Saturday, October 11, 2008

''బెల్‌ బజావో''-గంటకొట్టండి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3' నివేదిక ప్రకటించింది. ఈ రిపోర్టు వెల్లడించిన కొన్ని అంశాలు -ముఖ్యంగా దేశంలో గృహహింస బాధిత స్త్రీల సంఖ్యను చూస్తే చాలా బాధాకరంగా, ప్రమాదకరంగా వుంది. నిరక్షరాస్యత, అభివృద్ధి లేమికి మారుపేరైన బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. బీహార్‌లో 50 శాతం మందికి పైగా నిత్యం భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే -3 నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి.
బీహార్‌లో 59 శాతం మంది కుటుంబ హింసకు గురవుతున్నారు.
19 శాతం మంది లైంగిక హింసకు బలవుతున్నారు.
మహిళలపై గృహహింసలో జాతీయ సగటు 37శాతం
ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే 14శాతం మంది భౌతిక హింస, 35 శాతం మంది లైంగిక హింసను అనుభవిస్తున్నారు.

గృహహింసలో అగ్రస్థానం బీహార్‌ అయితే అట్టడుగు స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ (6%)వుంది. నిరక్షరాస్యతకు, హింసకు దగ్గర సంబంధముందని ఈ నివేదిక పేర్కొంటూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న పురుషులలో 60శాతం మంది అక్షర జ్ఞానం లేనివారేనని తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంట స్త్రీలు బతుకులు వెళ్ళదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. కోట్ల సంఖ్యలో స్త్రీలు, గృహహింసనుండి రక్షణ చట్టం వచ్చిన తరువాత కూడా హింసకు గురవ్వడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతాయె అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో అగ్రస్థానం సంపాదించిన బీహార్‌లో ఈ రోజుకీ రక్షణాధికారుల నియామకం జరగలేదు. గృహహింస చట్టం అమలు చేయమని, రక్షణాధికారులను నియమించమని ఒక న్యాయవాది శృతిసింగ్ పాట్నా హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చెయ్యల్సి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో వుంది. వివిధ ఎన్‌.జి.వోలు ఈ చట్టం అమలు విషయమై పట్టుదలతో పనిచేయడంవల్ల పూర్తిస్థాయి రక్షణాధికారుల నియామకం జరిగింది. బాధిత స్త్రీలు వీరి ద్వారా కోర్టులో కేసులు వేయగలుగుతున్నారు. హింసాయుత జీవితాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టం గురించిన అవగాహన, చైతన్యం ఇంకా చాలా మందికి లేదు. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్నయితే తెచ్చింది కానీ ఎలాటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేపట్టి వుంటే కొంతమంది మహిళలైనా చట్ట సహాయంతో హింసాయుత బతుకుల్లోంచి బయటపడగలిగేవారు.
నిజానికి భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కన్నా గృహహింస వల్ల ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికీ హెచ్‌ఐవి నిరోధక ప్రచారం కోసం ప్రభుత్వాలు కోట్లాది రపాయలు ఖర్చు చేస్తున్నాయి. గృహహింస అంశాన్ని ప్రభుత్వం హెచ్‌ఐవి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేయాల్సి వుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రచారం ప్రారంభమౌతున్నసూచనలు కన్పించడం సంతోషదాయకం. అలాంటి ఒక ప్రచారానికి సంబంధించినదే ''బెల్‌ బజావో'' కార్యక్రమం. నాకు తెలిసి మొట్ట మొదటి సారిగా కేంద్ర శిశు సంక్షేమశాఖ, "బ్రేక్‌ త్రూ" http://www.bellbajao.org/ అనే అంతర్జాతీయంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ కలిసి బెల్‌ బజావో ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టాయి.
ఈ ప్రోగ్రామ్‌ కింద రెండు వీడియోలను వీరు రూపొందించారు. వీటి ద్వారా గృహహింస మీద మౌనంగా వుండొద్దు అని చెప్పదలిచారు. ముఖ్యంగా ఈ రెండు వీడియోలు బాలురను, పురుషులను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఒక దానిలో ఒక మొహల్లాలో క్రికెట్‌ ఆడుకుంటున్న మగపిల్లలు, ఒక ఇంట్లో భర్త తలుపులు మూసి భార్యను కొట్టడం, ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఏడ్వడం వింటారు. వెంటనే వారు ఆట ఆపేసి, ఆ ఇంటికెళ్ళి, కాలింగ్ బెల్‌ కొడతారు. హింసిస్తున్న భర్త బయటకొచ్చి ఏంటి అని అడుగుతాడు. బాల్‌ పడింది మీ ఇంట్లో అంటారు పిల్లలు. నిజానికి బాల్‌ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. అప్పటికి ఆ ఇంట్లో హింస ఆగుతుంది. ఇంకో వీడియెలో పక్కింట్లో, భార్యను కొడుతున్న భర్త, బిగ్గరగా ఏడుస్తున్న భార్య. పక్కింటాయన లేచి వెళ్ళి బెల్‌ కొట్టి కొన్ని పాలు ఇస్తారా అని అడుగుతాడు. భర్త లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కూడా అప్పటికి తాత్కాలికంగా హింస ఆగుతుంది.
ఈ చిన్న వీడియోలు అందిస్తున్న సందేశం అద్భుతంగా వుంది. ఇంతకాలం గృహహింస అనేది వ్యక్తిగత వ్యవహారమని, బయటవాళ్ళు కల్గించుకూడదనే అపోహని ఇవి బద్దలు కొట్టాయి. ముఖ్యంగా పురుషుల్ని, మగపిల్లల్ని చైతన్యవంతం చేయడం ద్వారా గృహహంసను ఆపొచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. గృహ హింస సామాజికమైందని, ఇది వ్యక్తిగతంకాదని చెప్పడం ద్వారా సమాజం మొత్తం దీన్ని ఆపడానికి ఉద్యమించాలని చెప్పక చెప్పారు ఇందులో. ఈ సందేశాన్ని అంటే 'బెల్‌ బజావో' గంట కొట్టండి, లేదా ''మూసిన తలుపుల్ని కొట్టండి'' అంటూ ఒక వాహనం రూపొందించి దేశవ్యాప్త ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నమని చెప్పాలి. అందుకే నేను మీ అందర్ని కోరుతున్నాను మిత్రులారా? గృహహింసను ఆపడానికి మూసిన తలుపుల్ని తెరిపించండి. గంటకొట్టండి హింసను ఆపడంలో మీరూ భాగస్వాములు కండి.

2 comments:

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

మరి స్త్రీల కారనంగా స్త్రీలు ఎదుర్కొంటున్న గృహహింస మాటేమిటి సత్యవతి గారు. 4 సంవత్సరాలలో 498A కారణంగా 1,20,000 మంది స్త్రీలు ఎటువంటి విచారనణా లేకుండా కటకటాల పాలయ్యారు. వారి గురించి స్త్రీ వాదులు ఒక్క ముక్క కూడా మాట్లాడరే..? స్త్రీలు అంటే కేవలం ఒక మగాడికి భార్యలేనా..? ఆ మగాడి చెల్లి, తల్లి స్త్రీలు కారా..? ఇంకోవిషయం అసలు మగవాల్లు మనుషులు కారనా స్త్రీవాదుల అభిప్రాయం. భార్యను భర్త ఇంటిలో నుండి గెంటివేస్తే అది నేరం, కానీ భర్తను భార్య గృహహింస నిరొధక చట్టం లాంటి "పెడసరపు చట్టం" ను వుపయోగించి (దుర్వినియోగించి అనడం బెట్టరేమో...) భర్తనూ అతని తల్లి దండ్రులనూ తమ సొంత ఇంటిలోనుండీ గెంటివేస్తే మాత్రం, ఆవిడ నేటి మహిల. తన హక్కులు తెలుసుకున్న మహిల. పోనీ స్త్రీ వాదులు ఆడా మగా సమానం అనిచెప్పినా చేతల్లో మాత్రం ఆడవారు ఎక్కువ సమానం అన్నట్లు ప్రవర్థించడాన్ని పక్కన పెడితే... తమతోతి స్త్రీలు ఐనా భర్త చెల్లిని, తల్లిని (వారు స్త్రీలే కందండీ...) ఇంటినుండి వెల్లగొట్టడాన్ని చూస్తూ ఊరుకోవడం ఎంతవరకూ న్యాయం. మరి ఆ స్త్రీలకు లేదా నివాసపు హక్కు...?

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...