇప్పించేస్తుంది. కథ చివరలో సేటు వెంకటరత్నాన్ని మెచ్చుకుని నిన్ను పరీక్షించడానికే ఈ నాటకం ఆడామని చెప్పి అతని జీతం పెంచుతాడు. ఇది 'ధన త్రయోదశి' లోని కథ. 'దిద్దుబాటు' కథలో కథాంశం కూడా భర్తను సంస్కరించడమే. ధనత్రయోదశిలో కూడా అదే కథాంశం. అంతేకాకుండా దిద్దుబాటు కథ ఆదర్శపూరితంగాను, హాస్యంగాను వుంటే అచ్చమాంబ కథ గంభీరంగా, వాస్తవికంగా వుంటుంది. గురజాడ కన్నా పదేళ్ళ ముందే ఇలాంటి కథ రాసిన అచ్చమాంబను సాహిత్య కారులు ఉద్దేశ్యపూర్వకంగానే తెర వెనక్కి నెట్టేసారు.
ఈ తెరల్ని చీల్చి నిజాల్ని బయటపెట్టి భండారు అచ్చమాంబను రంగం మీదికి తీసుకు వచ్చినది కె. లలిత. వుమెన్‌ రైటింగు ఇన్‌ ఇండియా పుస్తకాన్ని ఎడిట్‌ చేస్తున్న సందర్భంలో మొట్ట మొదటగా లలిత ఈ అంశాన్ని పేర్కొన్నది. అచ్చమాంబను తొలి తెలుగు కథకురాలుగానే కాక 'ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణిగా ప్రకటించినది కూడా ఆమెనే. ఫిబ్రవరి 27 - మార్చి 1 వరకు 1998 లో ' భూమిక, అన్వేషి ఆధ్యర్యంలో ''తెలుగు కథ, నిర్మాణం, పరిధి, వైవిధ్యం'' పేరుతో నడిచిన మూడు రోజుల కథా వర్క్‌ షాప్‌లో లలిత తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ''సంఘ సంస్కరణోద్యమం - స్త్రీల కథలు'' అంశం మీద ప్రసంగిస్తూ లలిత, 1910లో వచ్చిన గురజాడ కథ మొదటి ఆధునిక కథ అంటున్నారు విమర్శకులు. కానీ 1902లో అచ్చమాంబ రాసిన ''ధనత్రయోదశి'' ఎందుకు మొదటి కథగా పరిగణించడం లేదు అని ప్రశ్నించారు. ఆ తర్వాత డా. భార్గవీరావు సంకలనం చేసిన నూరేళ్ళ పంట '' కథల సంకలనంలో ప్రచురించిన స్త్రీవిద్య మొదటి కథ కాదు. ''ధనత్రయోదశి నే మొదటి కథగా చెప్పుకోవాలి''
అయితే ఈ కథని తొలి కథగా ఒప్పుకోకపోవడానికి విమర్శకులు చెబుతున్న కారణాలు రెండు. ఒకటి కథ గ్రాంధిక భాషలో వుంది. రెండు ఆధునిక కథకుండాల్సిన లక్షణాలు లేవు. గురజాడ దిద్దుబాటును మొదట గ్రాంధిక భాషలోనే రాసి తర్వాత సరళ గ్రాంధిక భాషలోకి మార్చినట్టుగా తెలియ చెప్పే ఆధారాలు మన ముందున్నాయి. గురజాడ 'కమిలిని' పేరుతో రాసిన ఈ కథని అవసరాల సూర్యారావుగారు 'అణిముత్యాలు' కథా సంకలనంలో ముద్రించారు. ఇది గ్రాంధిక భాషలోనే వుంది.

రెండోది కథకుండాల్సిన లక్షణాలు లేవనేది. ఈ కథ రాసిన నాటి చారిత్రిక నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే ఈ మాట రాదు. సాహిత్య ప్రక్రియగా ప్రపంచ సాహిత్య చరిత్రలో కథ పుట్టిందే 19 శతాబ్దంలో. కథకు ఉండవలసిన లక్షణాలు స్థిర పడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోంచి చూడాల్సిన అవసరం వుంది. అయితే ఒక స్త్రీని ఒకానొక నూతన సాహిత్య ప్రక్రియకి ఆద్యురాలుగా ఆంగీకరించలేకపోయిన తెలుగు సాహిత్య విమర్శకులు చాలా తెలివిగా పై రెండు అంశాలను చూపించి అచ్చమాంబ తొలి కథకురాలు కాదు పొమ్మన్నారు. లేదా పట్టించుకోకుండా వదిలేసారు.

''కథా శిల్పం'' పేరుతో కథ మీద సిద్ధాంత గ్రంధం లాంటిది రాసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య అచ్చమాంబ కథని కనీసం స్పృశించకుండా, చాలా తెలివిగా ''తెలుగులో మొట్ట మొదటి కథ ఏది అన్న వివాదాన్ని కథా సాహిత్య చరిత్ర కారులకు వదిలి పెట్టి గురజాడ 'దిద్దుబాటు' మొదటి కథ అన్న పరికల్పనతో తెలుగు కథా పరిణామాన్ని గురించి ఆలోచిద్దాం'' అంటూ దాటవేసారు. ఎవరి కథ మొదటిది అనే అంశాన్ని పక్కకు పెట్టినా 'ధనత్రయోదశి' కథలోని మంచి చెడ్డల్ని గురించి ప్రస్తావించడం కూడా ఆయనకు ఇష్టం లేకపోయింది.
 ''తొంభై ఏళ్ళ తెలుగు కథ'' పుస్తకంలో కూడా పెదిభొట్ల సుబ్బరామయ్య, భమిడిపాటి జగన్నాధరావులు కూడా కథ గురించి విపులంగా చర్చిస్తూ భండారు అచ్చమాంబ గురించి ఒక్క మాట కూడా రాయలేదు. అంతెందుకు. ఇటీవల విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్‌ వారు '' తెలుగు కథకులు - కథన రీతులు'' పేరుతో వరుసగా మూడు పుస్తకాలు ప్రచురించారు. సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారామ్‌లు ఎడిటర్లుగా వ్యవహరించిన ఈ పుస్తకాలలోని మొదటి సంపుటిలో గురజాడ అప్పారావు గురించి రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు రాసిన వ్యాసం వుంది. అయితే భండారు అచ్చమాంబను తొలి కథా రచయితగా ఒప్పుకోలేక పోయినా అచ్చమాంబ కథల గురించి, కథన రీతులు గురించిన వ్యాసం రాయించేంత విశాల హృదయం వుండకపోయినా ఆవిడ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదా? ఆవిడ రాసిన కథల్లో ఆధునిక లక్షణాలు లేవని కొట్టి పారేయడం కాకుండా వాటి మంచి చెడ్డల్ని సమీక్షించాలన్న ఆలోచన లేకపోవడం వెనుక వున్నదంతా పురుషాధిపత్యమే అని అనుకోవాల్సిన పరిస్థితుల్ని వారే కల్పించినట్లు అవ్వలేదా? అయితే ఇటీవల కాత్యాయని విద్మహే సంపాదకత్వంలో వెలవడిన '' తెలుగులో స్త్రీల సాహిత్యం'' 20 వ శతాబ్ది రాజకీయార్ధిక పరిణామాలు'' పుస్తకంలోని ఒక పేరాను ప్రస్తావించి ఈ తొలి కథ ఎవరు రాసారన్న చర్చను ముగిస్తాను. ఈ పుస్తకంలోని అవగాహన పత్రం వ్యాసంలో కాత్యాయని ఇలా పేర్కొన్నారు.
 '' స్త్రీల సాహిత్య అధ్యయనానికి రాజకీయ అర్థశాస్త్ర దృక్పధం స్వీకరించవలసిన సిద్ధాంతం''. నిర్ధిష్ట చారిత్రక రాజకీయార్ధిక పరిణామాల నేపధ్యంలో దానిని పరిశీలించటం పద్ధతి. స్త్రీల సాహిత్య అధ్యయనానికి ప్రాతిపదికలు-
1. స్త్రీలు ఎంత సాహిత్యాన్ని సృష్టించారని కానీ ఎంత బాగా వ్రాసారని కానీ కాక అసలు వాళ్ళేం వ్రాసారో, ఎందుకు వ్రాసారో, ఎందుకు వ్రాయలేకపోయారో చూడాలి.
 2. పితృస్వామిక సామాజిక అధికారిక సంబంధాలలో అణిచివేతకు గురయిన వర్గం సృస్టించిన సాహిత్యంగా స్త్రీల సాహిత్య ప్రత్యేకతను గురించి పరిశీలించి విలువ కట్టాలి.
 3. స్త్రీల సాహిత్యాన్ని విలువ కట్టడంలో ఆ సాహిత్యం వచ్చిన కాలం నాటి మొత్తం సమాజపు స్థితి, అందులో స్త్రీల కున్న అవకాశాల నుండి వాళ్లు పొందిన చైతన్య స్థాయి ప్రాతిపదికలు కావాలి.
 సాహిత్యాన్ని తూకం వేయడానికి ఇంతకాలం పురుషులు వాడిన ప్రాతిపదికలు సాహిత్యాన్ని పురుష దృష్టి కోణం నుంచి అంచనా వేయడానికే పనికి వచ్చాయి. స్త్రీల ప్రత్యేక పరిస్థితుల గురించిన అవగాహన లేకపోవడమో లేక స్త్రీలను ముందుంచడం ఇష్టం లేకనో ఇంతకాలం స్త్రీల సాహిత్య చరిత్ర గురించి ఖచ్చితమైన, సవ్యమైన దిశలో అధ్యయనం లేకుండా పోయింది. పురుషాధిపత్యం, పితృస్వామ్యం అద్దాల్లోంచే స్త్రీల సాహిత్యాన్ని చూడడానికి అలవాటు పడిన విమర్శకులు, సాహిత్య చరిత్ర కారులు ఇకనైనా నిజాల్ని చూడటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ, అచ్చమాంబను తొలి తెలుగు కథకురాలిగా, ప్రధమ స్త్రీవాద చరిత్ర కారిణిగా బలంగా ప్రతిపాదిస్తూ ఆవిడ రచనల్లో జండర్‌ స్పృహ గురించి వివరిస్తాను.
 అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణాజిల్లా నందిగామలో పెనుగంచిప్రోలు గ్రామంలో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. చదువు విషయంలో చిన్నతనంలోనే కుటుంబంలో వివక్షకు గురయిన అచ్చమాంబకు చదువు విలువ బాగా తెలుసు. తన తమ్ముడు ఎమ్‌. ఏ చదవగలగటం తాను కనీసం ఇంగ్లీషు అక్షరాలను కూడా నేర్చుకోలేక పోవడం వెనుక వున్న లింగవివక్షని అర్థం చేసుకున్నది కాబట్టే ఈ విషయం మీద చాలా సార్లు తన రచనల్లో ప్రస్తావించింది.
అచ్చమాంబ తాను ఎందుకు చదువుకోలేకపోయిందో తన తమ్ముడుపై చదువులు ఎలా చదవగలిగాడో అర్థం చేసుకున్నది కాబట్టే 'అబలా సచ్చరిత్ర రత్నమాల'లో ఇలా రాసింది.
 '' స్త్రీల బుద్ధి పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషుల మస్తిష్కము మెదడు కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ది కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నగణదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరోకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న నామును సార్దకము జేతురని నా నమ్మకం''.
 భారత వీర నారీ మణుల జీవిత సంగ్రహములను రాయడానికి ' అబలా సచ్చరిత్ర రత్నమాల' అనే పేరుతో రాసిన గ్రంధం గురించి అందరికీ తెలుసు. ఈ పుస్తకానికి రాసిన ఉపోద్ఘాతం చదివినపుడు అచ్చమాంబలో జండర్‌స్పృహ ఎంత వుందో అర్థమౌతుంది.
 ఆ పుస్తకం రాయడం వెనుక వున్న ముఖ్యోద్దేశ్యం గురించి
1. '' స్త్రీలు అబబలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ... బూర్యముండిరనియు, నిపుడున్నారనియూ స్థాపించుట నా మొదటి యుద్దేశము''
2.'' స్త్రీలకు విద్య నేర్పిన యెడలను, వారికి స్వాతంత్య్రమోసగిన యెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెదరనియు, గుటుంబ సౌఖ్యమును నాశనము చేసేదరనియు గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈ యారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూలమగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు స్త్రీ విద్యా స్వాతంత్య్రముల వలన దేశమునకు లాభమే గాని నష్టముంగలుగనేరదనియు, స్త్రీ విద్య యత్యంతావశ్యకంబనియు సోదాహరణ పూర్వకంగా నిరూపించుట నా ద్వితీయోద్దేశ్యము'' అని రాసుకున్నారు అచ్చమాంబ.
 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంధంలో భారతదేశంలో వివిధ రంగాలలో ప్రసిద్ధులైన 34 మంది స్త్రీల సంగ్రహ చరిత్ర వుంది. ఒక్కొక్క స్త్రీ గురించి వివరిస్తూ అచ్చమాంబ తాను ఉపోద్ఘాతంలో రాసుకున్న తన ఉద్దేశ్యాలను బల పరుచుకుంటూ రాయడం కన్పిస్తుంది.
ఈ గ్రంధంలోని మొట్ట మొదటి కథ వీరమతి గురించి వుంది. ఈ కథా ప్రారంభం ఇలా వుంది.
 ''స్త్రీయ...స్తధా...'' ఈ సంస్కృత శ్లోకానికి అర్థం పురుషుల వలె ధైర్యము నవలంభించి, భీతి చెందక సర్వ కార్యములను నిర్వహంచునటుల స్త్రీలకు విద్య నేర్పవలయును.''
అచ్చమాంబ ఏది రాసినా సమయానుకూలంగా స్త్రీలకు విద్య ఎంత అవసరమో, విద్య లేకపోతే స్త్రీలు ఎలా వెనుకబడిపోతారో సోదాహరణంగా చెబుతుంది.
 మన దేశంలో ఆడపిల్లల్ని హీనంగా, తక్కువ చేసి చూడడం గురించి అచ్చమాంబ ఎపుడూ బాధపడుతుండేది. అబలా సచ్చరిత్ర రత్నమాల గ్రంధంలో ప్రముఖ కవయిత్రి తోరుదత్తు గురించి రాస్తూ, తోరూదత్తు తండ్రి ఆమెను పుత్రునివలె పెంచడం గురించి, చదువు చెప్పించడం గురించి ఇలా అంటుంది.
''పుత్రికలను పుత్రుల వలె జూచుటయే శాస్త్ర ధర్మం. కన్యా వివాహ సమయమందు దండ్రి ''పుత్రవత్పాలితామయా'' ''పుత్రునివలె నాచే పెంచబడిన కన్య'' అని చెప్పుట సర్వసిద్ధమే కదా''!
 ఆడపిల్లలను పుట్టిన దగ్గర నుండి వివక్షతో పెంచడం గురించి అదే వ్యాసంలో
 '' మన దేశమునందు బాలికలను బాలురకంటే నతి నీచముగా జూచుట మిక్కిలి ఖేధకరముగా నుండక మానదు. ఆడపిల్ల పుట్టిన నాటి నుండియు దలిదండ్రులు మిక్కిలి ఖేధముతో నుండెదరు. పెద్ద పెరిగిన కొలది పుత్రికలను పుత్రులవలె జూడక యెటులనైన బెంచవలయునని పెంచుదురు... ఈ దేశములోని యాడు పిల్లలలో నూటికి తొంబది తొమ్మండ్రు బాలికలు నేను చెప్పిన ప్రకార మత్యంతా లక్ష్యముతో బెంచబడుతున్నారనుటకు సందేహం లేదు.'' అంటుంది.
లింగవివక్ష పుట్టుక నుంచే ప్రారంభమౌతుందని ఈ వివక్ష వల్లనే బాలికలకు అత్యంత దురవస్థ ప్రాప్తించిందని వాపోతుంది అచ్చమాంబ.
 జ్యోతిశ్శాస్త్రంలో అద్వితీయ ప్రతిభావంతురాలైన ''ఖనా'' అనే స్త్రీ గురించి రాసిన వ్యాసంలో కూడా తల్లిదండ్రులు పక్షపాతంలో ఆడపిల్లలను ఎలా నిర్లక్ష్యం చేస్తారో రాస్తూ స్త్రీలు స్వతహాగా తెలివి లేనివారుగా పుట్టరని వారి పెంపకమే వారినలా తయారు చేస్తుందని వాదిస్తుంది.
'' బాలుడు చిన్నతనమునందెంత మందబుద్దియైనను వానికైదేండ్లు రాగానే తల్లి దండ్రులు విద్య నేర్పి వానికిగల మాంద్యమును వదిలించి జ్ఞానాభివృద్ధికొరకనేక శాస్త్రములను జదివింతురు...చిన్ననాడు వానికంటే విశేష ప్రజ్ఞ గల వాని యక్క మాత్రము విద్యాగంధమేమియు లేనందున మహా మూర్ఖశిరోమణియై యుండును. ఇట్లు తల్లిదండ్రులు పక్షపాతముచే బురుష సంతతిలోను స్త్రీ సంతతిలోను జ్ఞానమును గురించి మహదంతరము పడినదే గాని స్త్రీల స్వాభావిక మౌర్ఖ్యము వలన కాదు''.
కుటుంబంలో స్త్రీల అణిచివేత స్వరూపం గురించి ఇంత చక్కగా, స్త్రీ చైతన్యంతో మాట్లాడిన అచ్చమాంబ, ఆ అణిచివేతను ఎదుర్కొనాలంటే స్త్రీలకు విద్య అత్యంతావశ్యకమని వీలు చిక్కినపుడల్లా చెబుతుండేది. జండర్‌ వివక్ష కుటుంబంలో ఎలా మొదలవుతుందో, ఈ వివక్ష వల్ల స్త్రీలు ఎలా అణిచివేయబడి, తెలివి తక్కువ వారుగా , శక్తి లేనివారుగా ప్రచారం చేయబడతారో విశ్లేశిస్తూ అచ్చమాంబ ఆ రోజుల్లోనే రాయడం ఆశ్చర్యమన్పిస్తుంది.
 స్త్రీలకు విద్య అందకుండా చేసిన దుర్మార్గాల గురించి ఒక వైపు రాస్తూ, వారి మీద విరుచుకు పడుతూ మరో వైపు భార్యాభర్తల సంబంధం గురించి, భార్యల్ని గదుల్లో మూసిపెట్టే భర్తల గురించి రాయడం కన్పిస్తుంది.
 ఆదిశంకరుని సమకాలికురాలు, న్యాయ, మీమాస, వేదాంత శాస్త్ర పారంగతురాలు, తన వాదనతో ఆదిశంకరుని ఎదుర్కొనిన విదూషీమణి అయిన సరసవాణి గురించి రాసిన వ్యాసంలో పురుషులు స్త్రీలకు చేసిన అన్యాయాల గురించి దుయ్యబడుతుంది అచ్చమాంబ.
''మానవ దేహమున కలంకారమయిన విద్యభూషణము వారికి లేకుండ చేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మల వలె జేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రుగా జూడక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీల విషయమున జేసినయిట్టి యన్యాయము వలన స్త్రీలను మూఢురాండ్రనుగా జేసి చెడగొట్టుటయే కాక తామును వారికి తోడిపాటుగా మూర్ఖ శిరోమణులయి జెడిపోవుచున్నారు. ఈ స్థితి యంతయు పురుషుల లోపమువలనను, స్వప్రయోజనపరత్వం వలనను గలుచు చున్నదే కాని స్త్రీల దోషము వలనను మాత్రము గాదు.''
స్త్రీల స్థితి దిగజారిపోవడానికి పురుషులే కారణమని స్త్రీలను ఇళ్ళలో బంధించి తమ సేవ కోసం వాళ్ళను బానిసలుగా తయారు చేసారని చాలా ఘూటుగా విమర్శించిన అచ్చమాంబను పురుషద్వేషి అని ఆ రోజుల్లో ఎవరూ అనకపోవడం విచిత్రమే.
 అసలు ఈ గ్రంధానికి ప్రారంభంగా ఈమె పేర్కొనిన సంస్కృత శ్లోకం ఒక్కటి చాలు ఈమె ఆలోచనల్ని, దృక్పధాలిన్ని పట్టివ్వడానికి
 '' అరక్షితా గృహే రుద్ధా: పురుషై రాప్తకారిభి:
ఆత్మాన మాత్మనా యాస్తు రక్షేయుస్తాస్సురక్షితా:''
'' ఆప్తులైన పురుషులచే గృమమున నిర్భంధింపబడు స్త్రీలు సురక్షితురాండ్రు కాదు. ఏ స్త్రీలు తమ యాత్మను తామే కాపాడుకొందురో వారే సురక్షితరాండ్రు''.
ఆప్తులైన పురుషులంటే తండ్రి, అన్నదమ్ములు, భర్త మొదలైన వారు. వీళ్లు ఆప్తులే. ఆత్మీయులే. అయితే స్త్రీలని ఇంట్లో నిర్బంధించడానికి అందరూ సిద్ధమే. వాళ్లని అణిచివేస్తూ, ఎదగనీయకుండా అడ్డుకుంటూ, ఇంట్లో బంధిస్తూ వాళ్ళని రక్షిస్తున్నామని భావిస్తారు. అది రక్షణ కాదని, ఆప్తులు రక్షణ పేరుతో చేసేది నిర్భంధమని చెపుతూ, స్త్రీలు తమ ఆత్మని తామే కాపాడుకోవాలని, అపుడు మాత్రమే వారు సురక్షితులని అచ్చమాంబ రాసారు. అచ్చమాంబ ఆలోచనలు చాలా నిశితంగా, సూటిగా వుండేవి. తనేం రాస్తుందో ఆ అంశం పట్ల చాలా స్పష్టత వుంటుంది. స్త్రీలు స్వయం సిద్ధ్దలు కావాలని, తమను తామే రక్షించుకోవాలని ఎవరి మీదా ఆధారపడకూడదని తన అబలా సచ్చరిత్ర రత్నమాలలో రాసిన అచ్చమాంబ ఇతర రచనలను కూడా పరిశీలిద్దాం.
అచ్చమాంబ రాసిన వ్యాసాలు, పద్యాలు ఇతర రచనలు ఎక్కువగా 'హిందూసుందరి', 'సరస్వతి' అనే పత్రికలో ప్రచురించబడ్డాయి.
 హిందూసుందరిలో 1903 జూన్‌ నెల సంచికలో అచ్చమాంబ గారి రచన '' ఊనీలి తీరిజీరీశి ఖిరిరీచీతిశిలి ళితీ గీరితీలి '', 'దంపతుల ప్రధమ కలహము'పేరుతో ఒక రచన ప్రచురితమైంది. ఇందులో ఒక చిన్న విషయమై భార్యా భర్తలకు గొడవ జరుగుతుంది. భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. భార్యకు, ఆమె అమ్మమ్మకు జరిగిన సంభాషణలో అచ్చమాంబ భార్య చేత ఈ వాక్యాలు పల్కిస్తుంది.
 ''నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసినగుదునా ఏమి? గృమయజమానురాలిగా నెంచి, మన్నించి ప్రేమించవలయును గదా! అట్లు చేయక యిచ్చవచ్చిన పనులన్నియు నన్ను సేయమనిన నేను జేయుదునా ఏమి''.
 ''వివాహము కాగానే మేము గృహిణీ పదమున కర్హురాండ్రమగుదుమే కాని ధనమిచ్చి కొన్న బానిసలము కాము. మా వంటి పత్నులు పురుషుల యహంభావమునెంత మాత్రమును సహింపజాలరు.''
భార్యాభర్తల సంబంధంలోని అసమానత్వాన్ని పురుషుల అహంకారాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే గాని ఇలాంటి వాక్యాలు రాయడం సాధ్యం కాదు. అచ్చమాంబ జీవించిన నాటి పరిస్థితుల్ని గణనలోకి తీసుకుని ఆలోచిస్తే తప్ప ఆమెకు గల చైతన్యపు స్థాయి అర్థం కాదు.
 అలాగే ''విద్యావతులగు యువతుల కొక విన్నపము'' వ్యాసంలో ఆడపిల్లలకు విద్య నేర్పించడం ఎంత అవసరమో, ఆడపిల్లల్ని చదివించడానికి తల్లి దండ్రులు ఏం చేయాలో చాలా వివరంగా చర్చిస్తుంది. స్త్రీలు తమ గురించి తాము ఊపేక్ష చూపరాదని, పాఠశాలల్లో మగ టీచర్లే వుండడం వల్ల బాలికా విద్య కుంటుపడుతుందని, మహిళా టీచర్ల అవసరం గురించి చెబుతూ దీనికి పరిష్కారంగా
''స్త్రీ లందఱొక జట్టుగా గూడి తమలో వొకరి యింట పాఠకాలను స్థాపించి, అచటకే యందఱును పోయి నేర్పునట్టును, మనలో నొకరికి యిబ్బంది కలిగినపుడు వారి పనిని గడమ వారందఱు నిర్వహించునట్టును తమలో తాము నియమించుకొని తప్పక పనిచేయుచుండ, స్త్రీ విద్య నభివృద్ది గావింపగలిగి తమ కాలమును, జన్మమును సార్థకములగునటుల జేసెదరు'' అంటూ రాసింది. (హిందూసుందరి,1903 జూన్‌)
 అంతేకాదు చదువుకున్న స్త్రీలు గ్రామ గ్రామాన పాఠశాలలు ప్రారంభించి బాలికలందరికి చదువు చెప్పాలని, విద్యా సంపన్నులగు వారు ఆ విద్యా ధనమును తామే అనుభవించక తమ జాతి వారందరికి పంచి పెట్టడానికి పాటు పడాలని పిలుపు నిస్తూ అచ్చమాంబ ఎంతో ఉత్తేజకరంగా స్ఫూర్తిదాయకంగా ఈ వ్యాసాన్ని రచించింది. తన తోటి స్త్రీల విద్య లేమి పట్ల ఆర్తి, ఆవేదన ఈ వ్యాసం నిండా పరుచుకుని వుంది.
 'స్త్రీల విద్య యొక్క ప్రభావం' అనే వ్యాసంలో అచ్చమాంబ రాసిన విషయాలు మిక్కిలి ఆశ్చర్యకరముగా వున్నవి. ఇలాంటి ప్రాంతం భూ ప్రపంచం మీద వున్నదా లేక అచ్చమాంబ ఊహశక్తితో ఈ విషయాలు రాసిందా అన్పిస్తుంది.
 '' అయిస్‌ లండన్‌ ద్వీపమున స్త్రీ పురుషులందఱు సమానంగా విద్యను గాంతురు. అచట రాజకీయ హక్కులన్నియు స్త్రీ పురుషులకు సమానముగా నియ్యబడును... అచట విద్యాశాఖవారందరు స్త్రీలే...జనరక్షణమంతయు నచట నాడువారే చేయుచుండినందున..నిచట కారాగౄహముగాని, పోలీసుగాని లేరు. సైన్యము లేదు. న్యాయస్థానములు లేవు. ఇది యంతయు స్త్రీ విద్యా ప్రభావమే కదా? యితర దేశములందిట్టి దృష్టాంతములగుపడుచుండగా మన దేశమునందింకను కొందఱు స్త్రీలకు విద్య నేర్పవచ్చునా? లేదా? యని వాదించుచునే యున్నారు''. (హిందూ సుందరి 1902 ఆగష్టు నెల)
స్త్రీలు విద్యావంతులైతే దేశానికి ఎంత లాభం కలుగుతుందో నొక్కి చెప్పడానికి అచ్చమాంబ ఇంత అద్భుతమైన ఊహాప్రదేశాన్ని ఆవిష్కరించిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జైళ్లు, పోలీసులు, సైన్యం లేని దేశం ప్రపంచంలో ఎక్కడా వుండదు. అపూర్వమైన అచ్చమాంబ ఊహశక్తికి నిదర్శనంగా దీనిని అర్థం చేసుకోవాలి.
 భండారు అచ్చమాంబ రచనల గురించి ఇలా రాసుకుంటూ పోతే ఒక గ్రంథమే అవుతుంది. ఆమె రచనలన్నింటిని సేకరించి విశ్లేషణాత్మకత అధ్యయనం చేయాల్సిన అవసరం చాలా వుంది.
 అచ్చమాంబ గురించి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ తన ''ఆంధ్రకవయిత్రులు'' గ్రంథంలో
''బాల్యమునందంత విద్యావతి కాకున్నను స్వయంకృషిచే శాస్త్రములను, సంస్కృత కావ్యములను శ్రుతి స్మృతులను గూడ నర్థం చేసికొను శక్తిని సంపాదించింది. మహా రాష్ట్రాంగ్ల భాషలలో కూడా పండిత యయ్యెను.
చరిత్ర రచనయనిన మగవారికే మిక్కిలి కష్టతరము కదా. అట్టి యెడ స్త్రీలలో ప్రథమంగా చరిత్రను రచించి చక్కగా రచన నిర్వహించినదను ఖ్యాతి పొందినది. స్త్రీలలో చరిత్ర రచించిన ప్రథమ గౌరవమీమెదే'' అని రాశారు. ఊటుకూరు లక్ష్మికాంతమ్మ స్త్రీ కాబట్టి అచ్చమాంబను ప్రప్రధమ చరిత్రకారిణిగా గుర్తించింది.
 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీ పట్నంలో మొదటి మహిళా సమాజం ''బృందావన స్త్రీల సమాజం''ను స్థాపించిన ఘనత కూడా అచ్చమాంబకే దక్కుతుంది.రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పడటానికి కృషి చేసింది. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు.
 1905 జనవరి 18వ తేదీన అతి చిన్న వయస్సులో ముఫ్ఫైఏళ్ళకే అచ్చమాంబ మరణించింది. ''కీర్తిశేషురాలగు శ్రీమతి భండారు అచ్చమాంబగారు'' శీర్షికతో హిందూసుందరి పత్రిక ''అన్యులకు మేలు చేయ నీ యతివ బుట్టె''నని ''సుందరి పత్రికకు మాతృవియోగము కలిగినదని'' పేర్కొంటూ ఐదు పేజీల నివాళిని ప్రచురించింది.
 ఈ విధంగా భండారు అచ్చమాంబ ఆధునిక సాహిత్య చరిత్రలో సుస్థిరంగా నిలిచి పోయింది. చిన్నతనంలో ఏమి చదువుకోకపోయినా, స్వయం కృషిితో వివిధ భాషల్లో పాండిత్యం సంపాదించింది. వ్యక్తిగత జీవితంలో సంభవించిన విషాదకర సంఘటనలకు ఆమె కుంగి పోలేదు. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. ఇంతటి దు:ఖంలో కూడా కుప్ప కూలి పోకుండా, పట్టుదలతో 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంధాన్ని రచించింది. 1903లో దేశమంతా పర్యటించినపుడు పండితులతో, మేధావులతో చర్చించి పురాణ కాలపు స్త్రీల గురించిన సమాచారాన్ని సేకరించింది. తన రచనలన్నింటి నిండా స్త్రీవిద్య ఆవశ్యకత గురించి ప్రస్తావిస్తూ, స్త్రీ ఉద్యమాన్ని నిర్మించడానికే , ప్రోత్సహించడానికే తన రచనలను ఉపయోగించింది.
 చైతన్య వంతమైన జీవనశైలితో అభ్యుదయకరంగా, స్త్రీల జీవితాల్లో మార్పు కోసం అహరహం శ్రమించిన అచ్చమాంబ జీవితం అతి చిన్న వయసులోనే ముగిసిపోవడం నిజంగా మన దురదృష్టమే. ఆమె కనుక పూర్తి జీవితం జీవించి వుంటే అమూల్యమైన గ్రంధాలనెన్నింటినో రచించి వుండేది. స్త్రీవాద ఉద్యమం ఆమె స్ఫూర్తితో ఆనాడే ప్రారంభమై వుండేదేమో???
 తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి కథకు శ్రీకారం చుట్టిన అచ్చమాంబ, ప్రధమ స్త్రీవాద చరిత్ర కారిణి అచ్చమాంబ నూరేళ్ళ క్రితమే అభ్యుదయకరంగా స్త్రీవాద స్పృహతో రచనలు చేసింది.
నిజంగా కె. లలిత అన్నట్లు ఆధునిక చరిత్రలో మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటివి, మనం గర్వించదగినటువంటి నమూనాల కోసం వెతుక్కోవాలంటే మొట్ట మొదట కన్పించేది అచ్చమాంబ.
 1874 సంవత్సరంలో పుట్టిన అచ్చమాంబ శత జయంతి ఉత్సవాన్ని, భారతదేశంలో స్త్రీల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన 1974 ప్రాంతంలో మనం సెలబ్రేట్‌ చేసుకోలేక పోయినా కనీసం అచ్చమాంబ చనిపోయి వందేళ్ళు నిండిన సందర్భంలో ఆమెను ఈ విధంగా గుర్తు చేసుకోవడం నాకు అత్యంత విషాదంగాను అదే సమయంలో సంతోషంగాను, గర్వంగాను వుంది.
( నవంబరు 2003, 29,30 తేదీలలో తెలుగు విభాగం, యూనివర్సిటీ ఆర్ట్స్‌ ఞ సైన్స్‌ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన యు.జి.సి జాతీయ సదస్సులో (''జండర్‌ స్పృహ '' ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు) సమర్పించిన ప్రసంగ వ్యాసం.)

ఈ వ్యాసం రాయడానికి నాకు ఉపకరించిన పత్రికలు

1. అబలా సచ్చరిత్ర రత్నమాల -భండారు అచ్చమాంబ
2. ఆంధ్రకవయిత్రులు - ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ
3. హిందూ సుందరి పత్రికలు
4. భూమిక స్త్రీవాద పత్రిక
5. తెలుగు కథకులు -కథన రీతులు
సంపాదకులు: సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారామ్‌
7.తొంభై ఏళ్ల తెలుగు కథ -పెద్దిభోట్ల సుబ్బరామయ్య, భమిడిపాటి జగన్నాధరావు
8.కథా శిల్పం -వల్లంపాటి వెంకట సుబ్బయ్య
 9.నూరేళ్ళ పంట, రచయిత్రుల కథా సంకలనం -డా. భార్గవీరావు
10. 20 వ శతాబ్ది రాజకీయార్థిక పరిణామాలు తెలుగులో స్త్రీల సాహిత్యం - సంపాదకత్వం కాత్యాయనీ విద్మహూే
11.20 వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు
 సంకలనం: అబ్బూరి ఛాయాదేవి

12.WOMEN WRITING IN INDIA 600 BC to the present Volume 1:
 600 BC to the early 20 th Century

Sunday, June 14, 2009

సబర్మతిలో బావురుమంటున్న 'బా' గది!

  గుజరాత్‌లో అడుగుపెట్టగానే మానుతున్న గాయాన్ని ఎవరో కెలికినట్టయింది. మాకారు వడోదర మీదుగా వంద కిలోమీటర్ల వేగంతో ( ఎక్స్‌ప్రెస్‌ వేలో) పరుగెడుతున్నా ఏవో ఆర్తనాదాలు, అరుపులు, కేకలు చెవులపడుతున్నట్లే వుంది. గుజరాత్‌ గాయం అంత త్వరగా మానేది కాదు. ఈ బాధ గుండెల్ని పిండుతుండగానే మేం అహమ్మదాబాద్‌ చేరాం. అహమ్మదాబాద్‌లో అవీ ఇవీ చూశాక, కస్తూర్భా, గాంధీజీ చాలాకాలం నివసించిన సబర్మతీ ఆశ్రమం చూడ్డానికి వెళ్ళాం. గాంధీ జీవిత విశేషాలన్నీ వివరంగా రాసివున్న ఎగ్జిబిషన్‌ చూశాం. ఆయన జీవితంలో చోటు చేసుకున్న ప్రముఖ ఘట్టాలన్నింటినీ ఈ ప్రదర్శనలో చూపించారు. గాంధీజీ గదిలో ఆయన వడికిన రాట్నం చెక్కుచెదరకుండా వుంది. ఆయన కళ్ళజోడు, చేతికర్ర, చెప్పులు లాంటి వస్తు వులన్నింటినీ అద్భుతంగా అమర్చి ప్రదర్శనలో వుంచారు. అత్యంత నిరాడంబరుడైన వ్యక్తి వాడిన వస్తువులన్నీ అంతే సాదాసీదాగా వున్నాయి.
  ఒక్కొక్క గది చూసుకుంటూ వెళుతుంటే ' కస్తూర్భా గాంధీ గది' అని బోర్డు పెట్టి వున్న గది కనబడింది. ఆవిడకు చెందిన వస్తువులేమున్నాయో చూద్దామని ఆతృతగా గదిలోకి అడుగుపెట్టిన నేను అవాక్కై అలాగే నిలబడిపోయాను. 'కస్తూర్భా గాంధీ గది' అని తలుపుమీద రాయడం మినహా, ఆ ఒక్క చెక్కముక్క తప్ప ఆ గదిలో చిన్న పుల్ల ముక్క కూడా లేదు. కనీసం ఆ త్యాగమూర్తి ఫోటో కూడా ' ఆమె గది' లో లేదు. ఆవిడ వాడిన వస్తువులు , ఆమె ఇష్టపడిన సరంజామా కానీ ఆ గదిలో లేవు. ఖాళీ గది. బోసిపోయి బావురుమంటున్న గది. ' బా' రాట్నం వడికారు. అదేమైందో మరి? గాంధీజీ వస్తువుల్లాగా ఆమె ఉపయోగించిన వస్తువులు ఎన్నో వుండి వుంటాయి. అవన్నీ ఎక్కడ పారేసారో మరి?
  ఆ గదిని చూడగానే నాకు పట్టరాని కోపం వచ్చింది. బాధ కలిగింది. దుఃఖం తన్నుకొచ్చింది. ఒక పెద్ద ఉద్యమానికి సారథ్యం వహించిన వ్యక్తితో కలిసి బతికి, ఎన్నో కష్టాలు పడి, అతను ఏడిస్తే ఏడ్చి, నవ్వితే నవ్విన ఓ వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఎంత గొప్పగా వుందో చూస్తే గుండె చెరువవకుండా ఎలా వుంటుంది? జాతి మొత్తానికి పితృసమానుడుగా భావిస్తూ ' జాతిపిత'గా గాంధీజీని గౌరవిస్తామే! మరి, ఆ 'జాతిపిత' సహచరి ' జాతి మాత' కాదా? బారతీయులందరికీ గాంధీజీ పితృ సమానుడైతే కస్తూర్బా మాతృసమానురాలు కాదా? అయితేనేం, పితృస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం కదా! అక్కడ తండ్రులకే గౌరవం. తల్లులకి ప్రత్యేక గౌరవాలక్కరలేదు అంటారు కాబోలు.
  నేను 'బా'కి జరిగిన అన్యాయం మీద ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే ' ప్రతి చిన్న విషయానికి ఎందుకు వంకలు పెట్టడం? ప్రతిదాంట్లోకీ మీ ఫెమినిజం రావాల్సిందేనా? అనే కామెంట్‌ పుండుమీద కారం జల్లినట్లయింది. చరిత్ర పొడుగునా స్త్రీలకి ఎంత అన్యాయమైనా జరగనీ... మనం ప్రశ్నించకూడదన్నమాట. దుఃఖాన్ని వ్యక్తం యెయ్యడం అరవడం కిందకు వస్తుందన్నమాట. ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే, కస్తూర్భాకి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం గాంధీజీ పట్ల అపచారంగా ప్రచారమైనా ఆశ్చర్యపడనక్కరలేదు.ఎందుకంటే, తెలుగులో తొలికథ రాసింది భండారు అచ్చమాంబ అని సప్రమాణకంగా నిరూపించడం, గురజాడకి జరిగిన అవమానంగా కొందరు వ్యాఖ్యానించడం నాకు తెలుసు. గాంధీజీతో సమానంగా కస్తూర్బాకి గౌరవం ఇవ్వకపోవడాన్నీ, ఆమెకు సంబంధించిన చరిత్రని అందుబాటులో లేకుండా చేయడాన్నీ ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గాంధీతో ఆవిడ కలిసివున్న ఫోటోలు బోలెడు వున్నాయిగా. ఇంకా ఈ ఏడుపెందుకు? అని ఒకాయన అన్నాడు కూడా.
 మాతో వచ్చిన ఇంకొకాయన ' మీరు కస్తూర్భాని గాంధీజీ నుంచి విడదీసి ఎందుకు చూస్తున్నారు? షీ ఈజ్‌ పార్ట్‌ ఆఫ్‌ గాంధీ కదా! అసలు ఆవిడకు ప్రత్యేకంగా ఓ గది ఎందుకు, మీలాంటి వాళ్ళు పోట్లాడ్డానికి తప్ప' అని కూడా అన్నాడు. అంటే ఆయన దృష్టిలో కస్తూర్బా ఒక వ్యక్తి కాదు. ఆమెకు తనకంటూ వ్యక్తిత్వం లేదు. ఆలోచనల్లేవు. అభిరుచుల్లేవు. గాంధీగారిలో ఒక పార్ట్‌ కనుక ఆయన ఆలోచనలే ఆమెవన్నమాట. ఓహోహో... ఎంత దూరం ఆలోచించి ఆమె గదిని ఒక శూన్యమంటపంలా వుంచారు! నా మట్టి బుర్రకు ఈ ఆలోచన తట్టనేలేదు. వ్యక్తిత్వమే లేనివాళ్ళకి, అసలు ఒక ఉనికే లేనివాళ్ళకి ఆమె గది అనీ, ఆమె జ్ఞాపకచిహ్నాలు అనీ వెతకడం నాలాటి ఆజ్ఞానులే చేస్తారని ఆ మిత్రుడు తేల్చిచెప్పాడు.
 నాకు హఠాత్తుగా 'అనూరాధ' అనే అద్బుతమైన సినిమాలోని ఒక డైలాగు గుర్తుకొచ్చింది. లీలానాయుడు ( హీరోయిన్‌) బలరాజ్‌ సహానీ ( హీరో) ని ఓ సందర్బంలో - ' నువ్వు నీ డాక్టర్‌ గిరీ తప్ప నన్ను గురించి పట్టించుకుని ఎంతకాలమైంది? నా పాటవిని ఎన్ని రోజులైంది? నా ఆశలూ, అభిరుచులూ ఏమైపోయాయో ఆలోచించావా? ' అని అడుగుతుంది. బలరాజ్‌ సహానీ ఆశ్చర్యపోయి, చాలా అమాయకంగా ' నీ ఆశలూ, అభిరుచులూనా? నీకు వేరే ఆశయాలూ, ఆశలూ వున్నాయని నాకు తెలియదే! నేను నిన్నెప్పుడూ నానుంచి విడదీసి చూడలేదు.నువ్వు నాలో ఐక్యమైపోయావనుకున్నాను' అంటాడు - నిజాయితీగానే.
 పైన పేర్కొన్న మితృడి వ్యాఖ్యానం కూడా దీనికిందకే వస్తుంది. చరిత్రకారులది కూడా ఇదే ధోరణి. చరిత్ర పుటల్నిండా పురుషులు, వారి వీరత్వాలు, శూరత్వాలు, ఎంతమంది భార్యలు, ఎంతమంది సంతానాలు... ఇవే వుంటాయి ఈ పురుష చరిత్రల్లో జనాభాలో సగం వుండే స్త్రీలుండరు. వారి జ్ఞాపక చిహ్నాలూ వుండవు. దీనికి 'జాతిమాత' కూడా మినహాయింపు కాదని సబర్మతీ ఆశ్రమం చూసాక అర్థమైంది.
 గాంధీజీని పెళ్ళి చేసుకుని, ఓ మహోద్యమంలో తనవంతు కృషి చేసి, ఎన్నో బాధలు పడి, ఆయన చేసిన ప్రయోగాల నేపథ్యంలో ఎంతో మానసిక సంఠర్షణను అనుభవించిన కస్తూర్భాకి మనమిచ్చిన గౌరవం ఒక ఖాళీ గది. కనీసం ఆమె ఫోటోకైనా నోచుకోని ఓ శూన్యగది. గాంధీజీతో పాటు ఆమెకూడా కళ్ళజోడు పెట్టుకుంది.చెప్పులు వేసుకుంది. రాట్నం వొడికింది. కర్ర కూడా వుండే వుంటుంది. కానీ అవేవీ అంత విలువైనవి కావు. గౌరవవార్హమైనవి కావు. ప్రదర్శించాల్సినంత 'పవిత్రమైనవి' కావు. వేల సంవత్సరాలుగా స్త్రీలకు జరిగిన అన్యాయమే 'బా'కు కూడా జరిగింది. ప్రపంచం ' మహాత్మునిగా' కొనియాడే వ్యక్తికి భార్య అవుగాక, వ్యక్తిత్వం తొణికిసలాడే సంపూర్ణ మానవి అవుగాక, అయితేనేం, ఆమె స్త్రీ మాత్రమే. గాంధీగారి నీడ మాత్రమే. దీనినే అక్షరాలా ఆచరించి చూపించారు సబర్మతీ ఆశ్రమ నిర్వాహకులు.

Saturday, June 13, 2009

తుపాకీ మొనపై వెన్నెల

  క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్‌ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయిన మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
  మే ఒకటవ తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్‌ అదికారులు. ఏప్రిల్‌ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేకు వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్‌, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమయ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్‌ వెళ్ళాల్సి వుంది.
 రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్‌ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్‌ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్‌, లే వెళుతూ ఒక్క షాల్‌ సరిపోతుందనుకున్నావా అంటూ తన దగ&గరున్న ఉలెన్‌ బట్టలన్నీ ఓ సూట్‌కేస్‌ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు చూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
 ఉత్పల ఇచ్చిన అదనపు సూట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్‌ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్‌ వెకేషన్‌ కోసం శ్రీనగర్‌ వెళుతున్నారు. శ్రీనగర్‌ ఫ్లయిట్‌ కన్‌ఫర్మ్‌ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. వ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్‌ ఆఫర్‌ చేసింది. ఆ సీట్లో కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కనప్పబడి, సూర్యకాంతికి మెరుసు&తన్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయాను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్ప మాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
  ఎయిర్‌పోర్ట్‌ నించి బయటకు వచ్చి కారులో కూర్చుని తలుపు వేయబోయాను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని. ఎందుకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్‌ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నరు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47 పట్టుకున్న పట్టుకున్న పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ముందు సీట్లో సెటిల్‌ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
  మాకు టూరిస్ట్‌ గెస్ట్‌ హౌస్‌లో బస ఏర్పాటు చేసారు. శ్రీనగర్‌ రోడ్లమీద జనం కంటే పోలీసులు, మిలటరీ వాళ్ళు, బోర్డర్‌ సెక్యూరిటీ వాళ్ళు అడుగడుగునా ఆవరించి కని&పంచారు. మేం గెస్ట్‌ హౌస్‌కి వెళ్ళేలోపు నాలుగైదు చెక్‌పోస్ట్‌లను దాటాం. గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో కారు ఆగగానే తలుపుతీయబోయి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆవరణలో ఆకాశాన్నంటిన చినార్‌ చెట్లు కారు కలి&పంచిన విసుగును దూరం చేసాయి. చినార& చెట్లు మహావృక్షాల్లా, నిండా ఆకుల్తో చూడ్డానికి ఎంత బావున్నాయో! మాకిచ్చిన రూమ్‌లో అడుగుపెట్టి కిటికీ తలుపు తెరవగానే ఉరవడిగా పారుతున్న నదిమీంచి వచ్చిన గాలి ఉక్కిరిబిక్కిరి చేసింది. అది జీలం నది అని తర్వాత తెలిసింది. చినార్‌ చెట్ల సౌందర్యం, జీలం నది దర్శనం నాలో గొప్ప సంతోషాన్ని నింపినా అడుగడుగునా కప్పించిన పోలీస్‌ మిలటరీ, బి ఎస్‌ ఎఫ్‌ జవాన్లు నాలో మాత్రం చాలా ఆందోళనను కల్గించారు.
  ఆరోజు సాయంత్రం దాల్‌లేక్‌ చూడ్డానికి వెళ్ళాం. హిందీ సినిమా పాటల్లో చూసి ఈ సరస్సు పట్ల అభిమానం పెంచుకున్న వాళ్ళలో నేనూ వున్నాను. షికారీలు, హౌస్‌ బోటులు విస్తారంగా పరుచుకున్న జలరాసి చూడడానికి ఎంతో బావున్నా జీవం లేనట్టుగా, చైతన్యరహితంగా వున్న ఆ పరిసరాలు మాత్రం మనసును మెలిపెట్టాయి. వందల సంఖ్యలో వరసగా కొలువు తీరిన లగ్జరీ హౌస్‌ బోటులు, సరస్సు నలువైపులా బారులు తీరిన షికారీలు మనుష్యులు లేక వెల వెల బోతున్నాయి. దాల్‌లేక్‌లో పన్నెండు వందల హౌస్‌ బోటు లున్నాయని, టూరిస్టులు లేక అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్‌ చెప్పాడు. హౌస్‌ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజమానులు కూర్చునివున్నారు. హమీద్‌ ఫ్లోటింగు గార్డెన్‌ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడి&డ లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్‌ జమీన్‌' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్‌ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్‌ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్‌ చినార్‌' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్‌ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.
 శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఠల్‌ గార్డెన్స్‌ అనే పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్‌, నిషాద్‌, హనూర్‌, షాలిమార్‌. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్‌ ఫౌంటెన్‌ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్‌ గార్డెన్స్‌ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్‌ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్‌ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
 మర్నాడు గుల్‌మార్గ్‌ వెళ్ళాలని చాలా తొందరగా తయారైపోయాం. గుల్‌మార్గ్‌ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్‌ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్‌, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేం చూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్‌ అన్వర్‌ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్‌ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్‌ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
  మా మూడ్స్‌ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్‌ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్‌, దేవదార్‌, పోప్లార్‌ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక&కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద&ద మంచు దిబ్బ మా కారుకు అడ్డు వచి&చంది. అన్వర్‌ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్‌ చేరిపోయాం. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్‌ కార్‌) లో టాప్‌ ప్లేస్‌ ఐన సెవెన్‌ స్ప్రింగ్సు చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సమ్మోహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయాం. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి, చీరతోనే తిరిగాను. మైనస్‌ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్‌ నించి తిరుగు ప్రయాణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్న మా రావ్‌ ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్‌ పండు రంగులో కొచ్చింది. 'స్నోబైట్‌' ' సన్‌బర్న్‌' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
 మర్నాడు పెహల్‌గావ్‌ వెళ్ళొచ్చని, అనంతనాగులో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్‌ ప్రకటించాడు. అమర్‌నాథ్‌ యాత్ర పెహల్‌గావ్‌ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్‌ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్‌ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్‌ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయాం. అనంతనాగులో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము బయలుదేరిందని అన్వర్‌ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయాం. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్‌ చేరేటప&పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయాం. అయితే మా ప్రయాణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీల్లు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్‌ పార్క్‌లో వున్న ట్రాట్‌ ఫిష్‌ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్‌ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్‌ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్‌ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగు సరస్సును చూడలేకపోయామన్న నిరాశతో తిరిగి వచ్చేం.
 మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లే' ప్రయాణం మొదలైంది. లే గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లే పట్టణం. అది లదాఖ్‌ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని నేను ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్‌ నుంచి లే కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్‌ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్‌ - లే రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లే లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెపి&పంది. తొమ్మిదిన్నరకి లే లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగు అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుకకొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్‌ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్‌ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్‌ వచ్చి మా ఇద్దరి బ్లెడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్‌ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్‌ తాషి ' ఆప్‌ లోగు హమ్‌ సె బీ ఫిట్‌ హై, ఏక్‌ దమ్‌ ఫిట్‌' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హోల్‌ ఆఫ్‌ ఫేమ్‌' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లే చరిత్రతో పాటు, లదాఖ్‌ ఫెస్టివల్స్‌, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్‌ యుద్ధం, యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్‌ గ్లేసియర్‌ ఫోటోలు, అక&కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్‌ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
 అక్కడినుంచి మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లే చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్‌, ఆల్చి, ఫైయాండ్‌, షె మొదలైన ఎన్నో గొంపాలు వున్నాయి. వీటిలో లే కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్‌ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షనమైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్‌ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు. రావ్‌ ' ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగు కోట్‌, గ్లౌస్‌ వేసుకుని, మంకీకేప్‌ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను. వావ్‌! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్‌ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచి&చంది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తూండిపోయాను. తాషికి థాంక్స్‌ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయాను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా నిద్రపోయాను.
 మే ఎనిమిదో తేదీన మా అసలు అడ్వంచర్‌ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్‌ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగు సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లే రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది. ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగు సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్‌ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయాల మధ్య సన్నటి రోడ్డుమీద కారు మెలికలు తిరుగుతోంది. ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయాం. అక్కడ మైనస్‌ 4 టెంపరేచర్‌ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని రావ్‌ మైనస్‌ డిగ్రీలో నిలబడటం నాకు స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్‌ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్‌ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను యోగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్‌ లోపలకు పంపించగలిగాను. రావ్‌కు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్‌ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక&కడ ఒక మిలటరీ కేంప్‌ పెట్టారు. ఫస్ట్‌ ఎయిడ్‌, టాయిలెట్‌ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్‌ సుబేదార్‌ విష్ణు బహదూర్‌ గురండ్‌ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న టీ ఎంత తృప్తి నిచి&చందో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్‌ ( కొండ ఉడతలు) లు, యాక్స్‌, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగు సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది. ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్‌ గాంగు సరస్సు విస్తరించి వుంది. నాలుగు కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయాం. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగు సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయాణానికి అయిష్టంగానే సిద్ధమయ్యాం. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప&ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా తెలుగుమాట వినని మేం ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్‌ షేక్‌ మహబూబ్‌ పాషా గిద్దలూరుకు, లాన్స్‌ నాయక్‌ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్‌ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యాం.
 అప్పటికి మంచుకొండల మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్‌ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయాం. ఆ అదురులోనూ మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయాం. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్‌ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్‌ ఆన్‌ చేసాడు. మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయాం. ఆక్సిజన్‌ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్‌ ఎక్కి దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లే పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్‌.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లే , లదాఖ్‌ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కాబోలు అనుకున్నాను.
 అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయాణమయా&యం. క్షణక్షణం మారే లే వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్‌ పోర్ట్‌లో ఎండ ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా విమానం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
 పది రోజులపాటు కాశ్మీర్‌ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతూనే వుంది. శ్రీనగర్‌ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్‌ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఆగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన 80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలియదని మా పి.ఎస్‌.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు బర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు బతికి వున్నారో లేదో తెలియని బయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని ఒక చోట చదివాను. 20 వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి చంపి చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్‌ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్‌ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరబాగాలు ఇదీ నేటి కాశ్మీర్‌ వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.

Wednesday, June 3, 2009

ఉత్తరం ఉత్త కాయితం ముక్క కాదు


ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకుని,సన్నటి చిరుజల్లులు కురుస్తున్న వేళపుడు,నీటి తుంపర్లతో నిండిన చిరుగాలి శరీరాన్ని తడిపేస్తున్న వేళ,మా పోస్ట్ మాన్ ఓ నీలిరంగు కవర్ తెచ్చిచ్చాడు.ఏమిటేమిటొ చెత్తంతా మోసుకొచ్చే పొస్ట్ మాన్ ఈ రోజు నాకో ఉత్తరం తెచ్చిచ్చాడు.....ఉత్తరం....నిజంగా ఉత్తరమే.

ఏంత సంతోషమో.ఫ్రం అడ్రస్ చూసి మరీ సంతోషం.సుగుణ.చదువుకునే రోజుల్లో నా ఆత్మీయ నేస్తం.ఇంటర్నెట్ లో అడ్రస్ పట్టుకుని,నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తూ,
అందమైన దస్తూరితో,ఆత్మీయతను కుమ్మరించిన అక్షరాల వరసలు.ఆ రోజుల్లో మేము ఎన్నెన్ని ఉత్తరాలు రాసుకునే వాళ్ళం.ఎన్ని కబుర్లు వాటిల్లో కలబోసుకునే వాళ్ళం.

ఉభయ కుశలోపరి అంటూ మొదలయ్యే ఉత్తరాన్ని విప్పి...అందులోని కష్టాలూ,కన్నీళ్ళూ,నవ్వులు, నమ్మకాలూ,ఆప్యాయతలూ,ఆరాధనలూఅన్నింటిని కలగలిపి ఆస్వాదించడం ఎంత బావుండేదో!ప్రియ నేస్తాలకు,ప్రాణ సమానమైన మిత్రులకురాసే ఉత్తరాల్లోకి ఉద్వేగం,భావుకత,ఆత్మీయత,ఎంత సునాయాసంగా అక్షరాల్లోకి జాలువారేదో!ఎంత ఆనందాన్ని,హాయిని పంచేవి ఆనాటి ఉత్తరాలు.

సశేషం.......

Tuesday, June 2, 2009

వెర్రి పరుగు

దేని వెంటో పరుగు
ఎండమావిని అందుకోవాలని ఆరాటం
ఈ పరుగు పందెంలో
మనిషి ఎంత అలసిపోతున్నాడు
ఎంత కోల్పోతున్నాడు
సుఖాన్ని,శాంతిని
సంతోషాన్ని,సంబరాన్ని
గుండె నిండా అనుభవించలేని
అసంకల్పిత పరుగు
ఆగి ఆయాసం తీర్చుకునే
తీరికలేని పరుగు
చుట్టూ పరుచుకున్న అద్భుతాల్ని
చిన్న ఆనందాల్ని
తోసిరాజని పరుగే పరుగు
ఇంధ్ర ధనుస్సు ఎదురొచ్చినా
తలెత్తి చూడకుండానే
వాన చినుకులు కురుస్తున్నా పట్టించుకోకుండానే
ఉరుము ఉరిమినా
మెరుపు మెరిసినా
ఆకాశంలో విద్యుల్లతలు విరగ పూసినా
నా కోసం కాదులే
నాకవసరం లేదులే
అంతా నిర్లిప్తత,నిరాసక్తత
ప్రక్రుతిలో మమేకం కాలేకఫొవడం
మనిషి చేస్తున్న మహా తప్పు

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...