Sunday, November 30, 2008

ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.

ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.


కర్నూల్ వచ్చా నిన్న రాత్రి.ఉదయాన్నే వాకింగ్ చేద్దామని జాతీయ రహదారి(హైదరాబాద్ చిత్తూర్ పోయే దారి)మీదకి వచ్చాను.రాత్రి కురిసిన వానకి తోడు పొగమంచు జోడై దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది.రోడ్డుకి అటు ఇటు పచ్చటి తివాచీ పరిచినట్టు ,దట్టంగా పొగమంచు ఆవరించిన సెనగచేలు,గుత్తులు గుత్తులుగా కంకులేసిన జొన్న చేలు,మరోపక్క పసుపారబోసినట్టు విచ్చుకున్న పొద్దు తిరుగుడు పూలతో కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు చేలు. ఆ చల్లటి వేళ ప్రక్రుతి ఎంత రమణీయంగా ఉందో నేను రాయడం కాదు చూసితీరాల్సిందే.

మెలమెల్లగా తూరుపు ఎర్రబారుతోంది.భానుడి తొలికిరణాల స్పర్శని అనుభవిస్తూ ఎందుకో అలవోకగా పశ్చిమానికి తిరిగానా నా నోట్లోంచి వావ్ అంటూ ఓ కేక దూసుకొచ్చింది.

వానజల్లు లేకుండా విచ్చుకున్న రంగురంగుల ఇంధ్రధనుస్సు.ఓ క్షణం నా కళ్ళని నేను నమ్మలేకపోయాను.పొగమంచు కురుస్తోంది కాని వర్షం లేదే.సూర్య కిరణాలు మంచు మీద ఏటవాలుగా పడితే కూడా రెయిన్ బో వస్తుందా?(ఆ తర్వాత తెలిసింది ఆ టైం లో టౌన్ లో వాన పడిందని)

పచ్చదనం ,ఇంధ్రధనుస్సు నాతో చెట్టాపట్టలేసుకుంటూ నాతో నడిచాయంటే నమ్ముతారా మీరు?

ఒక్కదానివీ జాతీయ రహదారి మీదకి వాకింగ్ కి వెళతావా జాగ్రత్త అంటూ నా సహచరుడు హెచ్చరించాడు కానీ నేను ఒంటరిగా నడిచిందెక్కడ?పచ్చదనం,తొలికిరణాల వెచ్చదనం,ఏడురంగుల హరివిల్లు,ఉదయపు హాయైన ప్రశాంతత ఇవ్వన్ని నాతో ఉంటే నేను ఒంటరిగా నడవడమేంటి?

నిజానికి ప్రక్రుతిని మించిన తోడు వేరే ఏముంటుంది?

Friday, November 21, 2008

మార్పు మాత్రమే శాశ్వతం

ఉదయం చల్లటి గాలి మనసారా శరీరాన్ని తాకేవేళ నా నడకతో పోటీ పడుతూ ఎన్నో ఆలోచనలు.తెలిమంచుతెరలు ఎంత అడ్డం పడినా తొలిసూర్య కిరణాలు తొంగి చూసినట్టు కళ్ళకు అడ్డంపడుతున్న,దేన్నీ స్పష్టం చూడనివ్వని సంధిగ్ధాలెన్నో పటాపంచలౌతున్న చప్పుడు.
నిన్నటి దుఖ తీవ్రత ఈరోజు ఎందుకుండదు?నిన్నటి మనోవేదన, మాటలకందని మానసిక సంఘర్షణ ఈరోజు ఏమౌతుంది?హమ్మో ఇదిలేకపోతే నేను బతకగలనా?హమ్మో అది దూరమైతే నేను భరించగలనా? నువ్వు లేకపోతే నేను బతికుంటనా?నీ కోసం ప్రాణలైనా ఇచ్చేస్తాను.నువ్వు లేని జీవితాన్ని కల్లో కూడా ఊహించలేను.ఎన్ని అబద్ధాలను మోస్తూ మనిషి బతుకుతుంటాడో ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యమేస్తుందో. స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు, అనుబంధాలు ఇవన్ని అవసరమే.కానీ వాటి చుట్టూ మనం అల్లుకునే అభూతకల్పనలే వింతగా ఉంటాయి.ఆత్మ త్రుప్తి కోసం అనుకుంటూ ఎంత ఆత్మ ద్రోహం చేసుకుంటామో ఆలోచిస్తే సంభ్రమంగా ఉంది.అన్నీ శాశ్వతం,అన్నీ బంధాలూ రాతి స్వభావాన్ని కలిగి ఉంటాయి,ఎప్పటికీ మారవు అనుకోవడం లోనే అంత ఉంది చిక్కంతా.
నిజానికి ఏదీ శాశ్వతం కాదు  మార్పు ఒక్కటే శాశ్వతమైంది.చుట్టూ ప్రపంచం చలనశీలతకలిగి ఉంటుంది.
సంతోషం,దుఖం రెండూ శాశ్వతం కావు.అప్పుడే నవ్విన కళ్ళు మరో క్షణంలో కన్నీళ్ళని కురిపించొచ్చు.
అవే కన్నీళ్ళు ఆనంద భాష్పాలుగా పరిణామం చెందొచ్చు.
ప్రపంచాన్ని నడిపించేది మార్పు మాత్రమే.చలనాన్ని, చలనశీలతని అర్ధం చేసుకోగలిగితే బయట ప్రపంచం ఎలా మార్పునకు గురౌతుంతో మన మనో ప్రపంచం కూడా తీవ్రమైన మార్పులకు గురౌతుందనేది అవగాహన అవుతుంది.
జీవనది నిశ్చలంగా,నిర్మలంగా నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది.కానీ అదెంత చలనశీలతను కలిగి ఉంటుందో అక్కడ నీళ్ళు లిప్త మాత్రపుసేపు కూడా నిలిచి ఉండవని మనం మర్చిపోతాం.
జీవితం కూడా అంతే కదా.అన్ని బంధాలూ,స్నేహాలూ,ప్రేమలూ మనల్ని శాశ్వతంగా చుట్టుకుని ఉన్నట్టు, అవి ఎప్పటికీ మారవని ఎంత భ్రమ పడతామో కదా!ఈ క్లారిటీ ని కమ్మేసే పొగమంచు తెరలేవో  ఈ ఉదయపు వేళ జారి నా పాదాల మీద పడుతున్న భావన.
నా నడకలో మరింత ఆత్మవిశ్వాసం,ఆత్మగౌరవం.
మార్పు మీద ఎంతో ప్రేమ.శిలాసద్రుస్య బంధాల విముక్తి.మనస్సు స్వచ్చంగా,విశాలంగా ఉన్న భావన.
విశాల ప్రపంచం మీద ప్రేమ.
ఈ ఉదయం,ఈ తొలికిరణాలు,ఈ చల్లటి గాలీ ,ఈ పొగమంచూ ఈరోజుకే సొంతం.అలా అని వాటిని శాశ్వతమనుకోలేం కదా.ఇవన్నీఈ రొజున్నట్టుగానే రేపూ కావాలనుకోవడమంత వెర్రితనం మరొకటి ఉంటుందా.రేపు కొత్తగా,కాంతివంతంగా మన కళ్ళకి ఆవిష్క్రతమౌతాయిగా.
ఎంతో అద్బుతంగా,ధవళ కాంతి పుంజాలు వెదజల్లుతూ మనస్సుని మైమరపించే బ్రహ్మకమలం మర్నాటికి నిర్జీవంగా రాలిపోతుంది.
ఎంతటి ఆత్మీయ బంధమైనా,ఎంతటి వెలుగుల్ని కురిపించేదైనా అది అలాగే  శిలలా ఉండిపోతుందనుకోవడం  చాలా పొరపాటు.
మారాలి, మార్పుని ఆహ్వానించాలి.మనస్సుని మరింత విశాలం చేసుకోవాలి.

Wednesday, November 19, 2008

మనకేమైంది నేస్తమా

నిన్నలా చూడడం నా కెంత శిక్షో నీకు తెలుసా
 చిరుగాలికి రావి ఆకులు గలగలాడినట్టు
పారిజాతాలు జలజలా రాలిపడినట్టు
తెరలు తెరలుగా మొగలి రేకుల్నివిడదీసినట్టు
సహజంగా, సెలయేరు దూకినంత స్వచ్చంగా
నవ్వే నువ్వు
నీ నవ్వుతో నన్ను వెలిగించే నువ్వు
కన్నీళ్ళు కన్నీళ్ళుగా కరిగిపోవడం
ఆ కన్నీళ్ళకి కారణం నేనే కావడం
అబ్బ! నాకెంత గుండె కోతో నీకు తెలుసా?
ఒకరి సమక్షం ఇంకొకరికి ప్రాణమైన చోటే
ఒకరినొకరం స్ప్రుశించలేకపోవడం
ఎంత విషాదం?
ఒకరికొకరం ప్రాణంగా
స్నేహానికి నిర్వచనంలా నిలబడిన
మనం ఈ రోజు ఎందుకింత నిస్సహాయులమైనాం నేస్తమా!

Monday, November 3, 2008

దిబ్బపాలెం లో కుప్పకూలిన కొంపా గూడు.

ఆ తరువాత మేం ఆ పక్కనే ఉన్న దిబ్బపాలెం గ్రామం వెళ్ళేం.
భూకంపమొచ్చి కుప్పకూలిపోయాయా?శత్రురాజుల దాడిలో కూల్చేయబడ్డాయా అన్నంత హ్రుదయవిదారకంగా ఉన్నాయక్కడ కూలిన ఇళ్ళ ద్రుశ్యాలు.కడుపులో చెయ్యిపెట్టి దేవినట్టయ్యింది. ఎవరి ఇళ్ళను వాళ్ళే కూల్చేసుకుంటున్న దారుణ ద్రుశ్యాలు.ఇళ్ళు,బళ్ళు, కమ్యూనిటి హాళ్ళు ఒకటేమిటి-దిబ్బపాలెంలో అన్నీ మట్టి దిబ్బలే.ఇటుకల పోగులే.ఒంటరిగా దిగులుగానిలబడ్డ పెరళ్ళ ముందు
ప్రేమగా పెంచుకున్న మొక్కలు."వీళ్ళంతా ఎక్కడికెళ్ళారు?" అన్న ప్రశ్నకు గూళ్ళు కూలిపోయాయిగా.చెట్టుకొకరు.పుట్ట కొకరుగా చెదిరిపోయారు.ఎవరెక్కడికెళ్ళేరో ఎవరికి తెలుసు?తమ సొంత గ్రామం.సొంత పరిసరాలు.సొంత మనుషులు.ఆ గ్రామంతో పెనవేసుకున్న అనుభవాలు.గుండె దిటవునిచ్చే సామూహిక నివాస ప్రాంతం.ఏది?ఏమైంది?ఏకాకులై ఏకాంత వాసాలకి తరలిపోయిన ఆ ప్రజల జీవన శిధిలాల్లా దిబ్బపాలెంలో కూలిన ఇళ్ళ దిబ్బలు.కార్పోరేట్ కసాయితనానికి నిదర్శనంలా కనబడుతున్న సముద్రం చుట్టూ వెలుస్తున్న వైర్ల ఫెన్సింగ్.నిర్వాసితులైన ప్రజలకి ఫోటోలు తీస్తూ,వారిపై అవాకులు,చెవాకులు పేలిన ప్రభుత్వ ప్రత్యేక అధికారిబండతనం,లేకితనం.ఉన్న ఇంటిని కూల్చేసి,వలస పొమ్మనడంలోని దుక్ఖాన్ని,గుండె కోతని లేశమంతయినా ఊహించలేని ఆ అధికారితో మా తీవ్ర వాగ్వివాదం."అభివ్రుద్ధి" విశ్వరూపాన్ని, ప్రభుత్వ దారుణ, ,నిర్లక్ష్య వైఖరిని అద్దంలో చూసిన సందర్భమది.

మిగిలింది రేపు.

Sunday, November 2, 2008

తూర్పు కనుమల్లో వెల్లువెత్తిన స్త్రీల కన్నీటి ప్రవాహాలు

భూమిక ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న రచయిత్రుల సాహితీ యాత్ర ఈసారి ఉత్తరంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయమైంది.అక్టోబుర్ 17 న నలభై మంది అందులో ముప్పైకి పైగా రచయిత్రుల తో మా యాత్ర మొదలైంది.ఉత్త్రాంధ్ర లో జరుగుతున్న వివిధ సామాజిక ఉధ్యమాల అధ్యయనం, వాకపల్లి సందర్శనం మా యాత్రలో ముఖ్యమైన ఘట్టాలు.
మేం విశాఖలో దిగిన వెంటనే అల్పాహారం చేసేసి గంగవరం, దిబ్బపాలెం వైపు వెళ్ళిపోయాం. గంగవరం పోర్టు నిర్వాసితుల గురించి మీడియా లో చదవడమే కానీ ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే.గంగవరం గ్రామ ప్రజల గుండె ఘోషను అక్షరీకరించడానికి నా కలానికున్న బలమెంతో నాకు తెలియదు కానీ "మా సముద్రం పోయింది"అనే మాట పదేపదే చెవుల్లో గింగిర్లు తిరుగుతోంది.సముద్రం మా జీవనాధరం.చేపలు పట్టుకుని బతికేటోల్లం.మమ్మల్ని మా సముద్రం నుంచి వేరు చేస్తే మేం బతికేదెట్లా?మేం పని చేసుకు బతుకుతామంటే మీకు చెక్కులిస్తా..ఇక్కడి నుండి పొమ్మంటారేమిటి?ఉద్యోగాలిస్తామన్నరు.ఇల్లు కట్టించి ఇస్తామన్నరు.ఇంకా ఏమేమో ఇస్తామన్నారు.అవన్నీ మాకెందుకు?మా సముద్రాన్ని మాకిచ్చేస్తే చాలు కదా?కన్నీళ్ళ వేడికోలు.
గంగవరంలో మహిళలు సాహసోపేతమైన ఉద్యమం నడిపారు.జైలు కెళ్ళేరు.తుపాకీ తూటాల దెబ్బలు తిన్నారు.నూక రాజు ఆత్మార్పణే చేసాడు.మహిళలు పోర్టులోకి దూసుకెళ్ళి,వంటా వార్పూ కర్యక్రమం పెట్టి,పదిహేను రోజులు అక్కడే వండుకుని,తింటూ పోర్టు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు.స్త్రీలు జైలు కెళ్ళీ శిక్ష అనుభవిస్తున్నపుడు,పురుషులు ఉద్యమ ద్రోహం చేసి ఒప్పందాలు చేసుకున్నారని కన్నీళ్ళతో వారు చెబుతున్నపుడు మేమంతా నోట మాట రానివాళ్ళమయ్యాం.
గంగవరం చుట్టూ వెలుస్తున్న గోఘ సముద్రంలో పుట్టి,సముద్రంతో జీవితం పెనవేసుకుని,సముద్రమృ జీవనాధారమైన వాళ్ళనిసముద్రాన్ని ముట్టుకోకుండా అడ్డుకట్ట వెయ్యడమెంత ద్రోహమో ఎవరు చెబుతారు?మా "సముద్రం పోయింది"అంటూ గుండెలు బాబుకుని ఎడుస్తున్న గంగవరం గ్రామస్తుల్ని,ఉవ్వెత్తున ఉద్యమం నడిపి మోసగించబడిన ఆ స్త్రీ మూర్తులని ఎవరు ఓదార్చగలరు?

మిగతా భాగం రేపు

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...