Monday, June 4, 2012

కొస్టల్‌ కారిడార్‌ మింగేసిన రమణ చెల్లెలు

                 ప్రస్తుతం మీడియాలో హోరెత్తుతున్న కొన్ని కంపెనీల పేర్లు, వాటి నిర్వాకాలు చదువుతుంటే  నాలుగేళ్ళ క్రితం జరిగిన కొన్ని సంఘటనలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి.


2008లో అనుకుంటాను నేను చేనేత మహిళలు నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొనడానికి చీరాల వెళ్ళాను. మీటింగ్‌ తరువాత అక్కడికి దగ్గరలోనే వున్న బీచ్‌ను చూద్దామని ఒక టాక్సీ బుక్‌ చేసుకుని బయలుదేరాను. టాక్సీ డ్రెవర్‌ పేరు రమణ అని గుర్తు. మేం బీచ్‌వేపు వెళుతుంటే ఆ దారికటూ ఇటూ పొలాలన్నీ కంచెవేసి వున్నాయి. కనుచూపు మేరంతా  పొలాలు పడావు పడి వున్నాయి. ”ఏంటి! ఈ పొలాలన్నీ ఎవరివి కంచె ఎందుకు వేసారు?” అని రమణ నడిగాను. ”ఈ పొలాలన్నీ రైతులవండి. కోస్టల్‌ కారిడారో ఏంటో…అదేంటో నాకు  సరిగ్గా తెలవదండి. అది వస్తుందని ఈ పొలాలన్నీ తీసేసుకున్నారు. అదిగో! అటు చూడండి. అక్కడ మా పొలం కూడా వుంది. మాకు నష్టపరిహారమివ్వరు. అమ్ముకోనియరు!” రమణ చెప్పుకు పోతున్నాడు. ”మీ పొలం ఎవరు తీసుకున్నారు.

ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా ! ”అంటే  ”ఆ ఇషయాలేవీ నాకు తెల్వదండి. నేను టాక్సీ నడుపుకుంటాను. అయ్యన్నీ మా నాన్న చూసుకుంటాడు. మా చెల్లి పెళ్ళి చేద్దామని మా నాన్న ఎకరం పొలం బేరం కూడా పెట్టాడండి. ఆ టైమ్‌లోనే మా పొలాలు లాక్కున్నారు.  మా నాన్న మా చెల్లి పెళ్ళి చెయ్యలేక పోయాడు. మా చెల్లి వొళ్ళు కాల్చుకుని చనిపోయిందండి.” రమణ గొంతులో ఎంతో వేదన. ”అయ్యో! ఎంత ఘోరం జరిగింది.” అన్నాన్నేను ఏమనాలో తెలియక. ”మరేం చేస్తదండి. పెళ్ళి కుదిరింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. పొలం అమ్ముకోడానికి వీల్లేకుండా పోయింది. మా చెల్లి చాలా సున్నితమండి. భరించలేకపోయింది.” అన్నాడు రమణ.

మేం మాట్లాడుకుంటుండగానే బీచ్‌ వచ్చేసింది. నాకు బీచ్‌లో దిగాలన్పించలేదు. సముద్రాన్ని చూస్తే ఉప్పొంగే నా హృదయం ఆ రోజు ఉప్పొంగలేదు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రమణ చెల్లి  నా కళ్ళలో నీళ్ళు పెట్టించింది. కను చూపు మేరంతా సంకెళ్ళలో వున్న వేలాది ఎకరాల భూమి కూడా కన్నీళ్ళు పెడుతోందా అన్పించింది నీళ్ళతో నిండిన నా కళ్ళకి. రైతుల స్వేదంతో పులకించే భూమాతను చెరపట్టి, రైతుకు దూరం చేసి నోటికి తిరగని అడ్డమైన కంపెనీలకి ధారాదత్తం చేసిన భూమి ద్రోహులు ఈ రోజు చట్టం ముందు దోషులుగా నిలబడ్డం గొప్ప సంతోషంగానే వున్నా, రమణ కుటుంబంలాంటి  లక్షల కుటుంబాల కన్నీళ్ళు, కడగండ్లు తీరుతాయా లేదా? ఇదంతా నాటకమా అనే అనుమానం కూడా మనసులో పొడసూపుతోంది. పోలేపల్లి, కాకినాడ,సోంపేట, అరకు, పాడేరు. గంగవరం లాంటి ఎన్నెన్ని ఊళ్ళు, ఎంతమంది బాధిత ప్రజలు. ”అభివృద్ధి” దొంగజపం చేస్తూ, చటుక్కున చేపను పట్టి గుటుక్కున మింగేసే దొంగ కొంగలా లక్షలాది ఎకరాల సస్యశ్యామలమైన, ఆకుపచ్చటి భూముల్ని బీడు భూముల్ని చేసి నాశనం  చేసిన భూబకాసురులు జైళ్ళ పాలయితే వాళ్ళు చేసిన దౌష్ట్యాలూ, దుర్మార్గాలూ, దౌర్జన్యాలు సమసిపోతాయా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?

‘మా ప్రాణం పోయినా మా భూములివ్వమని’ నినదించిన పోలేపల్లి ప్రజల్ని అరబిందో కంపెనీ నిర్వాసితులను చేసే వొదిలింది. ” మా సముద్రం పోనాదండీ” అంటూ గుక్కపట్టి ఏడ్చిన దిబ్బపాలెం, గంగవరం ప్రజల్ని సముద్రంలోకి అడుగుపెట్టకుండా ఇనుపగోడ కట్టింది పోర్ట్‌. ”జిందాల్‌గాడిని మా భూముల్లో అడుగు పెట్టి చూడమనండ”ి అంటూ సవాలు విసిరిన కాకిదేవుడమ్మ, కాకినాడ సెజ్‌ మింగేసిన తమ భూముల్లో ఏరువాక మొదలు పెట్టిన కాకినాడ మహిళలు, తుపాకులకు ఎదురు నిలిచి పోరాడిన సోంపేట సాహసస్త్రీలు.

సూట్లు, బూట్లు వేసుకుని, పెద్ద పెద్ద కార్లల్లోంచి దిగుతూ అమాయకపు ముఖాలు పెట్టుకుని చట్టం ముందు దోషులుగా నిలబడిన వాళ్ళందరినీ చూస్తుంటే నాకు మళ్ళీ రమణ చెల్లెలు గుర్తుకొస్తోంది. కాకి దేవుడమ్మ, పోలేపల్లి చుక్కమ్మ, సోంపేట స్త్రీలు పదే పదే గుర్తుకొస్తున్నారు. లక్షలాది నిర్వాసితుల కన్నీళ్ళను తాగి, వారి జీవనాధారమైన భూముల్ని లాక్కున్న ద్రోహుల్ని చూస్తే కడుపులోంచి ఏదో తెలుములకుంటూ బయటకొస్తోంది. బహుశా అది నాలో పేరుకుపోయిన కోపం, ఉద్రేకం, ఉద్వేగం అయ్యుంటుంది. భూమి, పుట్రా కోల్పోని నాకే ఇంత ఉద్రేకం ఎగిసిపడితే సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ లక్షలాది నిర్వాసితుల మాటేంటి??? రస్‌ఆలఖైమా, గిల్‌క్రిస్ట్‌, ఎమ్మార్‌, వాన్‌పిక్‌ వీళ్ళందరూ ఎవరసలు? కనీసం స్వదేశం వాళ్ళైనా కాదు. వీళ్ళ లాభాల కోసమా రైతుల భూముల్ని భోంచేసింది?

ఈ సందర్భంగా కాకిదేవుడమ్మ  అమాయకంగా అన్న మాటొకటి గుర్తుకొస్తోంది. ” ఆ జిందాల్‌కి నెలకి ఎన్నో కోట్లు జీతమంటకదా! అంత జీతమొచ్చేటోడికి నా భూమే కావలసిసోచ్చిందా? నేను చచ్చినా నా భూమి వొదల్ను” ”శభాష్‌! దేవుడమ్మా శభాష్‌! ప్రభుత్వాలు, నానా రకాల కంపెనీలు గుంజుకున్న భూముల్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇపుడు కావలసింది వేలాది దేవుడమ్మలు. లక్షలాది చుక్కమ్మలు.
Share

6 comments:

G.P.V.Prasad said...

రమణ చెల్లెలును మింగేసిన coastal corridor

శ్యామలీయం said...

నష్టాలూ కష్టాలూ బడుగు జనం పంచుకుంటారు
వనరులూ లాభాలూ బడాబాబులు పంచుకుంటారు
జనం బాబుల్ని ప్రశ్నించినా దినదినం యెదిరించలేరు
వాళ్ళకు వీళ్ళ కష్టనష్టాలతో పనిలేదు
వీళ్ళకు వాళ్ళు చేసే అబివృధ్ది కడుపు నింపదు.

Anonymous said...

painful

Jai Gottimukkala said...

బూతల్లి బిడ్డలు
చిగురించే కొమ్మలు
చిదిమేసిన పువ్వులు
త్యాగాల గుర్తులు
మా బూములు మాకేనని
మర్లబడ్డ గానమా
తిరగబడ్డ రాగమ

From Gaddar's song "పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా"

Anonymous said...

I thought Mopidevi Venkataramana's sister captured the coastal corridor by looking at your title

వనజ తాతినేని/VanajaTatineni said...

వేలమందిని,అడ్డుకోకుంటే లక్షల మందిని నిర్వాసితులని చేసే కోస్టల్ కారిడార్ లు, ఆర్ధిక మండళ్ళు మనకొద్దు ..మా బ్రతుకు మమ్ము బ్రతకనివ్వండి , మా భూములని ఆక్రమించకండి అనే దేవుడమ్మ లే కావాలి.
పేదల జీవితాలని కాలరాచి బహుముఖ ప్రయోజనాలని పొందిన అవినీతి నేతలని అందలం ఎక్కిస్తున్న కొందరిని చూస్తే అసహ్యం కల్గుతుంది. "ముంజేతి కంకణానికి అద్దమేల" అని అయినా యోచించరేమి!?అనిపిస్తుంది.
శ్యామలీయం గారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...