Friday, June 25, 2021

ప్రకృతి నా తల్లి వేరు వేరు కాదు



నేను కడుపు లో ఉన్నపుడు అమ్మ ధాన్యం కొట్లో పనిచేస్తొందంట.అక్కడే నేను పుట్టానట.అప్పట్లో ఆడవాళ్ళు పురుడొచ్చేవరకు పని చేస్తూనే ఉండేవాళ్ళు.నేను పుట్టిన పద్నాలుగో రోజు మా అమ్మమ్మ చనిపోయిందట.తల్లి చనిపోయిన దుఖంలో అమ్మ నా అలనా పాలనా పెద్దక్కకి వదిలేసింది.నేను అలా గాలికి, ధూళికి పెరిగాను.
నా చిన్నతనం, నా బాల్యం ఏడు రంగుల ఇంధ్రధనుస్సంత అందమైంది.ఏభై మందున్న ఉమ్మడి కుటుంబంలో మా గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు.చెట్లెంబడి కోతుల్లా తిరుగుతూ, దొరికిన కాయా, కమ్మా తిని పక్షుల్లా బతికేవాళ్ళం.రాత్రి మిగిలిన చద్దన్నంలో గంజి పోసుకుని ,ఆవకాయ ముక్క నంజుకు తినేవాళ్ళం.నూకలతో అన్నం చేసి గిన్నెల్లో పోసేవాళ్ళు.అది తాగేవాళ్ళం.నా బాల్యంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆంక్షలు లేని స్వేచ్చ ఉండేది.మమ్మల్ని ఎవరూ ఏమీ అనేవారు కాదు.మా అమ్మ నన్ను తిట్టినట్టు, కొట్టినట్టు ఒక్క ఞ పకం కూడా లేదు.అలాగని విపరీతంగా పట్టించుకుని ప్రేమించిన ఞాపకం కూడా లేదు.
నేను చదువుకోవడం కొరకు చాలా పోరాటమే చేసాను.ఈ విషయంలో అమ్మ కన్నా నాన్నే నాకు అండగా నిలిచాడు.ఉమ్మడి కుటుంబంలో స్వేచ్చ లేని అమ్మ ఏం చేయగలుగుతుంది?అష్ట కష్టాలు పడి ఎన్నో అడ్డంకుల్ని దాటి,డిగ్రీ వరకు చదువుకోగలిగాను.
అమ్మ చాలా చొరవగా,ఎక్కడికైనా వెళ్ళగలిగేలా ఉండేది.కుటుంబంలో ఎవరికి ఏ రోగాలొచ్చినా పూర్ణని పిలవాల్సిందే.వాళ్ళతో ఆసుపత్రులకు వెళ్ళి ఉండిపోయేదట.ఆ రోజుల్లో గుండె ఆపరేషన్లంటే పెద్ద గండాల్లంటివి.ఈ ఆపరేసన్లను తమిళనాడులోని రాయవెల్లూరు లో చేసేవాళ్ళు.అమ్మ నాలుగు సార్లు గుండె రోగుల్ని తీసుకుని రాయవెల్లూరు వెళ్ళీంది.
అక్కడి క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో పేదలకి ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేసావారు. పాత చీరలు కట్టుకుని,వంటి మీదుండే నగల్ని తీసేసి, పక్కా బీదల్లా వీళ్ళు వేళ్ళేవాళ్ళత.భాషరానిచోట, అమ్మ దాక్టర్లతో మట్లాడేదట.వండుకుని తింటూ ఆసుపత్రిలో రోగులను చూసుకుంటూ ఉండేదట.ఈ చొరవ, సహాయం చేసే మనస్సు అమ్మకు ఉండడం వల్లనే అందరూ "పూర్ణమ్మ దేవత" అనేవారట.
ఉమ్మడి కుటుంబంలో అమ్మ ఎన్నో కష్టాలు పడింది.నాన్న వ్యాపార నిర్వాకాల వల్ల కష్టాలు పడింది. నాన్నకి శ్ర చేయడం తప్ప కల్లా కపటం తెలియదు.అలాంటి వాడు వ్యాపారం ఛెస్తే తుకారాం వ్యాపారమే అవుతుంది.
1975 ముగుస్తుండగా నాన్న నన్ను హైదరాబాదు తీసుకొచ్చి మా ఆరో చిన్నాన్న ఇంట్లో వదిలాడు.నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నాన్నకి చాలా కోరికగా ఉండేది.ఆయన బ్రతికి ఉండగా నాకు ఉద్యోగం రాలేదు.నాన్న పోయాక మా కుటుంబం చాలా కష్టాలు పడింది.ఆర్ధిక ఇబ్బందులకి అంతే లేదు.అల్లంటి సమయంలో నేను హైదరాబాదులో ఉండి, ఏదో కోర్సు చెయ్యడం కోసం రు350/ పంపమని అమ్మనడిగితేతనకున్న ఒకే ఒక గొలుదు తాకట్టు పెట్టి డబ్బు పంపింది.
1977 లో నాన్న చనిఫొయాడు.1979 లో నాకు పబ్లిక్ సర్వీస్ కమీష్న్లో ఉద్యోగం వచ్చింది.ఒక గది రు60 కి అద్దెకు తీసుకుని అమ్మని,తమ్ముడిని తీసుకొచ్చేసాను.అలా వచ్చిన అమ్మ 2005 మే నెలలో చనిపోయేవరకు నాతోనే ఉండిపోయింది.
నా జీవితంలోని ఎగుడుదిగుడులకి, ఎదుగుదలకి అమ్మ ప్రత్యక్ష సాక్షి.నా స్వేచ్చకి తను ఏనాడు తను అడ్డుపడలేదు.ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎపుడూ నాకు చెప్పలేదు.నేను ఏం చేసినా కరెక్టుగా, ఖచ్చితంగా చేస్తానని అమ్మకి గొప్ప నా నమ్మకం.నేను నాస్తికత్వానీ నా జీవితాచరణగా ఎంచుకుని,ఒక నాస్తికుణ్ణి ఇష్ట పడి అతనొతో కలసి ఉంటానని చెప్పినప్పుడు తను న్న్నేమి అనలేదు.
1980 లో విజయవాడలో అంత్ర్జాతీయ నాస్తిక మహా సభలు జరిగినపుడు,విజయవాడ గురించి ఏమి తెలియకుండా నేను ఒక్క దానే బయలుదేరినపుడు అమ్మ అస్సలు భయపడలేదు.వెళ్ళమనే చెప్పింది.ఆ సభల్లో నేను నా జీవిత సచరుణ్ణి ఎంచుకున్నానను.ఆ ఎంపిక చాలా గమ్మత్తుగా జరిగింది.నాస్తిక సభలు జరిగినపుడు మూధ నమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమ్మాలు చేసారు.అందులో ఒకటి నిప్పుల మీద నడవడం.నేను నిప్పులమీది నుంచి నడిచి వచ్చినపుడు పడిపోకుండా ఓ చెయ్యి నన్ను పట్టుకుంది.అతనే నా జీవిత సహచరుడ్య్యాడు.అలా మా పరిచయం జరగడం,అది స్నేహంగా పరిణామం చెందింది అతను ఉండేది హైదరాబాదే కాగ్
బట్టి మా ఇంటికి వస్తూ ఉండేవాడు.అతని రాక పోకల్ని అమ్మ ఏనాడూ ప్రశ్నించలేదు.అతన్ని రిజిష్టర్ పెళ్ళి చేసుకుంటానని చెప్పినపుడు మాత్రం అమ్మ అడిగింది.సంప్రదాయ పద్ధతిలొ చేసుకోమని.నేను సంప్రదాయ పద్ధతిలో పెళ్ళి ఛేసుకోనని,తాళి, మట్టెలు, నల్లపూసలు లాంటివి వేసుకోనని ఖచ్చితంగా చెప్పాను.నేనలా ధ్రుఢంగా చెప్పేసరికి తను ఇంకేమి అనలెదు..నీ ఇష్టం అంది. 1981 లో మేమిద్దరం అమ్మ సాక్షిగానే రిజిస్టర్ పెళ్ళి చేసుకున్నాం. అమ్మ ఎప్పటికి నాతోనే ఉంటుందని అతనికి ముందే చెప్పాను.మామూలుగా ఆడపిల్లలు అత్తారింటికి వెళతారు.నేను అత్తారింటికి వెళ్ళలేదు. నా సహచరుడే ఒక చిన్న పెట్టెతో నా గదికి వచ్చేసాడూ.అల మా సహజీవనం మొదలైంది.నేను ఆఫీసుకి,తను కోర్టుకి వెళ్ళిపోతే అమ్మే ఇంటిని చక్కబెట్టేది.
నా జీవితంలో నేను ఎప్పుడూ వంట చెయ్యలేదు.నాకు వంట చెయ్యడం ఇష్టం లేదు.అమ్మ మాకు వండి పెట్టేది.నా కర్యక్రమాల్లో మునిగితేలుతూ అసలు ఇంటి గురించి పట్టించుకునేదాన్ని కాదు.
అమ్మ ఎక్కడున్నా తనకి బోలెడు మంది స్నేహితులుండేవారు.మా ఇంట్లో మాగి అని ఓ కుక్క ఉండేది.అమ్మని మాగి అమ్మమ్మ అని పిల్లలు పిలిచే వాళ్ళు.మా ఇల్లు మాగి అమ్మమ్మ ఇల్లుగానే ప్రసిద్ధం.చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో సాయంగా ఉండడం వల్ల అందరూ తనని చాలా ఇష్టపడేవాళ్ళు.అమ్మని నాతో పాటు మీటింగ్లకే కాకుండా పిక్నిక్లకు,విహారయాత్రలకు నాతో తీసుకెళ్ళేదాన్ని.నా స్నేహితులతో బాగా కలిసిపోయేది.
నా సహచరుడు అమ్మని అత్త అని ఏరోజు పిలవలేదు.నాతో పాటు అమ్మా అనే పిలిచేవాడు.అమ్మంటే అతనికి చాలా ప్రేమ.నేను ఇల్లు, సంసారం మొత్తం అమ్మకే అప్పగించేసాను.ఈ బాధ్యతలేవీ లేకపోవడం వల్ల వ్యక్తిగా, రచయిత్రిగా,జర్నలిష్టు గా నేను ఎదగగలిగాను.అందరిలా నేను సంసారం బధ్యతల్లో కూరుకునిపోయి ఉంటే ఏమై ఉందునో నేను ఊహించను కూడాలేను. వంట పని ఈంటి పని ఆడవాళ్ళ సమయాన్ని ఎలా మింగేస్తాయో నాకు తెలుసు.అమ్మ వల్ల నేను ఈజంఝాటం నుండి తప్పించుకోగలిగాను.
సంసార బంధనాల్లో నేనెపుడూ తామరాకు మీద నీటిబొట్టు లాగానే ఉంటాను.
అయితే అమ్మని ఇంటికే అంకితం చేసానని అనుకోవద్దు.నాతో పాటు అన్ని మీటింగ్లకి తీసుకెల్లేదాన్ని.సాహిత్య కర్యక్రమాలకి తీసుకెల్లేదాన్ని.నేను తీసుకెల్లేననడం కంటె తనే వచ్చేదంటే బావుంటుంది. నాతో పాటు బయటకి రావడం తనకి ఇష్టం. తనకి తెలియని రచయిత్రిలేదు.అందరితో ఎంతో కలివిడిగా మాట్లాడేది.నా ఫ్రెండ్స్ అందరూ తనకి ఫ్రెండ్స్.నా ఆత్మీయ నేస్తాలంతా తనకి చాలా దగ్గరి వాళ్ళు.నా కోసం ఇంటికొచ్చే వాళ్ళంతా నేను ఇంట్లో లేకపోయినా అమ్మతో హాయిగా మాట్లాడేసి వెళ్ళిపోయేవారు.
అమ్మకి జీవితం పట్ల ఎంతో ప్రేమ.
తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం.మాచింగ్ జాకెట్టు లేకుండా చీర కట్టేది కాదు.శరీరం పట్ల ఎంతో స్రద్ధ.అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి.ఆవిడ తినే పళ్ళెం,తాగే గ్లాసు ఎవరూ ముట్టుకోకూడదు.తను ఉండే చొటునల్లా అవన్ని ప్రత్యేకంగా పెట్టే వాళ్ళం.అమ్మ తనని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకొనేది.తన జీవిత విధానమంతా చాలా డిఫరెంట్ అనుకునేది.శరీరం మీద చిన్న ముడత కనబడినా "చూడవే ఈముడత అసహ్యంగా" అని బాధపడిపోయేది.అమ్మా!నీ వయస్సుకి వస్తాయమ్మా అంటే,ఏమోనే చిరాగ్గా ఉంది చూడ్డానికి అనేది.ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ.తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారు చేసుకుని తలకి పట్టించేది.ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది.ఆ ఆయిల్ నన్ను పెట్టుకోమని సతాయించేది.నీకు దేనిపట్ల స్రద్ధ లేదని తిట్టేది నన్ను.చివరి దశలో ఆరోగ్యం బగోకుండా మంచం మీద ఉన్నపుడ్ కూడా తని చూడడానికి వచ్చే వాళ్ళకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతుండేది.
అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆస్చర్యంలో ముంచేసింది.జీవితం పట్ట్ల తన ప్రేమకి నిదర్శనంలా నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ళ మధ్య నాకీనాటికీ కనిపిస్తూనే ఉంటుంది.
తనకి అరవై సంవత్సరాలపుడె బిపి, షుగర్ మొదలైనాయి.ఎంతో శ్రద్ధగా మందులు వేసుకునేది.2000 లో అమ్మ ఒకసారి చాలా సీరియస్ గా జుబ్బు పడింది.అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయింది.మేమిద్దరం చెరో రెక్క పట్టుకుని బాత్రూముకి తీసుకెళ్ళేవాళ్ళం.తనని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కుర్చీలో కూర్చోబెట్టి మేడ మెట్ట్లు దింపుతుంటే నా సహచరుదు ఒక్కసారిగా భోరుమని ఏడ్వడం నాకింకా గుర్తు. ఈమె ఇంక ఇంటికి తిరిగొస్తుందా అంటూ ఏడ్చాడు.లక్కీగా అమ్మ ఆ గండం నుంచి బయటపడి మామూలు మనిషైంది.
అమ్మ మా ఇద్దరి జీవితాల్లోను ఒక భాగమైపోయింది.అమ్మ సీరియసుగా జబ్బుపడినపుడే అన్నయ్యను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాము.కాని తను ఎప్పుడు మా దగ్గర ఉండడానికే ఇష్టపడేది.ఎపుడైనా ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి మా దగ్గరికే వచ్చేసేది.
2005 లో నర్సాపురంలో నేను చదువుకున్న కాలేజి వాళ్ళు ఏదో ఫంక్షంకి నన్ను పిలిచారు.నేనూ వస్తానంటూ అమ్మ నాతో బయలుదేరింది.ప్రోగ్రాం అయిపోయాక నేను వచ్చేసాను.తను తమ్ముడి దగ్గర కొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పింది.ఆ తర్వాత రెందు రోజులకి బాత్రూంలో పడిపోయిందని తమ్ముడు ఫోన్ చేసి చెబితే నా గుండె గుభేలుమంది. ఈ వయస్సులో పడితే తిరిగి లేస్తారా? లేవనే లేదు.
కొంచం కోలుకున్నాక హైదరాబాదు తీసుకొచ్చేసాము.మా ఇంట్లోకి
రాగానే ఇపుడు నాకేం ఫర్వాలేదు అంది. కానీ బాగాలేదు.
ఒక రాత్రి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే నింస్కి తీసుకిళ్ళిపోయాం. చాలా సీరియస్ కండిషన్లో పదిహేను రోజులు
నిజాం ఆసుపత్రి లో ఉంది.రోజుకొకలాగా ఉండేది.ఒకరోజు నవ్వుతూ కబుర్లు చెప్పేది.మరో రోజు కోమాలో ఉండేది.మెలుకువ వస్తే కాఫీ కాఫీ అంటూ కలవరించేది.కాఫీ అంటే మహ ప్రాణం అమ్మకి.మే 14 రాత్రి అమ్మ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.ఆ పదిహేను రోజులూ నాకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.ఇల్లు,ఆసుపత్రి. అంతే.
అమ్మ కళ్ళను దానం చేసితన పార్ధివ శరీరానీ అంబులెన్సులో ఎక్కించుకుని,తనకెతో ఇష్టమైన మాఇంటికి తెచ్చి,తర్వాత మాఊరు సీతారామపురం బయలుదేరి వెళ్ళాం.అదే రోజు మా పొలాల్లో అమ్మ అంత్యక్రియలు జరిగాయి.
అమ్మతో నా అనుబంధం గురించి నేను అక్షరాల్లో రాయలేను.అది ఆత్మిక బంధం.నాకు తన తల్లి పేరు పెట్టుకుంది కాబట్టి నన్ను అమ్మాజీ అని పిలిచేది.తన నోట్లో నా పేరే నానుతుండేది.ముప్ఫై ఏళ్ళు నాతో ఉంది.నువ్వు నా కూతురి కాదు నా తల్లివి అనేది.తనని కంటికి రెప్పలా చూసుకున్నాను.తనకి ఏ లోటూ రానివ్వలేదు.తనకి ఏ కష్టం కలగనివ్వలేదు అనే త్రుప్తి చాలు నాకు.
నా మీద అమ్మ నాన్నల ప్రభావం అపారం.వాళ్ళు నన్ను పెంచిన తీరు అపూర్వం.అందుకే నా కధల సంపుటిని వాళ్ళకే అంకితమిస్తూ"చెట్టు మీద పిట్టల్లే నన్ను పెంచిన అమ్మా నాన్నలకి" అని రాసాను.నాలాగే అమ్మకి బోలెడుమంది స్నేహితులు.
అమ్మతో అలరారిన బాల్యస్మ్రుతులేవీ నాకు లేకపోయినా,నా ఎదుగుదలలోని ప్రతి మలుపులోనూ అమ్మ అభయ హస్తం నాతోనే ఉంది.నేను రచయిత్రిగా,జర్నలిష్టుగా, కార్యకర్తగా అనూహ్యమైన ఎత్తుకి ఎదగడం వెనక నా తల్లి శ్రమ స్పష్టంగా కనపడుతుంది.నా ఇంటిని, నా వంటిటి శ్రమని తనమీదేసుకుని నన్ను ఓ స్వేచ్చా విహగంలా ఆకాశంలోకి ఎగరేసింది.నేను ఆకాశంలో ఎగురుతున్నా నేల మీదున్న నా తల్లిని ఏ రోజూ నిర్లక్ష్యం చెయ్యలేదు.తనని అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకున్నను.తనకి కొడుకులున్నా అమ్మ కి నాతో ఉండడమే ఇష్టం.నేనూ అమ్మ బాధ్యతని ఆనందంగా నా మీద వేసుకున్నాను.తనకి ఏ కష్టం కల్గకుండా ఓ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వగలిగాను.ఒక ప్రత్యేక వ్యక్తిలా ఎలా బతికిందో అంతే హుందాగా,గౌరవంగా వెళ్ళిపోయింది.తన సేవాభావాన్ని పుణికి పుచ్చుకున్న నేను అమ్మ పేరు మీద మా ఊళ్ళో స్త్రీల కోసం ఒక సంస్థను స్థాపించాను.మా అమ్మను ఎంత ప్రేమిస్తానో మా ఊరిని అంతే ప్రేమిస్తాను.నా ద్రుష్టిలో రెండూ వేరు వేరు కాదు.కన్న తల్లి లాంటిదే పుట్టినూరు కూడా.
అమ్మ భౌతికంగా మా నుంచి దూరమైంది నెలలోనే . అయితే అమ్మ మా హ్రుదయాల్లోంచి ఎక్కడకూ వెళ్ళలేదు.అమ్మాజీ అంటూ నన్ను పిలుస్తూ నా చుట్టూ గాలిలో,నేను పెంచే చెట్లలో,నేను ప్రేమించే వెన్నెలలో,సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఒక్టేమిటి నన్ను అలరించే,నన్ను పులకింపచేసే సమస్త ప్రక్రుతి మాతలో నా తల్లి ప్రతిరూపమే కనిపిస్తుంది నాకు.ప్రక్రుతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు. ప్రక్రుతి ఉన్నంతకాలం,నేను ప్రక్రుతికి సమీపంగా ఉన్నంత కాలం నా తల్లి స్మృతి సజీవంగా నాలో దీపంలాగా వెలుగుతూంటుంది. నాకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.
May be an image of 2 people, including Jayalakshmi Akula
Uma Nuthakki, Prasuna Balantrapu and 114 others
15 Comments
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...