Thursday, December 25, 2008

"రంగవల్లి విశిష్ట మహిళా పురస్కారం"

మిత్రులకి నమస్కారం.
మీతో ఓ శుభవార్త పంచుకోవాలి.
 ఈ సంవత్సరానికి గాను "రంగవల్లి  విశిష్ట  మహిళా పురస్కారం" ఇవ్వడానికి నిర్ణయించినట్టు నిర్వాహకులు తెలియచేసారు.ఈ రోజు సాక్షి, జ్యోతి పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది.మీ కోసం సాక్షి లింక్  ఇస్తున్నాను,
http://epaper.sakshi.com/Details.aspx?id=94174&boxid=139184830

Monday, December 15, 2008

మీ పక్షాన మా అక్షరాలను మోహరిస్తూ…

భూమిక ముచ్చటగా మూడో సారి నిర్వహించిన రచయిత్రుల సాహితీ యాత్ర విజయవంతమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంది.
ఈ యత్రని ప్లాన్‌ చెయ్యడం, ఆ ప్లాన్‌ని తచ. తప్పకుండా అమలు చెయ్యడం కోసం మేము రెండు నెలలు శ్రమించాం

నలభై మంది వివిధ వయస్సులకు చెందిన రచయిత్రులను మూడు రోజుల పాటు కొండలెక్కించి, గుట్ట లెక్కించి సముద్రతీరాల వెంబడి సాగిన ఈ యాత్ర మిగిలిన రెండిటికంటే చాలా భిన్నమైంది. సృజనాత్మక రచనల్లో సామాజిక ఉద్యమాలను మిళితం చేయడం, జీవన్మరణ పోరాటాల్లో వున్న స్త్రీల సామాజిక ఉద్యమాల అధ్యయనం ఈ యాత్రలో ముఖ్య భూమిక పోషించాలని నేను అభిలషించాను. ఆయా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారితో, వారికి తోడ్పాటునందిస్తున్న సంస్థలతో నిరంతరం మాట్లాడుత, ఉద్యమ నేపధ్యాల గురించి, వెళ్ళాల్సిన ప్రదేశాల గుర్తింపు, ఎవరెవరిని కలవాలి, ఎలా కలవాలి, ఎక్కడ కలవాలిలాంటి అంశాల గురించి నేను గంటల తరబడి, రోజుల తరబడి మాట్లాడాల్సి వచ్చింది. ఇంతమందికి వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాల్సి వచ్చింది.
ఇంత భారాన్ని చాలా తేలికగా, ఎక్కడా ఎలాంటి లోటు, లోపం కలగకుండా పూర్తి చెయ్యగలగడం వెనుక ఎంతో మంది మిత్రుల సహకారం, కృషిి దాగి వున్నాయి. వారి తోడ్పాటు లేకుంటే నేను ఇంత బృహత్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసి వుండగలిగేదాన్ని కాదు. ముఖ్యంగా నాతో సమానంగా శ్రమపడిన వ్యక్తి మల్లీశ్వరి. వైజాగ్‌ ట్రిప్‌ వేయలనుకుంటున్నాం మల్లీశ్వరీ అని నేను ఫోన్‌లో చెప్పిన మరుక్షణం నుండే తను కొంగు నడుముకు చుట్టేసి రంగంలోకి దిగి పోయింది. తనతో పాటు తన సాహితీ మిత్రులందరినీ కలుపేసుకుంది. విద్యాసాగర్‌గారు, నారాయణ వేణుగారు, ప్రసాదవర్మగారు, చలంగారు వీరంతా ఎంతో ప్రేమగా మా ట్రిప్‌కోసం పనిచేసారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంక శ్రీనివాస రాజుగారు. మేము వసతి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా హాయిగా వుండేలా ఆయన చక్కటి ఏర్పాట్లు చేసారు. మామూలుగా అసాధ్యమైన సెంట్రల్‌ జైలు సందర్శనం లాంటి దాన్ని అతి సునాయసంగా ఏర్పాటు చేసి, అక్కడే భోజనంతో పాటు చక్కటి వినోద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చెయ్యడం, జైలర్‌గారు, వారి సహచరి, కృష్ణకుమారి ఎంతో సహృదయంతో మమ్మల్ని ఆదరించిన తీరు అభినందననీయం. వీరందరికి భూమిక కృతజ్ఞతలు. నా ప్రియ నేస్తం జయ స్వయంగా వండుకొచ్చి, ప్రేమగా వడ్డించిన అల్పాహారంలో తన స్నేహాన్ని కూడా మిళితం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక మా యత్రలో దిబ్బపాలెంలో పాపారావుగారు, వాకపల్లిలో రామారావ్‌ దొర, శృంగవరపు కోటలో, గంగవరంలో లక్ష్మిగార్ల సహకారం లేకుంటే మేము ఆయా ప్రాంతాల్లోకి అంత సులభంగా వెళ్ళగలిగివుండేవాళ్ళం కాదు. 'లయ' రవిగారు, 'మన్నెంలో' ఎడిటర్‌ మల్లిక్‌గారు ఎంతో సహకారమందించారు. అరకులో వేణుగారి మిత్రులు అందించిన సహకారం వెలకట్టలేనిది. తెర వెనుక ఇంత మంది సహకారం, సహృదయతలు పుష్కలంగా లభించడం వల్లనే నేను ఉత్తరాంధ్రయత్రని ఓ మరుపురాని యా త్రగా మలచగలిగాను.

మొత్తం యత్రలో ఉత్తరాంధ్ర ప్రాంత మీడియా వ్యవహరించిన తీరు గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. ఎంతో చైతన్య వంతమైన అవగాహనతో అక్కడ జరుగుతున్న సా మాజిక ఉద్యవలకు ఉత్తేజం అందిస్తూ, మా యాత్ర మొత్తం చిత్రాన్ని ఆంధ్ర దేశమంతా చాటింపు వేసారు. అద్భుతమైన కవరేజి ఇచ్చారు. మీడియా మిత్రులందరికి అభినందనవందనాలు.
అలాగే విశాఖ రచయితలు చక్కటి సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు పసైందైన విందు భోజనం పెట్టారు. విజయనగరంలో చాగంటి తులసిగారు ఏర్పాటు చేసిన సభలో మా హిందీ సంకలనాలు ఆవిష్కరించుకోవడం మరిచిపోలేని అనుభవం. తులసి గారికి, వారితోపాటు ఆ సభలో పాలుపంచుకున్న మిత్రులకి కృతజ్ఞతలు.
ఈ సాహితీ యాత్రలో మేము కలిసిన స్త్రీలు, వారి జీవన్మరణ పోరాటాలు, గుండెల్నిండా నిబ్బరాన్ని నింపిన దేవుడమ్మ, పార్వతి, గంగవరం శాంతి, మరిడమ్మ ఇంకా మరెంతో మంది సామాన్య స్త్రీల అసామాన్య వ్యక్తిత్వాల స్ఫూర్తి ధార లోపలి పేజీల నిండా ప్రవహిస్తోంది. అట్టడుగు స్థాయి స్త్రీల అవిశ్రాంత ఉద్యమాలు, ఉత్తేజానిచ్చే నాయకత్వాలు మా అందరిలో అలజడి, అశాంతిని రగిలించాయి. ఆపుకోలేని కన్నీళ్ళని సృష్టిించాయి. చైతన్యానికి, సంస్కారానికి, పోరాటానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన వాళ్ళ ముందు మేమంతా చిన్నబోయి, ఖిన్నులమై, నిస్సహాయులమై నిలబడ్డాం. వాళ్ళ పక్షాన మా అక్షరాలను వెహరించడం తప్ప ఇంకేం చేయగలం?వాళ్ళ దు:ఖాన్ని, వాళ్ళ బతుకు పోరును సిరాగా మార్చి ''అభివృద్ధి'' ప్రపంచపు వికృత పార్శ్వం మీద అక్షరాల జడివానను కురిపించాలని మేమందరం శపధం తీసుకున్నాం.
అందుకే తూర్పు కనుమల్లో వెలుగు రేఖల్లా ఉద్యమిస్తూ, ఉద్యమంలో పడుతూ లే స్తూ, అచ్చమైన నాయకురాళ్ళైమా అందరికీ స్ఫూ ర్తినిచ్చిన ఆ స్త్రీలందరికీ ఈ ప్రత్యేక సంచిక అంకితమివ్వడం నాకెంతో గర్వంగా వుంది. ఈ మొత్తం యాత్రని భూమిక తరఫునించి నిర్వహించి, రత్నమాల పేర్కొన్నట్టు ఒక చారిత్రక బాధ్యతని నిర్విఘ్నంగా పూర్తిచేయగలిగినందుకు, కలవడం, కలబోసుకోవడం ప్రధాన సూత్రంగా మొదలైన ఈ సాహితీ యాత్రలు రచయిత్రల మధ్య గాఢమైన స్నేహపూర్వక సాహిత్యానుబంధాన్ని ప్రోది చేయడం నాకు నిజంగా ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలిగించింది.
చివరగా, ఈ యాత్ర నిర్వహణలో నేనెదుర్కొన్నమానసిక సంఘర్షణని, దు:ఖభారాన్ని, తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడానికి నా కుడి ఎడమల నిలబడి నేను కుప్పకూలకుండా నిలబెట్టిన వాళ్ళు గీత, హేమంత. గుండెల్లోకి వొలుకుతున్న దు:ఖానుభవాలను భరిస్తనే యాత్రని పూర్తి చేయగలగడం వెనుక మా భూమిక టీమ్‌ ప్రసన్న, లక్ష్మి, కల్పన, నాగమణి, సుమ వీళ్ళందరి శ్రమ ఎంత వుందో నాకే తెలుసు. వీళ్ళు లేకుండా నేనిలాంటి పనుల్ని తలపెట్టనే లేను. వీళ్ళే నా బలం. జీవించడానికి అవసరమైన అనుభవాలనిచ్చిన ఉద్యమాల ఉత్తరాంధ్ర సాహితీ యాత్రని విజయవంతం చేసిన యావన్మందికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.

Monday, December 8, 2008

ప్రకృతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు

(మా అమ్మ గురించి నేను రాసిన ఈ వ్యాసంతో సహ మరో పదిహేను మంది వివిధ భాషా రచయిత్రులకు వారి వారి తల్లులతో ఉండే అనుబంధం గురించిన ఆత్మకధాత్మక వ్యాసాల సంపుటిని డా: జయశ్రీ మోహన్ రాజ్ గారు ఇంగ్లీషులోకి అనువదించారు.రూపా పబ్లికేషన్ వారు "నా తల్లి నా బలం"(My mother my strenth)
టైటిల్తో ప్రచురించారు.ఆ పుస్తకం 10వ తేదీన జూబ్లిహిల్స్ లో ని "ఒడిస్సీ" బుక్ షాప్ లో ఆవిష్కరించబడుతోంది. సమయం 6.30 టు 7.30.)

మా అమ్మ పేరు కాశీ అన్నపూర్ణ.అమ్మ పుట్టినపుడు వాళ్ళ తాత గారు కాబోలు కాశీ వెళ్ళేరట.అందుకని అలా పేరు పెట్టేరు.అమ్మకి ఒక అక్క..ఇద్దరు చెల్లెళ్ళు.వాళ్ళ నాన్నని (మా తాతయ్యని)బాబాయి అని పిలిచేది. వాళ్ళ బాబాయి గురించి చాలా చెప్పేది. గ్రామాల్లో భూస్వాములు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడాయన.గుర్రం మీద తిరుగుతూ,కనిపించిన ఆడపిల్లనల్లా చెరబడుతూ ,తింటూ, తాగుతూ వుండేవాడట.మేము చూళ్ళేదు కాని అమ్మ చెప్పేది.
అమ్మకి తన పుట్టిల్లంటే ఎంతో ప్రేమ.మా అమ్మమ్మ, తాతయ్య అరాచకాలలకి,అక్రుత్యాలకి నిలువెత్తు నిదర్శనంలా ఉండేదట. చెప్పుకోలేని వ్యాధేదో ఆమెని పట్టి పీడించేదని,దానితోనే ఆమె చనిపోయిందని అమ్మ బాధ పడేది. అమ్మమ్మ చనిపోవడంతో ఇద్దరి చెల్లెళ్ళ బాధ్యత అమ్మ మీదే పడింది.వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు తనే చూసింది.దాయాదుల పంచన ఉంటూ,తల్లిని, తండ్రిని కోల్పోయి,ఆస్తులు చేజారిపోయి అమ్మ అష్ట కష్టాలు పడిందని,అయినా తనకు పుట్టిల్లంటే,దాయాదుల పిల్లలంటే చాలా ఇష్టమని అక్క అంటుంది.
నేను పుట్టిన పది రోజులకి మా అమ్మమ్మ చనిపోయిందట.అమ్మ నన్ను మా పెద్దక్కకి వదిలేసి వెళ్ళిపోయింది.నెను ఎలక పిల్లలాగా ఇవాళొ రేపో పోతానన్నట్టు ఉండేదాన్నట.ఓ చింపిరి చాప మీద దొర్లుతూ ఉండేదాన్నట.అక్కకి తీరికైనపుడు కొన్ని పాలు తాగించేదట.
మా అమ్మ ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో చాకిరీ యంత్రంలా పనిచేసిది.మా తాత(మా నన్న నాన్న)కి ఏడుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్ళు.నాకు ఊహ తెలిసేటప్పటివరకు అందరూ కలిసే ఉండేవార్ళ్ళు.ఈంట్లోని ఆడవాళ్ళు పూటకి ఏభై మందికి వండి పోసేవాళ్ళట.ముందు మగవాళ్ళు,తర్వాత పిల్లలు తిన్నాక ఏమైనా మిగిలి ఉంటేనే ఆడవాళ్ళకి.చాలా సార్లు గంజి నీళ్ళే ఉండేవని అమ్మ అంటూ ఉండేది.అమ్మ కన్నా ఉమ్మడి కుటుంబంలోని బాధలు,కష్టాలు పెద్దక్క ఎక్కువ అనుభవించింది.చెళ్ళెళ్ళ బధ్యతల వల్ల అమ్మ ఎక్కువగా పుట్టింట్లో ఉండేదట.
మా పెద్దాక్క అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకునేది.మా తాత వంట వస్తువుల్ని తూకం ప్రకారం ఇవ్వడం వల్ల చివరగా తినే ఆడవాళ్ళకి చాలా సార్లు ఏమీ ఉండేది కాదు.ఆడవాల్లు తిన్నరా లేదా అని ఎవరికి పట్టేది కాదట.మా అక్క వళ్ళని వీళ్ళని అడిగి ఏవేవో తెచ్చి అమ్మకి పెట్టేదట.అమ్మ తోడికోడళ్ళు ఆరుగురు.అందులో కొందరు అమ్మతో తగవులు పడేవారట.అమ్మకి తగవులంటే భయం.గొడవలంటే భయం.తగవులు మొదలైతే భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకునేదట.
అమ్మ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండేది.
తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం.మాచింగ్ జాకెట్టు లేకుండా చీర కట్టేది కాదు.శరీరం పట్ల ఎంతో స్రద్ధ.అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి.ఆవిడ తినే పళ్ళెం,తాగే గ్లాసు ఎవరూ ముట్టుకోకూడదు.తను ఉండే చొటునల్లా అవన్ని ప్రత్యేకంగా పెట్టే వాళ్ళం.అమ్మ తనని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకొనేది.తన జీవిత విధానమంతా చాలా డిఫరెంట్ అనుకునేది.శరీరం మీద చిన్న ముడత కనబడినా "చూడవే ఈముడత అసహ్యంగా" అని బాధపడిపోయేది.అమ్మా!నీ వయస్సుకి వస్తాయమ్మా అంటే,ఏమోనే చిరాగ్గా ఉంది చూడ్డానికి అనేది.ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ.తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారు చేసుకుని తలకి పట్టించేది.ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది.ఆ ఆయిల్ నన్ను పెట్టుకోమని సతాయించేది.నీకు దేనిపట్ల స్రద్ధ లేదని తిట్టేది నన్ను.చివరి దశలో ఆరోగ్యం బగోకుండా మంచం మీద ఉన్నపుడ్ కూడా తని చూడడానికి వచ్చే వాళ్ళకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతుండేది.
అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆస్చర్యంలో ముంచేసింది.జీవితం పట్ట్ల తన ప్రేమకి నిదర్శనంలా
నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ళ మధ్య నాకీనాటికీ కనిపిస్తూనే ఉంటుంది.
తనకి అరవై సంవత్సరాలపుడె బిపి, షుగర్ మొదలైనాయి.ఎంతో శ్రద్ధగా మందులు వేసుకునేది.2000 లో అమ్మ ఒకసారి చాలా సీరియస్ గా జుబ్బు పడింది.అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయింది.మేమిద్దరం చెరో రెక్క పట్టుకుని బాత్రూముకి తీసుకెళ్ళేవాళ్ళం.తనని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కుర్చీలో కూర్చోబెట్టి మేడ మెట్ట్లు దింపుతుంటే నా సహచరుదు ఒక్కసారిగా భోరుమని ఏడ్వడం నాకింకా గుర్తు. ఈమె ఇంక ఇంటికి తిరిగొస్తుందా అంటూ ఏడ్చాడు.లక్కీగా అమ్మ ఆ గండం నుంచి బయటపడి మామూలు మనిషైంది.అమ్మ మా ఇద్దరి జీవితాల్లోను ఒక భాగమైపోయింది.అమ్మ సీరియసుగా జబ్బుపడినపుడే అన్నయ్యను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాము.కాని తను ఎప్పుడు మా దగ్గర ఉండడానికే ఇష్టపడేది.ఎపుడైనా ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి మా దగ్గరికే వచ్చేసేది.
2005 లో నర్సాపురంలో నేను చదువుకున్న కాలేజి వాళ్ళు ఏదో ఫంక్షంకి నన్ను పిలిచారు.నేనూ వస్తానంటూ అమ్మ నాతో బయలుదేరింది.ప్రోగ్రాం అయిపోయాక నేను వచ్చేసాను.తను తమ్ముడి దగ్గర కొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పింది.ఆ తర్వాత రెందు రోజులకి బాత్రూంలో పడిపోయిందని తమ్ముడు ఫోన్ చేసి చెబితే నా గుండె గుభేలుమంది. ఈ వయస్సులో పడితే తిరిగి లేస్తారా? లేవనే లేదు.
కొంచం కోలుకున్నాక హైదరాబాదు తీసుకొచ్చేసాము.మా ఇంట్లోకి
రాగానే ఇపుడు నాకేం ఫర్వాలేదు అంది. కానీ బాగాలేదు.
ఒక రాత్రి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే నింస్కి తీసుకిళ్ళిపోయాం. చాలా సీరియస్ కండిషన్లో పదిహేను రోజులు నింస్లో ఉంది.రోజుకొకలాగా ఉండేది.ఒకరోజు నవ్వుతూ కబుర్లు చెప్పేది.మరో రోజు కోమాలో ఉండేది.మెలుకువ వస్తే కాఫీ కాఫీ అంటూ కలవరించేది.కాఫీ అంటే మహ ప్రాణం అమ్మకి.మే 14 రాత్రి అమ్మ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.ఆ పదిహేను రోజులూ నాకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.ఇల్లు,ఆసుపత్రి. అంతే.
అమ్మ కళ్ళను దానం చేసితన పార్ధివ శరీరానీ అంబులెన్సులో ఎక్కించుకుని,తనకెతో ఇష్టమైన మాఇంటికి తెచ్చి,తర్వాత మాఊరు సీతారామపురం బయలుదేరి వెళ్ళాం.అదే రోజు మా పొలాల్లో అమ్మ అంత్యక్రియలు జరిగాయి.
అమ్మతో నా అనుబంధం గురించి నేను అక్షరాల్లో రాయలేను.అది ఆత్మిక బంధం.నాకు తన తల్లి పేరు పెట్టుకుంది కాబట్టి నన్ను అమ్మాజీ అని పిలిచేది.తన నోట్లో నా పేరే నానుతుండేది.ముప్ఫై ఏళ్ళు నాతో ఉంది.నువ్వు నా కూతురి కాదు నా తల్లివి అనేది.తనని కంటికి రెప్పలా చూసుకున్నాను.తనకి ఏ లోటూ రానివ్వలేదు.తనకి ఏ కష్టం కలగనివ్వలేదు అనే త్రుప్తి చాలు నాకు.
నా మీద అమ్మ నాన్నల ప్రభావం అపారం.వాళ్ళు నన్ను పెంచిన తీరు అపూర్వం.అందుకే నా కధల సంపుటిని వాళ్ళకే అంకితమిస్తూ"చెట్టు మీద పిట్టల్లే నన్ను పెంచిన అమ్మా నాన్నలకి" అని రాసాను.నాలాగే అమ్మకి బోలెడుమంది స్నేహితులు.
అమ్మతో అలరారిన బాల్యస్మ్రుతులేవీ నాకు లేకపోయినా,నా ఎదుగుదలలోని ప్రతి మలుపులోనూ అమ్మ అభయ హస్తం నాతోనే ఉంది.నేను రచయిత్రిగా,జర్నలిష్టుగా, కార్యకర్తగా అనూహ్యమైన ఎత్తుకి ఎదగడం వెనక నా తల్లి శ్రమ స్పష్టంగా కనపడుతుంది.నా ఇంటిని, నా వంటిటి శ్రమని తనమీదేసుకుని నన్ను ఓ స్వేచ్చా విహగంలా ఆకాశంలోకి ఎగరేసింది.నేను ఆకాశంలో ఎగురుతున్నా నేల మీదున్న నా తల్లిని ఏ రోజూ నిర్లక్ష్యం చెయ్యలేదు.తనని అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకున్నను.తనకి కొడుకులున్నా అమ్మ కి నాతో ఉండడమే ఇష్టం.నేనూ అమ్మ బాధ్యతని ఆనందంగా నా మీద వేసుకున్నాను.తనకి ఏ కష్టం కల్గకుండా ఓ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వగలిగాను.ఒక ప్రత్యేక వ్యక్తిలా ఎలా బతికిందో అంతే హుందాగా,గౌరవంగా వెళ్ళిపోయింది.తన సేవాభావాన్ని పుణికి పుచ్చుకున్న నేను అమ్మ పేరు మీద మా ఊళ్ళో స్త్రీల కోసం ఒక సంస్థను స్థాపించాను.మా అమ్మను ఎంత ప్రేమిస్తానో మా ఊరిని అంతే ప్రేమిస్తాను.నా ద్రుష్టిలో రెండూ వేరు వేరు కాదు.కన్న తల్లి లాంటిదే పుట్టినూరు కూడా.
అమ్మ భౌతికంగా మా నుంచి దూరమైంది ఈరోజే.అయితే అమ్మ మా హ్రుదయాల్లోంచి ఎక్కడకూ వెళ్ళలేదు.అమ్మజీ అంటూ నన్ను పిలుస్తూ నా చుట్టూ గాలిలో,నేను పెంచే చెట్లలో,నేను ప్రేమించే వెన్నెలలో,సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఒక్టేమిటి నన్ను అలరించే,నన్ను పులకింపచేసే సమస్త ప్రకృతి మాతలో నా తల్లి ప్రతిరూపమే కనిపిస్తుంది నాకు.ప్రక్రుతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు. ప్రకృతి ఉన్నంతకాలం,నేను ప్రకృతికి సమీపంగా ఉన్నంత కాలం నా తల్లి స్మ్రుతి సజీవంగా నాలో దీపంలాగా వెలుగుతూంటుంది. నాకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.

Thursday, December 4, 2008

ప్రేమ భాష్యం

ఒకరినొకరు ప్రేమించండి

అయితే మీ ప్రేమను ఆంక్షాగ్రస్తం కానీకండి

మీ ఇరువురి ఆత్మల తీరాల మధ్య

కదిలే సంద్రం కావాలి మీ ప్రేమ

ఒకే ప్రేమ చషకాన్ని ఒంపుకునేకన్నా

ఒకరికొరకై ఒకరు

వేర్వేరు మధుపాత్రలు

నింపుకోవడంలోనే ప్రేమ ఉన్నది

మీకున్నది చెరిసగం పంచుకు తినడంలో సౌఖ్యమున్నది

అలాగని ఒకే కంచంలో భుజించనక్కర లేదు

కలిసి సాగించే గాన న్రుత్యాలు స్రుజించే మేలిరకం హాయిలో

ఏకాంత విరహ సౌఖ్యాన్ని విస్మరిచరాదు సుమా!

ఒకే శబ్ద సౌందర్యాన్ని నిర్మించే వీణ తీగలు సైతం

విడి విడిగానే స్పందిస్తాయి కదా!

మనసు విప్పి మాటలు చల్లుకోవడం మహత్తరంగా ఉంటుంది

కానీ మనసు నిచ్చి పుచ్చుకోవడం అన్నది అర్ధం లేని మాట.

మనందరి ఉద్వేగాలకు,ఉల్లాసాలకు మూలాధారమైన

గుండె మనుగడ మన చేతిలో లేదన్నది నిజం కదా!

ఒకరికొకరు తోడయి సమస్యల సహారాను

సరదా సమీరాలను కలిసి స్వీకరించండి

అయితే

నిలిపి ఉంచే మూల స్పంభాలు సైతం

విడి విడిగానే ఉంటాయి చూసారు కదా!

ఆకుపచ్చని ఆరోగ్యాన్ని వెదజల్లే మర్రి చెట్టు

వేప వ్రుక్షం పరస్పర చాయలో పరిమళాలు ఒలికించవు కదా!



- ఖలీల్ జీబ్రాన్ (తెలుగుసేత ఎవరో)

Monday, December 1, 2008

ఈ రోజు చిరునవ్వులు చిలికించిన చందమామని చూసారా?

ఈ రోజు చిరునవ్వులు చిలికించిన చందమామని చూసారా?
భలేగా ఉంది.నా ఫ్రీండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పేను.
పిల్లలున్న అమ్మలందరికీ జ్ఞాపకం చేసా.నిజంగానే నవ్వుతున్నట్టున్న జాబిల్లిని చూడ్డం ఓ చక్కటి అనుభవం. చికిలి కళ్ళల్లా అటు ఇటు రెండు చుక్కలు నోరంతా తెరిచినట్టు చంద్రవంక.అలా కళ్ళార్పకుండా చూస్తూంటే మనవేపే చూస్తూ నవ్వుతున్నాడనిపిస్తుంది. ఆ నవ్వును చూస్తూంటే చాలా రిలాక్సింగ్ గా ఉంది.మీరంతా చూసారో లేదోకానీ నేనైతే బోలెడంత సేపు చూసి ఆనందించా.


                                         
ఫోటో సౌజన్యం చక్రవర్తి గారు.

Sunday, November 30, 2008

ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.

ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.


కర్నూల్ వచ్చా నిన్న రాత్రి.ఉదయాన్నే వాకింగ్ చేద్దామని జాతీయ రహదారి(హైదరాబాద్ చిత్తూర్ పోయే దారి)మీదకి వచ్చాను.రాత్రి కురిసిన వానకి తోడు పొగమంచు జోడై దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది.రోడ్డుకి అటు ఇటు పచ్చటి తివాచీ పరిచినట్టు ,దట్టంగా పొగమంచు ఆవరించిన సెనగచేలు,గుత్తులు గుత్తులుగా కంకులేసిన జొన్న చేలు,మరోపక్క పసుపారబోసినట్టు విచ్చుకున్న పొద్దు తిరుగుడు పూలతో కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు చేలు. ఆ చల్లటి వేళ ప్రక్రుతి ఎంత రమణీయంగా ఉందో నేను రాయడం కాదు చూసితీరాల్సిందే.

మెలమెల్లగా తూరుపు ఎర్రబారుతోంది.భానుడి తొలికిరణాల స్పర్శని అనుభవిస్తూ ఎందుకో అలవోకగా పశ్చిమానికి తిరిగానా నా నోట్లోంచి వావ్ అంటూ ఓ కేక దూసుకొచ్చింది.

వానజల్లు లేకుండా విచ్చుకున్న రంగురంగుల ఇంధ్రధనుస్సు.ఓ క్షణం నా కళ్ళని నేను నమ్మలేకపోయాను.పొగమంచు కురుస్తోంది కాని వర్షం లేదే.సూర్య కిరణాలు మంచు మీద ఏటవాలుగా పడితే కూడా రెయిన్ బో వస్తుందా?(ఆ తర్వాత తెలిసింది ఆ టైం లో టౌన్ లో వాన పడిందని)

పచ్చదనం ,ఇంధ్రధనుస్సు నాతో చెట్టాపట్టలేసుకుంటూ నాతో నడిచాయంటే నమ్ముతారా మీరు?

ఒక్కదానివీ జాతీయ రహదారి మీదకి వాకింగ్ కి వెళతావా జాగ్రత్త అంటూ నా సహచరుడు హెచ్చరించాడు కానీ నేను ఒంటరిగా నడిచిందెక్కడ?పచ్చదనం,తొలికిరణాల వెచ్చదనం,ఏడురంగుల హరివిల్లు,ఉదయపు హాయైన ప్రశాంతత ఇవ్వన్ని నాతో ఉంటే నేను ఒంటరిగా నడవడమేంటి?

నిజానికి ప్రక్రుతిని మించిన తోడు వేరే ఏముంటుంది?

Friday, November 21, 2008

మార్పు మాత్రమే శాశ్వతం

ఉదయం చల్లటి గాలి మనసారా శరీరాన్ని తాకేవేళ నా నడకతో పోటీ పడుతూ ఎన్నో ఆలోచనలు.తెలిమంచుతెరలు ఎంత అడ్డం పడినా తొలిసూర్య కిరణాలు తొంగి చూసినట్టు కళ్ళకు అడ్డంపడుతున్న,దేన్నీ స్పష్టం చూడనివ్వని సంధిగ్ధాలెన్నో పటాపంచలౌతున్న చప్పుడు.
నిన్నటి దుఖ తీవ్రత ఈరోజు ఎందుకుండదు?నిన్నటి మనోవేదన, మాటలకందని మానసిక సంఘర్షణ ఈరోజు ఏమౌతుంది?హమ్మో ఇదిలేకపోతే నేను బతకగలనా?హమ్మో అది దూరమైతే నేను భరించగలనా? నువ్వు లేకపోతే నేను బతికుంటనా?నీ కోసం ప్రాణలైనా ఇచ్చేస్తాను.నువ్వు లేని జీవితాన్ని కల్లో కూడా ఊహించలేను.ఎన్ని అబద్ధాలను మోస్తూ మనిషి బతుకుతుంటాడో ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యమేస్తుందో. స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు, అనుబంధాలు ఇవన్ని అవసరమే.కానీ వాటి చుట్టూ మనం అల్లుకునే అభూతకల్పనలే వింతగా ఉంటాయి.ఆత్మ త్రుప్తి కోసం అనుకుంటూ ఎంత ఆత్మ ద్రోహం చేసుకుంటామో ఆలోచిస్తే సంభ్రమంగా ఉంది.అన్నీ శాశ్వతం,అన్నీ బంధాలూ రాతి స్వభావాన్ని కలిగి ఉంటాయి,ఎప్పటికీ మారవు అనుకోవడం లోనే అంత ఉంది చిక్కంతా.
నిజానికి ఏదీ శాశ్వతం కాదు  మార్పు ఒక్కటే శాశ్వతమైంది.చుట్టూ ప్రపంచం చలనశీలతకలిగి ఉంటుంది.
సంతోషం,దుఖం రెండూ శాశ్వతం కావు.అప్పుడే నవ్విన కళ్ళు మరో క్షణంలో కన్నీళ్ళని కురిపించొచ్చు.
అవే కన్నీళ్ళు ఆనంద భాష్పాలుగా పరిణామం చెందొచ్చు.
ప్రపంచాన్ని నడిపించేది మార్పు మాత్రమే.చలనాన్ని, చలనశీలతని అర్ధం చేసుకోగలిగితే బయట ప్రపంచం ఎలా మార్పునకు గురౌతుంతో మన మనో ప్రపంచం కూడా తీవ్రమైన మార్పులకు గురౌతుందనేది అవగాహన అవుతుంది.
జీవనది నిశ్చలంగా,నిర్మలంగా నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది.కానీ అదెంత చలనశీలతను కలిగి ఉంటుందో అక్కడ నీళ్ళు లిప్త మాత్రపుసేపు కూడా నిలిచి ఉండవని మనం మర్చిపోతాం.
జీవితం కూడా అంతే కదా.అన్ని బంధాలూ,స్నేహాలూ,ప్రేమలూ మనల్ని శాశ్వతంగా చుట్టుకుని ఉన్నట్టు, అవి ఎప్పటికీ మారవని ఎంత భ్రమ పడతామో కదా!ఈ క్లారిటీ ని కమ్మేసే పొగమంచు తెరలేవో  ఈ ఉదయపు వేళ జారి నా పాదాల మీద పడుతున్న భావన.
నా నడకలో మరింత ఆత్మవిశ్వాసం,ఆత్మగౌరవం.
మార్పు మీద ఎంతో ప్రేమ.శిలాసద్రుస్య బంధాల విముక్తి.మనస్సు స్వచ్చంగా,విశాలంగా ఉన్న భావన.
విశాల ప్రపంచం మీద ప్రేమ.
ఈ ఉదయం,ఈ తొలికిరణాలు,ఈ చల్లటి గాలీ ,ఈ పొగమంచూ ఈరోజుకే సొంతం.అలా అని వాటిని శాశ్వతమనుకోలేం కదా.ఇవన్నీఈ రొజున్నట్టుగానే రేపూ కావాలనుకోవడమంత వెర్రితనం మరొకటి ఉంటుందా.రేపు కొత్తగా,కాంతివంతంగా మన కళ్ళకి ఆవిష్క్రతమౌతాయిగా.
ఎంతో అద్బుతంగా,ధవళ కాంతి పుంజాలు వెదజల్లుతూ మనస్సుని మైమరపించే బ్రహ్మకమలం మర్నాటికి నిర్జీవంగా రాలిపోతుంది.
ఎంతటి ఆత్మీయ బంధమైనా,ఎంతటి వెలుగుల్ని కురిపించేదైనా అది అలాగే  శిలలా ఉండిపోతుందనుకోవడం  చాలా పొరపాటు.
మారాలి, మార్పుని ఆహ్వానించాలి.మనస్సుని మరింత విశాలం చేసుకోవాలి.

Wednesday, November 19, 2008

మనకేమైంది నేస్తమా

నిన్నలా చూడడం నా కెంత శిక్షో నీకు తెలుసా
 చిరుగాలికి రావి ఆకులు గలగలాడినట్టు
పారిజాతాలు జలజలా రాలిపడినట్టు
తెరలు తెరలుగా మొగలి రేకుల్నివిడదీసినట్టు
సహజంగా, సెలయేరు దూకినంత స్వచ్చంగా
నవ్వే నువ్వు
నీ నవ్వుతో నన్ను వెలిగించే నువ్వు
కన్నీళ్ళు కన్నీళ్ళుగా కరిగిపోవడం
ఆ కన్నీళ్ళకి కారణం నేనే కావడం
అబ్బ! నాకెంత గుండె కోతో నీకు తెలుసా?
ఒకరి సమక్షం ఇంకొకరికి ప్రాణమైన చోటే
ఒకరినొకరం స్ప్రుశించలేకపోవడం
ఎంత విషాదం?
ఒకరికొకరం ప్రాణంగా
స్నేహానికి నిర్వచనంలా నిలబడిన
మనం ఈ రోజు ఎందుకింత నిస్సహాయులమైనాం నేస్తమా!

Monday, November 3, 2008

దిబ్బపాలెం లో కుప్పకూలిన కొంపా గూడు.

ఆ తరువాత మేం ఆ పక్కనే ఉన్న దిబ్బపాలెం గ్రామం వెళ్ళేం.
భూకంపమొచ్చి కుప్పకూలిపోయాయా?శత్రురాజుల దాడిలో కూల్చేయబడ్డాయా అన్నంత హ్రుదయవిదారకంగా ఉన్నాయక్కడ కూలిన ఇళ్ళ ద్రుశ్యాలు.కడుపులో చెయ్యిపెట్టి దేవినట్టయ్యింది. ఎవరి ఇళ్ళను వాళ్ళే కూల్చేసుకుంటున్న దారుణ ద్రుశ్యాలు.ఇళ్ళు,బళ్ళు, కమ్యూనిటి హాళ్ళు ఒకటేమిటి-దిబ్బపాలెంలో అన్నీ మట్టి దిబ్బలే.ఇటుకల పోగులే.ఒంటరిగా దిగులుగానిలబడ్డ పెరళ్ళ ముందు
ప్రేమగా పెంచుకున్న మొక్కలు."వీళ్ళంతా ఎక్కడికెళ్ళారు?" అన్న ప్రశ్నకు గూళ్ళు కూలిపోయాయిగా.చెట్టుకొకరు.పుట్ట కొకరుగా చెదిరిపోయారు.ఎవరెక్కడికెళ్ళేరో ఎవరికి తెలుసు?తమ సొంత గ్రామం.సొంత పరిసరాలు.సొంత మనుషులు.ఆ గ్రామంతో పెనవేసుకున్న అనుభవాలు.గుండె దిటవునిచ్చే సామూహిక నివాస ప్రాంతం.ఏది?ఏమైంది?ఏకాకులై ఏకాంత వాసాలకి తరలిపోయిన ఆ ప్రజల జీవన శిధిలాల్లా దిబ్బపాలెంలో కూలిన ఇళ్ళ దిబ్బలు.కార్పోరేట్ కసాయితనానికి నిదర్శనంలా కనబడుతున్న సముద్రం చుట్టూ వెలుస్తున్న వైర్ల ఫెన్సింగ్.నిర్వాసితులైన ప్రజలకి ఫోటోలు తీస్తూ,వారిపై అవాకులు,చెవాకులు పేలిన ప్రభుత్వ ప్రత్యేక అధికారిబండతనం,లేకితనం.ఉన్న ఇంటిని కూల్చేసి,వలస పొమ్మనడంలోని దుక్ఖాన్ని,గుండె కోతని లేశమంతయినా ఊహించలేని ఆ అధికారితో మా తీవ్ర వాగ్వివాదం."అభివ్రుద్ధి" విశ్వరూపాన్ని, ప్రభుత్వ దారుణ, ,నిర్లక్ష్య వైఖరిని అద్దంలో చూసిన సందర్భమది.

మిగిలింది రేపు.

Sunday, November 2, 2008

తూర్పు కనుమల్లో వెల్లువెత్తిన స్త్రీల కన్నీటి ప్రవాహాలు

భూమిక ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న రచయిత్రుల సాహితీ యాత్ర ఈసారి ఉత్తరంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయమైంది.అక్టోబుర్ 17 న నలభై మంది అందులో ముప్పైకి పైగా రచయిత్రుల తో మా యాత్ర మొదలైంది.ఉత్త్రాంధ్ర లో జరుగుతున్న వివిధ సామాజిక ఉధ్యమాల అధ్యయనం, వాకపల్లి సందర్శనం మా యాత్రలో ముఖ్యమైన ఘట్టాలు.
మేం విశాఖలో దిగిన వెంటనే అల్పాహారం చేసేసి గంగవరం, దిబ్బపాలెం వైపు వెళ్ళిపోయాం. గంగవరం పోర్టు నిర్వాసితుల గురించి మీడియా లో చదవడమే కానీ ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే.గంగవరం గ్రామ ప్రజల గుండె ఘోషను అక్షరీకరించడానికి నా కలానికున్న బలమెంతో నాకు తెలియదు కానీ "మా సముద్రం పోయింది"అనే మాట పదేపదే చెవుల్లో గింగిర్లు తిరుగుతోంది.సముద్రం మా జీవనాధరం.చేపలు పట్టుకుని బతికేటోల్లం.మమ్మల్ని మా సముద్రం నుంచి వేరు చేస్తే మేం బతికేదెట్లా?మేం పని చేసుకు బతుకుతామంటే మీకు చెక్కులిస్తా..ఇక్కడి నుండి పొమ్మంటారేమిటి?ఉద్యోగాలిస్తామన్నరు.ఇల్లు కట్టించి ఇస్తామన్నరు.ఇంకా ఏమేమో ఇస్తామన్నారు.అవన్నీ మాకెందుకు?మా సముద్రాన్ని మాకిచ్చేస్తే చాలు కదా?కన్నీళ్ళ వేడికోలు.
గంగవరంలో మహిళలు సాహసోపేతమైన ఉద్యమం నడిపారు.జైలు కెళ్ళేరు.తుపాకీ తూటాల దెబ్బలు తిన్నారు.నూక రాజు ఆత్మార్పణే చేసాడు.మహిళలు పోర్టులోకి దూసుకెళ్ళి,వంటా వార్పూ కర్యక్రమం పెట్టి,పదిహేను రోజులు అక్కడే వండుకుని,తింటూ పోర్టు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు.స్త్రీలు జైలు కెళ్ళీ శిక్ష అనుభవిస్తున్నపుడు,పురుషులు ఉద్యమ ద్రోహం చేసి ఒప్పందాలు చేసుకున్నారని కన్నీళ్ళతో వారు చెబుతున్నపుడు మేమంతా నోట మాట రానివాళ్ళమయ్యాం.
గంగవరం చుట్టూ వెలుస్తున్న గోఘ సముద్రంలో పుట్టి,సముద్రంతో జీవితం పెనవేసుకుని,సముద్రమృ జీవనాధారమైన వాళ్ళనిసముద్రాన్ని ముట్టుకోకుండా అడ్డుకట్ట వెయ్యడమెంత ద్రోహమో ఎవరు చెబుతారు?మా "సముద్రం పోయింది"అంటూ గుండెలు బాబుకుని ఎడుస్తున్న గంగవరం గ్రామస్తుల్ని,ఉవ్వెత్తున ఉద్యమం నడిపి మోసగించబడిన ఆ స్త్రీ మూర్తులని ఎవరు ఓదార్చగలరు?

మిగతా భాగం రేపు

Tuesday, October 14, 2008

భూమిక స్నేహ హస్తం

12.10.2008 ఈనాడు ఆదివారం లో వచ్చిన వ్యాసం.

భర్త సాధింపులు, అత్తమామల వేధింపులు, ఉద్యోగంలో ఒడుదొడుకులు...సమస్య ఏదైనా కానీ పరిష్కార దిశలో మహిళలకు ఆసరాగా నిలుస్తోంది 'భూమిక' హెల్ప్‌లైన్.

1800 425 2908


స్త్రీవాద పత్రిక 'భూమిక' నిర్వహిస్తోన్న హెల్ప్‌లైన్ నెంబర్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది టోల్‌ఫ్రీ నెంబరు. ఒక్క ఫోన్‌కాల్‌తో మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు వీరు. చదువు, ఉద్యోగం, గృహహింస, చట్టపరమైన చిక్కులు, మానసిక ఇబ్బందులు... ఇలా అన్ని రకాల సమస్యల నుంచి స్త్రీలకు విముక్తి కలిగించేందుకు ఈ హెల్ప్‌లైన్ సాయపడుతోంది.

15 ఏళ్లుగా స్త్రీ అభ్యుదయానికి అక్షరసాయం చేస్తున్న భూమిక 2006లో ఈ హెల్ప్‌లైన్‌ను వెుదలుపెట్టింది. 'చాలా మంది మహిళలు తమ సమస్యల్ని ఉత్తరాల ద్వారా భూమికకు తెలియజేసి సరైన దారి చూపమని అర్థించేవారు. అలాంటి వారికి సమాచారం లేదా పరిష్కారం దొరికే మార్గం చూపేవాళ్లం. ఎక్కువ మందిని ఆదుకోడానికి హెల్ప్‌లైనే సరైన మార్గమని భావించి ప్రారంభించాం' అని చెబుతారు భూమిక సంపాదకులు
కె.సత్యవతి. హెల్ప్‌లైన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం 'ఆక్స్‌ఫామ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది.

మాటే మంత్రం ఆమెది అత్తవారింట్లో నచ్చని పెళ్లి. భర్త లేని సమయంలో అత్తమామలు మానసికంగా శారీరకంగా హింసించేవారు. మూడేళ్లు అదే పరిస్థితి. కానీ ఒక్కసారైనా ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఓరోజు తలపై కట్టెతో కొట్టారు. రక్తం కారుతుండగా బయటకు పరుగుతీసింది. ఓ ఇంటి ముంగిట స్పృహతప్పి పడిపోయింది. ఆ సమాచారం భూమికకు అందింది... నిమిషాల్లో 108తో పాటూ ప్రొటెక్షన్ ఆఫీసర్ అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పూర్తయిన తర్వాత రక్షణ గృహంలో ఆశ్రయం కల్పించారు. కొన్నాళ్లకు అత్తమామలతోపాటు భర్తకు కౌన్సిలింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి భార్యాభర్తలు సుఖంగా జీవించడం వెుదలుపెట్టారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. కాస్త అటూ ఇటుగా ఇలాంటి నేపథ్యంతో భూమిక దృష్టికి వచ్చే కేసులు నెలలో అయిదు వరకూ ఉంటాయి.

ఆలుమగల మనస్పర్థల పరిష్కారానికీ భూమిక వేదికగా నిలుస్తోంది. తమ బాధలు పంచుకోడానికి ఎవరూ లేరని ఫోన్ చేసేవారూ, ఉన్న వాళ్లెవరూ తమని పట్టించుకోవడం లేదని చెప్పేవారూ... రోజులో పది మందైనా ఉంటారు. సమస్యను చెప్పుకోడానికీ, బాధను పంచుకోడానికీ ఓ ఆత్మీయ నేస్తం కావాలి... అది భూమిక రూపంలో వాళ్లకి దొరికింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలపాటు గొంతులో దాచుకున్న బాధ
ఒక్కసారి బయటకు వస్తుంది. 'ఫోన్ చేసినవారి మాటల్ని చాలా ఓపికతో వింటాం. ఒక్కోసారి గంటకు పైగానే మాట్లాడతారు. అయినా మేం విసుగుచెందం. అన్నీ విన్నాక సలహా లేదా సూచన చెబుతాం. తుది నిర్ణయం వారిదే. ఒక నిర్ణయానికి వచ్చాక సమస్య పరిష్కారానికి మా వంతు సాయం చేస్తాం' అని చెబుతారు భూమిక ప్రతినిధులు.

ఎల్లలు దాటి


రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి వీరికి ఫోన్‌లు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళల సమస్యల పరిష్కారానికి వీరిని ఆశ్రయించేవారు ఎక్కువ. అమెరికాలోని దక్షిణాసియా దేశాల మహిళల బాగోగులు చూసే 'మానవి' స్వచ్ఛంద సంస్థ తెలుగువారి సమస్యల పరిష్కారానికి భూమిక సాయం తీసుకుంటోంది. ఉద్యోగాల ఆశతో వెళ్లి విదేశాల్లో వోసపోయిన వారు స్వదేశం చేరుకోడానికీ వీరే దిక్కు. హెల్ప్‌లైన్ సేవలు జిల్లాలకూ విస్తరించాలనే భూమిక లక్ష్యం ఇపుడు నెరవేరింది. భూమిక స్ఫూర్తిగా ప్రభుత్వం ఇందిర క్రాంతిపథం సభ్యులచేత ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తోంది. వీరంతా భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపు పది జిల్లాల్లో ఇప్పటికే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాలకు చెందిన వారు శిక్షణలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకూ అధికారుల ఫోన్ నెంబర్లూ వారి దగ్గర సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రంలో ఏ మూలనుంచి సమస్య వినిపించినా తక్షణ పరిష్కారం కోసమే

ఈ ఏర్పాట్లు. బాధితులు ఆయా జిల్లాల్లో ఉండే మానవహక్కుల సంఘాలు, లోక్ అదాలత్, మహిళా కమిషన్ ద్వారా లబ్ధిపొందడానికీ సాయపడతారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100 మంది వరకూ భూమిక వాలంటీర్లు ఉన్నారు. వీరిలో మహిళా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలకి చెందిన వారు ఎక్కువ. న్యాయ సంబంధ సలహాల కోసం ప్రతి శనివారం న్యాయవాదితో ఫోన్‌లో ప్రత్యక్షంగా మాట్లాడే వెసులుబాటు ఇటీవల ప్రారంభించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిత్యం ఉండనే ఉంటుంది. సమస్యల వలయంలో చిక్కుకుపోయి అల్లాడే మహిళలను అందులోంచి బయటపడేలా చేయడంలో 'భూమిక' హెల్ప్‌లైన్ కీలక భూమిక వహిస్తోందనడంలో సందేహం లేదు.

Saturday, October 11, 2008

''బెల్‌ బజావో''-గంటకొట్టండి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3' నివేదిక ప్రకటించింది. ఈ రిపోర్టు వెల్లడించిన కొన్ని అంశాలు -ముఖ్యంగా దేశంలో గృహహింస బాధిత స్త్రీల సంఖ్యను చూస్తే చాలా బాధాకరంగా, ప్రమాదకరంగా వుంది. నిరక్షరాస్యత, అభివృద్ధి లేమికి మారుపేరైన బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. బీహార్‌లో 50 శాతం మందికి పైగా నిత్యం భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే -3 నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి.
బీహార్‌లో 59 శాతం మంది కుటుంబ హింసకు గురవుతున్నారు.
19 శాతం మంది లైంగిక హింసకు బలవుతున్నారు.
మహిళలపై గృహహింసలో జాతీయ సగటు 37శాతం
ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే 14శాతం మంది భౌతిక హింస, 35 శాతం మంది లైంగిక హింసను అనుభవిస్తున్నారు.

గృహహింసలో అగ్రస్థానం బీహార్‌ అయితే అట్టడుగు స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ (6%)వుంది. నిరక్షరాస్యతకు, హింసకు దగ్గర సంబంధముందని ఈ నివేదిక పేర్కొంటూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న పురుషులలో 60శాతం మంది అక్షర జ్ఞానం లేనివారేనని తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంట స్త్రీలు బతుకులు వెళ్ళదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. కోట్ల సంఖ్యలో స్త్రీలు, గృహహింసనుండి రక్షణ చట్టం వచ్చిన తరువాత కూడా హింసకు గురవ్వడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతాయె అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో అగ్రస్థానం సంపాదించిన బీహార్‌లో ఈ రోజుకీ రక్షణాధికారుల నియామకం జరగలేదు. గృహహింస చట్టం అమలు చేయమని, రక్షణాధికారులను నియమించమని ఒక న్యాయవాది శృతిసింగ్ పాట్నా హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చెయ్యల్సి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో వుంది. వివిధ ఎన్‌.జి.వోలు ఈ చట్టం అమలు విషయమై పట్టుదలతో పనిచేయడంవల్ల పూర్తిస్థాయి రక్షణాధికారుల నియామకం జరిగింది. బాధిత స్త్రీలు వీరి ద్వారా కోర్టులో కేసులు వేయగలుగుతున్నారు. హింసాయుత జీవితాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టం గురించిన అవగాహన, చైతన్యం ఇంకా చాలా మందికి లేదు. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్నయితే తెచ్చింది కానీ ఎలాటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేపట్టి వుంటే కొంతమంది మహిళలైనా చట్ట సహాయంతో హింసాయుత బతుకుల్లోంచి బయటపడగలిగేవారు.
నిజానికి భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కన్నా గృహహింస వల్ల ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికీ హెచ్‌ఐవి నిరోధక ప్రచారం కోసం ప్రభుత్వాలు కోట్లాది రపాయలు ఖర్చు చేస్తున్నాయి. గృహహింస అంశాన్ని ప్రభుత్వం హెచ్‌ఐవి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేయాల్సి వుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రచారం ప్రారంభమౌతున్నసూచనలు కన్పించడం సంతోషదాయకం. అలాంటి ఒక ప్రచారానికి సంబంధించినదే ''బెల్‌ బజావో'' కార్యక్రమం. నాకు తెలిసి మొట్ట మొదటి సారిగా కేంద్ర శిశు సంక్షేమశాఖ, "బ్రేక్‌ త్రూ" http://www.bellbajao.org/ అనే అంతర్జాతీయంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ కలిసి బెల్‌ బజావో ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టాయి.
ఈ ప్రోగ్రామ్‌ కింద రెండు వీడియోలను వీరు రూపొందించారు. వీటి ద్వారా గృహహింస మీద మౌనంగా వుండొద్దు అని చెప్పదలిచారు. ముఖ్యంగా ఈ రెండు వీడియోలు బాలురను, పురుషులను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఒక దానిలో ఒక మొహల్లాలో క్రికెట్‌ ఆడుకుంటున్న మగపిల్లలు, ఒక ఇంట్లో భర్త తలుపులు మూసి భార్యను కొట్టడం, ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఏడ్వడం వింటారు. వెంటనే వారు ఆట ఆపేసి, ఆ ఇంటికెళ్ళి, కాలింగ్ బెల్‌ కొడతారు. హింసిస్తున్న భర్త బయటకొచ్చి ఏంటి అని అడుగుతాడు. బాల్‌ పడింది మీ ఇంట్లో అంటారు పిల్లలు. నిజానికి బాల్‌ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. అప్పటికి ఆ ఇంట్లో హింస ఆగుతుంది. ఇంకో వీడియెలో పక్కింట్లో, భార్యను కొడుతున్న భర్త, బిగ్గరగా ఏడుస్తున్న భార్య. పక్కింటాయన లేచి వెళ్ళి బెల్‌ కొట్టి కొన్ని పాలు ఇస్తారా అని అడుగుతాడు. భర్త లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కూడా అప్పటికి తాత్కాలికంగా హింస ఆగుతుంది.
ఈ చిన్న వీడియోలు అందిస్తున్న సందేశం అద్భుతంగా వుంది. ఇంతకాలం గృహహింస అనేది వ్యక్తిగత వ్యవహారమని, బయటవాళ్ళు కల్గించుకూడదనే అపోహని ఇవి బద్దలు కొట్టాయి. ముఖ్యంగా పురుషుల్ని, మగపిల్లల్ని చైతన్యవంతం చేయడం ద్వారా గృహహంసను ఆపొచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. గృహ హింస సామాజికమైందని, ఇది వ్యక్తిగతంకాదని చెప్పడం ద్వారా సమాజం మొత్తం దీన్ని ఆపడానికి ఉద్యమించాలని చెప్పక చెప్పారు ఇందులో. ఈ సందేశాన్ని అంటే 'బెల్‌ బజావో' గంట కొట్టండి, లేదా ''మూసిన తలుపుల్ని కొట్టండి'' అంటూ ఒక వాహనం రూపొందించి దేశవ్యాప్త ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నమని చెప్పాలి. అందుకే నేను మీ అందర్ని కోరుతున్నాను మిత్రులారా? గృహహింసను ఆపడానికి మూసిన తలుపుల్ని తెరిపించండి. గంటకొట్టండి హింసను ఆపడంలో మీరూ భాగస్వాములు కండి.

Monday, September 29, 2008

తుపాకీ మొనపై వెన్నెల

 
(ఈ ప్రయాణానుభవం ఇంతకుముందు ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో  అచ్చయ్యింది.
ఈ ఫోటో కూడా అందులోదే.)
     క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్‌ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా  జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయినా మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
     మే ఒకటవ  తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్‌ అదికారులు. ఏప్రిల్‌ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేహ్  వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్‌, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్‌ వెళ్ళాల్సి వుంది.
 రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్‌ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్‌ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్‌, లే వెళుతూ ఒక్క షాల్‌ సరిపోతుందనుకున్నావా  అంటూ తన దగ్గరున్న ఉలెన్‌ బట్టలన్నీ ఓ సూట్‌కేస్‌ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు సూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
    ఉత్పల ఇచ్చిన అదనపు సట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్‌ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్‌ వెకేషన్‌ కోసం శ్రీనగర్‌ వెళుతున్నారు. శ్రీనగర్‌ ఫ్లయిట్‌ కన్‌ఫర్మ్‌ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. శ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్‌ ఆఫర్‌ చేసింది. ఆ సీట్లో  కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కప్పబడి, సూర్యకాంతికి మెరుస్తున్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు. ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్పమాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు  పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
     ఎయిర్‌పోర్ట్‌ నించి బయటకు వచ్చి కారులో  కూర్చుని తలుపు వేయబోయను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని. ఎందుకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్‌ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నారు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47   పట్టుకున్న పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ముందు సీట్లో  సెటిల్‌ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
టూరిస్టులు లేక  అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్‌ చెప్పాడు. హౌస్‌ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజవనులు కూర్చుని వున్నారు. హమీద్‌ ఫ్లోటింగు గార్డెన్‌ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడ్డి లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్‌ జమీన్‌' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్‌ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్‌ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్‌ చినార్‌' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్‌ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.  
    శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఘల్‌ గార్డెన్స్‌ అని పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్‌, నిషాద్‌, హనూర్‌, షాలిమార్‌. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్‌ ఫౌంటెన్‌ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్‌ గార్డెన్స్‌ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్‌ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్‌ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
    మర్నాడు గుల్‌మార్గ్‌ వెళ్ళాలని చాలా తొందరగా తయరైపోయామ్. గుల్‌మార్గ్‌ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్‌ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్‌, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేంచూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్‌ అన్వర్‌ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్‌ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్‌ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
     మా మూడ్స్‌ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్‌ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్‌, దేవదార్‌, పోప్లార్‌ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక్కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద్ద మంచు దిబ్బ  మా కారుకు అడ్డు వచ్చిన్ది. అన్వర్‌ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్‌ చేరిపోయామ్. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్‌ కార్‌) లో టాప్‌ ప్లేస్‌ ఐన సెవెన్‌ స్ప్రిన్గ్స్ చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సవ్మెహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయామ్. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా  కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి,   చీరతోనే తిరిగాను. మైనస్‌ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్‌ నించి తిరుగు ప్రయణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్ననా సహచరుడి ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్‌ పండు రంగులో కొచ్చింది.  'స్నోబైట్‌' ' సన్‌బర్న్‌' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
    మర్నాడు పెహల్‌గావ్‌ వెళ్ళొచ్చని, అనంతనాగ్ లో ఎన్నికలు అయిపోయయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్‌ ప్రకటించాడు.  అమర్‌నాథ్‌ యత్ర పెహల్‌గావ్‌ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్‌ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్‌ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్‌ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్‌  జామ్‌లో ఇరుక్కుపోయామ్. అనంతనాగ్ లో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము  బయలుదేరిందని అన్వర్‌ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయామ్. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్‌ చేరేటప్పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయామ్. అయితే మా ప్రయణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీళ్ళు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్‌ పార్క్‌లో వున్న ట్రాట్‌ ఫిష్‌ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్‌ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్‌ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్‌ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగ్ సరస్సును చూడలేకపోయమన్న నిరాశతో తిరిగి వచ్చేం.
    మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లేహ్' ప్రయాణం మొదలైంది. లేహ్ గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లేహ్ పట్టణం. అది లదాఖ్‌ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని  నేను ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్‌ నుంచి  లేహ్ కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్‌ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్‌ - లేహ్ రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లేహ్ లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెప్పిన్ది. తొమ్మిదిన్నరకి లేహ్ లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగ్ అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుక కొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా  తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్‌ గెస్ట్‌హౌస్‌కి  తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్‌ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్‌ వచ్చి మా ఇద్దరి బ్లెడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్‌ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్‌ తాషి ' ఆప్‌ లోగ్ హమ్‌ సె బీ ఫిట్‌ హై, ఏక్‌ దమ్‌ ఫిట్‌' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లేహ్ చరిత్రతో పాటు, లదాఖ్‌ ఫెస్టివల్స్‌, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్‌ యుద్ధం,  యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్‌ గ్లేసియర్‌ ఫోటోలు, అక్కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్‌ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
    అక్కడినుంచి  మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లేహ్ చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్‌, ఆల్చి, ఫైయండ్‌, షె మొదలైన ఎన్నో  గొంపాలు వున్నాయి. వీటిలో లేహ్ కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్‌ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షణ మైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్‌ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల  చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు.నా సహచరుడేమో "ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగ్ కోట్‌, గ్లౌస్‌ వేసుకుని, మంకీకేప్‌ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను.  వావ్‌! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్‌ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచ్చిన్ది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తండిపోయను. తాషికి థాంక్స్‌ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా  నిద్రపోయాను.
    మే ఎనిమిదో తేదీన  మా అసలు అడ్వంచర్‌ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్‌ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగ్ సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లేహ్ రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది.  ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగ్ సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్‌ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయల మధ్య సన్నటి రోడ్డు మీద కారు మెలికలు తిరుగుతోంది.  ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాలని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి  మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయామ్. అక్కడ మైనస్‌ 4 టెంపరేచర్‌ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని నా సహచరుడు మైనస్‌ డిగ్రీలో నిలబడటం నాకు ఆ స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్‌ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్‌ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను  యెగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్‌ లోపలకు పంపించగలిగాను. తనకు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్‌ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక్కడ ఒక మిలటరీ కేంప్‌ పెట్టారు. ఫస్ట్‌ ఎయిడ్‌, టాయిలెట్‌ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్‌ సుబేదార్‌ విష్ణు బహదూర్‌ గురండ్‌ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి  టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న  టీ ఎంత తృప్తి నిచ్చిన్దో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్‌ ( కొండ ఉడతలు) లు, యాక్స్‌, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగ్ సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది.  ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్‌ గాంగ్ సరస్సు విస్తరించి వుంది. నాలుగు  కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ. సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయామ్. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగ్ సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయణానికి అయిష్టంగానే సిద్ధమయ్యామ్. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప్ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా  తెలుగుమాట వినని మేం  ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్‌ షేక్‌ మహబూబ్‌ పాషా గిద్దలూరుకు, లాన్స్‌ నాయక్‌ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్‌ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యం.

    అప్పటికి మంచుకొండల  మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్‌ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయా. ఆ అదురులోనే మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయా. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్‌ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్‌ ఆన్‌ చేసాడు.  మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయా. ఆక్సిజన్‌ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్‌ ఎక్కి  దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లేహ్ పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిన్ధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం  పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్‌.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లేహ్ , లదాఖ్‌ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు  మొదలుపెట్టాడు కాబోలు  అనుకున్నాను.
    అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయణమయ్యామ్. క్షణక్షణం మారే లేహ్ వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్‌ పోర్ట్‌లో ఎండ  ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా వివనం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
    పది రోజులపాటు కాశ్మీర్‌ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతనే వుంది. శ్రీనగర్‌ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్‌ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన  80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యరో ఎవరికీ తెలియదని మా పి.ఎస్‌.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు భర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు భర్తలు బతికి వున్నారో లేదో తెలియని భయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని  ఒక చోట చదివాను. 20  వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి  చంపి, చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్‌ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్‌ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరభాగాలు ఇదీ నేటి కాశ్మీర్‌. వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.

Saturday, September 20, 2008

ఒంటరి దీవులు




జీవితం పూడ్చలేని ఓ అగాధంలా మారుతోంది
దేనితో పూడ్చాలి ఈ అగాధాన్ని?
జనం ఇరుకిరుకు గూళ్ళల్లోంచి బయటపడి
రోడ్ల మీద చీమల్లా పాకుతున్నారు
నోళ్ళు తెరుచుకుని నిలబడ్డ మహా మాల్స్
ఈ జనాన్ని అమాంతంగా మింగేస్తున్నాయ్
వందలాది వెర్రి మొర్రి చానల్స్
కంటి రెటీనా మీద కబ్జా చేస్తున్నయ్
ఇంటెర్నెట్ మహా మాయ
నరనరాల మీద నాట్యం చేస్తోంది
మొబైల్ ఫోన్ల మహ ప్రవాహం
చెవుల్లోంచి గుండెల్లోకి జారి
అయిస్ లా గడ్డకడుతోంది
"ఎవరికి వారౌ స్వార్హంలో
హ్రుదయాలరుదౌ లోకంలో"
నా కారు,నా చానెల్, నా మొబైల్, నా ఎఫ్.ఎం,
నా ఏ టి ఎం,నా ఇంటెర్నెట్, నా బాంక్ బాలెన్స్
ఇలా "నా"చుట్టూ గిరికీలు కొడుతున్నాం
మనం స్రుష్టించిన అద్భుత టెక్నాలజీ
మనల్నెంత ఒంటరుల్ని చేస్తోంది
"మన" ని "మనిషి" ని మర్చిపోయి
ఎవరికి వారం ఒంటరి దీవులమౌతున్నాం
తోటి మనిషి మాత్రమే పూడ్చగలిగిన
ఈ అగాధాలను
మార్కెట్లను ముంచెత్త్తుతున్న
మహా మాల్స్ లోని మహా చెత్త పూరిస్తుందా
మరింత అగాదగాన్ని స్రుష్టిస్తుంది తప్ప
మానవీయతని ప్రోదిచేస్తుందా
మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందా చెప్పండి.

Friday, September 19, 2008

ఈ రోజు ఏమైందంటే........


రోజూ ఉదయం లేచిందగ్గర నుండి ఒకటే ఉరుకులు పరుగులు.
ట్రాఫిక్ పద్మవ్యూహం లో సెగలు పొగలతో చిరాకులు
ఆఫీసుకి వెళ్ళగానే తలమునకలయ్యే పనులు
హెల్ప్ లైన్ లో అంతులేని సమస్యలు, సమాధానాలు, కౌన్సిలింగులు
ఈ రోజు రొటీన్ కి భిన్నంగా గడపాలని,రిలాక్ష్ అవ్వాలని అనుకున్నాం
నేను గీత.తను కూడా చాలా బిజి.తహసిల్దార్ కదా ఎప్పుడూ హడావుడే.
ఇద్దరం ఆఫీసు పనుల్ని పక్కన పెట్టేసి కలిసి గడపాలనుకున్నాం.
అన్నట్టు గీత ఎవరో చెప్పలేదుగా.నా నేస్తం.నాకు చాలా ప్రియమైన నేస్తం.
ఎంతటి పని ఒత్తిడి ఉన్నా మేమిద్దరం కలవడానికి,కబుర్లాడుకోవడానికి
కనీసం నెలలో ఒక రోజన్నా కేటాయిస్తాం.పనికి సంబంధించి ఏమి మాట్లాడం.
మాకిష్టమైన వన్ని చేస్తాం అంతే.
గీత ఈ రోజు ఉదయమే మా ఇంటికొచ్చేసింది.నేను నా పనులన్ని రేపటికి పోష్ట్ పోన్
చేసేసాను.
తనకిష్టమైన వెల్లుల్లి చికెన్,చేపల పులుసు,జొన్న రొట్టి చేసా.
తనకు ఎంతో ఇష్టమైన సంపెంగ పూలు,అనార్ పువ్వులు కోసి ఉంచాను
తను 11 కు వచ్చింది.కొన్ని కబుర్లయ్యాక ఇంటర్నెట్ ఓపెన్ చేసా.మా ఊరి వ్యాసం మీద వచ్చిన స్పందన చూసి చాలా సంతోష పడింది.
ఇద్దరం ఓ గంటన్నర సేపు కూరలతో పాటు కబుర్లు నంజుకుంటూ అన్నం తిన్నాం.
కాసేపు పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం.
అక్టోబర్లో భూమిక ఆర్గనైస్ చెయ్యబోతున్న రచయిత్రుల కాంప్ గురించి చర్చించాం.
ఆ తర్వాత తన కైనెటిక్ మీద శిల్పారామం బయలుదేరాం.
కార్ డ్రైవింగ్ అలవాటై స్కూటర్ నడపడం కొంత తడబడినా నేనే బండి నడిపా.శిల్పారామం లో షాపుల వేపు కన్నెత్తి చూడకుండా ఓ చక్కటి ప్రదేశం చూసుకుని కూర్చున్నం.ఆ ప్లేస్ చాలా ప్రశాంతంగ, హాయిగా ఉంది ఓ పొగడ చెత్తు చుట్టూ రచ్చబండలా కట్టారు.ఒకటీ రెండు పొగడ పూలు కూడా మా మీద రాలాయి.
ఐదు గంటలవరకు కబుర్లే.నవ్వులే.మా నవ్వులు అక్కడి కొండల్లో ప్రతిధ్వనించాయి.
ఆ తర్వాత వేడి వేడి టీ తాగుతుంటే ఆ పక్కనే ఓ పచ్చిమిర్చి చెట్టు విరగ కాచి కనబడింది.ఆ కాయలన్ని కోసి కాంటీన్ నడుపుతున్నాయనకి ఇస్తే మేమెప్పుడూ చూళ్ళేదే ఇన్ని కాయలున్నాయా అంటూ ఆనందమగా మిరపకాయలు తీసుకుంటే మాకు ఒకటే నవ్వులు.
మిర్చి బజ్జి తింటారా అని చాలా ప్రేమగా అదిగాదు.మేము వద్దని బయటకు వచ్చేసి మా బండి మీద రయ్మంటూ ఇంటి వేపు బయలుదేరాం.
ఇందులో ఎమి విశేషమేముంది అనుకుంటున్నారా?
చాలా ఉందండోయ్.ఈ నాటి ఒత్తిళ్ళ,సవాళ్ళ ప్రపంచంలో మనకిష్టమైన ఫ్రెండ్ తో
అచ్చంగా ఒక రోజు హాయిగా, జాలీగా కేవలం మన కోసమే ఒక రోజు కేటాయిచుకుని
గడపడంలో ఎంత ఆనందముందో,ఆ అనుభవం మనల్ని ఎంత ఫ్రెష్ గా,రిలాక్షెడ్ గా ఉంచుతుందో నా అనుభవం మీద చెబుతున్నా.
ఒక్క రోజు మనం ఇలా గడిపితే నెల రోజులు హేపీగా మన పనుల్ని నల్లేరు మీద బండి లా లాగెయ్యగలం.నిజం నా మాట మీద నమ్మకం లెకపోతే మీరూ ఒక సారి ఈ ప్రయోగం చేసి చూడండి.ఇది మనకి చాలా అవసరమని మీరే అంటారు.

Tuesday, September 16, 2008

సెజ్‌ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి


కొండవీటి సత్యవతి
పోలేపల్లి వెళ్ళాలని, అక్కడి సెజ్‌ బాధితులతో మాట్లాడి, వారి దు:ఖగాధని భూమికలో రాయలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
 రత్నమాల కూడ చాలాసార్లు చెప్పింది. అమెరికాలో వుండే జయప్రకాష్‌తో చాట్‌ చేస్తున్నపుడు తెలిసింది ఆగష్టు 7 న పోలేపల్లిలో పబ్లిక్‌ హియరింగు వుందని.
 సరే ఆ రోజు హాజరైతే అందరినీ ఒకే చోట కలిసినట్టు వుంటుందని, విషయలు బాగా అర్ధమౌతాయని అనుకుని శిలాలోలితకి, సుజాతాపట్వారీకీ ఫోన్‌ చేసాను.
శిలాలోలిత వస్తానని చెప్పడంతో పోలేపల్లి ప్రయాణం ఖాయమైంది.
ఆగష్టు 7న ఉదయం ఆరుకంతా రోడ్డెక్కేసాం. జడ్చర్ల దాదాపు 80 కిలోమీటర్లుంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ రత్నమాల, బాలగోపాల్‌, గీతాంజలి, హేమలలిత, సూరేపల్లి సుజాత వచ్చి వున్నారు. మాధవి, 50 మంది కాలేజీ పిల్లలతో కలిసి బస్సులో వస్తోందని, తన కోసమే ఎదురుచూస్తున్నామని సుజాత చెప్పింది. సమావేశం ఇంకా ఆరంభమయ్యే సూచనలు కనబడలేదు. టెంట్‌ వేస్తుంటే గాలికి కిందపడుతోంది. మేము నిలబడిన చోట రాక్షసుడి కోరల్లా రెండు ఆర్చీలు  ఎపి ఐఐసి వి రోడ్డు కిటూ అటూ దర్పంగా నిలబడి వున్నాయి. పొలాల్లో చురుగ్గా పనులు జరుగుతున్నాయి. ఆరవింద్‌ ఫార్మావారి షెడ్‌ నిర్మాణం జరుగుతుతోంది. లారీలు, రోడ్‌రోలర్లు అటూ, ఇటూ తిరుగుతున్నాయి. పొలాల మధ్యలో విశాలమైన నల్లటి తారు రోడ్డు అప్పటికే వేసారు. ఫార్మా కంపెనీల కాళ్ళు కందకుండా, వాళ్ళ కార్లు తిరగడానికి వీలుగా అంత విశాలమైన రోడ్డు వేసారని చూడగానే అర్ధమౌతుంది. వాటన్నింటినీ గమనిస్తూ అందరం మాట్లాడుకుంటుండగా మాధవి వాళ్ళ బస్సోచ్చింది. జీన్‌ పాంట్లేసుకున్న అమ్మాయిలు బిల బిల మంటూ బస్సు దిగేరు. వాళ్ళని చూసి నాకు చాలా సంతోషమన్పించింది.సెజ్‌లాంటి సీరియస్‌ అంశాల్లో యువత పాల్గొని, బాధితుల పక్షాన నిలబడితే మంచిది. ఈ విషయాలను వాళ్ళు అర్ధం చేసుకోగలిగితే బావుంటుంది అని నాకన్పించింది.
 బస్సు దిగిన వాళ్ళందరిని మళ్ళీ ఎక్కించి పోలేపల్లి గ్రామంలోకి బయలు దేరాం అందరం. మేము వెళుతున్నపుడు  చాలామంది స్త్రీలు ఎదురుపడ్డారు. వాళ్ళందరిని కూడా బస్సులో ఎక్కించుకుని ఊళ్ళోకి వెళ్ళాం. చాలా మంది పబ్లిక్‌ హియరింగు జరిగే ప్రాంతానికి బయలు దేరారు. కొంతమంది అక్కడ జరుగుతున్న పనుల్లో కూలీలుగా పనికి వెళ్ళారు. మేం పోలేపల్లికి ఆనుకుని వున్న గుండ్ల గడ్డ తాండాకి వెళ్ళాలనుకున్నాం. తండాలో ఎవరూ లేరని, పనులకి పొయ్యారని ఊళ్ళో వాళ్ళు అన్నారు. అయినా సరే కాలేజీ పిల్లలకి తాండా ఎలా వుంటుందోచూపించాలని మాధవి  వాళ్ళు అనడంతో ఇరుకు దారుల్లోంచి, లంబాడా తండాకి నడక మొదలు పెట్టాం. నిజంగానే మేము వెళ్ళేసరికి ఒక ముసలాయన తప్ప ఎవరూ కనబడలేదు. ఊరికి దూరంగా విసిరేసినట్టున్న ఆ లంబాడా తండాలో కోళ్ళు, కుక్కలు యధేచ్ఛగా తిరుగుతున్నాయి. చుట్టు చెట్ల మీద పిట్టలు గూళ్ళ కడుతున్న అద్భుత దృశ్యాలు కనబడ్డాయి. కొంత సేపటికి కొంతమంది స్త్రీలు తండాలోకి వచ్చారు. మేము వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టాం. అందరి గొంతులోను ఒకే వేదన, అందరి గుండెల్లోంచి తన్నుకొచ్చేది ఒకే దు:ఖం. మావి ఇన్ని ఎకరాలు పోయాయి, అన్ని ఎకరాలు పోయాయి, మాకు ఇప్పుడు ఏమీ లేదు. మేమెలా బతకాలి. మోసం చేసి మా భూములు గుంజుకున్నారు. పద్ధెనిమిది వేలు నష్టపరిహారం అన్నారు. అందరికీ లంచాలిచ్చి మాకు మిగిలింది ఎకరానికి ఎడెనిమిది వేలు. ఆ డబ్బాంతా ఎన్నడో అయిపోయింది. మా తండా తప్ప మా కిప్పుడు ఒక సెంటు భూమి కూడా మిగల్లేదు. తైదలు, జొన్నలు, కందులు పండించుకు తినేటోళ్ళం. తొక్కు చేసుకోనీకి ఒక్క చింతకాయకూడా మిగల్లేదు. మేము భూమి లేకుండా ఎలా బతకాలి. మందుల కంపెనీల్లో మమ్మల్ని కూలీలుగా చేసారు. కూలీ కూడా రోజూ దొరకదు. పస్తులుంటున్నాం. హాయిగా మా పంట మేం పండించుకు తినేటోళ్ళం ఇప్పుడు దినసరి కూలీలుగా మారిపోయం. మా కష్టాలెవరికి చెప్పుకోవాలె. ఎవరైనా చస్తే బొంద పెట్టనీకి సెంటు జాగా కూడా లేకుండ చేసారు. అప్పుడు మాకు తెలివి లేకపాయె. ఇప్పుడు మాకు అన్నీ తెలుసు ప్రభుత్వం మా మొఖాన కొన్ని వేలు కొట్టి తను మాత్రం లక్షలకి, కంపెనీలకి పొలాలు అమ్మింది. ఇదేం అన్యాయం? ఇదేం ప్రభుత్వం? ఇప్పుడు మాకు అన్నీ తెలిసాయి. మా భూమి మాకు వెనక్కి కావాలి. మాకు నష్టపరిహారం మొద్దు, మందుల కంపెనీలొద్దు మా భూమి వకు కావాలి'’ అంటూ తండా వాసులు నినదించారు. ఈ విషయాలు పబ్లిక్‌ హియరింగులో చెప్పండని బాలగోపాల్‌ సచించారు. వాళ్ళని సమావేశానికి రమ్మని చెప్పి అందరం తండా నుంచి బయలుదేరాం.
‘ఫోటో తీసుకుందామని ప్రయత్నించి నపుడు ఒక లంబాడీ స్త్రీ అన్న మాటలు నా చెవుల్లో గింగిర్లు కొట్టాయి. ‘’ ఎందుకమ్మా ఫోటోలు. ఎన్ని సార్లు ఫోటోలు దిగాలి ఎంతమందికి మా బాధలు చెప్పుకున్నాం. అందరూ వస్తారు. మాతో మాట్లాడతారు. మా కన్నీళ్ళు చూస్తారు. కానీ ఎవరూ తుడవనీకి రావడం లేదు. మా సమస్యల్ని పట్టించుకోవడం లేదు'’ ఆమె మాటలు నా చెంప మీద చెళ్ళున తగిలి నట్లయింది. ఇప్పటికి ఎంతమందికి తన గుండె విప్పి, తన బాధను వివరించిందో. ఎంత విసుగు చెందిందో పాపం! అన్పించింది, నిజమే! అందరం వస్తాం. చూస్తాం. సాలిడారిటీ ప్రకటిస్తాం. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి.
 గుండ్ల గడ్డ తాండ చూసిన తర్వాత, ఆమె మాటలు విన్న తర్వాత మనసంతా భారంగా అయ్యింది. అదే మూడ్‌తో పబ్లిక్‌ హియరింగు జరిగే చోటకి వచ్చాం. హైవేకి కూతవేటులో ఎపిఐఐసి కోర స్తంభాల పక్కన సమావేశం మొదలైంది. భూములు కోల్పోయిన వారంతా మాట్లాడసాగారు.
 మొదట జబ్బార్‌ అనే వ్యక్తిమాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల పొలాన్ని ప్రభుత్వం తీసేసుకుందని, హైదరాబాద్‌లోని జూపార్క్‌లాగా పార్క్‌ డెవలప్‌ చేస్తామని చెప్పి ప్రభుత్వం బలవంతంగా తమ భూముల్ని లాగేసుకుందని తెలిపాడు. దీనివల్ల తమ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారని, మొత్తం పోలేపల్లిలో నలభై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భూములు గుంజుకునే పని 2001 నుండి మొదలైంది. మాకు ఉద్యోగాలిస్తామని కలక్టర్‌ చెప్పాడుగానీ ఎవ్వరికీ ఉద్యోగం రాలేదు. పోలేపల్లి సెజ్‌ వల్ల 370 కుటుంబాలు నాశనమైపోయయి. చస్తే కూడా బొంద పెట్టనీకి లేదు. 2006లో అరవింద్‌ ఫార్మా కంపెనీ ముందు ఉద్యమం చేసినపుడు మాకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పోలేపల్లి సర్పంచ్‌ బాలస్వామి గౌడ్‌ మాట్లాడుత ‘’ప్రభుత్వానికి ప్రజల భూముల్ని గుంజుకునే హక్కున్నదంటూ మా భూముల్ని లాక్కున్నారు. నిజానికి ఇవేవీ ఎసైన్డ్‌ భూములు కాదు. ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కొన్నారు. ప్రభుత్వం ఒప్పుకొన్న వేవీ చెయ్యలేదు. నష్టపరిహారం కూడాచాలా తక్కువ ఇచ్చారు. రైతులంతా భూమికి భూమి అడుగుతున్నారు. కానీ ప్యాకేజ్‌ అమలు చేస్తామంటున్నారు. పార్లమెంటరీ కమిటీ పోలేపల్లి వచ్చింది. కాన్షీరామ్‌ రాణా రిపోర్ట్‌ మాకు దొరకనే లేదు. ఆ రిపోర్ట్‌ ఏమైందో తెలియదు'’ అన్నారు. అబ్ధుల్‌ రవూఫ్‌ తన భూమి 15 ఎకరాలు పోయిందని తాను నష్టపరిహారం తీసుకోలేదని అడుగుతుంటే కోర్టుకు పొమ్మంటున్నారు. ‘’అంటూ వాపోయడు. శంకరయ్య మాట్లాడుతూ’ మా బతుకు తెరువైన రెండకరాలు పోయాయి. నా చేతికి పద్దెనిమిది వేలు వచ్చాయి. మాకు న్యాయం కావాలి. మాపొలంమాకు కావాలి. దీని కోసం ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాం? మాది ఆరు ఎకరాలు పోయింది ఈ బాధ తట్టుకోలేక మా ఆయన గుండె పోటుతో చచ్చిపోయడు. అరవింద కంపెనీ వాళ్ళ జెండా పీకాం. రాయి పీకాం. వాళ్లు బోర్‌ పీకేసినాం. కంపెనీ కాడ టెంట్‌ వేసుకుని వంట చేసుకున్నాం. పోలీసులొచ్చి మమ్మల్ని పచ్చిపులుసు కూడా తిననీయలేదు.'’ పెద పెంటయ్య, మొగులమ్మదీ అదే వేదన. ‘’ఇరవై అయిదు ఎకరాలు గుంజుకున్నారు. మేము పదకొండుమందిమి. చేతిలో చిల్లిగవ్వలేదు. ఎక్కడ కలక్టరాఫీసు ఎక్కడ పోలేపల్లి. కూలినాలి చేసుకు బతికేటోల్లం. మహబబ్‌నగర్‌కి పోవడం మావల్లవుతుందా? మాకు న్యాయం చెయ్యండి, ‘’ గంగమ్మ, కమ్లి, రంగమ్మ, సాజీదాబేగం. అందరి గుండెల్లోను సుడులు తిరుగుతున్న దు:ఖం.
ఆగష్టు ఏడున జరిగిన పోలేపల్లి ఫార్మాసెజ్‌ దురాగతాలపై జరిగిన పబ్లిక్‌ హియరింగులో వెల్లువెత్తిన కన్నీటి గాధలు. పోలేపల్లి , గుండ్లగడ్డ తాండ, ముదిరెడ్డి పల్లి గ్రామాల ప్రలజ కన్నీటి ప్రవాహాలు మమ్మల్ని ముంచెత్తిన సందర్భమిది. ఒక్కొక్కరూ తమ గుండె ఘోషను వినిపిస్తుంటే మేము చేష్టలుడిగి కన్నీటి పొరల మధ్య స్తబ్ధులమై కూర్చున్నాం. ‘’అభివృద్ధి'’ విశ్వరూప సాక్షాత్కారమైన సమయమది. రెండు ఫార్మా కంపెనీల లాభాల కోసం 320 కుటుంబా లను రోడ్ల పాలు, చేసిన ‘అభివృద్ధి’ భూతం ఎపిఐఐసి రూపంలో వికృతంగా సాక్షాత్కారిచింది.నలభై మంది ప్రాణాలను ఈ భూతం ఇప్పటికే మింగేసింది. మరెంతోమంది ప్రజల గుండెలు  ఉద్వేగంతో, ఉద్రేకంతో, ని్స్సహాయత్వంలో ఎప్పుడు ఆగిపోతాయోనన్నంత బలహీనంగా కొట్టుకుంటున్నాయి. మొన్నటిదాకా 2,5,8,10, ఎకరాలకు ఆసాములు. ఇప్పుడు రోజు కూలీలు. వాళ్ళు ఆరుగాలం కష్టించి పంటల్ని పండిచుకున్న పొలాల్లోనే కూలీలైనారు. ప్రత్యేక ఆర్ధిక మండలి వాళ్ళ భూముల్ని మింగేసింది. పచ్చటి ప్రాంతాన్ని తవ్వి పోగులు పోసింది. పబ్లిక్‌ హియరింగు సందర్భంగా వాళ్ళు రాసుకున్న కరపత్రం చడండి. వాళ్ళు తమ బాధను దాటి, రెప్పచాటున పొంగుతున్న ఉప్పెనను అదిమిపట్టి, ఈ ప్రత్యేక ఆర్ధిక మండలివల్ల భవిష్యత్‌లో జరగబోయే వినాశనం గురించి ఎంత వివరంగా  రాసారో చూడండి.
ప్రియమైనా ప్రజలారా!
మేము పోలేపల్లి, గుండ్లగడ్డతాండ, ముదిరెడ్డి పల్లి గ్రావలకు సంబంధించిన రైతులం. ప్రస్తుతం మేము ఫార్మాసెజ్‌ బాధితులం. 2003 సం.న గ్రీన్‌ పార్క్‌ పేరుతో 320 కుటుంబాలకు చెందిన వ వెయ్యి ఎకరాల భమిని ఎపిఐఐసి స్వాధీనం చేసుకుంది. వ పండ్ల తోటలను బోర్లను ధ్వంసం చేసి, పచ్చని గడ్డిని తగలబెట్టింది. మేము ప్రశ్నించినందుకు వపై కేసులు పెట్టి జైళ్ళలోకి నెట్టింది. భములు పోయిన తర్వాత మేమంత కూలీలుగా బతుకుతున్నాము. తైదలు, జొన్నలు, కందులు, సీతాఫలాలు, చింతకాయలు, వమిడి, జామలు పండించుకుంట, బర్లు, గొర్లు కాసుకుంట బతికే మమ్మల్ని బజారు కీడ్చింది ఎపిఐఐసి. గ్రీన్‌పార్క్‌ పేరుతో సేకరించిన భములను ప్రస్తుతం ఫార్మాసెజ్‌కు ఇచ్చింది. ఫార్మాసెజ్‌లో కీలకమైన అరబిందోఫార్మా, హైట్రోడ్రగ్సు కంపెనీలు బల్క్‌ డ్రగ్సు తయరు చేయటానికి నిర్మాణాలు చేస్తున్నారు. ఎపిఐఐసి ఫార్మాసెజ్‌ కోసం మౌళిక వసతులైన రోడ్లు, నీరు, కరెంటు ఇప్పటికే ఏర్పాటు చేసింది. కాని 5 సం.రాల నుంచి నిరంతరం పోరాటం చేస్త వకు న్యాం చేయండి అని నెత్తి నోర కొట్టుకున్నా ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎపిఐఐసి ఎవరు పట్టించుకోలేదు.  భములు కోల్పోయి గుండెపగిలి చనిపోయిన 42 మంది రైతులు వారి కుటుంబాలు రోడ్లపాలయి బతుకెళ్ళదీస్తున్న ఏ ప్రభుత్వం చలించలేదు. ఈ సమస్య భములు కోల్పోవడం వరకు పోలేపల్లి సమస్య అయితే ఫార్మాసెజ్‌ ఉత్పత్తులు ప్రారంభించిందంటే ఈ సమస్య పాలమూరు జిల్లా సమస్య అవుతుంది. అంతేకాక దుందుబి నది నుంచి ఈ ఫార్మాసెజ్‌ విష పదార్ధాలు డిండినదిలో కలుస్తాయి. డిండినది నుంచి కృష్ణా నదిలో కలిసి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మొత్తం విషపూరితం అవుతుంది. జంట నగరాలకు వచ్చే కృష్ణ తాగునీరు, దక్షిణ కోస్తాకు వెళ్ళే కృష్ణ సాగునీరు విష పదార్థాలతో నిండిపోతుంది. మనం పోలేపల్లి ఫార్మాసెజ్‌ వెదజల్లె విష పదార్ధాలతో ఎలా బతకగలం, ఎలా వ్యవసాయం చేయగలం, ఎలా ధాన్యాలను ఉత్పత్తి చేయగలం, ఎలా జాతీయ సంపదను పెంచగలం, ఎలా భావితరాలను బతికించుకోగలం. నిన్నటి వరకు ఒక ఊరి సమస్య అయితే పోలేపల్లి పార్మాసెజ్‌ ఈ రోజు మన ఉమ్మడి సమస్య. మన ఉనికి సమస్య. మన బతుకు సమస్య. మన నాగరికత సమస్య, మొత్తంగా మన దేశభక్త సమస్య, దేశసార్వభౌవధికార సమస్య. కెవలం ఒకరిద్దరు ఫార్మా కార్పోరేట్‌ యజవనుల ఆదాయన్ని పెంచటానికి జరుగుతున్న  ఈ ఫార్మాసెజ్‌ కుట్రను భావ ప్రకటన ద్వారా బద్దలు కొడదాం. కాళ్ళ కింద భమిని కోల్పోవడమంటే సమస్తమం కోల్పోవడమే. కాబట్టి ఆగష్టు 7, 2008 ఉదయం 10గలకు పోలేపల్లి గ్రామంలో జరిగే పబ్లిక్‌ హియరింగులో మీరందరు వతో గొంతు కలపండి. పార్మాసెజ్‌కు వ్యతిరేకంగా ఎక్కడిక్కడ చర్చ పెట్టండి. సెజ్‌ దోపిడీని ఎండగట్టండి. మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధమవుదాం. పోలేపల్లి ఫార్మాసెజ్‌ వ్యతిరేక పోరాటాల్లో భాగమవుదాం, దేశభక్తిని చాటుకుందాం. సెజ్‌లను తరిమి కొడదాం, భారతదేశాన్ని కాపాడుకుందాం.
ఈ రోజు రాష్ట్రంలో ఏ మూల చూసినా సెజ్‌ మంటలే. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేరుతో, పాలకుల ‘అభివృద్ధి’ జపం పచ్చని పంట పొలాలను బీళ్ళుగా పరుస్తోంది. ప్రజల జీవనాధారాలను లాక్కుని వాళ్ళను దిక్కులేని వాళ్ళుగా తయారు చేస్తోంది. దేశంలో పలు ప్రాంతాలు సెజ్‌ల సెగకి భగ భగ మండుతున్నాయి. అది పోలేపల్లి కావచ్చు. కాకినాడ కావొచ్చు. సత్యవేడు కావచ్చు. సింగరు కావొచ్చు. సూళ్ళూరు పేట కావొచ్చు. దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో, లక్షలాది కుటుంబాలను శాశ్వత నిర్వాసితులను చేయబోతున్నాయి ఈ ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు. దేశంలో మొత్తం 600 పైగా సెజ్‌లున్నాయి. మన రాష్ట్రంలో 91 సెజ్‌లు ఇప్పటికీ సత్యప్రాయంగా అనుమతి పొందాయి. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు అనేవి దేశాన్ని అభివృద్ధి పధంలో నడుపుతాయని, లక్షలాది ఉద్యోగాలు  దొరుకుతాయని ప్రభుత్వం మొండిగా వాదిస్తున్నది. ఇది నిజం కాదు. ఈ సెజ్‌ల ఏర్పాటు వల్ల పచ్చటి పంట పొలాలు, అపార మత్య్ససంపద, సహజవనరులతో పాటు, గ్రామాలకు  గ్రామాలను కార్పోరేట్‌ సంస్థలు దోచుకుంటున్నాయి. ప్రజలు తమ పొలాల నుండి, తమ జలాల నుండి, తమ నివాసాల నుండి వెళ్ళగొట్టబడతారు. ముఖ్యంగా ఎస్‌.సి.ఎస్‌.టి. బి.సి మైనారిటీ ప్రజల భూముల్ని ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటోంది. కార్పోరేట్‌ రంగ ‘అభివృద్ధి’ని ప్రజల అభివృద్ధిగా బుకాయిస్తున్న ప్రభుత్వం భూములు, వనరులు, కొంపా గూడు కోల్పోయిన ఈ ప్రజల్ని ఏ ‘అభివృద్ధి’ బాట కడ్తుంది?
 పోలేపల్లి విషయనికొస్తే ఎస్‌.సి, ఎస్‌టి, బి.సి, మైనారిటీలకు చెందిన మొత్తం 1240 ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకున్నది. వీటిలో కేవలం 150 ఎకరాలను అరవిందో, హైట్రో ఫార్మాలకిచ్చి మిగతా భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చెయ్యలనుకుంటోదనేది స్పష్టం. రైతులకి 18 వేలిచ్చి ఫార్మా కంపెనీలకు కోట్లకు  అమ్మింది ప్రభుత్వం. సర్వం కోల్పోయి పోలేపల్లి ప్రజలు రోడ్ల మీద పడాల్సి వచ్చింది.
కాకినాడలో ఓఎన్‌జిసితో పాటు ప్రయివేటు పెట్రోలియం కంపెనీల కోసం 12,500 ఎకరాలను కబళించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సామర్ల కోట, పిఠాపురం, యు. కొత్త పల్లి మండలాల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ సెజ్‌ తీర ప్రాంతానికి వరింది. ఇవి చవిటి నేలలని ప్రభుత్వం చెబుతోంది కానీ అది నిజం కాదు. జీడి మామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు పంట భూమి కూడా వుంది. సరుగుడు నారు మళ్ళు ఇక్కడే ఎక్కువగా వున్నాయి. సరుగుడు  నారు రాష్ట్ర మొత్తానికి ఇక్కడి నుండే సరఫరా అవుతుంది అంతేకాదు ప్రకృతిలోని ఫలసాయం మీద ఆధారపడి బతికే  వెయ్యి కుటుంబాలకు పైగా గీత కార్మికులు, 1500 కుటుంబాల యాదవులు, మత్స్యకారులు ఈ ప్రాంతంలో వున్నారు. కాకినాడ సెజ్‌వల్ల వీరంతా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సెజ్‌ ఏర్పాటును వ్యతిరేకిస్త  అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. జైళ్ళ కెళుతున్నారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళు తున్నారు.
అలాగే చిత్తరుజిల్లా సత్యవేడులో, అనంతపురం, నెల్లూరుల్లో, ప్రకాశం జిల్లా ఓడ రేవు, గు౦టూరు జిల్లా నవాబు పట్నంలో కూడా శరవేగంతో సెజ్‌లు అమలవు తున్నాయి. కోస్తా తీరం వెంబడి ప్రజలు ‘కోస్టల్‌  కారిడార్‌’ భయం గుప్పిట్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దాదాపు 972 కిలోమీటర్ల అంటే కోస్తా  తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదారులు కృష్ణా, గు౦టూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని 972 కి.లీ పొడవున ఈ కారిడార్‌కు కావలిసిన భూమి సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్త్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఆహారభద్రతకు ముప్పు ఏర్పడబోతోంది. ప్రజారోగ్యం, పర్యావరణం మంటగలిసి పోతాయి. ఈ కారిడార్‌లో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలు వదిలిపెట్టే వ్యర్ధాలవల్ల ఆ ప్రాంతమంతా నరకంగా వరబోతోంది. సముద్ర జలాలు, భూగర్భ జలాలు కలుషితం కాబోతున్నాయి. అయినా సరే ప్రభుత్వం ముందు చూపు లేకుండా, ప్రజల ఆధీష్టానికి వ్యతిరేకంగా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు, కోస్టల్‌ కారిడార్‌ల ఏర్పాటుల కోసం సామ, దాన, భేద, దండోపాయ లన్నింటిని ఉపయెగిస్తోంది. వీటికి వ్యతి రేకంగా మాట్లాడుతున్న వాళ్ళని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తోంది. తాము బ్రహ్మాండమైన అబివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తుంటే అడ్డుకుంటున్నారని దమననీతిని ప్రదర్శిస్తోంది.
 పోలేపల్లిలో ఏర్పాటవుతున్న ఫార్మా సెజ్‌వల్ల సమస్తం కోల్పోయిన ప్రజలు, ప్రభుత్వం చెబుతున్న ‘అభివృద్ధి నమూనా’కి ఎంత దూరంలో వున్నారో ఆగష్టు 7న జరిగిన పబ్లిక్‌ హియరింగ్లో మాట్లాడిన ప్రజల్ని చూసిన తర్వాత ఎవరైనా అర్ధం చేసుకుంటారు. ఈ అభివృద్ధి నమూనా వెనక వుండే వినాశనం, విచ్ఛిన్నం, ఆహార, ఆరోగ్యం, జీవనాధారాల అభద్రతల గురించి మనం అర్ధం చేసుకోవాలి. పేద ప్రజల జీవితాలను, జీవనాధారాలను కార్పోరేట్‌ శక్తులకు బలిచ్చి, వాళ్ళకు లాభాలు గడించి పెట్టే పనిని ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తలకెత్తుకోవడం ఎంతో గర్వి౦చాల్సిన విష యం. సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యం వాదులు, హక్కులసంఫలు ఈ విషయమై ఐక్య ఉద్యమం నడపాల్సిన అవసరం ప్రజలకు అండగా వుండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సెజ్‌ల మీద ఏర్పాటైన కాన్సిరామ్‌ రాణా పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్లు
1. రైతుల కష్టాలను వారి ఉద్యమాలను అర్ధం చేసుకోవాలి.
2. సెజ్‌ల అనుమతుల్లో అనవసర తొందరపాటు వల్ల కూడా సెజ్‌ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 3. సెజ్‌ల ఏర్పాటు అభివృధ్ధిని, ఎగుమతుల్ని సూచిస్తుంది. అయితే దీనిని ప్రజలెందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ప్రజల ఆవెదనతో తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టాలి.
 4. ప్రజల ఉద్యమాలను, వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటూ, దాని కనుగుణంగా సెజ్‌ చట్టానికి మార్పులు, చేర్పులు చేసే దాకా వేరే సెజ్‌లను నోటిఫై చేయరాదు.
 5.  రైతుల నుండి తీసుకునే భూముల వల్ల రైతుల దిగుబడి, ఆదాయం తగ్గటమొక్కటే కాదు వారి సా్మాజిక, సాంస్కృతిక జీవితం ప్రభావితమౌతుంది. వ్యవసాయంతో సంబంధమున్న రైతుల, కూలీల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని కమిటీ నమ్ముతోంది.
6. అలాగే రోడ్ల విస్తరణ ఇళ్ళ నిర్మాణాల వల్లను, టౌన్‌షిప్‌ల నిర్మానం వల్లను ఎంతో పంట పొలం నాశనమవుతోంది.
 7.  ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ ఏర్పాటు వల్ల, నగరీకరణవల్ల పంట భూములు పాడయిపోతున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం సీరియస్‌ చర్యలు తీసుకోవాలి.
 8.  ఆర్ధిక అభివృద్ధి కోసం వ్యవసాయ అభివృద్ధిని ఫణంగా పెట్టడం భావ్యం కాదు…
 9. వ్యవసాయ ొభూముల్ని ఎట్టి పరిస్థితుల్లోను వ్యవసాయేతర పనులకి కేటాయించకూడదు…
కాన్షిరామ్‌రాణా రిపోర్ట్‌ 47 రికమండేషన్స్‌ని ప్రభుత్వానికి సూచించింది. ఈ కమిటీ పోలేపల్లిని కూడా సందర్శించింది. సెజ్‌లు ఏర్పాటు చేసేటపుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి చాలా చక్కటి రికమండేషన్స్‌ ఇచ్చింది. పూర్తి వివరాలు వచ్చే సంచికలో ప్రచురిస్తాం.

Friday, September 12, 2008

మా ఊరు సీతారామపురం-నా లైఫ్ లైన్


    ఆయ్‌! మాది నర్సాపురమండి. కాదండి... కాదండి నర్సాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో వుందండి మావూరు. సీతారామపురం. మా గొప్పూరు లెండి. నిజానికి అదసలు ఊరులాగుండదండి. 'అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు' అని ఏమనగారు చెప్పినలాంటియ్యేమీ మా వూర్లో లేవండి. ఇప్పటిగ్గూడ మా ఊరికి బస్సు లేదంటే మరి మీరు నమ్మాలండి. నమ్మకపోతే మీ ఇష్టమండి. మా వూర్లోనండి ఏమున్నా ఏం లేకపోయినా బోలెడన్ని తోటలున్నాయండి. మామిడి, జీడిమామిడి, సపోటా, సీతాఫలం తోటలేనండి ఊర్నిండా. ఇక సరుగుడు తోటలగురించి, వాటి ఈలపాట గురించి ఏం చెప్పమంటారు. నే సెపితే కాదండి మీరు ఇనాలండి. తాడితోపులు, కొబ్బరిచెట్లు కూడా ఊరంతా వున్నాయండి.
    మా యింట్లో మేం సుమారు 50 మంది పిల్లలుండేవాళ్ళం.ఏసంగి శెలవులొస్తే ఇంకా పెరిగిపోయేవారు. మా తాతకి ఏడుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నప్పుడు మేమందరం కలిసే వుండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ్ళ్ళు రోజూ వందమందికి వండి పెట్టేవాళ్ళంటండి. చివరాకర్న ఆడోళ్ళకి ఏముండేది కాదంట. అది వేరే సంగతిలెండి. మరొకసారి చెబుతాను  ఆ సంగతులు.
    మీరందర జీడిపప్పు బోలెడ్డబ్బెట్టి కొనుక్కుంటారుకదా. మాకైతే ఊర్నిండా జీడితోటలే. మేం పిల్లలందరం కలిసి వేసంగి శెలవులొస్తే కోతుల్లాగా చెట్లమీదే ఎగురుతుండేవోళ్ళం. జీడిపళ్ళు చీక్కుంట, గింజల్ని చెట్లకిందే కాల్చుకుంట, జీడిపప్పు తెగ తినేవోళ్ళం. ఇప్పుడేమో కొలస్ట్రాలని భయపెడుతున్నారుగాని మేం తిన్నంత జీడిపప్పు ఎవ్వరూ తినుండరంటే నమ్మండి. మా కూరల్నిండా పచ్చిజీడిపప్పే. చింతచిగురు, మామిడి కాయ, వంకాయ కోడిగుడ్లు అన్నింట్లోను కలిపేసుకుని వండేసుకునేవాళ్ళం. చింతాకు జీడిపప్పు కూర  రుచి నే చెబితే ఏం తెలుస్తుంది. తిని చూడాలంతే.
    వేసంగి శెలవుల్లో మా పిల్లమూకంతా ఆడపిల్లలైతే లంగాలకి కచ్చాలుపోసి, మొగపిల్లలైతే జేబుల్లోకి గంపెడేసి చింతచిగురు కోసి కుప్పలు పోసేవోళ్ళం. చిటారుకొమ్మల్లోకి పాక్కున్టూ వెళ్ళిపోవడం బలే మజాగా వుంటుంది. చింతాకు ఉడకబెట్టి బిళ్ళలు చేసేవోళ్ళు. ఆకు ఎండబెట్టి డబ్బాల్లో పోసేవోరు. మాకు సంవత్సరమంతా చింతాకు, చిన్తపరిగెలు, మెత్తళ్ళు,చిత్తడాయిలు, చెంగుడుపట్టు- ఇయ్యన్ని ఏంటీ అనుకుంటున్నారా? చేపలండీ బాబు చేపలు. ఈ చేపలన్నీ చింతాకుతో కలిపి ఒండుకుతింటే  ఇంకేమీ ఒద్దనిపిస్తదండి. మీరు కూడా పశ్చింగోదావరి వాళ్ళయితే ఇయ్యన్నీ ఈజీగా తెలిసిపోతాయండి.
    ఏసంకాలంలో మామిడి పళ్ళతోపాటు మాన్చి రుచైన పండు మరోటుందండి. మీరెప్పుడైనా తాట్టెంక తిన్నారా? చెట్టుమీద ముగ్గిన తాటి పండు నిప్పులమీద కాల్చుకుని తిన్నారంటే..... ఎందుకులెండి వర్ణిఅమ్చడం. మీరెరూ తినుండరు. పోనీ కుంపటేసిన తేగలన్నా తిన్నారా లేదా? కనీసం బుర్ర గుంజయినా తిన్నారా? తినుంటే మాత్రం వందేళ్ళొచ్చినా ఆ రుచుల్ని మర్చిపోవడం వుండదండి. సరే. మా ఊరినిండా పళ్ళతోటలే కాదండి కూరగాయల పాదుల ఎక్కువేనండి. వంకాయలు, దొండకాయలు, బీర, సొర, పొట్ల, గోరుచిక్కుళ్ళు, టమెటాలు, పచ్చిరగాయలు, గోన్గూర, తోటకూర ఒకటేమిటి అన్నీ పండిస్తాం. వీటన్నింటికి నీళ్ళెక్కడినించొస్తాయా అని ఆలోచిత్తన్నారా ఏంటి? నుయ్యిలు తవ్వుతారు. పదడుగులు తవ్వితే చాలు బుడబుడమని  నీళ్ళూరిపోతాయి. రెండు కుండల్లాంటివుంటాయి. వాటిని బుడ్లజోడంటారండి. ఈ బుడ్లజోడుని నూతుల్లోని నీళ్ళతో నింపి కూరపాదులకి నీళ్ళుపోస్తారు. బుడ్లజోడుతో నీళ్ళపోత అంటారు సిపుల్‌గా.
    మా నాన్న చాలా కష్టజీవి. గోచిపెట్టుకుని బుడ్ల జోడుతో పాదులకి నీళ్ళపోతపోసి, పచ్చిగడ్డి కోసుకుని ఇంటికొచ్చి అలిసిపోయి అలానే వీధరుగుమీద పడి నిద్రపోయేవాడు. నేను నాన్నతో కలిసి పాదుల్లో పనిచేసేదాన్ని. గొడ్డలితో కట్టెలు కొట్టేదాన్ని. పాలు పితికేదాన్ని.నూతుల్లో దిగి బోలెడన్ని చేపలు పట్టేదాన్ని. ఎపుడూ ఊరిమీద బలాదూర్‌ తిరిగేదాన్ని. నువ్వాడపిల్లవి. ఇలాంటి పనులు చెయ్యకూడదు అని ఏనాడూ మా నాన్న నాకు చెప్పలేదు. నేనేం చేసినా అడిగేవోడు ఎవ్వడూ లేడనుకోండి.
    ఓసారి నూతిలో దిగి చేపలు పడుతుంటే సీసాపెంకు గుచ్చుకుని ఒకటే రక్తం. నేనేం భయపడలేదు. ఆ నూతుల్లోనే వున్న మెట్టతామరాకు ముద్దగా చేసి తెగిన చోట పూసేసానంతే. తెగిందని ఆరోజు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఈ రోజుకి నా ఎడం చేయి మణికట్టు దగ్గర ఆ మచ్చ అలాగే వుండిపోయి, ఆ అల్లరి రోజుల్ని గుర్తుచేస్తంటుంది. తేగబుర్రల్ని కత్తితో కొడుతుంటే తెగిన మచ్చ కూడా ఎడం చేతి చూపుడు వేలు మీద వుందండోయ్‌. మరేంటనుకున్నారు. ఆ మచ్చల వెనక ఇంత మహా చరిత్ర వుందిమరి.
    తోటలెంబడి తూనీగలాగా తిరుగుతుండేదాన్ని కదా! నాకు బయమంటే ఏంటో తెలియదండి. కాని ఒక్క బావురుపిల్లికి  మాత్రం తెగ భయపడేదాన్ని. మా యిల్లు రైలుబండంత పొడుగుండి చాలా పెద్దమండువా ఇల్లండి. బోలెడంత పెరడు వుండేది. గుమ్పులుగా కోళ్ళు తిరుగుతుండేవి. ఈ కోళ్ళ కోసం రాత్రిళ్ళు బావురు బావురంటూ బావురుపిల్లి వచ్చేదండి. కోళ్ళు  గూళ్ళో దూరి కోడినెత్తికెళ్ళి తినేసేది. పిల్లొచ్చినపుడు కోళ్ళు గోల గోలగా అరిచేవండి. నా గుండెల్లో రైళ్ళు పరుగెట్టేవి. గుడ్లు మిటకరించి అటకమీదికి చూస్తుండేదాన్ని. అటకమీంచి బావురుపిల్లి  నా మీదికి  దూకేస్తుందని తెగ భయపడేదాన్ని. నేనెంత మొద్దునంటే పిల్లిక్కావలిసింది కోడిగాని నేను కాదుగా. అది ఈ మొద్దుబుర్రకు అర్తం కాడానికి చాలా కాలమే పట్టింది. అదండి సంగతి.
    మా వూర్లో నాకు ఎక్కువ యిష్టమైంది, ప్రాణప్రదమైంది అమ్మోరి తీర్తం.  మా వూరి దేవత పేరు మారమ్మ. సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారు. తీర్తం పదిరోజులుందనగానే  పిల్లల హడావుడి మొదలయ్యేది. తాటాకులు కోసుకొచ్చి బుల్లి బుల్లి బుట్టలల్లేవాళ్ళం. వీటిని జాజారి బుట్టలు అనేవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి రెండేసి బుట్టలన్నమాట. బుట్టల్లో  మట్టి నింపి నవధాన్యాలు వేసి నీళ్ళు పోసేవాళ్లం. పొద్దున లేవడం బుట్టలన్నీ వీధరుగుమీద పెట్టుకుని మొలకలొచ్చినయ్య లేదా అని చూసుకునేవాళ్ళం. అన్నింటి కన్నా ముందు పెసల మొక్కలొచ్చేవి. తీర్తం నాటికి జాజారి బుట్టల్నిండా పచ్చటి మొక్కలు గుబురుగా వచ్చేసేవి. తీర్తం నాటిముందు రోజు రాత్రి ఆసాదులు మోళీ కట్టేవాళ్ళు. ఆసాదులంటే ఎవరో చెప్పలేదు కదా!  మారమ్మ తీర్తంలో ఘటాలనే గరగలంటారు. ఈ  ఆసాదుల గరగల నృత్యం చూసి తీరాల్సిందే. మాదిగడప్పుకు అనుగుణంగా వారు వేసే స్టెప్‌లు, ఏ మెగాస్టార్‌ కూడా వెయ్యలేదండోయ్‌. ఆ... అన్నట్టు మెగాస్టార్‌ మా వూరివాడేనండి. మా బస్సులోనే వచ్చి మాకు బీటేసినవోడేనండోయ్‌. ఆ ముచ్చట మరోసారి చెబుతాలెండి. ఈ ఆసాదుల  మోళీ అబ్ధుతంగా వుంటుంది.  మోళీ అంటే మరేం కాదండి మేజిక్‌ అన్న మాట. మనిషి నెత్తిమీద నల్ల దుప్పటి కప్పి, పొయ్యేట్టి పకోడీలువొన్డేసేవోరు. జేబుల్లోంచి రూపాయల కట్టలు లాగి దండల్లాగా మెళ్ళో వేసుకునేవోళ్ళు. పేకముక్కల్ని ఫెవికాలెట్టి అంటించినట్టు సర్రున ఎగరేసేవోళ్ళు. మేం పిల్లలం నోళ్ళు ముయ్యడం మర్చిపోయి మొద్దురాచ్చిప్పల్లా చూస్తుండిపోయేవాళ్ళం. పి.సి. సర్కార్‌ మేజిక్‌ షో వాళ్ళముందు పనికిరాదంటే నమ్మండి.
    ఇంక తీర్తం రోజు సంగచ్చెబుతాను. తలంటుస్తానం చేసేసి, వుంటే కొత్తబట్టలేసేసుకుని ఆసాదుల రాకకోసం ఎదురుచూత్తా కూచొనేవాళ్ళం. డప్పుల హోరుతో ఆసాదులెళ్ళి ఊరి పొలిమేరల్ని కట్టేసి వచ్చేవోళ్ళు. ఆసాదుల వెంటపడి రెండు చేతుల్లో పచ్చటి జాజారి బుట్టలతో మిడతల దండులాగా పిల్లల గుంపు. బుట్టలో జానేడేసంత పచ్చటి మొక్కలు. ఆసాదులు గరగల నృత్యంతో ముందుకెళుతుంటే వాళ్ళ వెనకాల మేము. గుడి వరకూ అలా వెళ్ళి బుట్టల్ని గుడిచుట్టూ తిప్పి గుడి గోపురం కింద అంచుల మీద పెట్టేసేవోళ్ళం. గుడంతా పచ్చగా కళకళల్లాడిపోయేది. అసలు పిల్లలు బుట్టల్తో నడుస్తుంటే పచ్చటి తివాసీని మోసుకెళుతున్నారా అన్నంత ఆకుపచ్చగా వుండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా కళ్ళకి ఆ పచ్చదనం అగుపిస్తుందంటే మీరు నమ్మితీరాలి మరి.
     దీపాళి పండగ గురించి ఏం చెప్పమంటారు. ఎప్పుడూ డబ్బుల్తో దీపావళి టపాసులు కొనలేదు మేం. అన్నీ మేమే తయరు చేసుకునేవాళ్ళం. పేటేప్‌ కాయలు ( తాటాకులతో చేసేవి), మతాబులు,  సిసింద్రీలు, చిచ్చుబుడ్లు అన్నీ చేసేవోళ్ళం. ముడిసరుకులు కొనుక్కొచ్చి తయారు చేసేవోళ్ళం. మతాబులు చేయడానికి ముందు కాగితం గొట్టాలు చెయ్యలిగా. అలాగే సిసింద్రీ గొట్టాలు. కాయితం, అన్నం మెతుకులు వుంటే గొట్టాలు రెడీ. వాటిల్లో మందుకూరి ఎండకి పెట్టేవోళ్ళం. తాటాకుల్ని మెలికతిప్పి, మందుకూరి, వొత్తిపెడితే పెటేప్‌కాయ రెడి. మేం చేసినవి ఫట్‌ ఫట్‌ మని పేలేవి. మతాబులు జలతారు పువ్వుల్ని రాల్చేవి. సిసింద్రీలయితే  సుయ్‌మని ఎగిరిపోయేవి. ఇవన్నీ కాకుండా దీపావళికి మేం ఓ ప్రత్యేక వస్తువు  తయారు చేసేవోళ్ళం. ఉప్పు, ధాన్యపువూక, పేడ కలిపి ఓ మూటలాగా చేసి తాడు కట్టేవోళ్ళం. మూట మధ్య నిప్పురవ్వేస్తే, ఉప్పు టపటప పేలేది. తాడుతో ఆ మూటని గుండ్రంగా తిప్పితే మనచుట్ట నిప్పుల వలయం  ఏర్పడుతుంది. పేడ, వూక కాలుతుంటే ఉప్పురవ్వలు ఎగిసేవి. ఈ ఉప్పు మూట దీపావళికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ తెలుసాండి.
    వినాయక చవితికి కూడా మేం ఎండుపల్లేరుకాయల్ని మూటగట్టి ఇంటికొచ్చే కొత్తల్లుళ్ళని తెగ బెదిరించేవాళ్ళం. మా అల్లరికి బావలు పరుగో పరుగు. అల్లుళ్ళని చాలా రకాలుగా ఏడిపించే వాళ్ళం. ఆకునిండా భోజనం పెట్టి, ఆకు కింద ఆవాలు పోసి, సన్నటి  తాడుకట్టి ఆయన భోజనానికి కూర్చుని తినడం మొదలెట్టగానే ఆకుని లాగేసేవాళ్ళం. కింద ఆవాలుంటాయిగా ఆకు ఈజీగా కదిలిపోయేది. ఇంటల్లుడి ముఖం చూడాలి. అందరం గొల్లున నవ్వేవాళ్ళం. అలాగే గారెల్లో బండారు గాజులెట్టి అల్లుడికి పెట్టేవాళ్ళు. ఆయన ఆనందంగా  గారెలు లాగించబోయేసరికి గాజు గట్టిగా పళ్ళకి తగిలి బెంబేలెత్తిపోయేవాడు. మేం నవ్వుకుంటూ గాజుకు సరిపడా డబ్బులివ్వాలని ఆటపట్టించేవాళ్ళం. ఇవన్నీ పండగ సరదాల్లో భాగమేనండోయ్. పండగ సంబరాలు ఎంత రాసినా తనివి తీరదు . ఉగాదికి అరకలు కట్టి దున్నడాలు, సంగ్రాంతికి దుంలెత్తుకొచ్చి భోగిమంటలేయడాలు, కార్తీక వమాసం చలిరోజుల్లో తెల్లవారు ఝామునే గోదావరిలో మునగడాలు, అట్లతద్దికి ఉయ్యల లూగడాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో సంబరాలు.
     మావూరి గొప్పదనం గురించి ఇంకేం చెప్పమంటారండి బాబు! మాకు ఒక వేపు గోదారి. మరోవైపు సముద్రం. గోదావరి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంటే  పది కిలోమీటార్ల దూరంలో సముద్రం. నా బతుకు మా వూరి పచ్చదనంతోటి, మా వూరి చుట్టు వున్న నీళ్ళతోటి ముడిపడిపోయింది. వెన్నెల్లో గోదారి మీద లాంటి ప్రయణం, అంతర్వేది రేవు, అన్నాచెల్లెలగట్టు, కొనసీమ కొబ్బరి చెట్లు ఇవన్నీ నా జీవితంలో అంతర్భాగాలు. నా బాల్యం ధగధగ మా గోదారి గట్టుమీద సూర్యబింబం మెరిసినట్టు మిరుమిట్టు గొలుపుతుంటుంది.
    నేనేం టాటాలు, బిర్లాల్లాగా నా నోట్లో బంగారపు చెంచా పెట్టుకునేం పుట్టలేదు సుమండి. నేను పుట్టింది ధాన్యపు కొట్లోనంట. మా అమ్మ నిండు నెలల్తో ధాన్యపు కొట్లోంచి ధాన్యం తీస్తోందట. అమాన్తం నేను పుట్టేసానంట. కొవ్వాసు పీసు ( ఒక రకం చేప) లాగా వుండి ఈరోజో రేపో అన్నట్టుండేదాన్నంట. నా కర్మకాలి నే పుట్టిన పద్నాలుగో రోజే మా అమ్మమ్మ  చచ్చిపోయిందంట.  నా చదువుకూడా అంతే. మా వీధరుగు మీదే బడి వుండేది. బుద్ధిపుడితే కూర్చునేదాన్ని. లేకపోతే చెట్లెక్కేదాన్ని. టీకాల వాళ్ళు వస్తే మాత్రం నేను చిక్కడు, దొరకడు. చిటారు కొమ్మల్లోకి ఎక్కి కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక దిగేదాన్ని. నా కెవరన్నా భయముండేది కాదు కాని టీకాల వాళ్ళంటే ఆ సూదులు  చూసి భయమేసేది.
     నా కెందుకు, ఎలా, ఎపుడు పుట్టిందోగాని చదువుకోవాలనే కోరిక మాత్రం పుట్టేసింది. మా కుటుంబంలో అటు ఇటు చదువుకున్న వోళ్ళే లేరుమరి. నాకెలా పుట్టిందో తెలియదు. చదువుకోసం ఎంతో పోరాటం చేయాల్సివచ్చింది. మా నాన్నకి నన్ను చదివించాలనే వుండేది కాని డబ్బుల్లేవు. ఉమ్మడి కుటుంబానికి ఆయన చాకిరీ చేసేడు గాని చిల్లి కాని కూడా వుండేది కాదు. నా చదువు సమాచారం క్లుప్తంగా చెబుతాను. అయిదు వరకు ఊర్లోనే చదివాను. ఆరునించి పదివరకు ఓరియంటల్‌ స్కల్‌. అంతా సంస్కృతం మయం. మా సంస్కృతం మేష్టారు శ్లోకం తప్పు చదివితే స్కల్‌ చుట్టూ తిప్పి కొట్టేవోరు. ఒకసారి నేను ఆయనకి దొరక్కుండా బాదం చెట్టెక్కి కూర్చున్నా. ఆయన కోపం ఆపుకోలేక గోడకేసి తలబాదుకున్నాడు. నేను కిందికి వచ్చేసాను గాని ఆయన నన్ను కొట్టలేదు. నేను టెంత్‌ వరకు సంస్కృతం, ఇంటర్‌లో తెలుగు లిటరేచర్‌, డిగ్రీలో ఇంగ్లీషులిటరేచర్‌ చదవడమ్ వల్ల   సాహిత్యం మీద వల్లవలిన ప్రేమనాకు.
    మళ్ళీ ఓసారి మా ఊరి కెళదావ! మా ఊరికి బస్సులేదని ముందే చెప్పానుకదండి. నడవాల్సిందే! పదండి నడుద్దాం. కాలవ దగ్గర ఎర్ర బస్సుదిగి నడవడం మొదలెడితే మీకు ఇళ్ళేం కనబడవు. ఒక వేపు జీడితోటలు, మరోవేపు సరుగుడు తోటలు. ఆ తోటల్లో పడి ఓ మైలున్నర నడిస్తే  మా ఇల్లొస్తుంది. ఆ.... అన్నట్టు మీకు ఇంకో రహస్యం చెప్పడం మర్చిపోయా. ఎవరికి చెప్పకండేం. ఎండు సరుగుడాకులు చూసారా ఎపుడైనా? ఎండిపోయిన సరుగుడాకుల్ని తెల్ల కాగితాల్లో చుట్టుకుని గుప్‌ గుప్‌ మని పీల్చి పొగవొదిలేవాళ్ళం. హమ్మ! ఎంత రౌడీ పిల్లలు అని ముక్కుమీద వేలేసుకుంటున్నారా?  'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అని మహాకవే అన్నాడు నాదోలెక్కా. మాకు సిగరెట్లు తయరు చేయడం ఎంత సులువో తెలిసిపోయింది.  మాకు నోబుల్‌ ప్రైజ్‌ ఇవ్వాలికూడా.
    మీకు మరోరహస్యం కూడా చెబుతానండి. ఎవరితోనుచెప్పకండి. మా నాయనమ్మ రోజూ పొద్దున్నే మాన్చి్ పోత్తాడి కల్లు ముంతలు ముంతలు లాగించేదంటండి. మీకు ఇంకో సీక్రెట్టు చెప్పేస్తున్నాను. కాచుకోండి. మేం కూడా తాటాకు దొన్నుల్లో నింపుకుని పోత్తాడి కల్లు తాగేసేవోళ్ళమండి. మా ఇంటెనక ఓ  పోత్తాడి వుందండి. దాని కల్లు భలే తియ్యగా వుండేదండి. కల్లు అనగానే చాలా మంది మొకాలెందుకో తుమ్మల్లో పొద్దుగకినట్టయిపోతాయి. ఎందుకో నా కర్థమే కాదు. ముంజలు మాత్రం జుర్రుకుంట తినేస్తారు కాని కల్లంటే ఆముదం తాగిన మొకాలు పెడతారు. కల్లంటే కల్తీ కల్లనుకుంటున్నారా ఏంటి కొపదీసి. కాదండి బాబూ! మా వూరి ఈడిగ ఎంకట్రావుడు కల్లు తీస్తాడు. తెల్లారగట్లే అతను చెట్టెక్కడం మనం చెట్లకింద చేరడం. ఫ్రెష్‌. తాగితే అపుడే దింపిన కల్లే తాగాలండి. లేకపోతే యమ డేంజర్‌. కొబ్బరి నీళ్ళలాగానే వుంటదండి. ఒట్టండి. ఆరోగ్యానికి అపుడే తీసిన కల్లు చాలా మంచిదని  మా ఎంకట్రావుడు చెపుతాడండి. ఇదండి మావూరి కల్లు బాగోతం.
    మీరందరూ గోలీకాయల్తో గోలీలాడితే మేమ్  జీడిపిక్కల్తో గోలీలాట ఆడి బోలెడు జీడిగింజల్ని సంపాదించేవాళ్ళం. ఆ తర్వాత వాటిని అమ్మి  డబ్బులు సంపాదించేవాళ్ళం. పుస్తకాలు కొనుక్కోవాలికదా! డబ్బులంటే గుర్తొచ్చింది. మేం డబ్బులు కూడా తయరు చేసేం. ఫెయిలయామనుకోండి. చిల్ల పెంకుల్ని గుండ్రంగా అరగదీసి సిగరెట్‌ పెట్టెల్లో వుండే ముచ్చిబంగారం అంటించి కొట్టుకు తీసుకెళ్ళి ( రాత్రిపూట) నిమ్మతొనలిమ్మంటే, చిల్లపెంకుల్ని తీసుకుని మా వీపుల్ని  విమానంమోత మోగించిన విషయం గుర్తొస్తే చచ్చేంత నవ్వొస్తుంది నాకు. ఇంకా బలుసుచెట్ల కొమ్మలకుండే ముళ్ళకి నేరేడు పండ్లు గుచ్చి ద్రాక్ష గుత్తుల్లా చేసినా, పుంతలోని ఇసకలో ఉసిరి కాయల్ని కప్పెట్టి మర్నాడు తొనలు తొనలుగా వొలుచుకుతిన్నా, బ్రహ్మజెముడు కాయల్ని  కాళ్ళంతా పూసుకుని అమ్మోరక్తం  అని గగ్గొలు పెట్టినా, పిచ్చికాయలు, తాటాకు కలిపి నమిలి కళ్ళీ కన్నా ఎర్రగా నోరు పండించుకున్నా ఇదంతా మా అల్లరిలో భాగమైనా మా సృజనాత్మకతకి పునాదులని నేననుకుంటాను.
    అందుకే మా ఊరంటే ప్రాణం నాకు. నాకు బంగారు  బాల్యాన్నిచ్చిన మా సీతారామపురం నా లైఫ్‌ లైన్‌. ఊరుకుండాల్సిన లక్షణాలు లేని ఊరు కాబట్టి నేనాడింది ఆట పాడింది పాటగా సాగింది. దళితులు, రాజులు, కాపులు తప్ప వేరే  ఏ కులం వాళ్ళూ మా వూళ్ళో లేరు. దళితుల అణిచివేత విషయంలోమా ఊరేమీ మినహాయింపు కాదు. మా తాత ఓ భయంకరమైన, కరడుకట్టిన భూస్వామి. పావలా, అర్థణా అప్పిచ్చి ఎకరాలకెకరాలు భూమి రాయించుకున్న దుర్మార్గ భూస్వామి. ఈయన దుర్మార్గానికి బలై కుటుంబాలకు కుటుంబాలే ఊరొదిలి పోయారని, అందులో నా చిన్ననాటి నేస్తం నాగులు కూడ వుందని నేను పెద్దయ్యాకే నాకు అర్థమైంది. దొంగతనాలంటగట్టి దళితుల్ని గుంజలక్కట్టేసి కొట్టిన ఉదంతాలు చూచాయగా గుర్తున్నాయి. పాలేర్ల పెళ్లాల మీద అత్యాచారాలు చేసి, గర్భవతుల్ని చేసిన వాళ్ళూ వున్నారు. వాళ్ళకు పుట్టిన వాళ్ళ పిల్లల్లో తమ పోలికలు చూసుకుని ముఖాలు మాడ్చుకున్న వాళ్ళూ  వున్నారు. ఇవన్నీ నాకు పెద్దయ్యాక తెలిసిన నగ్న సత్యాలు.    వీటికి, మా వూరిలో నాకున్న అనుబంధానికి ఏం సంబంధం లేదు. పైరు పచ్చల్తో కళ కళలాడే మా ఊరు, ఎత్తైన అరుగుల్తో గంభీరంగా వుండే మా యిల్లు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో సజీవంగా వుంటాయి.
     ఇవండి మా ఊరి సంగతులు. ఇవన్నీ చదివేక మీరు నా బాల్యానుభవాలని ఆడపిల్ల మగపిల్లాడు సున్నితపు తాసులో కొలుత్తారని నాకు తెలుసండి. కల్లు తాగడాలు, సరుగుడు సిగరెట్లు పీల్చడాలు, గొడ్డళ్ళతో కట్టెలు కొట్టడాలు, చిటారుకొమ్మల్లోకి ఎగబాకడాలు, చేపల్ని పట్టుకోవడాలు ఇయ్యన్నీ జనం దృష్టిలో మగానుభవాలు. మగపిల్లలు మాత్రమే చేయల్సిన పనులు. ఆడపిల్లలక్కూడా ఇలాంటి బాల్యం వుంటుందంటే నమ్మరేమో! మనోళ్ళ దృష్టిలో ఆడపిల్లలు ఎచ్చనగాయలూ, వోమన గుంట్లూ ఆడాలి. లక్కపిడతలాటలూ, బొమ్మల పెళ్ళిళ్ళాటలు ఆడాలి. అమ్మలెనక వొంటింట్లో తిరిగి వొంటల్నేర్చుకోవాలి. తమ్ముళ్ళని  చెల్లెళ్ళని  ఎత్తుకు మోయలి. అడ్డగాడిదలు అన్నలు, తమ్ముళ్ళు తిని తేన్చిన కంచాలు ఎత్తాలి. వినయ విధేయతల్తో నడుములు, మెడలు వొమ్చేసి పెళ్ళికి సిద్ధంగా వుండాలి. అంతేకాని నాలాగా స్వేచ్ఛగా, పక్షిలాగా బయటే తిరగడం, నా కిష్టమైన  అన్ని పనుల్ని అడ్డూ, అదుపూ లేకుండా చేసేయడం అబ్బో! చాలా మందికి కంట్లో నలకపడ్డట్లే.
    చివరగా మా దొంగతనాల సంగతుల్జెప్పేసి ముగించేత్తానండి. మా వూర్లో బోలెడన్నిమామిడి తోటలున్నాయని చెప్పేనుకదండి. పచ్చిమామిడికాయలు మాకు బాగానే దొరికేవి కాని పండ్లు చిక్కేవి కాదు. మామిడి కాయల్ని ఎడ్లబండి మీద తీసుకొచ్చి మా తాతకు అప్పచెప్పేవోరు. మా తాత వాటన్నింటిని ఓ పెద్ద గదినిండా పోయించి పండింతర్వాత, కొంచం కొంచం డాగుపడ్డ పళ్ళనే బయటకు తెచ్చి ఇచ్చేవోడు. మాకు చాలా కోపమొచ్చేది. ఒక్క మంచి పండు ఇయ్యొచ్చు కదా అనుకునేవోళ్ళం. చచ్చినా ఇచ్చేవోడు కాదు. మరి మేం తక్కువోళ్ళమా? సరుగుడు కర్రల చివర్న సూదివాటంగా చెక్కి కిటికీల్లోంచి  పళ్ళు లాగేసేవోళ్ళం. ఆ గది కిటికీకి రెండు చువ్వల్లేకపోవడం మా పనెంతో సులువుగా అయిపోయేది. బోలెడన్ని మామిడి పండ్లు దొంగతనంగా లాగేసి తినేసేవోళ్ళం. మామిడిపండ్లు ఏమైపోతున్నాయో అర్తం కాక మా తాత జుట్టు పీక్కునేవోడు. ఇక మారెండో దొంగతనం భోగిమంటల కోసం దుంగలు ఎత్తుకురావటం. పొయ్యికిందికి దాచుకున్న కట్టెల్ని ఎత్తుకొచ్చి  భోగిమంటల్లో పడేసేవోళ్ళం. ఓసారి పెద్ద గొడవైపోయింది. రామాయమ్మని ఒకామె వుండేది. ఆమె పోట్లాట మొదలెట్టిందంటే ఓ పగల ఓ రాత్రీ నడిచేది. చెంబునిండా నీళ్ళు పెట్టుకుని అవి తాగుతూ మరీ తిట్టేది. దుంగలెత్తుకొచ్చామని మమ్మల్ని దుంపనాశనం తిట్లెన్నో తిట్టి మా చిన్నానతో కొట్టించింది.
     ఇలా రాసుకుంటపోతే ఈ వ్యాసం కొండపల్లి చెంతాడంత పొడుగైపోతాది. అవకాశం దొరికితే తరువాయి భాగం మళ్ళెప్పుడన్నా వినిపిస్తాలెండి. ఇంకా చానా సంగతులున్నాయి మరి.
     నేను ఇప్పటికే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసేసాను. ఏభై ఏళ్ళు వచ్చేసినా నా బాల్యం నా కళ్ళకి నవనవోన్మేషంగా కన్పిస్తూనే వుంటుంది. నా పెదాల మీద తురాయి పువ్వుల్ని పూయిస్తూనే వుంటుంది. మ ఊరు జున్నుముక్కలా నన్ను ఊరిస్తనే వుంటుంది. మా సపోటతోట నూతిలోని తెల్లని కలువపూలు నన్ను రా రమ్మని పిలుస్తనే వుంటాయి.
    మరింక శెలవుచ్చుకుంటానండి. మా ఊరంటే మీకూ ప్రేమ పుట్టే వుంటుంది. మీరందరూ కూడా మా ఊరిని, నాకు ప్రాణప్రదమైన మా సీతారామపురాన్ని ప్రేమించాలని కోరుకుంటూ....

Wednesday, September 10, 2008

మంచుపల్లకీలెక్కించొద్దు

తల్లులదినం...మదర్స్‌ డే. ఇటీవలే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంటర్నెట్‌లో లక్షల సంఖ్యలో మదర్స్‌ డే మీద వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. కనీసం ఆరోజైనా - ఐ లవ్యూ మామ్‌.. అని చెప్పమనే సందేశాలు కుప్పలుతెప్పలుగా వెబ్‌సైట్లనిండా వుంటాయి. తల్లుల త్యాగాలను కీర్తించే కవిత్వం... అబ్బో... నెట్‌నిండా పొంగిపొర్లుతోంది. మరిక లోటేంటి?.. తల్లుల గురించి ఇంత వీరలెవల్లో కీర్తిస్తుంటే సంతోషించక ఈ సన్నాయి నొక్కులేంటి అనిపిస్తోంది కదా..
మాతృత్వంలోనే వుంది ఆడజన్య సార్ధకం. అంటూ తల్లితనాన్ని ఆకాశానికెత్తేయడం వెనక పిల్లలు కనలేని స్త్రీలను అవవనించడం అంతర్లీనంగా వుందన్న విషయం ముందు అర్థం చేసుకోవాలి. మాతృత్వాన్ని పోటీలుపడి పొగిడే పురుషపుంగవులు పితృత్వం గురించి ఒక్కమాట కూడా ఎందుకనరో ఆలోచించగలగాలి.
సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే పనిని పునరుత్పత్తి శక్తి ద్వారా స్త్రీలు మాత్రమే చేయగలరు. అఫ్‌కోర్స్‌... పురుషుల పాత్ర లేకుండా ఈ పని జరగనప్పటికీ తొంభై శాతం బాధ్యత స్త్రీమీదే వుంది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసే మాతృత్వ ప్రక్రియను మాటల్లో కోటలు దాటించడం తప్ప ఆచరణలో అంతా అవహేళనే. స్త్రీ గర్భం ధరించిన క్షణం నుంచి కంటికిరెప్పలా కాపాడాల్సిన కుటుంబంగాని, సమాజంగాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని తమ తమ బాధ్యతల్ని ఏ రోజూ సక్రమంగా నిర్వర్తించిన దాఖలాలు లేవు.
గర్భం ధరించినప్పటి నుంచి ఆమె శరీరంలో చోటు చేసుకునే మార్పుల గురించి గాని, ఆమె మానసిక కల్లోలాల గురించి గాని ఎవరికీ పట్టదు. శ్రామిక మహిళల విషయమైతే మరీ అన్యాయం. పురుడు పోసుకునే ముందురోజు వరకు శ్రమ చెయ్యవలసిన్దే. కుటుంబ సభ్యుల కంచాల్లోకి అన్నం తేవాల్సిందే. పురిటి గాయలు మానకముందే పనిలోకి చొరబడాల్సిందే. మనం మహాఘనంగా కీర్తించుకునే మాతృత్వ మాధుర్యాలు, మాతృమూర్తుల దినోత్సవాలు వీరి దరిదాపులకు కూడా చేరని విషయాన్ని మనం గుర్తించడానికి నిరాకరిస్తాం. తల్లిపాల దినోత్సవాలను ఫుల్‌సైజ్‌ పేపర్‌ ప్రకటనలతో ఘనంగా జరుపుకుంటాం గాని బిడ్డకి కడుపునిండా పాలివ్వనివ్వని క్రూరత్వాల గురించి అస్సలు పట్టించుకోం.
పురిటి నొప్పుల గురించి , ప్రసవ వేదన గురించి అనుభవించిన వాళ్ళు మాత్రమే రాయగలరు.. చెప్పగలరు. పొరపాటున ఎవరైనా లేబర్‌ రూమ్‌లోని ప్రసవవేదన గురించి కవిత్వమో, కథో రాస్తే వాళ్ళు మాతృత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళుగా ప్రచారం చేస్తారు తప్ప, వాళ్ళు వర్ణించినదానిలో వాస్తవం గురించి చచ్చినా బుర్రకెక్కించుకోరు. మాతృత్వం చుట్టూ అల్లిన ఒక మిత్‌ మాతృత్వాన్ని గ్లోరిఫై చేస్తుందే గాని అందులోని బాధల గాధలను వర్ణించదు. ఈ మిత్‌ని బద్దలు కొట్టింది స్త్రీవాదులే. లేబర్‌ రూమ్‌లోని వేదనామయ ప్రపంచాన్ని సాహిత్యంలో ఆవిష్కరించింది స్త్రీవాద రచయిత్రులే. స్త్రీల శరీరాల్లో జరిగే మార్పులు సమస్తాన్నీ, ఆఖరికి రుతుక్రమంతో సహా అక్షరాల్లో నిక్షిప్తం చేయడంతో సాహిత్యంలో మొదటిసారి చాలా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. స్త్రీలు తమ అనుభవాల్ని, తమ ఆవేదనలను అక్షరీకరించి ప్రపంచం ముందు పెట్టినప్పుడు, ఆర్తిగా, ఆత్మీయంగా అర్థం చేసుకున్నవాళ్ళు బహుకొద్దిమంది. దాడికి దిగి, విష ప్రచారంతో మానసికంగా గాయపరిచినవాళ్ళే ఎక్కువ.
ఈ మధ్యనే ఒక తల్లి గుండెల్ని చీల్చుకుని వచ్చిన బాలింత డిప్రషన్‌ గురించి ఒక దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చదివినప్పుడు కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్లయ్యింది. చెప్పలేని ఒక ఉద్వేగం మనసంతా కమ్మేసింది. ఆ డిప్రషన్‌లో ఆ తల్లి తన కూతురితో సహా రైలుకెదురుగా నడిచిన సందర్భం గురించి చదువుతున్నప్పుడు గుండె అదిరినట్లయింది. ఆమె అలాంటి తీవ్రమైన మానసిక అలజడి నుంచి బయటపడి ఈరోజు విజయవంతమైన ప్రచురణలో నిలదొక్కుకోవడం నిజంగా అద్భుతమే. ఈ విషయన్ని ఎందుకు చెబుతున్నానంటే తల్లి పాత్రలో ఇమిడిపోయే ప్రతి స్త్రీ ఇంత తీవ్ర స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మానసిక అలజడికి శారీరక మార్పులకు గురవుతుంది. దీనిని అర్థం చేసుకుని ఆసరాగా నిలిచే సపోర్ట్‌ సిస్టమ్స్‌ ఏవీ లేవు. పైగా వాటిని గురించి అవహేళన, నిర్లక్ష్యంతో నిండిన ధోరణే కుటుంబ సభ్యుల్లోను,సమాజంలోను వుంది. బిడ్డకు చెయ్యల్సిన చాకిరీ, నిద్రలేమి, బయటి ప్రపంచానికి దూరమై, ఇంటి నాలుగ్గోడలకే అతుక్కుపోవడం లాంటివన్నీ ఆ మాతృమూర్తిని ఎంత నలిపేస్తాయె ఎవరూ అర్థం చేసుకోరు. ఆడపుట్టుక పుట్టినందుకు ఇవన్నీ చాలా సునాయసంగా ఎక్కడా వ్యతిరేకించకుండా నల్లేరు మీద బండిలా నడిపించుకెళ్ళిపోవాలని అందరూ ఆశిస్తారు గాని వాస్తవ సమస్యల గురించి పట్టించుకునే పద్దతే లేదు.
మాతృమూర్తుల దినోత్సవాలు జరుపుకోవడం గ్రీటింగుల ద్వారాను కాదు. పైపై నుంచి పొంగుకొచ్చే కవిత్వాలతో అసలే కాదు, మానవ జాతిని వృద్ధి చేసే మహత్తర కార్యాన్ని భుజాలకెత్తుకుని, ప్రకృతి తనకు మాత్రమే ప్రసాదించిన గురుతర బాధ్యతను ఎంతో నిష్టతో, ఇష్టంతో కొనసాగిస్తున్న సమస్త స్త్రీ జాతికి ప్రపంచం మొత్తం రుణపడి వుంది. మాతృత్వాన్ని మాటల మాయజాలంతో కీర్తించడం కాక, ఆమె బాధ్యతల్లో మనస్స్ఫూర్తిగా, ప్రేమగా, ఆత్మీయంగా, పాలు పంచుకోవాల్సిన అవసరం వుంది. బిడ్డల బాధ్యతను అంగీకరించగలిగే వున్నత సంస్కారం అలవర్చుకోవడం ఈనాటి తక్షణావసరం. మాతృత్వ మాధుర్యం గురించే కాదు, పితృత్వ మాధుర్యం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతేగాని, స్త్రీలను, వారి జవజీవాలను పీల్చి పిప్పి చేసే చాకిరీల సమస్తం గురించి మాట్లాడకుండా ముఖం చాటేసి - మాతృమూర్తుల దినోత్సవాలు జరుపుతాం... మమ్మల్ని మంచుపల్లకీల్లో ఊరేగిస్తాం అంటే నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...