Sunday, February 27, 2011

''బెల్‌ బజావో''-గంటకొట్టండి


కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3' నివేదిక ప్రకటించింది. ఈ రిపోర్టు వెల్లడించిన కొన్ని అంశాలు -ముఖ్యంగా దేశంలో గృహహింస బాధిత స్త్రీల సంఖ్యను చూస్తే చాలా బాధాకరంగా, ప్రమాదకరంగా వుంది. నిరక్షరాస్యత, అభివృద్ధి లేమికి మారుపేరైన బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. బీహార్‌లో 50 శాతం మందికి పైగా నిత్యం భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే -3 నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి. బీహార్‌లో 59 శాతం మంది కుటుంబ హింసకు గురవుతున్నారు. 19 శాతం మంది లైంగిక హింసకు బలవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే రెండో స్థానం లో ఉంది. గృహహింసలో అగ్రస్థానం బీహార్‌ అయితే అట్టడుగు స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ (6%)వుంది. నిరక్షరాస్యతకు, హింసకు దగ్గర సంబంధముందని ఈ నివేదిక పేర్కొంటూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న పురుషులలో 60శాతం మంది అక్షర జ్ఞానం లేనివారేనని తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంటూ స్త్రీలు బతుకులు వెళ్ళదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. కోట్ల సంఖ్యలో స్త్రీలు, గృహహింసనుండి రక్షణ చట్టం వచ్చిన తరువాత కూడా హింసకు గురవ్వడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతాయె అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో అగ్రస్థానం సంపాదించిన బీహార్‌లో ఈ రోజుకీ రక్షణాధికారుల నియామకం జరగలేదు. గృహహింస చట్టం అమలు చేయమని, రక్షణాధికారులను నియమించమని ఒక న్యాయవాది శృతిసింగు పాట్నా హైకోర్ట్‌లో ప్రజా ప్రయెజనాల వ్యాజ్యం దాఖలు చెయ్యల్సి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో వుంది. వివిధ ఎన్‌.జి.వోలు ఈ చట్టం అమలు విషయమై పట్టుదలతో పనిచేయడంవల్ల పూర్తిస్థాయి రక్షణాధికారుల నియమకం జరిగింది. బాధిత స్త్రీలు వీరి ద్వారా కోర్టులో కేసులు వేయగలుగుతున్నారు. హింసాయుత జీవితాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టం గురించిన అవగాహన, చైతన్యం ఇంకా చాలా మందికి లేదు. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్నయితే తెచ్చింది కానీ ఎలాటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేపట్టి వుంటే కొంతమంది మహిళలైనా చట్ట సహాయంతో హింసాయుత బతుకుల్లోంచి బయటపడగలిగేవారు.

నిజానికి భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కన్నా గృహహింస వల్ల ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికీ హెచ్‌ఐవి నిరోధక ప్రచారం కోసం ప్రభుత్వాలు కోట్లాది రపాయలు ఖర్చు చేస్తున్నాయి. గృహహింస అంశాన్ని ప్రభుత్వం హెచ్‌ఐవి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేయల్సి వుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రచారం ప్రారంభమౌతున్న సూచనలు కన్పించడం సంతోషదాయకం. అలాంటి ఒక ప్రచారానికి సంబంధించినదే ''బెల్‌ బజావో'' కార్యక్రమం. నాకు తెలిసి మొట్ట మొదటి సారిగా కేంద్ర శిశు సంక్షేమశాఖ, బ్రేక్‌ త్రూ అనే అంతర్జాతీయంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ కలిసి బెల్‌ బజావో ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టాయి.

ఈ ప్రోగ్రామ్‌ కింద రెండు వీడియెలను వీరు రూపొందించారు. వీటి ద్వారా గృహహింస మీద మౌనంగా వుండొద్దు అని చెప్పదలిచారు. ముఖ్యంగా ఈ రెండు వీడియెలు బాలురను, పురుషులను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఒక దానిలో ఒక మొహల్లాలో క్రికెట్‌ ఆడుకుంటున్న మగపిల్లలు, ఒక ఇంట్లో భర్త తలుపులు మూసి భార్యను కొట్టడం, ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఏడ్వడం వింటారు. వెంటనే వారు ఆట ఆపేసి, ఆ ఇంటికెళ్ళి, కాలింగు బెల్‌ కొడతారు. హింసిస్తున్న భర్త బయటకొచ్చి ఏంటి అని అడుగుతారు. బాల్‌ పడింది మీ ఇంట్లో అంటారు పిల్లలు. నిజానికి బాల్‌ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. అప్పటికి ఆ ఇంట్లో హింస ఆగుతుంది. ఇంకో వీడియెలో పక్కింట్లో, భార్యను కొడుతున్న భర్త, బిగ్గరగా ఏడుస్తున్న భార్య. పక్కింటాయన లేచి వెళ్ళి బెల్‌ కొట్టి కొన్ని పాలు ఇస్తారా అని అడుగుతాడు. భర్త లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కూడా అప్పటికి తాత్కాలికంగా హింస ఆగుతుంది.

ఈ చిన్న వీడియెలు అందిస్తున్న సందేశం అద్భుతంగా వుంది. ఇంతకాలం గృహహింస అనేది వ్యక్తిగత వ్యవహారమని, బయటవాళ్ళు కల్గించుకూడదనే అపోహని ఇవి బద్దలు కొట్టాయి. ముఖ్యంగా పురుషుల్ని, మగపిల్లల్ని చైతన్యవంతం చేయడం ద్వారా గృహహంసను ఆపొచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. గృహ హింస సామాజికమైందని, ఇది వ్యక్తిగతంకాదని చెప్పడం ద్వారా సమాజం మొత్తం దీన్ని ఆపడానికి ఉద్యమించాలని చెప్పక చెప్పారు ఇందులో. ఈ సందేశాన్ని అంటే 'బెల్‌ బజావో' గంట కొట్టండి, లేదా ''మూసిన తలుపుల్ని కొట్టండి'' అంతూ   ఒక వాహనం రూపొందించి దేశవ్యాప్త ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నమని చెప్పాలి. అందుకే నేను మీ అందర్ని కోరుతున్నాను.
 మిత్రులారా! గృహహింసను ఆపడానికి మూసిన తలుపుల్ని తెరిపించండి. గంటకొట్టండి హింసను ఆపడంలో మీరూ భాగస్వాములు కండి.

Monday, February 14, 2011

ప్రొటెక్షన్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేసే లీగల్‌, సోషల్‌ కౌన్సిలర్‌లతో రెండు రోజుల వర్క్ షాప్


"భూమిక” ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ స్కిల్స్‌ మరియు గృహహింస నిరోధక చట్టం మీద, సికింద్రాబాద్‌లోని యూత్‌ హాస్టల్‌లో జనవరి 21, 22 తేదీల్లో రెండు రోజుల వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ కు గృహహింస చట్టం అమలుకోసం స్త్రీశిశు అభివృద్ధి శాఖ వారు నియమించిన రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న లీగల్‌, సోషల్‌ కౌన్సిలర్స్‌ హాజరయ్యారు. ఒక నిజామాబాద్‌ మినహా మిగిలిన అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న ఈ కౌన్సెలర్‌లు, నేరుగా బాధిత స్త్రీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం, కోర్టులో డి.ఐ.ఆర్‌.
ను మెజిస్ట్రేట్‌కు సమర్పించడం, బాధితుల కోరిన పరిహారం అంటే, హింసనుండి రక్షణ ఉత్తర్వులు, మనోవర్తి ఇప్పించడం, నష్టపరిహారం, స్వంత ఇంటిలో వుండే హక్కును కల్పించడం లాంటి ముఖ్యమైన కర్తవ్యాల నిర్వహణలో ఉండటం వల్ల, చాలాకాలంగా ‘భూమిక’ వీరితో కలిసి పనిచేయాలని భావించింది.

పై అంశం గురించి వివరిస్తూ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సంచాలకులకు ఈ కౌన్సెలర్లకు ఒక వర్క్‌షాప్‌ నిర్వహించే విషయమై చర్చించడం ఆవిడ వెంటనే ఒప్పుకుని వారందరినీ హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు.

మొదటిరోజు ప్రతినిధులను ఆహ్వానిస్తూ, ఈ వర్క్‌షాప్‌ను ఎందుకు డిజైన్‌ చెయ్యాల్సి వచ్చిందో కొండవీటి సత్యవతి వివరించారు. ముఖ్యంగా భూమిక హెల్ప్‌లైన్‌కు వస్తున్న అసంఖ్యాకమైన కాల్స్‌ను గురించి చెబుతూ, బాధిత స్త్రీలను వివిధ జిల్లాల రక్షణాధికారుల కార్యాలయాలకు పంపుతున్న క్రమంలో అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని గురించిన ఫీడ్‌ బ్యాక్‌ రావడం లేదని, అసలు రక్షణాధికారుల కార్యాలయాల్లో కౌన్సెలర్‌ల బాధ్యతలేమిటో అవగాహన లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి గందరగోళం జరిగిన సంఘటనలు కూడా వున్నాయి. రక్షణాధికారుల కార్యాలయాలన్నింటిలోనూ ఒకేవిధమైన పద్ధతులు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడం కోసం, అలాగే కౌన్సిలర్స్‌ ఎదుర్కొంటున్న సాధకబాధకాలు, సమస్యల గురించి అర్థం చేసుకోవడానిక్కూడా ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశామని అన్నారు.

మొదటగా కౌన్సెలింగ్‌ నైపుణ్యాలమీద డా:కిరణ్మయి చాలా విపులమైన, ఇంటరాక్టివ్‌ సెషన్‌ను నిర్వహించారు. బాధిత స్త్రీలకు కౌన్సెలింగ్‌ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా శరీరభాష, కంటి కదలికలు, బాధితులను ఆహ్వానించే తీరు, కుర్చీలో కూర్చునే పద్ధతి, వారు తమ బాధను వివరిస్తున్నప్పుడు చూపించవలసిన ఏకాగ్రత మొదలైన అంశాల గురించి చాలా వివరంగా చెప్పారు. ప్రతినిధులచేత రోల్‌ ప్లే కూడా చేయించి వారిలో ఒకరిని కౌన్సిలర్‌గా, ఒకరిని బాధిత స్త్రీగా అభినయం చేయించి వారు చేసినదానిలో లోటుపాట్లను వారిచేతనే విశ్లేషింపచేసే పద్ధతి వల్ల, వారు కనబరిచే లోపాలను సులభంగా అర్థం చేసుకొనే తీరులో వివరించారు.

కిరణ్మయి సెషన్‌ జరుగుతున్నప్పుడే స్త్రీ శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ సంచాలకులు ఉషారాణి ఐ.ఎ.ఎస్‌.సమావేశంలోకి వచ్చారు. ఆవిడకు వేరే సమావేశం వుండటం వల్ల త్వరగా వెళ్ళాల్సిన తొందర ఉన్నందున కిరణ్మయిగారి సెషన్‌ను కొంతసేపు ఆపి ఉషారాణిగారు ప్రసంగించారు. కౌన్సిలర్‌లుగా పనిచేస్తున్నవారి కష్టసుఖాలు తనకు తెలుసునని, దాదాపుగా ఎనిమిది నెలలుగా వారు జీతం లేకుండా పనిచేస్తున్నారనే విషయం తనకు చాలా బాధ కల్గించిందనీ, వివిధ సాంకేతిక కారణాలవల్ల జీతాలుచెల్లించలేక పోయామని, అందువల్లనే వారితో సమావేశం నిర్వహించాలన్నా ఇబ్బందిగా అన్పించి పెట్టలేకపోయామని అన్నారు. ఇప్పుడు ఈ సమావేశానికి వస్తూ ఒక శుభవార్తను తీసుకువచ్చానని, ఆర్థికశాఖకు వెళ్ళి వారి జీతాల విషయమై చర్చించి, విడుదల చేయించామని, త్వరలో వారికి జీతాలు చెల్లిస్తామని, ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇలాంటి సమావేశం తమ శాఖ నిర్వహించాల్సి వుండగా, భూమిక లాంటి సంస్థ ముందుకు వచ్చి ఇంత పెద్ద బాధ్యతను మీదేసుకుని రెండు రోజులు వర్క్‌షాప్‌ను నిర్వహించడం అభినందనీయ మని ప్రశంసించారు.

ఉషారాణిగారి ప్రసంగానంతరం ప్రతినిధులు తమకున్న అన్నిరకాల సందేహాలను ఆమె ముందుంచారు. రెస్పాండెంట్లకు సమన్లు చేరవేయడంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ప్రయాణ ఖర్చులు లేకుండా జిల్లా అంతా తిరగాల్సి రావడం గురించి, వివిధ కోర్టులకు కేసుల కోసమై హాజరవడం గురించి ఆమెకు నివేదించారు. తాము కూర్చోవడానికి కొన్ని చోట్ల కనీస వసతి లేదని, స్టేషనరీ లాంటివి కూడా అందుబాటులో లేవని వివరించారు. వీటన్నింటికీ ఉషారాణిగారు ఓపిగ్గా సమాధానాలు చెబుతూ, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి నివేదికను తమకు అందచేయమని తప్పనిసరిగా వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

ఉషారాణిగారు వెళ్ళినతర్వాత డా:కిరణ్మయిగారు తమ ప్రసంగాన్ని కొనసాగించారు. భోజనవిరామ సమయం తర్వాత రెండవ సెషన్‌ ప్రారంభమైంది., జుడీషియల్‌ ఎకాడమీలో సీనియర్‌ ఫ్యాకల్టీగా వున్న సీతారామ అవధానిగారు గృహహింస నిరోధక చట్టం - 2005′ గురించి వివరించారు. ఈ సెషన్‌లో చట్టంలోని వివిధ అంశాల గురించి మిగతా చట్టాలకన్నా ఈ చట్టం ఎంత ఉన్నతమైందో ఉదాహరణ పూర్వకంగా వివరించారు. భారతీయ చట్టాలలో ఇంతవరకూ లేని, ఉన్న ఇంటిలోనే వుండే హక్కును ఈ చట్టం ప్రసాదించిందని, అలాగే పోలీసుల, న్యాయవాదుల జోక్యాన్ని చాలా వరకు తగ్గించిన సివిల్‌ చట్టంగా ఇది రూపొందించారని తెలిపారు. ఇంతమంచి చట్టం అమలులో వున్న విషయం చాలామందికి తెలియదని, ప్రభుత్వం దీనికి సరైన ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం వుందని, తెలియచేసారు. సీతారామావధానిగారు మాట్లాడు తున్నంతసేపు చాలా సావధానంగా విన్న ప్రతినిధులు, అసంఖ్యాకమైన ప్రశ్నలను ఆయనపై సంధించారు. గృహహింస చట్టం అమలుకోసం పని చేస్తున్న తమకి ఈ చట్టం పట్ల చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయని తమకు ఇలాంటి వర్క్‌షాప్‌ ఇంతవరకూ జరగలేదని చెబుతూ, ఒక్కొక్క కేసు విషయంలో ఒక్కొక్క సందేహం తమకు వస్తుంటుందని, ఎవరిని అడగాలో ఇంతకాలం తమకు తెలియలేదని పేర్కొన్నారు. దాదాపు ఒక గంటసేపు ఈ చర్చలు, ప్రశ్నలు సమాధానాల సెషన్‌ నడిచింది. ఒకదశలో సీతారామావధాని గారు ఆశ్చర్యపోతూ క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో ఇన్ని లొసుగులు, సందేహాలు వుండడం ఆశ్చర్యం కల్గిస్తుందనీ ఈ ప్రశ్నలన్నింటినీ గుదిగుచ్చి భూమిక వారి సహకారంతో జుడీషియల్‌ ఎకాడమీ సౌజన్యంతో ఒక పుస్తకాన్ని ప్రచురించాల్సిన అవసరం వుందని, దీని కోసం తను తప్పకుండా ప్రయత్నిస్తాననీ, ప్రతినిధుల చప్పట్ల మధ్య ప్రకటించారు.

స్వార్డ్‌ సంస్థ నుంచి శివకుమారి మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా వుందని చెబుతూ, గృహహింస చట్టం అమలులో చాలా సమస్యలు ఎదురౌతున్నాయని, ముఖ్యంగా మేజిస్ట్రేట్లు అవగాహన లేకుండా కేసుల్ని కొట్టేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా దీన్నొక తలనొప్పి చట్టంగా చూస్తున్నారని, జిల్లా యంత్రాంగం కూడా సరిగా రివ్యూ మీటింగ్‌లు పెట్టడం లేదని, ఒకవేళ పెట్టి నా సాయంత్రం ఓ అరగంట టైమిచ్చి తూతూమంత్రంగా ముగిస్తున్నారని చెప్పారు. న్యాయమూర్తులకు తప్పనిసరిగా జండర్‌ శిక్షణ ఇవ్వాలని సూచించారు. గృహహింస చట్టం అమలులో ప్రముఖ బాధ్యతను నిర్వహిస్తున్న లీగల్‌, సోషల్‌ కౌన్సిలర్స్‌ అందరిని ఒక చోట చేర్చి, మంచి వర్క్‌షాప్‌ను నిర్వహించిన భూమిక అభినందనీయ మన్నారు.

రెండోరోజు మొదటి సెషన్‌లో ‘సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ’లో పనిచేస్తున్న సుచరిత, ఆంధ్రప్రదేశ్‌లో గృహహింస చట్టం - 2005 అమలు తీరుతెన్నుల గురించిన నివేదిక సారాంశాన్ని ప్రతినిధులతో పంచుకున్నారు. తమమధ్యవున్న వివరాలకు, ప్రతినిధులు చెపుతున్న వివరాలకు పొంతన లేకపోవడం కొన్ని చోట్ల గమనించి, ఒక్కో జిల్లా వారినుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గృహహింస చట్టం రావడం వెనుక బిల్లు రూపం నుండి దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు చేసిన కృషిని చెబుతూ ప్రభుత్వం స్త్రీలమీద ప్రేమతో ఈ చట్టం తీసుకురాలేదని, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒప్పందాల వల్ల (సీడా) స్త్రీల కోసం ప్రత్యేక చట్టాలు వచ్చాయని, ఐతే అమలులో చాలా నిర్లక్ష్యవైఖరి వ్యక్తమౌతోందని చట్టం అమలుకు కావల్సిన వనరుల్ని కనీస సౌకర్యాలను కేటాయించడం లేదని అన్నారు. రక్షణాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న మీ అందర్నీ కలుసుకోవడం, మాట్లాడటం తనకు చాలా ఆనందాన్నిచ్చిందనీ, చాలా కొత్త విషయాలను తాను తెలుసుకోగలిగానని చెప్పారు.

వర్క్‌షాప్‌ ముగింపు దశకు వస్తున్న సమయంలో ప్రతినిధులందరూ తమతమ వ్యక్తిగత నేపథ్యాల గురించి వివరిస్తూ పరిచయం చేసుకుంటూ, తమ లాగానే వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నవారిని తొలిసారిగా ఇలా కలుసుకోవడం చాలా ఆనందాన్నీ, బలాన్ని ఇచ్చిందనిచెప్పారు. ఈ వర్క్‌షాప్‌ వల్ల తమలోపల సుడులు తిరుగుతున్న ఎన్నో సందేహాలు నివృత్తమయ్యాయని, కౌన్సిలింగ్‌ గురించిన ఎన్నో క్రొత్త అంశాల్ని తాము నేర్చుకోగలిగామని, అలాగే ”డీవీ’ యాక్ట్‌కి సంబంధించిన తమ అనుమానాలు కూడా తీరాయని, దీని ప్రభావం తమపనిపై పాజిటివ్‌గా పడుతుందని సంతోషంగా చెప్పారు.తమందరినీ ఇలా ఒకే గొడుగు కింద తీసుకొచ్చిన ‘భూమిక’కు ఎప్పటికీ రుణపడి వుంటామని ప్రకటించారు. మీరంతా ఒక సంఘంగా ఏర్పడితే బాగుంటుందన్న కొండవీటి సత్యవతి సూచనను వెంటనే ఆమోదించి ప్రాంతీయ కన్వీనర్‌లుగా ఈ క్రింది వారిని ఎన్నుకుని
రాష్ట్ర స్థాయి కన్వీనర్‌గా కొండవీటి సత్యవతిని ఎంచుకున్నారు.
జె. విజయభాస్కర్‌ హైద్రాబాద్‌,
పి. రేవతి దేవి వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, అదిలాబాద్‌
ఎం. ఉమాదేవి కడప, కరీంనగర్‌, అనంతపూర్‌, చిత్తూరు ఎస్‌.సరళ గుంటూరు, ప్రకాశం,
జి. మాధవి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం
ఎల్‌.సుధ తూర్పు, పశ్చిమ గోదావరి,
డి.ఎ.గౌరి రంగారెడ్డి, మెదక్‌,
చక్కటి ఆశావహమైన వాతావరణంలో మొదలైన రెండురోజుల వర్క్‌షాప్‌,చాలా నిర్మాణాత్మకంగా, ఉత్సాహంగా జరిగింది. షుమారు వందమంది పాల్గొన్న ఈ సమావేశం విజయవంతంగా ముగిసి, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు తెరతీసింది.

Thursday, February 10, 2011

జనగణనలో వాస్తవాలు చెప్పకపోతే ఏం జరుగుతుంది???

ఫిబ్రవరి 9 నుండి 29 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జనాభాగణన కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలవ్వబోతోంది. ఈ ఇరవై రోజులపాటు ఇంటింటికీ తిరిగి, ఇంటిల్లిపాది వివరాలను సేకరించడానికి దాదాపు లక్షమంది ఎన్యూమరేటర్లు సిద్దమవుతున్నారు. తమకు అప్పగించిన బాధ్యతను జాతీయ ప్రాముఖ్యంగల బాధ్యతగా భావించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరగి భవిష్యత్‌ ప్రణాళికల రూపకల్పనకు అవసరమయ్యే అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించడానికి నడుం బిగిస్తున్నారు. భారతీయ సమాజం భిన్న జాతుల సమ్మేళనం. భిన్న వర్గాల కలయిక. జనాభాలో సగభాగం మహిళలేవున్నారు. అలాగే శారీరక, మానసిక వైకల్యం వున్నవారు వుంటారు. స్త్రీలు, పురుషులు కాకుండా ఇతరులు కూడా వుంటారు. సమాజం భిన్న వ్యక్తుల, సంస్కృతుల కలయికగా వుంటుంది. ఈ సమాచారం అంతా కూడా జనభాగణనలోకి తప్పనిసరిగా రావాల్సి వుంటుంది.
భారతదేశానికి సంబంధించి 1872లో తొలిసారి జనభాగణన జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో, వివిధ సమయాలలో గణన జరిగింది. 1881లో దేశం మొత్తం మీద ఏకకాలంలో జనాభాగణన జరిగింది. అప్పటినుండి ప్రతి పది సంవత్సరాలకొకసారి నిరాటంకంగా జనగణన జరుగుతోంది. ఇప్పుడు (2011లో) జరుగుతున్న జనాభాగణన దేశంలో 15వ జనాభా గణనగాను, స్వాతంత్య్రానంతరం 7వదిగాను చెప్పుకోవాలి.

జనాభా గణన నిర్వహణ ముఖ్యోద్ధేశ్యం ఏమిటంటే భారతదేశం శ్రేయోరాజ్యం, స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి సామాన్య ప్రజల ఉపయోగార్ధం పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు మాత్రమే కాక ఇతరేతర సంక్షేమ పధకాలు తయారు చేయడానికి కావలసిన క్రింది స్థాయి సమాచారమంతా జనాభా గణన ద్వారానే సేకరించి యివ్వడం జరుగుతుంది.

2011 సంలలో తలపెట్టిన భారతదేశ జనాభా గణన రెండు దశలలో జరుగుతుంది. ఒకటి ఇళ్ళ జాబితా, ఇళ్ళ గణన,రెండు జనాభా గణన. మొదటి దశ ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ నెల వరకు, 2010 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగింది. ఈ దశలో భవనాల, గణన గృహాలు మరియు కుటుంబాలను గుర్తించి వాటిని ఇళ్ళ జాబితా, ఇళ్ళ గణన షెడ్యూల్‌లో ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయడం జరిగింది. ఇళ్ళ జాబితానే కాకుండా మానవ స్థిర నివాసాల స్థితి, ఇళ్ళ కొరత మొదలగు వాటిని అంచనా వేయడం, కుటుంబాలకు లభించే వసతుల సమాచారం కూడా సేకరించబడినది.

ఫిబ్రవరి 9 నుండి 29 వరకు జరగబోయే రెండవ దశ జనాభా గణన చాలా ముఖ్య మైనది. ఒక నిర్ణీత సమయంలో ప్రతి ఒక్క వ్యక్తిని గణన చేసి ఆమె, అతని వ్యక్తిగత వివరాలను సేకరించడమే జనాభా గణన రెండో దశ ముఖ్య ఉద్ధేశం.

రెండవ దశలో మన అందరి వివరాలు సేకరించడానికి ఎండనక, వాననక ఎక్కిన మెట్లు ఎక్కుతూ, దిగిన మెట్లు దిగుతూ, ఎంతో శ్రమకోర్చి ఎన్యుమరేటర్లు మన ఇంటి తలుపు తడతారు. 29 ప్రశ్నలలో మనకు సంబంధించిన సమాచారం వివరంగా, సక్రమంగా, నింపడానికి మనమందరం తప్పనిసరిగ సహకరించాల్సిన అవసరం వుంది. మనం ఏ విషయం చెప్పకుండా దాచినా నష్టం మనకే జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తమకు సంబంధించిన వివరాలను సరిగా చెప్పరు. ఉదా: ఎవరైనా మహిళను నీవు ఏం పని చేస్తావు అని అడిగితే, నేను ఏమీ పనిచేయను, ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది. అలాగే నీకు ఎంత మంది పిల్లలు అని అడిగినపుడు బతికి ఉన్న పిల్లల వివరాలను మాత్రమే చెపుతారు, జరిగిన అబార్షన్స్‌ గురించిగాని గర్భంలోనే చనిపోయిన పిల్లల గురించిగాని, అంగవైకల్యంతో, మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లల వివరాలను దాచిపెడతారు. అలాగే తమ వివాహం జరిగిన సంవత్సరాన్ని చెప్పమని అడిగినపుడు, వచ్చిన అధికారులు తమను శిక్షిస్తారనే భయంతో బాల్యవివాహం జరిగినాగాని, ఆ విషయాన్ని వెల్లడించకుండా పెళ్ళినాటికి తమకు 20 సంవత్సరాలు దాటినాయని చెబుతారు, ఆమెకు బాల్యవివాహం జరిగినట్లుగా మన కంటికి కనిపిస్తున్నప్పటికీ, మనం ఆమె చెప్పినవే నమోదు చేసుకోవలసి వస్తుంది. అలాగే మహిళలు ఈ రోజుల్లో చాలా ప్రాంతాలలో తామే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ, కుటంబాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, ఆ విషయం చెప్పకుండా, ఇంటికి పెద్ద కొడుకు పేరును ప్రస్తావిస్తారు.

పైన ప్రస్తావించిన అంశాలను వివరంగా గమనించినపుడు జనగణన సమయంలో సరి అయిన సమాచారం ఇవ్వకపోతే జరిగే నష్టం ఇప్పుడు చూద్దాం. నిజానికి మన సమాజంలో ఉదయం లేచిన దగ్గర నుండి,రాత్రి పడుకోబోయే వరకు మహిళలు ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటారు. ఇంటి పనితో పాటు, వంటపని, పిల్లల పనిని పనిగా గుర్తించక పోయినప్పటికీ వారు కుటంబ పోషణార్ధం, డబ్బు సంపాదన కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. బీడీలు చుట్టడం, విస్తళ్ళు కుట్టడం, పిడకలు చేసి అమ్ముకోవడం, బుట్టలు అల్లడం, పాడి పశువులను పెంచి పాలు అమ్మడం, పళ్ళు కూరగాయలు అమ్మడం, పూలు అమ్మడం, ఇలా రకరకాల పనులు చేసి సంపాదించి కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే జనగణన ఎమ్యూనరేటర్లు అడిగినపుడు తాము ఏమీ పని చేయడం లేదని చెెబుతూ ఉంటారు. అలాగే వ్యవసాయ పనులతో కూడా పూర్తి కాలం పనులు, పాక్షిక పనులు ఉంటాయి. వీటిని కూడా మహిళలు చెప్పరు. నిజానికి ఇంటి దగ్గర ఉండి చేసే అన్ని పనులను నమోదు చేసుకునే వీలు ఉంది. ఈ విధంగా స్త్రీలు చేసే వంటపని, ఇంటి పనే కాకుండా కుటుంబం కోసం చేసే అనేక అనేక పనులను జనగణనలో నమోదు చేయక పోవడం వలన స్త్రీల ఉత్పాదక శక్తి నమోదు కాకుండా పోవడమేకాక, స్త్రీలు ఏమి పనిచేయని వారుగా ముద్ర వేయబడుతున్నారు. 2001లో జరిగిన జనగణనలో ఆంధ్రప్రదేశ్‌లో పని స్త్రీ, పురుషుల పని నిష్పత్తి 35.1%, 56.2% ఉంది, ఇది నిజం కాదని మనకు అర్ధమవుతూనే వుటుంది. కాని మహిళలు తాము చేసే పనిని గురించి వివరంగా చెప్పకపోతే ఇలాగే నమోదు అవుతుంది మరి. అలాగే తమకు పుట్టిన పిల్లల గురించిన వివరాలను కూడా సరిగ ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఉదా: జరిగిన గర్భస్రావాలను గురించి, పుట్టిన వెంటనే చనిపోయిన బిడ్డ గురించి సరి అయిన సమాచారం ఇచ్చినట్లయితే ఆయా ప్రాంతాలలో కల్పించవలసిన వైద్య సదుపాయాలగురించి సరి అయిన ప్రణాళికలను రచించడానికి వీలు అవుతుంది. అంటే ఆయా ప్రాంతాలలో గర్భిణి స్త్రీలకు వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా, సరి అయిన ప్రయాణ సౌకర్యాలు అందుతున్నాయా, రహదారులు సక్రమంగా ఉన్నాయా లేదా వీటన్నింటిని పరిశీలించి ప్రణాళికలో పొందు పరచడానికి వీల వుతుంది. చాలామంది మేము ఒక్కరమే చెప్పకపోతే ఏమవుతుందిలే అని ఆలోచిస్తే, అందరం అలాగే అనుకుంటే రాజు గారి పాలకుండ చందాన అవుతుంది. అందుకని జనగణన ఎన్యుమరేటర్లు మన వద్దకు వచ్చినపుడు తప్పన సరిగ పైన పేర్కొన్న వివరాలను అందిద్దాం. అలా చేయకపోతే జరిగే నష్టం కూడా మనకు అర్ధం అయి ఉంటుంది.

ఇక జండర్‌ విషయానికి వచ్చినపుడు ఇంతకు ముందు వరకు స్త్రీలు, పురుషులు అనే కాలమ్‌ మాత్రమే ఉండేది. ఈ సారి ”ఇతరులు” అనే కాలమ్‌ను కూడా చేర్చడం జరిగింది. అంటే స్త్రీలు, పురుషులుగా మాత్రమే పుట్టకుండా ఏ లింగానికి చెందకుండా పుట్టిన వ్యక్తులు మన సమాజంలో చాలామందే వున్నారు. ఇంతవరకు వీరికి సంబంధించిన వివరాలు ఎక్కడ నమోదు కాలేదు. ఈ సారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భిడియపడకుండా తమ వాస్తవ వివరాలను నమోదు చేసుకుంటే మంచిది.

వైవాహిక స్థితికి సంబంధించి కూడా ఇంతకు ముందు వివాహితులు, అవివాహితులు, వైధవ్యం పొందినవారు,విడాకులు తీసుకున్న వారు అనే కాలమ్స్‌ మాత్రమే ఉండేవి. మారిన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ‘విడిపోయినవారు’ అనే అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్నవారు (లివింగ్‌ టు గెదర్‌) అనే కాలమ్‌ కూడా చేర్చి వుంటే బావుండేది.

పైన పేర్కొన్న అంశాలు ఒక ఎత్తు అయితే వికలాంగులకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా రాబట్టలేకపోవడం పెద్ద విషాదం. అందువల్లనే 2001 జనాభా లెక్కల ప్రకారం భారతేదశంలో వికలాంగులు కేవలం 2.1%గా వుంది. ఇది చాలా దేశాల కన్నా తక్కువ. ఉదా. పాకిస్థాన్‌లో 2.3% బంగ్లాదేశ్‌లో 5.6% శ్రీలంకలో 7%, ఆస్ట్రేలియాలో 20% అమెరికాలో 19.3%, బ్రిటన్‌లో 18% జనాభా వికలాంగులుగా ఉన్నారని వారి గణాంకాలు తెలుపుతున్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో సగటున 6% జనాభా వికలాంగులుగా ఉంటే ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశంలో కేవలం 2.1% మాత్రమే వికలాంగులు ఉండటం వెనుక అసలు కారణం జనగణన సమయంలో సరి అయిన సమాచారం ఇవ్వకపోవటమే. భారతదేశం చెబుతున్న 2.1% గురించి ఐక్యరాజ్యసమితి అభ్యంతరం తెలిపి కనీసం 10% మంది అయినా వికలాంగులు ఉంటారని అంచనా వేసింది.

ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 2011 జనగణన విభాగం వికలాంగులకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందులో భాగంగా వికలాంగులను 8 కేటగిరీలుగా విభజించింది. అవి. చూపులో, వినుటలో, మాటలో, కదలికలో, మానసిక మాంధ్యం, మానసిక వ్యాధి, ఏదైన ఇతరములు బహువైకల్యం.

అంగవైకల్యానికి సంబంధించిన ప్రశ్నలు చాలా సున్నితమైనవి. కావున ఎన్యుమరేటర్లు జాగ్రత్తగా , నైపుణ్యంతో అడగటం చాలా అవసరం. అడుగుతున్న క్రమంలో అంగవైకల్యానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడం ఎందుకు అవసరమో చెబుతూ, అంగవైకల్యంగల వ్యక్తులకు, వారి కుటుంబాల కోసం ప్రభుత్వం రూపొందించే వివిధ పధకాలకు కావలసిన ప్రణాళికలను రూపొందించడం, వాటికి కావలసిన వనరులు కేటాయించడం, తత్సంబంధిత సేవలు సమకూర్చడం అంగవైకల్యంగల వ్యక్తులకు విద్య , ఉపాధి అవకాశాలను అందరితో పాటు సమానంగా కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేయడం కోసం అంగ వైకల్యంగల వ్యక్తులకు ప్రభుత్వ రవాణా మరియు ఆరోగ్య సేవలు సమకూర్చడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని వివరించాలి.

కాబట్టి జనగణన ఎమ్యానరేటర్లు ఫిబ్రవరి 9 నుండి 29 తేదీల మధ్య మీ ఇంటికి వచ్చినపుడు మీ వ్యక్తిగత వివరాలన్నింటిని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలన్నింటిని వివరంగా చెప్పడం మీ బాధ్యత. వివరాలను దాచుకుంటే జరిగే నష్టం మనకే, సరి అయిన వివరాలను చెప్పినపుడు మాత్రమే ప్రభుత్వ పధకాలలో అవసరమైన అందరికీ మొత్తం భారతదేశ భవిష్యత్తు ప్రణాళికా పధక రచన జరుగుతుంది. ఎవరెవరికి ఏఏ అదనపు సౌకర్యాల అవసరం వుందో, ఆ విషయం ధృవీకరించబడేది జనగణన లెక్కల ద్వారానే అనే విషయాన్ని మనమందరం మనసులో ఉంచుకుంటూ 29 కాలమ్స్‌తో, చేటలాంటి పేపర్‌తో ఎన్యుమరేటర్‌ మీ ముందు నిలబడినపుడు విసుగు చెందకుండా, ఆత్రుత పెట్టకుండా ఒక గ్లాసు మంచినీళ్ళో, మజ్జిగో ఇచ్చి మన ఇంటికి వచ్చిన వారికి సమాచారం అందించడం మన బాధ్యత.







Monday, February 7, 2011

లాడ్లీ మీడియా అవార్డులు-భూమిక పాత్ర

ఇటీవల ఈ అవార్డుల విషయమై బ్లాగుల్లో చర్చ జరుగుతున్న విషయం నాకు మొన్ననే తెలిసింది.
2008 లో నాకు లాడ్లి అవార్డ్ వచ్చిన దగ్గర నుండి దక్షిణాది ప్రాంతాలకు గాను అంటే తమిళనాడు,,కర్నాటక, కేరళ,అంధ్ర ప్రదేశ్,పాండిచ్చేరి రాష్ట్రాలకు సంబంధించి కొలాబరేటింగ్ ఏజన్సి గా భూమిక ఉంటూ వస్తోంది.
ఎంట్రీలను పిలవడం,ప్రెస్ కాన్ ఫరెన్స్ నిర్వహించడం,జురీలను ఎంపిక చేయడం,వారు ఎంపిక చేసిన వాటికి అవార్డ్ ప్రకటించడం భూమిక బాధ్యతలు.
బాలికల హక్కుల కోసం,లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా జండర్ స్పృహతో ఉండే రచనలు చేసే జర్నలిష్టులు
ఎంట్రీలు పంపడానికి అర్హులు.
ఈ సంవత్సరం కొత్తగా బ్లాగులు కూడా ఇందులో చేర్చారు.నేను మనసులోమాట సుజాతకు ఈ విషయం చెప్పి మన బ్లాగ్ మితృలందరీ చెప్పండి అని కోరాను అలాగే తనవి ఉంటే పంపమని చెప్పాను.
నీహారిక గారిని కూడా పంపమని నేనే ఫోన్ చేసి అడిగాను.
ఆంధ్ర ప్రదేష్ మీడియా కబుర్లు రాము గారిని కూడా అడిగాను.
లాడ్లి ప్రకటన ని ఆయన బ్లాగ్ లో పెట్టమని కోరాను.
ఇక అవార్డుల ఎంపిక ప్రక్రియలో జూరి సభ్యులుగా ప్రొఫెసర్లు, రచయితలు,మీడియా ప్రముఖులు ఉన్నారు.
ఒక్కో విభాగానికి ముగ్గురు సభ్యులన్నారు.
వారంతా ఏకగ్రీవంగా ఎంపిక చేసినవారే అవార్డుకు అర్హులౌతారు.
ఈ అవార్డులిచ్చేది నేను కాదని అందరూ గమనించ ప్రార్ధన.
అవార్డులను స్పాన్సర్ చేసేది యూఎన్ ఎఫ్పియే నిర్వహించేది పాప్యులేషన్ ఫస్ట్ అనే సంస్థ.
అవార్దీలకు అవార్డుల కింద కొంత నగదు ఇవ్వమని నేను మూడేళ్ళూగా పోరడుతున్నాను.
అవార్డీలకు కనీసం ప్రయాణ సదుపాయం,ఇతర సౌకర్యాల కల్పనలో నిర్వాహకులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో బెంగలురులో ఏం జరిగిందో అవార్డీలకు తెలుసు.
నిర్వాహకులకు ఒక అల్టిమేటం ఇచ్చి నేనూ దీని నుండి తప్పుకుందామా అనుకుంటున్నాను.
కానీ ఆడపిల్లల మీద ఉన్న ప్రేమ,మీడియాలో జెండర్ సెన్సిటివిటి అనే అంశం మీద ఉన్న ఇష్టంతోనే భూమిక సహ సంస్థగా ఉంటోంది.
నీహారిక గారికి ఫోన్ చేసి ఈ విషయం వివరించడానికి చాలా ప్రయత్నం చేసాను.
నేను తనకి చాలా అన్యాయం చేసానని గట్టిగా అరుస్తూ ఆవిడ ఫోన్ పెట్టేసారు.
నేను ఆవిడకు ఎలాంటి అన్యాయమూ చేయలేదని,జడ్జీలు నిర్ణయించినవారే ఆవార్డులు పొందారని ఇందు మూలంగా సర్వ ప్రపంచానికి తెలుపుకోవడమైంది.
ఇక ఈ చర్చ ఇంతటితో ముగించడమైంది.
నాకు ఇలాంటి వాటి మీద సమయాన్ని వృధా చెయ్యడానికి కుదరని పనులనేకం ఉన్నాయి.












Wednesday, February 2, 2011

వేధింపులు ఆగలేదు రూపాలు మారాయంతే!

భూమిక ఆధ్వర్యం "పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010"

మీద ఒక రోజు జరిగిన సమావేశపు రిపోర్ట్ నిన్న ఆంధ్రజ్యోతి నవ్య పేజిలో వచ్చింది.
మీ కోసం ఆ లింక్.
https://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2011/feb/1/navya/1navya1&more=2011/feb/1/navya/navyamain&date=2/1/2011
బాత్‌రూముల్లో యాసిడ్...

నా పేరు ఉమ, ఐఎన్‌టియుసికి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను. మేము కొన్నాళ్లుగా రైల్వే మహిళా కూలీల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఇందులో భాగంగా...దేశంలోని చాలా రైల్వే స్టేషన్లకి వెళ్లాం. ఒక రైల్వేస్టేషన్ బాత్‌రూమ్‌లలో కనిపించిన ఒక దృశ్యం మా గుండెల్ని పిండేసింది. బాత్‌రూమ్‌ల్లో మహిళల బొమ్మల్ని వేయడం, రకరకాల రాతలు రాయడం అందరికీ తెలిసిన విషయమే. ఆ రాతల్ని చదివిన వారు ఓ గంటో...రెండు గంటలో వాటి గురించి ఆలోచిస్తారు, తరువాత మరిచిపోతారు.
కాని మేం చూసిన రైల్వే స్టేషన్లలో మహిళలు వాడే బాత్‌రూమ్‌ల్లోకి నీళ్లు వెళ్లకుండా చేసి బక్కెట్లలో యాసిడ్ పోసి పెట్టారు. మహిళల్ని హింసించడానికి ఎన్ని కొత్త పద్ధతులు కనిపెడుతున్నారో చూడండి. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంటేనే ఒళ్లంతా జలదరిస్తోంది. అప్పటికే ఆ బాత్‌రూమ్‌లు వాడిన వారి సంగతేంటి? ఇలా ఒకటీ...రెండూ కాదు కొందరు మగవారి వికృత చేష్టలకు మహిళలు పడే ఇబ్బందులు అన్నీ...ఇన్నీ కాదు. నోటితో ఎవ్వరికీ చెప్పుకోలేని వేధింపులు ఈ రోజు మహిళలు ఎదుర్కొంటున్నారు. చంపితేనే శిక్ష, వేధిస్తే ఎవరు ఏమంటారు అనే ధీమానే వారితో ఈ పనులన్నీ చేయిస్తోంది.

ఉద్యోగం మానేశాను...

నా పేరు ఇందిర, నాలుగేళ్లక్రితం నేను ఒక పేరున్న కార్పోరేట్ కంపెనీలో పనిచేశాను. కొత్తగా ఉద్యోగంలో చేరాను. అక్కడ డిజిఎం హెచ్ఆర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఫోన్ నుంచి నాకు 'ఇది నా పర్సనల్ ఫోన్‌నెంబర్' అని ఒక మెసేజ్ వచ్చింది. మర్నాటి నుంచి ఆ ఫోన్ నుంచి నాకు రకరకాల మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. వాటిని చదివినపుడు వెంటనే వెళ్లి వాడ్ని చంపేయలన్నంత కోపం వచ్చేది. కాని ఏం చేయలేను. కొత్తగా ఉద్యోగంలో చేరాను. పైవారితో పెద్దగా పరిచయాలు లేవు. రెండు నెలలు నరకం భరించాను. గంటగంటకీ వచ్చే మెసేజ్‌లు మా ఇంట్లోవాళ్ల కంటపడకుండా చూడ్డానికి ఎన్ని తిప్పలు పడ్డానో. గోల చేస్తే నా పరువే పోతుందనుకున్నాను.
నా మౌనాన్ని వాడు బలహీనతగా భావించాడు. రోజురోజుకీ శృతి మించిపోతున్నాడు. ఒక రోజు వాడో, నేనో తేలిపోవాలని నిర్ణయించుకున్నాను. మా హెచ్ఒడికి, హెడ్ ఆఫ్ ది హెచ్ఆర్‌కి, డైరెక్టర్‌గారికి అందరికీ వాడి చేష్టల గురించి చెప్పాను. రుజువులు చూపించాను. వాడికి చాలా పెద్ద శిక్ష పడుతుందని ఆశించాను. తీరా చూస్తే... అందరూ వాడ్ని గదిలోకి పిలిపించి నాకు సారీ చెప్పించారంతే. వాడు సింపుల్‌గా సారీ చెప్పి వెళ్లిపోయాడు. నా సెక్షన్‌లో ఉన్న ఆడవాళ్లంతా నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్...ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేస్తావా అన్నారు. దాంతో రిజైన్ చేసి బయటికి వచ్చేశాను. నేను వచ్చిన రెండు నెలలకి ఆ డిజిఎమ్‌కి ప్రమోషన్ వచ్చిందని విన్నాను. ఈ హైటెక్ వేధింపుల గురించి ఎవ్వరికీ చెప్పుకోలేం. భరించలేక కడుపు చించుకుంటే వచ్చి కాళ్లమీద పడుతుంది.. అంతే.

పిల్లాడి కోసం...

నా పేరు లలిత, మాకు ఒక్కగానొక అబ్బాయి. మధ్యతరగతి కుటుంబం. కష్టపడి పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాం. ఒక రోజు అబ్బాయితో ప్రిన్సిపల్ కబురు పంపించాడు. మర్నాడు వెళ్లి కలిశాను. 'మీ పిల్లాడు సరిగ్గా చదవడం లేదు. మీరు అప్పుడుప్పుడు వచ్చి అతని చదువు విషయాలు తెలుసుకుంటుండాలి' అని చెప్పాడు. అలాగేనన్నాను. మొదట్లో వెళ్లినపుడు అబ్బాయి చదువు విషయాలే అడిగేవాడు. తరువాత...నా పర్సనల్ విషయాలు అడగడం మొదలుపెట్టాడు. మాట్లాడడం అయిపోయినా సరే వెళ్లనిచ్చేవాడు కాదు. టీలు, కాఫీలు తెప్పించి తాగమని ఏవో కబుర్లు చెప్పేవాడు. నాకు చాలా ఇబ్బంది అనిపించేది.
క్కడికీ ఇంటిదగ్గర ఏవో ముఖ్యమైన పనులు ఉన్నాయని చెప్పి తప్పించుకునేదాన్ని. కబురు పంపినపుడు వెళ్లకపోతే 'మీ అబ్బాయి పాసవడం మీకిష్టం లేదా'అంటూ బెదిరించేవాడు. ఈ విషయం మావారికి చెబితే ముందు నన్నే తప్పుపడతారెమో. నీ ప్రమేయం లేకుండా వాడు అలా ప్రవర్తించడంటూ నన్నే అనుమానిస్తారేమో అని భయపడ్డాను. అదెలా ఉన్నా...ఆ దుర్మార్గుడు అబ్బాయి చదువుని చెడగొడతాడేమోనని భయం వేసింది. ఏం చేస్తాను? నిస్సహాయిరాలిని అయిపోయాను. ఒకోసారి చచ్చిపోతే బాగుండుననిపిస్తోంది.

ఆ ఫోన్‌కాల్ వల్ల...

నా పేరు సరిత, నాకు పెళ్లయి ఆరునెలలైంది. నేను ఒక పేరున్న కంపెనీలో పనిచేస్తున్నాను. ఒకరోజు సాయంత్రం నా ఫోన్‌కి ఒక కాల్ వచ్చింది. అవతలి గొంతు ఎవరిదో మగవారిది. పేరు, ఊరు చెప్పి పరిచయం చేసుకున్నాడు. వెంటనే నేను మీరెవరో నాకు తెలియదన్నాను. 'తెలియాల్సిన పనేంటి' అన్నాడు వెటకారంగా. వరసగా వాడు చేస్తున్న ఉద్యోగం గురించి, వాడు సంపాదించిన ఆస్తుల గురించి చెప్పుకొచ్చాడు. 'అవన్నీ నాకెందుకు చెపుతున్నావ్...ఇంతకీ నువ్వు ఎవరు?' అంటూ గట్టిగా అరిచాను. 'ఎందుకు అరుస్తావు? మాలాంటి వారి కాల్స్ గురించే కదా నువ్వు ఎదురుచూస్తావు' అన్నాడు. 'ఎవరు చెప్పారు?' అన్నాను.

'సర్లే మ్యాటర్‌లోకి వస్తాను. యస్ ఆర్ నో చెప్పు. ప్యారడైజ్ దగ్గర ఉన్న ఒక బార్‌లో ఉన్న బాత్‌రూమ్‌లో నీ పేరు, ఫోన్ నెంబరు రాసి ఉంది. పక్కనే ప్లీజ్ కాల్ అని కూడా రాసి ఉంది. అందుకే చేశాను. ఇప్పుడు చెప్పు' అన్నాడు విజయగర్వంగా. ఎదురుగుండా ఉంటే చంపేసేదాన్ని. ఎవడ్రా నువ్వు అంటూ....నా నోటికొచ్చినట్టు తిట్టేసి పెట్టేశాను. మళ్లీ ఫోన్ చేస్తాడేమోనని ఫోన్ నా దగ్గరే పెట్టుకున్నాను. ఒకవేళ అలాంటి కాల్స్ గురించి నా భర్తకి తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా! వచ్చింది ఒక ఫోన్ కాల్ అయినా నేను మామూలు మనిషి కావడానికి మూడ్నెల్లు పట్టింది. ఇలాంటివి చెప్పడానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కాని ఆ క్షణంలో పడే వేదన, ఒత్తిడి చాలా ఎక్కువ. మాటల్లో చెప్పలేం.

షాపింగ్ అంటేనే....

మాది పశ్చిమగోదావరి జిల్లా, నా పేరు సునీత. మా బంధువుల అమ్మాయి పెళ్లి షాపింగ్ కోసం హైదరాబాద్ వచ్చాం. ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కి వెళ్లాం. అక్కడ ఒక డ్రస్సు బాగా నచ్చింది. సైజు కొంచెం డౌటుగా ఉండడంతో డ్రస్సింగ్‌రూమ్‌లోకి వెళ్లాను. మర్నాడు నా బంధువుల్లో ఒకబ్బాయి...ఆ షాపింగ్‌మాల్‌లో ఉన్న డ్రస్సింగ్ రూముల్లో కెమెరాలు ఉన్నాయని చెప్పాడు. నేను నమ్మలేదు. ఒకరోజు నాకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.'పలానా షాపింగ్‌మాల్ సెంటర్‌లో ఉన్న డ్రస్సింగ్‌రూమ్‌లో డ్రస్సు మార్చుకుంటుంటే...తీసిన ఫొటోలు నా దగ్గర ఉన్నాయి' అని ఉంది ఆ మెసేజ్‌లో. మెసేజ్ చదివిన వెంటనే నా ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
విషయాన్ని గుట్టుగా ఉంచాలా? లేక మా వాళ్లందరికీ చెప్పాలా? అర్థం కాక ఓ నెల రోజుల పాటు నరకం అనుభవించాను. మెసేజ్ వచ్చిన నెంబర్‌కి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తుంది. ఏం చేయాలో తోచలేదు. నలుగురికీ చెప్పి దొంగని పట్టుకునే ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నాను. ముందు మా కజిన్‌కి చెప్పాను. విన్న వెంటనే కయ్యిమన్నాడు. 'ఒకసారేగా మెసేజ్ వచ్చింది, మళ్లీ రెండో మెసేజ్ వస్తే నాతో చెప్పు...ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం.
అయినా డ్రస్సు కొనుక్కుని ఇంటికి రాక డ్రస్సింగ్‌రూమ్‌లోకి ఎవడు వెళ్లమన్నాడు?' అని తిట్టాడు. అంటే ఏమటి? ఉన్న అవకాశం వాడుకోవడం కూడా నా తప్పేనా? ఇలా కొందరు మహిళలు చెప్పిన సమస్యలకు అక్కడున్న పెద్దలు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేశారు. కాని ఖచ్చితమైన పరిష్కారమంటూ ఏదీ కనిపించలేదు. ఆయా పరిస్థితులని బట్టి మహిళలందరూ సంఘటితమై సమస్యపై పోరాడ్డం ఒక పరిష్కారమైతే, పనిప్రదేశాల్లో కమిటీలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు మహిళలు ఎదుర్కొనే వేధింపులపై దృష్టిపెట్టడం మరో మార్గమని చెప్పారు.

Tuesday, February 1, 2011

చంబల్ లోయలో రేగుపళ్ళ వేట


కరక్ట్ గా సంవత్సరం గుర్తు లేదు.
హైదరాబాద్ నుండి ఓ పదిహేను మందిమి నేషనల్ వుమన్ స్టడీస్
కాన్ ఫరెన్స్ లో పాల్గొనడానికి జైపూర్ వెళ్ళేం.
నాతో పాటు స్త్రీల ఉద్యమ నాయకులంతా ఉన్నారు.
జైపూర్ మీటింగ్ అద్భుతంగా సాగింది.
జాతీయస్థాయి మహిళా నాయకురాళ్ళనెందరినో ఆ కాన్ ఫరెన్స్ లో కలిసాను.
జైపూరంతా చుట్టబెట్టి సమావేశపు జ్ఞానాన్ని మెదళ్ళలో నింపుకుని
ఆంధ్ర ప్రదేశ్ ఎక్ష్ ప్రెస్ లో తిరుగు ప్రయాణమయ్యాం.
జైపూర్ నుండి బస్సు లో వచ్చి ఢిల్లీ నుండి ట్రైన్ లో బయలుదేరాం.
దాదాపు 36 గంటల ప్రయాణం.
మేము పాటలతో,ఆటలతో అల్లరితో మా కంపార్ట్ మెంట్ మోగించాం.
గ్రూప్ తో ప్రయాణాలు నాకు అలవాటే.అల్లరి అల్లరిగా గొడవ చెయ్యడం అలవాటే.
మేము ప్రయాణిస్తున్న రైలు హఠాత్తుగా ఓ అడవిలో ఆగిపోయింది.
బయటకు చూస్తే దట్టమైన అడవి, ఎత్తైన కొండలు,లోతైన లోయలు కనిపిస్తున్నాయ్.
మధ్య ప్రదేష్ రాష్ట్రం లో ఉన్నామన్న మాట.
నేను మెల్లగా లేచి డోర్ దగ్గరకొచ్చాను.

అబ్బ!ఏమి అడివి,ఎంత పచ్చదనం.బండ రాళ్ళల్లా ఉన్న కొండలు.
హఠాత్తుగా నా కళ్ళు రేగుచెట్ల మీద పడ్డాయి.
ఆకుపచ్చ,పసుపు రంగుల్లో రేగుపళ్ళు కనబడ్డాయ్.
ఇంకేమీ ఆలోచించకుండా రైలు దిగి ఆ చెట్ల వేపు వెళ్ళిపోయా.
నేను రేగు పళ్ళు కోస్తుండగా మా గ్రూప్ వాళ్ళు చూసారు.
ఒకటే కేకలు,అరుపులు.రా,వచ్చేయ్ అంటూ కోపంగా అరుస్తున్నారు.
నేను తాపీ గా దోసిలినిండా పళ్ళు కోసుకుని భోగీ లోకి ఎక్కేసాను.
ఎక్కేకా చూడండి తిట్టారూ.
ఏమనుకుంటూన్నావ్ ఇది చంబల్ లోయ. ఫూలందేవి తిరిగే చోటు.
రైలు ఇక్కడాగిందేమిటా అని అందరూ హడిలి చస్తుంటే నువ్వు రేగుపళ్ళ కోసం చంబల్లోయలోకెళతావా అంటూ తలంటేసారు.
నిజమా?? ఇది చంబల్ లోయా?నాకేం తెలుసు?
రైలు వెళ్ళిపోతునదని అరుస్తున్నారనుకున్నాను.
పూలన్ దేవి కనిపిస్తుందా?
రైలు దిగడానికి నాకేమీ భయమెయ్యలేదు.
రైలు కదిలినా పరిగెత్తి ఎక్కగలనులే అనుకున్నాను.
తిట్ట్లతో తల తడిసిపోయాకా బయటకు చూద్దును కదా పక్క కంపార్ట్ మెంట్ వాళ్ళు నన్ను చూసి ఆవేశం తెచ్చుకున్నట్టున్నరు రేగు చెట్టుకి ముళ్ళుంటాయని తెలియక అమాంతంగా కొమ్మల్ని పట్టుకోబోయేసరికి ముళ్ళు గుచ్చుకున్నాయ్ కాబోలు నా వేపు కోపంగా చూస్తూ వెళ్ళి రైక్కేసారు.
దీనిక్కూడా నాకు మళ్ళీ తిట్లు పడ్డాయ్.
పాపం వాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నాయ్ నీ వల్లనే అని మొదలేసారు.
నేను చెవుల్ని వాళ్ళకి ఇచ్చేసి నా కళ్ళని చంబల్ లోయ కి అంకితం చేసాను.
పూలన్ దేవి కనబడకపోతుందా అని తలపోస్తుంటే ఒక్క కుదుపుతో రైలు కదిలింది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...