Tuesday, March 23, 2010

స్త్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాల్సిందే.

కొండవీటి సత్యవతి
1975 సంవత్సరం. మా నాన్న మా ఆవుపాలు పిండుతుంటే నేను లేగదూడను పట్టుకుని నిలబడ్డాను. రేడియోలో ఢిల్లీ నుండి వచ్చే ఏడుగంటల వార్తలు వస్తున్నాయి. ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించిందని వార్తల్లో చెబుతూ స్త్రీల కోసం ఎన్నో సరికొత్త కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలియచెప్పాడు న్యూస్‌రీడర్‌. పాలుపిండడం అయిపోయింది. నేను దూడను వదిలేసాను. అది చెంగుమంటూ ఎగిరి తల్లి పొదుగులో దూరిపోయింది. ఆ రోజు ఉదయం రేడియోలో చెప్పిన మహిళా సంవత్సరం వార్త మా నాన్న బుర్రలో చేరిపోయింది. నేను డిగ్రీ పూర్తిచేసి ఇంట్లో ఉన్నాను. 'పద హైదరాబాద్‌ పోదాం నీకు ఉద్యోగం వచ్చేస్తుంది' అన్నాడు. హైదరాబాదా? నేను అప్పటికి పక్కజిల్లాకి కూడా పోలేదు. సరే అన్నాను. నాకున్న రెండో, మూడో చీరలు బాగులో పెట్టుకుని మా నాన్నతో కలిసి మహానగరంలోకి వచ్చేసాను.
హుస్సేన్‌సాగర్‌ పక్కన పాటిగడ్డ కాలనీ. మా చిన్నాన్న ఇంటికి వచ్చేసాం. అప్పటికే ఆ ఇంట్లో నాలాంటివాళ్ళు నలుగురు ఉన్నారు. మా చిన్నమ్మ, చిన్నాన్నల హృదయాలు విశాలమైనా, క్వార్టర్‌ మాత్రం మహా ఇరుకు. అందరం అందులోనే సర్దుకున్నాం. నన్ను దింపేసి మానాన్న వెళ్ళిపోయాడు. నాకు మంచి ఉద్యోగం వచ్చేస్తుందని మా ఊళ్ళో వుంటూ గొప్ప కలలు కంటూ వుండేవాడు. 1975 మహిళా సంవత్సరమే కాదు మహా అంధకార సంవత్సరమని నాకు అప్పటికి తెలియదు. 76లో గ్రూప్‌ |ఙకోసం సర్వీస్‌ కమీషన్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. అప్పటికి పదేళ్ళుగా రిక్రూట్‌మెంట్‌ లేదు. లక్షలాది అప్లికేషన్‌లు వచ్చాయి. నేను పోటీ పడ్డాను. పేపరంతా ఇందిరాగాంధిమయం. పరీక్ష బ్రహ్మాండంగా రాసాను. కానీ ఆ ఉద్యోగం రావడానికి మూడేళ్ళు పట్టింది. 165 రూ||ల జీతానికి అమీర్‌పేటలో రెడ్‌రోజెస్‌ అనే కాన్వెంట్‌లో చేరాను. ఆ తర్వాత ఇక్రిసాట్‌లో చేసాను. చిన్న చితకా ఉద్యోగాలు చాలానే చేసాను.
నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కలలు కన్న మా నాన్న 77లో చనిపోయాడు. నేను తీవ్ర నిరాశతో కూరుకుపోయాను. నాకు మా నాన్నతో చాలా అనుబంధం. ఆయనే నాకు కట్టెలు కొట్టడం, చేపలు పట్టడం, పాలు పిండడం, మొక్కలకు నీళ్ళు పట్టడం లాంటి 'మగపనులు'' చేసే అవకాశం కల్పించాడు. నువ్వు ఆడపిల్లవి, అణుకువగా, ఇంటిపట్టున ఉండాలి లాంటి మాటలు, ఆంక్షలు ఎన్నడూ నేను విని వుండలేదు. నేను మా ఊరి తోటల్లో స్వేచ్ఛగా, హాయిగా తిరుగుతుండేదాన్ని. సాధారణంగా అన్ని ఇళ్ళలోను ఆడపిల్లలు ఎదుర్కొనే వివక్షని నేను నా జీవితంలోని ఏదశలోను ఎదుర్కోలేదు. నన్ను చెట్లమీద పిట్టల్లా, నీళ్ళల్లో చేపలా ఎదగనిచ్చిన మా నాన్న మరణం నన్ను చాలా కుంగదీసింది. ఆయన్ని కడసారి కూడా చూడలేకపోయాను. నేను మా ఊరు తిరిగి వెళ్ళిపోయాను.
ఇక్కడే ఓ స్నేహహస్తం నన్ను ఆదుకుంది. నేను పాటిగడ్డలో వుండే రోజుల్లో జయ, విజయ అని ఇద్దరు ఫ్రెండ్స్‌లుండేవాళ్ళు. నేను ఈ రోజు ఈ స్థితిలో నిలబడి వుండడానికి కారకురాలు జయ. తన స్నేహం, నన్ను మా వూరి నుండి లాగి మళ్ళీ హైదరాబాద్‌కు తెచ్చింది. నేను సంఘర్షిస్తూనే ఎదగడానికి, నాకాళ్ళ మీద నేను నిలబడడానికి తను అందించిన సపోర్ట్‌ను మాటల్లోకి అనువదించడం చాలా కష్టం. నిజానికి నా జీవితం పొడవునా, నేను నడిచివచ్చిన దారికిరువైపులా దివిటీలు పట్టి దారి చూపించిన వాళ్ళు స్నేహితులు, హితులే. నేను చదువుకున్న స్కూల్‌ హెడ్‌మిస్ట్రెస్‌ కన్యాకుమారి గారి పాదాలకు రోజు ప్రణమిల్లినా తక్కువే.
కన్యా కుమారి గారు నేను ఇటీవల   దిగిన  ఫోటో

నేను చదువుకోవడానికి, ప్రతి సంవత్సరం అది కొనసాగడానికి ఆవిడ చేసిన కృషి అపారం. రోజూ ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్న రోజుల్లో ఆవిడ నన్ను తనింట్లో పెట్టుకుని చదివించారు. నాకు విద్యాభిక్ష పెట్టింది ఆవిడే అని గర్వంగా చెప్పుకుంటాను.
మా వూరు సీతారామపురం. నాలైఫ్‌లైన్‌. నాకు అందమైన, అద్భుతమైన బాల్యాన్నిచ్చిన చిన్న గ్రామం. మామిడి, జీడి, సపోటా, సీతాఫలం, సరుగుడు తోటలతో పచ్చగా, ప్రాణంగా వుండే మా ఊరు. ఒకవైపు గోదావరి, మరోవైపు సముద్రం. మా ఇల్లు పెద్ద సత్రం. మా అమ్మలు రోజూ ఏభైై, అరవై మందికి వండిపోసేవారు. ఏడుగురు చిన్నాన్నలు, పెద్దనాన్నలు వాళ్ళ పిల్లలు కలిసి వుండే పెద్ద వుమ్మడి కుటుంబం. మా తాత ఈ కుటుంబానికి రాజు. ఇంతమందికి వొండి వడ్డించాక అమ్మలకి ఆఖరున తిండివుండేది కాదు. పిల్లలం ఏదో పెట్టింది తిని ఊరిమీద పడేవాళ్ళం. తోటల వెంబడి తిరుగుతూ, కాయో, కమ్మో తింటూ ఎక్కువ టైమ్‌ బయటే. ఎక్కడి కెళ్ళావ్‌? ఏం చేసావ్‌? లాంటి ప్రశ్నలెప్పుడూ నేను వినలేదు. నా ఇష్టం వచ్చినంత సేపు తిరగడం, తిండికి ఇంటికి రావడం, నిజానికి మేం తిన్నమా లేదా అని ఎవరికి పట్టేది కాదు. అద్భుతమైన బాల్యం. అందరికీ దొరకని అరుదైన బాల్యం నాది. ఇప్పటికీ నా గ్రామం గురించి, నా బాల్యం గురించి పచ్చటి జ్ఞాపకాలే నాలో మెదులుతాయి. ఆ రెంటితోనూ నేటికీ సజీవ సంబంధం నిలుపుకోవడం నేను సాధించిన గొప్ప విజయమే.
ఆడపిల్లల్ని చదివించకూడదన్న మూర్ఖత్వం మా కుటుంబంలో లేదు గానీ ఆర్థికంగా స్తోమత లేదు. అందుకే నా చదువు ప్రతి సంవత్సరం ఆగిపోయేది. టీచర్లు ఉత్తరాలు వ్రాసేవారు. కన్యాకుమారిగారు మా ఊరొచ్చి మా వాళ్ళతో మాట్లాడేవారు. అలా అలా చాలా కష్టంగా బి.ఏ. వరకు లాగాను. మా నాన్నకి తెలియక నన్ను ఓరియంటల్‌ స్కూల్‌లో చేర్చాడు. అంతా సంస్కృత మయం. నేను పదో తరగతి వరకు సంస్కృతం తప్ప వేరే సబ్జక్టులు చదవలేదు. లెక్కలు, సైన్స్‌లాంటివేమీ చదవలేదు. ఓరియంటల్‌ టెంత్‌ అంటే ఎమ్‌.ఏ. స్టాండర్డ్‌ అనేవాళ్ళు. అప్పుడే నేను మహాకావ్యాలన్నీ సంస్కృతంలో చదివాను. మేఘసందేశం, చంపూ రామాయణం, కాదంబరి ఇంకా చాలా చదివాను. అమరకోసం భట్టీ వేసేవాళ్ళం. మేము శ్లోకాలు తప్పు చదివితే మా సంస్కృతం మాష్టారు పరుగులు పెట్టించి కొట్టేవారు. మేం దొరక్కపోతే ఆయన తలగోడకేసి కొట్టుకునేేవారు. చాలా కష్టం మీద నేను, అన్నపూర్ణ అనే ఇంకో అమ్మాయి మాత్రమే టెంత్‌ పాస్‌ అయ్యాము. అది కూడా చాలా కాలం రిజల్ట్సు ఆపిపెట్టి పాస్‌ అయ్యామని ప్రకటించారు. ఇంటర్‌లో ప్రత్యేక తెలుగు. తెలుగును ప్రాణప్రదం చేసింది తెలుగు లెక్చరర్‌ హనుమాయమ్మగారు. ఎంత అద్భుతంగా చెప్పేవారో. డిగ్రీలో ప్రత్యేక ఇంగ్లీష్‌. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు ఇలా చదవడం వల్ల సాహిత్యం పట్ల వల్లమాలిన ప్రేమ. చరిత్రని ప్రేమకావ్యంలా బోధించిన వసంత, లలితగార్ల వల్ల చరిత్ర అంటే మహా ప్రేమ.
నా బాల్యం లాగానే నా చదువు కూడా భిన్నంగా వైవిధ్యంగా సాగింది. చదువు చెప్పడమే కాదు సాహిత్యంవైపు చూపు సారించేలా చేసింది మా లెక్చరర్‌లే. ఆంగ్ల నవలలు చదవమని ప్రోత్సహించింది మా హిస్టరీ లెక్చరర్‌ వసంతగారు. ఆరోతరగతి నుండి బి.ఏ. వరకు చదువులో నా అనుభవాలు రాయాలంటే అదో గ్రంథమే అవుతుంది. అందమైన అపూర్వమైన అనుభవాలు నాలో ఇప్పటికీ సజీవంగా మిగిలే వున్నాయి. నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ''ఆచంట'' అనే గ్రామంలో పెద్ద ఎత్తున జరిగే శివరాత్రి ఉత్సవాలలో భగవద్గీత పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి సంపాదించాను. కన్యాకుమారి గారు నన్ను తనతో తీసుకెళ్ళేవారు. అప్పట్లో నేను భగవద్గీత శ్లోకాలు అనర్ఘళంగా చదివి అర్థాలు చెప్పేదాన్ని. వేలాదిమంది ముందు జరిగిన పోటలో నేను ఆపకుండా శ్లోకాలు చదివితే టైమ్‌ మర్చిపోయి అందరూ విన్నారు. నాకు ప్రథమ బహుమతిగా భాగవతం పుస్తకాలిచ్చారు. చాలామంది స్పాట్‌లో ఏదివుంటే అది నాచేతిలో పెట్టారు. అంత బాగా చదివేదాన్ని. మర్నాడు నా ఫోటో పేపర్లో వేస్తే మా నాన్న చూసాడు. అప్పట్లో నేను నర్సాపురంలో 'గీతాపారాయణం' చెయ్యడానికి వచ్చిన ఒకాయనతో వెళ్ళిపోవాలని అనుకునేదాన్ని. ఆయన సన్యాసి. ఆయన శిష్యవర్గంలో కలిసి నేను వెళ్ళిపోవాలనుకుని మా కన్యాకుమారిగారితో చెపితే ఆవిడ వారించారు. తెగ పూజలు చేసేదాన్ని. భక్తిరసం నరనరాన పారేది. అయితే ఇంటర్‌లోకి వచ్చేసరికి ఎన్నో పుస్తకాలు చదివిన ప్రభావం వల్ల నూటికి నూరు శాతం నాస్తికురాలిగా మారిపోయాను. సి.వి. రాసిన 'సత్యకామ జాబాలి' రాహుల్‌ సాంతృత్యాయన్‌ రాసిన 'ఓల్గా నుండి గంగాతీరం' అప్పటికే చదివిన గుర్తు. ఇవన్నీ నాలో భక్తిని చావగొట్టి, నాస్తికత్వం వేపు నడిపించాయి. నాస్తికత్వం నా జీవన విధానమైంది నేటికీ. నా జీవన సహచరుణ్ణి కూడా నాస్తికత్వం పునాదిగానే ఎంపిక చేసుకునేలా నాలో మార్పు తెచ్చింది.
మళ్ళీ కొంచెం వెనక్కి వెళితో 1979లో నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌లో. ఇరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరాత 2000లో వదిలేసాను. ఆ మధ్యలో 1996లో డిప్యూటీ తాహసిల్‌దారుగా సెలెక్ట్‌ అయ్యి మా ఊరిలో వుండి ఆ ఉద్యోగం చేసాను. యలమంచిలి ఎమ్‌.ఆర్‌.ఓ.గా 1997 సూపర్‌సైక్లోన్‌ను అతి సమీపంగా చూసాను. హైదరాబాద్‌లో ట్రైనింగు సమయంలో వచ్చిన వరద సహాయ కార్యక్రమాల్లో భాగంగా భయంకరమైన మురికివాడల్లో పనిచేసాను. నగరంలో మురికివాడల భీభత్స చిత్రాన్ని అర్థం చేసుకున్నది అప్పుడే. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ లోని అధికారుల అభిజాత్యధోరణి, అవినీతిని తట్టుకోలేక ఎమ్‌.ఆర్‌.ఓ. ఉద్యోగానికి బై చెప్పి మళ్ళీ సర్వీస్‌కమిషన్‌కి వెళ్ళిపోయాను. 'భూమిక'లో పూర్తికాలం పనిచెయ్యాలనే ఆలోచనతో మొత్తానికే ప్రభుత్వ ఉద్యోగానికి పర్మినెంట్‌గా గుడ్‌బై చెప్పేసాను. అయితే ఆ ఇరవై ఏళ్ళ అనుభవాలు నాకెన్నో పాఠాలు చెప్పాయి. నేను ఎదగడానికి, మరో మార్గంలోకి మళ్ళడానికి అక్కడే పునాది పడింది. సర్వీస్‌ కమీషన్‌లో పనిచేసే రోజుల్లోనే రత్నమాల, సంధ్య వాళ్ళంతా పరిచయమయ్యారు. 'డౌరీడెత్‌ కమిటీ' మీటింగులు రెగ్యులర్‌గా విద్యారణ్య స్కూల్‌లో జరుగుతాయని వీళ్ళ ద్వారానే తెలిసింది.
సంధ్యతో పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. నేను బాగులింగంపల్లి బస్టాండులో నిలబడి 'ఒక తల్లి కథ' అనుకుంటా చదువుతున్నాను. సంధ్య నా దగ్గరకొచ్చి ఆ పుస్తకం మేమే వేసాం. అంటూ పరిచయం చేసుకుంది. అప్పటినుండి ఇద్దరం ఎన్నో కార్యక్రమాల్లో భాగమవ్వడంతో పాటు మంచి మిత్రులం కూడా అయ్యాం. రత్నమాల రెగ్యులర్‌గా మా ఆఫీసుకు వస్తుండేది. నేను సర్వీస్‌ కమీషన్‌ ఉద్యోగుల సంఘంలో చాలా క్రియాశీలంగా పనిచేసేదాన్ని. 'నవ్యసాహితీ సమితి' పేరుతో ఒక సాహిత్య సంస్థను కూడా స్థాపించాం. ప్రముఖ నాటకరచయిత గండవరం సుబ్బరామిరెడ్డి గారు నా సహోద్యోగులు. ఆయన అధ్యక్షులు. నేను కార్యదర్శిగా చాలా సాహిత్య కార్యక్రమాలు చేసేవాళ్ళం. సినారె, దివాకర్ల వెంకటావధాని, నగ్నముని, ఎన్‌.గోపిలాంటిగారి ఎందరినో ఆఫీసుకు పిలిచి ఉపన్యాసాలిప్పించేవాళ్ళం. ఒకసారి ఒకే నివేదిక, మీద సి.నారె, దివాకర్ల వున్నారు. 'నవ్య సాహితీ సమితి' అని ఎందుకు పెట్టారు మీరు పాత సాహిత్యం చదవరా అని దివాకర్ల అంటే సి.నారె. 'అసలు మీరు అభినవ్య అని పెట్టాలి కదా' అన్నారు. చాలా వాదోపవాదాలు జరిగాయి ఆ రోజు. ఆఫీసులో మంచి సాహిత్య వాతావరణం వుండేది ఆ మీటింగుల ద్వారా.
క్రమంగా నేను ఉద్యోగినుల సంఘం వైపు మళ్ళాను. వుమెన్స్‌వింగు కన్వీనర్‌గా ఎన్నికయ్యాను. ఉద్యోగినుల సమస్యలపై అధ్యయనం చేసి ఓ పెద్ద మీటింగు పెట్టాం. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుండి రెండువేల మంది ఉద్యోగినులు హాజరయ్యారు. 90 రోజుల నుండి 120 రోజులకు పెంచిన మెటర్నిటీ లీవ్‌ జీవో ఆ సమావేశ ఫలితమే!
రెగ్యులర్‌గా డౌరీ డెత్‌ కమిటీ మీటింగులకి హాజరవ్వ సాగాను. అక్కడే నాకు అన్వేషి గురించి తెలిసింది. సజయ, అంబిక, లలిత ఇంకా ఎంతో మంది పరిచయమయ్యారు. ఒకమ్మాయి ఆ మీటింగుకి వస్తుండేది. ఆమె అక్కని వాళ్ళ బావ కిరోసిన్‌ పోసి చంపేసాడు. చాలా ఏడ్చేది కోపంగా అరిచేది. ఆమె కన్నీళ్ళు ఇంకా నాకు గుర్తే. నాకు కళ్ళల్లో నీళ్ళూరిపోయేవి ఆ పిల్లని చూస్తే. కోపంతో, ఉద్వేగంతో రగిలిపోయేదాన్ని. స్త్రీలపట్ల అమలయ్యే హింసల గురించి వారం వారం వింటూ నాలో ఒక కసిని పెంచుకున్నాను.ఏదో చెయ్యాలి? అనే ఆరాటం కలిగేది. స్త్రీల అంశాలు స్త్రీ సమస్య నా ఆలోచనల్లో ప్రథమస్థానంలోకి వచ్చింది. అన్వేషితో అనుబంధం నన్ను జాతీయస్థాయి స్త్రీల సమా వేశాలకు నడిపించింది. జైపూర్‌, కాలికట్‌, రాంచి అన్ని సమావేశా లకు వెళ్ళాను. నా ఆలోచనల పరిధిని పెంచిన సమావేశాలివి. జాతీయస్థాయిలో పనిచేస్తున్న ఎందరో పరిచయమయ్యారు.
జయప్రభతో పరిచయం 'లోహిత' ఆవిర్భావానికి నాంది అయ్యింది. తెలుగులో మొట్టమొదటి స్త్రీవాద కరపత్రిక లోహిత ఇద్దరి ఆధ్వర్యంలో బయటకొచ్చింది. సంవత్సరం పాటు నడిచింది. ఒకటో రెండో సంచికలు వచ్చాక జయప్రభ అమెరికా వెళ్ళిపోవడంతో ఒక్కదాని నడిపాను. పత్రిక నడపడం అంటే ఏమిటో అర్థమైంది అప్పుడే. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయినా నాకు మంచి అనుభవాన్నిచ్చింది లోహిత.
క్రమం తప్పకుండే అన్వేషి మీటింగులకి వెళ్ళడం మొదలుపెట్టాను. లలిత ఆధ్వర్యంలో అన్వేషి నిత్యచైతన్యంలా వుండేది. వీణ, రమా, సూజి, వసంత, భారతి వీళ్ళందరితో మాట్లాడటం ఎంతో బావుండేది. అక్కడి లైబ్రరీ, మీటింగులు, చర్చలు మనసు వికసించడానికి, స్త్రీవాదం నరనరాల్లో ఇంకడానికి చాలానే దోహదం చేసాయి. ఫెమినిజం అంటే ఏమిటో అర్థం చేసుకున్నది అన్వేషిలోనే. ''ఫెమినిస్ట్‌ స్టడీ సర్కిల్‌''లో మాట్లాడగలిగే స్థాయికి నేను ఎదిగింది ఇక్కడే. ఈ మీటింగులోనే అనుకుంటాను ఓల్గా పరిచయమైంది. అస్మిత పరిచయం, వసంత్‌తో పరిచయం కూడా ఇక్కడే. 'మూడుతరాలు' పుస్తకాల చర్చలు ఓల్గా రంగనాయకమ్మల వివాదం మీద వచ్చిన పుస్తకాలు ఇవన్నీ నాలో రకరకాల ముద్రల్ని వేసాయి. అప్పట్లో అన్వేషిలో ఒక పత్రిక తీసుకురావాలనే చర్చ జరుగుతుండేది. అన్వేషి టీమ్‌తో కలిసి సారా ఉద్యమ అధ్యయనం కోసం నెల్లూరు వెళ్ళడం జరిగింది. గ్రామ గ్రామాల్లో తిరిగాం. దూబకుంట రోశమ్మను కలిసిన గుర్తు.
చర్చోపచర్చల తర్వాత 1993 జనవరిలో 'భూమిక' మొదటి సంచిక బయటకు వచ్చింది. ఒక సామూహిక ప్రయత్నంగా నేను ఎడిటర్‌గా భూమిక మొదలైంది. మొదటి సంవత్సరాల్లో ఎక్కువ పని సజయ చేసేది. మేము సహకరించేవాళ్ళం. డి.టి.పి. డిజైన్‌, ప్రింటింగు, పోస్టింగు అన్నీ కలిసి చేసేవాళ్ళం. అన్వేషిలోనే మాకు చిన్న రూమ్‌ ఇచ్చారు. అక్కడి నుండే భూమిక వచ్చేది. నిజానికి అన్వేషి అండ లేకుంటే భూమిక మనగలిగేది కాదు. చాలా కాలం అన్వేషి ఆఫీసులోనే కొనసాగింది. భూమిక నిలబడడానికి 'నిర్ణయ' ద్వారా ఇందిరజెన అందించిన సహకారం ఎంతో వుంది.
1996లో బాగులింగంపల్లికి భూమిక ఆఫీసు మారిపోయింది. ఒక సామూహిక ప్రయత్నంగా మొదలైనా క్రమంగా, వివిధ కారణాల వల్ల వ్యవస్థాపక సభ్యులంతా వెళ్ళిపోయినా భూమిక పట్ల నాకున్న ప్రేమ, నిబద్ధతతో నేను మాత్రం వదలలేక పోయాను. బహుశా నేను కూడా వదిలేసి వుంటే ఖచ్చితంగా భూమిక మూతపడివుండేది. ఎన్నో ఘర్షణలు, సంఘర్షణలు తట్టుకుని ఒక సామాజిక బాధ్యతగా భూమికను కొనసాగించాను. ఇప్పటికీ అదే ఉద్దేశ్యంతో నడిపిస్తున్నాను.
నా ఈ అనుభవాలను మీతో పంచుకోవడానికి నేను చాలా సందేహించాను. ఓ ఉదయాన్నే ఛాయాదేవిగారికి ఫోన్‌చేసి భూమికతో నేను ఎదిగిన క్రమాన్ని భూమిక పాఠకులతో పంచుకోవాలనిపిస్తుంది. ఇది కరక్టేనా అని అడిగినప్పుడు తప్పకుండా రాయండి అని ప్రోత్సహించారు. ప్రతిమ కూడా అదేమాటన్నది. ఇంక ధైర్యంగా రాయడం మొదలుపెట్టాను. ఇరవై ఏళ్ళ అనుభవాలు. నా జీవితంలో సుదీర్ఘకాలం భూమికతోనే గడిచింది. భూమిక నా పేరులో భాగమైపోయింది.
ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, పొట్ట చేత పట్టుకుని నగరానికొచ్చిన నేను నా జీవితాన్ని అంచెలంచెలుగా నేనే నిర్మించుకున్నాను. జీవితంలోని ఏ దశలోను ఎక్కడా రాజీ పడింది లేదు. కులాలకతీతంగా, సంప్రదాయ విరుద్ధంగా కట్నప్రశక్తి లేని నాస్తికత్వం జీవన విధానంగా వుండే వ్యక్తినే నా సహచరుడుగా చేసుకోవాలనుకున్నాను. అది నా జీవితకాశయం. అలాంటి వాడు దొరక్కపోతే పెళ్ళే వద్దనుకున్నాను. గమ్మత్తుగా అంతర్జాతీయ నాస్తికసభల్లో నేను కోరుకున్న మనిషి దొరికాడు. అది కూడా చాలా చిత్రంగా నాస్తిక సభల సందర్భంగా విజయవాడ నాస్తిక కేంద్రం (గోరాగారిది) మహిమలకు వ్యతిరేకంగా నిప్పులమీద నడిచే కార్యక్రమం పెట్టారు. నేను కణ కణ మండే నిప్పుల గుండం మీద నడిచి తూలిపోబోతున్నపుడు ఓ చేయి నన్ను పడకుండా ఆపింది. నాసికత్త్వం పునాదిగా ఆ చేతిలో చెయ్యేసి అతడినే నా జీవన సహచరుడుగా చేసుకున్నాను. ఆశయాలకోసం, ఆదర్శాల కోసం రాజీ పడని కాలమది. గుండెల్నిండా ఆశయాల అగ్ని రగులు తుండేది. నాస్తికత్వం నేటికీ నా జీవన విధానమే. నా బతుకును నానుండి దూరం కాకుండా చేసుకోవడానికి, నా జీవితం నా చేతుల్లోంచి జారిపోకుండా వుండడానికి నేను చాలా సంఘర్షణే చేసాను. చేస్తూనే వున్నాను.
ఎనభైలలో తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తిన స్త్రీవాదకెరటం నన్నూ బలంగానే తాకింది. నా కథల్లోకి దూకింది. మెల్లగా వ్యాసాల్లోకి, కాలమ్స్‌లోకి మళ్ళింది. కథలు రాయలేకపోతున్నాననే అసంతృప్తి కలుగుతున్నా నేను మొదటి రోజుల్లో రాసినంత వాడిగానే ఈనాటికీ వ్యాసం, ఎడిటోరియల్‌ రాయడం వెనుక వున్నది ఏ మాత్రమూ తగ్గని స్త్రీల మీద హింస మాత్రమే. స్త్రీల మీద నిరంతరాయంగా, నిస్సిగ్గుగా అమలవుతున్న కౄరమైన మానసిక, శారీరకహింస నాలో పెను కోపాన్ని పుట్టిస్తుంది. నా ఆవేశాన్ని, ఆవేదనని వ్యక్తీకరించుకోవాలంటే వాడిగానే రాయాలి. భూమిక ఎడిటర్‌గా నాకున్న అనుభవాలకు భిన్నమైనవి హెల్ప్‌లైన్‌ అనుభవాలు. ఉదయం లేచిన దగ్గరనుండి, రాత్రి నిద్రపోయే వరకు హెల్ప్‌లైన్‌లో బాధిత స్త్రీల కన్నీళ్ళు కౌన్సిలర్‌ల చెవుల్లోకి ఇంకు తుంటాయి. వాళ్ళు మాటల్లోంచి నేరుగా నా గుండెల్లోకి జారు తుంటాయి. నిత్య హింసల కొలుముల్లో ఇంత మంది స్త్రీలు మగ్గు తుంటే అవన్నీ వింటుంటే గుండె భగ భగ మండుతుంది.
ఆ రోజు 'డౌరీ డెత్‌ కమిటీ' మీటింగులో ఆ పిల్ల కార్చిన కన్నీళ్ళు నన్నెంతగా కలవరపెట్టాయో ఈనాటికీ ఆ కలవరం, క్రోధం నన్నంటి పెట్టుకునే వున్నాయి. అవే నన్ను నడిపిస్తున్నాయి. పత్రిక నడిపినా, బాధితుల పక్షాన హెల్ప్‌లైన్‌ నిర్వహించినా నా ఆశయం ఒక్కటే. స్త్రీల కోసం పనిచెయ్యడమే. హింస లేని సమాజం కోసం కృషిి చెయ్యడమే ఆ ఆశయం.
ఈ రోజున ప్రపంచం వందేళ్ళ మహిళాదినం జరుపు కుంటున్న నేపధ్యంలోంచి చూసినపుడు, నేను నడిచివచ్చిన మార్గాన్ని వీక్షించుకున్నపుడు నాకు చాలా సంతృప్తిగానే అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఎంచుకున్న మార్గంలోనే నేను నడస్తున్నాననే అనిపిస్తుంది. అయితే ఈనాటి మహిళ ఎదుర్కొంటున్న హింస మాత్రం తీవ్రంగా నన్ను ఉద్విగ్నపరుస్తుంది. ఇంకా ఎంతో చెయ్యాలనే కర్తవ్యాన్ని బోధిస్తుంది. మరోసారి ఉవ్వెత్తున స్త్రీ ఉద్యమం ఎగిసిపడాల్సిన ఆవశ్యకత గురించి కలలు కనమంటుంది. ప్రపంచీకరణ మాయాజాలంలో మునిగి తేలుతున్న మనం జూలు విదిలించాల్సిన అవసరం ఎంత ఉందో, స్త్రీల మీద అమలవుతున్న నేరాల చిట్టా తేల్చి చెబుతుంది.
అభివృద్ధి ముసుగులో ఛిద్రమైపోతున్న స్త్రీల జీవితాలు ట్రాఫికింగులో తెల్లవారుతున్నాయి. గృహహింసచట్టం వచ్చినా ప్రతిరోజూ వేలాది స్త్రీల బతుకుల్ని మసిబారుస్తూనే వున్నాయి. ఇంత జరుగుతున్న పౌరసమాజం స్త్రీల పక్షాన మాట్లాడక పోవడం వెనుక కారనమేంటో అన్వేసించాల్సిన అవసరం ఈ రోజు చాలా వుంది. చట్టాల కోసం డిమాండ్‌ చేసినంతగా అమలు కోసం ఉద్యమించని స్త్రీల ఉద్యమ వైఫల్యమెంతో అంచనా వేయాల్సి వుంది. కొత్త కొత్త చట్టాలు వచ్చేసాయని సంబరపడిపోతే సరిపోతుందా?ఈ తరానికి స్త్రీవాద భావాలను, మానవీయ కోణాలను అందివ్వలేకపోవడం మన వైఫల్యం కాదా? ప్రపంచీకరణ మిగిల్చిన విధ్వంసంలో అన్ని విలువలు కొట్టుకుపోతున్నా, మునుపెన్నడూ లేని తీవ్ర స్థాయిలో ఇంటా బయటా హింస పెచ్చరిల్లి పోతున్నా మనమెందుకు సామూహిక చర్యలకి దిగలేకపోతున్నాం. నేను లోంచి మనలోకి నడిచిన ఆనాటి తరం, మనలోంచి నేను లోకి జారిపోతున్న ఈనాటి తరం. ఈ మార్పు భీతిగొల్పుతుంది. భయపెడుతుంది. మనల్ని ఏకాకులుగా మార్చేస్తుంది. చుట్టూ ఏం జరుగుతోందో చూడనివ్వని బండ తనంలోకి నెట్టేస్తుంది. ఈ రోజు మీడియా ప్రదర్శిస్తున్న విశృంఖల, వినాశకర ధోరణివల్ల స్త్రీలు మరింత హింసకు గురౌవుతున్నారు. చిన్న పిల్లల్ని సైతం వదలకుండా వేటాడుతున్న వైనం దిగ్భ్రమకు గురిచేస్తోంది.
మార్చి ఎనిమిదికి వందేళ్ళు నిండిన సందర్భంగా మనమెక్కడున్నాం అని సమీక్షించుకుంటున్నపుడు, స్త్రీల ఉద్యమంలో భాగమైన జీవితాన్ని జ్ఞాపకాల్ని, నెమరు వేసుకుంటుంటే ఓ గొప్ప ఉద్వేగంతో పాటు విషాదమూ కలుగుతోంది. చెయ్యాల్సింది ఇంకా కొండంత మిగిలిపోయిందని గోరంతకే పొంగిపోతే అర్ధం లేదని కూడా అర్ధమౌతోంది. ఎవరి కన్నీళ్ళైతే నన్ను కలవరపెట్టి కర్తవ్యబోధ చేసాయో, ఆ కన్నీళ్ళని కొంతైనా తుడవగలిగేలా నన్ను నేను మలుచుకోగలిగాననే గర్వం నా గుండెల్నిండా వుంది. నేను ఎంచుకున్న దారిలోనే గత ఇరవై సంవత్సరాలుగా నడవగలిగిన గుండె నిబ్బరాన్ని నేను అలవరచుకోగలిగాను. ఇది నాకెంతో సంతృప్తిని మిగిల్చింది.
ఓ చిన్న గ్రామంలో మొదలైన నా ప్రయాణం, స్త్రీల ఉద్యమంతో మమేకమై, స్త్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాలన్నదే నా కోరిక. ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వున్న వాళ్ళమంతా ఖచ్చితంగా మనమెక్కడున్నాం, ఎవరి పక్షాన వున్నాం అని ప్రశ్నించుకోవాల్సిన సందర్భమిది. ఆ ప్రశ్నని నన్ను నేనే వేసుకుని సమాధానాన్ని అన్వేషిస్తూ సాగిందే ఈ వ్యాసం. నేను పబ్లిక్‌లోనే వున్నాను. ఈ రాతలో తప్పొప్పొలు, అభిజాత్యాలు వుంటే నన్ను నిర్ద్వంద్వంగా నిలదీయండి.

Friday, March 12, 2010

హమ్మో!!!! ఎన్ని మోదుగపూలో !!!!!


నువ్వూ నేనూ మోదుగ పూలూ
మార్చి ఎనిమిది మీటింగులో ప్రసంగించి
నేనూ నా నేస్తం సిద్దిపేటకెళ్ళి వస్తుంటే
కరీంనగర్ రహదారిలో కన్నులపండుగగా మోదుగపూలు.
కాదు కాదు మోదుగ వనాలు .
ఒకటా రెండా హమ్మో ఎన్ని వనాలో !
మోదుగపూలని
కావలించుకుని ఫోటో దిగితే కాని తనివి తీరలేదు.
నేనూ నా ఫ్రెండూ
ఒకటే కేరింతలు,తుళ్ళింతలు
అడవి అంటుకుందా అనిపించేలా
ఎర్రని మంటల్లా మోదుగపూలు
మండుటెండలో కూడా మమ్మల్ని సమ్మోహపరిచిన
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ మత్తులో ముంచెత్తే
మోదుగ పూలు

Tuesday, March 9, 2010

ఓ భార్య రాసిన కవిత

నేను వండిన కూర అతనికి నచ్చలేదు
నేను చేసిన కేకూ నచ్చలేదు
అతనన్నాడు
నేను చేసిన బిస్కట్లు గట్టిగా ఉన్నయని
వాళ్ళ అమ్మ చేసినట్టు లేవట
నేను కాఫీ కూడా సరిగ్గా చెయ్యలేదట
ప్రేమగా చేసిన స్వీటూ నచ్చలేదు
అతని తల్లి మడత పెట్టినట్టుగా
అతని బట్టలు నేను మడత పెట్టలేదట
నేను వీటన్నింటికి సమాధానం ఏంటీ అని వెతుకుతుంటే
ఒక క్లూ కోసం మధనపడుతుంటే
అతని తల్లి చేసినట్టే నేను ఏమైనా చెయ్యగలనా
అని ఆలోచిస్తుంటే
నా పెదవులమీద చిరుదరహాసం మొలకెత్తింది
ఓ వెలుగు కిరణం నా కళ్ళ ముందు కదలాడింది
ఓ పని ఖచ్చితంగా
వాళ్ళ అమ్మ చేసినట్టు
చెయ్యగలననిపించి
చాచి ఓ లెంపకాయ్ అతని చెంప మీద వేసాను.
వాళ్ళ అమ్మ ఎప్పుడూ చేసేలా

అనుసృజన:సత్యవతి కొండవీటి
(రచయిత్రి ఎవ్వరో తెలియదు)

Sunday, March 7, 2010

మాలో ఉన్న మనసు మాకు గాక ఇంకెవరికి తెలుసు?

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/mar/7/navya/7navya1&more=2010/mar/6/navya/navyamain


ఈసారి జుగల్‌బందీ ఎవరితో?
సంధ్య..
ఏ సంధ్య?
ప్రగతిశీల మహిళా సంఘం సంధ్య. పీఓడబ్ల్యూ సంధ్య.
అబ్బో ఫైర్‌బ్రాండ్. దులిపిపారేస్తుంది. నిప్పులు చెరుగుతుంది.
తర్వాత?
'భూమిక' ఎడిటర్ కొండవీటి సత్యవతి.
అవునా... ఆడవాళ్ల కోసం హెల్ప్‌లైన్ నడుపుతుంది... ఆవిడేగా...
అవును వాళ్లిద్దరే. రాష్ట్రంలో మహిళలకు, తెలుగు ఛానెళ్ల ప్రేక్షకులకు వీరిద్దరూ బాగానే తెలుసు. స్త్రీల సమస్యల మీద తక్షణం స్పందించే సంధ్య, సత్యవతులు ఫైర్‌బ్రాండ్సే. వాళ్లలో మామూలు మహిళలకుండే భావోద్వేగాలు లేవా? అందరి తరఫునా మాట్లాడే వాళ్ల అసలు స్వరం వినిపించినదెక్కడ? వాళ్ల మనసు సంగతులు ఎందరికి తెలుసు? వందేళ్ల అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈ జుగల్‌బందీ 'నవ్య'కు ప్రత్యేకం.

సత్యవతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో నా జీవితం తెలియకుండానే ముడిపడింది. '75 అంటే ముప్ఫై ఐదేళ్ల క్రితం ఒక మార్చిలో ఉదయం నేనూ మా నాన్నా ఆవుపాలు పిండుతూ రేడియో వింటున్నాం. 'ఈ ఏడాదిని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటిస్తున్నారం'టూ వార్తల్లో చదివారు. అది నాకు బాగా గుర్తు. ఆ ఏడే నేను నా కాళ్లమీద నిలబడాలని ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను.

సంధ్య : 75 అంతర్జాతీయ మహిళా సంవత్సరంతో నాకూ కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. ఇందిరాగాంధీ పాలనలో అవి చీకటి రోజులు. తపాలాపూర్ కుట్రకేసులో ఇరికిస్తారని మా పెదనాన్న ప్రవాసంలోకి వెళ్లారు, మా నాన్న అరెస్టయ్యారు. ఆయన బ్లాక్ డెవెలప్‌మెంట్ ఆఫీసరుగా ఉద్యోగం చేసేవారు. పేదలకు మేలు చేసేవారు. అందువల్ల ఆయన అరెస్టయ్యారని తెలిసినప్పుడు ఆ రోజుల్లోనే 1500మంది గ్రామీణులు అప్పటి మంత్రి బాలాగౌడ్ ఇంటిని చుట్టుముట్టి 'సారును వదిలిపెట్టండి' అంటూ నినాదాలిచ్చారు. తర్వాత మా నాన్న దెబ్బలతో స్పృహతప్పిన స్థితిలో సిరిసిల్ల బస్టాండులో కనిపిస్తే తీసుకొచ్చారు. ఆ సమయంలో మేం స్కూలుకెళ్తున్నప్పుడు ఎవరెవరో వచ్చి 'మీ ఇంటికి రవి మావయ్య వచ్చాడా, రాజన్న మామ వచ్చాడా , సత్యం తెలుసా...' అంటూ ఆరాలు తీసేవారు. మేం పిల్లలం అయినా, ఆ వివరాలు వాళ్లకు చెప్పకూడదని 'మాకేం తెలీదు' అనేసేవాళ్లం అమాయకపు మొహాలు పెట్టి. కొన్ని నెలల పాటు మా ఇంట్లోనూ ఎమర్జన్సీ వాతావరణం కనిపించేది. చాలామందిలాగా నాకు మా అమ్మానాన్నా ఏమీ కొనిచ్చి ప్రత్యేకంగా ముద్దుగా చూసిన జ్ఞాపకాలేమీ లేవుగానీ, వాళ్ల ప్రవర్తన ద్వారా నాలో నింపిన స్ఫూర్తి చాలా గొప్పది.

నవ్య : మీ ఇద్దరికీ బాల్యంలో గోదావరి అనేది ఉమ్మడి అంశం అనుకుంటాను...


సత్యవతి : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం దగ్గర సీతారాంపురం అనే కుగ్రామంలో పుట్టాను నేను. గోదావరి నదికీ సముద్రానికీ మధ్యన అందమైన ఊరది. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఎంత పెద్దదంటే రోజూ కనీసం వందమంది భోజనాలు ఇంట్లో! అంతమందిలో పిల్లల్ని ప్రత్యేకంగా పట్టించుకోవడం, ఏం తిన్నారు, ఏం చదువుతున్నారు వంటివి చూడటం జరిగేది కాదు. నాకు ఇద్దరక్కయ్యలు, అన్న, తమ్ముడు. మేం రోజంతా హాయిగా తోటల్లో చేలల్లో తిరగడం, ఇంటికొచ్చి ఉన్నదేదో తినేసి మళ్లీ ఆటలు. ఆడ మగ వివక్ష ఉండేదికాదు. ఇంట్లో అప్పటివరకూ చదువుకున్నవాళ్లెవరూ లేరు కనుక నేను చదువుకోవడానికి మాత్రం కష్టపడ్డాను. చాలాదూరం నడిచివెళ్లటం. సైకిలెక్కి వెళ్లాలంటే లంగాలు అడ్డం పడేవి. అలాగే నేను ఓరియంటల్ టెంత్ పూర్తి చేశాను. ఇంటర్లో తెలుగు, డిగ్రీలో ఇంగ్లిష్ సాహిత్యాలు ప్రధానాంశాలు. స్కూల్లో ఉపాధ్యాయులు, కాలేజీలో లెక్చరర్లు పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు. అలాగే సమాజం గురించి తెలియజెప్పేవారు. ఇప్పుడదేం లేదు, ఎంతసేపూ ర్యాంకుల గోల.

సంధ్య : మా తాతల సమయంలోనే కృష్ణా జిల్లా నుంచి వరంగల్ అక్కడినుంచి ఆదిలాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ల ప్రయాణం కొండపల్లిగారితో కలిసి సాగిందని చెప్పొచ్చు. నేను పుట్టింది ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట దొనబండ దగ్గర బుద్ధిపల్లి గ్రామంలో. మా పొలాలు దాటితే అడవి. పొలాలకూ అడవికీ మధ్య గోదావరి వాగులు. మా అమ్మది కృష్ణాజిల్లా కూచిపూడి దగ్గర బార్లపూడి. సెలవులకు వెళ్లొస్తుండేవాళ్లం. అప్పటివరకూ అంతా రైతు కుటుంబమేగానీ మా నాన్న బ్లాక్ డెవెలప్‌మెంట్ అధికారిగా ఉద్యోగస్తులయ్యారు. నాకో అన్నయ్య, ఒక తమ్ముడు. సత్యవతి వాళ్లలాగా మాదీ పెద్ద కుటుంబమే. మరీ వందమందని కాదుగానీ రోజూ కనీసం పాతిక ముప్ఫైమందికి భోజనాలుండేవి. నాన్న పెదనాన్నలకు రాజకీయ చైతన్యం ఎక్కువని చెప్పాను కదా, వాళ్లను కలవడానికి ఎవరోఒకరు వచ్చిపోతుండేవారు. నేను హైస్కూల్లో ఉన్నప్పుడు ప్రజాతంత్రలో వచ్చే 'రాజు-పేద'ను తోటి పిల్లలకు చదివి వినిపించేదాన్ని. శ్రీశ్రీ అనంతం, వాసిరెడ్డి సీతాదేవి సావేరి అప్పుడు చదివినవే. ప్రజాశక్తి, విశాలాంధ్ర, సృజన, నూతన, విమోచన వంటి పత్రికలను తెగ చదివేవాళ్లం.

సత్యవతి : అవును, ఆ పత్రికలంటే చాలా ఇష్టంగా ఉండేది.

నవ్య : మీరిద్దరూ ఒకరికొకరు తారసపడిందెక్కడ?


సత్యవతి : అదా.. తల్చుకుంటే భలే విచిత్రంగా ఉంటుంది. నేను బాగ్‌లింగంపల్లి బస్టాపులో నిలబడి పుస్తకం చదువుకుంటున్నాను. సంధ్య వచ్చి 'ఆ పుస్తకం నా చేతుల్లోంచి వచ్చిందే' అంటూ పరిచయం చేసుకుంది.

సంధ్య : అప్పట్లో నగరంలో భావసారూప్యత ఉన్న వ్యక్తులు పరిచయం కావడం కష్టం. అప్పటికే స్త్రీల కోసం పనిచేస్తున్న మేం రూపంలో కూడా సింపుల్‌గా ప్రత్యేకంగా కనిపించేవాళ్లం. అలా బస్టాపులో సత్యవతిని చూసేసరికి 'మావంటి మనిషే' అని తెలిసిపోయింది. బస్టాపులో నిలబడి మరీ పుస్తకాలు చదివేంత పిచ్చి ఎవరికుంటుంది? పైగా ఏ వారపత్రికో కాదు. మహాశ్వేతాదేవి రాసిన 'ఒక తల్లి' చదువుతోంది. అప్పట్లో నేను హైదరాబాద్ బుక్‌ట్రస్ట్‌లో పనిచేసేదాన్ని. ఆ పుస్తకాన్ని ప్రచురించింది మేమే. అందుకే అలా చెబుతూ పరిచయం చేసుకున్నాను.

సత్యవతి : మీకు తెలుసా, మన రాష్ట్రంలో ప్రింటింగ్ టెక్నాలజీని చదువుకున్న మొదటి మహిళ సంధ్యే. మేం కలిసింది 84లో అనుకుంటాను. మా స్నేహం బలపడింది రకరకాల ఉద్యమాల్లోనే. ముఖ్యంగా 'స్త్రీ శక్తి సంఘటన' వంటి సంస్థల ద్వారా చురుగ్గా పనులు చేపట్టడం తొలి దశ. 85లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాం. మేమిద్దరం ఆటోకు మైక్ కట్టుకుని కూకట్‌పల్లి, వనస్థలిపురం అన్నీ తిరిగాం. నన్ను అరెస్టు చేసి రెండు రోజుల పాటు కంట్రోల్ రూమ్‌లో ఉంచారు! తర్వాత ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్‌లో మేం చేసిన సమ్మెల మూలంగానే ఉద్యోగినులకిచ్చే ప్రసూతి సెలవును 90 నుంచి 120 రోజులకు పెంచారు.

సంధ్య : సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా 'ఆడవాళ్లు ఉద్యోగాలంటూ బయట తిరుగుతుంటే వంటిళ్లేమవుతాయి, కుటుంబాలేమవుతాయి...' అనేలా వ్యాఖ్యలు చేశారు. దానికి దేశంలో తీవ్రమైన నిరసన వచ్చింది. మేం హైకోర్టులో ర్యాలీ చేసి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాం. అది పూర్తిగా మా సారధ్యంలోనే జరిగింది! అలాంటి దుడుకు పనులెన్నో! ఇక్కడి విద్యారణ్య స్కూల్లో 'డౌరీ డెత్స్ ఇన్వెస్టిగేషన్ కమిటీ' సమావేశాల్లో తరచూ కలిసేవాళ్లం. అక్కడికి వరకట్న బాధితులు చాలామంది వచ్చేవాళ్లు. వాళ్లను చూసి సత్యవతి కదిలిపోయేది. ఒక కేసు వింటున్నప్పుడు ఆమె ఎంత కదిలిపోయిందంటే అప్పటి ఆమె కన్నీళ్లు నాకిప్పటికీ గుర్తున్నాయి.

సత్యవతి : నా జీవితాన్ని మలుపు తిప్పిన కన్నీళ్లవి. స్వరూప అని ఒకమ్మాయి తన అక్కను కట్నం కోసం బావ చంపేశాడని, ఎలాగైనా న్యాయం చెయ్యాలని లేదంటే తనే బావను చంపేస్తానని ఆవేశంగా మాట్లాడింది. ఆ అమ్మాయి చెప్పిన వివరాలు వింటున్నప్పుడు 'ఇంత అన్యాయమా' అని నాకు చాలా ఏడుపొచ్చేసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, అలాంటివారికి అండగా నిలబడాలి, ఏమైనా చెయ్యాలి అని. అలా మొదలయినవే 'భూమిక' పత్రిక, భూమిక హెల్ప్‌లైన్.

నవ్య : కానీ కన్నీళ్లు నిస్సహాయతకు ప్రతీకలని, ముఖ్యంగా ఆడవాళ్లు మాట్లాడితే కన్నీరు పెట్టుకుంటారని ఒక అభిప్రాయం ఉంది సమాజంలో. మీలాగా ధైర్యంగా పనిచేస్తున్నవారు కన్నీళ్లు పెట్టుకోవడం అంటే...


సంధ్య : అవును. అందరూ అలాగే అనుకుంటారు. మొన్నటికి మొన్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్లో మాజీ గవర్నర్ తివారీ లీలల విషయంలో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చేసింది. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తే అంత దిగజారిపోయి ప్రవర్తిస్తే ఇక దిక్కెవరు అనిపించింది. పైగా చాలామంది ఎంపీలు కూడా దానిలో భాగస్వాములని ఆరోపణలు విన్నప్పుడు - ఎంతమంది పెద్దమనుషులుగా ముసుగుల్లో చలామణీ అయిపోతున్నారో అని బాధవేసి కంట నీరొచ్చింది.

దాన్ని కూడా ఎకసెక్కం చేశారు కొంతమంది. సంధ్య కన్నీళ్లు పెట్టుకోవడం ఏమిటని నవ్వినవాళ్లు నాకు తెలుసు. ఇప్పుడేకాదు, ఒక ఛానెల్లో డూపుల మీద కార్యక్రమం వచ్చేది. దానిలో 'సేవల సంధ్య' అంటూ నాకో డూప్‌ను తయారుచేశారు. ఆమె ఆడవారి సమస్యలకు పరిష్కారాలు చెబుతుంటే లోపల్నుంచీ భర్త 'విడాకుల కాగితాల మీద సంతకం పెట్టవే...' అని హుంకరిస్తాడు. ఈమె 'ఏమండీ...' అని బెరుగ్గా వెళ్లిపోతుంది. ఏవిటి అందులోని హాస్యం? దానిద్వారా ఏరకమైన సందేశం జనాలకు పంపదలచుకున్నారు వాళ్లు? సాటి స్త్రీలకోసం పనిచేసేవాళ్లంటే అంత చులకనా?

సత్యవతి : నిజానికి బాధితుల కథలు వింటున్నప్పుడు ఒకోసారి చాలా ఎమోషనల్‌గా అయిపోతాం. కన్నీళ్లూ సహజమే. దాన్ని గుర్తించకుండా కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు, వెటకారాలు చేస్తుంటారు. అదెంత బాధ కలిగిస్తుందో ఎవరూ అర్థం చేసుకోరు. మగవాళ్లు కుటుంబాన్ని నిర్లక్షం చేసి సమాజం కోసం పనిచేస్తుంటే 'ఆయన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పరుల కోసం పనిచేశాడు...' అని పొగుడుతారు. అదే మహిళ అదే పని చేస్తే మాత్రం 'ముందు ఇంటిని పిల్లలనూ చక్కదిద్దుకోకుండా ఎవర్ని ఉద్ధరిస్తావు..' అన్న తరహాలో మాట్లాడతారు.

సంధ్య : దాదాపు పాతికేళ్లుగా చేస్తున్న ప్రయాణం ఇది. ఇందులో ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించాం.. మమ్మల్ని అరెస్టులు చేయించినా, బెదిరించినా, చంపేస్తామంటూ అర్థరాత్రి ఫోన్లు వచ్చినా... తట్టుకున్నాంగానీ స్నేహితులుగా నటిస్తూ ఇలా వెటకారాలు చేసినప్పుడు మాత్రం చాలా బాధకలుగుతుంది. ఇంట్లో ఉదయం లేచి అందరిలాగానే వంటపని, ఇంటిపని అంతా చేసుకుని బైటకొచ్చి బాధితుల తరఫున మాట్లాడుతున్నప్పుడు - దాన్ని గుర్తించకపోయింది సరికదా, ఈ కామెడీ ఏమిటి?

నవ్య : గడచిన ఇరవయ్యేళ్లలో సమాజ స్వరూపం మారిపోయింది. వరకట్నం వంటి సమస్యలు అలాగే ఉన్నాయి, వాటికితోడు యాసిడ్ దాడుల వంటివి కొత్తవి వచ్చిపడుతున్నాయి. మరొకవైపు ఉద్యమాలు, సామాజికస్పృహ వంటివి తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మీకు 'ఎవరికోసం ఇదంతా' అనే నిస్పృహ కలగదా? కుటుంబాల నుంచి సపోర్ట్ ఎంత?


సత్యవతి : 80లో గోరాగారు ప్రపంచ నాస్తిక మహాసభలు నిర్వహించినప్పుడు నిప్పులగుండాల్లో నడవడం అనేది భ్రమ అని చూపెట్టడానికి నేనూ నడిచాను. ఎందుకో చివరికొచ్చేసరికి తూలిపడబోతే ఒకాయన చెయ్యందించి సాయం చేశాడు. తర్వాత శ్రీశ్రీ సాహిత్యం అవీఇవీ మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌కూ వచ్చారు. అలా మా పరిచయం పెరిగి జస్టిస్ వివిఎస్‌రావుగారు నా జీవిత భాగస్వామి అయ్యారు. 81 సెప్టెంబరు 5న ఇరవై రూపాయల ఖర్చుతో జరిగిన దండల పెళ్లి మాది.

సంధ్య :అప్పట్నుంచీ ఈవిడ ఏ నిప్పుల్లో నడిచినా ఆయన సాయం చేస్తూనే ఉన్నారన్నమాట. మావారు రామకృష్ణారెడ్డి ప్రింటింగ్ కోర్సు చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్. మా చదువులైన పదేళ్ల తర్వాత పెళ్లి జరిగింది. సత్యవతికీ నాకూ బోలెడన్ని పోలికలు జీవితంలో. మా ఇద్దరివీ స్టేజీ పెళ్లిళ్లే. ఇద్దరం కొన్ని కారణాల వలన పిల్లలు వద్దనుకున్నాం, ఇద్దరికీ రంగవల్లి స్మారక అవార్డులు వచ్చాయి. మమ్మల్ని అక్కచెల్లెళ్లా అని ఎంతోమంది అడిగేవారు... సత్యవతి :మహిళారంగంలో పనిచేస్తున్నవారికి రంగవల్లి పురస్కారం రావడం ఎంతో గర్వకారణం. నాకన్నా ముందటేడు ఆ అవార్డునందుకుంటూ సంధ్య చేసిన ఉద్వేగభరిత ప్రసంగానికి హాల్లో అందరి కళ్లూ తడిసిపోయాయి.

సంధ్య : అప్పటి సత్యవతి మొహం నాకింకా గుర్తుంది. వందేళ్ల మహిళా దినోత్సవం జరుపుకొంటున్నా ఇప్పటికీ అవే సమస్యలు, ఇంకా సమానత్వం కోసం పోరాటమే. మీరన్నట్టు ఇప్పుడంతా కెరీరిజం. అందువల్ల అప్పుడప్పుడూ కాస్త నిరాశగా అనిపిస్తుంది. కానీ ఎక్కడో కలిసినప్పుడు, ఫోన్లోనో ఒకోసారి చెబుతారు... 'సంధ్యక్కా మీరు మాట్లాడింది విని ధైర్యం తెచ్చుకున్నాను, నా కుటుంబం నిలబడింది' ఇలా. అప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుంది. అందరి తరఫునా మాట్లాడేవాళ్లకు చెప్పలేనంత స్ట్రెస్, అప్పుడప్పుడూ కొద్దిగా నిరాశ ఉంటాయి. ఇతరులు వచ్చి మాకు చెప్పుకుని తేలికపడతారు. మా సమస్యలు ఎవరికీ చెప్పుకోం. ఎవరికీ పట్టవు.

సత్యవతి : సంధ్య చెప్పింది అక్షరాలా నిజం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పుడు భూమిక హెల్ప్‌లైన్ నంబర్ ఎక్కువమందికి సాయం చేసింది. ఎక్కడైనా తారసపడినప్పుడు అది తమనెలా ఆదుకుందో చెబుతుంటారు స్త్రీలు. అది చాలా సంతోషంగా ఉంటుంది. ఓపిక ఉన్నంతవరకూ ఇలాగే కొనసాగాలనిపిస్తుంది.

పాతికేళ్ల స్నేహంలో ఎన్నో జ్ఞాపకాలు, సంఘటనలు, మరపురాని అనుభవాలు, అవమానాలు, నిరాశలు, సంతృప్తులు... కలబోసుకుంటుంటే కాలం తెలియకుండా పోవడం సహజమే. వీళ్లతో మాట్లాడుతున్నప్పుడు 'కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు..' పాట ఎక్కణ్నుంచో వినిపిస్తున్నట్టే అనిపించింది. ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంది నవ్య.

ఇంటర్వ్యూ : అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్

Wednesday, March 3, 2010

భల్లుగూడా ఆదివాసీ అక్కలకు జరిగిన అన్యాయాన్ని ఖండిచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

మేము ఒక ఇంటి ముందు కూర్చున్నాము. మా చుట్టూ ఊరంతా చేరారు.

జనవరి 22 న అత్యాచారానికి గురైన ముగ్గురు మహిళలు కూర్చున్నారు.

మేము వారితో మాట్లాడడానికి ప్రయత్నించాం.అయితే ఆ ముగ్గురికి తెలుగు రాదు.
వాళ్ళ ముఖాలు ఎంత అమాయకంగా ఉన్నాయొ చెప్పలేను.అసలు ఏ భావమూ కనబడ లేదు.బహుశా ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు ఉన్నారు.
22 జనవరి రోజు ఎమి జరిగిందో చెప్పడానికి అక్కడ ఒకరిద్దరు తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
రాంబాబు అనే ఆయన మాకు దుబాసీగా వ్యవహరించాడు.
ఒక్కరి తర్వాత ఒక్కరు తమ పట్ల పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించిదీ చెప్పారు.
జనవరి 22 న దాదాపు 80 మంది గ్రేహౌండ్స్ పోలీసులు స్థానిక ఎస్ ఐ.కేశవ్ రావ్ తో సహ భల్లుగూడా గ్రామం మీద దాడి చేసి మగ వాళ్ళని,మగ పిల్లల్ల్ని దగ్గరలోని స్కూల్ లో పెట్టి తాళం వేసారు. ఆ తర్వాత పోలీసులు ఆదివాసీల ఇళ్ళళ్ళోకి చొరబడి నలుగురు స్ర్తీల మీద అత్యాచారానికి పాల్పడ్డారు.వంతల డోమిని,వంతల రామి,వంతల ముక్త,కిల్లో భుట్టొ లు పోలీసుసు తమ మీద అత్యాచారం చేసారని,అందులో ఒకరి చేతుల్లో ఉన్న పసి పిల్లని తుప్పల్లోకి విసిరేసాసారని వివరించారు.అత్యాచారానికి గురైన ఇద్దరి భర్తలని అరెష్టు చేసి విశాఖ జైల్లో ఉంచి బాగా కొట్టారని రాంబాబు చెప్పాడు.

జనవరి 23 న పాడేరు ఎం ఎల్ ఏ రాజా రావ్ కి తమకు జరిగి దారుణం గురిచి చెప్పుకున్నా మూడు రోజుల వరకు కేసు బుక్ చెయ్యలెదు స్థానిక పోలీసులు.కేసు రిజిస్టర్ చెయ్యకపోగా భల్లుగూడా గ్రామస్తుల్ని తీవ్రంగా బెదిరించారు.
వైద్య పరీక్షలకి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు.

ప్రతి రోజు రాత్రిళ్ళు పోలీసులు తమ గ్రామం చుట్టు తిరుగుతున్నారని,తమని బెదిరిస్తున్నారని గ్రామస్తులు భయపడుతూ చెప్పారు.

తమకి పోలీసులంటే చాలా భయమని,ఓ పదేళ్ళ క్రితం ఇలాగే తమ గ్రామం మీద పడి తమ పెద్దల్ని భయంకరంగా కొట్టారని,ఆ సంఘటనని తాము ఎప్పటికి మర్చిపోలేమని, తమకు నక్సలైట్ల గురించి ఏమీ తెలియదని గద్గద స్వరాలతో చెప్పారు. డొమిని రామి, ముక్తలతో ఇంకా ఎక్కువ మాట్లాడాలని మాకు ఉన్న భాష అడ్డం వచ్చింది.వారి ముఖాల్లో 22 తేదీ నాటి ఘోరం తాలుకూ భయం స్పష్టంగా కనబడుతోంది. వారి ముఖాల్లోని అమాయకత్వం,ఎలాంటి భావాన్ని వ్యక్తం కానివ్వని ఆ అమాయకత్వం మా కళ్ళళ్ళొఓ నీళ్ళు పెట్టించిది.
క్రితం సంవత్సరం ఇదే విధమైన అత్యాచారనికి గురైన వాకపల్లి మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భూమి చెబితే ఆకాశం నమ్మదా అంటూ నిలదీసారు.
భల్లుగూడా దోమిని,రామి,ముక్త లు మాత్రం కన్నీళ్ళని సైతం కోల్పోయినట్లు కనబడ్డారు.
భారమైన గుండెలతో,వారికి న్యాయం జరిగేలా క్రుషి చేస్తామని,ఈ మారు మూల ఆదివాసీ గ్రామం లో జరిగిన ఈ బీభత్సకాండ గురించి ప్రపంచానికి తెలియ చెబుతామని వారికి చెప్పి చిక్కటి చీకటిలో కొండలెక్కి అడవి దాటి రాత్రి ఒంటి గంటకి వైజాగ్ చేరాం.
ఆ రాత్రి దుఖంతోనే కడుపు నిడిపోయింది.ఎవ్వరం అన్నాలు తినలేదు.
ఆ అమాయక అదివాసీ ల ముఖాలు కళ్ళళ్ళొంచి కదలడం లేదు.
భల్లుగూడా ఆదివాసీ అక్కలకు జరిగిన అన్యాయాన్ని ఖండిచాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

Monday, March 1, 2010

భల్లుగూడ లో గిరిజన మహిళలపట్ల గ్రేహౌండ్స్ పోలీసుల బీభత్స కాండ





ఫిబ్రవరి ఇరవై ఆరున కొంతమంది రచయిత్రులం  కలిసి
విశాఖ జిల్లా భల్లుగూడలో గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచారానికి గురైన గిరిజన మహిళలను కలిసాం.
ఉదయం పది గంటలకి విశాఖలో బయలుదేరి పాడేరు మీదుగా రెండు టాటా సుమోల్లో  బయలుదేరాం.భల్లుగూడా బాధిత స్త్రీలు పాడేరు వస్తారని ముందు చెప్పారు.
కానీ మేమే భల్లుగూడా వెళ్ళాల్సి వచ్చింది.
దాదాపు పది కిలోమీటర్లు కొండల్లో,అడవిలో నడవాలని చెప్పడంతో చాలామంది వాహనాల్లోనే ఉండిపోయారు.
నేను మరో ఏడుగురం  నాలుగున్నరకి  భల్లుగూడకి బయలుదేరాం.
దారంతా రాళ్ళు,రప్పలతో నిండి ఉంది.
రెండు కొండలెక్కి దిగడంతో నాకు చాలా అయాసం వచ్చేసింది.
మధ్యలో దట్టంగా చెట్లు అల్లుకున్న అడవి.
కొండలెక్కి అడవి దాటి భల్లుగుడా చేరేసరికి సూర్యాస్తమమౌతోంది.
మా కోసం ఊరంతా ఎదురుచూస్తోంది.
అత్యాచారానికి గురైన ముగ్గురు స్త్రీలు మాతో మాట్లాడడానికి
సిద్ధమయ్యారు....................

(మిగిలింది రేపు చదవండి)

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...