Thursday, December 25, 2008

"రంగవల్లి విశిష్ట మహిళా పురస్కారం"

మిత్రులకి నమస్కారం.
మీతో ఓ శుభవార్త పంచుకోవాలి.
 ఈ సంవత్సరానికి గాను "రంగవల్లి  విశిష్ట  మహిళా పురస్కారం" ఇవ్వడానికి నిర్ణయించినట్టు నిర్వాహకులు తెలియచేసారు.ఈ రోజు సాక్షి, జ్యోతి పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది.మీ కోసం సాక్షి లింక్  ఇస్తున్నాను,
http://epaper.sakshi.com/Details.aspx?id=94174&boxid=139184830

Monday, December 15, 2008

మీ పక్షాన మా అక్షరాలను మోహరిస్తూ…

భూమిక ముచ్చటగా మూడో సారి నిర్వహించిన రచయిత్రుల సాహితీ యాత్ర విజయవంతమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంది.
ఈ యత్రని ప్లాన్‌ చెయ్యడం, ఆ ప్లాన్‌ని తచ. తప్పకుండా అమలు చెయ్యడం కోసం మేము రెండు నెలలు శ్రమించాం

నలభై మంది వివిధ వయస్సులకు చెందిన రచయిత్రులను మూడు రోజుల పాటు కొండలెక్కించి, గుట్ట లెక్కించి సముద్రతీరాల వెంబడి సాగిన ఈ యాత్ర మిగిలిన రెండిటికంటే చాలా భిన్నమైంది. సృజనాత్మక రచనల్లో సామాజిక ఉద్యమాలను మిళితం చేయడం, జీవన్మరణ పోరాటాల్లో వున్న స్త్రీల సామాజిక ఉద్యమాల అధ్యయనం ఈ యాత్రలో ముఖ్య భూమిక పోషించాలని నేను అభిలషించాను. ఆయా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారితో, వారికి తోడ్పాటునందిస్తున్న సంస్థలతో నిరంతరం మాట్లాడుత, ఉద్యమ నేపధ్యాల గురించి, వెళ్ళాల్సిన ప్రదేశాల గుర్తింపు, ఎవరెవరిని కలవాలి, ఎలా కలవాలి, ఎక్కడ కలవాలిలాంటి అంశాల గురించి నేను గంటల తరబడి, రోజుల తరబడి మాట్లాడాల్సి వచ్చింది. ఇంతమందికి వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాల్సి వచ్చింది.
ఇంత భారాన్ని చాలా తేలికగా, ఎక్కడా ఎలాంటి లోటు, లోపం కలగకుండా పూర్తి చెయ్యగలగడం వెనుక ఎంతో మంది మిత్రుల సహకారం, కృషిి దాగి వున్నాయి. వారి తోడ్పాటు లేకుంటే నేను ఇంత బృహత్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసి వుండగలిగేదాన్ని కాదు. ముఖ్యంగా నాతో సమానంగా శ్రమపడిన వ్యక్తి మల్లీశ్వరి. వైజాగ్‌ ట్రిప్‌ వేయలనుకుంటున్నాం మల్లీశ్వరీ అని నేను ఫోన్‌లో చెప్పిన మరుక్షణం నుండే తను కొంగు నడుముకు చుట్టేసి రంగంలోకి దిగి పోయింది. తనతో పాటు తన సాహితీ మిత్రులందరినీ కలుపేసుకుంది. విద్యాసాగర్‌గారు, నారాయణ వేణుగారు, ప్రసాదవర్మగారు, చలంగారు వీరంతా ఎంతో ప్రేమగా మా ట్రిప్‌కోసం పనిచేసారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంక శ్రీనివాస రాజుగారు. మేము వసతి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా హాయిగా వుండేలా ఆయన చక్కటి ఏర్పాట్లు చేసారు. మామూలుగా అసాధ్యమైన సెంట్రల్‌ జైలు సందర్శనం లాంటి దాన్ని అతి సునాయసంగా ఏర్పాటు చేసి, అక్కడే భోజనంతో పాటు చక్కటి వినోద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చెయ్యడం, జైలర్‌గారు, వారి సహచరి, కృష్ణకుమారి ఎంతో సహృదయంతో మమ్మల్ని ఆదరించిన తీరు అభినందననీయం. వీరందరికి భూమిక కృతజ్ఞతలు. నా ప్రియ నేస్తం జయ స్వయంగా వండుకొచ్చి, ప్రేమగా వడ్డించిన అల్పాహారంలో తన స్నేహాన్ని కూడా మిళితం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక మా యత్రలో దిబ్బపాలెంలో పాపారావుగారు, వాకపల్లిలో రామారావ్‌ దొర, శృంగవరపు కోటలో, గంగవరంలో లక్ష్మిగార్ల సహకారం లేకుంటే మేము ఆయా ప్రాంతాల్లోకి అంత సులభంగా వెళ్ళగలిగివుండేవాళ్ళం కాదు. 'లయ' రవిగారు, 'మన్నెంలో' ఎడిటర్‌ మల్లిక్‌గారు ఎంతో సహకారమందించారు. అరకులో వేణుగారి మిత్రులు అందించిన సహకారం వెలకట్టలేనిది. తెర వెనుక ఇంత మంది సహకారం, సహృదయతలు పుష్కలంగా లభించడం వల్లనే నేను ఉత్తరాంధ్రయత్రని ఓ మరుపురాని యా త్రగా మలచగలిగాను.

మొత్తం యత్రలో ఉత్తరాంధ్ర ప్రాంత మీడియా వ్యవహరించిన తీరు గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. ఎంతో చైతన్య వంతమైన అవగాహనతో అక్కడ జరుగుతున్న సా మాజిక ఉద్యవలకు ఉత్తేజం అందిస్తూ, మా యాత్ర మొత్తం చిత్రాన్ని ఆంధ్ర దేశమంతా చాటింపు వేసారు. అద్భుతమైన కవరేజి ఇచ్చారు. మీడియా మిత్రులందరికి అభినందనవందనాలు.
అలాగే విశాఖ రచయితలు చక్కటి సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు పసైందైన విందు భోజనం పెట్టారు. విజయనగరంలో చాగంటి తులసిగారు ఏర్పాటు చేసిన సభలో మా హిందీ సంకలనాలు ఆవిష్కరించుకోవడం మరిచిపోలేని అనుభవం. తులసి గారికి, వారితోపాటు ఆ సభలో పాలుపంచుకున్న మిత్రులకి కృతజ్ఞతలు.
ఈ సాహితీ యాత్రలో మేము కలిసిన స్త్రీలు, వారి జీవన్మరణ పోరాటాలు, గుండెల్నిండా నిబ్బరాన్ని నింపిన దేవుడమ్మ, పార్వతి, గంగవరం శాంతి, మరిడమ్మ ఇంకా మరెంతో మంది సామాన్య స్త్రీల అసామాన్య వ్యక్తిత్వాల స్ఫూర్తి ధార లోపలి పేజీల నిండా ప్రవహిస్తోంది. అట్టడుగు స్థాయి స్త్రీల అవిశ్రాంత ఉద్యమాలు, ఉత్తేజానిచ్చే నాయకత్వాలు మా అందరిలో అలజడి, అశాంతిని రగిలించాయి. ఆపుకోలేని కన్నీళ్ళని సృష్టిించాయి. చైతన్యానికి, సంస్కారానికి, పోరాటానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన వాళ్ళ ముందు మేమంతా చిన్నబోయి, ఖిన్నులమై, నిస్సహాయులమై నిలబడ్డాం. వాళ్ళ పక్షాన మా అక్షరాలను వెహరించడం తప్ప ఇంకేం చేయగలం?వాళ్ళ దు:ఖాన్ని, వాళ్ళ బతుకు పోరును సిరాగా మార్చి ''అభివృద్ధి'' ప్రపంచపు వికృత పార్శ్వం మీద అక్షరాల జడివానను కురిపించాలని మేమందరం శపధం తీసుకున్నాం.
అందుకే తూర్పు కనుమల్లో వెలుగు రేఖల్లా ఉద్యమిస్తూ, ఉద్యమంలో పడుతూ లే స్తూ, అచ్చమైన నాయకురాళ్ళైమా అందరికీ స్ఫూ ర్తినిచ్చిన ఆ స్త్రీలందరికీ ఈ ప్రత్యేక సంచిక అంకితమివ్వడం నాకెంతో గర్వంగా వుంది. ఈ మొత్తం యాత్రని భూమిక తరఫునించి నిర్వహించి, రత్నమాల పేర్కొన్నట్టు ఒక చారిత్రక బాధ్యతని నిర్విఘ్నంగా పూర్తిచేయగలిగినందుకు, కలవడం, కలబోసుకోవడం ప్రధాన సూత్రంగా మొదలైన ఈ సాహితీ యాత్రలు రచయిత్రల మధ్య గాఢమైన స్నేహపూర్వక సాహిత్యానుబంధాన్ని ప్రోది చేయడం నాకు నిజంగా ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలిగించింది.
చివరగా, ఈ యాత్ర నిర్వహణలో నేనెదుర్కొన్నమానసిక సంఘర్షణని, దు:ఖభారాన్ని, తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడానికి నా కుడి ఎడమల నిలబడి నేను కుప్పకూలకుండా నిలబెట్టిన వాళ్ళు గీత, హేమంత. గుండెల్లోకి వొలుకుతున్న దు:ఖానుభవాలను భరిస్తనే యాత్రని పూర్తి చేయగలగడం వెనుక మా భూమిక టీమ్‌ ప్రసన్న, లక్ష్మి, కల్పన, నాగమణి, సుమ వీళ్ళందరి శ్రమ ఎంత వుందో నాకే తెలుసు. వీళ్ళు లేకుండా నేనిలాంటి పనుల్ని తలపెట్టనే లేను. వీళ్ళే నా బలం. జీవించడానికి అవసరమైన అనుభవాలనిచ్చిన ఉద్యమాల ఉత్తరాంధ్ర సాహితీ యాత్రని విజయవంతం చేసిన యావన్మందికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.

Monday, December 8, 2008

ప్రకృతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు

(మా అమ్మ గురించి నేను రాసిన ఈ వ్యాసంతో సహ మరో పదిహేను మంది వివిధ భాషా రచయిత్రులకు వారి వారి తల్లులతో ఉండే అనుబంధం గురించిన ఆత్మకధాత్మక వ్యాసాల సంపుటిని డా: జయశ్రీ మోహన్ రాజ్ గారు ఇంగ్లీషులోకి అనువదించారు.రూపా పబ్లికేషన్ వారు "నా తల్లి నా బలం"(My mother my strenth)
టైటిల్తో ప్రచురించారు.ఆ పుస్తకం 10వ తేదీన జూబ్లిహిల్స్ లో ని "ఒడిస్సీ" బుక్ షాప్ లో ఆవిష్కరించబడుతోంది. సమయం 6.30 టు 7.30.)

మా అమ్మ పేరు కాశీ అన్నపూర్ణ.అమ్మ పుట్టినపుడు వాళ్ళ తాత గారు కాబోలు కాశీ వెళ్ళేరట.అందుకని అలా పేరు పెట్టేరు.అమ్మకి ఒక అక్క..ఇద్దరు చెల్లెళ్ళు.వాళ్ళ నాన్నని (మా తాతయ్యని)బాబాయి అని పిలిచేది. వాళ్ళ బాబాయి గురించి చాలా చెప్పేది. గ్రామాల్లో భూస్వాములు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడాయన.గుర్రం మీద తిరుగుతూ,కనిపించిన ఆడపిల్లనల్లా చెరబడుతూ ,తింటూ, తాగుతూ వుండేవాడట.మేము చూళ్ళేదు కాని అమ్మ చెప్పేది.
అమ్మకి తన పుట్టిల్లంటే ఎంతో ప్రేమ.మా అమ్మమ్మ, తాతయ్య అరాచకాలలకి,అక్రుత్యాలకి నిలువెత్తు నిదర్శనంలా ఉండేదట. చెప్పుకోలేని వ్యాధేదో ఆమెని పట్టి పీడించేదని,దానితోనే ఆమె చనిపోయిందని అమ్మ బాధ పడేది. అమ్మమ్మ చనిపోవడంతో ఇద్దరి చెల్లెళ్ళ బాధ్యత అమ్మ మీదే పడింది.వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు తనే చూసింది.దాయాదుల పంచన ఉంటూ,తల్లిని, తండ్రిని కోల్పోయి,ఆస్తులు చేజారిపోయి అమ్మ అష్ట కష్టాలు పడిందని,అయినా తనకు పుట్టిల్లంటే,దాయాదుల పిల్లలంటే చాలా ఇష్టమని అక్క అంటుంది.
నేను పుట్టిన పది రోజులకి మా అమ్మమ్మ చనిపోయిందట.అమ్మ నన్ను మా పెద్దక్కకి వదిలేసి వెళ్ళిపోయింది.నెను ఎలక పిల్లలాగా ఇవాళొ రేపో పోతానన్నట్టు ఉండేదాన్నట.ఓ చింపిరి చాప మీద దొర్లుతూ ఉండేదాన్నట.అక్కకి తీరికైనపుడు కొన్ని పాలు తాగించేదట.
మా అమ్మ ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో చాకిరీ యంత్రంలా పనిచేసిది.మా తాత(మా నన్న నాన్న)కి ఏడుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్ళు.నాకు ఊహ తెలిసేటప్పటివరకు అందరూ కలిసే ఉండేవార్ళ్ళు.ఈంట్లోని ఆడవాళ్ళు పూటకి ఏభై మందికి వండి పోసేవాళ్ళట.ముందు మగవాళ్ళు,తర్వాత పిల్లలు తిన్నాక ఏమైనా మిగిలి ఉంటేనే ఆడవాళ్ళకి.చాలా సార్లు గంజి నీళ్ళే ఉండేవని అమ్మ అంటూ ఉండేది.అమ్మ కన్నా ఉమ్మడి కుటుంబంలోని బాధలు,కష్టాలు పెద్దక్క ఎక్కువ అనుభవించింది.చెళ్ళెళ్ళ బధ్యతల వల్ల అమ్మ ఎక్కువగా పుట్టింట్లో ఉండేదట.
మా పెద్దాక్క అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకునేది.మా తాత వంట వస్తువుల్ని తూకం ప్రకారం ఇవ్వడం వల్ల చివరగా తినే ఆడవాళ్ళకి చాలా సార్లు ఏమీ ఉండేది కాదు.ఆడవాల్లు తిన్నరా లేదా అని ఎవరికి పట్టేది కాదట.మా అక్క వళ్ళని వీళ్ళని అడిగి ఏవేవో తెచ్చి అమ్మకి పెట్టేదట.అమ్మ తోడికోడళ్ళు ఆరుగురు.అందులో కొందరు అమ్మతో తగవులు పడేవారట.అమ్మకి తగవులంటే భయం.గొడవలంటే భయం.తగవులు మొదలైతే భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకునేదట.
అమ్మ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండేది.
తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం.మాచింగ్ జాకెట్టు లేకుండా చీర కట్టేది కాదు.శరీరం పట్ల ఎంతో స్రద్ధ.అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి.ఆవిడ తినే పళ్ళెం,తాగే గ్లాసు ఎవరూ ముట్టుకోకూడదు.తను ఉండే చొటునల్లా అవన్ని ప్రత్యేకంగా పెట్టే వాళ్ళం.అమ్మ తనని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకొనేది.తన జీవిత విధానమంతా చాలా డిఫరెంట్ అనుకునేది.శరీరం మీద చిన్న ముడత కనబడినా "చూడవే ఈముడత అసహ్యంగా" అని బాధపడిపోయేది.అమ్మా!నీ వయస్సుకి వస్తాయమ్మా అంటే,ఏమోనే చిరాగ్గా ఉంది చూడ్డానికి అనేది.ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ.తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారు చేసుకుని తలకి పట్టించేది.ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది.ఆ ఆయిల్ నన్ను పెట్టుకోమని సతాయించేది.నీకు దేనిపట్ల స్రద్ధ లేదని తిట్టేది నన్ను.చివరి దశలో ఆరోగ్యం బగోకుండా మంచం మీద ఉన్నపుడ్ కూడా తని చూడడానికి వచ్చే వాళ్ళకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతుండేది.
అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆస్చర్యంలో ముంచేసింది.జీవితం పట్ట్ల తన ప్రేమకి నిదర్శనంలా
నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ళ మధ్య నాకీనాటికీ కనిపిస్తూనే ఉంటుంది.
తనకి అరవై సంవత్సరాలపుడె బిపి, షుగర్ మొదలైనాయి.ఎంతో శ్రద్ధగా మందులు వేసుకునేది.2000 లో అమ్మ ఒకసారి చాలా సీరియస్ గా జుబ్బు పడింది.అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయింది.మేమిద్దరం చెరో రెక్క పట్టుకుని బాత్రూముకి తీసుకెళ్ళేవాళ్ళం.తనని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కుర్చీలో కూర్చోబెట్టి మేడ మెట్ట్లు దింపుతుంటే నా సహచరుదు ఒక్కసారిగా భోరుమని ఏడ్వడం నాకింకా గుర్తు. ఈమె ఇంక ఇంటికి తిరిగొస్తుందా అంటూ ఏడ్చాడు.లక్కీగా అమ్మ ఆ గండం నుంచి బయటపడి మామూలు మనిషైంది.అమ్మ మా ఇద్దరి జీవితాల్లోను ఒక భాగమైపోయింది.అమ్మ సీరియసుగా జబ్బుపడినపుడే అన్నయ్యను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాము.కాని తను ఎప్పుడు మా దగ్గర ఉండడానికే ఇష్టపడేది.ఎపుడైనా ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి మా దగ్గరికే వచ్చేసేది.
2005 లో నర్సాపురంలో నేను చదువుకున్న కాలేజి వాళ్ళు ఏదో ఫంక్షంకి నన్ను పిలిచారు.నేనూ వస్తానంటూ అమ్మ నాతో బయలుదేరింది.ప్రోగ్రాం అయిపోయాక నేను వచ్చేసాను.తను తమ్ముడి దగ్గర కొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పింది.ఆ తర్వాత రెందు రోజులకి బాత్రూంలో పడిపోయిందని తమ్ముడు ఫోన్ చేసి చెబితే నా గుండె గుభేలుమంది. ఈ వయస్సులో పడితే తిరిగి లేస్తారా? లేవనే లేదు.
కొంచం కోలుకున్నాక హైదరాబాదు తీసుకొచ్చేసాము.మా ఇంట్లోకి
రాగానే ఇపుడు నాకేం ఫర్వాలేదు అంది. కానీ బాగాలేదు.
ఒక రాత్రి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే నింస్కి తీసుకిళ్ళిపోయాం. చాలా సీరియస్ కండిషన్లో పదిహేను రోజులు నింస్లో ఉంది.రోజుకొకలాగా ఉండేది.ఒకరోజు నవ్వుతూ కబుర్లు చెప్పేది.మరో రోజు కోమాలో ఉండేది.మెలుకువ వస్తే కాఫీ కాఫీ అంటూ కలవరించేది.కాఫీ అంటే మహ ప్రాణం అమ్మకి.మే 14 రాత్రి అమ్మ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.ఆ పదిహేను రోజులూ నాకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.ఇల్లు,ఆసుపత్రి. అంతే.
అమ్మ కళ్ళను దానం చేసితన పార్ధివ శరీరానీ అంబులెన్సులో ఎక్కించుకుని,తనకెతో ఇష్టమైన మాఇంటికి తెచ్చి,తర్వాత మాఊరు సీతారామపురం బయలుదేరి వెళ్ళాం.అదే రోజు మా పొలాల్లో అమ్మ అంత్యక్రియలు జరిగాయి.
అమ్మతో నా అనుబంధం గురించి నేను అక్షరాల్లో రాయలేను.అది ఆత్మిక బంధం.నాకు తన తల్లి పేరు పెట్టుకుంది కాబట్టి నన్ను అమ్మాజీ అని పిలిచేది.తన నోట్లో నా పేరే నానుతుండేది.ముప్ఫై ఏళ్ళు నాతో ఉంది.నువ్వు నా కూతురి కాదు నా తల్లివి అనేది.తనని కంటికి రెప్పలా చూసుకున్నాను.తనకి ఏ లోటూ రానివ్వలేదు.తనకి ఏ కష్టం కలగనివ్వలేదు అనే త్రుప్తి చాలు నాకు.
నా మీద అమ్మ నాన్నల ప్రభావం అపారం.వాళ్ళు నన్ను పెంచిన తీరు అపూర్వం.అందుకే నా కధల సంపుటిని వాళ్ళకే అంకితమిస్తూ"చెట్టు మీద పిట్టల్లే నన్ను పెంచిన అమ్మా నాన్నలకి" అని రాసాను.నాలాగే అమ్మకి బోలెడుమంది స్నేహితులు.
అమ్మతో అలరారిన బాల్యస్మ్రుతులేవీ నాకు లేకపోయినా,నా ఎదుగుదలలోని ప్రతి మలుపులోనూ అమ్మ అభయ హస్తం నాతోనే ఉంది.నేను రచయిత్రిగా,జర్నలిష్టుగా, కార్యకర్తగా అనూహ్యమైన ఎత్తుకి ఎదగడం వెనక నా తల్లి శ్రమ స్పష్టంగా కనపడుతుంది.నా ఇంటిని, నా వంటిటి శ్రమని తనమీదేసుకుని నన్ను ఓ స్వేచ్చా విహగంలా ఆకాశంలోకి ఎగరేసింది.నేను ఆకాశంలో ఎగురుతున్నా నేల మీదున్న నా తల్లిని ఏ రోజూ నిర్లక్ష్యం చెయ్యలేదు.తనని అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకున్నను.తనకి కొడుకులున్నా అమ్మ కి నాతో ఉండడమే ఇష్టం.నేనూ అమ్మ బాధ్యతని ఆనందంగా నా మీద వేసుకున్నాను.తనకి ఏ కష్టం కల్గకుండా ఓ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వగలిగాను.ఒక ప్రత్యేక వ్యక్తిలా ఎలా బతికిందో అంతే హుందాగా,గౌరవంగా వెళ్ళిపోయింది.తన సేవాభావాన్ని పుణికి పుచ్చుకున్న నేను అమ్మ పేరు మీద మా ఊళ్ళో స్త్రీల కోసం ఒక సంస్థను స్థాపించాను.మా అమ్మను ఎంత ప్రేమిస్తానో మా ఊరిని అంతే ప్రేమిస్తాను.నా ద్రుష్టిలో రెండూ వేరు వేరు కాదు.కన్న తల్లి లాంటిదే పుట్టినూరు కూడా.
అమ్మ భౌతికంగా మా నుంచి దూరమైంది ఈరోజే.అయితే అమ్మ మా హ్రుదయాల్లోంచి ఎక్కడకూ వెళ్ళలేదు.అమ్మజీ అంటూ నన్ను పిలుస్తూ నా చుట్టూ గాలిలో,నేను పెంచే చెట్లలో,నేను ప్రేమించే వెన్నెలలో,సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఒక్టేమిటి నన్ను అలరించే,నన్ను పులకింపచేసే సమస్త ప్రకృతి మాతలో నా తల్లి ప్రతిరూపమే కనిపిస్తుంది నాకు.ప్రక్రుతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు. ప్రకృతి ఉన్నంతకాలం,నేను ప్రకృతికి సమీపంగా ఉన్నంత కాలం నా తల్లి స్మ్రుతి సజీవంగా నాలో దీపంలాగా వెలుగుతూంటుంది. నాకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.

Thursday, December 4, 2008

ప్రేమ భాష్యం

ఒకరినొకరు ప్రేమించండి

అయితే మీ ప్రేమను ఆంక్షాగ్రస్తం కానీకండి

మీ ఇరువురి ఆత్మల తీరాల మధ్య

కదిలే సంద్రం కావాలి మీ ప్రేమ

ఒకే ప్రేమ చషకాన్ని ఒంపుకునేకన్నా

ఒకరికొరకై ఒకరు

వేర్వేరు మధుపాత్రలు

నింపుకోవడంలోనే ప్రేమ ఉన్నది

మీకున్నది చెరిసగం పంచుకు తినడంలో సౌఖ్యమున్నది

అలాగని ఒకే కంచంలో భుజించనక్కర లేదు

కలిసి సాగించే గాన న్రుత్యాలు స్రుజించే మేలిరకం హాయిలో

ఏకాంత విరహ సౌఖ్యాన్ని విస్మరిచరాదు సుమా!

ఒకే శబ్ద సౌందర్యాన్ని నిర్మించే వీణ తీగలు సైతం

విడి విడిగానే స్పందిస్తాయి కదా!

మనసు విప్పి మాటలు చల్లుకోవడం మహత్తరంగా ఉంటుంది

కానీ మనసు నిచ్చి పుచ్చుకోవడం అన్నది అర్ధం లేని మాట.

మనందరి ఉద్వేగాలకు,ఉల్లాసాలకు మూలాధారమైన

గుండె మనుగడ మన చేతిలో లేదన్నది నిజం కదా!

ఒకరికొకరు తోడయి సమస్యల సహారాను

సరదా సమీరాలను కలిసి స్వీకరించండి

అయితే

నిలిపి ఉంచే మూల స్పంభాలు సైతం

విడి విడిగానే ఉంటాయి చూసారు కదా!

ఆకుపచ్చని ఆరోగ్యాన్ని వెదజల్లే మర్రి చెట్టు

వేప వ్రుక్షం పరస్పర చాయలో పరిమళాలు ఒలికించవు కదా!



- ఖలీల్ జీబ్రాన్ (తెలుగుసేత ఎవరో)

Monday, December 1, 2008

ఈ రోజు చిరునవ్వులు చిలికించిన చందమామని చూసారా?

ఈ రోజు చిరునవ్వులు చిలికించిన చందమామని చూసారా?
భలేగా ఉంది.నా ఫ్రీండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పేను.
పిల్లలున్న అమ్మలందరికీ జ్ఞాపకం చేసా.నిజంగానే నవ్వుతున్నట్టున్న జాబిల్లిని చూడ్డం ఓ చక్కటి అనుభవం. చికిలి కళ్ళల్లా అటు ఇటు రెండు చుక్కలు నోరంతా తెరిచినట్టు చంద్రవంక.అలా కళ్ళార్పకుండా చూస్తూంటే మనవేపే చూస్తూ నవ్వుతున్నాడనిపిస్తుంది. ఆ నవ్వును చూస్తూంటే చాలా రిలాక్సింగ్ గా ఉంది.మీరంతా చూసారో లేదోకానీ నేనైతే బోలెడంత సేపు చూసి ఆనందించా.


                                         
ఫోటో సౌజన్యం చక్రవర్తి గారు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...