Monday, November 5, 2018

నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే… –

మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్‌. అయినా సరే వెళ్ళాలి. నల్లమల కళ్ళముందు కొచ్చింది. రా… రా… అని పిలవడం మొదలుపెట్టింది. ఆకురాలు కాలం… అడివంతా నగ్నంగా, నిజరూపంతో సాక్షాత్కరించే కాలం. పచ్చదనం మచ్చుకైనా కనబడదు. అయినా సరే వెళదామని నిర్ణయించుకున్నాను.

ప్రశాంతితో అన్నాను ఓ రెండు రోజులు ఎటైనా పోదామా? అని. ‘సై’ అంది. కర్నూల్‌, మహానంది, అహోబిలం… ర్నూల్‌లో మహా ఎండలు. ఫర్వాలేదు… పోదామ్‌… అనుకున్నాం. ఏప్రిల్‌ నాలుగో సోమవారం… ఆఫీసులో కొన్ని పనులున్నాయ్‌. పన్నెండింటికల్లా పూర్తయిపోయాయి. మిట్ట మధ్యాహ్నం వేళ కారులో కర్నూల్‌ బయలుదేరాం. ప్రశాంతి చాలాసార్లు కర్నూల్‌ వెళ్ళింది కానీ, మహానంది, అహోబిలం చూళ్ళేదట. కర్నూల్‌లో ఆగకుండా మహానంది వెళ్ళిపోయాం. అప్పటిదాకా మండిన సూర్యుడు మహానంది కొండల్లోకి జారిపోయాడు. ఆ కొండల్లోంచి 365 రోజులూ జాలువారే నీటి చెలమల్లోకి సూర్యుడు పారిపొయ్యాడన్నమాట వేడి భరించలేక.
మేం మహానందిలో దిగేసరికి కొంచం చీకటి పడుతోంది. పెద్దగా జనం లేరు. ఉన్నవాళ్ళు కొలనులో ఈతలు కొడుతూ కేరింతలు కొడుతున్నారు. మహానందిలో వున్న గొప్ప ఆకర్షణ నిత్యం పారే నీటిబుగ్గ… ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. గుడి ఆవరణలో వున్న తటాకంలో ఎప్పుడూ ఒకే స్థాయిలో మిలమిలా మెరిసే స్వచ్ఛమైన నీళ్ళు… తటాకం అడుగు కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. నడుములోతు మాత్రమే నీటిలోతు ఉంటుంది. ఎప్పుడూ అది పెరగదు… తరగదు. అందులోంచి గుడి బయటవున్న రెండు తటాకాల్లోకి నీళ్ళు మహాఫోర్స్‌గా వస్తుంటాయి. అక్కడి నుండి కాలువద్వారా నీళ్ళు పొలాల్లోకి పారుతుంటాయి. కొన్ని వందల ఎకరాలకు ఈ నీరు పారుతుంది. మహానందిలో పెంచే అరటి తోటలన్నీ ఈ నీటితోనే పెరుగుతాయి.
మహానంది గుడిమీద నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండదు. ప్రశాంతి గుడిలోకి వెళదామంది. అక్కడ గుడి వెనక ఓ పెద్ద నాగమల్లి చెట్టుంది. ఆ చెట్టు చుట్టూ పాముల బొమ్మలుంటాయి. నాకు ఈ చెట్టు కూడా ఆకర్షణే. ఇద్దరం కాసేపు కొలను నీళ్ళల్లో నిలబడ్డాం. మొత్తం దిగి ఈత కొట్టాలనిపించింది. కానీ అడవి దాటి అహోబిలం చేరాలి. మహానందిలో మాకు సహకరించిన శ్రీనుకి వీడ్కోలు చెప్పి అహోబిలం వేపు సాగిపోయాం. మా కోసం అహోబిలంలో ఎదురు చూస్తున్న నాగరాజుకి వచ్చేస్తున్నామని కాల్‌ చేసి చెప్పాం. చీకటి పడిపోయింది. అమావాస్యకి ముందు రోజులు… చిమ్మచీకటిగా వుండి నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశాంతి, నేను కబుర్లలో పడ్డాం. ప్రశాంతి దెయ్యాల కబుర్లు మొదలెట్టింది. కొరివి దెయ్యాలగురించి చెబుతుంటే డ్రైవర్‌ యాదగిరి జడుసుకున్నాడు. ”మేడం! నాకు దయ్యాలంటే చాలా భయం. చెప్పకండి” అంటూ వొణికాడు. మేం విరగబడి నవ్వుకున్నాం. ఎనిమిదిన్నరకి దిగువ అహోబిలం చేరుకున్నాం. నాగరాజు మా కోసం రూమ్‌ బుక్‌ చేసాడు. రోజంతా ప్రయాణం… స్నానం చేసి వేడి వేడి చపాతీలు తిని నిద్రపోయాం. ఆరింటికి ఎగువ అహోబిలం వెళదామని తయారుగా వుండమని, యాదగిరికి చెప్పాం.
మర్నాడు నాలుగింటికే మెలకువ వచ్చేసింది. తయారైపోయి రూమ్‌ బయటకి వచ్చేసరికి ఎదురుగా నెలపొడుపునాటి నెలవంక… ఇదేంటి ఇప్పుడు నెలవంక అనుకుంటూ ఆశ్చర్యపోయి ”మన స్నేహం మొదలైంది నెలపొడుపునాడే కదా! మనల్ని పలకరిద్దామని వచ్చినట్టుంది” అన్నాను. ఇంకా తెల్లవారలేదు. దిగువ గుళ్ళోంచి సుప్రభాత హడావుడి వినిపిస్తోంది. నెలవంకని చూస్తూ… సంతోషపడుతూ కారెక్కగానే ఎగువ అహోబిలంవైపు కారు బయలుదేరింది. పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి. ఆకులు రాలిపోవడంవల్ల అడవి పల్చగా కనబడుతోంది. ఆరింటికల్లా పైకి వెళ్లిపోయాం. నేను చాలాసార్లు అహోబిలం వెళ్ళాను. రకరకాల గ్రూప్స్‌తో వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా చూసిన ప్రతిసారీ కొత్తగానే వుంటుంది. తొలిసారి చూస్తున్న ప్రశాంతి ఆనందాశ్చర్యాలకి లోనైంది. మెట్లెక్కుతున్నప్పుడు చేతికందుతున్న ఆ కొండచరియ, ఆ అమరిక ప్రశాంతిని అబ్బుర పరిచాయి.
అహోబిలం వచ్చినప్పుడల్లా గుడి వెనకున్న అడవి మొత్తం తిరగాలని అన్పించేది. ఎత్తైన కొండలతో నిండివుండే నల్లమల అడివి మొత్తం తిరగాలని. చివరి శిఖరం వరకు ఎక్కాలని కలలు కంటుండేదాన్ని. కానీ ఎప్పుడూ ధైర్యం చెయ్యలేదు. దానికి కారణం ఆ కొండలెక్కడం కష్టమని, ఆ అడవిలో తిరగడం ప్రమాదకరమని చాలామంది భయపెట్టడమే. మామాలుగానే ఎత్తులెక్కడం నాకు కష్టం. జ్వాలా నరసింహుని కొండ ఎక్కడం అసాధ్యం అని తేల్చేయడం వల్ల… అమ్మో! నేను ఎక్కలేనులే అని నిర్ణయించేసుకుని అడవిలో సమీపంలో వుండే జలపాతం వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసే వాళ్ళం. ఇంతకు ముందు నేను వెళ్ళిన బృందాల్లో ఎవ్వరూ సాహసం చెయ్యలేదు. కానీ… ఈసారి ప్రయత్నం చెయ్యాలి. నన్ను గెలిపించడానికి నాతో ప్రశాంతి వుంది. జ్వాలా నరశింహ కొండ ఎక్కడం నాకు గొప్ప విజయమే. ”అమ్మూ! నేనున్నా కదా! ప్రయత్నం చేద్దాం… జాయేంగే… జీతేంగే…” అంటూ ఉత్సాహపరిచింది.
ఆ అడవి గర్భంలోకి గైడ్‌ లేకుండా వెళ్ళడం అసాధ్యం. ఎక్కడ దారి తప్పుతామో, ఎటు వెళ్ళిపోతామో అంతు చిక్కదు. గైడ్‌ని చూడమని నాగరాజుకు అంతకు ముందే చెప్పాం. మేం కొండపైకి వచ్చేసరికి గైడ్‌ తయారుగా వున్నాడు. చిన్న పిల్లాడు… నేనే గైడ్‌ అన్నాడు. ”నువ్వా!” అని మేము ఆశ్చర్యపోతే… ”నేనే మేడం… చాలా రోజుల్నించి గైడ్‌గా చేస్తున్నా… అడవిలో నాకంతా తెలుసు” అన్నాడు. ఆ పిల్లాడి పేరు సంజీవ్‌, వాళ్ళన్న ముందుకొచ్చి అన్నాడు. ”మేడం… వాడికి అంతా తెలుసు. మీకు బాగా చూపిస్తాడు” అనడంతో మేం సంజీవ్‌ వెంట అడవిలోకి బయలుదేరాం. దారిలో ఊత కర్రలు తీసుకున్నాడు.
మూడో కాలుని టిక్‌ టిక్‌ మనిపిస్తూ నడక మొదలుపెట్టాం. మొదటగా దర్శనమిచ్చే జలపాతం కనబడలేదు. ”వర్షాలు లేవు మేడం… జలపాతం ఇంకిపోయింది” అన్నాడు సంజీవ్‌.
నడక మొదలైంది. బండలమీద వొడుపుగా నడుస్తున్నాం. ఇంతకు ముందొచ్చినపుడు, జలపాతం సమీపంలో కూర్చుని మెడిటేషన్‌ చేస్తూ నేను ఫోటోలు తీయించుకున్న ప్రదేశం దగ్గర కొచ్చాం. చాలా సన్నగా నీళ్ళు కారుతున్నాయి. అక్కడ మళ్ళీ ఫోటోలు తీసుకున్నాం. అక్కడ ఓ చెట్టుకి పెద్ద తొర్ర ఏర్పడి వుంది. ప్రశాంతి అందులోకి దూరి ఫోటో తీసుకోవాలనుకుంది. కానీ సంజీవ్‌ వారించాడు తొర్రలో ఏమైనా జంతువులు, పాములు ఉండొచ్చు, లోపలికి వెళ్ళొద్దన్నాడు.
పెద్ద పెద్ద బండరాళ్ళ మీద నడుస్తున్నాం. సూర్యుడు ఇంకా అడవిలో అడుగు పెట్టలేదు. అయినా విపరీతంగా చెమటలు కారుతున్నాయి. చెట్లు చాలా వరకు ఆకులు రాలిపోయి, ఎండిపోయినట్లు కనబడుతున్నా చాలా చెట్లు పచ్చగానే వున్నాయి. ఆకురాలిన చెట్లకి సన్నటి కిసలయాలు తొంగి చూస్తున్నాయి. కొన్ని చెట్లకి ఎర్రటి ఆకులు, ముదురు మెరూన్‌ కలర్‌లో ఆకులు, పచ్చటి చిగుర్లు… అడివంతా రంగుల మయంగా వుంది. ఎన్నో రకాల అడవి పూలు… చాలా విలక్షణమైన పూలగుత్తులు. ఆ మత్తులో నడుస్తున్న మమ్మల్ని ‘పాము, పాము, ఆగండి’ అంటూ హెచ్చరించాడు సంజీవ్‌. అందరం ఎక్కడివాళ్ళమక్కడే ఆగిపోయాం. కర్రతో కొట్టగానే పాము ఓ బండ కిందికి జర జరా పాక్కుంటూ వెళ్ళిపోయింది. అలాంటి బండల మీదే మేము నడుస్తున్నాం. ఏ బండ కింద ఏ పాముందో! ”నాకు పాములంటే చాలా భయం” ప్రకటించాడు యాదగిరి. కాసేపు పాముల మీద చర్చ నడిచింది.
ఇటీవల తమ పొలంలో కన్పించిన పాముల గురించి చెప్పింది ప్రశాంతి. బండల మీద కాళ్ళు వేస్తుంటే జారుతుందనే భయంతో పాముల భయం కూడా తోడైంది. మేం జాగ్రత్తగా నేలమీద, బండలమీద దృష్టి పెట్టి నడుస్తున్నపుడు మా ఎదురుగా హఠాత్తుగా సీతాకోక చిలుకల గుంపు కనబడింది. అన్నీ ఒకే రంగులో
ఉన్నాయి. కొన్ని నేల మీద వాలి, మరికొన్ని వాటి చుట్టూ ఎగురుతున్నాయి. నేను వాటి దగ్గరగా వెళ్ళాను. ”ఇక్కడ సీతాకోకచిలుకలు చాలా వుంటాయి. నాకు రోజూ కన్పిస్తాయి” అన్నాడు సంజీవ్‌. వాటి దగ్గరకెళ్ళగానే అన్నీ ఒక్కసారి లేచాయి. పట్టుకుందామని ప్రయత్నం చేస్తే ఒక్కటీ దొరకలేదు. వాటిని పట్టుకునే ప్రయత్నాన్ని ప్రశాంతి వీడియో తీసింది. అన్ని సీతాకోక చిలుకలు ఎగురుతూ, నేలమీద వాలుతూ వాటి హడావుడిలో అవి మునిగినప్పుడు మేము ముందుకు సాగాం.
అడవి మధ్యలో కట్టిన ఒక బ్రిడ్జి మీదికి వచ్చాం. ”అదిగో చూడండి ఉగ్రస్తంభం… అక్కడే నరశింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అక్కడి వరకు వెళ్ళడం కష్టం. జ్వాలా నరశింహ కొండ వరకు వెళ్ళొచ్చు. ఆ కొండ ఎక్కడానికి 600 మెట్లున్నాయి” ఉన్నాడు సంజీవ్‌. ”ఆరువందల మెట్లా? అమ్మో! నేను రాను” అనేసాను. అనడమే కాదు ఒకచోట కూర్చుండి పోయాను. ”అమ్మూ! ఇటురా!” అని పిలిచింది ప్రశాంతి. నేను లేచి వెళ్ళాను. అప్పటికి కొంచం ఎండ పెరుగుతోంది. ఇద్దరం బ్రిడ్జి మధ్య వరకూ నడుచుకుంటూ వెళ్ళాం. ”అదిగో చూడు! ఉగ్రస్తంభం అని సంజీవ్‌ చెప్పిన కొండ. భలే వుంది… మెల్లగా వెళదాం… నేనున్నాగా అమ్మూ…” అంది. ”నేను రాను… అన్ని మెట్లెక్కి అంత ఎత్తుకు రావడం నావల్ల కాదు” అంటూ భీష్మించాను. ఉగ్ర స్తంభకొండని ఫోకస్‌ చేసి బోలెడు ఫోటోలు దిగాం. బ్రిడ్జి మీద నుంచి నల్లమల మహాద్భుతంగా కనిపిస్తోంది. ఎత్తైన కొండలు విభిన్న రంగుల ఆకులతో చెట్లు… కొన్ని చెట్లకి ఎర్రటి తురాయి పువ్వులాంటి ఆకులు… పండుటాకుల్లోంచి తొంగి చూస్తున్న లేత చిగురుటాకులు. అడవి పచ్చగా, వొత్తుగా వున్నపుడు పచ్చదనం మాత్రమే కనబడుతుంది. ఆకురాలు కాలంలో అడవి అందం భిన్న వర్ణాల మేళవింపులో కళ్ళకు విందు చేస్తుంది. ఈ సౌందర్యం చూడాలనే కదా ఎండల్లో నల్లమల ట్రిప్‌ వేసాం.
బ్రిడ్జి మీద నుంచి చుట్టూ పరుచుకున్న అపార సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నవేళ ప్రశాంతి నా భుజం చుట్టూ చెయ్యేసి ”అమ్మూ! పద వెళదాం. నువ్వు ఎక్కగలవు. ఆయాసమొస్తే ఆగుదాం… కూర్చుందాం. నేనున్నాగా” అంటూ నన్ను మెట్ల వేపు నడిపించింది. ఆ మెట్ల వేపు, ఆ ఎత్తు వేపు చూడగానే నా గుండె ఝల్లుమంది. అప్పటికే గుండె దడదడ కొట్టుకుంటోంది. మైసూర్‌లోని శ్రావణ బెళగొల కొండ ఎక్కినప్పటి అనుభవం పదే పదే గుర్తుకొస్తోంది. ఆ రోజు సగం దారిలో స్పృహతప్పి పడిపోయిన దృశ్యం కళ్ళముందు కదలాడుతోంది. బహుశా అదే నాలో ఒక ఫోబియాలాగా తయారైందనుకుంటాను. ప్రశాంతి నా చెయ్యి పట్టుకునే వుంది. నేను మెల్లగా మెట్లెక్కడం మొదలు పెట్టాను. యాదగిరి, నాగరాజు, సంజీవ్‌లు మా ముందు నడుస్తూ ”మేడం! వచ్చేసాం… ఇంకొంచం దూరమే” అంటూ ఉత్సాహపరుస్తున్నారు.
వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది. చేతిలో కర్ర చెమటకి జారుతోంది. పది మెట్లెక్కడం… ఆయాసంతో కూర్చుండి పోవడం… అలా కూర్చున్నప్పుడు, చుట్టూ పరుచుకున్న అడవి సౌందర్యం చాలా సేద తీర్చేది. జ్వాలా వరకు నేను వెళ్ళగలనా అనుకుంటూ చాలాసార్లు ”ఇంక నేను రాను… మీరు వెళ్ళి రండి… ఇక్కడ కూర్చుంటాలే” అనేదాన్ని. అడవి మధ్యలో ఒక్కదాన్ని కూర్చోడానికి సిద్ధమయ్యాను కానీ మెట్లెక్కాలంటే… ”అమ్మూ! నువ్వు రాగలవు… నీకేమీ కాదు. అసలు నువ్వు భయపడడమేమిటి?” అంటుంది ప్రశాంతి. భయమేనా? కాదు భయం కాదు. నా గుండె పనితీరు మీద నాకున్న అపనమ్మకం. ఆయాసంతో గుండె ఆగిపోతుందనే సంశయం… నాది నార్మల్‌ గుండె కాదు కదా! మాటేయించుకున్న ఓటి గుండె… చాలా సంవత్సరాలు జరిగిపోయినా… నాలో ఆ ఫీలింగ్‌ పోలేదు. అందుకే ఎత్తులకి ఎక్కాలంటే… గుండె ఏమవుతుందో అనే బెదురు అలాగే
ఉండిపోయింది. అలా అని నాకు చావంటే భయం లేదు. కానీ అప్పుడే ఈ సౌందర్యాన్నంతా అర్థాంతరంగా వదిలేసి పోవాలనీ లేదు. ఈ భయాన్ని మోస్తూనే నా సాహసాలన్నీ చేస్తుంటాను.
ఆగుతూ, కూర్చుంటూ చుట్టూ పరుచుకున్న అడవి అందాన్ని చూస్తూ నాలుగొందల మెట్లు ఎక్కేసాను. మళ్ళీ ఆగిపోయాను. కింద లోయ, ఎదురుగా ఎత్తైన కొండ… ఆ కొండమీంచి లోయలోకి రివ్వుమంటూ ఎగిరొచ్చింది ఓ పసుప్పచ్చటి పిట్ట. ”అరే! ఎంత పచ్చగా ఉందో ఈ పిట్ట” అని ఆశ్చర్యపోతుంటే దాని తోడు పిట్ట కూడా ఎగిరొచ్చి నా ఎదురుగా వున్న చెట్టుమీద వాలింది. ముందు ఎగిరిన పిట్ట కూడా వచ్చి చేరింది. వాటి సోయగాన్ని చూస్తూ చాలాసేపు నా అలసటని మర్చిపోయాను. ”అమ్మూ! పద ఎండ పెరుగుతోంది. దిగడం కష్టమౌతుంది” అంది ప్రశాంతి. ఎక్కడం మొదలు పెట్టాం. ఉగ్రస్తంభం ఎదురుగా కనిపిస్తోంది. కుడిచేతివైపున ఓ ఎత్తైన కొండ… ఆ కొండ వాలుల్లో బహుశా తేనెపట్టులుండి వుంటాయి. చిగురు శివాజీ రాసిన ఆర్టికల్‌ గుర్తొచ్చింది. 2002 లో అనుకుంటాను ఆయన నల్లమల అడవుల్లో చెంచులు తేనె తీసే విధానం గురించి ఓ అద్భుతమైన వ్యాసం రాసారు. ఆ వ్యాసాన్ని తీసి మళ్ళీ భూమికలో వెయ్యాలి అనుకుంటూ మెల్లగా మెట్లెక్కుతున్నాను. ప్రశాంతి నా భుజం చుట్టూ చెయ్యేసి నాతో పాటే నడుస్తోంది. ”అమ్మూ! అదిగో జ్వాలా నరశింహ గుడి, వచ్చేసాం” అంది. ఆ వెంటనే కొండమీంచి జరజరా బండలు దొర్లుతూ లోయలో పడుతున్న శబ్దం. ”ఏంటవి? బండలు దొర్లి పడుతున్నాయ్‌” అంటే… ”అంతే మేడం… అలా పడుతుంటాయ్‌… అలా కిందికి చూడండి… ఆ పెద్ద బండ పైనుంచి పడి పెద్ద చెట్టుని మొత్తం విరక్కొట్టేసింది… ఆ చెట్టు మొదలు చూడండి ఎంత లావుగా వుందో” సంజీవ్‌ చెప్పాడు. ”మేడం! వచ్చేసాం… మీరు మెట్లన్నీ ఎక్కేసారు” అంటూ అరిచాడు యాదగిరి. నాలో గొప్ప సంతోషం ఉప్పొంగింది. కర్రను కింద పడేసి ఏదో ఎవరెస్ట్‌ ఎక్కినంత ఉద్వేగంతో ”ఐ డిడ్‌ ఇట్‌…. ఐ యామ్‌ సో హ్యాపీ” అంటూ ప్రశాంతిని వాటేసుకుని ”నువ్వు నాచేత గొప్ప సాహసం చేయించావే. ఎన్నో సంవత్సరాల కలని సాకారం చేయించావ్‌… లవ్‌ యూ బంగారం…” అంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టాను. ఇద్దరం వొకరి నొకరం పట్టుకుని డాన్స్‌ చేసాం. ఆ క్షణాల్లో నాలో వెల్లువెత్తిన ఉత్సాహం, నామీద నాకు గొప్ప నమ్మకం… నేను మాటల్లోకి అనువదించలేను. ఎంతో కాలంగా నాలో గూడు కట్టి ఉన్న (నేను ఎత్తులెక్కలేను అనే భయం) భయం పటాపంచలైన సందర్భం. ఈ కష్ట సాధ్యమైన ప్రయాణానికి ఓ అర్థం దొరికిన సందర్భమన్నమాట.
మెట్లన్నీ అయిపోయాక చదును నేలమీదకి వచ్చాం. కుడి చేతి వేపున ఉగ్రస్థంభం… నిట్టనిలువుగా వుంది. అక్కడికి వెళ్ళడానికి మెట్లుగానీ, దారి కానీ లేదట… కానీ చాలా మంది బండలమీద, అడవిలో నడుచుకుంటూ పైవరకు వెళతారట. మేం కొండ వాలు మీంచి జాగ్రత్తగా నడుస్తున్నాం. బండలు జారుతున్న శబ్దం… చూస్తే గుడి పక్కన కాపురముంటున్న చెంచు కుటుంబం చుట్టుపక్కల శుభ్రం చేస్తూ బండల్ని లోయలోకి తోస్తున్నారు. ”ఈ గుడిని చూసుకుంటూ ఓ చెంచు కుటుంబం ఇక్కడే కాపురముంటోంది. వాళ్ళు అప్పుడప్పుడూ కొండ దిగుతుంటారు తమ అవసరాల కోసం” సంజీవ్‌ చెప్పాడు. మేం నడుస్తున్న కొండ కింద చల్లగా, తేమగా వుంది. కొండల్లోంచి చిరుధారల్లో నీళ్ళు పడుతున్నాయి. వర్షాకాలమైతే పెద్ద ధారతో జలపాతం జాలువారుతుందట. నేను ఆ ధార కింద తలపెట్టి ముఖం కడుక్కున్నాను. చల్లటి నీళ్ళు తగలగానే అలసట అంతా మాయమైంది. గుడి వేపు వెళ్ళాం. జ్వాలా నరశింహస్వామి ఆలయం అని రాసి వుంది. చిన్న గుడి. నేను గుడి వెనక చెంచుల ఇంటి వేపు వెళ్ళాను. చిన్న గుడిశె లాంటి ఇల్లు. ఊయల వేలాడుతోంది. ఇంట్లో మహిళలెవరూ కనబడలేదు. ఇద్దరు మగ వాళ్ళు ఆవరణలో వున్న చిన్న చిన్న రాళ్ళని తొలగిస్తూ లోయలోకి తోస్తూ కనబడ్డారు. ఆ ఇంట్లో ఉండే చెంచు వ్యక్తి పేరు కిషన్‌ అని తర్వాత ప్రశాంతి చెప్పింది. తన పనిలో చాలా బిజీగా ఉన్నాడతను. గుడి మెట్లు దిగుతుంటే… ”మేడం! పూజారి గారొస్తున్నారు వెనక్కి రండి” అంటూ సంజీవ్‌ పిలిచాడు. దూరంగా మెట్లకివతల పూజారి కనబడ్డాడు. ఆయన రోజూ రాడట. ఎవరైనా పైకి వస్తే చూసి వస్తాడట. ”నేను రానులే… ఆ మేడం ఉందిగా” అంటూ నేను నీటిధారవేపు వెళ్ళాను. ఓ పది నిమిషాల తర్వాత అందరూ గుళ్ళోంచి బయట కొచ్చారు. ”మేడం ఈ గుహలో నీటి గుండం చూడండి… నరశింహస్వామి హిరణ్య కశిపుడిని చంపాకా ఈ నీళ్ళల్లో చేతులు కడుక్కున్నారు. చూడండి నీళ్ళు ఎర్రగా ఉంటాయి” అన్నాడు సంజీవ్‌. కొండగుహలో స్వచ్ఛంగా వున్న నీళ్ళు కనిపించాయి. దానికి ఇనుప జాలీలతో చేసిన చిన్న తలుపులు పెట్టి కట్టి వుంచారు. ”చాలా లోతుంటుంది. 365 రోజులూ ఆ నీళ్ళు అలాగే ఉంటాయి. తగ్గవు, పెరగవు… మహానందిలో నీళ్ళలాగానే” అన్నాడు నాగరాజు. ప్రశాంతి లోపలికెళ్ళి దోసిలి నిండా నీళ్ళు తెచ్చి తాగుతూ భలే తియ్యగా
ఉన్నాయి” అంటూ నా నోట్లో కొన్ని పోసింది. చల్లగా తియ్యగా
ఉన్నాయి. ”తొందరగా వెళ్ళాలి. ఎండ పెరిగితే దిగలేరు” అన్నాడు సంజీవ్‌. టైమ్‌ చూస్తే ఎనిమిదిన్నర. మెట్లన్నీ దిగాలని దిగులు పడుతుంటే ”మేడం! వేరే దారిలో తీసుకెళతాను. ఎక్కువ మెట్లుండవు కానీ కొంచం పైకి ఎక్కి దిగాలి” అన్నాడు సంజీవ్‌.
వచ్చిన దారి కాకుండా కొత్త దారిలో దిగడం మొదలు పెట్టాం. వెనక నించి ఎండ చుర్రుమని కాలుతోంది. ఒక గుహ దగ్గర ఆగి ”ఇది ఎలుగుబంటి గుహ… లోపల ఉందేమో అన్నా” అంటూ కెవ్వుమన్నాడు యాదగిరి. ఉందేమో చూస్తానంటూ ప్రశాంతి గుహలో తలపెట్టింది… ”ఏం లేదు… యాదగిరి నువ్వనవసరంగా భయపడుతున్నావ్‌” అంది. వచ్చేటప్పుడు ప్రశాంతి కొన్న బిస్కట్‌లు తిని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడక మొదలు పెట్టాం. చిన్న చిన్న ఎత్తుల్ని ఎక్కేసాను. ఎక్కువ భాగం చదునుగానే వుంది. రకరకాల చెట్లు… రంగు రంగుల ఆకులు, తీగలు… దట్టమైన నల్లమల అడవి గర్భంలో నడుస్తున్నాం. మధ్యలో ఇంకో గుడి దగ్గర ఆగాం. అక్కడి నుంచి ఏకబిగిన దిగేశాం. మేం కొండ దిగుతున్నపుడు ఎదురుగా మరో కొండమీద మెట్లు కనిపించాయి. మనుష్యులు కన్పిస్తున్నారు. ఒక ఆకుపచ్చటి చీర కదిలినట్లు ఒక చెంచు మనిషి అంత ఎత్తు మీంచి పచ్చటి వెదురు బొంగుల్ని ఈడ్చుకుంటూ మెట్లు దిగుతూ కనిపించాడు ప్రశాంతికి. ”అమ్మూ! అటు చూడు… ఆ వ్యక్తి వెదురు బొంగుల్ని ఎంత వేగంగా ఆ మెట్ల మీంచి లాక్కొస్తున్నాడో … చూడు” అంటూ చూపించింది. ”ఎంత కష్టమో కదా! ఈ అడవిలో ఎక్కడా వెదురు కనబడలేదు. వెదురు కోసం చాలా ఎత్తు కెళ్ళాలేమో! మామూలుగా శ్రీశైలం నుంచి అటు ఆత్మకూరు కానీ, ఇటు హైదరాబాదు కానీ ప్రయాణిస్తే అద్భుతమైన వెదురు పొదలు కన్పిస్తాయి. అహోబిలం అడవుల్లో వెదురు లేదనుకున్నాను. పైన ఉంది కాబోలు” అన్నాను నేను. మన్ననూర్‌ దగ్గర టైగర్‌ రిజర్వ్‌ ఫారెష్టులో కూడా ఎక్కువగా వెదురు పొదలు కనిపిస్తాయి. దిగుతున్నంత సేపు అటు వేపు మెట్లమీద జారుతున్న వెదురును చూసాం.
తొమ్మిదిన్నరకి దిగువ అహోబిలం చేరిపోయాం. ఎండబాగా పెరిగిపోయింది. చెమటతో వొళ్ళంతా తడిసి పోయింది. కింద గుళ్ళోకి వెళ్ళాం. యాదగిరి గుట్టలో ఉన్నట్టు ఇక్కడ కూడా గర్భగుడి కొండ గుహలో ఉంటుంది. గుహలోపల చల్లగా ఉంటుంది. ప్రశాంతి కోసమే నేను అన్ని గుళ్ళల్లోకి వెళ్ళాను.
సంజీవ్‌కి ఐదు వందలిచ్చి ”ఈ పని చేస్తే చేసావ్‌ కానీ బాగా చదువుకో… చదువుకుంటే ఇంకా బాగా రాణిస్తావ్‌” అని చెప్పి దిగువ అహోబిలం వేపు బయలుదేరాం. మరో గంటలో ఆళ్ళగడ్డ వేపు బయలుదేరాం. ఆళ్ళగడ్డలో భోజనం చేసి హైదరాబాదు బయలు దేరేటప్పటికి రెండయింది. బైక్‌ ఉందంటూ నాగరాజు అహోబిలంలోనే ఉండిపోయాడు. మేమిద్దరం మండుతున్న ఎండలో నల్లమల కబుర్లు చెప్పుకుంటూ హైదరాబాదు బ

Wednesday, May 16, 2018

అమ్మ...అమెరికా


--కొండవీటి సత్యవతి
........................................
ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.
ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు.
నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి.వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు.
ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు,కొందరికి పొలాలు,ఆస్తులూ ఉన్నాయి.
ఎవ్వరూ చూసేవాళ్ళు లేక,పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు.విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు.
నేను వెళ్ళేటప్పటికి రఘురాం అనే ఒక ఎన్నారై అక్కడున్నాడు.
ఆయన తల్లి ఆశ్రమం లో ఉన్నారు.ఆరు నెలలకోసారి వస్తాడట ఆయన.
ఆయనతో మాట్లాడాలనిపించింది.ఆశ్రమం బయట ఉన్న గుట్టల వేపు నడుస్తూ వెళ్ళాం.
"మీ అమ్మ గారికి ఇప్పుడెలా ఉంది" అడిగాను.
"బాగానే ఉంది.వయసు మీదపడింది.ఓల్డేజ్ రిలేటెడ్ ప్రోబ్లంస్ అంతే." అన్నాడు.
"ఆమెకి హటాత్తుగా ఏమైనా అయితే ఎలా?"
"హోం వాళ్ళు చూసుకుంటారు.నాకు ఇంఫార్మ్ చేస్తారు.జూబిలీ హిల్స్ లో పెద్ద ఇల్లుంది ప్రోపర్టీస్ ఉన్నాయ్..హటాత్తుగా డాడి చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడుంచాం."
"అమెరికా తీసుకెళ్ళొచ్చుగా."
"ప్రయాణం చేయలేనంది"
"ఇక్కడ ఇల్లుంది,ఆస్తులున్నాయ్ కదా ఇంక అమెరికాలోనే ఎందుకుండడం.?"
రఘురాం చివ్వున తలెత్తి నా వేపు చూసాడు.
"ఇక్కడుండలేమండీ"
"ఎందుకుండలేరు?'
"నా వైఫ్,పిల్లలు రారు.అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం."
"ఏముందక్కడ?"
"ఏమి లేదో చెప్పండి."
"మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా"
"వస్తూ పోతూ ఉంటాగా"
"సారీ...నేనిలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి.నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా. ఎన్నో ఓల్డేజ్ హోంలు తిరుగుతుంటాను.ఎంతో మంది తల్లితండ్రులతో మాట్లాడుతుంటాను.వాళ్ళ అనుభవాలు,పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంటాయి.లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్ధిస్తుంటారు."
"మా అమ్మ కూడా అంతేనండి"
"అమ్మలందరూ అంతే రఘురాం గారూ. ఇక్కడ కూర్చుందామా .మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది" అన్నాను.
"తప్పకుండా,అమ్మ కూడా నిద్రపోతోంది" అన్నాడు రఘురాం.
అక్కడున్న ఓ బెంచీ మీద కూర్చున్నాం.
మా అమ్మ నాన్నలకి నేనొక్కడినే.పిజి చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను.పిజి అయిపోయింది,మంచి ఉద్యోగమొచ్చింది.పెళ్ళి చేసారు,పిల్లలు పుట్టుకొచ్చారు.విలాసవంతమైన జీవితం,వీకెండ్ పార్టీలు,ప్రయాణాలు.అప్పుడప్పుడూ ఇండియా రావడం,చుట్టాల్లా ఉండి వెళ్ళడం.నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసేవాళ్ళకి లోటులేదు.ఓ రాత్రి నాన్న హటాత్తుగా గుండె పోటుతో చనిపోయాడు.శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది.షాక్ లోకి వెళ్ళిపోయింది.నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు.
మూడు రోజుల తర్వాత నేనొస్తే వచ్చావా,నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు"అంది.నాకు ఏడుపు తన్నుకొస్తోంది.అమ్మ ఏడవడం లేదు.హాస్పిటల్ కి పోదామంటుంది.
అమ్మ చుట్టూ బంధువులున్నారు.అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు.
ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకుపడిపోయింది. నాన్న లేడని అర్ధమైంది.
అంతా ముగిసిపోయింది.అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను.రానంది.ఈ ఇంటితో, మీ నాన్నతో ఏభై ఏళ్ళ అనుబంధం నాది.ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ రానంది.
నా పరిస్థితి మీరూహించగలరనుకుంటాను.అమ్మకి నేనొక్కడినే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎన్నో రకాల మందులేసుకుంటుంది.నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా.ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను...
వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగొచ్చాను.మళ్ళీ వెళ్ళాను.మళ్ళీ వచ్చాను.
నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి.నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోయాయి.
అంత పెద్ద ఇంటిలో ఒక్కర్తీ ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు.
తన తోడుని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని.
నా జీవితమంతా అమ్మ పంచిన ప్రేమ,లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది.
ఓ రొజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను.
"నానీ తో స్కైప్ లో మాట్లాడొచ్చుగా డాడీ" అని మాత్రమే అన్నారు.
"నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను."
"వాట్...ఆ ముసలామె కోసం నీ కెరీర్ పాడుచేసుకుంటావా?"అంది నా భార్య.
"డాడీ...ఆ డర్టీ ఇండియాకి మేము రాం."ఇద్దరూ ఒకే సారి అరిచారు.
రోకీ నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా?
ముగ్గురూ బిత్తరపోయారు.
నేను మిమ్మళ్ని రమ్మని అడగడం లేదు.మీ చదువులు పాడవుతాయని నాకూ తెలుసు.మీరు ఇక్కడే ఉండండి.
నేను వెళతాను.
దాని మీద చాలా అర్గుమెంట్స్ జరిగాయి.
"ఇంత మంచి జీవితాన్నిచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావ్ ఏముంది డాడీ అక్కడ" అంది నా కూతురు
"అక్కడ మా అమ్ముంది. నా మీద ప్రాణాలన్ని పెట్టుకుని పెంచిన మా అమ్ముందమ్మా అక్కడ.
నన్ను కని పెంచిన నా కన్నతల్లిని వొంటరిగా వదిలేయలేనమ్మా"
అంటూ ఏడ్చాను.గుండెలవిసేలా ఏడ్చాను.
ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని,ఉద్యోగానికి రెజైన్ చేసీ ఇండియా వచ్చేసాను.
నేనొచ్చి ఐదేళ్ళయ్యింది.మా నాన్న మీద బెంగతో,అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది.
అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని,సంతోషాన్ని ఇచ్చాయి.
ఆ తర్వాత నా భార్యా పిల్లలూ కూడా వచ్చేసారు.
చాలా కాలం గా ఇలా ఓల్డేజ్ హోం లు తిరుగుతూ నా కధ చెబుతుంటాను.
అమెరికా కంటే అమ్మెంత గొప్పదో చెబుతుంటాను."
రఘురాం కళ్ళల్లో నీళ్ళు.
నన్ను వదిలేసి వడి వడిగా వాళ్ళమ్మ గది వైపు వెళ్ళిపోయాడు.
********************

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...