Thursday, February 18, 2010

మహిళలకు సహాయ కేంద్రం




మహిళలకు సహాయ కేంద్రం
మహిళా పోలీస్‌ స్టేషన్‌, సిసిఎస్‌, హైదరాబాద్‌

   ఈ రోజు ఉదయం 11 గంటలకు  నగర పోలీస్ కమీషనర్ ఎ.కే ఖాన్ ప్రారంభించారు. మీటింగ్ ఉండడం వల్ల సబితా ఇంద్రా రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేక పోయారు.
    మహిళలపై నానాటికీ పెచ్చరిల్లుతున్న హింస మానవ హక్కులకు విఘాతంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని, పోలీస్‌ స్టేషన్లలోనే మహిళా సహాయ కేంద్రాల్ని నెలకొల్పడమన్నది ఒకానొక వ్యూహాత్మక ప్రతిపాదనగా ముందుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోలీసు విభాగంతో పాటు, ఆక్స్ ఫాం ఇండియా, స్వార్డ్ సంస్థల సమష్టి కృషి ఫలితంగా ఈ ప్రతిపాదన కార్యరూపాన్ని సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో 2004లో ప్రారంభమైన ఈ మహిళా సహాయ కేంద్రాల ఏర్పాటు నేడు పౌరసమాజమూ, ప్రభుత్వాల మధ్య అద్భుత సమన్వయ సహకారానికి తార్కాణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రోత్సాహకర అనుభవం ఆధారంగా సహాయ కేంద్రాల ఏర్పాటు డిఎఫ్యైడి సహకారంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు (వరంగల్, కరీంనగర్, అనంతపురం) విస్తరించింది. శ్రీ ఎ.కె.ఖాన్‌ అదనపు డిజిపి (లా అండ్‌ ఆర్డర్)గా పనిచేస్తున్న కాలంలో దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో పదిచోట్ల సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. ఈ దిశగా సంయుక్త కార్యాచరణకు సంబంధించిన ఒక ఒడంబడికని డిజిపి కార్యాలయం ఆమోదించాల్సి
 ఉంది.
    ఐదు లక్షల రూపాయల వ్యయంతో సహాయ కేంద్ర నమూనా నిర్మితమైంది. ఇటువంటి కార్యక్రమానికి ఇంత భారీ స్థాయిలో నిధుల్ని అందించడమన్నది  ఆక్స్ ఫాం ఇండియా చరిత్రలో ఇదే మొదటిసారి. వైవాహిక, గృహ హింసలనెదుర్కుంటున్న మహిళల సమస్యల్ని పరిష్కరించాలంటే అందుకు సానుకూల వాతావరణంతోపాటు, గోప్యమైన విచారణ కూడా అవసరం. ప్రధానంగా ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే సహాయ కేంద్ర రూపకల్పన జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదుదారులతో పాటు వచ్చే వృద్ధులు, పిల్లలు రోజల్లా స్టేషన్‌ వెలుపలే వేచి ఉండాల్సిన అగత్యముండేది. ఈ అసౌకర్యాన్ని కూడా గుర్తించే కేంద్ర రూపకల్పనలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేగాక కేంద్రనిర్వహణలో కొందరు మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తలు వంటి నిపుణుల సహకారం అవసరమవుతుంది కనుక, వారిక్కూడా కొంత చోటును కేటాయించాల్సి వచ్చింది. 
   హింసలకి గురైన బాధితులు, ఫిర్యాదుదారులపై ప్రతిదాడులు జరగకుండా నిరోధించేందుకు అన్ని కోణాల్లోనూ సహకరించడంతో పాటు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా యువతని, కుటుంబాల్ని, అన్ని సామాజిక వర్గాల్ని చైతన్యపరచడం ప్రధాన బాధ్యతగా సహాయ కేంద్రాలు పనిచేస్తాయి. ఇలాంటి వ్యవస్థ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఒరిస్సా, రాజస్థాన్‌లలో ఇదివరకే అమల్లో ఉంది. ఉత్తరప్రదేశ˜, గుజరాత్
లలో సహాయ కేంద్రాల ఏర్పాటు ఇంకా ప్రారంభదశలో ఉంది.
    పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలోనే వ్యూహాత్మకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు సంబంధించి న్యాయవ్యవస్థ పరిధిలోనే బాధిత మహిళలకు మానసిక, శారీరక, భావోద్వేగ పరమైన రక్షణతోపాటు చట్టపరమైన ఆశ్రయాన్ని కల్పించినట్టవుతుంది. సహాయ కేంద్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్లయిన (సామాజిక సేవ, సామాజిక శాస్త్రాలు) ఇద్దరు సామాజిక కార్యకర్తలు హింసకు గురైన మహిళలకు, పిల్లలకు చట్టపరమైన సలహాలతో పాటు, అన్ని విధాలైన సహాయ సహకారాల్ని అందిస్తారు. 
మహిళలు, పిల్లలకు సహాయాన్నందించడంలో కేంద్రం పాత్ర, విధివిధానాలు
    - బాధిత మహిళలకు మానసిక స్థయిర్యాన్ని కలిగించడంతో పాటు, వారికి భావోద్వేగ పరమైన సహాయాన్ని అందించడం
    - హింసను విడనాడే విధంగా హింసకు పాల్పడిన, అందుకు సహకరించిన వ్యక్తులతో అవసరమైన చర్చలు జరపడం
    - మహిళలకు అవసరమైన అన్ని సహాయ వ్యవస్థల్ని పెంపొందించే విధంగా కృషి చేయడం
    - మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా పోలీసు సహకారం కోసం ప్రయత్నించడం
    - చట్టపరమైన సహాయాన్నందించడం
    - తాత్కాలికంగానైనా హోమ్స్, ఇనిస్టిట్యూషన్స్, హాస్టళ్ళు,తదితర మార్గాల ద్వారా బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడం
    - బాధిత మహిళలకు అండగా నిలిచే పురుషులతో కలిసి పనిచేయడం,
    - స్త్రీధనం వంటి ఆస్తుల పునర్నిర్మాణం, పరిరక్షణ దిశగా బాధిత మహిళలకు సహాయమందించడం
    - యువతరం, విద్యా సంస్థలు, సామాజిక వర్గాల్లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెరిగేలా వారితో కలిసి పనిచేయడం
    - నేరం జరిగిన తరువాత, సంక్షోభానంతర కాలంలో బాధిత మహిళలకు మరింత మానసిక స్థయిర్యాన్ని కల్పించేలా కవ్న్సెలింగ్ నిర్వహించడం

Saturday, February 13, 2010

నేనొక్కదాన్ని కోణార్క్, పురి వెళ్ళొచ్చానోచ్!!!







భువనేశ్వర్ వచ్చింది మహా సీరియస్ మీటింగ్ కి.
జెండర్ బడ్జెట్.బడ్జెట్ ని స్త్రీల ద్రుష్టి కోణం నుండి,
జెండర్ పర్స్పెక్టివ్ నుండి ఎలా అర్ధం చేసుకోవాలి
అనే అంశం మీద మీటింగ్ జరిగింది.
కెంద్ర ప్రభుత్వం గ్రుహ హింస నుండి స్త్రీలకు రక్షణ కల్పించే చట్టం తెచ్చింది గానీ
దాని అమలుకు సరిపడిన నిధులివ్వడం లేదు.
జెండర్ బడ్జెట్ కు,ఈ అంశానికి ఉన్న లింక్ కు సంబంధించి
భువనేశ్వర్ లో ఒకటిన్నర రోజులు మీటింగ్ జరిగింది.
చర్చోపచర్చలు,తీర్మానాలు అయ్యాయి.
బుర్ర వేడెక్కిపోయి చల్లగాలి పీల్చుకోకపోతే పిచ్చెక్కిపోయేలా ఉందని కారు బుక్ చేసుకుని కోణార్క్ కి పారిపొయ్యా.
కోణార్క్ శిల్ప సౌందర్యం రెండు కళ్ళు విప్పార్చుకుని చూడాల్సిందే.
అద్భుత శిల్పవిన్యాసం.
ఎన్నివేలమంది శిల్పులు అహర్నిశలు అన్నపానాలు లేకుండా చెక్కారో.
సూర్యుడి రధచక్రాలను చూస్తుంటే ఆ రధం కదులుతున్నదా అనే భ్రమ కలుగుతుంది.
కోణర్క్ చూడడం గొప్ప అనుభవం.
కోణర్క్ నుండి సముద్ర తీరం వెంబడి పురి వెళ్ళడం
మరో అపూర్వానుభవం.
వైజాగ్ నుండి భీమిలి వెళ్ళే రోడ్డులా ఉంటుంది.
దీన్ని మెరైన్ డ్రైవ్ అంటారట.
మధ్యలో దట్టమైన అడవి కూడా వస్తుంది.
పురి బీచ్ అండమాన్ బీచ్ లాగా అనిపించింది.
స్వచ్చంగా,శుభ్రంగా వుంది.
నీలి ఆకాశం రంగులో మిల మిల మెరిసిపోయే నీళ్ళు.
ఇటీవల అక్కడ సముద్రం రోడ్డు మీదకొచ్చేసిందట.అక్కడ రోడ్డు కోతకు గురైంది.
నేను నీళ్ళల్లోంచి బయటకు వచ్చేస్తుంటే కెరటాలు నా పాదాలను పట్టుకొని వెళ్ళిపోవద్దని బతిమాలినట్టు అనిపించింది.
నేను పొవ్వాలని వెనక్కి తిరిగానో లెదో కెరటాలు ఎగురుకుంటూ వచ్చి మళ్ళి మళ్ళీ నా పాదాలను తాకుతూనే ఉన్నాయి.
వెళ్ళొద్దని అడుగుతూనే ఉన్నాయి.
దిగులుగానే వాటిని వదిలేసి జగన్నాధ గుడి వేపు మళ్ళిపోయాను.
అక్కడి కెళ్ళడం ఓ భయంకరానుభవం.
ఇరుకిరికు రోడ్డు,ఆ రొడ్డు నిండ యాచకులు,పశువులు,దుకాణాలు.
గుడిముందు ఏమిటొ మంటలు.గుళ్ళోకి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తానంటూ వేధించే పురోహితులు.
వద్దు మొర్రో అంటే వినడు.
నేను గుళ్ళో కెళ్ళను బాబో అంటే నన్నో వింత మ్రుగాన్ని చూసినట్టు చూసి క్యోం ఆయా ఇత్నా దూర్ అంటూ లెక్చరివ్వబోయాడు.
అతన్ని తప్పించుకుని,పురి ఇరుకులోంచి బయటపడి
భువనేశ్వర్ వైపు సాగిపోయా.
కోణర్క్, పురి బీచ్ చూడడం మహాద్భుతం.మంచి అనుభవం.
మొదటి సారి భువనేశ్వర్ వచ్చి ఒక్కదాన్ని  కోణార్క్,పూరి వెళ్ళిరావడం మహా థ్రిల్లింగ్ గా ఉంది.

Thursday, February 4, 2010

ఇంఫాల్ ఎక్ పల్ హసి -ఎక్ పల్ ఆశు

2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్యభారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను. పూనాలో సమావేశాలు జరుగుతున్నపుడే హెల్ప్‌లైన్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కి జైపూర్‌ వెళ్ళడం వల్ల నేను వాటిని మిస్‌ అయ్యాను. ఎలాగైనా ఇంఫాల్‌ వెళ్ళాలని డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాను. మణిపూర్‌ చాలాదూరం కాబట్టి ప్రయాణ ఖర్చులకే ఇరవైవేలు కావాలి. సొంత డబ్బులతోనే వెళ్ళాలి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్న మహిళా జర్నలిస్ట్‌లు 2003లో ఢిల్లీలో సమావేశమైనపుడు ఒక వెబ్‌సైట్‌ నిర్మాణంతో పాటు ప్రతి సంవత్సరం కలవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మొదటి సమావేశానికి నేను హాజరయ్యాను. మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద చర్చలతో పాటు, ఎన్నో అంశాల మీద మూడురోజులపాటు సమావేశాలు జరుగుతాయి.
మూడునెలల క్రితం ఇంఫాల్‌లో సదస్సు నిర్వహణా బాధ్యతని స్వీకరించిన అంజులిక నుంచి చక్కటి కవితాత్మకమైన ఆహ్వానం నెట్‌వర్క్‌ సభ్యులందరికీ అందింది. అంజులిక రాసిన ఈమెయిల్‌ అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఇక అప్పటినుండి ప్రయణపు ఏర్పాట్లు మొదలయ్యాయనే చెప్పాలి. అయితే ఎన్నో అనుమానాలు. మణిపూర్‌ గురించి గాని మిగతా ఈశాన్యభారతం గురించి గానీ మీడియాలో ఎలాంటి వార్తల, సమాచారం లేకపోవడం వల్ల ఎన్నెన్నో సందేహాలు. అసలు ఎలా వెళ్ళాలి? ఇంఫాల్‌కి రైల్వేలైను లేదు. విమానంలో వెళితే ఎక్కడ దిగాలి? కోల్‌కతానా? గౌహతీనా? అక్కడి నుండి బస్సులుంటాయ? ఎన్ని గంటల ప్రయణం? ఇంటర్‌నెట్‌ నుండి కొంత సమాచారం సేకరించినా తృప్తిలేదు. మొబైల్‌ ఫోనులు మౌనవ్రతం పడతాయని, ఎటిఎమ్‌లు మొత్తానికే మొరాయిస్తాయని కొందరు భయపెట్టారు. అవసరమైన డబ్బులు మోసుకెళ్ళాలన్నమాట.


ఈ అనుమానాలన్నీ ప్రశ్నలరూపంలో సంధిస్తూఅంజులికకు ఎన్ని మెయిల్స్‌ రాసినా సమాధానాల్లేవు. మణిపూర్‌లో పరిస్థితి, అంజూలిక నిస్సహాయస్థితి తెలియక కోపం తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇంటర్నెట్‌ సరిగ్గా పనిచేయడం లేదని, త్వరలోనే అన్ని వివరాలు రాస్తానని తన మెయిల్‌, ఆ మర్నాడే కల్పనాశర్మ నుండి మెయిల్‌ వచ్చింది. అంజులిక కజిన్‌ ఇంఫాల్‌లో దారుణ హత్యకు గురయ్యాడని తను చాలా దుఃఖంలో వుందని దాని సారాంశం. అందరం చాలా బాధపడుతూ తనకి రాసాం. తను కాన్ఫరెన్స్‌ నిర్వహించగలుగుతుందా అనే భయాలను పటా పంచలు చేస్తూ అంజులిక అన్ని వివరాలతో మెయిల్‌ ఇచ్చింది. తన దుఃఖాన్ని దిగమింగి ప్రోగ్రామ్‌ జరపడానికే తను రెడీ అయ్యింది.


ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎంతమంది వెళతారో, ఎవరెవరు వెళతారో స్పష్టత లేకపోవడం వల్ల నేను నా ప్రోగ్రామ్‌ ఒంటరిగానే తయారుచేసుకున్నాను. గౌహతిలో ఐఐటి చదువుతున్న, నా ఫ్రెండ్‌ గీత కూతురు వైశ్ణవి నా కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యాంపస్‌లోను, షిల్లాంగ్‌లో నా కోసం గెస్ట్‌హౌస్‌ బుక్‌ చేసి, టాక్సీ మాట్లాడి గౌహతి ఏయిర్‌పోర్ట్‌లో వుంచింది.ఈశాన్య రాష్ట్రాలకి ఎపుడూ వెళ్ళకపోయినా సరే ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా ఒక్కదాన్ని తిరుగుదామనే నిర్ణయించుకున్నాను కొన్నిసార్లు ఒంటరి ప్రయాణాలు గొప్ప గొప్ప అనుభవాలను అందిస్తాయి. ఇంఫాల్‌ వెళ్ళిన తర్వాతే ఆంధ్రా నుండి వచ్చిన వాళ్ళని కలుసుకోవడం జరిగింది.

4వ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఫ్లయిట్‌లో నా ఇంఫాల్‌ ప్రయాణం మొదలైంది. పదిగంటలకి కోల్‌కత్తాలో దిగి, ఇంఫాల్‌ ఫ్లయిట్‌ కోసం ఎదురుచస్తున్నపుడు బాంబే, పూనే, కలకత్తా గ్రూప్‌లు కలిసాయి. 12.30కి ఇండిగో విమానంలో బయలుదేరి 1.45కి ఇంఫాల్‌లో దిగాను. ముందు విమానంలో బయలుదేరి వెళ్ళిన ఆంధ్రాగ్రూప్‌లో సాక్షిలో పనిచేసే మంజరి, వార్తలో పనిచేసే జె. శ్యామల, వసంత, వనజారెడ్డి, ఎన్‌టివీలో పనిచేసే సమీర (మంజరి కూతురు) కలిసారు. అంజులిక కోసం ఎదురుచస్తుంటే గలగల నవ్వుతూ చిత్ర మా కోసం వాహనం తీసుకుని వచ్చింది. అందరం వాహనంలో ఎక్కి 'మంత్రిపుక్రి' అనే ప్రాంతానికి బయలుదేరాం. అక్కడే ఒక క్రిష్టియన్‌ సంస్థలో మా అందరికీ వసతి ఏర్పాటైంది. ఎయిర్‌పోర్ట్‌ నుండి మంత్రిపుక్రికి వెళుతుంటే, దారిపొడుగునా కనబడిన షాపులు, భవనాలు గమనించినపుడు మేము ఒక రాష్ట్ర రాజధాని నగరంలో ఉన్న భావం కలగలేదు. దుమ్ముకొట్టుకుపోయిన ఆ దారంతా చూస్తున్నపుడు ఏదో చిన్న పట్టణంలో వున్నామనిపించింది. మధ్యలో అరగంటపైగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పెళ్ళిళ్ళ సీజనని చిత్ర ప్రకటించింది. మామూలు పౌరుల కన్నా తుపాకు లెక్కుపెట్టిన ఆర్మి, అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధుల హడావుడి ఎక్కువగా వుంది. జిప్సీ వాహనాల్లో ట్రిగ్గర్‌ మీద వేలుంచి, తీక్షణంగా జనంవేపు చూస్తున్న వాళ్ళని చూస్తుంటే వెన్నులో జలదరించినట్లయింది.


మా వాహనం దుమ్ము రేపుకుంటూ మంత్రిపుక్రిలోకి ప్రవేశించింది. మెయిన్‌ రోడ్డుకి అరకిలోమీటర్‌లో రిట్రీట్‌ హౌస్‌ వుంది. దుమ్ము తుఫానును చీల్చుకుంటూ మా వాహనం ఓ చిన్నపాటి చెరువు పక్కనుంచి పాఠశాల భవనంలా వున్న రిట్రీట్‌ హౌస్‌ ముందు ఆగింది. అప్పటికి మూడు గంటలయ్యింది. ఎవరి సామానులు వాళ్ళు మోసుకుంట రెండస్తులు ఎక్కి లోపలికెళితే బోర్డింగ్‌ స్కూల్‌లో వున్నట్లు వరసగా ఓ ఇరవై మంచాలు కనబడ్డాయి. తలో మంచం దగ్గర లగేజ్‌ పెట్టి లంచ్‌ ఏర్పాట్లు ఏమిటా అని అడిగితే ఏమీ లేవు అని తెలిసింది. అందరి బ్యాగుల్లోంచి బిస్కెట్‌ పాకెట్లు, చిక్కీలు, చపాతీలు బయటకొచ్చాయి. అందరం వాటిని షేర్‌ చేసుకుని కబుర్లలో పడ్డాం. ఇరవైమందికి మూడే బాత్‌రమ్‌లున్నాయి. ఎవరెవరు ఎపుడు స్నానాలు చేయాలో జోక్‌లేసుకుంటూ నవ్వుకుంటూ వున్నపుడు ఎవరో వచ్చి మనకోసం రూమ్‌లు కూడా వున్నాయంట అంటూ ప్రకటించారు. మళ్లీ లగేజ్‌మోసుకుంటూ రూమ్‌లున్నవేపు వెళ్ళాం. నేను, కల్పనాశర్మ ఒక రూమ్‌లో సర్దుకున్నాం.


మొబైల్‌ ఫోన్లు మూగనోము పట్టడంతో మెయిన్‌రోడ్డు కెళ్ళి ఎస్‌టిడి ఫోన్‌ చెయాలని కొంతమంది బయలుదేరాం. రోడ్డు మీదకెళ్ళేవరకు మాకు తెలియని విషయం ఒకటుంది. అదే గత నెలరోజులుగా ఇంఫాల్‌లో సాయంత్రం ఐదు నుండి ఉదయం ఐదు వరకు కర్ఫ్యూ వుందని. మేము వెళ్ళేసరికి నాలుగున్నర అయ్యింది. ఇంక అరగంటే టైముంది. ఒకే ఒక్క ఎస్‌.టి.డి. బూత్‌ కనబడింది. ఫోన్లు చేసి, వాటర్‌ బాటిల్స్‌, ఏవో తినుబండారాలు కొనుక్కుని టీ కోసం చూస్తే ఒక్క హోటల్‌ కూడా కనబడలేదు. పోలీసుల విజిల్స్‌ వినబడసాగాయి. హడావుడిగా షాప్‌లు మూసేయసాగారు. ఒకామె టీకోసం మేం పడుతున్న అవస్థ చూసి, ఇంట్లోకి పిలిచి బ్లాక్‌ టీ పెట్టి ఇచ్చింది. పాలు లేవని చెప్పింది. అందరం దుమ్ము లేపుకుంటూ మా బసవేపు నడవసాగాం. తీరా రిట్రీట్‌ హౌస్‌కి చేరేసరికి చిమ్మచీకటి. పవర్‌ కట్‌ అట. కరెంట్‌ ఎపుడొస్తుందో ఎపుడు పోతుందో తెలియదట. చీకటి వల్ల వెన్నెల స్పష్టంగా కనబడుతోంది. చుట్ట పరుచుకున్న కొండల మీద తెల్లగా కురుస్తున్న వెన్నెల. పల్లెటూళ్ళల్లో కరెంట్‌ పోయినపుడు పౌర్ణమి ఎంత అందంగా కనబడుతుందో అష్టమినాటి చంద్రుడు అంత అందంగాను కనబడ్డాడు.


మా అదృష్టం బావుండి రూమ్‌ల్లో చిన్నచిన్న సోలార్‌లైట్‌లు వెలుగుతున్నాయి. ఎనిమిదింటికల్లా డిన్నర్‌కి రమ్మన్నారు. కట్టెలపొయ్యి మీద చికెన్‌ వొండుతుంటే లోపలికెళ్ళి చూసాన్నేను. అపుడే లిల్లీ పరిచయమైంది. రిట్రీట్‌ హౌస్‌లో వంట చేస్తుంది లిల్లీ. కూరల్లో ఉప్పూ కారం అస్సలు లేవు. చికెన్‌ కొంచం బెటర్‌. క్యాబేజ్‌ ఎక్కువగా వాడారు. ఏదో తిన్నామన్పించి ఎనిమిదిన్నరకల్లా రూమ్‌ల్లో పడ్డాం. ఏంచెయ్యలో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు కబుర్లయ్యాయి. ప్రయాణ బడలికతో అందర అలిసిపోయారు. అయినా నిద్దర రావట్లేదు. టీవీల్లేవు. చదువుదామంటే లైట్‌ లేదు. చుట్టూ చిమ్మచీకటి. ఉండుండి వినిపిస్తున్న పోలీసుల విజిల్స్‌. ముసుగేసి పడుకోవడం బెటరన్పించి తొమ్మిదికల్లా మంచమెక్కేసాం. నా రూమ్మేట్‌ కల్పనకి దుమ్మువల్ల బాగా జలుబుచేసి, రాత్రంతా చాలా ఇబ్బంది పడింది.

మర్నాడు ఐదుకల్లా మెలుకువ వచ్చేసింది. తొమ్మిదింటికల్లా రెడీ అవ్వాలని క్రితం రోజు చిత్ర చెప్పింది. ఓ గంటసేపు వాకింగ్‌ కెళితే టైమ్‌పాస్‌ అవుతుందని అనుకుని బూట్లేసుకుని బయటకొస్తే బాగా చలిగా అన్పించింది. అప్పటికే మంజరి, సమీర వాళ్ళు కూడా బయటకొచ్చారు. అందరం కలిసి బయటపడి కనబడుతున్న కొండలవేపు బయలుదేరాం. చల్లగాలిలో నడవడం చాలా హాయిగా వుంది. చిన్నచిన్న ఇళ్ళు. ఎక్కువ భాగం వెదురు తడకలతో కట్టుకున్నవే. మేం నడుస్తూ వెళుతున్నపుడు ఒకామె ఇంటిముందు ఊడుస్తుంటే మాతో వున్న వసంత ఫోటో తియ్యడానికి ప్రయత్నించినపుడు మమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచింది. సన్నగా, సంప్రదాయ మణిపురి దుస్తుల్లో వున్న ఆమె పేరు సోసో. మమ్మల్ని ఎంతో ఆదరంగా పిలిచి, చిన్నచిన్నమోడాలు వేసి కూర్చోమంది. లోపల్నుంచి నలుగురు పిల్లలు వచ్చారు. తన పిల్లలని ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలని చెప్పింది. చక్కటి నవ్వుముఖాలతో, చికిలి కళ్ళతో వున్నారు వాళ్ళు. తన భర్త పొల్ల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడట. వెదురు చాపలతో కట్టిన మూడురూముల ఇల్లు. శుభ్రంగా వుంది. లోపల్నించి కుంపటి తెచ్చి మామధ్య పెట్టి టీ తెస్తానని వెళ్ళింది. మేం పిల్లల ఫోటోలు తియ్యడంలో మునిగాం. ఆమె కొడుకు నవ్వుతుంటే ఎంత ముద్దొచ్చాడో. ఆ పిల్లాడి కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ నవ్వుతుంటాయి. సోసో వేడివేడి టీ తెచ్చి ఇచ్చింది. ఆ చలిలో వెచ్చటి టీ తాగుతూ సోసోతో బోలెడు కబుర్లు చెప్పాం. కర్ఫ్యూ గురించి అడిగితే, నవ్వుతూఅలవాటయిపోయింది అంది. మేము జర్నలిస్ట్‌లమని చెప్పాం. ఆమెకు థాంక్స్‌ చెప్పి బయటపడ్డాం.


తొమ్మిదింటికల్లా అందరం తయరై బస్సులో కూర్చున్నాం. దాదాపు 60 మంది జర్నలిస్టులం అప్పటికి ఇంఫాల్‌ చేరుకున్నాం. ఇంకా రావలసిన వాళ్ళున్నారు. మొదటిరోజు మీటింగ్‌ కాంగ్లా ఫోర్ట్‌ అనే చోట జరుగుతోందని చిత్ర చెప్పింది. మేము కాంగ్లా చేరేసరికి పదయ్యింది. సమావేశాన్ని ప్రారంభించే హాలులో కూర్చున్నాం. మణిపూర్‌ మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ సమావేశాన్ని ప్రారంభించారు. అదే రోజు ''అనుపవ జయరామన్‌'' అవార్డును ప్రదానం చేయడం జరిగింది. చాలా చిన్న వయస్సులో మరణించిన ''అనుపమ'' పేరు మీద ఆమె తల్లిదండ్రులు, జర్నలిస్టుల నెట్‌వర్క్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవార్డును 2008కి గాను అలీఫియ ఖాన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, హిందుస్తాన్‌ టైమ్స్‌, ముంబయ్‌కి ప్రదానం చేసారు.


ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 'అరంబమ్‌ మెంచుబీ' మణిపురి స్త్రీల స్థితిగతుల మీద ఉపన్యసించారు. అరంబమ్‌ నాకు బాగా పరిచయమే. మేమంతా ''స్పారో'' ఏర్పాటు చేసిన జాతీయస్థాయి రచయిత్రుల సమావేశంలో ఐదు రోజులు ఖషీద్‌ (ముంబయి)లో కలిసివున్నాం. నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా పల్కరించింది. అక్కడే వుండే మరో మణిపురి రచయిత్రి బోర్‌కన్య గురించి వాకబుచేస్తే, మర్నాడు తనని తీసుకొస్తానని వాగ్ధానం చేసింది అరంబమ్‌. ఆ తర్వాత మణిపురి వర్కింగ్‌ జర్నలిస్ట్‌లతో మాటామంతి జరిగింది. మణిపురి జర్నలిస్ట్‌లతోమాట్లాడుతున్న సందర్భంలోనే కాంగ్లా గేట్‌ ఉదంతం గురించి, ఆ గేట్‌ ముందు జరిగిన చారిత్రాత్మక మణిపురి స్త్రీల నగ్నప్రదర్శన గురించి మా అందరికీ వివరంగా తెలిసింది. నాలుగున్నర అయ్యేసరికి కర్ఫ్యూ హడావుడి మొదలైంది. మేమంతా హడావుడిగా బస్సెక్కేసాం. అందరూ ఎక్కేసరికి ఆలస్యం అవ్వడంతో కర్ఫ్యూ మొదలైంది. పోలీసులు, ఆర్మీ బెదిరింపుల మధ్య మా బస్సు భయంభయంగా బయలుదేరింది.
కాంగ్లాఫోర్ట్‌, మనోరమాదేవి హత్య :

2004, జులై 11వ తేదీన తన ఇంట్లో నిద్రపోతున్న మనోరమాదేవి అనే మహిళను అర్ధరాత్రి అస్సామ్‌ రైఫిల్స్‌ అరెస్ట్‌ చేసి తీసుకెళ్ళారు. తీవ్రవాది అనే అనుమానంతో ఆమెను అరెస్ట్‌ చేసారు. కొన్ని గంటల తర్వాత చిత్రహింసలకు గురిచేయబడి, ఒళ్ళంతా గాట్లు, కమిలిపోయిన శరీరభాగాలతో, సామూహిక అత్యాచారానికి గురైన మనోరమ శవం రోడ్డుమీద దర్శనమిచ్చింది.


ఈ సంఘటన మణిపూర్‌ స్త్రీలను తీవ్రంగా కలిచివేసింది. 12 మంది ''మైరా ఫెయిబి'' సంస్థకు చెందిన మణిపూరి స్త్రీలు ''ఇండియన్‌ ఆర్మి రేప్‌ అజ్‌'' అనే బేనర్‌తో పబ్లిక్‌ ప్రదేశంలో, కాంగ్లా గేటు ముందు నగ్నప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన దేశం మొత్తాన్నీ నివ్వెరపరిచి మణిపూర్‌లో ఏం జరుగుతుందో అర్థం చేయించింది. మనోరమ హత్యానంతరం కొన్ని నెలలపాటు మణిపూర్‌ మండిపోయింది. కమీషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ వేసారు గానీ ఈ రోజుకీ ఆ రిపోర్ట్‌ బయటకు రాలేదు. స్త్రీల నగ్నప్రదర్శనానంతర ఉద్యమం వల్ల అస్సామ్‌ రైఫిల్స్‌కీ, ఆర్మీకి కేంద్ర స్థావరంగా వున్న కాంగ్లా ప్రాంతాన్ని ఖాళీ చేయించి, సివిల్‌ అధికారులకు అప్పచెప్పడం జరిగింది.


మేము బస్సులో మంత్రిపుక్రికి ప్రయాణం చేస్తున్నపుడు కాంగ్లా గేట్‌ ఉదంతం గురించి విన్నాం. మనోరమని తలుచుకుని కన్నీళ్ళ పర్యంతమయ్యామ్. తోటి స్త్రీకి జరిగిన అన్యాయన్ని ప్రశ్నిస్తూ నగ్నప్రదర్శనలాంటి తీవ్రచర్యతో తమ నిరసనను వ్యక్తం చేసిన పన్నెండుమంది మణిపురి స్త్రీలకు పాదాభివందనం చెయ్యాలన్పించింది. బస్సు మా బస దగ్గరికి దుమ్ములేపుకుంట వచ్చింది. అప్పటికే చీకటి పడింది. కరెంట్‌ లేదు. దూరంగా కొండలమీద మిణుకు మిణుకుమటూ వెలుగుతున్న దీపాలు. పిండారబోసినట్లు నవమి వెన్నెల. ''కొండలపైనా, కోనలలోనా గోగులుపూచే జాబిలి'' అని పాడుకుంటూ ఆ చీకట్లో చేసే పనేంలేక బయటే కూర్చుండిపోయం. చాలాసేపు కాంగ్లా గేట్‌ ఉదంతం మా మాటల్లో నలిగింది. డిన్నర్‌ అయ్యాక కొంతమందిమి ఒక గదిలో చేరి పాటలు పాడే కార్యక్రమం మొదలుపెట్టాం. బెంగుళూరు నుండి వచ్చిన వాసంతి రేష్మా 'చార్‌ దినోంకా' పాటని అద్భుతంగా పాడింది. అన్ని భాషల వాళ్ళు తలో పాటా అందుకుని హైపిచ్‌లో పాడుతూ, అల్లరి చేస్తుంటే రిట్రీట్‌ ఫాదర్‌ పాల్‌ వచ్చి నిశ్శబ్దంగా వుండాలని తొమ్మిది అవుతోంది, లైటు తీసేయాలని హుకుం జారీచేసాడు. బతుకుజీవుడా తొమ్మిదికే పడుకోవాలా అనుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్ళం ముడుచుకుపోయామ్. ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. కలల్లో కాంగ్లా గేట్‌, నగ్నస్త్రీలు కలవరపరిచారు. మనసు కలిచివేసి నట్లయింది.
మర్నాడు ఉదయమే ఆంధ్రా బ్యాచ్‌ ఎదురుగావున్న కొండ ఎక్కాలని బయలుదేరాం. నేను, వనజ, మంజరి, శ్యామల, సమీర, వసంత, అనూరాధ, వనజారెడ్డి అందరం హుషారుగా కొండెక్కుతున్నాం. కిందినుంచి చూస్తే కొండమీద ఏమీ కనబడలేదు గాని మేముపైకి వెళుతుంటే ఓ ఇల్లు కనబడింది. దానిపక్కనే ఓ గెష్ట్‌హౌస్‌ లాంటిది కనబడింది. కొండమీదికి వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లోని కుటుంబమంతా ఉదయపు ప్రార్థనలో వున్నారు. మేం నిశ్శబ్దంగా నిలబడ్డాం. కొంతసేపటికి ప్రార్థన ముగించి ఒకాయన మాదగ్గరకొచ్చాడు. మేం ఫలానా అని చెప్పాం. తన పేరు అనమ్‌ అని, ఆ కొండపేరు ఖదిమ్‌ కొండ అని చెబుతూ ఖదిమ్‌ అనే అతను అక్కడ వుండేవాడని, ఈ గెష్ట్‌హౌస్‌ వాళ్లదేనని, తాను వాచ్‌మెన్‌నని చెప్పాడు. ఆ పక్కనే వున్న ఖదిమ్‌ భార్య సమాధినిచూపించాడు. మా ఎనిమిదిమందికి పొగలు కక్కే టీ తీసుకొచ్చి ఇచ్చింది అతని కూతురు. టీ తాగి అతని ఇంట్లోకి వెళ్ళాం. చిన్న ఇల్లు. అనమ్‌, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు వుంటున్నారు. ఆవులు, బాతులు పెంచుతున్నారు. మేం శెలవు తీసుకుని బయలుదేరబోతుంటే 'ఆప్‌ లోగ్‌ ఫిర్‌ ఆయియే' అంటూ ఆదరంగా చెప్పాడు అనమ్‌. మణిపూర్‌ వాస్తవ్యులు కొత్తవ్యక్తులతో కూడా చాలా ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడ్డం గమనించాం. సోసో, అనమ్‌ కుటుంబం మాకు బాగా గుర్తుండిపోయారు.


తొమ్మిదిన్నరకి రెండోరోజు సమావేశం మొదలైంది. నెట్‌వర్క్‌ సమావేశాలకు హాజరైన సభ్యుల పరిచయాలయ్యయి. అంతకుముందురోజు మధ్యాహ్నానికి ఇంఫాల్‌ చేరిన 'నవోదయం' సభ్యులు తమని తాము పరిచయం చేసుకున్నపుడు సభ్యులందరూ కరతాళధ్వనులతో వారిని ఆహ్వానించారు. చిత్తరుకు చెందిన ఈ గ్రామీణస్త్రీలు ఎంతో ప్రతిభావంతంగా తామే ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా పనిచేస్తూ నడుపుతున్న పత్రిక నవోదయం. స్వయంసహాయక బృందాలకు చెందిన ఈ పత్రిక చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. ఆ టీమ్‌ సభ్యులు ప్రతి సంవత్సరం మహిళా జర్నలిస్ట్‌ల నెట్‌వర్క్‌ సమావేశాలకు హాజరవుతారు.


పరస్పర పరిచయలయ్యక నెట్‌వర్క్‌ గురించి, వెబ్‌సైట్‌ గురించి చర్చ జరిగింది. జాతీయస్థాయిలో మహిళా జర్నలిస్ట్‌్‌ల నెట్‌వర్క్‌ను రిజిష్టర్‌ చేయలా వద్దా అనే అంశం మీద వేడైన వాడైన చర్చ జరిగింది. కొంతమంది రిజిష్టర్‌ చేస్తే బావుంటుందని వాదిస్తే మరికొందరు నెట్‌వర్క్‌ అందం అంతా రిజిష్టర్‌ చెయ్యకుండా, ఏలాంటి హెచ్చుతగ్గుల స్థాయిలు లేకపోవడంలోనే వుందని వాదించారు. అయితే ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్‌ వైపు మొగ్గుచపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కల్పనాశర్మ చర్చను ముగిస్తూ దీనిమీద తొందరపడడం మంచిది కాదని మరింత చర్చ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పింది.


ఆ తర్వాత మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలు ఇచ్చారు. హ్యూమన్‌ రైట్స్‌ అలర్ట్‌ అనే సంస్థ నుండి బబ్లూ లైటోంగ్‌బామ్‌ చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. సభ్యులందరూనిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని విన్నారు. మణిపూర్‌లో తిరుగుబాటు నేపథ్యాన్ని గురించి ప్రస్తుతం ఎన్ని గ్రపులు అండర్‌గ్రౌండ్‌లో వుండి పోరాటం చేస్తున్నదీ వివరించారు. నాగాలు, కుకీలు, మైతేయులు, వైష్ణవులు, ముస్లిమ్‌ల గురించి వివరించాడు బబ్లూ. భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి మణిపూర్‌ రాచరికంలో వుందని, ఆగష్టు 14, 1947 రోజు అంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన ఒకరోజుముందే నాగా నేషనల్‌ కౌన్సిల్‌ బ్రిటీష్‌ రాజ్యం నుండి తాము స్వతంత్య్రాన్ని పొందినట్టు ప్రకటించుకున్నారు. అయితే స్వాతంత్య్రానంతరం ఇండియన్‌ గవర్నమెంట్‌ బలవంతంగా మణిపూర్‌ను ఇండియాలో విలీనం చెయ్యడాన్ని జీర్ణించుకోలేని అనేక గ్రపులు తిరుగుబాటు బాట పట్టాయి. ఈ తిరుగుబాట్లను అణిచివేసే నెపంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరమైన చట్టాలను తెచ్చాయి. అనేక గ్రూపులు చేస్తున్న ఈ తిరుగుబాట్లను లా అండ్‌ ఆర్డర్‌ సమస్యగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప వారి ఆత్మగౌరవ పోరాటాలుగా గుర్తించడం లేదు. ఈ తిరుగుబాట్లను అణచడానికి ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్‌ ఏక్ట్‌ 1958ని తీసుకొచ్చారు. సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేసి, మణిపూరీ ప్రజల మాన, ప్రాణాలను ఈ చట్టం హరిస్తోందని బబ్లూ వివరించారు. ఎన్నో దేశీయ గ్రూప్‌లు భారత ప్రభుత్వంతో పోరాడుతున్నాయని, ఆర్మీ, అస్సామ్‌ రైఫిల్స్‌కి చెందిన సాయుధులు ప్రజలను ఊచకోత కోస్తున్నారని బబ్లూ వివరించాడు.


బబ్లూ తర్వాత 'నాగా వుమన్‌ యూనియన్‌'కి చెందిన గ్రేస్‌ ఫట్‌సంగ్‌ నాగా స్త్రీల ఉద్యమం గురించి చెప్పారు. ఆమె ప్రసంగం తర్వాత డా: ఎస్‌. చోంగ్లాయ్‌మానవహక్కుల కోసం 'కుకి'లు చేస్తున్న పోరాటం గురించి ప్రసంగించారు. 1919లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాటం చేసిన, ఒకప్పుడు ''ఇండిపెండెంట్‌, హిల్‌, కంట్రీని'' ఏలిన దేశీయ ప్రజలైన 'కుకీ'లు ఈ రోజు అత్యంత దయనీయంగా బతుకుతున్నారని చోంగ్లోయ్‌ వివరించారు.


వీరి ప్రసంగాలు చాలా ఆసక్తిదాయకంగా సాగి, మణిపూర్‌ చరిత్ర పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ మంచి చర్చను లేవనెత్తాయి.

ఆ తర్వాత ''వుమన్‌ విడోడ్‌ బై కాన్‌ప్లిక్ట్‌ ఇన్‌ మణిపూర్‌'' పేరుతో అంజులిక తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ చూపించారు. సైన్యం విచక్షణారహితంగా కాల్చేసిన కుటుంబాల స్థితిగతులు, అతిచిన్న వయస్సుల్లో భర్తల్ని పోగొట్టుకుని విధవలైన స్త్రీలు హృదయవిదారకంగా రోదిస్త కాల్పుల నేపథ్యాలను వివరించినపుడు అందరం కదిలిపోయామ్. నలుగురు నుంచి ఐదుగురు పిల్లలతో భర్తల్ని పోగొట్టుకున్న ఆ స్త్రీల జీవితాల్లోని విషాదం చూస్తూ కన్నీళ్ళ పర్యంతమైనాం అందరం. అన్నిటికన్నా అత్యంత దుఃఖాన్ని నింపిన సన్నివేశం మిలిటెంట్‌ గ్రూప్‌ చేతుల్లో హత్యకు గురైన అంజులిక సోదరుడి భార్య ప్రసంగం. ప్రస్తుత ఇంఫాల్‌ కర్ఫ్యూకి కారణమైన దింగనమ్‌ కిషన్‌, (మణిపురి సివిల్‌ సర్వీస్‌కి చెందిన యువ అధికారి) దారుణహత్య. ఫిబ్రవరి 13న కిషన్‌ని, అతని డ్రైవర్‌ని, అంగరక్షకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళి హత్య చేసారు. శోకదినాలను పాటిస్తూ తెల్లవస్త్రాలను ధరించి కిషన్‌ భార్య నెట్‌వర్క్‌ సమావేశాలకు వచ్చి జరిగిన దారుణాన్ని వివరించినపుడు మేమంతా దుఃఖాన్ని ఆపుకోలేకపోయామ్. అందంగా, అమాయకంగా, పుట్టెడు దుఃఖంలో వున్న ఆమె ముఖం ఈ రోజుకీ కళ్ళల్లోంచి పోకుండా కలవరపెడుతూనే వుంది.

లంచ్‌ తర్వాత ఆరుబయట మణిపురీ నృత్యప్రదర్శన ఏర్పాటుచేశారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి అద్భుతంగా నృత్యం చేసారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనను కూడా తిలకించిన తర్వాత మనం ఇపుడు ఇమా మార్కెట్ చూడ్డానికి వెళుతున్నామని, త్వరగా వెళ్ళి, కర్ఫ్యూ సమయానికి తిరిగి వచ్చెయ్యాలని అంజులిక ప్రకటించడంతో అందరం హడావుడిగా బస్సెక్కేసాం. కాంగ్లా గేట్‌కి ఎదురుగా, కిటకిటలాడుతున్న మార్కెట్‌ దగ్గర బస్సు ఆగింది. అప్పటికి టైమ్‌ నాలుగుంబావు అయ్యింది. బ్యాచ్‌లుగా విడిపోయి ఒక్కో బ్యాచ్‌కి ఒక్కో మణిపూరీ అమ్మాయి తోడురాగా మార్కెట్‌ వేపు వెళ్ళాం.మార్కెట్‌ యమ రద్దీగా వుంది. లోపలికెళ్ళినపుడు అక్కడున్న షెడ్‌లలో బారులుతీరి కూర్చున్న మణిపురీ స్త్రీలు వివిధ వ్యాపారాలు చేస్త కనబడ్డారు. అక్కడ దాదాపు 3000 మంది స్త్రీలు ప్రతిరోజూ వ్యాపారం చేస్తారని తెలిసింది. ఆ మార్కెట్‌ ఎప్పుడు మొదలైందనే దానికి స్పష్టమైన సమాధానం దొరకలేదు. అక్కడ వ్యాపారులందరూ ఆడవాళ్ళే. అదీ మధ్యవయస్సులో వున్నవాళ్ళు, అరవై దాటివాళ్ళు ఉన్నారు.తల్లుల మార్ఖెట్ అనే దీనికి పేరు. బట్టలు, వివిధ వస్తువులు, కూరగాయలు, చేపలు ఒకటేమిటి ఎన్నో అమ్ముతుంటారు. ఎక్కువగా వివిధ రంగుల్లో మణిపురీ చేనేత దుస్తులు కన్పించాయి. ఈమార్కెట్‌ పేరు 'ఇమా' బజార్‌. అక్కడ కొనుక్కునే పురుషులు తప్ప అమ్మే పురుషులుండరు.


మేమంతా తలోదిక్కు వెళ్ళిపోయామ్. అందరూ మణిపురి సంప్రదాయ లుంగీలు, షాల్‌లు కొన్నారు. ఎంతో హడావుడిగా అమ్మేవాళ్ళు అమ్ముతూ, సర్దుకునేవాళ్ళు సర్దుకుంటున్నారు. పిలిచి పిలిచి అమ్ముతున్నారు. కర్ఫ్యూ టైమ్‌ అయిపోతోంది. ఒక ముసలామె గంప నిండా వంకాయరంగు కలువపూలు తెస్తూ కనబడింది. నేను, మంజరి మూడేసి కట్టల పువ్వులు కొనేసాం. మాకు తోడుగా వచ్చినవాళ్ళు ఇంక పోదాం అంటూ కంగారుపెట్టసాగారు. మార్కెట్‌ వొదిలి రావాలని ఎవ్వరికీి లేదు. సరదాగా అట ఇట తిరుగుతూ ఆ స్త్రీలను పల్కరించాలని వాళ్ళతో మాట్లాడాలని వున్నా గాని, పోలీసుల విజిల్స్‌, సాయుధ సైనికులు తుపాకులెక్కుపెట్టి తిరుగుతున్న జిప్సీ వాహనాలు అందరినీ టెన్షన్‌ పెట్టేసాయి.మార్కెట్‌ కూడా చాలావరకు మూసేసారు. మేమంతా కంగారు కంగారుగా మా బస్సు ఆగివున్న చోటుకి పరుగులుపెట్టేం. ప్రతి ఒక్కరూ, ఏదో ఒక వాహనం పట్టుకుని, కిటకిటలాడే ఆటోలెక్కి ఇళ్ళకు వెళ్ళిపోసాగారు. బిజినెస్‌ ఊపందుకునే సాయంత్రం వేళ పాపం! ఆ మహిళలంతా దుకాణాలు మూసేసి ఇళ్ళకు వెళ్ళిపోవడం అదీ ఎంతో టెన్షన్‌గా వెళ్ళడం చాలా బాధన్పించింది. ఇళ్ళకెళ్ళాక మాత్రం ఏముంటుంది? కరెంట్‌ లేని చీకటి ఇళ్ళు మాత్రమే వాళ్ళకోసం ఎదురుచూస్తాయి. బహుశా సైన్యం ఇనుపబూట్ల చప్పుళ్ళే వాళ్ళకి వినోదమేమో! అంతకు మించిన చప్పుళ్ళు ఆ కర్ఫ్యూవేళ ఇంకేముంటాయి?


మా బస్సు వేగంగా మమ్మల్ని తెచ్చి రిట్రీట్‌ హౌస్‌లో దింపేసింది. అప్పటికి ఐదున్నర అయ్యింది. మార్కెట్‌ దగ్గర ఫోన్‌ చేద్దామని ప్రయత్నించినా ఎక్కడా ఎస్‌టిడి బూత్‌ కనబడలేదు. నేను మెయిన్‌రోడ్డు మీదకెళుతున్నా ఎవరైనా వస్తారా అంటే మంజరి నేను కూడా వస్తానంది. శ్యామల కూడా మాతో బయలుదేరింది. ఎస్‌టిడిబూత్‌ వుంటుందనే ఆశతో ఆ చీకట్లో బయలుదేరాం. కరెంటు లేకపోవడం వల్ల వెన్నెల తెల్లగా మెరుస్తోంది. మాకు ఒక మిలిటరీ జీప్‌ ఎదురొచ్చింది. మేం పక్కకు జరిగి నిలబడ్డాం. దుమ్ము లేపుకుంట వెళ్ళిపోయింది. కొంతమంది స్త్రీలు గుడ్డిదీపాలు పెట్టుకొని కూరగాయలు, చేపలు అమ్ముకుంటున్నారు. షాపులన్నీ మూసేసారు. వాటర్‌ బాటిల్స్‌ కొందామంటే దొరకలేదు. మేము అంతకుముందురోజు మాట్లాడిన ఎస్‌టిడిబూత్‌ మూసేసి వుంది. అర్జంటుగామాట్లాడాలి ఎలా? అనుకుంటూ అక్కడ నిలబడిన ఒకాయన్ని ఇక్కడ ఇంకో ఎస్‌టిడి బూత్‌ వుందా అని హిందీలో అడిగాం. మా వేపు ఎగాదిగా చూసి ఆ ప్రాంతానికి కొత్తవాళ్ళమని అర్థం చేసుకుని 'ఆయీయే' అంటూ రోడ్డు మీదకు దారితీసాడు. మెయిన్‌రోడ్డంతా చీకటిగా, నిర్మానుష్యంగా వుంది. ఒక షాప్‌ ముందాగి తలుపు మీద కొడితే ఆ తలుపు ఓరగా తెరుచుకుంది. లోపల ఫోన్‌ వుంది. ముగ్గురం లోపలికెళ్ళగానే ఆ షాపతను తలుపు మూసేసాడు. తనివితీరా ఫోన్‌లో మాట్లాడి, మిత్రులకి ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నామో చెప్పేసరికి వాళ్ళు కంగారుపడ్డారు. నా మిత్రురాలు ఒకామె అయితే నన్ను చివాట్లేసింది. అలాంటి ప్రమాదకర పరిస్థితులున్నచోట ఎడ్వంచర్లేమిటని కేకలేసింది.


షాపతనికి డబ్బులిచ్చేసి మొత్తంగా నిర్మానుష్యంగా మారిన రోడ్ల మీద నడుస్తూ, ఇంఫాల్‌ ప్రజల ముఖ్యంగా స్త్రీల కష్టాలకు బాధపడుతూ,


ఇలా ఎన్నాళ్ళు కర్ఫ్యూనడుస్తుందా, జనం ఇలా ఎంతకాలం భరించాలా అని చర్చించుకుంటూ మా బసకు చేరాం.


మర్నాడు తొమ్మిదిన్నరకే మీటింగ్‌ మొదలైంది. నెట్‌వర్క్‌కి సంబంధించిన కార్యకలాపాల గురించి, వచ్చే సమావేశం ఎక్కడ నిర్వహించాలి అనే అంశం గురించి చర్చ జరిగింది. మేము నిర్వహిస్తాం అంటూ కేరళ బృందం ముందుకు రావడంతో నిర్వహణకు అవసరమైన వనరుల మీద, ఆ వనరుల్ని ఎలా సేకరించాలి అనే దానిమీద వాదోపవాదాలు జరిగాయి. బెంగుళూరుగ్రూప్‌ 'అనుపమ జయరామన్‌' అవార్డు నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చకు పెట్టారు. చాలా సీరియస్‌గా అందరం చర్చలో మునిగివున్న వేళ అంజులిక హఠాత్తుగా ఒక ప్రకటన చేసింది. ఇరామ్‌ షర్మిల ఆ రోజు విడుదల కాబోతోందని, మనమంతా ఇపుడు ఆమెను బంధించి వుంచిన ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పడంతో అక్కడంతా ఒక ఉత్కంఠ నెలకొంది. నేను ఇంఫాల్‌కి వచ్చిన రోజే షర్మిలను కలిసే వీలుందా అని చిత్రని అడిగితే చాలా కష్టం అని చెప్పింది. రెండు సంవత్సరాల క్రితమే ''మణిపుర్ ఉక్కు మహిళ ఇరామ్‌ షర్మిల'' అని నేనుభూమికలో సంపాదకీయం రాసాను. ఆమె ధైర్యం, సాహసం ఎంతో స్ఫర్తిదాయకమైనవి. అలాంటి షర్మిలను కలుసుకునే అవకాశం రావడం అందరిలోను ఉద్వేగాన్ని రేపింది.

లంచ్‌ తిన్నామనిపించి అందరం బస్సులో ఎక్కేసాం. ఓ అరగంట ప్రయణం తర్వాత మేము షర్మిల విడుదల కోసం రిలే నిరాహారదీక్షలు చేస్తున్న శిబిరం దగ్గర దిగాం. అప్పటికి 88 రోజులుగా మణిపురి స్త్రీలు రిలే నిరసనదీక్షలు చేస్తున్నారు. మేము కూడా శిబిరంలో కూర్చున్నాం.
అద్భుత సాహసమూర్తి ఇరాం షర్మిల

ఇరామ్‌ షర్మిల సామాజిక కార్యకర్తగా పనిచేసేది. భద్రతాదళాల చేతుల్లో హత్యలకు, అత్యాచారాలకు బలైన స్త్రీల కన్నీటికథనాలను వినేది. శాంతియత్రల్లో పాల్గొనేది. 2000 సంవత్సరం నవంబరు 2న 'మాలోమ్‌' పట్టణంలోని బస్టాండులో అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధులు పదిమంది పౌరులను కాల్చి చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిల తీవ్రంగా చలించిపోయింది. అంతకుముందు మణిపురి తిరుగుబాటుదారులు భద్రతాదళాల వాహనాలపై దాడిచేసినందుకు ప్రతీకారంగా అస్సామ్‌ రైఫిల్స్‌ ఈ దురాగతానికి దిగింది. 'మాలోమ్‌' పట్టణం ఇంఫాల్‌కి పదిహేను కిలోమీటర్ల దూరంలో వుంది. షర్మిల ఈ సంఘటన జరగడానికి ముందే ఒక శాంతియత్రా నిర్వహణ కోసం మాలోమ్‌కి వచ్చి వుంది. ఆమె మాలోమ్‌లో వున్నపుడే ఈ దారుణ సంఘటన జరగడంతో, శాంతి ర్యాలీ ఆలోచనను విరమించుకుని అంతకంటే తీవ్రమైన కార్యాచరణకి పూనుకోవాలని నిర్ణయించుకుంది. భద్రతాదళాలకు విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టిన Armed Forces Special Powers Act, 1958 (AFSPA) ని రద్దుచేయలంట ఆమరణ నిరాహారదీక్షకు దిగాలనే తీవ్ర నిర్ణయన్ని ఇరామ్‌ షర్మిల తీసుకుని తల్లితో చెప్పినపుడు ఆమె గట్టిగా వ్యతిరేకించి షర్మిలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. షర్మిల తన నిర్ణయానికే కట్టుబడడంతో తల్లి కఠినాతికఠినమైన నియమం పెట్టింది. షర్మిల తను మొదలుపెట్టిన కార్యంలో విజయం సాధించేవరకు తన ముఖం చూపించవద్దని నియమం పెట్టడంతో షర్మిల ఒప్పుకుని తన ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది. నవంబర్‌ 11, 2000లో షర్మిల ప్రారంభించిన ఈ దీక్ష తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతూనే వుంది.


అమరణ నిరాహార దీక్షలో వున్న షర్మిలను ఆత్మహత్యా నేరం కింద ప్రభుత్వం అరెష్ట్‌ చేసి బలవంతంగా ముక్కుల్లోంచి ట్యూబ్‌లేసి, ద్రవాహారం పంపిస్తూ జె.ఎన్‌, ఆసుపత్రిలోని ఎంతో భద్రత కల్గిన వార్డులో బంధించి వుంచింది. ఈ నేరం కింద ఒక్క సంవత్సరమే ఖైదీలో వుంచే వీలుండడంవల్ల, ప్రతి సంవత్సరం ఒక రోజు విడుదల చేసి షర్మిల ఆహారం తీసుకోదు కాబట్టి మళ్ళీ అరెస్ట్‌ చేయడం ఎనిమిదేళ్ళుగా ఒక ''తన్తు''లాగా నడుస్తోంది. మేము ఇంఫాల్‌లో వున్నపుడే మార్చి 7న ఆమెను విడుదల చేసి, మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినం రోజున అరెస్ట్‌ చేసి ఆసుపత్రి వార్డులో బంధించారు.


"షర్మిల కంబ లప్‌" పేరుతో ''మైరా పెయిబి'' స్త్రీలు ఆమెకు సహకరిస్తున్నారు. మణిపూర్‌ లోయలో ఈ మైరాపెయిబి స్త్రీలు అట్టడుగు స్థాయినించి సాంప్రదాయక స్త్రీల సంఘాలుగా ఏర్పడి పనిచేస్తుంటారు. చారిత్రకంగా తీసుకుంటే ఈ మైరాపెయిబీ స్త్రీలు బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగివున్నారు. అలాగే మణిపూర్‌లో తాగుడు వ్యసనానికి, డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది కూడా వీరే. అతిబలమైన సాయుధ దళాలను ధిక్కరిస్తూ వనవ హక్కుల ఉద్యమాన్ని నడుపుతున్నది కూడా మైరాపెయిబీ స్త్రీలే నన్నది నగ్నసత్యం. ప్రస్తుతం షర్మిల ఆమరణదీక్షకు మద్దతునిస్తున్నవాళ్ళు వీళ్ళే.


2006లో షర్మిల విడుదలైనప్పుడు, ఆమె తన సోదరుడు, మరో ఇద్దరు కార్యకర్తలతో ఢిల్లీకి వెళ్ళి జంతర్‌మంతర్‌ దగ్గర రోడ్డు మీద తన దీక్షను ప్రారంభించింది. పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్‌ చేసి ఆలిండియా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో వుంచి ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారాన్ని పంపి ఆమె దీక్షని భగ్నం చేసారు. ఆ తర్వాత షర్మిలను ఇంఫాల్‌ తీసుకెళ్ళి జవహర్‌లాల్‌నెహ్రూ హాస్పిటల్‌లో నిర్బంధించారు. ఆమెని ప్రతి సంవత్సరం విడుదల చేసి, ఆమె తన దీక్షను కొనసాగించడంతో, ఆమెపై ఆత్మహత్యానేరం వెపి మళ్ళీ మళ్ళీ నిర్బంధిస్తూనే వున్నారు.మార్చి ఎనిమిదిన ఆమెను తిరిగి అరెస్ట్ చేసారు.


2009లో మేము ఇంఫాల్‌లో వున్నపుడు మార్చి 7న ఆమెను విడుదల చేసారు. ఆమె దీక్షకు మద్దతుగా మైరాపెయిబీ స్త్రీలు చేపట్టిన నిరసన శిబిరంలో మేము కూర్చుని వున్నపుడే మరో పదిహేను నిముషాల్లో షర్మిలను విడుదల చేస్తారనే సమాచారం వచ్చింది. మేమందరం శిబిరంలోంచి బయలుదేరి ఆసుపత్రికి కాలినడకనే చేరుకున్నాం. అప్పటికి సమయం మూడు కావస్తోంది. మేము వెళ్ళేసరికే అక్కడ పెద్దఎత్తున మీడియాకు చెందిన వాళ్ళు, స్త్రీలు, మైరాపెయిబికీ చెందిన కార్యకర్తలు గుమిగూడారు. షర్మిలను నిర్బంధించిన హై సెక్యూరిటీ వార్డు ముందు మేమంతా నిలబడ్డాం. ఎవరెవరో వస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. లోపలున్న పోలీసులు మాటిమాటికీ తలుపులు తీసి బయటకు తొంగిచూసి మళ్ళీ తలుపులు మూస్తున్నారు. 70 సంవత్సరాలు పైబడిన మైరాపెయిబీకీ చెందిన వృద్ధ స్త్రీలు చాలా ఓపికగా వార్డు మెట్ల మీద కూర్చుని షర్మిల కోసం ఎదురుచస్తున్నారు. 78 సంవత్సరాల కె.తరుణి అనే స్త్రీమాట్లాడుతూ అప్సని (AFSPA) రద్దుచెయ్యలి. షర్మిలని కాపాడాలి. ఈ దుర్మార్గ చట్టాన్ని రద్దుచెయ్యకపోతే మేము ఈసారి ఎవ్వరికీ ఓట్లు వెయ్యం. జరిగింది చాలు అంటూ దృఢమైన కంఠంతో చెప్పినపుడు ఆ వయస్సులో ఆమె కన్పరిచిన నిబద్ధత మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అలాంటి స్త్రీలు చాలామంది అక్కడ గుమిగూడి వున్నారు. వారంతా షర్మిల విడుదల కోసం 88 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు.

మాలో ఉత్కంఠ పెరగసాగింది. అక్కడ కూర్చునే చోటు లేదు. నిలబడ్డం కూడా కష్టంగానే వుంది. సమయం గడుస్తున్నకొద్దీ కర్ఫ్యూ భతం భయపెట్టసాగింది. నాలుగున్నర అయ్యింది. నిలబడి నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. ఇంకో అరగంటలో కర్ఫ్యూ పెట్టేస్తారు. వార్డు లోపల్నుంచి పోలీసులు బయటకు వస్తున్నారు. తొంగి చూస్తున్నారు. గ్రిల్‌ చప్పుడైనప్పుడల్లా మా కళ్ళు గ్రిల్‌కు అతుక్కు పోతున్నాయి. ఐదు కావస్తోంది. మేము షర్మిలను చూడలేమేమో ననే సందేహం పీడించసాగింది. సరిగ్గా ఆ సమయంలో ఎవరో బిగ్గరగా ప్రకటించారు. ఆ రోజు కర్ఫ్యూ 7 గంటల వరకు పొడిగించారని. హమ్మయ్య అనుకుంటూ మళ్ళీ గ్రిల్‌ గేట్‌ చప్పుడు కోసం ఎదురుచడసాగాం.

5.30 అయ్యింది. వార్డు రూమ్‌ తెరుచుకుంది. గ్రిల్‌ గేట్‌ కూడా తెరిచారు. సూర్యుడు అస్తమించేవేళ, ఆ చిరుచీకట్లో వెలుగురేఖలా షర్మిల చాలా మెల్లగా అడుగులేస్తూ వస్తూ కనబడింది. తెల్లగా పాలిపోయిన ముఖం. ఒక్కసారిగా వెలిగిన మీడియా ఫ్లాష్‌లైట్లను తట్టుకోలేక కళ్ళు మూసుకున్న షర్మిల కనబడింది. సంప్రదాయ మణిపురి దుస్తుల్లో, భుజాల చుట్టు గులాబీ రంగు షాల్‌ చుట్టుకుని కళ్ళు మూసుకుని బయటకు వచ్చిన షర్మిలనుచూసి కొంతమంది చప్పట్లు కొట్టారు. కొంతమంది స్త్రీలు బిగ్గరగా ఏడ్చారు.


'మైరాపెయిబి' స్త్రీలు ఆమెకు రక్షణ కవచంలా ఏర్పడి, ఆమెను పసిపాపను పొదువుకున్నట్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. షర్మిల నిలబడడానికి కూడా శక్తి లేక తల వాల్చేస్తూ ఆ స్త్రీల చేతుల ఆసరాతో నడిచి మీడియా ముందుకొచ్చింది. నేను షర్మిలా పక్కనే వుండడంతో ఆమెను అతిదగ్గరగా పరిశీలించగలిగాను. తొమ్మిది సంవత్సరాలుగా నోటితో ఘనపదార్ధం ఏమీ తినకుండా మణిపూరి ప్రజల కోసం, AFSPA 1958 చట్టం రద్దు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న 35 సంవత్సరాల షర్మిలను అతిసమీపంగా చూసినపుడు నా గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడంతో పాటు, ఆమె వజ్రసంకల్పం ముందు నా శిరస్సు వాలిపోయింది. పోరాట పటిమ, దృఢ సంకల్పం, ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధంగా వున్న ఆ స్త్రీ మూర్తి ముందుమోకరిల్లాలన్పించింది.


చాలా బలహీనంగా వున్నప్పటికీ్ ఆమె ఏ వాహనంలోను ఎక్కకుండా, స్త్రీల సమూహంతో కలిసి అక్కడికి 500 మీటర్ల దరంలో వున్న నిరాహారదీక్షా శిబిరం వరకు నడవసాగింది. ఆమె వెంట మేమంతా, దాదాపు 70 మంది వివిధ భాషలకు చెందిన జర్నలిస్ట్‌లం నడిచాం. శిబిరం దగ్గరకు చేరగానే ఆమె కోసం పరుపు సిద్ధం చేసి కూర్చోబెట్టారు. ఆమె కాళ్ళకు మేజోళ్ళు తొడిగారు. ఆమె మెడను నిలపలేకపోతోంది. ఆమె శరీరం అటు ఇటు ఊగిపోతోంది. అక్కడ చేరిన అసంఖ్యాక మీడియా పదేపదే కోరగా ఆమె గళం విప్పింది. మెత్తగా, పీలగా ఆమె గొంతు విన్పించసాగింది. "నాకోసం ఎదురుచస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు తెలపడానికి నాదగ్గర సరైనమాటలు లేవు. మీరు నాకు మరింత ధైర్యాన్నిచ్చారు. మణిపూర్‌ నుండి AFSPA 1958 చట్టాన్ని రద్దుచేసేవరకు నేను ఈ నిరాహారదీక్షని కొనసాగించదలిచాను. ఇమాస్‌ తో కలిసి ప్రచారాన్ని సాగిస్తానని చెప్పింది. షర్మిల మెల్లగా, స్పష్టంగా మాట్లాడుతూ ''ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళాదినాన్ని జరుపుకుంటుంటే, ఇక్కడ మణిపూర్‌లో సారవంతమైన భూములతో, అపారమైన వనరులతో, చల్లటి గాలులు వీచే చోట, ప్రజలు ఎంతో స్నేహసుహృద్భావాలతో పల్కరించే చోట స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు, అణిచివేత బయట ప్రపంచానికి తెలియవు.'' అన్నప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ''నేను మాఅమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చూడకుండానే ఇంతకాలం వున్నాను. తనకి చాలా అనారోగ్యం చేసినపుడు కూడా చూడాలంటే భయమన్పించింది. నువ్వెందుకు వచ్చావు. నన్నుచూడొద్దన్నాను కదా అంటుందేమోనని ఆమె వున్న ఆసుపత్రి వార్డు ముందు ఎంతోసేపు తచ్చాడాను.'' అన్నప్పుడు అక్కడున్న స్త్రీలు దు:ఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చారు. మాఅందరి కళ్ళల్లోను నీళ్ళు చిప్పిల్లాయి.


మెల్లగా చీకటి చిక్కనౌతోంది. షర్మిల ఆ రాత్రి శిబిరంలోనే గడపటానికి సిద్ధపడింది. కర్ఫ్యూ పెట్టే టైమ్‌ దగ్గరపడడంతో మేము కూడా వెళ్ళడానికి లేచాం. అప్పుడే అంజులిక షర్మిలకి సమీపంగా వెళ్ళి ఎంతోమంది మహిళా జర్నలిస్ట్‌లు ఆమె చూడడానికి వచ్చారని, వారంతా శిబిరంలో వున్నారని చెప్పగానే ''మీ అందరినీ చూడ్డం నాకు సంతోషంగా వుంది. ఇక్కడి స్త్రీలకు ఏం జరుగుతోందో మీరు దేశం నలుమూలలా తెలియచేస్తారని నాకు ఆశగా వుంది. మీ సోదరుడి హత్య నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది'' అన్నప్పుడు అంజులిక బాధతో సతమతమైంది.


మేమంతా శిబిరంలోంచి బయటపడి బస్సులో ఎక్కాం. అందరం మౌనంగా కూర్చున్నాం. కాసేపట్లో కర్ఫ్యూ పెట్టేస్తారు. బస్సు రిట్రీట్‌ హౌస్‌ దగ్గర ఆగింది. యథాప్రకారం చీకటి. చిమ్మచీకట్లో కురుస్తున్న వెన్నెల. నాకురూమ్‌లోకి వెళ్ళాలన్పించలేదు. కాసేపు వెన్నెల్లో కూర్చుని కిచెన్‌ వేపు వెళ్ళాను. లిల్లీతో మాట్లాడాలన్పించింది. ''లిల్లీ! మేము రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం'' అన్నాను. మళ్ళీ రమ్మని, వచ్చినపుడు తనని కలవమని చెప్పింది. నీకు ఇక్కడి పనికి జీతమెంత ఇస్తారని అడిగితే 1200 ఇస్తారని, రెండుపూటలా తిండి పెడతారని చెబుతూ తనకి తొమ్మిది మంది చెల్లెళ్ళున్నారని, తండ్రి చనిపోయాడని, తన తల్లి కూడా వంట పనిచేస్తుందని చెప్పింది. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్‌ పాటించరా అంటే సిగ్గుపడుతూలేదని చెప్పింది. సోసో కూడా అదే మాట అంది. ఆడవాళ్ళు పిల్లల్ని కంటూ పోవాల్సిందే. ఫ్యామిలీప్లానింగ్‌ లేదు అంది.చూడ్డానికి చిన్నగా వుంటుంది సోసో. ఆమెకు నలుగురు పిల్లలు. డిన్నర్‌ చేసి లిల్లీకి బై చెప్పి నా రూమ్‌కు వచ్చేసాను.

8వ తేదీ ఉదయం సోసో ఇంటికెళ్ళాం. మళ్ళీ తప్పక రమ్మని కోరింది సోసో. ఆమెకు గుడ్‌బై చెప్పి, మళ్ళీ ఇంకో కప్పు టీ తాగి అక్కడి నుండి బయటపడ్డాం. పదిగంటలకి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. అన్నీ సర్దుకుని అందరికీ వీడ్కోలు చెప్పి రూమ్‌లో ఏకాంతంగా కూర్చున్నపుడు ఇంఫాల్‌ అనుభవాలు ఒకటొకటే కళ్ళముందు కదలాడాయి. దుమ్ము కొట్టుకుపోయిన నగరం, చీకట్లో మగ్గుతున్న నగరం, కర్ఫ్య పడగనీడ కింద కుములుతున్న మణిపూర్‌ రాష్ట్ర రాజధాని. ఇపుడిపుడే ''అభివృద్ధి'' నామజపం వినబడుతోందని, వందలాది కుటుంబాలు ఎయిర్‌పోర్ట్‌ విస్తరణలో నిర్వాసితమౌతున్నయని బబ్లూ చెప్పాడు. మీ హైదరాబాదు చాలా 'అభివృద్ధి' చెందిందటగా అని వ్యంగ్యంగా అడిగినపుడు షంషాబాద్‌ చుట్టుపక్కల కనుమరుగైన వందలాది గ్రామాలు, పూల, పండ్ల తోటలు గుర్తొచ్చాయి. చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరిపోయిన ఆ ఊళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. ఆంధ్రదేశంలో ''అభివృద్ధి'' పేరు మీద ఏర్పాటవుతున్న ''సెజ్‌''ల గురించి జీవనాధారాల్ని కోల్పోతున్న ప్రజల్ని గురించి మేం చెప్పాం.


ఇంఫాల్‌లో వున్న నాలుగురోజుల్లో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ప్రజలెదుర్కొంటున్న కష్టాలు, స్త్రీలు పడుతున్న అగచాట్లు చూసాం. ఎక్కడ చూసినా ఏదో పనిచేస్తూ స్త్రీలు. ఇమా మార్కెట్‌లో వ్యాపారాలు చేసే వేలాది స్త్రీలు ర్ఫ్యూ వేళ ఉరుకులు పరుగులతో దుకాణాలు మూసేసి, కిక్కిరిసిన వాహనాల్లో ఇళ్ళకు చేరే స్త్రీలు. అన్నింటినీ మించి జిప్సీ వాహనాల్లో ప్రజల మీద తుపాకులెక్కుపెట్టి ఊరకుక్కల్లా వీధులెంబడి తిరిగే సైన్యం, అస్సామ్‌ రైఫిల్స్‌. ఎక్కడచూసినా సైన్యమే. 23 లక్షల మణిపూర్‌ జనాభాకి 53000 సాయుధ సైనికులు వున్నారంటే పరిస్థితి ఎంత భీతావహంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడెవరిని చంపేస్తారో, ఎవరిని అరెస్ట్‌ చేస్తారో? ఎవరిని మాయం చేస్తారో తెలియదు. మహిళల మీద అత్యాచారాలకి అంతేలేదు.AFSPA 1958 చట్టం సైన్యానికిచ్చిన పాశవిక అధికారాలతో ఎవరినైనా కాల్చొచ్చు. ఎవరినైనా చంపొచ్చు. ఊళ్ళకుఊళ్ళు తగలబెట్టొచ్చు. ఇవన్నీ కేవలం అనుమానంతోనే చెయ్యొచ్చు. తిరుగుబాటుదారులున్నారనే నెపంతో రోజుకి కనీసం రెండు హత్యలు జరుగుతున్నాయి. చిన్నవయస్సులో భర్తల్ని పోగొట్టుకుంటున్న స్త్రీలు. అయిదారుగురు పిల్లల్తో అనాథలవుతున్న స్త్రీలు. ఉపాధి లేక ఉద్యోగాల్లేక డ్రగ్స్‌కు, తాగుడుకు బానిసలౌతున్న యువత. నిరాశానిస్పృహలతో తిరుగుబాటుదారుల్లో చేరుతున్న యువకులు. 60 సంవత్సరాలుగా అగ్నిగుండంలా మండుతున్న మణిపూర్‌. 40 ఎత్‌నిక్‌ కమ్యూనిటీలున్న మణిపూర్‌లో 38 తిరుగుబాటు గ్రూపులున్నాయి. ప్రభుత్వాల మీద తిరుగుబాటు చెయ్యడంతో పాటు వాటిల్లో వాటికి ఎన్నో విభేదాలు, పరస్పర దాడులు.


'గ్రేస్‌ షట్‌సంగ్‌' నాగా వుమన్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ మాటల్లో చెప్పాలంటే సాంప్రదాయకంగా మణిపురి స్త్రీలు శాంతిప్రేమికులు. శాంతి స్థాపన కోసం స్త్రీలు పాటుపడుతున్నారు. మణిపురి స్త్రీలు తీవ్ర వివక్ష నెదుర్కొంటున్నారు. వారికి ఎలాంటి హక్కులూలేవు. నిర్ణయధికారం లేదు. సైన్యం చేతిలో అత్యాచారాలు, కాల్పుల్లో భర్తల మరణాలు, కుటుంబాల్ని కాపాడుకోవాల్సిన పెనుభారాలు. మణిపురి స్త్రీలు రెండువిధాలా సమస్యల్ని ఎదుర్కోవాలి. సైన్యం అత్యాచారాలొకవైపు, తిరుగుబాటుదారుల అవసరాలు తీర్చాల్సి రావడం మరోవేపు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న మణిపూరి స్త్రీలు. మొత్తం మణిపూర్‌ కోసం ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడుతున్న షర్మిల. నగ్నప్రదర్శనలాంటి తీవ్ర నిర్ణయలతో సైన్యం అకృత్యాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మైరాఫెయిబి కార్యకర్తల సాహసం.


AFSPA లాంటి బలమైన చట్టం పెట్టుకుని కూడా మణిపూర్‌ ప్రభుత్వం మణిపూరి ప్రజల్ని కాపాడలేకపోతోంది. ప్రతిరోజూ సైన్యం కాల్పుల్లోనో, రెబెల్‌ తిరుగుబాటుదారుల చర్యలవల్లో నలుగురో, ఐదుగురో చనిపోవాల్సిందే. మేము ఇంఫాల్‌లో వున్నపుడే 13 ఏళ్ళ కుర్రాడు కాల్పుల్లో చనిపోయిన విషాద సంఘటన జరిగింది. మణిపూర్‌లో మామూలు పరిస్థితులు నెలకొనే ఆశ అయితే కనుచపుమేరలో కనబడ్డం లేదు. AFSPA చట్టం రద్దు అవ్వడం గానీ, ఇరాం షర్మిల ఆమరణ నిరాహారదీక్ష ముగియడం అనేవి కల్లోమాటగానే అన్పిస్తున్నాయి.


ఇంతటి విషాదకర పరిస్థితుల్లో ఎంతో హాయిగా నవ్వే మణిపురి స్త్రీలను చూస్తే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో. హృద్యంగా నవ్వే చిత్ర, అంజులిక, సోసో, లిల్లీ, ఆరంభమ్‌. వీళ్ళ హాయైన నవ్వు చసి చిత్రతో అన్నాన్నేను ''magic of Manipur Is your smile''. మీరింత చక్కగా ఎలా నవ్వగలుగుతున్నారు. అంటే సమాధానంగా మరింత నవ్వే దొరికింది.


ఇంఫాల్‌ విమానాశ్రయంలో కూర్చుని గౌహతి వెళ్ళే విమానం ఎక్కేవరకు ఇవే ఆలోచనలు. మణిపూర్‌లో త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలనే ఆశాభావంతో నేను తిరుగు ప్రయణమయ్యాను. మనస్సునిండా మణిపూర్‌ విషాదం నిండిపోవడం వల్ల అక్కడి నుండి అస్సాం, మేఘాలయ వెళ్ళిన అనుభవాలను ప్రస్తుతం రాయలేకపోతున్నాను. మేఘాలయలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, ప్రపంచంలోనే తడిప్రాంతంగా రెండుసార్లు గిన్నిస్‌ బుక్‌ కెక్కిన చిరపుంజిలో, చెక్కలబళ్ళమీద ప్లాస్టిక్‌ బిందెలతో కిలోమీటర్ల దూరం నీళ్ళ కోసం వెతుకుతున్న స్త్రీలని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. నిత్యవర్షం కురుస్తుందని చెప్పుకునే చోట నీళ్ళకోసం వెదుకులాట నిజంగా ఎంత విషాదం. మరెప్పుడైనా ఈ విషయాల గురించి రాస్తాను.

మొత్తానికి, మహిళా జర్నలిస్ట్‌ల మూడురోజుల కాన్ఫరెన్సు, మణిపూర్‌ మహిళల విషాద జీవితాల్లోని మల్లెపువ్వులాంటి నవ్వులు, ఇరాం షర్మిల ఉక్కులాంటి పట్టుదల, మైరాపెయిబీ మాతృమూర్తుల మడమ తిప్పని పోరుబాట ఇవన్నీ నామీద గొప్ప ముద్రవేసాయి. తిరిగివచ్చాక కూడా మనసంతా ముసురుపట్టినట్లే వుంది. కర్ఫ్యూలో వున్నట్లే అన్పిస్తోంది. చీకటి గుయ్యారంలో మగ్గుతున్నట్లే వుంది. మణిపూరి మహిళల మందహాసం గుర్తొచ్చినపుడు మాత్రం చాలా హాయిగా, రిలాక్స్‌డ్‌గా అన్పిస్తోంది. నాతోపాటు నాలుగురోజులు గడిపిన మిత్రులందరూ పదేపదే గుర్తొచ్చినా, ఎక్కువగా నా మనసులో చోటు సంపాదించుకున్నది మాత్రం సమీర. షిల్లాంగ్‌లోని రెయిన్‌బో హోటల్‌ యజవని హరీష్‌ని గురించి తప్పక రాయలి.అతను చాలా ఎమోషనల్‌గా నన్ను కదిలించాడు. నేను అచ్చం తన చెల్లెలులాగా వున్నానని, కళ్ళు, ముక్కుతీరు తన చెల్లెల్ని గుర్తుకు తెస్తోందని చెబుతూ మా గురించి వివరాలు అడిగి, హెల్ప్‌లైన్‌ గురించి విని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎవరూ అలా పని చెయ్యరని, తనకి లా ఫామ్‌ పెట్టాలని వుందని మీరు హెల్ప్‌ చేస్తరా అని అడిగాడు. మాకు గౌహతిలో చౌకగా మూడు నక్షత్రాల హోటల్‌లోరూమ్‌లు మాట్లాడి పెట్టాడు. ఎనిమిది మందిమి రెండు రూమ్‌ల్లో సర్దుకోగలిగాం. హైదరాబాద్‌ వచ్చాక రెండు సార్లుమాట్లాడాడు. 'బెహాన్‌! ఆప్‌ ఫిర్‌ కబ్‌ ఆరే షిల్లాంగ్‌' అంటూ ఆప్యాయంగా మాట్లాడే హరీష్‌,గౌహతిలో నన్ను తన ఆటోలో కూర్చోబెట్టుకుని,కామాఖ్య కొన్డ మీదకి,బ్రహ్మపుత్ర నది మీదకి పడవ శికారుకి తీసుకెళ్ళి,నగరమన్తా తిప్పి చూపిన్చి భద్రమ్గా నన్ను ఎయిర్ పోర్ట్ లో దిన్చిన ఆటో వాలా కమల్ భాయ్, వందలకొద్దీ మా ఫోటోలు, వీడియోలు తీసి, ఫోటోలు మాకివ్వాలి సుమా అని అడిగినపుడు ఖర్చవుతుందని అల్లరిగా నవ్వే సమీర, ఖర్చంటే డబ్బులేనా ఏంటి అని వెక్కిరించే సమీర నాకు చాలా నచ్చింది.


మంజరి కూతురుగా కంటే బోలెడన్ని పుస్తకాలు చదివిన, సరదాగా, సంబరంగా నవ్వే సమీర మా గ్రూప్‌లో వుండడం మాకు గొప్ప ఎసెట్‌. అమ్మాకూతుళ్ళలా కాకుండా స్నేహితుల్లా మెలిగిన మంజరి, సమీరామాకు బోలెడంత వినోదం, హాస్యం అందించారు. ఇంఫాల్‌ ట్రిప్‌లో సమీర పరిచయం హైలెట్టే మరి. దీనిక్కూడా ఖర్చవుతుందంటుందో ఏమో!!!

సింగారం పోవాలే

ఉప్పల్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో సింగారమనే పల్లె ఉంది.
ఊరు చక్కగా ఉంటుంది.తెలంగాణా పల్లె వాతావరణం ఉంటుంది.
ఊరంతా మోదుగు పూల చెట్లు.
సీజన్లో ఎర్రటి మోదుగు పూలతో ఊరంతా ఎర్రబారి ఉంటుంది.
నిన్న నేను నా నేస్తం గీత నా కారులో నేనే డ్రైవ్ చేస్తూ సింగారమెళ్ళేం.
సింగారం ప్రత్యేకత ఒకటి ఊరంతా పచ్చగా కూరగాయలపాదుల్తో నిండి ఉంటుంది.
నా నేస్తం వాళ్ళ పెద్దమ్మ గారి ఊరు.
వాళ్ళింట్లో టర్కి కోళ్ళు,గిన్ని కోళ్ళు, మామూలు కోళ్ళు
బోలెడు ఉన్నాయి.
అన్నింటిని మించి అక్కడ చల్లటి నీరా ప్రెష్ గా దొరుకుతుంది.
అలా చూస్తున్నారేంటి?
అప్పుడే తాటి చెట్టు నుండి దింపిన నీరా నీటుగా ఉంటుంది.
నమ్మకం లేకపోతే ఒక్కసారి తాగి చూడండి.
నిజానికి నీరా కొబ్బరి నీళ్ళకంటే శ్రేష్టమైంది.
దానిలో నానా చెత్తా కలిపి కల్లు కాంపౌండ్ లో బ్రష్టు పట్టిస్తారు.
మొత్తానికి సింగారమెళ్ళడం తియ్యటి నీరా తాగడం భలే బావుంటుంది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...