Tuesday, September 25, 2007

ఆరు బ్రహ్మ కమలాలతో నేను


ఆరు బ్రహ్మ కమలాలతో నేను

మిత్రులారా! బ్రహ్మ కమలాలు సంవత్సరానికి ఒకటో రెండో పూస్తాయని నేను విన్నాను.చదివాను.అయితే మా ఇంట్లో మాత్రం బ్రహ్మకమలాలు ఆగకుండా పూస్తూనే వున్నాయి.ఓ నెల రోజుల క్రితం తొమ్మిది పూలు పూసాయి.మళ్ళీ మొన్న పన్నెండు పువ్వులొచ్చాయి.రెండు రోజులు వరుసగా ఆరు ఆరు పువ్వుల చొప్పున వికసించి నన్ను ఆశ్చర్యంలో ముంచేసాయి.
మీకోసం ఈ ఆరు పువ్వులు.

Monday, September 24, 2007

పత్తి మందారం








పత్తి మందారం పువ్వులివిగో.ఈ పువ్వులు ఉదయం పూసినప్పుడు పాల నురుగంత తెల్లగా ఉంటాయి.మధ్యాహ్నానికి చక్కటి గులాబీ రంగులోకి మారతాయి.సాయంత్రానికి ఎర్రటి అరుణిమ దాలుస్తూ ముడుచుకుపోవడం, రాలిపోవడం జరుగుతుంది.
ఈ రోజు మా ఇంట్లో పూసిన పత్తి మందారల భిన్న స్వరూపాలివి.

Saturday, September 15, 2007

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. మణిపూ‌ర్‌లోని ‘మలోమ్’ ప్రాంతంలో ‘తిరుగుబాటు’ దారుల మీద అస్సామ్ రైఫిల్స్ జరిపిన దారుణ కాల్పుల్లో పదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శాంతి ఊరేగింపుకోసం ‘మలోమ్’ వెళ్ళిన షర్మిలను ఈ సంఘటన కలిచివేసింది. మణిపూ‌ర్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు ఇంతకు ముందు జరగలేదా అంటే జరిగాయి. కాని శాంతి ఊరేగింపుల ద్వారానే ఈ భద్రతా దళాల దారుణాలను ఆపలేమని అర్థం చేసుకున్న షర్మిల ఆరోజు నుంచే తన అమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఆమె బలహీనమైన శరీరం యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రభుత్వం ఆమె మీద కేసుపెట్టి జైలుకు పంపింది. ఆమెకు బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికి తన నిరాహారదీక్షని జైల్లోనే కొనసాగించింది. అప్పటినుండి ఆమె నిర్బంధంలోనే వుంది. బలవంతంగా ముక్కుకు గొట్టాలు అమర్చి ఆహారం పంపిస్తున్నారు. ఆమెకు కొన్నిసార్లు బెయిల్ దొరికినా, ఆమె నిరాహార దీక్ష కొనసాగించడంతో మళ్ళీ మళ్ళీ అరెస్టు చేయడం జైలుకి పంపడంజరుగుతూ వచ్చింది.

ఈ ఏడేళ్ళ కాలంలో షర్మిల వృద్ధురాలైన తన తల్లిని ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నిరక్షరాస్యురాలైన , గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె తల్లి షర్మిలకిస్తున్న మానసిక మద్దతు వెలకట్టలేనిది. “మీరు ఎందుకు మీ బిడ్డను చూడడానికి వెళ్ళలేదు” అని అడిగిన ఒక విలేఖరికి ఆమె తల్లి ఇరామ్ సఖీదేవి ఇచ్చిన సమాధానం “నా గుండె చాలా బలహీనమైంది. నేను షర్మిలను చూస్తే ఏడుస్తాను. నా ఏడుపుతో తన ధృఢ నిర్ణయాన్ని చెదరగొట్టదలుచుకోలేదు. అందుకే షర్మిల తన గమ్యం చేరేవరకు ఆమెను చూడదలుచుకోలేదు.”

షర్మిల నిరాహారదీక్ష కొనసాగుతున్న సమయంలోనే 2004 లో మణిపూర్ స్త్రీల చారిత్రక నగ్న ప్రదర్శన జరిగింది. భద్రతా దళాల చేతిలో మనోరమ అనే మహిళ అత్యాచారానికి, హత్యకి బలైనపుడు మణిపూర్ స్త్రీల గుండెలు మండిపోయాయి. తీవ్ర చర్యకి వారిని ప్రేరేపించిందీ సంఘటన. అస్సామ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ ముందు మణిపురి తల్లుల నగ్న ప్రదర్శన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సెవెన్ సిస్టర్స్‌గా పిలవబడే ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో యావత్ ప్రపంచానికి తేటతెల్లం చేసిందీ నగ్న ప్రదర్శన.

ఇంఫాల్‌లోని జవహర్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లోని జుడీషియల్ కస్టడీ నుంచి బెయిల్ దొరికిన వెంటనే ఆమె మిత్రులు షర్మిలాను ఢిల్లీకి తరలించారు. చాలా నాటకీయ పరిస్థితుల్లో ఆమె హఠాత్తుగా అక్టోబరు 2 న ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ముందు ప్రత్యక్షమై మహాత్మాగాంధి సమాధి మీద పుష్పగుచ్ఛం వుంచుతూ “మహాత్మా గాంధీ కనుక ఈరోజు బతికి వుండి వుంటే, ఆయన తప్పకుండా సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టి వుండేవాడని నేను యావత్ భారత ప్రజలకు చెప్పదలిచాను. భారతీయులందరికీ నా విన్నపం ఒక్కటే. సాయుధ దళాల చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పండి. మా ప్రచారంలో భాగం పంచుకోండి” (టెలిగ్రాఫ్ అక్టోబరు 5, 2006)

ప్రస్తుతం షర్మిలను అరెస్టు చేసి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వుంచి బలవంతంగా ముక్కు ద్వారా ఆహారం పంపిస్తున్నారు. ఇంఫాల్ హాస్పిటల్ ఇరుకు గదిలోంచి, ఎయిమ్స్‌లోని స్పెషల్ వార్డులో వుంటూ షర్మిల తన నిరాహార దీక్ష కొనసాగిస్తూనే వుంది. అయితే ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని డాక్టర్లు ప్రకటిస్తున్నారు. ముక్కుకి బలవంతంగా అమర్చిన గొట్టం వల్ల షర్మిల తీవ్రమైన బాధని భరిస్తోంది.. ఇటీవలే ఆమె బి.బి.సిలో మాట్లాడుతూ “మణిపూర్ ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైంది కాదు. నా పోరాటం సత్యం కోసం, ప్రేమ కోసం, శాంతికోసం” అంటూ ప్రకటించింది.

ముప్పై ఐదేళ్ళ బలహీనమైన ఈ యువతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతికెక్కిన భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గాంధీ అడుగుజాడల్లో, అహింసాయుత పద్ధతిలో, మడమతిప్పనిపోరు సల్పుతోంది. తన ప్రాణాలను తన ప్రజలకోసం తృణ ప్రాయంగా ఫణంగా పెట్టి పోరాడుతున్న షర్మిలా ఇరామ్‌తో గొంతు కలపడం అభ్యుదయాన్ని కాంక్షించే వారందరి కర్తవ్యం.

Friday, September 14, 2007

మానవీయ భాష నేటి అవసరం

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ‘’పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు'’ వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ‘’పల్లెటూరి పిల్లగాడా'’ పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

నిజానికి ఎడిటోరియల్గా వస్తున్న ఈ కధనం రిపోర్ట్ల్లో రావలసింది. కానీ ఆనాటి ఆ సమావేశంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వల్ల సంపాదకీయం రాయాల్సి వస్తోంది. అయితే ఇది ఒక ఉద్యమాన్ని కించపరచడానికో, వ్యక్తిగతంగా ఎవరినో దుమ్మెత్తి పోయడానికో రాస్తున్నది కాదు. అస్తిత్వ ఉద్యమాల పట్ల ఉద్యమంలో వున్న వారి నిబద్ధత పట్ల వున్న గౌరవానికి ఈ సంపాదకీయానికి ఏలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మాకెలాంటి వ్యతిరేకతా లేదు. ఇంతకు ముందు భూమిక తెలంగాణా పోరాట నేపధ్యంతో ‘’ ప్రత్యేక తెలంగాణ సంచికను'’ కూడా వెలువరించిన విషయం విస్మరించకూడదని మనవి.

అయితే ఆ రోజు సమావేశంలో జరిగిన సంఘటనని ఎత్తి చూపాల్సిన అవసరం చాలా వుంది. మీటింగు మొదలవ్వబోతోందని సూచిస్తూ తెలంగాణ వైశిష్ట్యం గురించి ఒక పాట పాడ్డం మొదలుపెట్టారు. పాట మంచి ఊపుగా, ఉద్విగ్నంగా సాగుతోంది. సభికులు పాటను ఆస్వాదిస్తున్నారు. నేనూ అదే మూడ్లో వున్నాను. హఠాత్తుగా, కర్ణకఠోరంగా వినబడిన పాటలోని ఒక వాక్యం నన్ను దిగ్భ్రమకి గురి చేసింది. నిలువెల్లా వొణికించింది. కోపంతో నో..నో..అని అరిచాను కూడా.
తెలంగాణ అపుడెలా వుండేది, ఇపుడెలా వుంది పోలుస్తూ సాగుతోన్న పాటలో
‘’నిండు ముత్తయిదువులా ఉండేదానివి
ముండ మోపి లెక్క నయ్యావే తెలంగాణ…'’

ఆ పాటని పాడుతున్న వాళ్ళల్లో ఇద్దరు స్త్రీలు కూడా వున్నారు. ఆ వాక్యాలని వాళ్ళెలా ఉచ్ఛరించగలిగేరా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు గుండెల్లో ముల్లు గుచ్చుకున్నంత బాధేసింది. నేనింక అక్కడ ఒక క్షణం నిలవలేకపోయాను. చివరి దాకా సమావేశంలో వుండి పాటలన్నింటిని వినాలని కూర్చున్న నేను, ఆ ఒక్క పాట అవ్వగానే లేచి హాలు బయటకి వచ్చేసాను.పాట పాడిన వాళ్ళని పిలిచి పబ్లిక్ మీటింగులో ఆడవాళ్ళని అవమానిస్తున్న ఆ పాటని మీరెలా పాడగలిగేరు అని అడిగితే సరైన సమాధానం రాలేదు.

విప్లవోద్యమ నేపధ్యం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యం కలిగిన వ్యక్తులు వేదిక మీద, వేదిక కింద ఆసీనులై వున్న ఆనాటి సమావేశంలో స్త్రీలని ముత్తయిదువలని, ముండ మోపులని చీలుస్తూ, అవమానిస్తూ గొంతెత్తి పాడటాన్ని నేను ఈ రోజుకీ జీర్ణించుకోలేక పోతున్నాను. అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ కూడా ఇంకా స్త్రీలను అవమాన పరిచే భాషను వదులుకోలేక పోతున్నారే అని చాలా బాధపడుతున్నాను. స్త్రీలను కించపరిచే భాషను భాషాశాస్త్రం నుంచి తొలగించాలని ఒక వైపు స్త్రీవాద ఉద్యమం డిమాండ్ చేసి కొంతవరకు మామూలు సాహిత్యకారుల్లో సైతం ఒక అవగాహనని కల్గించినా అభ్యుదయవాదులు, విప్లవ వాదులు దీన్ని వొదిలించుకోలేకపోవడం చాలా దు:ఖంగా అన్పిస్తోంది.

తెలుగు భాష నిండా స్త్రీలను కించపరిచే పదాలు - మానభంగం, అనుభవించడం, చెరచడం, ముండమోపి, ముత్తయిదువ, అయిదోతనం, శీలం, అబల, సౌభాగ్యవతి లాంటి పితృస్వామ్య సంస్కృతికి అద్దం పట్టే పదాలు కుప్పలు తెప్పలుగా వున్నాయి. ఇలాంటి దారుణ పద ప్రయోగాలను భాషా శాస్త్రం నుండి తొలగించడానికి ఒక భాషా సాంస్కృతిక విప్లవంలో పాలు పంచుకోవాల్సింది పోయి అభ్యుదయ వాదులు కూడా వివక్షాపూరిత భాషను యధేేచ్ఛగా ప్రయోగించడం అర్ధం చేసుకోలేకపోతున్నాను.

ఇప్పటికైనా స్త్రీలకు సంబంధించి ఒక గౌరవ ప్రదమైన మానవీయ భాషను, ప్రత్యామ్నాయ పద ప్రయోగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని అభ్యుదయ వాదులతో సహా అందరూ ఆలోచించాలని, పెద్దు ఎత్తున చర్చను లేవనెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...