Saturday, July 5, 2008

బడా కార్పోరేట్లను గడ గడ లాడిస్తున్న ‘’ముక్తా జోడియా'’

'’మేము మాకోసం పోరాడ్డం లేదు. మా తరువాత తరం కోసం పోరాడుతున్నాం.

ఈ అడవి మా తాత ముత్తాతలకు చెందింది.

ఇక్కడ మేము ఎలా ప్రశాంతంగా బతికామో మా తరువాత తరం కూడా ఇలాగే బతకాలి.


మా గుండె, మా ఆత్మ ఈ అడవితో ముడిపడి ఉంటాయి. మా జీవనాధారం ఈ అడవి. మమ్మల్ని ఇక్కడినుండి తరలించే హక్కు ఎవ్వరికీ లేదు'’ ఈ మాటలు చాలా స్పష్టంగా, ధృఢంగా ముక్తాజోడియా నోటి నుండి వాచ్చాయి. 58 ఏళ్ల ముక్త పదమూడు సంవత్సరాలుగా ఒరిస్సాలోని రాయగడ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుపుతోంది. గిరిజనుల హక్కుల కోసం ఆమె తలపడుతున్నది ఓ బడా కార్పొరేట్‌ దిగ్గజంతో అన్నది మరచిపోకూడదు. ఈ పోరాటం మొదలై చాలా కాలమే అయింది. ఉత్కళ్‌ అల్యూమినా ఇంటర్నేషనల్‌ లిమిటె కంపెనీ ముక్తకు చెందిన భూమిని లాక్కునే ప్రయత్నం చేసినపుడు మా ‘భిట్లా మట్టి’ (వ సొంతగడ్డ)ని తీసుకునే హక్కు ఎవరికీ లేదంట నినదించి, పెద్ద ఎత్తున గిరిజనులను సమీకరించి పోరాటం ప్రారంభించింది.
ఒరిస్సాలోని కాషీపూర్‌ బ్లాక్‌లో రాయగడ జిల్లాలో శ్రీగుడ దౌడగుడాలో ముక్తాజోడియా జన్మించింది. ఆమె చడ్డానికి సాదాసీదా, బక్కపలచని గిరిజన స్త్రీ లాగా కనబడుతుంది.కానీ ఈరోజు ఆమె ఒక్క పిలుపునిస్తే వందలాది గిరిజనులు ప్రాణాలర్పించడానికి సిద్ధపడుతున్నారు. నోరులేని ఆ ప్రాంతపు అమాయక గిరిజనుల కోసం గొంతు విప్పి పోరాడుతున్న ధీరవనిత ముక్త. పోరాట పటిమ కల్గిన ముక్తా జోడియాను 2007 సంవత్సరానికిగాను ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘’చింగారి అవార్డు'’ వరించింది. గత సంవత్సరం డిసెంబరు 5న భోపాల్‌లో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పేరు మీద ‘చింగారిట్రస్ట్‌’ వారు నెలకొల్పి కార్పొరేట్‌ నేరాలకు వ్యతిరేకంగా పోరాడే మహిళలకు ప్రదానం చేస్తున్నారు.
అడవులను, అందమైన ప్రకృతిని, అటవీ సంపదను నాశనం చేస్తున్న కార్పోరేట్‌ హౌస్‌ల మీద ముక్త యుద్ధం ప్రకటించింది. ‘’ప్రకృతి క సంపద్‌ సురక్ష పరిషద్‌'’ అనే సంస్థను స్థాపించి, గిరిజనులను సమీకరించి, హిండాల్కో కంపెనీ వారి ఉత్కళ అల్యూమినా ఇంటర్‌నేషనల్‌ లిమిడెట్‌ మీద రాజీలేని పోరాటం సాగిస్తోంది. డిసెంబరు 16, 2000 సంవత్సరంలో ఉద్యమం చేస్తున్న గిరిజనుల మీద పోలీసులు పాశవికంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చాలామంది చనిపోవడం, గాయపడడం జరిగింది. గాయపడిన వారిని కనీసం ఆసుపత్రికి తరలించకపోగా, వారిని తీసుకెళ్ళడానికి వచ్చిన ముక్త జోడియా, మరికొందరిని చంపేస్తామని పోలీసులు బెదిరించారు. అయినా అదరక బెదరక ముక్త గాయపడిన వారిని వెసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించగలిగింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంట ఆమె మిత్రురాలు శ్రీమలి ‘’పోలీసు కాల్పులు జరపగానే అందర చెల్లాచెదురైపోయారు. గాయపడినవాళ్లు రక్తాలు కారుతూ పడి ఉన్నారు. పోలీసులు దగ్గరకు రావద్దని, వస్తే కాల్చేస్తామని బెదిరిస్తున్నా ముక్త ముందుకెళ్లి గాయపడిన వాళ్లని ఆసుపత్రికి చేర్చింది. అందులో నా కొడుకు కూడా ఉన్నాడు. ఈ రోజు నా కొడుకు బతికున్నాడంటే అది ముక్త చలవే'’ అంటుంది కళ్లనీళ్లతో. ముక్తాజోడియా రాయగఢ జిల్లా అంతా ప్రాచుర్యం పొందింది. ఆమెనిపుడు అందర ‘ముక్తా మా’ అని పిలుస్తున్నారు. ఆమెతోపాటు ఉద్యమంలో ఉన్న మనోహర్‌ మాటల్లో ‘’ముక్తామా పారిశ్రామికీకరణకు
యతిరేకంగా పదమూడు సంవత్సరాలుగా పోరాడుతోంది. గిరిజనుల బతుకుల్ని ఫణంగా పెట్టి పెద్ధ పెద్ద కంపెనీలు అడవుల్ని నాశనం చేస్తున్నాయి. వాళ్లు చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. వందలాది గిరిజనులు తమ సొంత భూములు కోల్పోయి నిర్వాసితులవుతున్నారు. ముక్తావను పోలీసులు చంపేస్తామని బెదిరించినా ఆమె ధైర్యంగా ముందుకెళుతోంది. ఆమె మాకు కొండంత ధైర్యం'’అంటాడు.
ముక్త ఎంతో దు:ఖంతో తన అనుభవాలు బెబుతుంది. ‘ఇంద్రాబతి’ లాంటి మెగాడామ్‌లు కట్టినపుడు తన తల్లిదండ్రులు, మిగిలిన ప్రజల పాట్లు ఆమె చిన్నతనంలోనే చూసింది. తమ జీవనాధారమైన భూమిని కోల్పోయి తల్లిదండ్రులతోపాటు ఆమె నిద్రలేని రాత్రులు గడిపింది. ‘’వాళ్ల కళ్లలోని వేదన, వారి గాయపడిన మనస్సులు నన్నెంతో కలవరానికి, దు:ఖానికి గురిచేసేవి. ఆ బాధే నన్ను కార్పోరేట్‌ క్రౌర్యానికి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడేలా పురికొల్పింది. రాష్ట్రప్రభుత్వం కూడా ఈ సంస్థలతో చేతులు కలపడం నన్ను మరింత ధైర్యంగా పోరాడేలా చేసింది.'’ అంటుంది ముక్త.
నిరంతరం చుట్టు పక్కల గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ గిరిజనులను ఐకమత్యంగా ఉండేట్టుగా ప్రేరేపిస్తుంది. రాబోయే కొత్త కొత్త ప్రాజెక్టుల వల్ల తమకు ఎదురయ్యే నష్టాల గురించి, బాక్సైట్‌ తవ్వకాల వల్ల తమకు జరిగే నష్టం గురించి వారికి వివరిస్తూ తిరుగుతుంటుంది ముక్త. శారీరకంగా బలహీనంగా ఉండే ముక్త మానసికంగా అత్యంత బలవంతురాలు, సాహసికురాలు. ‘’స్వార్ధపరులైన కార్పోరేట్‌ కంపెనీవాళ్లు మమ్మల్ని విడదీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రలోభాలు పెడుతున్నారు. అయినప్పటికీ మేము ఐక్యంగా పోరాడుతాం. మా భూముల్ని మేం వదులుకోం. మేం చావనైనా చస్తాంగానీ మా సొంతగడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం'’ అంటుంది ముక్తామా.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...