Saturday, August 29, 2009

రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుక



నిన్న అంటే 28 న ప్రముఖ లలిత,సినీ సంగీత గాయకురాలు రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ లోని తాజ్ త్రీ స్టార్ హోటల్ ల్లో ఉత్సాహంగా,సరదగా జరిగాయి. ఆమెకు ఆత్మీయులైన అతికొద్ది మందినే ఆవిడ ఆహ్వానించారు."నువ్వు రాకపోతే చూడు దొంగా" అంటూ నన్ను ప్రేమగా పిలిచారు.ఆవిడ పాటలంటే ప్రాణం కాబట్టి నేను సంతోషంగానే వెళ్ళేను.నా ఫ్రెండ్ గీత నాతో వచ్చింది. మూర్తి,విజయలక్ష్మి,చైత్ర వంటి గాయకులు వచ్చారు. సురేఖా మూర్తి బాలసరస్వతిగారు గానం చేసిన,అత్యంత ఆదరణ పొందిన "ఆ తొటలోనొకటి ఆరాధానాలయము ఆ ఆలయములోని అందగాడెవరే" పాటని అద్భుతంగా పాడారు.విజయలక్ష్మి దేవదాసు లోని పాటను పాడి వినిపించారు.చైత్ర "ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు నీ చక్కని మోము చూడ తనివి తీరదు" పాటని చక్కగా పాడింది. ఆ తర్వాత బాలసరస్వతి గారు కేక్ కట్ చేసి మా అందరి బలవంతం మీద "రెల్లు పూల పానుపుపై జల్లు జల్లు గా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా"పాటని ఆ హోటల్ హాల్లో వెన్నెల్ని కురిపిస్తూ,అత్యంత మాధుర్యంగా పాడారు. ఆ తర్వాత అందరం భోజనాలు చేసాం. 81 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో ఉత్సాహంగా,జోకులు పేలుస్తూ గల నవ్వే ఆమెని చూస్తే ఎంత సంతోషం వేస్తుందో. భూమిక కోసం ఆమెని ఇంటర్వ్యూ చేసినపుడు ఆమె చెప్పిన జోకులకి మా కడుపు చెక్కలయ్యింది.ఆమె ప్రత్యేకత ఏమిటంటే జోకు పేల్చినపుడు ఆమె నవ్వదు మనల్ని తెగ నవ్విస్తుంది. ఇటీవల నేను నందలూరు కధానిలయం వారి ఉత్తమ సంపాదక అవార్డును తిరుపతిలో తీ సుకున్నపుడు ఆ మీటింగ్ లో ప్రత్యక్షమై నాకు గొప్ప సంతోషాన్ని కలిగించారు. తన గానం ద్వారా అనిర్వచనీయమైన,అద్భుతమైన ఆనందాన్ని పంచే బాలసరస్వతిగారు నిండు నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ....కొన్ని పోటోలు,వీడియో మీకోసం.

Thursday, August 20, 2009

గర్భసంచుల్ని కోల్పోయిన 100 మంది ఆడవాళ్ళు


నేను ఈ మధ్య ఒక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరవ్వడం కోసం మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నేను చెప్పైన సంస్తకు చెందిన ఒక డాక్టర్ ఆ గ్రామంలో హిస్ట్రెక్టమి (గర్భ సంచుల తీసివేత)చేయించుకున్న స్త్రీలతో పని చేస్తున్నారు. ఆ సమావేశానికి దాదాపు 100 మంది మహిళలు హాజరయ్యారు. అందరూ హిస్ట్రెక్టమి చేయించుకున్న వాళ్ళే. తప్పు తప్పు చేయించుకున్న వాళ్ళు కాదు.భయానో నయానో ఒప్పించి ఒక విధంగా బలవంతపు ఆపరేషన్లకి గురిచేయబడినవాళ్ళు. కాన్సర్ వస్తుందని,పిల్లలు పుట్టాక దాని అవరంలేదు అని చెప్పి,ఇంకా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ గర్భసంచుల్ని కోసేసారట. ఒక్కొక్కళ్ళు తమ కధల్ని మాకు వినిపించారు. ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే తీసేసారు. ప్రస్తుతం వాళ్ళందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు. నేను చెప్పిన డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. నేను వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పాను.

Monday, August 10, 2009

తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి సభ



మొన్న ఆదివారం నేను ఓ అద్భుతమైన సమావేశానికి వెళ్ళేను.ఎక్కడనుకున్నారు?చండ్ర రాజేశ్వరరావ్ ఫౌండేషన్ కి.అక్కడ తాపీ ధర్మారావు గారి కోడలు తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి జరిగింది.రాజమ్మ గారి కొడుకు,కూతురు ఈ సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ కొండపల్లి కోటేస్వరమ్మ గారిని,వి.హనుమంతరావు గారిని,వేములపల్లి సత్యవతి గారిని,లీలావతి గారిని,సరళా దేవిగారిని,మల్లు స్వరాజ్యం గారినీ కలవడమే కాదు వారితో కలిసి భోజనం చేసాను.ఉద్యమాల కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులను ఆ రోజు కలిసాను. తాపీ రాజమ్మ గారి గురించి, వారి జీవితం గురించి ఎన్నో అపురూపమైన విషయాలు విన్నాను. నిజంగా ఆ ఆదివారం నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే అనుభవాన్నిచ్చింది.

Friday, August 7, 2009

చేనేతకి చేయూత నిద్దాం






ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు పీపుల్స్ ప్లాజా నుండి లుంబినీ పార్క్ వరకు చేనేత కోసం నడక కార్యక్రమం జరిగింది. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను."ఈభూమి" లో నేను ఒరవడి పేరుతో కాలం రాస్తున్నను.ఆగస్ట్ నెల సంచిక లో వచ్చిన ఆ వ్యాసం మీ కోసం.

నేను ఇటీవల మా ఊరు సీతారామపురం వెళ్ళాను. నర్సాపురానికి దగ్గరగా ఒక పక్క గోదావరి, మరో పక్క సముద్రం చుట్టి వుండే మా ఊరు వెళ్ళడమంటే నాకెప్పుడూ సంబరమే. సంతోషంగా వెళ్ళిన నేను ఒక విషాద వార్తని వినాల్సివచ్చింది. ఆ వార్త నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయింది. అది సూర్యనారాయణ మరణ వార్త. ఆయన వయసు మీద పడే చనిపోయాడు కానీ ఆయనతో వున్న ఒకానొక అనుబంధం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చివరిదశలో దీనాతిదీనంగా, దుర్భర దారిద్య్రంతో వాళ్ళ కుటుంబం చితికిపోయిందని విన్నపుడు నాకు ఈ దేశంలోని కోట్లాది చేనేత కళాకారులు, చేనేత కార్మికులు గుర్తొచ్చారు.
సూర్యనారాయణ చేనేత కళాకారుడు. వాళ్ళ కుటుంబమంతా మగ్గం మీద పనిచేసేవాళ్ళు. మా కుటుంబం మహా పెద్దది. దాదాపు వందమంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం. మా తాత, మామ్మలకి తొమ్మిది మంది సంతానం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కలిసి మా ఇల్లొక సత్రంలాగా వుండేది. మా కుటుంబానికి కావలసిన బట్టల్లో అధిక భాగం సూర్యనారాయణ కుటుంబం చేతుల్లోంచే వచ్చేవి. చీరలు, లుంగీలు, తువ్వాళ్ళు చేతి రుమాళ్ళులాంటి రోజువారీ దుస్తుల్ని నేసి సూర్యనారాయణ తీసుకొచ్చేవాడు. మా నాన్న, పెదనాన్న, చిన్నాన్నలు ఆ రోజుల్లో పాంట్‌లు వేసుకోవడం నేను చూళ్ళేదు. సూర్యనారాయణ నేసుకొచ్చిన పంచెలు, లుంగీలు మాత్రమే కట్టుకునేవాళ్ళు. చొక్కాలు వేసుకోవడం చాలా తక్కువ. మానాన్న రైతు కాబట్టి పొలానికెళ్ళేపుడు ఏ రోజు చొక్కా వేసుకునేవాడు కాదు. మా అమ్మకి చేనేత చీరలంటే చాలా ఇష్టం. ఆవిడ రకరకాల ఊళ్ళ నుంచి చీరలు తెప్పించేది. బొబ్బిలి, మాధవరం, ఉప్పాడ, వెంకటగిరి - ఈ ఊళ్ళ పేర్లన్ని నేను చేనేత ద్వారానే చిన్నప్పుడే విన్నాను.
బహుశ మా అమ్మ నుంచే నాకు చేనేత చీరల వారసత్వం వచ్చి వుంటుంది. నేను చేనేత తప్ప వేరేదీ కట్టను. నాకు మంగళగిరి, పేటేరు, గుంటూరు, కొయ్యలగూడెం, నారాయణపేట, వెంకటగిరి చీరలంటే చాలా ఇష్టం. ఈ చీరలు కట్టుకుంటే వుంటే హాయిని వర్ణించాలంటే ఇక్కడ సాధ్యం కాదు సరే! మళ్ళీ సూర్యనారాయణ గురించి మాట్లాడాలి. ఆయన ముఖం ఎంతో అమాయకంగా, కోమలంగా వుండేది. బట్టల మూట సైకిల్‌కి కట్టుకుని తెచ్చి మా వీధి అరుగు మీద రంగు రంగుల చీరల్ని, తెల్లటి పంచెల్ని వెదజల్లేవాడు. మేము పిల్లల మూకంతా వాటి చుట్టూ చేరేవాళ్ళం. ఆడపిల్లల కోసం దళసరి, తక్కువ కౌంట్‌లో రంగు రంగుల బట్టముక్కల్ని తెచ్చేవాడు. మాకు వాటితో గౌన్లు కుట్టించేవాళ్ళు. మా కుటుంబానికి కావలసిన బట్టలన్నీ తీసుకుని అతనికావ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేవాడు మా తాత. కొన్ని సార్లు అంతా ఇచ్చేవాడు కాదు. సూర్యనారాయణ మళ్ళీ వచ్చినపుడు మిగతాది ఇచ్చేసేవాడు. అలా సూర్యనారాయణతో మాకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది. అతని దగ్గర చాలా మంది బట్టలు కొనేవాళ్ళు, నేసినవన్నీ అమ్ముడుపోవడంతో, మళ్ళీ నేయడం, అమ్మడం, ఇలా ఆ కుటుంబానికి కావలసిన పని పుష్కలంగా వుండేది. ఆదాయం కూడా అదే స్థాయిలో వుండేది.
క్రమంగా ఈ చేనేత సంబంధం తెగిపోవడం మొదలై చాలా కాలమే అయ్యింది. సిల్క్‌ బట్టలు వెల్లువెత్తి చేనేతను పక్కకు తోసేసాయి. సిల్క్‌ బట్ట మెయింటెనెన్స్‌ తేలిక కాబట్టి జనం వాటి వేపు మొగ్గడం మొదలైంది. స్వయం పోషకులుగా, తమ హస్తాల్లోంచి వస్త్రాలను రూపొందించే చేనేత కళాకారులు, కార్మికులు క్రమంగా పని కోల్పోవడం, నేసిన వాటిని అమ్ముకోలేక పోవడం, ఆదాయం తగ్గిపోవడం, ఆఖరికి ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవ్వడం ఈనాటి నగ్నసత్యం. పరమ విషాదం. ప్రభుత్వం ఏదో చేస్తున్నానంటోంది. చేనేత సహకార సంఘాలకి రాజకీయ చీడపట్టి మొదలంటా కుళ్ళిపోయాయి. చేనేత పనివారు పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయారు. వారికి ఆ పని తప్ప వేరేది రాదు. పని కల్పిస్తే కుటుంబం మొత్తం కష్టపడి పనిచేసుకుంటారు. అద్భుతమైన వస్త్రాలని అందిస్తారు. వారికి కావలసింది పని. వారు నేసింది అమ్ముడై ఆదాయం రావడం. అంతే పని చెయ్యకుండా పింఛన్‌లిమ్మని, విరాళాలు ఇమ్మని వారు కోరడం లేదు. మేం కష్టించి సృష్టిించే బట్టల్ని కొనండి. మాకు ఆదాయం వస్తుంది. మేం గౌరవ ప్రదంగా బతుకుతాం అనేదే వారి కోరిక.
సూర్యనారాయణ మరణవార్త నాలో రేసిన ఆలోచనలు ఇవి. ఆయనెంత ధైర్యంగా, నిబ్బరంగా వుండేవాడో గుర్తొచ్చి ఆ ధైర్యం వెనుక వున్న బలం ఏమిటో అర్ధమై నేను ఈ కాలమ్‌ ద్వారా ఒక విషయం చెప్పదలిచాను. మనం కూడా చేనేతని ప్రేమిద్దాం. చేనేత వస్త్రాలని కొందాం అనే నిర్ణయం చేసుకోవడంతో పాటు నాది మరో కోరిక వుంది.
మన రాష్ట్రంలో వేలాది ఆలయాలున్నాయి. ప్రతి రోజు లక్షలాది భక్తులు ఈ ఆలయాలను దర్శిస్తుంటారు. ఒక్క తిరుపతికి వచ్చే భక్తులే లక్షలలో వుంటారు. హుండీలో కోట్లాది రూపాయలు సమర్పించుకుంటూ వుంటారు. భక్తజనకోటికి నాదో విన్నపం. గుళ్ళకొచ్చే వాళ్ళంతా చేనేత వస్త్రాలను ధరించి వస్తే... ఊహించుకోవడానికే నాకు పరమానందంగా వుంది.మీ భక్తి రసానికి మానవీయ కోణాన్ని అద్ది చూడండి. కోట్లాది చేనేత పనివారలకి చేతినిండా పని. పనికి తగిన ఆదాయం, కేవలం తిరుపతికి వచ్చే భక్తులు ఒక్క రోజు చేనేత వస్త్రం కట్టి గుళ్ళో కెళ్ళండి. మీకు మానసిక తృప్తితో పాటు, మానవత్వం కూడా పరిమళిస్తుంది. చేనేత పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లకపోతే నన్నడగండి. మా సూర్యనారాయణకి నేనిచ్చే నివాళి ఇదే. చేనేత జిందాబాద్‌.

Thursday, August 6, 2009

భారతీయ శిక్షాస్మృతి లోని ఆర్టికల్‌ 377- డిల్లీ హైకోర్ట్ జడ్జిమెంట్

భారతీయ శిక్షాస్మృతిలోని ఆర్టికల్‌ 377 కి 149 సంవత్సరాల చరిత్ర వుంది. లార్డ్‌  మెకాలే 1860లో ఈ ఆర్టికల్‌ని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో చేర్చారు.  ఈ ఆర్టికల్‌ ప్రకారం అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడే స్త్రీ పురుషులు పది సంవత్సరాల జైలు శిక్షకి, పెనాల్టీకి గురవుతారు. వారిని శిక్షించడానికి ఈ ఆర్టికల్‌ రూపొందించబడింది.  నూట నలభై సంవత్సరాలుగా  ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి హోమోసెక్సువల్స్‌ని నేరస్తులుగా ముద్రవేసి హింసించడం, బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం జరుగుతూ వస్తోంది. కేసులు పెట్టడం కాక ఆయా వ్యక్తులను, కుటుంబ సభ్యులను బెదిరించే పనికి పోలీసులు పూనుకోవడంతో హోమోలు భయం భయంగా బతకడం, తీవ్ర మానసిక ఆందోళనకి లోనవ్వడం జరుగుతోంది.
377కి వ్యతిరేకంగాను, ఈ ఆర్టికల్‌కి మొత్తంగా  భారతీయ శిక్షాస్మృతిలోనుంచి తీసెయ్యాలని చాలా కాలంగా నిశ్శబ్ద ఉద్యమం జరుగుతోంది. చివరికి జూలై రెండు 2009 లో ఈ ఉద్యమం బహిరంగంగా రోడ్డెక్కింది. ఆర్టికల్‌ 377 భారత రాజ్యాంగంలోని సమానత్వ భావనకి విరుద్ధమని, చట్టం దృష్టిిలో అందరూ సమానమేనని ఢిల్లీ హైకోర్టు ప్రకటించడంతో వందల సంఖ్యలో హోమోసెక్సువల్స్‌, లెస్బియన్స్‌ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. బెంగుళూరు, ముంబయ్‌, కలకత్తాలో కూడా ఇలాంటి ర్యాలీలు జరిగాయి. మొట్ట మొదటి సారి పెద్ద సంఖ్యలో వీరు ప్రదర్శనల్లో పాల్గొని నినాదాలతో కదం తొక్కారు.
ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు మీద దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 377 రద్దుచేయాలని, రద్దు చేయకూడదనే వాదనలు జరుగుతున్నాయి. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే భారతీయ మీడియా (ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌) మొత్తం ఈ తీర్పుకు అనుకూలంగా స్పందించడంతో పాటు మొదటి పేజీల్లో పతాక శీర్షిక కథనాలను ప్రచురించాయి. పాజిటివ్‌ దృష్టిికోణంతో ఆర్టికల్స్‌ ప్రచురిస్తున్నాయి. దీనివల్ల జరిగిన మేలు ఏమిటంటే -ఇంతకాలం-మొదటి దశలో వున్న హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ పట్ల ప్రజల్లో వున్న 'స్టిగ్మా' లాంటిది ఈ అంశంలోనూ మెల్లగా కరగడం మొదలైంది. ఒక ఆరోగ్య కరమైన చర్చకు ఇది తెరతీసింది.
 అయితే మత నాయకులు, సంప్రదాయవాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఇది భారతీయ సంస్కృతి కాదని, దీనివల్లరభారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతాయని గగ్గోలు పెడుతున్నారు. సుప్రీమ్‌ కోర్టులో ఈ తీర్పును నిలిపివేయాలంటూ అప్పీల్‌ కూడా చేసారు. అయితే సుప్రీమ్‌ కోర్టు స్టే ఇవ్వలేదు. ఒక వ్యక్తి హోమోగానో, లెస్బియన్‌గానో వుంటే కుటుంబ వ్యవస్థ ఎందుకు నాశనమౌతుంది? వారి వారి పుట్టుకతో భిన్న లైంగిక ధోరణులను కలిగి వుండే వ్యక్తులు నేరస్థులు ఎలా అవుతారు? వారి భిన్నమైన లైంగికత వల్ల వారు మొత్తంగా నేరం చేసినట్లు 377 కింద కేసులు బుక్‌ చేయడం లేదా చేస్తామని బెదిరించడం ఎంతవరకు న్యాయం అంటూ ఈ రోజున ప్రశ్నలు చెలరేగుతున్నాయి. అంతే కాకుండా భారతీయ కుటుంబాల నాశనం అంటూ జరిగితే అది పురుషుల హింసాయుత ప్రవృత్తులవల్లే జరుగుతుంది. ఇటీవల కాలంలో స్త్రీల పట్ల పెరిగిపోతున్న హింసా ధోరణులు, తాగుడు, కుటుంబ హింస, కట్నం హత్యలు, పిల్లలపై దాడులు వీటిని గురించి మాట్లాడని వారంతా ఇపుడు సంస్కృతి పేరుతో 'గే'ల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. స్త్రీలపై అమలవుతున్న భయానక హింస భారతీయ సంస్కృతిలో భాగమా? దీన్ని మన  సంస్కృతికి వ్యతిరేకమని వీళ్ళు ఎందుకు  మాట్లాడరు?  భారతీయ సంస్కృతికి, కుటుంబానికి, వివాహ వ్యవస్థకి ముప్పు వాటిల్లబోయేది పురుషుల  ఆధిపత్య, అహంకార, హింసాయుత ధోరణుల వల్లనే  తప్ప తమ మానాన తాము బతికే ''ఎల్‌జిబిటి''ల వల్ల కాదు అనేది స్పష్టం.
ఇటీవల ఒక సర్వే ప్రకారం 10% మంది భిన్న లైంగిక ధోరణులను కలిగివున్నారని, వీరినెవ్వరూ తయారు చెయ్యలేదని, వీరంతా పుట్టుకతోనే, బయలాజికల్‌గా ఈ ధోరణులను కల్గి వున్నారని తెలుస్తోంది. అమ్మాయిలు, అబ్బాయిలు హాస్టల్స్‌లో వుండేటపుడు 'గే' లుగా తయారవుతారని, కౌన్సిలింగుద్వారాను, సైకియాట్రిక్‌ చికిత్స ద్వారాను వీరిని నయం చేయవచ్చుననే వాదన కూడా విన్పిస్తోంది. అయితే గేలుగా బతికే పురుషులు స్త్రీలతో లైంగిక సంబంధాలని ఇష్టపడరని, అలాగే లెస్బియన్‌లుగా బతికే స్త్రీలు పురుష సంపర్కాన్ని  ఒప్పుకోరనేది కూడా విదితమే. సైకియాట్రిక్‌ కౌన్సిలింగుద్వారా  వీరిని నయం చేయవచ్చనే వాదం పై విధంగా వీగిపోతుంది.
ఢిల్లీ హైకోర్టు 377 మీ ఇచ్చిన తీర్పు 'గే' హక్కులపై ఒక విస్పష్టమైన, విస్తృతమైన చర్చకి దారితీయడం సంతోషించాల్సిన  అంశం. ఎందుకంటే ఒక అంశాన్ని కార్పెట్‌ కింద దాచేసినట్లు దాచేస్తే ఆ అంశం ఉనికి లేకుండా పోదు. దాని పట్ల  నిగూఢతను, స్టిగ్మాను కొనసాగించడం కాక బహిరంగంగా ఒక చర్చను లేవనెత్తడం అవసరం. మంచి, చెడ్డలను చర్చించడం అవసరం.
రాజ్యాంగ విరుద్ధమైన ఒక ఐపిసి ఆర్టికల్‌ (377) 149 సంవత్సరాలుగా కొనసాగడం చాలా అన్యాయమైన విషయం.. వ్యక్తి స్వేచ్ఛకు, ఛాయిస్‌కు సంబంధించిన భిన్నమైన లైంగిక జీవన విధానం నేరమని చెబుతూ వారిని హింసించడం అమానుషమే అవుతుంది. ప్రజలు తమ కిష్టమైన, నచ్చిన విధానంలో (ఎదుటి వారికి కష్టం, నష్టం కల్గించకుండా) బతికే తీరును, బతుకుతున్న విధానాన్ని అర్ధం చేసుకోలేకపోతే ఆ సమాజం అభివృద్ధి చెందిందే కాదు.
దీనిమీద చెలరేగుతున్న వాదోపవాదాలను గమనిస్తే. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్‌ ఎల్‌జిబిటి (లెస్బియన్‌ , గే, బైసెక్సువల్‌ మరియు ట్రాన్స్‌ జెండర్‌)లుగా జీవనం సాగిస్తున్న వారికి లీగల్‌ సపోర్ట్‌ నిచ్చింది గానీ సామాజిక సమ్మతి చాలా దూరంలో వుందనిపిస్తోంది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...