Wednesday, July 8, 2009

నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి - కమలాదాస్

నేను డిగ్రీ పూర్తి చేసి నాకొక ఉనికిని, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ
హైదరాబాద్ చేరిన తొలిరోజులు. చదువుకున్నది తెలుగు మాధ్యమంలోనే అయినా మా
హిస్టరీ లెక్చరర్ నాకు ఆంగ్ల సాహిత్యం పట్ల ఎంతో ఇష్టాన్ని, ఆసక్తిని
రేకెత్తించారు. ఆవిడ ప్రేరణతోనే డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ సబ్జక్టుగా
తీసుకున్నాను. టెంత్ క్లాసులో సంస్కృతం, ఇంటర్ లో స్పెషల్ తెలుగు,
డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీషు చదవడం వల్ల సాహిత్యం పట్ల ఎనలేని ప్రేమ
ఏర్పడింది. నా కుటుంబ నేపధ్యం సాహిత్యాను రక్తిని కల్గించేది కాదు. నాకు
నేనుగా సాహిత్యంలో మునగడం, తేలడం నేర్చుకున్నాను. కంటబడిన ప్రతి
పుస్తకాన్ని చదవడం, ఆ పుస్తకం కల్గించే ప్రభావానికి లోనవ్వడం, జీవితానికి
అన్వయించుకోవడం ఓ క్రమపద్ధతిలో జరిగాయి. రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా
నుండి గంగా వరకు చదివి నేను తీవ్రమైన ప్రభావానికి గురయ్యాను. అలాగే
సి.వి.రాసిన “సత్యకామ జాబాలి”. ప్రేమ్ చంద్ “గోదాన్” మహాశ్వేతాదేవి
పుస్తకాలు. ఇలా ఎన్నో వేల పుస్తకాలు జీవితాన్ని సుసంపన్నం చేసాయి.

నేను 1976 లో హైదరాబాదు వచ్చాను. అదే సంవత్సరం కమలాదాస్ ఆత్మకథ “మై
స్టోరి” రిలీజ్ అయ్యింది. ఆ రోజుల్లో నేను కొని చదివిన “మై స్టోరీ”
పుస్తకం ఖరీదు ఆరు రూపాయలు. చిన్న ఫాంట్ లో వుంటుంది. కమలాదాస్ మరణ వార్త
విన్నాక దాన్ని తీసి చదవబోతే ఎర్రగా మారిపోయిన పేజీలు, ఈ వయస్సులో అంత
చిన్న ఫాంట్ చదవడం చాలా కష్టమైంది. పేజీలో పేరుకుపోయిన “డష్ట్ మైట్స్”
విజృంభించి నా మీద దాడి చేసి తుమ్మల మీద తుమ్మలొచ్చి కళ్ళలోంచి బొటాబొటా కమలా దాస్ మరణం కల్గించిన దుఖం వల్ల
నీళ్ళొచ్చాయో, పాతపుస్తకం ముట్టుకోవడం వల్ల వచ్చాయో నేను నిర్ణయించుకోలేక
పోయాను. ఎందుకంటే కమలాదాస్ భౌతికంగా వేల మైళ్ళ దూరంలో వున్న తన రచనల
ద్వారా, జీవన విధానం ద్వారా నా మీద విపరీతమైన ప్రభావం వేసిన రచయిత్రి.
సంచలనాలకు పెట్టింది పేరైన కమలాదాస్ పనిగట్టుకొని సంచలనాలను
సృష్టించలేదు. తను నమ్మిన దాన్ని ఆచరించడాన్ని జనం సంచలనాలుగా పిలవడం
జరిగింది. ఆమె ఏం మాట్లాడినా, రాసినా, ఆచరించినా తను నూటికి నూరు శాతం
నమ్ముతూ చేసిందే. ఎవరైనా కొత్త సంచలనం ఏం సృష్టించబోతున్నారని అడిగితే,
“నేను నమ్మిన దాన్ని మాట్లాడుతున్నాను. వివాదాస్పదంగా బతకడం నా కేమీ సరదా
కాదే. జనం ఎందుకలా అనుకుంటారు?” అంటూ ప్రశ్నించేది కమలాదాస్.

కమలాదాస్, నిజానికి మరణ శయ్య మీద హాస్పిటల్ లో ఉండి, హాస్పిటల్ బిల్లులు
చెల్లించడానికి “మై స్టోరీ” రాసింది. నేను ఈ లోకంలోంచి నిష్క్రమించే
ముందు, ఆ సమయం ఆసన్నమయ్యేసరికి నాలో ఉన్న అన్ని రహస్యాలను నాలోంచి బయటకు
పంపెయ్యాలనుకున్నాను. అందుకే ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. అయితే
అనూహ్యంగా నేనుకోలుకున్నాను. నా కుటుంబం గురించి బంధువుల గురించి నేను
రాసిన అంశాలు వాళ్ళల్లో తీవ్రమైన కోపాన్ని కల్గించాయి. చట్టబద్ధంగా ఒక
వ్యక్తిని వివాహమాడి అతనితో వుంటూనే నేను వివాహం బయట వ్యక్తులతో ప్రేమలో
పడ్డానని రాయడం పెను వివాదానికి దారి తీసింది. నేను నా స్వంత ఊరు
వెళ్ళినపుడు ఆ కోపాల మంట నన్ను తాకింది. నేను బొంబాయి పారిపోవలసి
వచ్చింది.” అంటుంది “మైస్టోరీ” కి రాసిన ముందు మాటలో.

1932 లో మలబార్ తీరంలో సంప్రదాయ నాయర్ల కుటుంబంలో పుట్టింది. తండ్రి
వి.యం.నాయక్ “మాతృభూమి” అనే మళయాల పత్రికకు మానేజింగ్ ఎడిటర్ గా
పనిచేసేవాడు. తల్లి బాలామణి అమ్మ కవయిత్రి. తల్లి తండ్రులిద్దరూ తమ
వ్యాపకాల్లో మునిగి తేలుతుండడం వల్ల కమలాదాస్ బాల్యం ఒంటరితనంలోనే
గడిచింది. అయితే తల్లి, మేన మామ నారాయణ మీనన్ లు రచయితలుగా
ప్రసిద్ధులవ్వడం వల్ల ఇంటి నిండా సాహిత్య వాతావరణం వుండేది. చిన్నప్పటి
నుండే కవిత్వం చదవడం అలవాటైంది కమలకు. తనూ కవితలల్లడం అలవరుచుకోవడంతో
పాటు తన దైన ఊహల్లో విహరిస్తూండేది. బాల్యంలో ఎదుర్కొన్న ఒంటరితనానికి
తోడు స్కూల్ వాతావరణం, అక్కడి యాంత్రికత ఆమెను తీవ్రమైన నిరాశను
మిగిల్చాయి. అందుకే ఆమెకు ఆరేళ్ళ వయసప్పుడు రాసిన కవిత్వంలో ఎంతో
విషాదముండేది.

“నేను ఆరేళ్ల వయసప్పుడే చాలా సెంటిమెంటల్ గా ఉండేదాన్ని. విషాదభరితమైన
కవితలు రాసేదాన్ని. తలలు తెగిపోయి, ఎప్పటికీ తలలేకుండా వుండే బొమ్మల
గురించి కవితలు రాసేదాన్ని. అలాంటి ప్రతి కవిత నన్ను ఏడిపించేది” అంటుంది
తన ఆత్మకథలో.

అలాంటి ఒంటరితనపు, విషాదపు బాల్యం గడవక ముందే 15 సంవత్సరాలకే తన కంటే
చాలా పెద్దవాడయిన మాధవ దాస్ తో పెళ్ళి జరగడం ఆమెను మరింత నైరాశ్యంలోకి
తోసేసింది. మాధవ్ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక తొలిసారి ఆమెని కలవడానికి
కలకత్తా వొచ్చినప్పుడు అతని ప్రవర్తన ఆమెను తీవ్రంగా గాయపరచడతో పాటు అతని
పట్ల విముఖతను ప్రోదచేసింది. అతని మొరటుతనం ఆమెను భయపెట్టింది. తన
ఒంటరితనాన్ని దూరం చేస్తాడని భావించిన ఆమె అతన్ని వెకిలి చేష్టలని
అసహ్యించుకుంది.”

“అతను నన్ను సున్నితంగా తన చేతుల్లోకి తీసుకోవాలని, నా చెవుల్లో ప్రేమ
భాష్యాలు చెప్పాలని ఆశించాను. నాతో ప్రేమగా సంభాషించాలని, స్నేహం
కురిపించాలని, వెచ్చటి స్పర్శని పంచాలని కోరుకున్నాను. తన చేతులతో నా
ఒంటరితనాన్ని దూరం చేస్తాడని నేను గాఢంగా ఆశించాను.”

అలా జరగక పోగా ఆమె ఒంటరిగా వున్నప్పుడు అతని మొరటు శృంగార చేష్టలు ఆమె
సున్నితమైన శరీరం మీద నల్లటి, ఎర్రటి మచ్చల్ని మిగిల్చాయి. వివాహం జరిగాక
తన తొలి రాత్రి అనుభవాన్ని ఇలా వర్ణిస్తుంది.

“తొలి రాత్రి ఎలాంటి హెచ్చరికా లేకుండా అతను నా మీద పడ్డాడు. అతన్నుంచి
తప్పించుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను. నా గుండె వేగంగా
కొట్టుకోవడంతో నన్ను వదలమని ఎంతో బతిమాలాను. వినలేదు. ఆ రాత్రి అతని
అత్యాచార పర్వం అసంపూర్తిగానే మిగిలింది. ఆ రాత్రి పదే పదే అతను నన్ను
గాయపరుస్తూనే వున్నాడు.”

కమలాదాస్ “మారిటల్ రేప్” గురించి, తన తొలిరాత్రి అనుభవం గురించి వివరంగా
తన ఆత్మకథలో “wedding night:” అనే చాప్టర్ లో ఎంతో ధైర్యంగా రాసింది.

పెళ్ళి, భర్త లాంటి ఆలోచనలు కలగని వయస్సులోనే పెళ్ళవడం, వివాహ జీవితంలో
కుదురుకోక ముందే 16 ఏళ్ళకే తల్లవడం జరిగిపోయాయి. కమలాదాస్ పెద్దకొడుకు
నల్లప్పన్ ఆమెకు పదహారేళ్ళకే పుట్టాడు. వెంట వెంటనే ఇద్దరు కొడుకులు
పుట్టడంతో చిన్నారి కమల చిన్నపిల్లలాగే తన కొడుకులతో కలిసి ఆడేది,
పాడేది. పెద్దకొడుకు పుట్టాక, ఆమె భర్త కనపరిచిన విసుగు, నిర్లక్ష్యం
ఆమెను ఎంతో బాధపెట్టేవి. అతనికి సెక్స్ తప్ప ఇంకేది పట్టేది కాదు. ఫక్తు
వ్యాపారి లాగా ప్రవర్తించేవాడని రాస్తుంది ఒకచోట. తను ఊహించుకున్న
జీవితానికి, వాస్తవంతో తను బతుకుతున్న జీవితానికి ఎక్కడా పొంతన కుదరక
తీవ్రమనస్తాపం పొందేది. ఈ సంఘర్షణంతో ఆమె కవిత్వంలో పొంగిపొర్లేది.
సమ్మర్ ఇన్ కలకత్తా, ది దిసెండెంట్స్ కవితా సంపుటిల్లో తన మానసిక
కల్లోలాన్ని, కలవరాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే భర్త నిర్లక్షాన్ని,
తిరుగుబోతు తనాన్ని ధిక్కరిస్తూ, తాను కూడా అతని లాగానే విశ్వాస
రాహిత్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటుంది.

I made up my mind to be unfaithful to him, at least physically.” ఒక
భవన నిర్మాణ కార్మికుడితో ప్రేమకలాపాలు సాగించడానికి ఎలా ప్రయత్నించింది
ఎంతో వివరంగా, ధైర్యంగా “మైస్టోరీ”లో రాస్తుంది.

ఈ సాహసం, తిరుగుబాటు తత్వం బతుకు పొడుగునా కలుపుకోవడం కమలాదాస్
ప్రత్యేకత. సంసార జీవితం లోని మొనాటనీని అత్త, భర్తల సాధింపులను
తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి సైతం సిద్ధపడుతుంది. అక్కడ కూడా
విఫలమై రాజీ పడుతుంది. భర్తకు చాకిరీ చెయ్యడం అతని చొక్కాలకు బటన్లు
కుట్టడం, వొళ్ళు నలిగేదాకే చాకిరీ చేయడం అలవాటు చేసుకున్నా ఆమెలోపలి ఆత్మ
అనుక్షణం ఆమెను ధిక్కరించేవి. తను కలలు కన్న జీవితానికి, తాను బతుకుతున్న
జీవితానికి ఎక్కడా పొంతన కుదరక మానసిక సంఘర్షణని అనుభవిస్తూ, ఆ సంఘర్షణని
కవితలుగా మలచడం అలవాటు చేసుకుంది.

ఒక రోజు కమలాదాస్ భర్త మాధవ్, తన పురుష ప్రేమికుడుతో కలిసి తమ పడకగది
తలుపులు బిగించుకున్నపుడు, (అదీ తన పుట్టిన రోజు నాడు) కమల భరించలేక
భోరున ఏడ్చింది. తన భర్త ప్రేమ తనది కాదని అర్ధమై అర్ధరాత్రిళ్ళు ఒంటరిగా
దుఃఖంతో సతమతమయ్యేది. అలాంటి ఓ రాత్రి, కొత్త జీవితాన్ని, కొత్త
భవిష్యత్తునూ ఆశిస్తూ
“wipeout the paints, unmould the clay,
Let nothing remain of that yesterday”

అంటూ రాసిన కవితని అప్పటికప్పుడు పత్రికకు పంపించింది. ఇంట్లో పనంతా
అయ్యాక, అందరూ తిని నిద్రపొయ్యాక, అర్ధరాత్రి వేళ డైనింగ్ టేబుల్ ని
శుభ్రం చేసుకొని అక్కడే రాయడానికి కూర్చునేది. గంటలు అలా గడిచిపోతుండేవి.
ఒక్కోసారి తెల్లారి పోయేది. రాత్రంతామేలుకొని రాస్తూ వుండడం, పగలు మళ్ళీ
కుటుంబ బాధ్యతలు వీటన్నింటితో ఆమే ఆరోగ్యం పాడవడం మొదలైంది.రచయిత్రి
కావాలనుకునే స్త్రీకి ఈనాటికీ తనకంటూ ఓగది, ఓ టేబుల్, కుర్చీ, సరిపడిన
సమయం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కమలాదాస్ ఇలా అంటుంది.

“నేను మామూలు మధ్యతరగతి స్త్రీ గురించి ముఖ్యంగా ఎవరైతే రచయిత
కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నా విషయానికొస్తే
వంటింట్లో కూరగాయలు తరుక్కునే బల్ల, భోజనాలు తినే బల్ల ఇవే నా రచనా
స్థలాలు. అదంతా శుభ్రం చేసుకుని రాసుకోవడానికి కూర్చోవాలి. అదే నేను
పనిచేసుకునే స్థలం. అందరూ నిద్రపోయాక నేనూ, నా టైప్ రైటర్ మాత్రమే
మేలుకొని వుంటాం. అలాంటి సమయంలోనే నేను నా కుటుంబాన్ని పూర్తిగా
మర్చిపోయి స్వతంత్ర వ్యక్తిగా మిగులుతాను. ఆ నిశ్శబ్ద నిశిరాత్రి నన్ను
నేను కనుగొంటాను.” అంటుంది. 1921 లో వర్జీనియా వుల్ఫ్ “ఏ రూమ్ ఆఫ్ ఒన్స్
ఒన్” లో “ప్రతి స్త్రీ తనకంటూ ఓ గది, తనదంటూ కొంత సొమ్ము తప్పకుండా
కలిగి ఉండాలి. రచయిత్రి కావాలనుకునే స్త్రీలకి ఇవి ఖచ్చితంగా వుండాలి”
అంటుంది. కమలాదాస్ లాంటి ప్రసిద్ధ రచయిత్రులు కూడా డైనింగ్ టేబుల్ మీదే
తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం నిజంగా విషాదమే కదా!

కమలాదాస్ కథలు, నవలలు రాసినప్పటికీ ఆమె రాసిన కవిత్వం బహుళ ప్రజాదరణ
పొందింది. తనలో చెలరేగే సంఘర్షణలను, భావోద్వేగాలను, కల్లోలాలను
వ్యక్తీకరించడానికి కథ, నవల కన్న కవిత్వానికే ఎక్కువగా ఎంచుకున్నది. ఆమె
భావాల తీవ్రత, స్వేచ్చా కాంక్ష కవిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతుంది.
“పునీల్” అనే కవితలో

నిజం,
ఒకటి రెండు కట్టుబాట్లని నేను మీరాను
అయినప్పటికీ దైవాన్ని కాని, సమాజాన్ని కాని క్షమాభిక్ష కోసం అర్ధించను.
అతిక్రమణలోనే ఆనందాన్ని అనుభవించాను
నిజంగా, నన్ను నేను పునీతురాలిగానే భావిస్తాను.
పుణ్యం కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు
పరిత్యాగంలోని నిజమైన స్వేచ్ఛా సమయాల కోసం మాత్రమే!”

( - అనువాదం పసుపులేటి గీత)

“నాలో సుడులు తిరిగే బాధే కవితలుగ రూపెత్తాయ్. ప్రతి కవిత బాధలోంచే
పుట్టింది.” అంటుంది ఒకచోట. ఒంటరితనం, భార్యాభర్తల సంబంధంలోని బోలుతనం,
యాంత్రికత,ప్రేమ రాహిత్యం కమలాదాస్ ని నిరంతర అన్వేషణలోకి నడిపాయి.
సంతోషం కోసం, నిజమైన ప్రేమ కోసం ఈ అన్వేషణ కొనసాగింది. సూటి బాణాల్లాంటి
కవితల్లో తన భావోద్వేగాలను వ్యక్తీకరించడం, జనాలను షాక్ చెయ్యడం ఆమెకు
వెన్నతో పెట్టిన విద్య.

“స్టాక్ వెరిఫికేషన్” అనే కవితలో ………….

మునుల తాళపత్ర గ్రంధాలు, సాధువుల ప్రవచనాలు నన్ను శాంత పరిచే వేదాంతాలు,
ఏవీ నా మీద రుద్దకండి కాళ్ళ మధ్య ఓ మనిషిని బిగబట్టి ముగ్గురు
కొడుకుల్ని బయటకు తెచ్చాను” అని రాయగలిగిన సత్తా కమలాదాస్ లో మాత్రమే
చూడగలం.

కమలాదాస్ కవిత్వం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న వేళ, ఆమె భర్తకి కవిత్వ
రచన లాభసాటి వ్యాపారంగా కనబడలేదు. రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసే మాధవ్
దాస్ ఇంటా బయటా ఎప్పుడూ డబ్బులెక్కల్లోనే మునిగి తేలుతుండడం, ఆమె ఏం
రాస్తే డబ్బులు రాలతాయో ఆలోచించడం, ఆమెను కవిత్వం రాయడం మానేసి కథలు
రాయమని నిర్దేశించడంతో కమల నవలలూ, కాలమ్స్ రాయడం మొదలుపెట్టింది.” అతను
చెప్పిన దాన్ని నేను ఏనాడూ వ్యతిరేకించలేదు. దీనివల్ల నాలో కవిత్వం ఎండి
పోయింది కానీ మా దాంపత్యం మాత్రం విజయవంతంగా నడిచింది.” అంటుంది.
అందులోని వ్యంగ్యాన్ని, పదునును అర్ధం చేసుకుంటే తప్ప కమలాదాస్ వేదనని
అర్ధం చేసుకోలేం.

కమలాదాస్ మళయాళ సాహిత్యాన్ని “మాధవకుట్టి “,ఆంగ్ల సాహిత్యాన్ని” కమలాదాస్
“పేరుతోను రాసేది. ఆమె రాసిన ఆంగ్ల రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
ప్రాచుర్యం పొందాయి. నోబుల్ సాహిత్య పురస్కారానికి కూడా! కమలాదాస్
ఆంగ్లంలో అయిదు కవితాసంపుటులు ఒక నవల ” అల్ఫాబెట్ ఆఫ్ లష్ట్” “పద్మావతి
ది హర్లెట్ అండ్ అదర్ స్టోరీస్” పేరుతో కథల సంపుటి, “మైస్టొరీ” ఆత్మకథ
ప్రచురించింది.

కమలాదాస్ కథల నిండా కలకత్తాలో ఆమె బాల్యం తాలూకు అమాయికత్వం, జ్ఞాపకాలు
నిండి వుంటాయి. ఆమె కవిత్వం ఎలాంటి దాపరికాలు లేకుండా, కుండ బద్దలు
కొట్టినట్టు వుంటుంది. “ఇల్లాలినంటూ నాకో పేరుపెట్టావ్/ నీకు టీ
కాచడానికి పటిక బెల్లం దంచడం/ వేళ తప్పకుండా విటమిన్ గోలీలివ్వడం/ ఇదీ
నేను నేర్చుకున్న చదువంతా” కమలాదాస్ ఇంటి చాకిరీ, భర్తకి సేవలు చేయడం
గురించి ఇంత సూటిగా రాయడం ఇపుడూ పెద్ద గొప్పగా, కొత్తగా అన్పించకపోవచ్చు.
80 దశకంలో తెలుగు సాహిత్యంలోకి స్త్రీవాద ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి వొచ్చి
చేరినపుడు తెలుగు కవయిత్రులు ఇంతకంటే సూటిగ, ఘాటుగా కవిత్వం రాసారు. కానీ
కమలాదాస్ రాసిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆమె ఎంత విప్లవాత్మకంగా,
స్త్రీవాద దృష్టి కోణంతో రాసిందో అర్ధం చేసుకోవచ్చు. సహజంగానే ఆమె రచనలు
సంప్రదాయ వాదాల్లో గగ్గోలు పుట్టించాయి. 1976 లో ఆమె ప్రచురించిన
“మైస్టోరీ” జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గొప్ప కీర్తిని
సంపాదించిపెట్టినా అంతే స్థాయిలో ఆమె మీద విమర్శల జడివాన కూడా కురిసింది.
అందులో ఆమె వర్ణించిన అనుభవాలు, వివాహేతర సంబంధాల వర్ణనలు, ఆడస్నేహితులతో
ఎదురైన అనుభవాలు భర్త కొనసాగించిన హోమోసెక్సువల్ సంబంధాలు -
వీటిన్నింటిని నదురు బెదురు లేకుండా తన ఆత్మకథలో రాసిన కమలాదాస్
సంప్రదయవాదులతో పాటు బంధువుల ఆగ్రహానికి కూడా గురైంది. లెస్బియన్ రిలేషన్
షిప్ గురించి ఆమె రాసిన అంశాలు చాలా మందిని షాక్ చేసాయి. 18 సంవత్సరాల
అమ్మాయి తన పట్ల వ్యవహరించిన విధాన్ని

“ఆమె నా పెదాల మీద ముద్దు పెట్టింది. నా చెవుల్లొ నువ్వు చాలా స్వీట్ గా
వున్నావ్ అంటూ గుసగుసలాడింది. నా జీవితంలో నేననుభవించిన మొదటి ముద్దు
ఇదే. మా అమ్మ నేను పసిదానిగా వున్నపుడు ముద్దు పెట్టిందేమో గాని ఆ తర్వాత
ఎవ్వరూ నాకు ముద్దివ్వలేదు” అంటుంది.

కమలాదాస్ రాసిన విషయాలు ఆనాటి మళయాళీ సమాజాన్ని ఓ కుదుపు కుదిపాయి.
నిర్భయంగా ఆమె వెల్లడించిన అంశాలను చూసి గగ్గోలు పెట్టే సమాజాన్ని మరింత
ఏడిపించాలనే అల్లరి ఆలోచనలు కూడా ఆమె చేసిందా అన్పించేలా ఆమె ఆత్మకథలో
ఒక్కో చాప్టర్ కి ఆమె పెట్టిన శీర్షికలు వున్నాయి. బహుశా ఆమె ఆత్మకథను
సీరియలైజ్ చేసిన పత్రిక కూడా రెచ్చగొట్టే విధంగ శీర్షికలు పెట్టినట్టు
అన్పిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో అవన్నీ ఉత్తుత్తి సంఘటనలే అని
ప్రకటించింది కూడా!

కమలాదాస్ తన జీవితమంతా ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం
అన్వేషించింది. “ప్రేమతోను, నమ్మకంతోను నిండీన సంబంధాలను స్త్రీ పురుషులు
ఇద్దరూ కోరుకుంటారని, అని ఇంట్లో దొరకనప్పుడు బయట వెతుక్కుంటారని” ఒక
ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె. వివాహం బయటి ప్రేమ ను వెదుక్కొవడం అనే
ఆలోచననే సహించని సంప్రదాయ సమాజం, ఆమె భావాలను విని వొదిలేస్తుందని
భావించడం వెర్రితనమే అవుతుంది. అందుకే మాట్లాడిన ప్రతి మాట, రాసిన ప్రతి
అక్షరం వివాదాస్పదమైంది. ఆమె మనస్ఫూర్తిగ నమ్మిన దాన్ని చెప్పింది తప్ప
సెన్షేషన్ కోసమో, వివాదం కోసమో చెప్పలేదు. ఆమె దృష్టీలో శారీరక, మానసిక
సౌందర్యాల మధ్యన భేదం లేదు. శరీర సౌందర్యాన్ని వర్గించడంలో ఆమె ఎలాంటి
శషబిషలు పాటీంచలేదు. “డాన్స్ ఆఫ్ యూనక్స్”, “యాన్ ఇంట్రడక్షన్” లాంటి
కవితల్లో దీనిని మనం చూడొచ్చు. “యాన్ ఇంట్రడక్షన్” కవితలో

“I am every/ woman who love” అంటుంది. 70 దశకంలో కొత్తగా రాస్తున్న
రచయిత్రులకు ప్రతినిధిగా కమలాదాస్ “వ్యక్తిగతంగా సమాజం భావించే అన్ని
అంశాల మీద రాస్తూ, ఆయా అంశాలను బహిరంగపరచడానికి ఎలాంటి సంకోచం లేకుండా
రాస్తూ పోయింది. అప్పటికే ఇస్మత్ చుంగ్తాయ్ రాసిన “రిహాయి”కథ సంప్రదాయ
సాహిత్యలోకంలో పెను సంచలనాలను కలిగించింది. కమలాదాస్ తన అనుభవాలుగా
అంగీకరిస్తూ, శరీరం గురించి, కోరికల గురించి, ప్రేమ గురించి, మానవీయ
స్త్రీ పురుష సంబంధాల గురించి ధైర్యంగా రాయడం ద్వారా కొత్తగా రాస్తున్న
రచయిత్రులకు ఎంతో స్ఫూర్తిని, నిబ్బరాన్ని ఇచ్చింది. ఎనభై దశకంలో
వెల్లువెత్తిన స్త్రీవాద సాహిత్యానికి, స్త్రీ వాద కవయిత్రులకు
స్ఫూర్తిగానూ కమలాదాస్ రచనలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

కమలాదాస్ ఏది రాసినా సంచలనమే. ఏది ఆచరించినా సంచలనమే. డిశంబరు 16, 1999
సంవత్సరంలో 65 ఏళ్ళ వయస్సులొ ఇస్లామ్ మతాన్ని స్వీకరించింది. ఆమె రచనలు
ఎంత సంచలనం కల్గించాయో ఆమె ఇస్లామ్ మత స్వీకరణ కూడా వేడి వేడి చర్చల్ని
లేవనెత్తింది. అంతే కాదు బురఖా ధరిస్తూ, స్త్రీలను అణిచివేసే హిందూ మతంలో
కన్నా ఇస్లామ్ లోనే స్త్రీలకు రక్షణ వుందనే ప్రకటన కూడా చేసింది.
సహజంగానే ఇలాంటి ప్రకటనలు జనంలో ఆమె పట్ల ఆగ్రహాన్ని వెల్లుబికిస్తాయి.
అయితే కమలాదాస్ తాను నమ్మిన దాన్ని ఆచరించడానికి, రాయడానికి, బహిరంగంగా
ప్రకటించడానికి ఏనాడు జంక లేదు. ఒక సంప్రదాయ హిందూ నాయర్ కుటుంబానికి
చెందిన కమలాదాస్, భర్త మరణానంతరం ఇస్లాం స్వీకరించి, పేరు మార్చుకుని
తుదివరకు అలాగే బతికింది.

కమలాదాస్ రాజకీయాలను కూడా వొంటబట్టించుకుని “లోక్ సేవా పార్టీ” ని
స్థాపించి 1984 పార్లమెంటు అభ్యర్ధిగా పోటి చేసి ఓడిపోయింది.

తనని తాను ఫెమినిష్ట్ గా చెప్పుకోక పోయినా, తన జీవితంలోని అనుభవానలను,
తాను నమ్మిన వాటిని గురించి రాస్తూ స్త్రీల జీవితాల్లోని అణిచి వేత
గురించి రాసింది. తన గురించి రాసుకున్నా, వారెవ్వరి గురించి రాసినా ఆమె
ఎక్కడా ఏ ముసుగులూ వేసుకోలేదు. జీవితమంతా ప్రేమకోసం వెదుకులాటే అయ్యింది
ఆమెకి. “నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు. ప్రేమకోసం వెదుకులాటే నా జీవితమంతా”
అంటుంది ఒకచోట.

కమలాదాస్ తన రచనల ద్వారా ఇంగ్లీషు, మళయాళ సాహిత్యాల్లో అజరామరంగా
నిలిచిపోతుంది. నిరంతర అన్వేషిగా జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆ
ప్రయోగాల పర్యవసానంగా ప్రజల ఆగ్రహాలను చవి చూసింది. తన అన్వేషణలో భాగంగా
పెయింటింగ్స్ వేసింది. రాజకీయాల్లోకి నడిచింది. మతం మార్చుకుంది. నిరంతర
అన్వేషణలో భాగమే ఇవన్నీ కూడా. ప్రేమతో నిండిన స్త్రీ పురుష సంబంధాల కోసం
జీవితమంతా అన్వేషించింది. మనుష్యుల మధ్య మానవీయ సంబంధాల కోసం ఆరాటపడింది.

2006 లో కమలాదాస్ చిట్టచివరి సారి కేరళను సందర్శించింది. తన తాతల నాటి
ఇంటిని, స్థలాన్ని కేరళ సాహిత్య అకాడమీకి దానం చేసింది. తను బతికుండగా
మళ్ళీ కేరళకు రాలేననే విషయం ఆమెకు అర్ధమైనట్టే వుంది. అందుకే ఇలా
అంటుంది.

“నేను మళ్ళీ నా మరణం తర్వాత ఇక్కడికి వస్తాను. మానవాకృతిలో మాత్రం కాదు.
ఒక పక్షిగానో, ఒక లేడిగానో మాత్రమే వస్తాను. నేను ఈ భూభాగంలో మమేకమై
వుంటాను.”

కమలాదాస్ తుది శ్వాస విడిచింది పూనాలో తన రెండో కొడుకు ఇంట్లో. 75
సంవత్సరాల తన అన్వేషణకు ఫుల్ స్టాప్ పెడుతూ 31 మే కమలాదాస్ మరణించింది.
చనిపోయేందుకు రెండు సంవత్సరాల ముందు తనను దర్శించవచ్చిన మిత్రుడు విజయ్
నంబీశన్ తో నేను ముసలి దాన్ని అయిపోతున్నాను” అంటుంది. 72 ఏళ్ళ వయస్సులో
తను ముసలితనంలోకి వెళ్ళినట్టు కొత్తగా చెప్పడం, గమనించడం అంటే తనలోని
పసిప్రాయం లేకుండా పోయిందని అంగీకరించడమే. అలాంటి చిన్నపిల్లలతత్వం ఆమెలో
తుదిదాక బతికుండడమే ఆమెలో గొప్పతనం.

నిరంతరాన్వేషి,, సంచలనాల చిరునామా, ప్రేమ పిపాసి, సాహసి కమలాదాస్ కు ఇదే
నా అక్షరాంజలి. తన ఆత్మకథ ద్వారా నా మీద ఎంతో ప్రభావం చూపిన కమలకు నా
అశ్రు నివాళి

1 comment:

మరువం ఉష said...

సాంప్రదాయాన్ని దాని దారికి వదిలి తనక్కావాల్సినదాన్ని వెదుక్కున్న ఆమె ధీరోదాత్త. నిజమైన ప్రేమ దక్కించుకోలేకపోవటం దురదృష్టమైనా కనీసం ఈ ప్రయత్నం చేయగలగటం ఆమెకి అందిన అరుదైన అవకాశం. ఇదీ అని చెప్పలేని ఎన్నో సాపత్యాలు మా ఇరువురి నడుమా. మరోసారి నివాళి సమర్పిస్తూ...

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...