Friday, March 27, 2009

ఇంఫాల్‌ - ఏక్‌ పల్‌ హసీ ఏక్‌ పల్‌ ఆశు

2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్యభారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను. పూనాలో సమావేశాలు జరుగుతున్నపుడే హెల్ప్‌లైన్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కి జైపూర్‌ వెళ్ళడం వల్ల నేను వాటిని మిస్‌ అయ్యాను. ఎలాగైనా ఇంఫాల్‌ వెళ్ళాలని డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాను. మణిపూర్‌ చాలాదూరం కాబట్టి ప్రయాణ ఖర్చులకే ఇరవైవేలు కావాలి. సొంత డబ్బులతోనే వెళ్ళాలి.
 దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్న మహిళా జర్నలిస్ట్‌లు 2003లో ఢిల్లీలో సమావేశమైనపుడు ఒక వెబ్‌సైట్‌ నిర్మాణంతో పాటు ప్రతి సంవత్సరం కలవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మొదటి సమావేశానికి నేను హాజరయ్యాను. మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద చర్చలతో పాటు, ఎన్నో అంశాల మీద మూడురోజులపాటు సమావేశాలు జరుగుతాయి.
 మూడునెలల క్రితం ఇంఫాల్‌లో సదస్సు నిర్వహణా బాధ్యతని స్వీకరించిన అంజులిక నుంచి చక్కటి కవితాత్మకమైన ఆహ్వానం నెట్‌వర్క్‌ సభ్యులందరికీ అందింది. అంజులిక రాసిన ఈమెయిల్‌ అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఇక అప్పటినుండి ప్రయణపు ఏర్పాట్లు మొదలయ్యాయనే చెప్పాలి. అయితే ఎన్నో అనుమానాలు. మణిపూర్‌ గురించి గాని మిగతా ఈశాన్యభారతం గురించి గానీ మీడియాలో ఎలాంటి వార్తల, సమాచారం లేకపోవడం వల్ల ఎన్నెన్నో సందేహాలు. అసలు ఎలా వెళ్ళాలి? ఇంఫాల్‌కి రైల్వేలైను లేదు. విమానంలో వెళితే ఎక్కడ దిగాలి? కోల్‌కతానా? గౌహతీనా? అక్కడి నుండి బస్సులుంటాయ? ఎన్ని గంటల ప్రయణం? ఇంటర్‌నెట్‌ నుండి కొంత సమాచారం సేకరించినా తృప్తిలేదు. మొబైల్‌ ఫోనులు మౌనవ్రతం పడతాయని, ఎటిఎమ్‌లు మొత్తానికే మొరాయిస్తాయని కొందరు భయపెట్టారు. అవసరమైన డబ్బులు మోసుకెళ్ళాలన్నమాట.
 ఈ అనుమానాలన్నీ ప్రశ్నలరూపంలో సంధిస్తూఅంజులికకు ఎన్ని మెయిల్స్‌ రాసినా సమాధానాల్లేవు. మణిపూర్‌లో పరిస్థితి, అంజూలిక నిస్సహాయస్థితి తెలియక కోపం తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇంటర్నెట్‌ సరిగ్గా పనిచేయడం లేదని, త్వరలోనే అన్ని వివరాలు రాస్తానని తన మెయిల్‌, ఆ మర్నాడే కల్పనాశర్మ నుండి మెయిల్‌ వచ్చింది. అంజులిక కజిన్‌ ఇంఫాల్‌లో దారుణ హత్యకు గురయ్యాడని తను చాలా దుఃఖంలో వుందని దాని సారాంశం. అందరం చాలా బాధపడుతూ తనకి రాసాం. తను కాన్ఫరెన్స్‌ నిర్వహించగలుగుతుందా అనే భయాలను పటా పంచలు చేస్తూ అంజులిక అన్ని వివరాలతో మెయిల్‌ ఇచ్చింది. తన దుఃఖాన్ని దిగమింగి ప్రోగ్రామ్‌ జరపడానికే తను రెడీ అయ్యింది.
 ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎంతమంది వెళతారో, ఎవరెవరు వెళతారో స్పష్టత లేకపోవడం వల్ల నేను నా ప్రోగ్రామ్‌ ఒంటరిగానే తయారుచేసుకున్నాను. గౌహతిలో ఐఐటి చదువుతున్న, నా ఫ్రెండ్‌ గీత కూతురు వైశ్ణవి నా కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యాంపస్‌లోను, షిల్లాంగ్‌లో నా కోసం గెస్ట్‌హౌస్‌ బుక్‌ చేసి, టాక్సీ మాట్లాడి గౌహతి ఏయిర్‌పోర్ట్‌లో వుంచింది.ఈశాన్య రాష్ట్రాలకి ఎపుడూ వెళ్ళకపోయినా సరే ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా ఒక్కదాన్ని తిరుగుదామనే నిర్ణయించుకున్నాను కొన్నిసార్లు ఒంటరి ప్రయాణాలు గొప్ప గొప్ప అనుభవాలను అందిస్తాయి. ఇంఫాల్‌ వెళ్ళిన తర్వాతే ఆంధ్రా నుండి వచ్చిన వాళ్ళని కలుసుకోవడం జరిగింది.
 4వ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఫ్లయిట్‌లో నా ఇంఫాల్‌ ప్రయాణం మొదలైంది. పదిగంటలకి కోల్‌కత్తాలో దిగి, ఇంఫాల్‌ ఫ్లయిట్‌ కోసం ఎదురుచస్తున్నపుడు బాంబే, పూనే, కలకత్తా గ్రూప్‌లు కలిసాయి. 12.30కి ఇండిగో విమానంలో బయలుదేరి 1.45కి ఇంఫాల్‌లో దిగాను. ముందు విమానంలో బయలుదేరి వెళ్ళిన ఆంధ్రాగ్రూప్‌లో సాక్షిలో పనిచేసే మంజరి, వార్తలో పనిచేసే జె. శ్యామల, వసంత, వనజారెడ్డి, ఎన్‌టివీలో పనిచేసే సమీర (మంజరి కూతురు) కలిసారు. అంజులిక కోసం ఎదురుచస్తుంటే గలగల నవ్వుతూ చిత్ర మా కోసం వాహనం తీసుకుని వచ్చింది. అందరం వాహనంలో ఎక్కి 'మంత్రిపుక్రి' అనే ప్రాంతానికి బయలుదేరాం. అక్కడే ఒక క్రిష్టియన్‌ సంస్థలో మా అందరికీ వసతి ఏర్పాటైంది. ఎయిర్‌పోర్ట్‌ నుండి మంత్రిపుక్రికి వెళుతుంటే, దారిపొడుగునా కనబడిన షాపులు, భవనాలు గమనించినపుడు మేము ఒక రాష్ట్ర రాజధాని నగరంలో ఉన్న భావం కలగలేదు. దుమ్ముకొట్టుకుపోయిన ఆ దారంతా చూస్తున్నపుడు ఏదో చిన్న పట్టణంలో వున్నామనిపించింది. మధ్యలో అరగంటపైగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పెళ్ళిళ్ళ సీజనని చిత్ర ప్రకటించింది. మామూలు పౌరుల కన్నా తుపాకు లెక్కుపెట్టిన ఆర్మి, అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధుల హడావుడి ఎక్కువగా వుంది. జిప్సీ వాహనాల్లో ట్రిగ్గర్‌ మీద వేలుంచి, తీక్షణంగా జనంవేపు చూస్తున్న వాళ్ళని చూస్తుంటే వెన్నులో జలదరించినట్లయింది.
 మా వాహనం దుమ్ము రేపుకుంటూ మంత్రిపుక్రిలోకి ప్రవేశించింది. మెయిన్‌ రోడ్డుకి అరకిలోమీటర్‌లో రిట్రీట్‌ హౌస్‌ వుంది. దుమ్ము తుఫానును చీల్చుకుంటూ మా వాహనం ఓ చిన్నపాటి చెరువు పక్కనుంచి పాఠశాల భవనంలా వున్న రిట్రీట్‌ హౌస్‌ ముందు ఆగింది. అప్పటికి మూడు గంటలయ్యింది. ఎవరి సామానులు వాళ్ళు మోసుకుంట రెండస్తులు ఎక్కి లోపలికెళితే బోర్డింగ్‌ స్కూల్‌లో వున్నట్లు వరసగా ఓ ఇరవై మంచాలు కనబడ్డాయి. తలో మంచం దగ్గర లగేజ్‌ పెట్టి లంచ్‌ ఏర్పాట్లు ఏమిటా అని అడిగితే ఏమీ లేవు అని తెలిసింది. అందరి బ్యాగుల్లోంచి బిస్కెట్‌ పాకెట్లు, చిక్కీలు, చపాతీలు బయటకొచ్చాయి. అందరం వాటిని షేర్‌ చేసుకుని కబుర్లలో పడ్డాం. ఇరవైమందికి మూడే బాత్‌రమ్‌లున్నాయి. ఎవరెవరు ఎపుడు స్నానాలు చేయాలో జోక్‌లేసుకుంటూ నవ్వుకుంటూ వున్నపుడు ఎవరో వచ్చి మనకోసం రూమ్‌లు కూడా వున్నాయంట అంటూ ప్రకటించారు. మళ్లీ లగేజ్‌మోసుకుంటూ రూమ్‌లున్నవేపు వెళ్ళాం. నేను, కల్పనాశర్మ ఒక రూమ్‌లో సర్దుకున్నాం.
 మొబైల్‌ ఫోన్లు మూగనోము పట్టడంతో మెయిన్‌రోడ్డు కెళ్ళి ఎస్‌టిడి ఫోన్‌ చెయాలని కొంతమంది బయలుదేరాం. రోడ్డు మీదకెళ్ళేవరకు మాకు తెలియని విషయం ఒకటుంది. అదే గత నెలరోజులుగా ఇంఫాల్‌లో సాయంత్రం ఐదు నుండి ఉదయం ఐదు వరకు కర్ఫ్యూ వుందని. మేము వెళ్ళేసరికి నాలుగున్నర అయ్యింది. ఇంక అరగంటే టైముంది. ఒకే ఒక్క ఎస్‌.టి.డి. బూత్‌ కనబడింది. ఫోన్లు చేసి, వాటర్‌ బాటిల్స్‌, ఏవో తినుబండారాలు కొనుక్కుని టీ కోసం చూస్తే ఒక్క హోటల్‌ కూడా కనబడలేదు. పోలీసుల విజిల్స్‌ వినబడసాగాయి. హడావుడిగా షాప్‌లు మూసేయసాగారు. ఒకామె టీకోసం మేం పడుతున్న అవస్థ చూసి, ఇంట్లోకి పిలిచి బ్లాక్‌ టీ పెట్టి ఇచ్చింది. పాలు లేవని చెప్పింది. అందరం దుమ్ము లేపుకుంటూ మా బసవేపు నడవసాగాం. తీరా రిట్రీట్‌ హౌస్‌కి చేరేసరికి చిమ్మచీకటి. పవర్‌ కట్‌ అట. కరెంట్‌ ఎపుడొస్తుందో ఎపుడు పోతుందో తెలియదట. చీకటి వల్ల వెన్నెల స్పష్టంగా కనబడుతోంది. చుట్ట పరుచుకున్న కొండల మీద తెల్లగా కురుస్తున్న వెన్నెల. పల్లెటూళ్ళల్లో కరెంట్‌ పోయినపుడు పౌర్ణమి ఎంత అందంగా కనబడుతుందో అష్టమినాటి చంద్రుడు అంత అందంగాను కనబడ్డాడు.
 మా అదృష్టం బావుండి రూమ్‌ల్లో చిన్నచిన్న సోలార్‌లైట్‌లు వెలుగుతున్నాయి. ఎనిమిదింటికల్లా డిన్నర్‌కి రమ్మన్నారు. కట్టెలపొయ్యి మీద చికెన్‌ వొండుతుంటే లోపలికెళ్ళి చూసాన్నేను. అపుడే లిల్లీ పరిచయమైంది. రిట్రీట్‌ హౌస్‌లో వంట చేస్తుంది లిల్లీ. కూరల్లో ఉప్పూ కారం అస్సలు లేవు. చికెన్‌ కొంచం బెటర్‌. క్యాబేజ్‌ ఎక్కువగా వాడారు. ఏదో తిన్నామన్పించి ఎనిమిదిన్నరకల్లా రూమ్‌ల్లో పడ్డాం. ఏంచెయ్యలో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు కబుర్లయ్యాయి. ప్రయాణ బడలికతో అందర అలిసిపోయారు. అయినా నిద్దర రావట్లేదు. టీవీల్లేవు. చదువుదామంటే లైట్‌ లేదు. చుట్టూ చిమ్మచీకటి. ఉండుండి వినిపిస్తున్న పోలీసుల విజిల్స్‌. ముసుగేసి పడుకోవడం బెటరన్పించి తొమ్మిదికల్లా మంచమెక్కేసాం. నా రూమ్మేట్‌ కల్పనకి దుమ్మువల్ల బాగా జలుబుచేసి, రాత్రంతా చాలా ఇబ్బంది పడింది.
 మర్నాడు ఐదుకల్లా మెలుకువ వచ్చేసింది. తొమ్మిదింటికల్లా రెడీ అవ్వాలని క్రితం రోజు చిత్ర చెప్పింది. ఓ గంటసేపు వాకింగ్‌ కెళితే టైమ్‌పాస్‌ అవుతుందని అనుకుని బూట్లేసుకుని బయటకొస్తే బాగా చలిగా అన్పించింది. అప్పటికే మంజరి, సమీర వాళ్ళు కూడా బయటకొచ్చారు. అందరం కలిసి బయటపడి కనబడుతున్న కొండలవేపు బయలుదేరాం. చల్లగాలిలో నడవడం చాలా హాయిగా వుంది. చిన్నచిన్న ఇళ్ళు. ఎక్కువ భాగం వెదురు తడకలతో కట్టుకున్నవే. మేం నడుస్తూ వెళుతున్నపుడు ఒకామె ఇంటిముందు ఊడుస్తుంటే మాతో వున్న వసంత ఫోటో తియ్యడానికి ప్రయత్నించినపుడు మమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచింది. సన్నగా, సంప్రదాయ మణిపురి దుస్తుల్లో వున్న ఆమె పేరు సోసో. మమ్మల్ని ఎంతో ఆదరంగా పిలిచి, చిన్నచిన్నమోడాలు వేసి కూర్చోమంది. లోపల్నుంచి నలుగురు పిల్లలు వచ్చారు. తన పిల్లలని ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలని చెప్పింది. చక్కటి నవ్వుముఖాలతో, చికిలి కళ్ళతో వున్నారు వాళ్ళు. తన భర్త పొల్ల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడట. వెదురు చాపలతో కట్టిన మూడురూముల ఇల్లు. శుభ్రంగా వుంది. లోపల్నించి కుంపటి తెచ్చి మామధ్య పెట్టి టీ తెస్తానని వెళ్ళింది. మేం పిల్లల ఫోటోలు తియ్యడంలో మునిగాం. ఆమె కొడుకు నవ్వుతుంటే ఎంత ముద్దొచ్చాడో. ఆ పిల్లాడి కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ నవ్వుతుంటాయి. సోసో వేడివేడి టీ తెచ్చి ఇచ్చింది. ఆ చలిలో వెచ్చటి టీ తాగుతూ సోసోతో బోలెడు కబుర్లు చెప్పాం. కర్ఫ్యూ గురించి అడిగితే, నవ్వుతూఅలవాటయిపోయింది అంది. మేము జర్నలిస్ట్‌లమని చెప్పాం. ఆమెకు థాంక్స్‌ చెప్పి బయటపడ్డాం.
 తొమ్మిదింటికల్లా అందరం తయరై బస్సులో కూర్చున్నాం. దాదాపు 60 మంది జర్నలిస్టులం అప్పటికి ఇంఫాల్‌ చేరుకున్నాం. ఇంకా రావలసిన వాళ్ళున్నారు. మొదటిరోజు మీటింగ్‌ కాంగ్లా ఫోర్ట్‌ అనే చోట జరుగుతోందని చిత్ర చెప్పింది. మేము కాంగ్లా చేరేసరికి పదయ్యింది. సమావేశాన్ని ప్రారంభించే హాలులో కూర్చున్నాం. మణిపూర్‌ మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ సమావేశాన్ని ప్రారంభించారు. అదే రోజు ''అనుపవ జయరామన్‌'' అవార్డును ప్రదానం చేయడం జరిగింది. చాలా చిన్న వయస్సులో మరణించిన ''అనుపమ'' పేరు మీద ఆమె తల్లిదండ్రులు, జర్నలిస్టుల నెట్‌వర్క్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవార్డును 2008కి గాను అలీఫియ ఖాన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, హిందుస్తాన్‌ టైమ్స్‌, ముంబయ్‌కి ప్రదానం చేసారు.
 ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 'అరంబమ్‌ మెంచుబీ' మణిపురి స్త్రీల స్థితిగతుల మీద ఉపన్యసించారు. అరంబమ్‌ నాకు బాగా పరిచయమే. మేమంతా ''స్పారో'' ఏర్పాటు చేసిన జాతీయస్థాయి రచయిత్రుల సమావేశంలో ఐదు రోజులు ఖషీద్‌ (ముంబయి)లో కలిసివున్నాం. నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా పల్కరించింది. అక్కడే వుండే మరో మణిపురి రచయిత్రి బోర్‌కన్య గురించి వాకబుచేస్తే, మర్నాడు తనని తీసుకొస్తానని వాగ్ధానం చేసింది అరంబమ్‌. ఆ తర్వాత మణిపురి వర్కింగ్‌ జర్నలిస్ట్‌లతో మాటామంతి జరిగింది. మణిపురి జర్నలిస్ట్‌లతోమాట్లాడుతున్న సందర్భంలోనే కాంగ్లా గేట్‌ ఉదంతం గురించి, ఆ గేట్‌ ముందు జరిగిన చారిత్రాత్మక మణిపురి స్త్రీల నగ్నప్రదర్శన గురించి మా అందరికీ వివరంగా తెలిసింది. నాలుగున్నర అయ్యేసరికి కర్ఫ్యూ హడావుడి మొదలైంది. మేమంతా హడావుడిగా బస్సెక్కేసాం. అందరూ ఎక్కేసరికి ఆలస్యం అవ్వడంతో కర్ఫ్యూ మొదలైంది. పోలీసులు, ఆర్మీ బెదిరింపుల మధ్య మా బస్సు భయంభయంగా బయలుదేరింది.

కాంగ్లాఫోర్ట్‌, మనోరమాదేవి హత్య :

 2004, జులై 11వ తేదీన తన ఇంట్లో నిద్రపోతున్న మనోరమాదేవి అనే మహిళను అర్ధరాత్రి అస్సామ్‌ రైఫిల్స్‌ అరెస్ట్‌ చేసి తీసుకెళ్ళారు. తీవ్రవాది అనే అనుమానంతో ఆమెను అరెస్ట్‌ చేసారు. కొన్ని గంటల తర్వాత చిత్రహింసలకు గురిచేయబడి, ఒళ్ళంతా గాట్లు, కమిలిపోయిన శరీరభాగాలతో, సామూహిక అత్యాచారానికి గురైన మనోరమ శవం రోడ్డుమీద దర్శనమిచ్చింది.
 ఈ సంఘటన మణిపూర్‌ స్త్రీలను తీవ్రంగా కలిచివేసింది. 12 మంది ''మైరా ఫెయిబి'' సంస్థకు చెందిన మణిపూరి స్త్రీలు ''ఇండియన్‌ ఆర్మి రేప్‌ అజ్‌'' అనే బేనర్‌తో పబ్లిక్‌ ప్రదేశంలో, కాంగ్లా గేటు ముందు నగ్నప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన దేశం మొత్తాన్నీ నివ్వెరపరిచి మణిపూర్‌లో ఏం జరుగుతుందో అర్థం చేయించింది. మనోరమ హత్యానంతరం కొన్ని నెలలపాటు మణిపూర్‌ మండిపోయింది. కమీషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ వేసారు గానీ ఈ రోజుకీ ఆ రిపోర్ట్‌ బయటకు రాలేదు. స్త్రీల నగ్నప్రదర్శనానంతర ఉద్యమం వల్ల అస్సామ్‌ రైఫిల్స్‌కీ, ఆర్మీకి కేంద్ర స్థావరంగా వున్న కాంగ్లా ప్రాంతాన్ని ఖాళీ చేయించి, సివిల్‌ అధికారులకు అప్పచెప్పడం జరిగింది.
 మేము బస్సులో మంత్రిపుక్రికి ప్రయాణం చేస్తున్నపుడు కాంగ్లా గేట్‌ ఉదంతం గురించి విన్నాం. మనోరమని తలుచుకుని కన్నీళ్ళ పర్యంతమయ్యామ్. తోటి స్త్రీకి జరిగిన అన్యాయన్ని ప్రశ్నిస్తూ నగ్నప్రదర్శనలాంటి తీవ్రచర్యతో తమ నిరసనను వ్యక్తం చేసిన పన్నెండుమంది మణిపురి స్త్రీలకు పాదాభివందనం చెయ్యాలన్పించింది. బస్సు మా బస దగ్గరికి దుమ్ములేపుకుంట వచ్చింది. అప్పటికే చీకటి పడింది. కరెంట్‌ లేదు. దూరంగా కొండలమీద మిణుకు మిణుకుమటూ వెలుగుతున్న దీపాలు. పిండారబోసినట్లు నవమి వెన్నెల. ''కొండలపైనా, కోనలలోనా గోగులుపూచే జాబిలి'' అని పాడుకుంటూ ఆ చీకట్లో చేసే పనేంలేక బయటే కూర్చుండిపోయం. చాలాసేపు కాంగ్లా గేట్‌ ఉదంతం మా మాటల్లో నలిగింది. డిన్నర్‌ అయ్యాక కొంతమందిమి ఒక గదిలో చేరి పాటలు పాడే కార్యక్రమం మొదలుపెట్టాం. బెంగుళూరు నుండి వచ్చిన వాసంతి రేష్మా 'చార్‌ దినోంకా' పాటని అద్భుతంగా పాడింది. అన్ని భాషల వాళ్ళు తలో పాటా అందుకుని హైపిచ్‌లో పాడుతూ, అల్లరి చేస్తుంటే రిట్రీట్‌ ఫాదర్‌ పాల్‌ వచ్చి నిశ్శబ్దంగా వుండాలని తొమ్మిది అవుతోంది, లైటు తీసేయాలని హుకుం జారీచేసాడు. బతుకుజీవుడా తొమ్మిదికే పడుకోవాలా అనుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్ళం ముడుచుకుపోయామ్. ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. కలల్లో కాంగ్లా గేట్‌, నగ్నస్త్రీలు కలవరపరిచారు. మనసు కలిచివేసి నట్లయింది.
 మర్నాడు ఉదయమే ఆంధ్రా బ్యాచ్‌ ఎదురుగావున్న కొండ ఎక్కాలని బయలుదేరాం. నేను, వనజ, మంజరి, శ్యామల, సమీర, వసంత, అనూరాధ, వనజారెడ్డి అందరం హుషారుగా కొండెక్కుతున్నాం. కిందినుంచి చూస్తే కొండమీద ఏమీ కనబడలేదు గాని మేముపైకి వెళుతుంటే ఓ ఇల్లు కనబడింది. దానిపక్కనే ఓ గెష్ట్‌హౌస్‌ లాంటిది కనబడింది. కొండమీదికి వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లోని కుటుంబమంతా ఉదయపు ప్రార్థనలో వున్నారు. మేం నిశ్శబ్దంగా నిలబడ్డాం. కొంతసేపటికి ప్రార్థన ముగించి ఒకాయన మాదగ్గరకొచ్చాడు. మేం ఫలానా అని చెప్పాం. తన పేరు అనమ్‌ అని, ఆ కొండపేరు ఖదిమ్‌ కొండ అని చెబుతూ ఖదిమ్‌ అనే అతను అక్కడ వుండేవాడని, ఈ గెష్ట్‌హౌస్‌ వాళ్లదేనని, తాను వాచ్‌మెన్‌నని చెప్పాడు. ఆ పక్కనే వున్న ఖదిమ్‌ భార్య సమాధినిచూపించాడు. మా ఎనిమిదిమందికి పొగలు కక్కే టీ తీసుకొచ్చి ఇచ్చింది అతని కూతురు. టీ తాగి అతని ఇంట్లోకి వెళ్ళాం. చిన్న ఇల్లు. అనమ్‌, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు వుంటున్నారు. ఆవులు, బాతులు పెంచుతున్నారు. మేం శెలవు తీసుకుని బయలుదేరబోతుంటే 'ఆప్‌ లోగ్‌ ఫిర్‌ ఆయియే' అంటూ ఆదరంగా చెప్పాడు అనమ్‌. మణిపూర్‌ వాస్తవ్యులు కొత్తవ్యక్తులతో కూడా చాలా ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడ్డం గమనించాం. సోసో, అనమ్‌ కుటుంబం మాకు బాగా గుర్తుండిపోయారు.
 తొమ్మిదిన్నరకి రెండోరోజు సమావేశం మొదలైంది. నెట్‌వర్క్‌ సమావేశాలకు హాజరైన సభ్యుల పరిచయాలయ్యయి. అంతకుముందురోజు మధ్యాహ్నానికి ఇంఫాల్‌ చేరిన 'నవోదయం' సభ్యులు తమని తాము పరిచయం చేసుకున్నపుడు సభ్యులందరూ కరతాళధ్వనులతో వారిని ఆహ్వానించారు. చిత్తరుకు చెందిన ఈ గ్రామీణస్త్రీలు ఎంతో ప్రతిభావంతంగా తామే ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా పనిచేస్తూ నడుపుతున్న పత్రిక నవోదయం. స్వయంసహాయక బృందాలకు చెందిన ఈ పత్రిక చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. ఆ టీమ్‌ సభ్యులు ప్రతి సంవత్సరం మహిళా జర్నలిస్ట్‌ల నెట్‌వర్క్‌ సమావేశాలకు హాజరవుతారు.
 పరస్పర పరిచయలయ్యక నెట్‌వర్క్‌ గురించి, వెబ్‌సైట్‌ గురించి చర్చ జరిగింది. జాతీయస్థాయిలో మహిళా జర్నలిస్ట్‌్‌ల నెట్‌వర్క్‌ను రిజిష్టర్‌ చేయలా వద్దా అనే అంశం మీద వేడైన వాడైన చర్చ జరిగింది. కొంతమంది రిజిష్టర్‌ చేస్తే బావుంటుందని వాదిస్తే మరికొందరు నెట్‌వర్క్‌ అందం అంతా రిజిష్టర్‌ చెయ్యకుండా, ఏలాంటి హెచ్చుతగ్గుల స్థాయిలు లేకపోవడంలోనే వుందని వాదించారు. అయితే ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్‌ వైపు మొగ్గుచపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కల్పనాశర్మ చర్చను ముగిస్తూ దీనిమీద తొందరపడడం మంచిది కాదని మరింత చర్చ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పింది.
 ఆ తర్వాత మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలు ఇచ్చారు. హ్యూమన్‌ రైట్స్‌ అలర్ట్‌ అనే సంస్థ నుండి బబ్లూ లైటోంగ్‌బామ్‌ చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. సభ్యులందరూనిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని విన్నారు. మణిపూర్‌లో తిరుగుబాటు నేపథ్యాన్ని గురించి ప్రస్తుతం ఎన్ని గ్రపులు అండర్‌గ్రౌండ్‌లో వుండి పోరాటం చేస్తున్నదీ వివరించారు. నాగాలు, కుకీలు, మైతేయులు, వైష్ణవులు, ముస్లిమ్‌ల గురించి వివరించాడు బబ్లూ. భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి మణిపూర్‌ రాచరికంలో వుందని, ఆగష్టు 14, 1947 రోజు అంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన ఒకరోజుముందే నాగా నేషనల్‌ కౌన్సిల్‌ బ్రిటీష్‌ రాజ్యం నుండి తాము స్వతంత్య్రాన్ని పొందినట్టు ప్రకటించుకున్నారు. అయితే స్వాతంత్య్రానంతరం ఇండియన్‌ గవర్నమెంట్‌ బలవంతంగా మణిపూర్‌ను ఇండియాలో విలీనం చెయ్యడాన్ని జీర్ణించుకోలేని అనేక గ్రపులు తిరుగుబాటు బాట పట్టాయి. ఈ తిరుగుబాట్లను అణిచివేసే నెపంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరమైన చట్టాలను తెచ్చాయి. అనేక గ్రూపులు చేస్తున్న ఈ తిరుగుబాట్లను లా అండ్‌ ఆర్డర్‌ సమస్యగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప వారి ఆత్మగౌరవ పోరాటాలుగా గుర్తించడం లేదు. ఈ తిరుగుబాట్లను అణచడానికి ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్‌ ఏక్ట్‌ 1958ని తీసుకొచ్చారు. సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేసి, మణిపూరీ ప్రజల మాన, ప్రాణాలను ఈ చట్టం హరిస్తోందని బబ్లూ వివరించారు. ఎన్నో దేశీయ గ్రూప్‌లు భారత ప్రభుత్వంతో పోరాడుతున్నాయని, ఆర్మీ, అస్సామ్‌ రైఫిల్స్‌కి చెందిన సాయుధులు ప్రజలను ఊచకోత కోస్తున్నారని బబ్లూ వివరించాడు.
 బబ్లూ తర్వాత 'నాగా వుమన్‌ యూనియన్‌'కి చెందిన గ్రేస్‌ ఫట్‌సంగ్‌ నాగా స్త్రీల ఉద్యమం గురించి చెప్పారు. ఆమె ప్రసంగం తర్వాత డా: ఎస్‌. చోంగ్లాయ్‌మానవహక్కుల కోసం 'కుకి'లు చేస్తున్న పోరాటం గురించి ప్రసంగించారు. 1919లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాటం చేసిన, ఒకప్పుడు ''ఇండిపెండెంట్‌, హిల్‌, కంట్రీని'' ఏలిన దేశీయ ప్రజలైన 'కుకీ'లు ఈ రోజు అత్యంత దయనీయంగా బతుకుతున్నారని చోంగ్లోయ్‌ వివరించారు.
 వీరి ప్రసంగాలు చాలా ఆసక్తిదాయకంగా సాగి, మణిపూర్‌ చరిత్ర పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ మంచి చర్చను లేవనెత్తాయి.
 ఆ తర్వాత ''వుమన్‌ విడోడ్‌ బై కాన్‌ప్లిక్ట్‌ ఇన్‌ మణిపూర్‌'' పేరుతో అంజులిక తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ చూపించారు. సైన్యం విచక్షణారహితంగా కాల్చేసిన కుటుంబాల స్థితిగతులు, అతిచిన్న వయస్సుల్లో భర్తల్ని పోగొట్టుకుని విధవలైన స్త్రీలు హృదయవిదారకంగా రోదిస్త కాల్పుల నేపథ్యాలను వివరించినపుడు అందరం కదిలిపోయామ్. నలుగురు నుంచి ఐదుగురు పిల్లలతో భర్తల్ని పోగొట్టుకున్న ఆ స్త్రీల జీవితాల్లోని విషాదం చూస్తూ కన్నీళ్ళ పర్యంతమైనాం అందరం. అన్నిటికన్నా అత్యంత దుఃఖాన్ని నింపిన సన్నివేశం మిలిటెంట్‌ గ్రూప్‌ చేతుల్లో హత్యకు గురైన అంజులిక సోదరుడి భార్య ప్రసంగం. ప్రస్తుత ఇంఫాల్‌ కర్ఫ్యూకి కారణమైన దింగనమ్‌ కిషన్‌, (మణిపురి సివిల్‌ సర్వీస్‌కి చెందిన యువ అధికారి) దారుణహత్య. ఫిబ్రవరి 13న కిషన్‌ని, అతని డ్రైవర్‌ని, అంగరక్షకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళి హత్య చేసారు. శోకదినాలను పాటిస్తూ తెల్లవస్త్రాలను ధరించి కిషన్‌ భార్య నెట్‌వర్క్‌ సమావేశాలకు వచ్చి జరిగిన దారుణాన్ని వివరించినపుడు మేమంతా దుఃఖాన్ని ఆపుకోలేకపోయామ్. అందంగా, అమాయకంగా, పుట్టెడు దుఃఖంలో వున్న ఆమె ముఖం ఈ రోజుకీ కళ్ళల్లోంచి పోకుండా కలవరపెడుతూనే వుంది.
 లంచ్‌ తర్వాత ఆరుబయట మణిపురీ నృత్యప్రదర్శన ఏర్పాటుచేశారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి అద్భుతంగా నృత్యం చేసారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనను కూడా తిలకించిన తర్వాత మనం ఇపుడు ఇమా మార్కెట్ చూడ్డానికి వెళుతున్నామని, త్వరగా వెళ్ళి, కర్ఫ్యూ సమయానికి తిరిగి వచ్చెయ్యాలని అంజులిక ప్రకటించడంతో అందరం హడావుడిగా బస్సెక్కేసాం. కాంగ్లా గేట్‌కి ఎదురుగా, కిటకిటలాడుతున్న మార్కెట్‌ దగ్గర బస్సు ఆగింది. అప్పటికి టైమ్‌ నాలుగుంబావు అయ్యింది. బ్యాచ్‌లుగా విడిపోయి ఒక్కో బ్యాచ్‌కి ఒక్కో మణిపూరీ అమ్మాయి తోడురాగా మార్కెట్‌ వేపు వెళ్ళాం.మార్కెట్‌ యమ రద్దీగా వుంది. లోపలికెళ్ళినపుడు అక్కడున్న షెడ్‌లలో బారులుతీరి కూర్చున్న మణిపురీ స్త్రీలు వివిధ వ్యాపారాలు చేస్త కనబడ్డారు. అక్కడ దాదాపు 3000 మంది స్త్రీలు ప్రతిరోజూ వ్యాపారం చేస్తారని తెలిసింది. ఆ మార్కెట్‌ ఎప్పుడు మొదలైందనే దానికి స్పష్టమైన సమాధానం దొరకలేదు. అక్కడ వ్యాపారులందరూ ఆడవాళ్ళే. అదీ మధ్యవయస్సులో వున్నవాళ్ళు, అరవై దాటివాళ్ళు ఉన్నారు.తల్లుల మార్ఖెట్ అనే దీనికి పేరు. బట్టలు, వివిధ వస్తువులు, కూరగాయలు, చేపలు ఒకటేమిటి ఎన్నో అమ్ముతుంటారు. ఎక్కువగా వివిధ రంగుల్లో మణిపురీ చేనేత దుస్తులు కన్పించాయి. ఈమార్కెట్‌ పేరు 'ఇమా' బజార్‌. అక్కడ కొనుక్కునే పురుషులు తప్ప అమ్మే పురుషులుండరు.
 మేమంతా తలోదిక్కు వెళ్ళిపోయామ్. అందరూ మణిపురి సంప్రదాయ లుంగీలు, షాల్‌లు కొన్నారు. ఎంతో హడావుడిగా అమ్మేవాళ్ళు అమ్ముతూ, సర్దుకునేవాళ్ళు సర్దుకుంటున్నారు. పిలిచి పిలిచి అమ్ముతున్నారు. కర్ఫ్యూ టైమ్‌ అయిపోతోంది. ఒక ముసలామె గంప నిండా వంకాయరంగు కలువపూలు తెస్తూ కనబడింది. నేను, మంజరి మూడేసి కట్టల పువ్వులు కొనేసాం. మాకు తోడుగా వచ్చినవాళ్ళు ఇంక పోదాం అంటూ కంగారుపెట్టసాగారు. మార్కెట్‌ వొదిలి రావాలని ఎవ్వరికీి లేదు. సరదాగా అట ఇట తిరుగుతూ ఆ స్త్రీలను పల్కరించాలని వాళ్ళతో మాట్లాడాలని వున్నా గాని, పోలీసుల విజిల్స్‌, సాయుధ సైనికులు తుపాకులెక్కుపెట్టి తిరుగుతున్న జిప్సీ వాహనాలు అందరినీ టెన్షన్‌ పెట్టేసాయి.మార్కెట్‌ కూడా చాలావరకు మూసేసారు. మేమంతా కంగారు కంగారుగా మా బస్సు ఆగివున్న చోటుకి పరుగులుపెట్టేం. ప్రతి ఒక్కరూ, ఏదో ఒక వాహనం పట్టుకుని, కిటకిటలాడే ఆటోలెక్కి ఇళ్ళకు వెళ్ళిపోసాగారు. బిజినెస్‌ ఊపందుకునే సాయంత్రం వేళ పాపం! ఆ మహిళలంతా దుకాణాలు మూసేసి ఇళ్ళకు వెళ్ళిపోవడం అదీ ఎంతో టెన్షన్‌గా వెళ్ళడం చాలా బాధన్పించింది. ఇళ్ళకెళ్ళాక మాత్రం ఏముంటుంది? కరెంట్‌ లేని చీకటి ఇళ్ళు మాత్రమే వాళ్ళకోసం ఎదురుచూస్తాయి. బహుశా సైన్యం ఇనుపబూట్ల చప్పుళ్ళే వాళ్ళకి వినోదమేమో! అంతకు మించిన చప్పుళ్ళు ఆ కర్ఫ్యూవేళ ఇంకేముంటాయి?
 మా బస్సు వేగంగా మమ్మల్ని తెచ్చి రిట్రీట్‌ హౌస్‌లో దింపేసింది. అప్పటికి ఐదున్నర అయ్యింది. మార్కెట్‌ దగ్గర ఫోన్‌ చేద్దామని ప్రయత్నించినా ఎక్కడా ఎస్‌టిడి బూత్‌ కనబడలేదు. నేను మెయిన్‌రోడ్డు మీదకెళుతున్నా ఎవరైనా వస్తారా అంటే మంజరి నేను కూడా వస్తానంది. శ్యామల కూడా మాతో బయలుదేరింది. ఎస్‌టిడిబూత్‌ వుంటుందనే ఆశతో ఆ చీకట్లో బయలుదేరాం. కరెంటు లేకపోవడం వల్ల వెన్నెల తెల్లగా మెరుస్తోంది. మాకు ఒక మిలిటరీ జీప్‌ ఎదురొచ్చింది. మేం పక్కకు జరిగి నిలబడ్డాం. దుమ్ము లేపుకుంట వెళ్ళిపోయింది. కొంతమంది స్త్రీలు గుడ్డిదీపాలు పెట్టుకొని కూరగాయలు, చేపలు అమ్ముకుంటున్నారు. షాపులన్నీ మూసేసారు. వాటర్‌ బాటిల్స్‌ కొందామంటే దొరకలేదు. మేము అంతకుముందురోజు మాట్లాడిన ఎస్‌టిడిబూత్‌ మూసేసి వుంది. అర్జంటుగామాట్లాడాలి ఎలా? అనుకుంటూ అక్కడ నిలబడిన ఒకాయన్ని ఇక్కడ ఇంకో ఎస్‌టిడి బూత్‌ వుందా అని హిందీలో అడిగాం. మా వేపు ఎగాదిగా చూసి ఆ ప్రాంతానికి కొత్తవాళ్ళమని అర్థం చేసుకుని 'ఆయీయే' అంటూ రోడ్డు మీదకు దారితీసాడు. మెయిన్‌రోడ్డంతా చీకటిగా, నిర్మానుష్యంగా వుంది. ఒక షాప్‌ ముందాగి తలుపు మీద కొడితే ఆ తలుపు ఓరగా తెరుచుకుంది. లోపల ఫోన్‌ వుంది. ముగ్గురం లోపలికెళ్ళగానే ఆ షాపతను తలుపు మూసేసాడు. తనివితీరా ఫోన్‌లో మాట్లాడి, మిత్రులకి ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నామో చెప్పేసరికి వాళ్ళు కంగారుపడ్డారు. నా మిత్రురాలు ఒకామె అయితే నన్ను చివాట్లేసింది. అలాంటి ప్రమాదకర పరిస్థితులున్నచోట ఎడ్వంచర్లేమిటని కేకలేసింది.
 షాపతనికి డబ్బులిచ్చేసి మొత్తంగా నిర్మానుష్యంగా మారిన రోడ్ల మీద నడుస్తూ, ఇంఫాల్‌ ప్రజల ముఖ్యంగా స్త్రీల కష్టాలకు బాధపడుతూ,
ఇలా ఎన్నాళ్ళు కర్ఫ్యూనడుస్తుందా, జనం ఇలా ఎంతకాలం భరించాలా అని చర్చించుకుంటూ మా బసకు చేరాం.
 మర్నాడు తొమ్మిదిన్నరకే మీటింగ్‌ మొదలైంది. నెట్‌వర్క్‌కి సంబంధించిన కార్యకలాపాల గురించి, వచ్చే సమావేశం ఎక్కడ నిర్వహించాలి అనే అంశం గురించి చర్చ జరిగింది. మేము నిర్వహిస్తాం అంటూ కేరళ బృందం ముందుకు రావడంతో నిర్వహణకు అవసరమైన వనరుల మీద, ఆ వనరుల్ని ఎలా సేకరించాలి అనే దానిమీద వాదోపవాదాలు జరిగాయి. బెంగుళూరుగ్రూప్‌ 'అనుపమ జయరామన్‌' అవార్డు నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చకు పెట్టారు. చాలా సీరియస్‌గా అందరం చర్చలో మునిగివున్న వేళ అంజులిక హఠాత్తుగా ఒక ప్రకటన చేసింది. ఇరామ్‌ షర్మిల ఆ రోజు విడుదల కాబోతోందని, మనమంతా ఇపుడు ఆమెను బంధించి వుంచిన ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పడంతో అక్కడంతా ఒక ఉత్కంఠ నెలకొంది. నేను ఇంఫాల్‌కి వచ్చిన రోజే షర్మిలను కలిసే వీలుందా అని చిత్రని అడిగితే చాలా కష్టం అని చెప్పింది. రెండు సంవత్సరాల క్రితమే ''మణిపుర్ ఉక్కు మహిళ ఇరామ్‌ షర్మిల'' అని నేనుభూమికలో సంపాదకీయం రాసాను. ఆమె ధైర్యం, సాహసం ఎంతో స్ఫర్తిదాయకమైనవి. అలాంటి షర్మిలను కలుసుకునే అవకాశం రావడం అందరిలోను ఉద్వేగాన్ని రేపింది.
 లంచ్‌ తిన్నామనిపించి అందరం బస్సులో ఎక్కేసాం. ఓ అరగంట ప్రయణం తర్వాత మేము షర్మిల విడుదల కోసం రిలే నిరాహారదీక్షలు చేస్తున్న శిబిరం దగ్గర దిగాం. అప్పటికి 88 రోజులుగా మణిపురి స్త్రీలు రిలే నిరసనదీక్షలు చేస్తున్నారు. మేము కూడా శిబిరంలో కూర్చున్నాం.

అద్భుత సాహసమూర్తి ఇరాం షర్మిల

 ఇరామ్‌ షర్మిల సామాజిక కార్యకర్తగా పనిచేసేది. భద్రతాదళాల చేతుల్లో హత్యలకు, అత్యాచారాలకు బలైన స్త్రీల కన్నీటికథనాలను వినేది. శాంతియత్రల్లో పాల్గొనేది. 2000 సంవత్సరం నవంబరు 2న 'మాలోమ్‌' పట్టణంలోని బస్టాండులో అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధులు పదిమంది పౌరులను కాల్చి చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిల తీవ్రంగా చలించిపోయింది. అంతకుముందు మణిపురి తిరుగుబాటుదారులు భద్రతాదళాల వాహనాలపై దాడిచేసినందుకు ప్రతీకారంగా అస్సామ్‌ రైఫిల్స్‌ ఈ దురాగతానికి దిగింది. 'మాలోమ్‌' పట్టణం ఇంఫాల్‌కి పదిహేను కిలోమీటర్ల దూరంలో వుంది. షర్మిల ఈ సంఘటన జరగడానికి ముందే ఒక శాంతియత్రా నిర్వహణ కోసం మాలోమ్‌కి వచ్చి వుంది. ఆమె మాలోమ్‌లో వున్నపుడే ఈ దారుణ సంఘటన జరగడంతో, శాంతి ర్యాలీ ఆలోచనను విరమించుకుని అంతకంటే తీవ్రమైన కార్యాచరణకి పూనుకోవాలని నిర్ణయించుకుంది. భద్రతాదళాలకు విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టిన Armed Forces Special Powers Act, 1958 (AFSPA) ని రద్దుచేయలంట ఆమరణ నిరాహారదీక్షకు దిగాలనే తీవ్ర నిర్ణయన్ని ఇరామ్‌ షర్మిల తీసుకుని తల్లితో చెప్పినపుడు ఆమె గట్టిగా వ్యతిరేకించి షర్మిలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. షర్మిల తన నిర్ణయానికే కట్టుబడడంతో తల్లి కఠినాతికఠినమైన నియమం పెట్టింది. షర్మిల తను మొదలుపెట్టిన కార్యంలో విజయం సాధించేవరకు తన ముఖం చూపించవద్దని నియమం పెట్టడంతో షర్మిల ఒప్పుకుని తన ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది. నవంబర్‌ 11, 2000లో షర్మిల ప్రారంభించిన ఈ దీక్ష తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతూనే వుంది.
అమరణ నిరాహార దీక్షలో వున్న షర్మిలను ఆత్మహత్యా నేరం కింద ప్రభుత్వం అరెష్ట్‌ చేసి బలవంతంగా ముక్కుల్లోంచి ట్యూబ్‌లేసి, ద్రవాహారం పంపిస్తూ జె.ఎన్‌, ఆసుపత్రిలోని ఎంతో భద్రత కల్గిన వార్డులో బంధించి వుంచింది. ఈ నేరం కింద ఒక్క సంవత్సరమే ఖైదీలో వుంచే వీలుండడంవల్ల, ప్రతి సంవత్సరం ఒక రోజు విడుదల చేసి షర్మిల ఆహారం తీసుకోదు కాబట్టి మళ్ళీ అరెస్ట్‌ చేయడం ఎనిమిదేళ్ళుగా ఒక ''తన్తు''లాగా నడుస్తోంది. మేము ఇంఫాల్‌లో వున్నపుడే మార్చి 7న ఆమెను విడుదల చేసి, మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినం రోజున అరెస్ట్‌ చేసి ఆసుపత్రి వార్డులో బంధించారు.
 "షర్మిల కంబ లప్‌" పేరుతో ''మైరా పెయిబి'' స్త్రీలు ఆమెకు సహకరిస్తున్నారు. మణిపూర్‌ లోయలో ఈ మైరాపెయిబి స్త్రీలు అట్టడుగు స్థాయినించి సాంప్రదాయక స్త్రీల సంఘాలుగా ఏర్పడి పనిచేస్తుంటారు. చారిత్రకంగా తీసుకుంటే ఈ మైరాపెయిబీ స్త్రీలు బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగివున్నారు. అలాగే మణిపూర్‌లో తాగుడు వ్యసనానికి, డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది కూడా వీరే. అతిబలమైన సాయుధ దళాలను ధిక్కరిస్తూ వనవ హక్కుల ఉద్యమాన్ని నడుపుతున్నది కూడా మైరాపెయిబీ స్త్రీలే నన్నది నగ్నసత్యం. ప్రస్తుతం షర్మిల ఆమరణదీక్షకు మద్దతునిస్తున్నవాళ్ళు వీళ్ళే.
 2006లో షర్మిల విడుదలైనప్పుడు, ఆమె తన సోదరుడు, మరో ఇద్దరు కార్యకర్తలతో ఢిల్లీకి వెళ్ళి జంతర్‌మంతర్‌ దగ్గర రోడ్డు మీద తన దీక్షను ప్రారంభించింది. పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్‌ చేసి ఆలిండియా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో వుంచి ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారాన్ని పంపి ఆమె దీక్షని భగ్నం చేసారు. ఆ తర్వాత షర్మిలను ఇంఫాల్‌ తీసుకెళ్ళి జవహర్‌లాల్‌నెహ్రూ హాస్పిటల్‌లో నిర్బంధించారు. ఆమెని ప్రతి సంవత్సరం విడుదల చేసి, ఆమె తన దీక్షను కొనసాగించడంతో, ఆమెపై ఆత్మహత్యానేరం వెపి మళ్ళీ మళ్ళీ నిర్బంధిస్తూనే వున్నారు.మార్చి ఎనిమిదిన ఆమెను తిరిగి అరెస్ట్ చేసారు.
 2009లో మేము ఇంఫాల్‌లో వున్నపుడు మార్చి 7న ఆమెను విడుదల చేసారు. ఆమె దీక్షకు మద్దతుగా మైరాపెయిబీ స్త్రీలు చేపట్టిన నిరసన శిబిరంలో మేము కూర్చుని వున్నపుడే మరో పదిహేను నిముషాల్లో షర్మిలను విడుదల చేస్తారనే సమాచారం వచ్చింది. మేమందరం శిబిరంలోంచి బయలుదేరి ఆసుపత్రికి కాలినడకనే చేరుకున్నాం. అప్పటికి సమయం మూడు కావస్తోంది. మేము వెళ్ళేసరికే అక్కడ పెద్దఎత్తున మీడియాకు చెందిన వాళ్ళు, స్త్రీలు, మైరాపెయిబికీ చెందిన కార్యకర్తలు గుమిగూడారు. షర్మిలను నిర్బంధించిన హై సెక్యూరిటీ వార్డు ముందు మేమంతా నిలబడ్డాం. ఎవరెవరో వస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. లోపలున్న పోలీసులు మాటిమాటికీ తలుపులు తీసి బయటకు తొంగిచూసి మళ్ళీ తలుపులు మూస్తున్నారు. 70 సంవత్సరాలు పైబడిన మైరాపెయిబీకీ చెందిన వృద్ధ స్త్రీలు చాలా ఓపికగా వార్డు మెట్ల మీద కూర్చుని షర్మిల కోసం ఎదురుచస్తున్నారు. 78 సంవత్సరాల కె.తరుణి అనే స్త్రీమాట్లాడుతూ అప్సని (AFSPA) రద్దుచెయ్యలి. షర్మిలని కాపాడాలి. ఈ దుర్మార్గ చట్టాన్ని రద్దుచెయ్యకపోతే మేము ఈసారి ఎవ్వరికీ ఓట్లు వెయ్యం. జరిగింది చాలు అంటూ దృఢమైన కంఠంతో చెప్పినపుడు ఆ వయస్సులో ఆమె కన్పరిచిన నిబద్ధత మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అలాంటి స్త్రీలు చాలామంది అక్కడ గుమిగూడి వున్నారు. వారంతా షర్మిల విడుదల కోసం 88 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు.
 మాలో ఉత్కంఠ పెరగసాగింది. అక్కడ కూర్చునే చోటు లేదు. నిలబడ్డం కూడా కష్టంగానే వుంది. సమయం గడుస్తున్నకొద్దీ కర్ఫ్యూ భతం భయపెట్టసాగింది. నాలుగున్నర అయ్యింది. నిలబడి నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. ఇంకో అరగంటలో కర్ఫ్యూ పెట్టేస్తారు. వార్డు లోపల్నుంచి పోలీసులు బయటకు వస్తున్నారు. తొంగి చూస్తున్నారు. గ్రిల్‌ చప్పుడైనప్పుడల్లా మా కళ్ళు గ్రిల్‌కు అతుక్కు పోతున్నాయి. ఐదు కావస్తోంది. మేము షర్మిలను చూడలేమేమో ననే సందేహం పీడించసాగింది. సరిగ్గా ఆ సమయంలో ఎవరో బిగ్గరగా ప్రకటించారు. ఆ రోజు కర్ఫ్యూ 7 గంటల వరకు పొడిగించారని. హమ్మయ్య అనుకుంటూ మళ్ళీ గ్రిల్‌ గేట్‌ చప్పుడు కోసం ఎదురుచడసాగాం.
 5.30 అయ్యింది. వార్డు రూమ్‌ తెరుచుకుంది. గ్రిల్‌ గేట్‌ కూడా తెరిచారు. సూర్యుడు అస్తమించేవేళ, ఆ చిరుచీకట్లో వెలుగురేఖలా షర్మిల చాలా మెల్లగా అడుగులేస్తూ వస్తూ కనబడింది. తెల్లగా పాలిపోయిన ముఖం. ఒక్కసారిగా వెలిగిన మీడియా ఫ్లాష్‌లైట్లను తట్టుకోలేక కళ్ళు మూసుకున్న షర్మిల కనబడింది. సంప్రదాయ మణిపురి దుస్తుల్లో, భుజాల చుట్టు గులాబీ రంగు షాల్‌ చుట్టుకుని కళ్ళు మూసుకుని బయటకు వచ్చిన షర్మిలనుచూసి కొంతమంది చప్పట్లు కొట్టారు. కొంతమంది స్త్రీలు బిగ్గరగా ఏడ్చారు.
'మైరాపెయిబి' స్త్రీలు ఆమెకు రక్షణ కవచంలా ఏర్పడి, ఆమెను పసిపాపను పొదువుకున్నట్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. షర్మిల నిలబడడానికి కూడా శక్తి లేక తల వాల్చేస్తూ ఆ స్త్రీల చేతుల ఆసరాతో నడిచి మీడియా ముందుకొచ్చింది. నేను షర్మిలా పక్కనే వుండడంతో ఆమెను అతిదగ్గరగా పరిశీలించగలిగాను. తొమ్మిది సంవత్సరాలుగా నోటితో ఘనపదార్ధం ఏమీ తినకుండా మణిపూరి ప్రజల కోసం, AFSPA 1958 చట్టం రద్దు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న 35 సంవత్సరాల షర్మిలను అతిసమీపంగా చూసినపుడు నా గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడంతో పాటు, ఆమె వజ్రసంకల్పం ముందు నా శిరస్సు వాలిపోయింది. పోరాట పటిమ, దృఢ సంకల్పం, ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధంగా వున్న ఆ స్త్రీ మూర్తి ముందుమోకరిల్లాలన్పించింది.
 చాలా బలహీనంగా వున్నప్పటికీ్ ఆమె ఏ వాహనంలోను ఎక్కకుండా, స్త్రీల సమూహంతో కలిసి అక్కడికి 500 మీటర్ల దరంలో వున్న నిరాహారదీక్షా శిబిరం వరకు నడవసాగింది. ఆమె వెంట మేమంతా, దాదాపు 70 మంది వివిధ భాషలకు చెందిన జర్నలిస్ట్‌లం నడిచాం. శిబిరం దగ్గరకు చేరగానే ఆమె కోసం పరుపు సిద్ధం చేసి కూర్చోబెట్టారు. ఆమె కాళ్ళకు మేజోళ్ళు తొడిగారు. ఆమె మెడను నిలపలేకపోతోంది. ఆమె శరీరం అటు ఇటు ఊగిపోతోంది. అక్కడ చేరిన అసంఖ్యాక మీడియా పదేపదే కోరగా ఆమె గళం విప్పింది. మెత్తగా, పీలగా ఆమె గొంతు విన్పించసాగింది. "నాకోసం ఎదురుచస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు తెలపడానికి నాదగ్గర సరైనమాటలు లేవు. మీరు నాకు మరింత ధైర్యాన్నిచ్చారు. మణిపూర్‌ నుండి AFSPA 1958 చట్టాన్ని రద్దుచేసేవరకు నేను ఈ నిరాహారదీక్షని కొనసాగించదలిచాను. ఇమాస్‌ తో కలిసి ప్రచారాన్ని సాగిస్తానని చెప్పింది. షర్మిల మెల్లగా, స్పష్టంగా మాట్లాడుతూ ''ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళాదినాన్ని జరుపుకుంటుంటే, ఇక్కడ మణిపూర్‌లో సారవంతమైన భూములతో, అపారమైన వనరులతో, చల్లటి గాలులు వీచే చోట, ప్రజలు ఎంతో స్నేహసుహృద్భావాలతో పల్కరించే చోట స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు, అణిచివేత బయట ప్రపంచానికి తెలియవు.'' అన్నప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ''నేను మాఅమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చూడకుండానే ఇంతకాలం వున్నాను. తనకి చాలా అనారోగ్యం చేసినపుడు కూడా చూడాలంటే భయమన్పించింది. నువ్వెందుకు వచ్చావు. నన్నుచూడొద్దన్నాను కదా అంటుందేమోనని ఆమె వున్న ఆసుపత్రి వార్డు ముందు ఎంతోసేపు తచ్చాడాను.'' అన్నప్పుడు అక్కడున్న స్త్రీలు దు:ఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చారు. మాఅందరి కళ్ళల్లోను నీళ్ళు చిప్పిల్లాయి.
 మెల్లగా చీకటి చిక్కనౌతోంది. షర్మిల ఆ రాత్రి శిబిరంలోనే గడపటానికి సిద్ధపడింది. కర్ఫ్యూ పెట్టే టైమ్‌ దగ్గరపడడంతో మేము కూడా వెళ్ళడానికి లేచాం. అప్పుడే అంజులిక షర్మిలకి సమీపంగా వెళ్ళి ఎంతోమంది మహిళా జర్నలిస్ట్‌లు ఆమె చూడడానికి వచ్చారని, వారంతా శిబిరంలో వున్నారని చెప్పగానే ''మీ అందరినీ చూడ్డం నాకు సంతోషంగా వుంది. ఇక్కడి స్త్రీలకు ఏం జరుగుతోందో మీరు దేశం నలుమూలలా తెలియచేస్తారని నాకు ఆశగా వుంది. మీ సోదరుడి హత్య నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది'' అన్నప్పుడు అంజులిక బాధతో సతమతమైంది.
 మేమంతా శిబిరంలోంచి బయటపడి బస్సులో ఎక్కాం. అందరం మౌనంగా కూర్చున్నాం. కాసేపట్లో కర్ఫ్యూ పెట్టేస్తారు. బస్సు రిట్రీట్‌ హౌస్‌ దగ్గర ఆగింది. యథాప్రకారం చీకటి. చిమ్మచీకట్లో కురుస్తున్న వెన్నెల. నాకురూమ్‌లోకి వెళ్ళాలన్పించలేదు. కాసేపు వెన్నెల్లో కూర్చుని కిచెన్‌ వేపు వెళ్ళాను. లిల్లీతో మాట్లాడాలన్పించింది. ''లిల్లీ! మేము రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం'' అన్నాను. మళ్ళీ రమ్మని, వచ్చినపుడు తనని కలవమని చెప్పింది. నీకు ఇక్కడి పనికి జీతమెంత ఇస్తారని అడిగితే 1200 ఇస్తారని, రెండుపూటలా తిండి పెడతారని చెబుతూ తనకి తొమ్మిది మంది చెల్లెళ్ళున్నారని, తండ్రి చనిపోయాడని, తన తల్లి కూడా వంట పనిచేస్తుందని చెప్పింది. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్‌ పాటించరా అంటే సిగ్గుపడుతూలేదని చెప్పింది. సోసో కూడా అదే మాట అంది. ఆడవాళ్ళు పిల్లల్ని కంటూ పోవాల్సిందే. ఫ్యామిలీప్లానింగ్‌ లేదు అంది.చూడ్డానికి చిన్నగా వుంటుంది సోసో. ఆమెకు నలుగురు పిల్లలు. డిన్నర్‌ చేసి లిల్లీకి బై చెప్పి నా రూమ్‌కు వచ్చేసాను.
 8వ తేదీ ఉదయం సోసో ఇంటికెళ్ళాం. మళ్ళీ తప్పక రమ్మని కోరింది సోసో. ఆమెకు గుడ్‌బై చెప్పి, మళ్ళీ ఇంకో కప్పు టీ తాగి అక్కడి నుండి బయటపడ్డాం. పదిగంటలకి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. అన్నీ సర్దుకుని అందరికీ వీడ్కోలు చెప్పి రూమ్‌లో ఏకాంతంగా కూర్చున్నపుడు ఇంఫాల్‌ అనుభవాలు ఒకటొకటే కళ్ళముందు కదలాడాయి. దుమ్ము కొట్టుకుపోయిన నగరం, చీకట్లో మగ్గుతున్న నగరం, కర్ఫ్య పడగనీడ కింద కుములుతున్న మణిపూర్‌ రాష్ట్ర రాజధాని. ఇపుడిపుడే ''అభివృద్ధి'' నామజపం వినబడుతోందని, వందలాది కుటుంబాలు ఎయిర్‌పోర్ట్‌ విస్తరణలో నిర్వాసితమౌతున్నయని బబ్లూ చెప్పాడు. మీ హైదరాబాదు చాలా 'అభివృద్ధి' చెందిందటగా అని వ్యంగ్యంగా అడిగినపుడు షంషాబాద్‌ చుట్టుపక్కల కనుమరుగైన వందలాది గ్రామాలు, పూల, పండ్ల తోటలు గుర్తొచ్చాయి. చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరిపోయిన ఆ ఊళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. ఆంధ్రదేశంలో ''అభివృద్ధి'' పేరు మీద ఏర్పాటవుతున్న ''సెజ్‌''ల గురించి జీవనాధారాల్ని కోల్పోతున్న ప్రజల్ని గురించి మేం చెప్పాం.
 ఇంఫాల్‌లో వున్న నాలుగురోజుల్లో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ప్రజలెదుర్కొంటున్న కష్టాలు, స్త్రీలు పడుతున్న అగచాట్లు చూసాం. ఎక్కడ చూసినా ఏదో పనిచేస్తూ స్త్రీలు. ఇమా మార్కెట్‌లో వ్యాపారాలు చేసే వేలాది స్త్రీలు ర్ఫ్యూ వేళ ఉరుకులు పరుగులతో దుకాణాలు మూసేసి, కిక్కిరిసిన వాహనాల్లో ఇళ్ళకు చేరే స్త్రీలు. అన్నింటినీ మించి జిప్సీ వాహనాల్లో ప్రజల మీద తుపాకులెక్కుపెట్టి ఊరకుక్కల్లా వీధులెంబడి తిరిగే సైన్యం, అస్సామ్‌ రైఫిల్స్‌. ఎక్కడచూసినా సైన్యమే. 23 లక్షల మణిపూర్‌ జనాభాకి 53000 సాయుధ సైనికులు వున్నారంటే పరిస్థితి ఎంత భీతావహంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడెవరిని చంపేస్తారో, ఎవరిని అరెస్ట్‌ చేస్తారో? ఎవరిని మాయం చేస్తారో తెలియదు. మహిళల మీద అత్యాచారాలకి అంతేలేదు.AFSPA 1958 చట్టం సైన్యానికిచ్చిన పాశవిక అధికారాలతో ఎవరినైనా కాల్చొచ్చు. ఎవరినైనా చంపొచ్చు. ఊళ్ళకుఊళ్ళు తగలబెట్టొచ్చు. ఇవన్నీ కేవలం అనుమానంతోనే చెయ్యొచ్చు. తిరుగుబాటుదారులున్నారనే నెపంతో రోజుకి కనీసం రెండు హత్యలు జరుగుతున్నాయి. చిన్నవయస్సులో భర్తల్ని పోగొట్టుకుంటున్న స్త్రీలు. అయిదారుగురు పిల్లల్తో అనాథలవుతున్న స్త్రీలు. ఉపాధి లేక ఉద్యోగాల్లేక డ్రగ్స్‌కు, తాగుడుకు బానిసలౌతున్న యువత. నిరాశానిస్పృహలతో తిరుగుబాటుదారుల్లో చేరుతున్న యువకులు. 60 సంవత్సరాలుగా అగ్నిగుండంలా మండుతున్న మణిపూర్‌. 40 ఎత్‌నిక్‌ కమ్యూనిటీలున్న మణిపూర్‌లో 38 తిరుగుబాటు గ్రూపులున్నాయి. ప్రభుత్వాల మీద తిరుగుబాటు చెయ్యడంతో పాటు వాటిల్లో వాటికి ఎన్నో విభేదాలు, పరస్పర దాడులు.
 'గ్రేస్‌ షట్‌సంగ్‌' నాగా వుమన్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ మాటల్లో చెప్పాలంటే సాంప్రదాయకంగా మణిపురి స్త్రీలు శాంతిప్రేమికులు. శాంతి స్థాపన కోసం స్త్రీలు పాటుపడుతున్నారు. మణిపురి స్త్రీలు తీవ్ర వివక్ష నెదుర్కొంటున్నారు. వారికి ఎలాంటి హక్కులూలేవు. నిర్ణయధికారం లేదు. సైన్యం చేతిలో అత్యాచారాలు, కాల్పుల్లో భర్తల మరణాలు, కుటుంబాల్ని కాపాడుకోవాల్సిన పెనుభారాలు. మణిపురి స్త్రీలు రెండువిధాలా సమస్యల్ని ఎదుర్కోవాలి. సైన్యం అత్యాచారాలొకవైపు, తిరుగుబాటుదారుల అవసరాలు తీర్చాల్సి రావడం మరోవేపు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న మణిపూరి స్త్రీలు. మొత్తం మణిపూర్‌ కోసం ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడుతున్న షర్మిల. నగ్నప్రదర్శనలాంటి తీవ్ర నిర్ణయలతో సైన్యం అకృత్యాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మైరాఫెయిబి కార్యకర్తల సాహసం.
 AFSPA లాంటి బలమైన చట్టం పెట్టుకుని కూడా మణిపూర్‌ ప్రభుత్వం మణిపూరి ప్రజల్ని కాపాడలేకపోతోంది. ప్రతిరోజూ సైన్యం కాల్పుల్లోనో, రెబెల్‌ తిరుగుబాటుదారుల చర్యలవల్లో నలుగురో, ఐదుగురో చనిపోవాల్సిందే. మేము ఇంఫాల్‌లో వున్నపుడే 13 ఏళ్ళ కుర్రాడు కాల్పుల్లో చనిపోయిన విషాద సంఘటన జరిగింది. మణిపూర్‌లో మామూలు పరిస్థితులు నెలకొనే ఆశ అయితే కనుచపుమేరలో కనబడ్డం లేదు. AFSPA చట్టం రద్దు అవ్వడం గానీ, ఇరాం షర్మిల ఆమరణ నిరాహారదీక్ష ముగియడం అనేవి కల్లోమాటగానే అన్పిస్తున్నాయి.
ఇంతటి విషాదకర పరిస్థితుల్లో ఎంతో హాయిగా నవ్వే మణిపురి స్త్రీలను చూస్తే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో. హృద్యంగా నవ్వే చిత్ర, అంజులిక, సోసో, లిల్లీ, ఆరంభమ్‌. వీళ్ళ హాయైన నవ్వు చసి చిత్రతో అన్నాన్నేను ''magic of Manipur Is your smile''. మీరింత చక్కగా ఎలా నవ్వగలుగుతున్నారు. అంటే సమాధానంగా మరింత నవ్వే దొరికింది.
 ఇంఫాల్‌ విమానాశ్రయంలో కూర్చుని గౌహతి వెళ్ళే విమానం ఎక్కేవరకు ఇవే ఆలోచనలు. మణిపూర్‌లో త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలనే ఆశాభావంతో నేను తిరుగు ప్రయణమయ్యాను. మనస్సునిండా మణిపూర్‌ విషాదం నిండిపోవడం వల్ల అక్కడి నుండి అస్సాం, మేఘాలయ వెళ్ళిన అనుభవాలను ప్రస్తుతం రాయలేకపోతున్నాను. మేఘాలయలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, ప్రపంచంలోనే తడిప్రాంతంగా రెండుసార్లు గిన్నిస్‌ బుక్‌ కెక్కిన చిరపుంజిలో, చెక్కలబళ్ళమీద ప్లాస్టిక్‌ బిందెలతో కిలోమీటర్ల దూరం నీళ్ళ కోసం వెతుకుతున్న స్త్రీలని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. నిత్యవర్షం కురుస్తుందని చెప్పుకునే చోట నీళ్ళకోసం వెదుకులాట నిజంగా ఎంత విషాదం. మరెప్పుడైనా ఈ విషయాల గురించి రాస్తాను.
 మొత్తానికి, మహిళా జర్నలిస్ట్‌ల మూడురోజుల కాన్ఫరెన్సు, మణిపూర్‌ మహిళల విషాద జీవితాల్లోని మల్లెపువ్వులాంటి నవ్వులు, ఇరాం షర్మిల ఉక్కులాంటి పట్టుదల, మైరాపెయిబీ మాతృమూర్తుల మడమ తిప్పని పోరుబాట ఇవన్నీ నామీద గొప్ప ముద్రవేసాయి. తిరిగివచ్చాక కూడా మనసంతా ముసురుపట్టినట్లే వుంది. కర్ఫ్యూలో వున్నట్లే అన్పిస్తోంది. చీకటి గుయ్యారంలో మగ్గుతున్నట్లే వుంది. మణిపూరి మహిళల మందహాసం గుర్తొచ్చినపుడు మాత్రం చాలా హాయిగా, రిలాక్స్‌డ్‌గా అన్పిస్తోంది. నాతోపాటు నాలుగురోజులు గడిపిన మిత్రులందరూ పదేపదే గుర్తొచ్చినా, ఎక్కువగా నా మనసులో చోటు సంపాదించుకున్నది మాత్రం సమీర. షిల్లాంగ్‌లోని రెయిన్‌బో హోటల్‌ యజవని హరీష్‌ని గురించి తప్పక రాయలి.అతను చాలా ఎమోషనల్‌గా నన్ను కదిలించాడు. నేను అచ్చం తన చెల్లెలులాగా వున్నానని, కళ్ళు, ముక్కుతీరు తన చెల్లెల్ని గుర్తుకు తెస్తోందని చెబుతూ మా గురించి వివరాలు అడిగి, హెల్ప్‌లైన్‌ గురించి విని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎవరూ అలా పని చెయ్యరని, తనకి లా ఫామ్‌ పెట్టాలని వుందని మీరు హెల్ప్‌ చేస్తరా అని అడిగాడు. మాకు గౌహతిలో చౌకగా మూడు నక్షత్రాల హోటల్‌లోరూమ్‌లు మాట్లాడి పెట్టాడు. ఎనిమిది మందిమి రెండు రూమ్‌ల్లో సర్దుకోగలిగాం. హైదరాబాద్‌ వచ్చాక రెండు సార్లుమాట్లాడాడు. 'బెహాన్‌! ఆప్‌ ఫిర్‌ కబ్‌ ఆరే షిల్లాంగ్‌' అంటూ ఆప్యాయంగా మాట్లాడే హరీష్‌,గౌహతిలో నన్ను తన ఆటోలో కూర్చోబెట్టుకుని,కామాఖ్య కొన్డ మీదకి,బ్రహ్మపుత్ర నది మీదకి పడవ శికారుకి తీసుకెళ్ళి,నగరమన్తా తిప్పి చూపిన్చి భద్రమ్గా నన్ను ఎయిర్ పోర్ట్ లో దిన్చిన ఆటో వాలా కమల్ భాయ్, వందలకొద్దీ మా ఫోటోలు, వీడియోలు తీసి, ఫోటోలు మాకివ్వాలి సుమా అని అడిగినపుడు ఖర్చవుతుందని అల్లరిగా నవ్వే సమీర, ఖర్చంటే డబ్బులేనా ఏంటి అని వెక్కిరించే సమీర నాకు చాలా నచ్చింది.
మంజరి కూతురుగా కంటే బోలెడన్ని పుస్తకాలు చదివిన, సరదాగా, సంబరంగా నవ్వే సమీర మా గ్రూప్‌లో వుండడం మాకు గొప్ప ఎసెట్‌. అమ్మాకూతుళ్ళలా కాకుండా స్నేహితుల్లా మెలిగిన మంజరి, సమీరామాకు బోలెడంత వినోదం, హాస్యం అందించారు. ఇంఫాల్‌ ట్రిప్‌లో సమీర పరిచయం హైలెట్టే మరి. దీనిక్కూడా ఖర్చవుతుందంటుందో ఏమో!!!

Saturday, March 14, 2009

సేవ్‌ ద గర్ల్‌ ఛైల్డ్‌ ప్లీజ్‌!

జనవరి24 తేదీని ”జాతీయ ఆడపిల్లల దినం”గా కేంద్రం ప్రకటించింది. విచ్చలవిడిగా విస్తరించిపోయిన లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిండాల హత్యలు, గృహహింస, పోషకాహారలేమి లాంటి అంశాలపై విస్తృత స్థాయి ప్రచారం చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ‘దినాన్ని’ ప్రకటించారు. టీవీప్రకటనలు, పాఠశాలల్లో పాఠాల రూపంలో, వ్యాపార ప్రకటనల్లోను ఆడపిల్లల గురించి ప్రచారం చేయనున్నారు. గృహ హింసకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు అవసరమైన నిధులను మళ్ళించి, పూర్తి స్థాయి రక్షణాధికారుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నిధులను బడ్జెట్‌ కేటాయింపుల్లో భాగంగా చెయ్యాలని నిర్ణయించారు. మొత్తానికి ఇంత కాలానికి ఆడపిల్లల కోసం ఓ ప్రత్యేక దినాన్ని కేటాయించడంతోపాటు, ఆడపిల్లలెదుర్కొంటున్న వివక్షకి వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఆలస్యం గానైనా ఆడపిల్లల సమస్యల మీద దృష్టి సారించడం ముదావహం.
అయితే ఒక ప్రత్యేక దినాన్ని ప్రకటించి, కొన్ని ప్రచార కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన మన సమాజంలో పాతుకుపోయిన లింగవివక్షని రూపుమాపగలమా? ఆడపిల్లల స్థితిగతుల మీద యునైటెడ్‌ నేషన్స్‌ ప్రకటించిన అంశాలను ఒక్కసారి గమనిద్దాం.
ు ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల్లో లేని 110 మిలియన్‌ల పిల్లల్లో 60% ఆడపిల్లలు.
ు 18 సంవత్సరాలు నిండే నాటికి బాలురకన్నా, బాలికలు 4.4 సంవత్సరాల విద్యాకాలాన్ని తక్కువ పొందుతారు.
ు ప్రపంచం మొత్తం మీద ప్రాధమిక పాఠశాలల్లో నమొదు కాని 30 మిలియన్‌ల పిల్లల్లో 60% మంది ఆడపిల్లలే.
ు ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవి బారిన పడిన వారిలో బాలురకన్నా బాలికలే ఎక్కువ.
ు ప్రతి సంవత్సరం 1,46,000 మంది టీనేజ్‌ యువతులు ప్రసవ సమయంలో మృత్యువాత పడుతున్నారు.
ు 13 మందిలో ఒకరు ప్రసవ సమయంలో మరణించే ప్రమాదంలో వున్నారు. 450 మిలియన్‌ ఆడపిల్లలు, స్త్రీలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.
ు ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల సంఖ్యలో గృహహింసకు, పబ్లిక్‌ స్థలాల్లో హింసకు మహిళలు గురవుతున్నారు.
యునైటెడ్‌ నేషన్స్‌ గణాంకాల ప్రకారం చూస్తే ఈ రోజుకీ గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లలకి విద్య అందని కుసుమమే. ప్రపంచీకరణ నేపధ్యం, వ్యవసాయ, చేనేత విధ్వంసం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుంగుబాటు, ”అభివృద్ధి” పేరు మీద జరుగుతున్న నిర్వాసితత్వం- వీటి పర్యవసానాలు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్త్రీల, ఆడపిల్లల జీవితాలు మరింత ప్రభావితమౌతున్నాయి. రాష్ట్రంలో పెరిగిపోతున్న ”ట్రాఫికింగ్‌” విష వలయంలో చిక్కుకుని వేలాదిమంది బాలికలు ప్రతిరోజు వేశ్యావాటికలకు చేరవేయబడుతున్నారు. హెచ్‌ఐవిలాంటి ప్రవదకర వ్యాధులకు బలవుతున్నారు.
మన సమాజంలో ఇంకా జరుగుతున్న బాల్యవివాహాలు, ఆడపిల్లల చదువు, వృత్తి, ఆరోగ్యంలాంటి వాటిని సమూలంగా నాశనం చేస్తున్నాయి. బాల్య వివాహాల చుట్టూ అల్లుకుని వున్న సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, మత పరమైన అంశాల గురించి పట్టించుకోకుండా, వాటిని ప్రధాన స్రవంతి చర్చల్లోకి తేకుండా బాల్యవివాహాలు నశించాలి అంటూ గొంతులు చించుకుంటే ఏమీ ఫలితం వుండదు. దేశంలో విపరీతంగా పడిపోతున్న సెక్స్‌రేషియె, వీధి వీధినా అల్ట్రాసౌండ్‌ మెషిన్లు పెట్టి, లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిండాల హత్యలు చేస్తున్న వాళ్ళని ఉదారంగా వదిలేస్తూ చూసీ చూడనట్లు నటించే చట్టం వల్ల ఉపయెగమేమీ లేదన్నది ఇప్పటికే అర్ధమైపోయింది.
ఇటీవల యూనిసెఫ్‌ ఒక నగ్న సత్యంలాంటి రిపోర్ట్‌ని విడుదల చేసింది. జనవరి 15న మనమంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ చేదుగుళిక లాంటి వాస్తవాన్ని యూనిసెఫ్‌ ప్రకటించింది. వతృమరణాలకి, పేదరికానికి వున్న సంబంధం గురించిన ఈ అధ్యయన రిపోర్ట్‌ ఏం చెబుతోందో చూద్దాం. పేద దేశాలలో, ప్రసవ సమయంలో 300 రెట్లు స్త్రీలు మరణించే ప్రమాదంలో వున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే ధనిక దేశాలలో కన్నా పేద దేశాలలో పుట్టిన పిల్లలు 14 రెట్లు అధికంగా మొదటి నెలలో చనిపోయే పరిస్థితి వుంది.చిన్న వయస్సు బాలిక గర్భం దాల్చితే ఆమె ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. అలాగే 15 సంవత్సరాల వయస్సులో ప్రసవించితే బాలిక చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. 95శాతం మాతృమరణాలు సంభవిస్తున్నది ఆఫ్రికా మరియు ఆసియా దేశాలలోనే. మరీ ముఖ్యంగా 35 శాతం దక్షిణాసియాలోనే. ఈ ప్రాంతాలలోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 7,00,000 మంది 15,19 ఏళ్ళ వయస్సున్న బాలికలు, యువతులు ప్రసవ సమయంలో మరణిస్తున్నారని యునిసెఫ్‌ రిపోర్ట్‌ ప్రకటించింది.
జనవరి 24 తేదీని ‘బాలికలదినం’గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పై విషయలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని, వాటి కనుగుణమైన విధాన నిర్ణయాలని, కార్యచరణ ప్రణాళికలను, చిత్తశుద్ధితో రూపొందించి  అమలు చేస్తుందని ఆశిద్దాం. ”సేవ్‌ ద గర్ల్‌ ఛైల్డ్‌” క్యాంపెయిన్‌ని ఉధృతం చేస్తుందని ఆశపడదాం.

Thursday, March 12, 2009

మాకు ‘నో’ అనే హక్కు లేదా?

”మేం చదువుకోకూడదా? మేం రోడ్లమీదకు రాకూడదా? మాకు ‘నో’ అనే హక్కు లేదా? ఎవడంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమను ఒప్పుకుని తీరాలి అని బలవంతపెడితే, మృగంలా ప్రవర్తిస్తే మేము ఒప్పుకు తీరాలా? మా ఇష్టాయిష్టాలకు ప్రమేయం లేదా? మేం ఒప్పుకోకపోతే కత్తులతో పొడవడం, ఆసిడ్‌ పోసి గాయపర్చడం. వీళ్ళంతా ఏ సంస్కృతికి వారసులు? వీళ్ళకి ప్రేమంటే తెలుసా? ప్రేమంటే ఇదేనా? వీళ్ళని శిక్షించే చట్టమేదీ లేదా?” ఈ ప్రశ్నలను మనం చాలాసార్లు విని వుంటాం. అగ్రికల్చర్‌ యూనివర్సిటీక్యాంపస్‌లో ఆసిడ్‌ దాడికి గురై మరణ యాతన అనుభవించిన అనూరాధ, బెంగుళూరులో అలాంటి దాడికే బలైన వందనా పాటిల్‌. ఈప్రశ్నలను పదే పదే వేస్తూనే వున్నారు. ఒక అయేష, ఒక ప్రత్యూష, ఒక స్వప్నిక, ఒక ప్రణీత-నిండు జీవితాలను ‘ప్రేమ’ అనే క్రూర క్రీడకి బలిపెడుతూనే వున్నారు. ‘ప్రేమ’ ఈ రోజు క్యాన్సర్‌ కన్నా ప్రమాదకరంగాతయారై ఆడపిల్లల్ని కబళిస్తోంది. ముక్కూ ముఖం లేని స్వప్నిక రూపం, ఉబ్బిపోయి కళ్ళు మూసుకుపోయిన ప్రణీత ముఖాలు మనోఫలకంలోంచి చెదరకుండా పదే పదే కళ్ళముందు కదలాడి కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఆరకముందే నిందితులు దొరికారన్న వార్త ఎంతో ఊరట కలిగించింది. ఆసిడ్‌ దాడికి పాల్పడ్డ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో ఘోషించిన వారంతా, వారి అరెస్టుతో ఎంతో ఊరట చెందారు. పోలీసులు చాలా వేగంగా, కేవలం 48 గంటల్లో పట్టుకోగలిగారని ప్రశంసించారు కూడా.
అంబేద్కర్‌ విగ్రహం దగ్గర మహిళాసంఘాలు తలపెట్టిన ధర్నా మాత్రం కొనసాగాలని నిర్ణయమైంది. అయితే శనివారం ఉదయమే ఎవరో ఫోన్‌ చేసి ధర్నా కాన్సిల్‌ అయ్యిందని చెప్పినపుడు, ఏమైంది? ఎందుకు కాన్సిల్‌ అయ్యింది అని అడిగితే ‘వాళ్ళ ముగ్గురిని ఎన్‌కౌంటర్‌ చేసేసారు. మీకు తెలియదా? ‘ అని చెప్పారు. వెంటనే టీవీ ఆన్‌ చేస్తే ఎన్‌కౌంటర్‌ దృశ్యాలు, ఛానళ్ళ హడావుడి. నిన్న రాత్రి పోలీస్‌ కస్టడీలో వున్న వాళ్ళు పొద్దున్నే ఎదురుకాల్పుల్లో చనిపోవడం, గుట్టల్లో శవాలు పడి వుండడం, శవాల చేతుల్లో తుపాకులు, కత్తులు వుండడం. నమ్మశక్యంగాని దృశ్యాలు. నిందితుల్ని శిక్షించడమంటే చంపి వేయడమా? నిన్నటి ఆవేశం, కోపం స్థానంలో క్రమంగా ఆవేదన, భయం ప్రవేశించాయి. పోలీస్‌ కస్టడీలో వున్న వాళ్ళకి ఆయుధాలెలా వచ్చాయనే ప్రశ్న బుర్రలోంచి పోనంటూ వేధించసాగింది.
చేతివేళ్ళు ఛానళ్ళను యా౦త్రికంగా నొక్కుతున్నాయి. టీవీలో దృశ్యాలు మారుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో నిందితులను చంపేయడాన్ని పండగలా జరుగుకుంటున్న క్యాంపస్‌ విద్యార్థులు . టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న మరి కొందరు. పోలీసులు చాలా మంచి పని చేసారని ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తున్న వాళ్ళు. తేనె పూసిన కత్తిలాంటి నవ్వుతో అభినందనల్ని స్వీకరిస్తున్న ఉన్నత పోలీసు అధికారి. ఆడపిల్లలు అందిస్తున్న పువ్వుల బొకేలని గర్వంగా అందుకుంటూ, టీవీలకు ఫోజులిస్తున్న ఆ అధికారిని చూస్తుంటే నా వొళ్ళంతా జలదరించింది. మూడు ప్రాణాల్ని తూటాలకు బలిచ్చిన అతని ముఖంలోని ఆ నవ్వుని నేను ఈ జన్మకి మర్చిపోలేననుకుంటాను.
దృశ్యం మారింది. టీవీ యా౦కర్ల రిపోర్టర్ల వికృత చర్యలు. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న వాళ్ళ ముఖాల దగ్గర, వాళ్ళ బంధువుల ముఖాల వద్ద మైక్‌లు పెట్టి మీరేమనుకుంటున్నారు? ఎన్‌కౌంటర్‌ మీకు సంతోషాన్నిచ్చిందా? తూటాలకు బలివ్వడం బావుందా? లేదావాళ్ళని యాసిడ్‌ పోసి చంపి వుండాల్సిందని మీరు భావిస్తున్నారా? ఈ అంశంపై ఎస్‌.ఎమ్‌.ఎస్‌లు చేయండి. మీ అభిప్రాయం చెప్పండి. నోరు విప్పి సరిగా మాట్లాడలేక పోతున్న ప్రణీత నోట్లో మైకు కుక్కి మాట్లాడించిన ఈ భయానక, బీభత్స, జుగుప్సాకర దృశ్యాలను చూడాల్సి రావడం ఎంత బాధాకరం. అతి తీవ్రంగా గాయపడి, వైద్యం పొందుతున్న ఆ పిల్లల దగ్గరికి ఈ టీివీ రిపోర్టర్లను ఎలా అనుమతిస్తున్నారో ఎంతకీ అర్ధం కాని ప్రశ్న. టీవీలలో నడుస్తున్న ఈ అమానవీయ దృశ్యాలు మనసును ఎంత బండ బారుస్తున్నాయె, సున్నితంగా స్పందించడం అంటే ఏమిటో మర్చిపోయేలా తయారు చేస్తున్నాయె చూస్తుంటే, మీడియా మహా విశ్వరూపం వెన్నులోంచి చలి పుట్టిస్తోంది.
వరుసగా జరుగుతున్న సంఘటనలు మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అమ్మాయిల మీద జరిగిన పాశవిక దాడి, పదే పదే పునరావృతమౌతున్న సంఘటనలు, పువ్వుల్లాంటి పిల్లల ముఖాలు మాడి మసి బారిపోయిన దృశ్యాలు, దోషుల్ని శిక్షించమని కోరిన జనాగ్రహాన్ని తెలివిగా తమ వేపు మళ్ళించుకుని ఏకంగా ప్రాణాలే తీసేసిన పోలీసుల క్రూరత్వం. దీన్నంతా పంచరంగుల సినిమాలా జనం మెదళ్ళలోకి రీళ్ళు రీళ్ళుగా పంపిస్తున్న మీడియా.
ఏం జరుగుతోందసలు? మనం ఎటువెళుతున్నాం? అసలు విషయలను గాలికొదిలేసి, వేరుకు పట్టిన చీడనొదిలేసి పైపైన పాకుతున్న పురుగుల్ని చీదరించుకుంటే ఏం లాభం? ‘మహిళా సాధికారత’ అంటే పావలా వడ్డీ అనుకునే చోట, మహిళల మీద పెరుగుతున్న నేరాలకు కారణాలను అన్వేషిించకుండా, ఆ నేరాలను అరికట్టే చర్యల్ని ఆదిలోనే తీసుకోకుండా, ఇంటా బయటా హోరుగాలిలో దీపంలా రెప రెపలాడుతున్న స్త్రీల జీవితాలను ఆసిడ్‌లకు, కిరోసిన్‌లకు, కిరాతకాలకు బలిస్తున్న చోట ఇలాగే, ఇంత బీభత్సంగానే వుంటుంది. స్త్రీ, పురుషుల సమానత్వం అనే మాట మచ్చుక్కూడా వినబడని, ఆలోచనల్లో, దృక్పధాల్లో మార్పుకోసం ఉద్యమ స్పూర్తిని నింపని రాజకీయ కలుషిత వాతావరణంలో ఇలాంటి దృశ్యాలనే చూడాల్సి వుంటుంది. మాకు హక్కుల్లేవా? అంటూ ఆడపిల్లలు అరుస్తూ బలవుతూనే వుంటారు.

Sunday, March 1, 2009

విందు తర్వాత…..

కొండవీటి సత్యవతి

చలి గడగడలాడించేస్తోంది. చేతి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. గది మధ్యలోని బుఖారి నుంచి వచ్చే వెచ్చదనం ఏ మాత్రం సరిపోవటం లేదు.
”అబ్బ! ఇంత చలేమిట్రా బాబూ! ఎలా భరిస్తున్నావ్‌” వధవి అతి కష్టం మీద అంది. చలికి పళ్ళు టక టక కొట్టుకుంటున్నాయి.
”ఏం చేయమంటావ్‌ భరించక. అయినా నిన్ను చలికాలంలో కాశ్మీర్‌ రమ్మని ఎవడు చెప్పాడు” అని హనీఫ్‌ ”కాంద్దీ లావో” అన్నాడు.
”నాకేం తెలుసురా బాబూ! మరీ ఇంత భయంకరంగా వుంటుందంటే ఢిల్లీ నుంచే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని” సుధాకర్‌ మాట్లాడకుండా సవెవాయ్‌ లోంచి వేడి వేడి టీ పోసి ఇచ్చాడు.
టీ తాగుత బుఖారీకి దగ్గరగా జరిగింది మాధవి. వెచ్చటి టీ గొంతులోకి జారుతుంటే హాయిగా వుంది. ఈ సీజన్‌లో ఇక్కడికి రావడం ఎంత బుద్ధి తక్కువో అర్థమైంది మాధవికి.
ఢిల్లీలో ఏదో మీటింగ్‌ అటెండవ్వ డానికి వచ్చింది. అది నిన్న ఉదయమే అయి పోయింది. తన పిన్ని కొడుకు సుధాకర్‌ శ్రీనగర్‌లో మిలటరీలో మంచి హోదాలో ఉన్నాడని ఎలాగైనా ఒకసారి శ్రీనగర్‌ వెళ్ళా లని వధవి ఎప్పటినుంచో అనుకుంటోంది. అయితే ప్రస్తుతం చాలా చలిగా వుంటుందని సుధాకర్‌ చెప్పినా విన కుండా వచ్చింది. సరే వస్తానంటే వద్దనడం ఎందుకులే అని సుధాకర్‌ ఊరుకున్నాడు.
”వదిన ఎపుడొస్తుందిరా” మాధవి అడిగింది.
”లంచ్‌ టైముకి వస్తుందిలే. ఏం ఆకలేస్తోందా?” నవ్వుతూ అన్నాడు సుధాకర్‌.
”ఆకలా? పాడా? పొద్దున్న తిన్నదే అరగలేదింకా”.
”రెండు రోజులైతే అలవాటవు తుందిలే. నేను బయటకెళ్ళి వస్తా. ఒక్కర్తివీ ఉండగలవా?”
”దివ్యంగా వుంటాను. నాకేం భయం. ఎవరైనా తుపాకులుచ్చుకుని వస్తా రంటావా?”
”దివ్యంగా వుంటానని మళ్ళీ తుపా కులంటావేంటీ?”
”ఏవె బాబూ! ఎక్కడ చూసినా సైన్యం, పోలీసులే. ఇక్కడ మామూలు మనుష్యుల కన్నా పోలీసులే ఎక్కువ వున్నట్టు న్నారు.”
”నేచురల్లీ! లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ చాలా వుంది. ఏ టైములో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు”.
”కన్పిస్తూనే వుందిగా. సరే. నేను టీవీ చూస్తుంటాను నువ్వెళ్ళిరా.” అంది ధైర్యంగానే.
”వద్దులే మధ! వదిన వచ్చాక వెళతాలే”
”అయ్యె! నీకేం పనులున్నాయె వెళ్ళరా! నిజంగానే చెబుతున్నా. నాకేం భయం లేదు.”
”అంత అర్జంటేమీ కాదులే. ఇవాళ ఎలాగ ఆదివారం కదా. ఆ… అన్నట్టు మర్చిపోయను. సాయంత్రం మనం డిన్నర్‌కి బయట కెళ్ళాలి. వదిన చెప్పిందా?”
”చెప్పలేదే! అయినా ఈ చలిలో బయటకెలా వెళతాంరా బాబూ”
”తప్పకుండా వెళ్ళాలి. మాపై ఆఫీసర్‌ కూడా వస్తాడు”
బయట కారాగిన చప్పుడైంది.
”వసు వచ్చినట్టుంది” సుధాకర్‌.
లాంగ్‌ కోటు, మంకీ కాప్‌తో వసుధ లోపలికొచ్చింది.
”తొందరగా వచ్చినట్టున్నావే”.
”అవును. మధుకోసం తొందరగా వచ్చేసా. అయినా హాస్పిటల్‌లో కూడా పని ఎక్కువ లేదు.”
వసుధ మిలటరీ హాస్పిటల్‌లో డాక్టరుగా పనిచేస్తోంది.
”వదినా బయటెలా వుంది”
”చలి గురించా. చలిగానే వుంది. మాకు అలవాటయి పోయిందిలే” అంది కోట, కాప్‌ తీసేస్త
”వసూ! ఈవినింగ్‌ డిన్నర్‌ గురించి మధుకి చెప్పలేదట.”
”అవును. ఉదయం హడావుడిలో మర్చిపోయను”.
”సరే! లంచ్‌ చేద్దామా!”
వంటచేసే హనీఫ్‌ వేడివేడిగా వడ్డించాడు.
”రాజ్‌వ కూర చాలా బావుంది. మదూ! ఇంకొంచెం వేసుకో” వసుధ.
”బావుంది. ఇవి మనవేపు బొబ్బర్లలాగా లెదు”.
”అదే జాతిలే. పన్నీర్‌ వేసుకో. ఈ చలికి బావుంటుంది”.
”మదు! నువ్వింకా కథల, కవితల రాస్తున్నావా? మానేసావా?”
”రాస్తూనే వున్నాను. ఈ మధ్యనే నా కథల సంకలనం వేసాను”
”అవునా! మరి నాకు పంపలేదే”
”నీకా?! నువ్వు కథలు కూడా చదువుతావా? తీవ్రవాదుల, ఎన్‌కౌంటర్ల వీటిలోనే మునిగి తేలతావనుకున్నాను”
”భలేదానివి మదు! అది ఉద్యోగం. అవన్నీ ఉద్యోగ ధర్మాలు. నేను కూడా రాసేవాడినని మర్చిపోయవా?”
”అవుననుకో. కాని అదెప్పటి మాట. నువ్వు సాహిత్యం సంగతే మర్చిపోయవనుకున్నాను”.
వీళ్ళిద్దరి సంభాషణని వసుధ ఆసక్తిగా వింటోంది. సుధాకర్‌ కథల గట్రా రాసేవాడని ఆమెకు అస్సలు తెలియదు.
”అలా అనుకోవడం నీ తప్పు. నిజమే చాలా కాలంగా నేనేమీ రాయలేదు. వసుకి నేను రచయితనని తెలియదు కూడా” అన్నాడు నిష్ఠూరంగా.
”ఒ.కె. ఒ.కె. సారీ! నా కథల పుస్తకం నా సూట్‌కేస్‌లో వుంది. ఇపుడే ఇస్తా సరేనా”
”ఇంత చిన్న విషయనికి సారీ ఎందుకులే గాని నేను చేస్తున్న ఉద్యోగం నాలో రచయితని చంపేసింది. అయితే నేను సియచిన్‌లో ట్రయినింగ్‌లో వున్నపుడు జరిగిన ఒక సంఘటన నన్ను కదిలించి చాలా సంవత్సరాల తర్వాత నా చేత కవిత్వం రాయించింది”
”సియచిన్‌ గ్లేసియర్‌లో ట్రయినింగ్‌ అయ్యవా”
నోరు వెళ్ళబెట్టి మరీ అడిగింది మధు.
”అవునే! సియచిన్‌ మంచుకొండల్లో మూడు నెలలున్నాను. అక్కడ ధవళ కాంతులీనే మంచు తప్ప మరేమీ వుండదు. మంచు తప్ప మరో ప్రాణి వుండదు”.
”అమ్మ బాబోయ్‌! ఎలా బతికేర్రా బాబూ!”
”నేనొక్కణ్ణే బతికాను. నా బాచ్‌లో ఐదుగురు చనిపోయరు” సుధాకర్‌ గొంతు భారంగా పలికింది.
వసుధ, మాధవి ఉలిక్కిపడ్డారు. ఈ విషయలేవీ తనతో ఎపుడ చెప్పలేదని ఆశ్చర్యపడింది వసుధ.
”అయ్యె! ఎంత ఘోరం. అలాంటి చోట ట్రయినింగ్‌ ఎందుకసలు” అంది మధు.
”ఆ రోజున ఏంజరిగిందో విను. మేం నిద్రలో ఉన్నపడు పెద్ద మంచుతుఫాను వచ్చింది. నా పక్క టెంట్‌లో వున్న నా బ్యాచ్‌మేట్ల టెంట్లన్నీ మంచులో కప్పడ పోయయి. లక్కీగా నా టెంట్‌కేమీ కాలేదు. మర్నాడు అతి కష్టం మీద వాళ్ళ మృత శరీరాలు మంచు తవ్వి తీసారు. నిద్రలోనే బిగుసుకు పోయరు. వెంటనే నన్ను కిందికి పంపేసారు. చాలా రోజులగ్గాని నేను కోలు కోలేకపోయను. కోలు కొన్నాక ఒక కవిత రాసాను. చాలా సంవత్సరాల తర్వాత రాసాను” ఎటో చూస్త చెబుతున్నాడు సుధాకర్‌.
వింటున్న వాళ్ళ హృదయలు బరువెక్కాయి. వసుధ లేచి వెళ్ళి సుధాకర్‌ దగ్గరగా కూర్చుని ”నువ్వెపుడ ఈ విషయలు నాకు చెప్పలేదే” అంది.
”ఎందుకో నాకు ఆ విషయం తలుచుకోబుద్ధి కాదు. ఆ రాత్రి నాతో సరదాగా కబుర్లు చెప్పిన ఐదుగుర అలా చనిపోవడం చాలా బాధాకరంగా అన్పించేది. ఇదిగో ఇపుడు మధు, నువ్వేం రాయడం లేదు అంటే అదంతా గుర్తొచ్చింది” అన్నాడు.
”అది సరేగాని. అంత చలివుండే సియచిన్‌కి కాపలా ఎందుకసలు?” ”బోర్డర్‌ కదా! వాచ్‌ తప్పదు. దీన్ని కాపలా కాయడంలో ఎందరో మిలటరీ వాళ్ళు చలికి చచ్చిపోతుంటారు. ఇటు, అటు కూడా” మధు బుర్ర గోక్కుంట చటుక్కున అంది ”దీన్ని కామన్‌ పీస్‌ ఏరియగా డిక్లేర్‌ చేస్తే బావుంటుంది కదా!”
”అద్భుతమైన ఐడియ! కాని ఎవరు చేస్తారు. సియచిన్‌ గ్లేసియర్‌లో ప్రతి రోజూ ఎవరో ఒకరు చావాల్సిందే. మనం ‘లేహ్‌’ వెళ్ళగలిగితే అక్కడున్న ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ మ్యూజియంలో సియచిన్‌ సైనికులు వేసుకునే ప్రత్యేక డ్రెస్సులు, షూస్‌, ఫోటోలు చూడొచ్చు” అన్నాడు.
”లేతహ్‌ వెళ్ళడం ఇపుడు కుదరదు. నువ్వా చలి భరించలేవు. మే, జూన్‌ అయితే చాలా బావుంటుంది” అంది వసుధ.
అప్పటికి తినడం పూర్తయింది. హనీఫ్‌ వేడివేడిగా టీ యిచ్చాడు. టీ తాగేసి సుధాకర్‌ బయటకెళ్ళిపోయడు.
”మధ! నువ్వు రావడం వల్ల నాకు రెండు విషయలు కొత్తగా తెలిసాయి. థాంక్స్‌ టు యూ” అంది వసుధ.
”అవును. వీడు చాలా సెన్సిటివ్‌. వాడిదీ నాదీ ఒకే ఈడు. నాకన్నా ఆరు నెలలేవె పెద్దవాడు. మా ఊళ్ళో స్కూల్‌ లేకపోవడంతో నా స్కూల్‌ చదువంతా వీళ్ళ ఊరిలో వీళ్ళింట్లో వీడితోనే అయింది” అంది మాధవి.
”అది తెలుసు. తనే చెప్పాడు. రాస్తాడని మాత్రం ఈ రోజే తెలిసింది”
”చాలా బాగా రాసేవాడు. కథల కన్నా కవిత్వం రాయడం తనకిష్టం. నాకు కథలు రాయడం ఇష్టం”.
”బావుంది. అన్నా చెల్లెళ్ళిద్దర రైటర్స్‌ అన్న విషయం దాచిపెట్టారన్నవట” అంది నవ్వుతూ
”మేమ్‌ సాబ్‌! ఆప్‌కేలియే కోయీ ఆయ” అన్నాడు హనీఫ్‌.
”ఠీక్‌ హై! మై అభీ ఆవూంగీ. వున్‌ కో బిఠాదో” అంది వసుధ.
”మదు! కాసేపు పడుకోరాదు! నేనిపుడే వస్తా”
‘సరే’ అంట ్మాధవి తనకిచ్చిన రూమ్‌లోకెళ్ళింది. కాసేపు టీవీ ొచూసింది. నేషనల్‌ జియొగ్రాఫికల్‌ ఛానల్‌లో అంటార్కిటికా మీద ఏదో ప్రోగ్రామ్‌ వస్తోంది.
వెంటనే సియచిన్‌ గ్లేసియర్‌ గుర్తొచ్చింది. ఆ మంచులో కప్పడిపోయిన ఐదుగురు గుర్తొచ్చారు. వాళ్ళ కుటుంబాల వాళ్ళు గుర్తొచ్చారు.
అయ్యె! అన్పించింది. ఆలోచనల్లో వుండగానే వగన్నుగా కునుకు పట్టింది మాధవికి.
మెలుకువ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ చలిగా అన్పించింది. రూమ్‌లో హీటరుంది. బద్ధకంగా అలాగే మంచంలో పడుకుని వుంది.
”మదు! లేచావా!” అ౦టూ వచ్చాడు సుధాకర్‌.
”ఆ…. లేచాను. నువ్వొచ్చి ఎంత సేపయ్యింది”.
”చాలా సేపయ్యింది. టైమెంతో తెలుసా? ఆరు. మొద్దులా నిద్రపో్యావ్‌”.
”హవ్మె! ఆరయ్యిందా? వదిన లేపొచ్చుగా”.
రెండు సార్లు వచ్చింది. నువ్వేమొ గురకలు పెట్టి నిద్రపోతున్నావ్‌” హాస్యంగా అన్నాడు.

”గురకా? ఛీ… ఛీ నేను గురక పెట్టను”
”నీకెలా తెలుస్తుందేమిటి? గురక నిద్దరోతున్నపుడు వస్తుంది”.
”అవునా? నాకు తెలియదులే. నేనింకా మెలుకువగా వున్నప్పుడు వస్తుందనుకున్నాను” అంది నవ్వుతూ.
ఇద్దర గట్టిగా నవ్వుతంటే వసుధ వచ్చి ”ఏమిటి? ఇద్దర తెగ నవ్వుతున్నారు. ఏం తల్లీ నిద్ర సరిపోయిందా? కుంభకర్ణుడి చెల్లెల్లా నిద్రపోయవ్‌”.
”అంటే నేను కుంభకర్ణుణ్ణని నీ ఉద్దేశమా”
”ఉండొచ్చు” అంది వసుధ నవ్వుతూ.
”అది సరేగాని, ఈ డిన్నర్‌కి నేను రాకపోతే ఏమౌతుంది” అంది ొమాధవి.
”ఏమీ కాదు. ఇంట్లో నీకు బోరు కొడుతుంది. ఎందుకు రానంటున్నావ్‌?
”వాళ్ళెవరో ఏంటో! నాకు పరిచయం లేదుగా”.
”ఏం ఫర్వాలేదు. ఎవరూ ఏమీ అనుకోరు. లేచి తయరవ్‌. మనం ఏడింటికల్లా బయటపడాలి”.
”ఒరేయ్‌! సుధా! ఇంతకీ మనం వెళుతున్న పార్టీ సందర్భం ఏమిటో చెప్పనే లేదు”. కారులో కూర్చున్నాక మాధవి అడిగింది.
”ఇక్కడి ఎస్‌.ఎస్‌.పి. కి ప్రమొషన్‌ వచ్చింది. అతని కొడుకు బర్త్‌డే కూడా నట”. అన్నాడు సుధాకర్‌. ”అలాగా” అంటుండగానే కారు ఓ ఇంటి ముందు ఆగింది. కారులో హీటర్‌ వుండడం వల్ల వెచ్చగానే వుంది.
ఆ చలిలో కారుదిగి బయటకు రావాలంటే ప్రాణాంతకంగా అన్పించింది మాధవికి.
ఎస్‌.ఎస్‌.ప.ిఇనాయత్‌, ఆయన భార్య తబస్సుమ్‌ వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు. అప్పటికే లోపల చాలా మంది వచ్చి వున్నారు. పోలీస్‌, మిలటరీ అధికారుల్తో హాలంతా నిండిపోయింది. హాల్లో సన్నటి వెలుతురు పరుచుకుని వుంది. మంద్రంగా సంగీతం వినబడుతోంది. తబస్సుమ్‌ ఆడవాళ్ళ కూర్చున్న దగ్గరికి వచ్చి అందరినీ పలకరించింది. మాధవి కన్నార్పకుండా ఆమెనే చూడసాగింది. ఎంత అందంగా వుందీమె. విలక్షణమైన కాశ్మీరీ పోలికల్తో తెల్లగా, సన్నగా, నాజూగ్గా మెరిసిపోతోంది. వయసు ఏభై పైనే వుండొచ్చు. కాని అలా అన్పించడం లేదు. వసుధ, ొమాధవిని ఆమెకి పరిచయం చేసింది. ఆత్మీయత ఉట్టిపడే కంఠంతో మాధవిని పలకరించి కుడిచేతి మీద ముద్దుపెట్టింది. మాధవికి గమ్మత్తుగా అన్పించింది.
గ్లాసుల గలగలలు మొదలయ్యయి. ఘుమఘుమలాడే నాన్‌వెజ్‌ కాశ్మీరీ వంటకాల వాసనలు హాలంతా కమ్మేసాయి.
హాలుకు ఒక వైపున అందంగా అమర్చిన టేబుల్‌ మీద గులాబీ రంగు కాక్‌ వుంది.
”హేపీ బర్త్‌ డే టు అన్వర్‌ ” అని రాసిన ప్లేకార్డ్‌ వుంది.
అందరూ ఆ టేబుల్‌ వేపు నడిచారు. లోపల్నించి ఐదేళ్ళ కుర్రాడిని తీసుకొచ్చిందొకామె. కాశ్మీరీల సంప్రదాయ డ్రస్‌లో, తలమీద రమీ టోపీతో కుర్రాడు ముద్దుగా వున్నాడు. అయితే ఆ పిల్లాడు తబస్సుమ్‌ కొడుకంటే ఆమెకి నమ్మకం కలగలేదు. ఆ వయస్సులో వీళ్ళకింత చిన్న కొడుకా?
”వీడు వీళ్ళ మనవడేవె వదినా” అంట గుసగుస లాడింది వసుధ చెవిలో.
”కాదట. కొడుకేనట”.
”సుధా గాడేడీ! వాడినే అడుగు దాం” చుట్ట చూసింది కాని సుధాకర్‌ దగ్గర్లో కనబడలేదు. దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
అన్వర్‌ కేక్‌ కట్‌ చేసాడు. అందర చప్పట్లు కొట్టారు. ఇనాయత్‌, తబస్సుమ్‌లు వాడి నోటిలో కేక్‌ పెట్టి ఫోటోలు తీయించు కున్నారు.ఆ తర్వాత అన్వర్‌ని లోపలి గదిలోకి తీసుకెళ్ళిపోయరు. డ్రింక్స్‌, కబాబ్స్‌ సర్వ్‌ చేసారు. ఎవరి కిష్టమైన డ్రింక్‌ వాళ్ళు తాగుత కబుర్లలో పడ్డారందరూ.
వైన్‌, జిన్‌ లాంటివి ఆడవాళ్ళవేపు వచ్చాయి. మటన్‌ బాల్స్‌ నములూతూ, వైన్‌ సిప్‌ చేస్త ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు.
డిన్నర్‌ కంప్లీట్‌ అయ్యేవరకు సుధాకర్‌ వీళ్ళ వేపు రానేలేదు.
పదకొండు గంటలకి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంట ఇళ్ళకి బయలు దేరారు.
కారులో కూచున్నాక వెంటనే మాధవి అడిగిన మొదటి ప్రశ్న అన్వర్‌ గురించే.
”సుధా! అన్వర్‌ చాలా చిన్నగా వున్నాడు. వీళ్ళ కొడుకేనా? లేక వాళ్ళ మనవడా?” మాధవి
”కొడుకూ కాదు మనవడూ కాదు”.
”ఏమిట్రోయ్‌! మందెక్కువయ్యిందా”
”నిజమే. అన్వర్‌ని వీళ్ళు పెంచుకున్నారు”
”అలా చెప్పు. అదీ సంగతీ”. అంది మాధవి.
”పెంచుకోవడం అంటే దత్తత తీసుకోలేదు. ఒక ఆపరేషన్‌లో అన్వర్‌ వీళ్ళకి దొరికాడు”.
”ఆపరేషన్‌లో దొరకడమేమిటి? వదినా! వీడికి నిజంగానే మందెక్కువ య్యింది”. నవ్వుత అంది మాధవి. వసుధ కూడా నవ్వింది.
”అబ్బ! ఊరుకుంద! నేను ఎక్కువ తాగనని నీకు తెలుసు. కంపెనీ కోసం కొంచం తీసుకుంటాను. సరే! నీ అను మానాలన్నీ తీరాలంటే మొత్తం చెప్పాల్సిందే”.
”చెప్పు చెప్పు” అంట తొందర పెట్టింది.
”నీకు తెలుసు కదా మదు! ఇక్కడ తీవ్రవాదుల ప్రాబ్లమ్‌ గురించి. ఎన్‌ కౌంటర్ల, కూంబింగ్‌ ఆపరేషన్‌లు, కిడ్నాప్‌లు నిత్యం జరుగుతుంటాయి. ఇనాయత్‌ ఇలాంటి ఒక ఆపరేషన్‌లో పాల్గొన్నపుడు అన్వర్‌ దొరికాడు.
”అంటే….’మాధవికి కొంచెం అర్థమయ్యింది.
”ఒక రోజున ఒక ఇంట్లో తీవ్ర వాదులు దాక్కున్నారని ఇనాయత్‌కి ఇన్‌ఫర్‌మేషన్‌ వచ్చింది. ఆయన బలగాలతో ఆ ఇంటిమీద దాడిచేసాడు. ఆ దాడిలో ఇంట్లో వున్న వాళ్ళందర చనిపోయరు. గమ్మత్తుగా అన్వర్‌ గాయలేమీ కాకుండా బతికి బయటపడ్డాడు”.
”నిజంగా ఆ యింట్లో తీవ్రవాదులు దాక్కొన్నారా”.
”లేదని తర్వాత తెలిసింది. అన్వర్‌ తల్లి, తండ్రి, చెల్లి ఆ దాడిలో చనిపోయరు”.
మాధవికి కడుపులోంచి ఏదో తెళ్ళుకొస్తున్నట్లనిపించింది.
”అన్వర్‌ అమ్మా నాన్న అమాయ కులు. పేదవాళ్ళు. ఇనాయత్‌కి వచ్చింది తప్పుడు ఇన్‌ఫర్‌మేషన్‌. అతడి భార్య తబస్సుమ్‌ బలవంతంమీద అన్వర్‌ని తెచ్చుకుని పెంచుతున్నారు.
”ఒక్కసారి కారాపు” అని అరిచింది మాధవి.
సడన్‌ బ్రేక్‌తో కారాగింది.
గబుక్కున డోర్‌ తీసి భళ్ళున వాంతి చేసుకుంది మాధవి. సుధాకర్‌ వసుధ గాభరాపడ్డారు. ”ఏమైంది మధ! ఫుడ్‌ పాయిజనింగయ్యిందేమిటి?”
”ఏం ఫర్వాలేదులే. ఈ వాంతి అవ్వకపోతే నేను చాలా బాధపడేదాన్ని. ఛీ…ఛీ…. ఇలాంటి ఇంటికి తీసుకొచ్చా వేమిటి? అమాయకుల్ని పొట్టన పెట్టుకుని, రక్తపు చేతులతో వాళ్ళ బిడ్డని పెంచడానికి వీళ్ళకి సిగ్గులేద! తన అమ్మా, నాన్న చెల్లెల్ని చంపిన వాడే తనని సాకుతున్నాడని పాపం అన్వర్‌కి తెలియదు. ఎంత ఘొరం! కోపంగా అంది మాధవి.
”మదు! అనవసరంగా ఆవేశ పడకు. కాశ్మీర్లో ఇలాంటివి మామూలే. అన్వర్‌ని పెంచుకుంటున్నందుకు అందర ఇనాయత్‌కి తెగపొగుడుతుంటేను. అనాధలా వదిలేయకుండా…”.
సుధాకర్‌ మాటలు పూర్తికాకుండానే మాధవి ”అనాథని చేసిందెవరు?” అంటూ గయ్‌మంది.
”సుధా! ఇంక వాదించకు. ఆ విష యం ముందు తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు. నాక్కూడా ఏమిటో కడుపులో తిప్పుతున్నట్టు గా వుంది” అంది వసుధ.
సుధాకర్‌ మాట్లాడకుండా కూర్చున్నాడు.
అన్వర్‌ అమాయకమైన ముఖం గుర్తొచ్చి మాధవి భారంగా నిట్తూర్చింది. అన్వర్‌కి జరిగిన అన్యాయన్ని పట్టించు కోకుండా దొంగ చేతికే తాళాలిచ్చినట్లు తన కుటుంబాన్ని చంపినవాడి కొడుకుగా చెలామణి కమ్మని ఆదేశించడం ఎంత అన్యాయం. పైగా అతనికి ప్రవెషన్‌లు, పొగడ్తలు.
ఇక్కడ ఇలాంటివి మామూలే అంట సమర్ధిస్తున్న సుధాకర్‌ వేపు చూస్త ”నేను రేపు వెళ్ళిపోతాను” అంది హఠాత్తుగా.
”రేపేనా? ఎందుకు?
”ఏవె! నాకిక్కడ ఉండాలన్పించ డం లేదు”.
అన్వర్‌ ముద్దు ముఖం ఆమె కళ్ళల్లోంచి చెదిరిపోవడం లేదు.
ఇనాయత్‌ని తల్చుకోగానే ఆమెకి టాల్‌స్టాయ్‌ ‘విందు తర్వాత’ కథలో మిలటరీ అధికారి గుర్తొచ్చాడు. నిశ్శబ్ధంగా కారుదిగి ఇంట్లోకి వెళుతున్న మాధవిని చూస్త నిలబడ్డారు సుధాకర్‌, వసుధలు.
(బుఖారి : కాశ్మీర్‌ లాంటి చలిప్రదేశాల్లో వెచ్చదనం కోసం ఏర్పాటు చేసుకునేది. ఒక స్తంభంలాంటి కట్టడం. దానిలో నిత్యం బొగ్గుగాని, గ్యాస్‌గాని వుంచి వెలిగిస్తే గదంతా వెచ్చగా వుంటుంది.
సవెవాయ్‌ : టీ కాచుకునేది. చిన్న సైజు బాయిలర్‌ లాగా వుంటుంది.
కాంగ్ది : నిప్పుల కుంపటి. కాశ్మీరీలు చలికాలంలో దీన్ని దుప్పట్లో పెట్టుకుని పడుకుంటారు.)

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...