Wednesday, July 6, 2011

జైళ్ళతో నా అనుభవాలు-మొదటి భాగం

నేను మొదటిసారి 1999 లో రాజమండ్రి సెంట్రల్ జైల్ విజిట్ చేసాను.
అప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం లో మండల రెవెన్యూ ఆఫీసర్ గా పని చేస్తున్నాను.
ఆ ఉద్యోగానికి రిజైన్ చేసాలెండి.
చిలకలూరిపేట బస్సు దహనం కేసు మీకు గుర్తు ఉండే ఉంటుంది.
1993 మార్చి 8 న చలపతి,విజయవర్ధనం అనే ఇద్దరు దళిత యువకులు చిలకలూరి పేట నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో దోపిడీ చెయ్యడానికి ప్రయత్నించి పెట్రోల్ పొయ్యడం వల్ల బస్సు తగలబడి చాలామంది సజీవ దహనమయ్యారు.అదో భయానక సంఘటన.అప్పట్లో ఎంతో సంచలనం కల్గించిన ఘోరమైన నేరం.
ఈ కేసులో ముద్దాయిలైన చలపతి,విజయవర్ధనం లకు కోర్టు మరణ శిక్ష విధించింది.
వాళ్ళు చేసింది ఘోరమే.కాని మరణ శిక్ష పరిష్కారం కాదు.
అప్పట్లో మరణ శిక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక గ్రూప్ లో నా మితృరాలు ఉండడం,వాళ్ళు మరణశిక్షలకు వ్యతిరేకంగా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీస్తుండడం వల్ల నేను కూడా వాళ్ళతో కలిసి మరణ శిక్షలు పడ్డ చలపతి,విజయవర్ధనం లను కలిసి వాళ్ళ ఇంటర్యూలను తీసుకోవడానికి రాజమండ్రి సెంట్రల్
జైలుకెళ్ళేం.
వాళ్ళని ఇంటర్యూ చెయ్యడం,వాళ్ళ వర్షన్ ని వినడం, దాన్ని షూట్ చెయ్యడం మర్చిపోలేని అనుభవాలు.
గుంటూరు లో ఓ మురికివాడలో నివసించే వీళ్ళిద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు.
బస్సును దోపిడీ చెయ్యాలని ప్లాన్ వేసారు.చిలకలూరు నుండి బస్సులో బయలు దేరి మార్గమధ్యంలో దోపిడీ కి ప్రయత్నించారు.ప్రయాణికులు ప్రతిఘటించడంతో ఘర్షణ
జరిగిందని మంటలు ఎలా చెలరేగాయో తమకు తెలియదని వాళ్ళు చెప్పారు.దోపిడీ చెయ్యడమే తమ ఉద్దేశ్యమని బస్సు తగలబెట్టాలని తాము అనుకోలేదని తమవల్ల జరిగిన ప్రాణ నష్టానికి తామెంతో కుమిలిపోతున్నామని చెప్పుకున్నారు.
తాము తెలిసో తెలియకో చాలా కుటుంబాలకు తీరని వేదన కలిగించామని తమని క్షమించమని వేడుకుంటున్నామని చెప్పారు.
మేము వాళ్ళతో ఓ పూటంతా గడిపాం.అప్పటికే చాలా కాలంగా
వాళ్ళు జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తున్నారు.
మరణ శిక్షలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న కాలమది.
వీళ్ళకు కూడా మరణ శిక్షను కఠినమైన జీవిత ఖైదుగా గా మార్చాలని జరిగిన ఉద్యమంవల్ల
వాళ్ళ మరణ శిక్ష ఎన్నోసార్లు వాయిదాపడింది.మరణం అంచులదాకా వెళ్ళారు చాలా సార్లు.
మొత్తానికి వాళ్ళ మరణ శిక్ష రద్దయ్యింది.
బహుశా వాళ్ళు జీవిత కాల శిక్షలు కూడా పూర్తి అయ్యి విడుదలయ్యుంటారు.
చాలా కాలం వాళ్ళ దగ్గర నుండి మాకు ఉత్తరాలొస్తుండేవి.
పశ్చాత్తాపంతో దహించుకుపోతూ ఉత్తరాలు రాసేవాళ్ళు.
వాళ్ళు చేసింది చిన్న నేరమేమీ కాదు.
అలా మొదటి సారి నేను జైల్ చూసాను.

4 comments:

Praveen Mandangi said...

మావోయిస్ట్ కవి శివసాగర్ వ్రాసిన కవిత ఇది. మనుధర్మ చట్టాల పడగ నీడలో హవాలాగాళ్ళ కక్కుర్తి కామకేళి, దాని విషపుకోరల్లో దళితులు.
http://audios.teluguwebmedia.in/59854924

karlapalem Hanumantha Rao said...

మరణ శిక్ష అమలు అయివుంటే ...?
మరి వారి పశ్చాత్తాపానికి అవకాశమే వుండి వుండేది కాదు.అలాగని వారిని ఎందుకో క్షమించాలనీ మనసుకు అనిపించదు.మరణ శిక్షల రద్దు అంశం చర్చకు వచ్చినప్పుడల్లా మనసు ఇలాగే నలిగి పోతుంటుంది.
ఏమైనా మీ మొదటి జైలు అనుభవం చాలా ప్రసిద్ధమయిన సంఘటనతోనే ముడిపడిపోయింది మ్యాడం గారూ!

Praveen Mandangi said...

నేను మరణ శిక్షలకి వ్యతిరేకం కాదు కానీ సిక్కులని ఊచకోసినవాళ్ళకి మరణ శిక్షలు వెయ్యకుండా చలపతిరావు, విజయవర్ధనరావు లాంటి దళితులకే మరణ శిక్ష ఎందుకు వేశారనేది నా ప్రశ్న. ఇదే పని పరిటాల రవి లాంటి ప్రముఖ గ్యాంగ్‌స్టర్ చేశాడనుకోండి, అతనికి మరణ శిక్ష పడేదా?

Praveen Mandangi said...

ఉరి శిక్ష పడినవాళ్ళలో ఒకడు రిక్షా తొక్కేవాడు. మన న్యాయస్థానాలు ఒకడి వెనుకాల ఉన్న డబ్బుని చూసి అతను నేరం చేశాడో, లేదో నిర్ధారిస్తాయి.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...