గుండె చెరువౌతోంది మిత్రులారా!
మతమౌఢ్యం,మతవాదాల రూపమింత భయానకమా?
మన బతుకులింక వేయి పడగల మతమౌడ్య్లుల పడగ నీడల్లోనేనా?
అయ్యో!మనం 21 వ శతాబ్దంలోనే బతుకుతున్నామా!
నిన్న ఆ భయానక,బీభత్స సంఘటన జరగడానికి పది నిమిషాల ముందు నేను, పిఓడబ్ల్యూ సంధ్య,సుజాత,ఇంకో అమ్మాయి కలిసి విశాఖ గిరిజన స్త్ర్రీల పై అత్యాచారాల విషయమై జరిగిన సమావేశంలో పాల్గొని ముఖ్య మంత్రి కి మెమొరాండం ఇవ్వడానికి వెళ్ళేం.మేము ఆ రోడ్డు దాటిన పది నిముషాలకి బాంబు దాడి జరగడం,అందమైన లుంబిని పార్క్ బుద్ధుడి సాక్షిగా రక్తసిక్తమైపోయింది.అమాయక ప్రాణాలు మత మౌఢ్యానికి బలై పోయాయి.
కళ్ళ వెంబడి రక్తాశ్రువులు ధార కడుతున్నాయి. గుండెను పిండేసే ఆ బీభత్స ద్రుశ్యాలను చూసి చూసి మెదడు స్తంభించిపోయింది.
ఉదయమే పేపర్ ముట్టుకుంటే చేతులకంటిన నెత్తురు ఎంత కడుక్కున్నా,ఏ సబ్బులేసి తోముకున్నా వదలడం లేదు.ఆ నెత్తుటి చేతులతో తిండి సహించక,పడుకుంటే నిద్ర రాక పీడ కలలు
పగలు కూడ పీడిస్తున్నాయి.
అయ్యో! ఇది నాగరిక సమాజమా?
మతం పేరు మీద ఎన్ని కోట్ల మంది బలవ్వాలి?
క్షతగాత్రుల్ని చూస్తుంటే గుండె చెరువై కళ్ళళ్ళోంచి ఉప్పెనలా
దుఖం తన్నుకొస్తోంది.
ఈ బాధకి మందేమిటి?
Sunday, August 26, 2007
Subscribe to:
Post Comments (Atom)













0 comments:
Post a Comment