Sunday, October 24, 2010

వీరి నిబద్ధత, జీవనశైలి ఎంతో స్ఫూర్తిదాయకం

ఇటీవల కాలంలో నాకు, భూమికకు డైభ్భై, ఎనభైలు దాటిన వారితో అవ్యాజమైన ఆత్మీయ సంబంధం పెరుగుతోంది. వారందరికీ నేనంటేను, ముఖ్యంగా భూమిక అంటేను విపరీతమైన ప్రేమ. వారి జీవన శైలి, క్రమశిక్షణ, నిబద్ధతల నుండి నిత్యం ఎంతో నేర్చుకోవలసింది వుంటూనే వుంటుంది. వారి ఆచరణకు, కార్యకలాపాలకు వయస్సు అడ్డుపడుతున్న దాఖలాలు నాకెపుడూ కనబడలేదు.

చిల్లరిగె స్వరాజ్యలక్ష్మిగారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళి ఆవిడ జీవన శైలి చూసి నోటమాట రాలేదు నాకు. పడుకునే మంచానికి ఒక వైపు వంట, మరో వైపు రాసుకునే బల్ల. నడవడంలో ఇబ్బంది వుండడంవల్ల, ఒంటరిగా వుంటుండడంవల్ల ఆవిడ చేసుకున్న ఏర్పాటు అది. రాయాలనే ఆవిడ తపన, తనున్న స్థితి పట్ల ఎలాంటి విచారమూ వ్యక్తం చేయని ఆవిడపట్ల నాకెంత అభిమానం కలిగిందో చెప్పలేను.

కథల మాస్టారిని చూస్తే కూడా నాకు చాలా సంతోషంగా వుంటుంది. ఆయన ‘కథా నిలయం’లో వున్నంత కాలం క్రమం తప్పకుండా ‘భూమిక పత్రిక అందింది’. ‘ధన్యవాదాలు’ అని ఉత్తరం రాసేవారు. కధల సేకరణని యజ్ఞంలా నిర్వహించిన కారా మాస్టారు ఇంకా ఇంకా కథానిలయం అభివృద్ధి చేయాలని తపన పడుతూనే వున్నారు. ఆయనతో మాట్లాడటం ఓ అద్భుతానుభవంలా వుంటుంది.

అబ్బూరి ఛాయదేవిగారిని చూస్తుంటే నాకెపుడూ అబ్బురమే. ఆవిడ వయస్సును జయించారా అన్పిస్తుంది. ఎన్నెన్ని బాధ్యతలు నిర్వహిస్తారో ! సమావేశాలు, సభలు, పుస్తకాలకి ముందు మాటలు, అభినందనలు అబ్బో! ఆవిడ కార్యకలాపాల లిస్ట్‌ కొండపల్లి చాంతాడంత. సమయపాలన, స్వయం నిర్వహణ అంశాలలో ఆవిడ నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.

నాకెప్పటినుండో ఆత్మీయురాలు, నా పట్ల ఎంతో ప్రేమని కురిపించే శారదా శ్రీనివాసన్‌గారు. మొదటిసారి ఆవిడని చూసినపుడు నేను పొందిన అనుభవం వర్ణించడం నా తరం కాదు. ఎందుకంటే చిన్నప్పుడు రేడియోలో ఆవిడ నాటకాలు విని ఆవిడని ఎపుడైనా చూడగలనా అని కలలు కన్నదాన్ని. ఆవిడని చూడడమే కాదు ఆవిడ ప్రేమని కూడా పొందడం నాకు గొప్ప అనుభవం. ఆవిడ లైబ్రరీలోంచి తీసుకుని ఎన్నో పుస్తకాలు చదివాను. ఈ రోజుకీ ఆవిడ గొంతులోంచి నా మీద అభిమానం కురుస్తూనే వుంది.

చెన్నైలో వుండే వి.ఎ.కె. రంగారావుగారి ఉత్తరాలు ఎంతో కళాత్మకంగా వుంటాయి. భూమిక గురించి ఆయన తరుచూ రాస్తూంటారు. కవరు మీద చక్కటి బొమ్మలు అతికించి కళాత్మకమైన తీరులో పంపుతారు. మొన్నటికి మొన్న భూమికకు విరాళం పంపిస్తూ పోస్ట్‌ చేసిన కవరు మీద చిరునవ్వులు చిలికిస్తున్న ‘మొనాలిసా’ బొమ్మని ఏదో పుస్తకంలోది కత్తిరించి కవరు మీద అతికించారు. ఆయన రాసే ఉత్తరం ఎంత ఉత్తేజాన్నిస్తుందో కళాత్మకమైన కవర్లు అంతగానూ స్ఫూర్తిదాయకంగా వుంటాయి.

సత్తిరాజు రాజ్యలక్ష్మిగారు. ఎనభై ఆరు సంవత్సరాల వయస్సులో ఆవిడ ఒంటరిగా వుంటూ కూడా నా చుట్టూ బోలెడు మంది వున్నారు, ఎంతో మంది వచ్చిపోతూ వుంటారు, నాకు ఒంటరితనం అన్పించదు అంటారు. పూలతో కబుర్లాడుతూ నేనో కవిత రాస్తే దానికి ఆవిడ స్పందించిన తీరు అద్భుతం. తన బాల్యానుభవాలతో సహా ఎన్నింటినో గుర్తుకు తెచ్చుకుంటూ ఆవిడ రాసిన ప్రతిస్పందన ఈ సంచికలోనే వుంది. నిజానికి అలా స్పందించేవాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు.

వేములపల్లి సత్యవతి గారు సమాజానికి స్ఫూర్తినందించేవారి గురించి రాయాలని తపన పడుతుంటారు. వేళ్ళు సహకరించక పోయినా సరే ఆవిడ రాస్తూనే వుంటారు. ఇటీవల సూర్యదేవర రాజ్యలక్ష్మిగారి మీద పెద్ద వ్యాసం రాసి, వద్దంటే కూడా వినకుండా స్వయంగా ఆఫీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. ఆవిడ కుడి చేతి బొటన వేలుకి బాండ్‌ఎయిడ్‌ వేసే వుంది. అంత పెద్ద వయస్సులో ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేసి వచ్చిన ఆవిడని చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. వేములపల్లి సత్యవతిగారి నిబద్ధత అంత గొప్పగా వుంటుంది.

పి. సత్యవతి గారి గురించి రాయాలంటే చాలానే రాయాలి. ఆవిడ రిటైర్‌ అయ్యాక కంప్యూటర్‌ నేర్చుకుని, ఇంటర్‌నెట్‌ వాడుతూ, తన బ్లాగుని కూడా నిర్వహిస్తున్నారు. తెలుగులో చక్కగా తనే టైప్‌ చేసి తన కాలమ్‌ పంపుతారు. అలనాటి రచయిత్రులు గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా తన కాలమ్‌లో రాస్తున్నారు. ఈ నిబద్ధత అందరిలోను వుంటే స్త్రీవాదం ఇంకా పరిపుష్టమౌతుందికదా.

ఆర్‌. శాంతసుందరిగారి పనితీరు, జీవనశైలి ఎంతో భిన్నంగా వుంటాయి. హిందీ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి హిందీలోకి ఆవిడ చేసే అనువాదాలు అసంఖ్యాకంగా, ప్రణాళికాబద్థ్దంగా నడుస్తూ వుంటాయి. ఇంట్లో తన అనువాద పనిని ఒక క్రమశిక్షణతో, నియమిత పనిగంటలతో ఖచ్చితంగా చేస్తారు. ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్రని ఆవిడే రాసారా అన్నంత అద్భుతంగా అనువాదం చేసారు.

ఇలా రాసుకుంటూ పోతుంటే ఈ లిస్ట్‌ ఈస్ట్‌ గోదావరిదాకా సాగుతుంది. సుజాతామూర్తిగారి ఆత్మీయత, వి. హనుమంతరావుగారి ఆదరణని మర్చిపోలేను. సింగమనేని నారాయణగారు, కేతు విశ్వనాథరెడ్డిగారు, కొండపల్లి కోటేశ్వరమ్మ, మల్లాది సుబ్బమ్మగారు, చేకూరి రామారావు, సి.నారాయణరెడ్డిగార్ల సాహిత్య ప్రయాణం అపురూపమనిపిస్తుంది. మల్లు స్వరాజ్యంగారి పోరాటపటిమ గురించి ఇదే సంచికలో సమగ్రంగా వుంది.

వీరందరి గురించి ఎందుకు రాస్తున్నట్టు అని పాఠకులకు అనిపించవచ్చు. ఎందుకు రాస్తున్నానో కొంతవరకు అర్ధమయ్యే వుండాలి. ఇంత వయస్సు మీద పడినా, శరీరం సహకరించకపోయినా సరే వీరు కనపరుస్తున్న నిబద్ధత, స్పందన, క్రమశిక్షణలకి ప్రణమిల్లాలనే నేను రాశాను. వీరిలో కనిపిస్తున్న స్పందన, చురుకుతనం యువతలో గాని, మధ్య వయస్కులైన మేధావుల్లోగానీ ఎందుకు కన్పించడం లేదనే వేదనే నా చేత రాయించింది. వీరి నుండి ఎంతో నేర్చుకోవలసింది వుంది. సామాజిక సమస్యలపట్ల బండబారిపోతున్న నేటి తరం వీరినుండి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతో వుంది. నా మీద, భూమిక మీద అపారమైన అభిమానం, ఆత్మీయత కురిపిస్తున్న ఈ అపూర్వ సీనియర్‌ సిటిజన్స్‌కి, మేధావులకి, రచయితలకి ‘ సీనియర్‌ సిటిజన్స్‌డే ‘ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

1 comment:

Rao S Lakkaraju said...

మీరు వ్యాసం పొరపాటున పోస్ట్ లో రెండు సార్లు వచ్చింది. సరిచెయ్యండి. తరువాత ఈ వ్యాఖ్యను డిలీట్ చెయ్యండి.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...