Thursday, April 6, 2023

నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే…

మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్‌. అయినా సరే వెళ్ళాలి. నల్లమల కళ్ళముందు కొచ్చింది. రా… రా… అని పిలవడం మొదలుపెట్టింది. ఆకురాలు కాలం… అడివంతా నగ్నంగా, నిజరూపంతో సాక్షాత్కరించే కాలం. పచ్చదనం మచ్చుకైనా కనబడదు. అయినా సరే వెళదామని నిర్ణయించుకున్నాను.
ప్రశాంతితో అన్నాను ఓ రెండు రోజులు ఎటైనా పోదామా? అని. ‘సై’ అంది. కర్నూల్‌, మహానంది, అహోబిలం… కర్నూల్‌లో మహా ఎండలు. ఫర్వాలేదు… పోదామ్‌… అనుకున్నాం. ఆఫీసులో కొన్ని పనులున్నాయ్‌. పన్నెండింటికల్లా పూర్తయిపోయాయి. మిట్ట మధ్యాహ్నం వేళ కారులో కర్నూల్‌ బయలుదేరాం. ప్రశాంతి చాలాసార్లు కర్నూల్‌ వెళ్ళింది కానీ, మహానంది, అహోబిలం చూళ్ళేదట. కర్నూల్‌లో ఆగకుండా మహానంది వెళ్ళిపోయాం. అప్పటిదాకా మండిన సూర్యుడు మహానంది కొండల్లోకి జారిపోయాడు. ఆ కొండల్లోంచి 365 రోజులూ జాలువారే నీటి చెలమల్లోకి సూర్యుడు పారిపొయ్యాడన్నమాట వేడి భరించలేక.
మేం మహానందిలో దిగేసరికి కొంచం చీకటి పడుతోంది. పెద్దగా జనం లేరు. ఉన్నవాళ్ళు కొలనులో ఈతలు కొడుతూ కేరింతలు కొడుతున్నారు. మహానందిలో వున్న గొప్ప ఆకర్షణ నిత్యం పారే నీటిబుగ్గ… ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. గుడి ఆవరణలో వున్న తటాకంలో ఎప్పుడూ ఒకే స్థాయిలో మిలమిలా మెరిసే స్వచ్ఛమైన నీళ్ళు… తటాకం అడుగు కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. నడుములోతు మాత్రమే నీటిలోతు ఉంటుంది. ఎప్పుడూ అది పెరగదు… తరగదు. అందులోంచి గుడి బయటవున్న రెండు తటాకాల్లోకి నీళ్ళు మహాఫోర్స్‌గా వస్తుంటాయి. అక్కడి నుండి కాలువద్వారా నీళ్ళు పొలాల్లోకి పారుతుంటాయి. కొన్ని వందల ఎకరాలకు ఈ నీరు పారుతుంది. మహానందిలో పెంచే అరటి తోటలన్నీ ఈ నీటితోనే పెరుగుతాయి.
మహానంది గుడిమీద నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండదు. ప్రశాంతి గుడిలోకి వెళదామంది. అక్కడ గుడి వెనక ఓ పెద్ద నాగమల్లి చెట్టుంది. ఆ చెట్టు చుట్టూ పాముల బొమ్మలుంటాయి. నాకు ఈ చెట్టు కూడా ఆకర్షణే. ఇద్దరం కాసేపు కొలను నీళ్ళల్లో నిలబడ్డాం. మొత్తం దిగి ఈత కొట్టాలనిపించింది. కానీ అడవి దాటి అహోబిలం చేరాలి. మహానందిలో మాకు సహకరించిన శ్రీనుకి వీడ్కోలు చెప్పి అహోబిలం వేపు సాగిపోయాం. మా కోసం అహోబిలంలో ఎదురు చూస్తున్న నాగరాజుకి వచ్చేస్తున్నామని కాల్‌ చేసి చెప్పాం. చీకటి పడిపోయింది. అమావాస్యకి ముందు రోజులు… చిమ్మచీకటిగా వుండి నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశాంతి, నేను కబుర్లలో పడ్డాం. ప్రశాంతి దెయ్యాల కబుర్లు మొదలెట్టింది. కొరివి దెయ్యాలగురించి చెబుతుంటే డ్రైవర్‌ యాదగిరి జడుసుకున్నాడు. ”మేడం! నాకు దయ్యాలంటే చాలా భయం. చెప్పకండి” అంటూ వొణికాడు. మేం విరగబడి నవ్వుకున్నాం. ఎనిమిదిన్నరకి దిగువ అహోబిలం చేరుకున్నాం. నాగరాజు మా కోసం రూమ్‌ బుక్‌ చేసాడు. రోజంతా ప్రయాణం… స్నానం చేసి వేడి వేడి చపాతీలు తిని నిద్రపోయాం. ఆరింటికి ఎగువ అహోబిలం వెళదామని తయారుగా వుండమని, యాదగిరికి చెప్పాం.
మర్నాడు నాలుగింటికే మెలకువ వచ్చేసింది. తయారైపోయి రూమ్‌ బయటకి వచ్చేసరికి ఎదురుగా నెలపొడుపునాటి నెలవంక… ఇదేంటి ఇప్పుడు నెలవంక అనుకుంటూ ఆశ్చర్యపోయి ”మన స్నేహం మొదలైంది నెలపొడుపునాడే కదా! మనల్ని పలకరిద్దామని వచ్చినట్టుంది” అన్నాను. ఇంకా తెల్లవారలేదు. దిగువ గుళ్ళోంచి సుప్రభాత హడావుడి వినిపిస్తోంది. నెలవంకని చూస్తూ… సంతోషపడుతూ కారెక్కగానే ఎగువ అహోబిలంవైపు కారు బయలుదేరింది. పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి. ఆకులు రాలిపోవడంవల్ల అడవి పల్చగా కనబడుతోంది. ఆరింటికల్లా పైకి వెళ్లిపోయాం. నేను చాలాసార్లు అహోబిలం వెళ్ళాను. రకరకాల గ్రూప్స్‌తో వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా చూసిన ప్రతిసారీ కొత్తగానే వుంటుంది. తొలిసారి చూస్తున్న ప్రశాంతి ఆనందాశ్చర్యాలకి లోనైంది. మెట్లెక్కుతున్నప్పుడు చేతికందుతున్న ఆ కొండచరియ, ఆ అమరిక ప్రశాంతిని అబ్బుర పరిచాయి.
అహోబిలం వచ్చినప్పుడల్లా గుడి వెనకున్న అడవి మొత్తం తిరగాలని అన్పించేది. ఎత్తైన కొండలతో నిండివుండే నల్లమల అడివి మొత్తం తిరగాలని. చివరి శిఖరం వరకు ఎక్కాలని కలలు కంటుండేదాన్ని. కానీ ఎప్పుడూ ధైర్యం చెయ్యలేదు. దానికి కారణం ఆ కొండలెక్కడం కష్టమని, ఆ అడవిలో తిరగడం ప్రమాదకరమని చాలామంది భయపెట్టడమే. మామాలుగానే ఎత్తులెక్కడం నాకు కష్టం. జ్వాలా నరసింహుని కొండ ఎక్కడం అసాధ్యం అని తేల్చేయడం వల్ల… అమ్మో! నేను ఎక్కలేనులే అని నిర్ణయించేసుకుని అడవిలో సమీపంలో వుండే జలపాతం వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసే వాళ్ళం. ఇంతకు ముందు నేను వెళ్ళిన బృందాల్లో ఎవ్వరూ సాహసం చెయ్యలేదు. కానీ… ఈసారి ప్రయత్నం చెయ్యాలి. నన్ను గెలిపించడానికి నాతో ప్రశాంతి వుంది. జ్వాలా నరశింహ కొండ ఎక్కడం నాకు గొప్ప విజయమే. ”అమ్మూ! నేనున్నా కదా! ప్రయత్నం చేద్దాం… జాయేంగే… జీతేంగే…” అంటూ ఉత్సాహపరిచింది.
ఆ అడవి గర్భంలోకి గైడ్‌ లేకుండా వెళ్ళడం అసాధ్యం. ఎక్కడ దారి తప్పుతామో, ఎటు వెళ్ళిపోతామో అంతు చిక్కదు. గైడ్‌ని చూడమని నాగరాజుకు అంతకు ముందే చెప్పాం. మేం కొండపైకి వచ్చేసరికి గైడ్‌ తయారుగా వున్నాడు. చిన్న పిల్లాడు… నేనే గైడ్‌ అన్నాడు. ”నువ్వా!” అని మేము ఆశ్చర్యపోతే… ”నేనే మేడం… చాలా రోజుల్నించి గైడ్‌గా చేస్తున్నా… అడవిలో నాకంతా తెలుసు” అన్నాడు. ఆ పిల్లాడి పేరు సంజీవ్‌, వాళ్ళన్న ముందుకొచ్చి అన్నాడు. ”మేడం… వాడికి అంతా తెలుసు. మీకు బాగా చూపిస్తాడు” అనడంతో మేం సంజీవ్‌ వెంట అడవిలోకి బయలుదేరాం. దారిలో ఊత కర్రలు తీసుకున్నాడు.
మూడో కాలుని టిక్‌ టిక్‌ మనిపిస్తూ నడక మొదలుపెట్టాం. మొదటగా దర్శనమిచ్చే జలపాతం కనబడలేదు. ”వర్షాలు లేవు మేడం… జలపాతం ఇంకిపోయింది” అన్నాడు సంజీవ్‌.
నడక మొదలైంది. బండలమీద వొడుపుగా నడుస్తున్నాం. ఇంతకు ముందొచ్చినపుడు, జలపాతం సమీపంలో కూర్చుని మెడిటేషన్‌ చేస్తూ నేను ఫోటోలు తీయించుకున్న ప్రదేశం దగ్గర కొచ్చాం. చాలా సన్నగా నీళ్ళు కారుతున్నాయి. అక్కడ మళ్ళీ ఫోటోలు తీసుకున్నాం. అక్కడ ఓ చెట్టుకి పెద్ద తొర్ర ఏర్పడి వుంది. ప్రశాంతి అందులోకి దూరి ఫోటో తీసుకోవాలనుకుంది. కానీ సంజీవ్‌ వారించాడు తొర్రలో ఏమైనా జంతువులు, పాములు ఉండొచ్చు, లోపలికి వెళ్ళొద్దన్నాడు.
పెద్ద పెద్ద బండరాళ్ళ మీద నడుస్తున్నాం. సూర్యుడు ఇంకా అడవిలో అడుగు పెట్టలేదు. అయినా విపరీతంగా చెమటలు కారుతున్నాయి. చెట్లు చాలా వరకు ఆకులు రాలిపోయి, ఎండిపోయినట్లు కనబడుతున్నా చాలా చెట్లు పచ్చగానే వున్నాయి. ఆకురాలిన చెట్లకి సన్నటి కిసలయాలు తొంగి చూస్తున్నాయి. కొన్ని చెట్లకి ఎర్రటి ఆకులు, ముదురు మెరూన్‌ కలర్‌లో ఆకులు, పచ్చటి చిగుర్లు… అడివంతా రంగుల మయంగా వుంది. ఎన్నో రకాల అడవి పూలు… చాలా విలక్షణమైన పూలగుత్తులు. ఆ మత్తులో నడుస్తున్న మమ్మల్ని ‘పాము, పాము, ఆగండి’ అంటూ హెచ్చరించాడు సంజీవ్‌. అందరం ఎక్కడివాళ్ళమక్కడే ఆగిపోయాం. కర్రతో కొట్టగానే పాము ఓ బండ కిందికి జర జరా పాక్కుంటూ వెళ్ళిపోయింది. అలాంటి బండల మీదే మేము నడుస్తున్నాం. ఏ బండ కింద ఏ పాముందో! ”నాకు పాములంటే చాలా భయం” ప్రకటించాడు యాదగిరి. కాసేపు పాముల మీద చర్చ నడిచింది.
ఇటీవల తమ పొలంలో కన్పించిన పాముల గురించి చెప్పింది ప్రశాంతి. బండల మీద కాళ్ళు వేస్తుంటే జారుతుందనే భయంతో పాముల భయం కూడా తోడైంది. మేం జాగ్రత్తగా నేలమీద, బండలమీద దృష్టి పెట్టి నడుస్తున్నపుడు మా ఎదురుగా హఠాత్తుగా సీతాకోక చిలుకల గుంపు కనబడింది. అన్నీ ఒకే రంగులో
ఉన్నాయి. కొన్ని నేల మీద వాలి, మరికొన్ని వాటి చుట్టూ ఎగురుతున్నాయి. నేను వాటి దగ్గరగా వెళ్ళాను. ”ఇక్కడ సీతాకోకచిలుకలు చాలా వుంటాయి. నాకు రోజూ కన్పిస్తాయి” అన్నాడు సంజీవ్‌. వాటి దగ్గరకెళ్ళగానే అన్నీ ఒక్కసారి లేచాయి. పట్టుకుందామని ప్రయత్నం చేస్తే ఒక్కటీ దొరకలేదు. వాటిని పట్టుకునే ప్రయత్నాన్ని ప్రశాంతి వీడియో తీసింది. అన్ని సీతాకోక చిలుకలు ఎగురుతూ, నేలమీద వాలుతూ వాటి హడావుడిలో అవి మునిగినప్పుడు మేము ముందుకు సాగాం.
అడవి మధ్యలో కట్టిన ఒక బ్రిడ్జి మీదికి వచ్చాం. ”అదిగో చూడండి ఉగ్రస్తంభం… అక్కడే నరశింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అక్కడి వరకు వెళ్ళడం కష్టం. జ్వాలా నరశింహ కొండ వరకు వెళ్ళొచ్చు. ఆ కొండ ఎక్కడానికి 600 మెట్లున్నాయి” ఉన్నాడు సంజీవ్‌. ”ఆరువందల మెట్లా? అమ్మో! నేను రాను” అనేసాను. అనడమే కాదు ఒకచోట కూర్చుండి పోయాను. ”అమ్మూ! ఇటురా!” అని పిలిచింది ప్రశాంతి. నేను లేచి వెళ్ళాను. అప్పటికి కొంచం ఎండ పెరుగుతోంది. ఇద్దరం బ్రిడ్జి మధ్య వరకూ నడుచుకుంటూ వెళ్ళాం. ”అదిగో చూడు! ఉగ్రస్తంభం అని సంజీవ్‌ చెప్పిన కొండ. భలే వుంది… మెల్లగా వెళదాం… నేనున్నాగా అమ్మూ…” అంది. ”నేను రాను… అన్ని మెట్లెక్కి అంత ఎత్తుకు రావడం నావల్ల కాదు” అంటూ భీష్మించాను. ఉగ్ర స్తంభకొండని ఫోకస్‌ చేసి బోలెడు ఫోటోలు దిగాం. బ్రిడ్జి మీద నుంచి నల్లమల మహాద్భుతంగా కనిపిస్తోంది. ఎత్తైన కొండలు విభిన్న రంగుల ఆకులతో చెట్లు… కొన్ని చెట్లకి ఎర్రటి తురాయి పువ్వులాంటి ఆకులు… పండుటాకుల్లోంచి తొంగి చూస్తున్న లేత చిగురుటాకులు. అడవి పచ్చగా, వొత్తుగా వున్నపుడు పచ్చదనం మాత్రమే కనబడుతుంది. ఆకురాలు కాలంలో అడవి అందం భిన్న వర్ణాల మేళవింపులో కళ్ళకు విందు చేస్తుంది. ఈ సౌందర్యం చూడాలనే కదా ఎండల్లో నల్లమల ట్రిప్‌ వేసాం.
బ్రిడ్జి మీద నుంచి చుట్టూ పరుచుకున్న అపార సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నవేళ ప్రశాంతి నా భుజం చుట్టూ చెయ్యేసి ”అమ్మూ! పద వెళదాం. నువ్వు ఎక్కగలవు. ఆయాసమొస్తే ఆగుదాం… కూర్చుందాం. నేనున్నాగా” అంటూ నన్ను మెట్ల వేపు నడిపించింది. ఆ మెట్ల వేపు, ఆ ఎత్తు వేపు చూడగానే నా గుండె ఝల్లుమంది. అప్పటికే గుండె దడదడ కొట్టుకుంటోంది. మైసూర్‌లోని శ్రావణ బెళగొల కొండ ఎక్కినప్పటి అనుభవం పదే పదే గుర్తుకొస్తోంది. ఆ రోజు సగం దారిలో స్పృహతప్పి పడిపోయిన దృశ్యం కళ్ళముందు కదలాడుతోంది. బహుశా అదే నాలో ఒక ఫోబియాలాగా తయారైందనుకుంటాను. ప్రశాంతి నా చెయ్యి పట్టుకునే వుంది. నేను మెల్లగా మెట్లెక్కడం మొదలు పెట్టాను. యాదగిరి, నాగరాజు, సంజీవ్‌లు మా ముందు నడుస్తూ ”మేడం! వచ్చేసాం… ఇంకొంచం దూరమే” అంటూ ఉత్సాహపరుస్తున్నారు.
వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది. చేతిలో కర్ర చెమటకి జారుతోంది. పది మెట్లెక్కడం… ఆయాసంతో కూర్చుండి పోవడం… అలా కూర్చున్నప్పుడు, చుట్టూ పరుచుకున్న అడవి సౌందర్యం చాలా సేద తీర్చేది. జ్వాలా వరకు నేను వెళ్ళగలనా అనుకుంటూ చాలాసార్లు ”ఇంక నేను రాను… మీరు వెళ్ళి రండి… ఇక్కడ కూర్చుంటాలే” అనేదాన్ని. అడవి మధ్యలో ఒక్కదాన్ని కూర్చోడానికి సిద్ధమయ్యాను కానీ మెట్లెక్కాలంటే… ”అమ్మూ! నువ్వు రాగలవు… నీకేమీ కాదు. అసలు నువ్వు భయపడడమేమిటి?” అంటుంది ప్రశాంతి. భయమేనా? కాదు భయం కాదు. నా గుండె పనితీరు మీద నాకున్న అపనమ్మకం. ఆయాసంతో గుండె ఆగిపోతుందనే సంశయం… నాది నార్మల్‌ గుండె కాదు కదా! మాటేయించుకున్న ఓటి గుండె… చాలా సంవత్సరాలు జరిగిపోయినా… నాలో ఆ ఫీలింగ్‌ పోలేదు. అందుకే ఎత్తులకి ఎక్కాలంటే… గుండె ఏమవుతుందో అనే బెదురు అలాగే
ఉండిపోయింది. అలా అని నాకు చావంటే భయం లేదు. కానీ అప్పుడే ఈ సౌందర్యాన్నంతా అర్థాంతరంగా వదిలేసి పోవాలనీ లేదు. ఈ భయాన్ని మోస్తూనే నా సాహసాలన్నీ చేస్తుంటాను.
ఆగుతూ, కూర్చుంటూ చుట్టూ పరుచుకున్న అడవి అందాన్ని చూస్తూ నాలుగొందల మెట్లు ఎక్కేసాను. మళ్ళీ ఆగిపోయాను. కింద లోయ, ఎదురుగా ఎత్తైన కొండ… ఆ కొండమీంచి లోయలోకి రివ్వుమంటూ ఎగిరొచ్చింది ఓ పసుప్పచ్చటి పిట్ట. ”అరే! ఎంత పచ్చగా ఉందో ఈ పిట్ట” అని ఆశ్చర్యపోతుంటే దాని తోడు పిట్ట కూడా ఎగిరొచ్చి నా ఎదురుగా వున్న చెట్టుమీద వాలింది. ముందు ఎగిరిన పిట్ట కూడా వచ్చి చేరింది. వాటి సోయగాన్ని చూస్తూ చాలాసేపు నా అలసటని మర్చిపోయాను. ”అమ్మూ! పద ఎండ పెరుగుతోంది. దిగడం కష్టమౌతుంది” అంది ప్రశాంతి. ఎక్కడం మొదలు పెట్టాం. ఉగ్రస్తంభం ఎదురుగా కనిపిస్తోంది. కుడిచేతివైపున ఓ ఎత్తైన కొండ… ఆ కొండ వాలుల్లో బహుశా తేనెపట్టులుండి వుంటాయి. చిగురు శివాజీ రాసిన ఆర్టికల్‌ గుర్తొచ్చింది. 2002 లో అనుకుంటాను ఆయన నల్లమల అడవుల్లో చెంచులు తేనె తీసే విధానం గురించి ఓ అద్భుతమైన వ్యాసం రాసారు. ఆ వ్యాసాన్ని తీసి మళ్ళీ భూమికలో వెయ్యాలి అనుకుంటూ మెల్లగా మెట్లెక్కుతున్నాను. ప్రశాంతి నా భుజం చుట్టూ చెయ్యేసి నాతో పాటే నడుస్తోంది. ”అమ్మూ! అదిగో జ్వాలా నరశింహ గుడి, వచ్చేసాం” అంది. ఆ వెంటనే కొండమీంచి జరజరా బండలు దొర్లుతూ లోయలో పడుతున్న శబ్దం. ”ఏంటవి? బండలు దొర్లి పడుతున్నాయ్‌” అంటే… ”అంతే మేడం… అలా పడుతుంటాయ్‌… అలా కిందికి చూడండి… ఆ పెద్ద బండ పైనుంచి పడి పెద్ద చెట్టుని మొత్తం విరక్కొట్టేసింది… ఆ చెట్టు మొదలు చూడండి ఎంత లావుగా వుందో” సంజీవ్‌ చెప్పాడు. ”మేడం! వచ్చేసాం… మీరు మెట్లన్నీ ఎక్కేసారు” అంటూ అరిచాడు యాదగిరి. నాలో గొప్ప సంతోషం ఉప్పొంగింది. కర్రను కింద పడేసి ఏదో ఎవరెస్ట్‌ ఎక్కినంత ఉద్వేగంతో ”ఐ డిడ్‌ ఇట్‌…. ఐ యామ్‌ సో హ్యాపీ” అంటూ ప్రశాంతిని వాటేసుకుని ”నువ్వు నాచేత గొప్ప సాహసం చేయించావే. ఎన్నో సంవత్సరాల కలని సాకారం చేయించావ్‌… లవ్‌ యూ బంగారం…” అంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టాను. ఇద్దరం వొకరి నొకరం పట్టుకుని డాన్స్‌ చేసాం. ఆ క్షణాల్లో నాలో వెల్లువెత్తిన ఉత్సాహం, నామీద నాకు గొప్ప నమ్మకం… నేను మాటల్లోకి అనువదించలేను. ఎంతో కాలంగా నాలో గూడు కట్టి ఉన్న (నేను ఎత్తులెక్కలేను అనే భయం) భయం పటాపంచలైన సందర్భం. ఈ కష్ట సాధ్యమైన ప్రయాణానికి ఓ అర్థం దొరికిన సందర్భమన్నమాట.
మెట్లన్నీ అయిపోయాక చదును నేలమీదకి వచ్చాం. కుడి చేతి వేపున ఉగ్రస్థంభం… నిట్టనిలువుగా వుంది. అక్కడికి వెళ్ళడానికి మెట్లుగానీ, దారి కానీ లేదట… కానీ చాలా మంది బండలమీద, అడవిలో నడుచుకుంటూ పైవరకు వెళతారట. మేం కొండ వాలు మీంచి జాగ్రత్తగా నడుస్తున్నాం. బండలు జారుతున్న శబ్దం… చూస్తే గుడి పక్కన కాపురముంటున్న చెంచు కుటుంబం చుట్టుపక్కల శుభ్రం చేస్తూ బండల్ని లోయలోకి తోస్తున్నారు. ”ఈ గుడిని చూసుకుంటూ ఓ చెంచు కుటుంబం ఇక్కడే కాపురముంటోంది. వాళ్ళు అప్పుడప్పుడూ కొండ దిగుతుంటారు తమ అవసరాల కోసం” సంజీవ్‌ చెప్పాడు. మేం నడుస్తున్న కొండ కింద చల్లగా, తేమగా వుంది. కొండల్లోంచి చిరుధారల్లో నీళ్ళు పడుతున్నాయి. వర్షాకాలమైతే పెద్ద ధారతో జలపాతం జాలువారుతుందట. నేను ఆ ధార కింద తలపెట్టి ముఖం కడుక్కున్నాను. చల్లటి నీళ్ళు తగలగానే అలసట అంతా మాయమైంది. గుడి వేపు వెళ్ళాం. జ్వాలా నరశింహస్వామి ఆలయం అని రాసి వుంది. చిన్న గుడి. నేను గుడి వెనక చెంచుల ఇంటి వేపు వెళ్ళాను. చిన్న గుడిశె లాంటి ఇల్లు. ఊయల వేలాడుతోంది. ఇంట్లో మహిళలెవరూ కనబడలేదు. ఇద్దరు మగ వాళ్ళు ఆవరణలో వున్న చిన్న చిన్న రాళ్ళని తొలగిస్తూ లోయలోకి తోస్తూ కనబడ్డారు. ఆ ఇంట్లో ఉండే చెంచు వ్యక్తి పేరు కిషన్‌ అని తర్వాత ప్రశాంతి చెప్పింది. తన పనిలో చాలా బిజీగా ఉన్నాడతను. గుడి మెట్లు దిగుతుంటే… ”మేడం! పూజారి గారొస్తున్నారు వెనక్కి రండి” అంటూ సంజీవ్‌ పిలిచాడు. దూరంగా మెట్లకివతల పూజారి కనబడ్డాడు. ఆయన రోజూ రాడట. ఎవరైనా పైకి వస్తే చూసి వస్తాడట. ”నేను రానులే… ఆ మేడం ఉందిగా” అంటూ నేను నీటిధారవేపు వెళ్ళాను. ఓ పది నిమిషాల తర్వాత అందరూ గుళ్ళోంచి బయట కొచ్చారు. ”మేడం ఈ గుహలో నీటి గుండం చూడండి… నరశింహస్వామి హిరణ్య కశిపుడిని చంపాకా ఈ నీళ్ళల్లో చేతులు కడుక్కున్నారు. చూడండి నీళ్ళు ఎర్రగా ఉంటాయి” అన్నాడు సంజీవ్‌. కొండగుహలో స్వచ్ఛంగా వున్న నీళ్ళు కనిపించాయి. దానికి ఇనుప జాలీలతో చేసిన చిన్న తలుపులు పెట్టి కట్టి వుంచారు. ”చాలా లోతుంటుంది. 365 రోజులూ ఆ నీళ్ళు అలాగే ఉంటాయి. తగ్గవు, పెరగవు… మహానందిలో నీళ్ళలాగానే” అన్నాడు నాగరాజు. ప్రశాంతి లోపలికెళ్ళి దోసిలి నిండా నీళ్ళు తెచ్చి తాగుతూ భలే తియ్యగా
ఉన్నాయి” అంటూ నా నోట్లో కొన్ని పోసింది. చల్లగా తియ్యగా
ఉన్నాయి. ”తొందరగా వెళ్ళాలి. ఎండ పెరిగితే దిగలేరు” అన్నాడు సంజీవ్‌. టైమ్‌ చూస్తే ఎనిమిదిన్నర. మెట్లన్నీ దిగాలని దిగులు పడుతుంటే ”మేడం! వేరే దారిలో తీసుకెళతాను. ఎక్కువ మెట్లుండవు కానీ కొంచం పైకి ఎక్కి దిగాలి” అన్నాడు సంజీవ్‌.
వచ్చిన దారి కాకుండా కొత్త దారిలో దిగడం మొదలు పెట్టాం. వెనక నించి ఎండ చుర్రుమని కాలుతోంది. ఒక గుహ దగ్గర ఆగి ”ఇది ఎలుగుబంటి గుహ… లోపల ఉందేమో అన్నా” అంటూ కెవ్వుమన్నాడు యాదగిరి. ఉందేమో చూస్తానంటూ ప్రశాంతి గుహలో తలపెట్టింది… ”ఏం లేదు… యాదగిరి నువ్వనవసరంగా భయపడుతున్నావ్‌” అంది. వచ్చేటప్పుడు ప్రశాంతి కొన్న బిస్కట్‌లు తిని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడక మొదలు పెట్టాం. చిన్న చిన్న ఎత్తుల్ని ఎక్కేసాను. ఎక్కువ భాగం చదునుగానే వుంది. రకరకాల చెట్లు… రంగు రంగుల ఆకులు, తీగలు… దట్టమైన నల్లమల అడవి గర్భంలో నడుస్తున్నాం. మధ్యలో ఇంకో గుడి దగ్గర ఆగాం. అక్కడి నుంచి ఏకబిగిన దిగేశాం. మేం కొండ దిగుతున్నపుడు ఎదురుగా మరో కొండమీద మెట్లు కనిపించాయి. మనుష్యులు కన్పిస్తున్నారు. ఒక ఆకుపచ్చటి చీర కదిలినట్లు ఒక చెంచు మనిషి అంత ఎత్తు మీంచి పచ్చటి వెదురు బొంగుల్ని ఈడ్చుకుంటూ మెట్లు దిగుతూ కనిపించాడు ప్రశాంతికి. ”అమ్మూ! అటు చూడు… ఆ వ్యక్తి వెదురు బొంగుల్ని ఎంత వేగంగా ఆ మెట్ల మీంచి లాక్కొస్తున్నాడో … చూడు” అంటూ చూపించింది. ”ఎంత కష్టమో కదా! ఈ అడవిలో ఎక్కడా వెదురు కనబడలేదు. వెదురు కోసం చాలా ఎత్తు కెళ్ళాలేమో! మామూలుగా శ్రీశైలం నుంచి అటు ఆత్మకూరు కానీ, ఇటు హైదరాబాదు కానీ ప్రయాణిస్తే అద్భుతమైన వెదురు పొదలు కన్పిస్తాయి. అహోబిలం అడవుల్లో వెదురు లేదనుకున్నాను. పైన ఉంది కాబోలు” అన్నాను నేను. మన్ననూర్‌ దగ్గర టైగర్‌ రిజర్వ్‌ ఫారెష్టులో కూడా ఎక్కువగా వెదురు పొదలు కనిపిస్తాయి. దిగుతున్నంత సేపు అటు వేపు మెట్లమీద జారుతున్న వెదురును చూసాం.
తొమ్మిదిన్నరకి దిగువ అహోబిలం చేరిపోయాం. ఎండబాగా పెరిగిపోయింది. చెమటతో వొళ్ళంతా తడిసి పోయింది. కింద గుళ్ళోకి వెళ్ళాం. యాదగిరి గుట్టలో ఉన్నట్టు ఇక్కడ కూడా గర్భగుడి కొండ గుహలో ఉంటుంది. గుహలోపల చల్లగా ఉంటుంది. ప్రశాంతి కోసమే నేను గుళ్ళల్లోకి వెళ్ళాను.
సంజీవ్‌కి ఐదు వందలిచ్చి ”ఈ పని చేస్తే చేసావ్‌ కానీ బాగా చదువుకో… చదువుకుంటే ఇంకా బాగా రాణిస్తావ్‌” అని చెప్పి దిగువ అహోబిలం వేపు, మరో గంటలో ఆళ్ళగడ్డ వేపు బయలుదేరాం. ఆళ్ళగడ్డలో భోజనం చేసి హైదరాబాదు బయలు దేరేటప్పటికి రెండయింది. బైక్‌ ఉందంటూ నాగరాజు అహోబిలంలోనే ఉండిపోయాడు. మేమిద్దరం మండుతున్న ఎండలో నల్లమల కబుర్లు చెప్పుకుంటూ హైదరాబాదు బయలుదేరాం.
old post
*************************
All reactions:
Sri P, Swetcha Votarkar and 97 others
19
1
Share

Saturday, December 24, 2022

ప్రెషర్‌ కుక్కర్లు కొనివ్వడం కాదు ఇంటిపనిలో భాగస్వాములవ్వాలి

 – కొండవీటి సత్యవతి

ఇద్దరు మిత్రులు పొలం గట్లమీద మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. అటూ ఇటూ పచ్చటి పంట పొలాలు. కళ్ళకి ఎంతో ఇంపుగా కనబడుతున్నాయి.

ఆ మాటా ఈ మాటా దొర్లాక ‘‘అరేయ్‌! సుధాకర్‌! కిందటి ఆదివారం వస్తనంటివి. రానేలేదు. ఏదో ట్రైనింగుకి పోవాలి, రాను అన్నావ్‌ కదా! నీకేం ట్రైనింగురా’’ అడిగాడు రమేష్‌.
‘‘అదా! చెప్పాలిరా నీతో.’’
‘‘ఆడ బాయికాడ కూర్చుందాం పా. ఈ లోపు రంగయ్యొస్తాడు కల్లు దింపనీకి.’’
‘‘కల్లు సంగతి తర్వాతరా. నేను ట్రైనింగులో విన్న ముచ్చట నీకు చెప్పాలి’’ అన్నాడు కూర్చుంటూ.
‘‘కల్లు మర్చిపోయేంత గొప్ప ముచ్చటేందిరా’’ నవ్వాడు రమేష్‌.
‘‘మీ చెల్లి కడుపుతో ఉంది కదా’’
‘‘అవును. నాకు తెలుసుగా’’
‘‘అంటే, ఎలా చెప్పాలిరా? భార్యలు గర్భంతో ఉన్న భర్తలతో ఆ మీటింగ్‌ జరిగింది’’ అన్నాడు సిగ్గుపడుతూ.
‘‘అదేందిరోయ్‌. భార్య గర్భానికి, నీ మీటింగ్‌కి ఏందిరా సంబంధం. గమ్మత్తుగా ఉందే’’
‘‘చెబుతా ఆగు మరి’’
దూరంగా రంగయ్య వస్తూ కనబడ్డాడు.
‘‘అడిగో రంగయ్య కూడా వచ్చాడు’’
‘‘ఏందయ్యో! దోస్తులిద్దరూ సందె కల్లుకోసమొచ్చారా. ఈ రోజు కల్లు లేదు. ఊరికే చూసి పోదామని వచ్చా’’ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు రంగయ్య.
‘‘అట్లానా! సరేలే. నువ్వు కూడా కూర్చో. సుధాకర్‌ ఏదో ముచ్చట చెబుతాడట. చెప్పరా’’.
రంగయ్య కూడా సుధాకర్‌ వైపు ఆసక్తిగా చూశాడు.
‘‘ఎలా మొదలెట్టాలో సమజైతలేదు. సర్లే… చెప్పేస్తా. మా బస్తీలో అంగన్‌వాడి టీచర్‌ ఉంటది గదా! నా భార్య గర్భంతో ఉంది, అంగన్‌వాడి సెంటర్‌కి వెళ్తుంది కదా! పది రోజుల క్రితం నన్ను పిలిపించింది. ఎందుకా అనుకుంటా పోయినా. ఈ ట్రైనింగ్‌ పోవాలని చెప్పింది. తప్పనిసరిగా పోవాలని చెప్పింది. ఏమి ట్రైనింగ్‌, నేనెందుకు పోవాల, నేను పోను అని కొట్లాడినా. చాలాసేపు సంజాయించింది. నీతోపాటు చాలామంది ఉంటారులే అని ఒప్పించింది. అలా మొన్న ఆదివారం నాడు పోయినాను’’ అంటూ నవ్వాడు సుధాకర్‌.
‘‘ఆడోళ్ళంతా కట్టగట్టుకు పోతుండే మీటింగ్‌లవి. మొదటిసారి ఇంటున్నా మొగోళ్ళు మీటింగ్‌లకి పోవుడు’’ అన్నాడు రంగయ్య.
‘‘అదే కదా’’ అన్నాడు రమేష్‌.
‘ఆగండాగండి. ఇది వేరే తీరుగున్న మీటింగ్‌. గర్భంతో ఉన్న ఆడవాళ్ళలో రక్తం… కాదు అదేంటది రక్తహీనత ఎక్కువగా ఉంటే పుట్టబోయే బిడ్డలు అనారోగ్యంతో పుడతారంటూ మొదలుపెట్టి ఎన్నో విషయాలు చెప్పబట్టె. మొదట్లో ఏమీ అర్థం కాలేదు. ఆమెకి రక్తం తక్కువుంటే నేనేం చెయ్యాల, మందులేసుకోవాలి. నాకెందుకు చెబుతున్నారని తొలుత కోపమొచ్చింది. నాతోపాటు ఇరవై మంది మగాళ్ళుండె. అందరూ వాదించబట్టె. కానీ ఆ మేడం… పేరు మర్చిపోయా చాలా శాంతంగా సంజాయించింది. మమ్మల్ని సానా ప్రశ్నలడిగింది.’
‘‘మీ ఇంట్లో వంటెవరు చేస్తారు?’’
‘‘నా భార్య చేస్తుంది.’’
‘‘ఎవరు వడ్డిస్తారు?’’
‘‘ఆమెనే వడ్డిస్తుంది.’’
‘‘ముందెవరు తింటారు?’’
‘‘పిల్లలు. ఇంట్లో పెద్దలుంటే వాళ్ళు.’’
‘‘తర్వాత?’’
‘‘నాకు పెడుతుంది.’’
‘‘మీరంతా తిన్నాక తనకి ఎవరు వడ్డిస్తారు?’’
‘‘భలేగా అడిగారే. ఆమే తింటుంది. ఆమెకి ఎవరు పెడతారు’’
‘‘ఆమె ఏం తింటుందో, ఎంత తింటుందో మీకు తెలుసా?’’
‘‘మాకు పెట్టిందే ఆమె తింటుంది.’’
‘‘ఆమెకు తినడానికి ఏమైనా మిగులుతాయా. మీరు ఎప్పుడైనా మీ భార్యని నువ్వు తిన్నావా? నీకు కూర సరిపోయిందా? అని అడుగుతారా?’’
‘‘నేనెందుకడుగుతా. ఆమెకు కావలసింది ఆమె తింటది.’’
ఇలాగా ఎన్నో ప్రశ్నలు అడిగారు. మస్తు కోపమొచ్చింది. ఏందీ పిచ్చి ప్రశ్నలు అని కూడా అనిపించింది.
‘‘నిజమే గదా! ఏందా పిచ్చి ప్రశ్నలు. గదేం ట్రైనింగ్‌’’ రంగయ్య అన్నాడు తుపుక్కున ఊస్తూ.
‘‘ఆగాగు రంగన్నా. ముందు కోపమొచ్చినా తర్వాత ఆలోచనొచ్చింది. నిజమే కదా! మనం తినుడే గానీ ఎన్నడైనా ఆళ్ళ గురించి మనం పట్టించుకుంటామా అనిపించింది.’’
రమేష్‌, రంగయ్య ఆశ్చర్యంగా చూశారు సుధాకర్‌ వైపు.
‘‘నా ఇంటిది కడుపుతో ఉంది కదా. ఆమె గురించి మస్తు ప్రశ్నలడిగారు తెలుసా?’’
‘‘ఏమన్నారేంటి సుధాకర్‌?’’
‘‘అదే చెబుతున్నా’’
‘‘ఆ మేడం అడిగింది కదా! నీ భార్య కడుపుతో ఉంది కదా! ఎన్నో నెలో నీకు తెలుసా?’’
‘‘గా ముచ్చట నీకెందుకంటా’’ రంగయ్య అన్నాడు.
‘‘నేనూ అదే అన్నాను. నాకు తెల్వది. ఆమెకెన్నో నెలపడ్డదో ఆళ్ళమ్మకి తెలుస్తది. నాకు తెల్వదు.’’
‘‘గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉందా? నీ భార్య ఆరోగ్యం మంచిగా ఉన్నదా? ఆమె బరువెంత పెరిగింది. ఏమి తింటున్నది. మంచి ఆహారం సరిపడా తింటున్నదా? ఆసుపత్రికి తీసుకెళ్ళావా? డాక్టర్‌ ఏమి చెప్పింది. ఓయబ్బో ఎన్ని ప్రశ్నలడిగిందనుకున్నారు. ఏంటది పోషకాహారం అంట, తింటున్నదా అని కూడా అడిగింది. పోషకాహారమంటే ఏందో నాకేమెరుక. నేను ఏమీ చెప్పలేకపోయాను. మస్తు సిగ్గుపడ్డాను. కానీ నాతోపాటు ఉన్న మురళి చాలా బాగా చెప్పిండు తెలుసా?’’
‘‘ఏ మురళి? మన వెంటకయ్య కొడుకా?’’
‘‘అవును ఆడే. మేడం అడిగిన అన్నింటికీ టకటకా చెప్పిండు.’’
‘‘అవురా. ఆడు ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు కదా!’’ నవ్వాడు రమేష్‌.
‘‘అదే మాట మేడం కూడా అనిందిరా. మర్చిపోయా. మా పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో కూడా అడిగింది. పెద్దలు చేసిన పెళ్ళా, ప్రేమ పెళ్ళా అని కూడా అడిగారు. మురళి, ఇంకో ఇద్దరు ప్రేమ పెళ్ళి అని చెప్పారులే.’’
‘‘అదా సంగతి’’ అన్నాడు రంగయ్య.
‘‘తర్వాతేమైందిరా’’ అన్నాడు రమేష్‌.
‘‘వస్తున్నా, ఆడికే వస్తున్నా. మస్తు ప్రశ్నలు, సమాధానాలు అయ్యాక మాతో కొన్ని పనులు చేపిచ్చారు’’
‘‘పనులు చేపించారా? ఏం పనులురా’’
‘‘కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్లు మా ముందు పెట్టి చాకుతో కొయ్యమన్నారు. చాలామందికి కోపమొచ్చి సర్రున లేచి వెళ్ళబోయారు. అప్పుడు మేడం ఏమన్నదంటే, ఎందుకు కోపమొచ్చింది. కూరగాయలు, పండ్లు కట్‌ చేయడం చెడ్డపనా?’’ అంది.
‘‘కాకపోతే ఏంటి మరి. అది ఆడోళ్ళ పని. మేమెందుకు చెయ్యాలి. మా పరువు తియ్యాలనుకుంటున్నారా’’ అంటూ అరిచాడు ఒకాయన.
వెంటనే మురళి లేచి ‘‘తప్పేముంది. పెద్ద పెద్ద వంటల్లో మగాళ్ళు కోస్తారుగా. హోటళ్ళలో చూళ్ళేదా? మేడం నేను కోస్తాను. ఇంట్లో నేనే కూరలు కోస్తే నా భార్య వండుతుంది. ఇపుడామె కడుపుతో ఉంది. ఎక్కువసార్లు వంట కూడా చేస్తాను. ఆమెకి వికారంతో వాంతులవుతాయి. పొద్దుగాలప్పుడు చాలా నీరసంగా ఉంటుంది. అందుకే చాలా పనులు నేను చేస్తా ఇంట్లో’’ అంటూ కూరగాయలు చకచకా కోసి చూపించాడు.
‘‘మేడం! ఉల్లిపాయలు మాత్రం నా వల్ల కాదు. కళ్ళ నుండి నీళ్ళొస్తూనే ఉంటాయి’’ అంటూ నవ్వాడు మురళి.
మురళిని చూసి కొంతమంది ముందుకొచ్చి కూరలు తరగడానికి ప్రయత్నం చేశారు. ఒకాయన వేలు కట్‌ చేసుకుని కెవ్వుమన్నాడు. అందరూ నవ్వారు. మేడం అతని చేతికి బ్యాండ్‌ ఎయిడ్‌ వేసింది. ఆ తర్వాత పండ్లు కోయమన్నది. కొంతమందే కోయగలిగారు.
‘‘మీలో ఎంతమందికి ఇల్లు ఊడ్వడం తెలుసు.’’
‘‘మీరు మరీ ఘోరం మేడం. నా భార్య ఉండగా ఇల్లు నేనెందుకు ఊడుస్తాను.’’
‘‘నేనూడ్చినా ఆడంగి వెధవా, నీకేం ఖర్మరా అని మా అమ్మ తిడుతుంది’’ అన్నాడొకడు.
‘‘మగ పుట్టుక పుట్టి చీపురు పట్టుకునే ఖర్మ మాకేంటి మేడం’’ అన్నాడొకతను.
‘‘అద్సరే గానీ నువ్వేమన్నావ్‌రా సుధాకరూ’’ అడిగాడు రంగయ్య.
‘‘ఇదేం ట్రైనింగురా! మగవాళ్ళని ఆటపట్టించనీకా’’ అన్నాడు రమేష్‌.
‘‘నాకూ ఆ పనులేవీ రావు కదా! అదే చెప్పాను. నేను పొద్దుగాల పనికి పోతా. సాయంత్రమొస్తా. ఈ పనులు చెయ్యనీకి నాకు టైమెక్కడిది’’ అన్నాను.
మేడం వెంటనే ‘‘నీ భార్య కూడా బయటికెళ్ళి పనిచేసి సాయంత్రం వస్తుంది కదా! మరి ఆమె ఎలా చెయ్యగలుగుతుంది. పైగా ఇప్పుడు కడుపుతో ఉంది కూడా’’ అని అందరివైపు తిరిగి ‘‘మీరేమంటారు?’’ అంది.
‘‘అవన్నీ ఆడాళ్ళేగా చెయ్యాలి. మేం చేస్తే చులకన అయిపోమా? అయినా అవేం గొప్ప పనులా. ఆడాళ్ళు ఈజీగా చేసేస్తారు.’’
చీపుర్లు బయటికి తీసి ‘‘ఊడ్చడానికి ప్రయత్నం చెయ్యండి. అదెంత కష్టమైన పనో, ఎంత నడుం నొప్పి వస్తుందో మీకు అర్థమౌతుంది’’ అంది మేడం.
కొందరు కోపంగా బయటకు వెళ్ళిపోయారు. మురళి చక్కగా ఊడ్చి మేం పారేసిన కూరగాయ ముక్కల్ని చేటలో ఎత్తిపెట్టాడు. అది చూసి కొంతమంది చీపురు తీసుకున్నారు. చాలామందికి పట్టుకోవడం రాలేదు. నడుం ఒంచి ఊడ్వడం రాలేదు.
‘‘నువ్వేం చేసినావురా. ఊడ్చావా’’ హేళనగా అన్నాడు రంగయ్య.
‘‘ప్రయత్నం చేశా. నడుం ఒంగలే. చేతిలో చీపురు నిలవలే. ఊడ్చడం అంత తేలిక కాదని అర్థమైంది. కడుపుతో కమల… అదే నా భార్య ఇల్లూడ్వడానికి ఎంత కష్టపడుతుందో అర్థమైందిరా’’ అన్నాడు సుధాకర్‌.
శ్రోతలిద్దరూ నోళ్ళు వెళ్ళబెట్టి విన్నారు. రంగయ్య కొడుకు కల్లు తీసుకొచ్చాడు. రెండు సీసాల్నిండా కల్లు. ‘‘ఏంది అందరూ అంతలా మాటల్లో మునిగారు’’ అన్నాడు సాయి.
‘‘పొయ్యిరా కల్లు. గీ సుధాకర్‌ చెప్తున్న మాట వింటుంటే పిచ్చెక్కేట్టుంది’’ అన్నాడు రంగయ్య.
నాలుగు మోదుగాకులు తెంపుకొచ్చి కల్లు పోసిచ్చాడు సాయి.
‘‘నిజమే రంగన్నా. ఉదయం మీటింగ్‌ మొదలైనప్పుడు నాకూ కోపం, చిరాకు వచ్చాయి. పిచ్చి పట్టినట్టనిపించింది. ఎందుకంటే ఇసుంటి మాటలు ఎప్పుడూ వినలే. కానీ సాయంత్రానికి మంచిగనిపించింది. చివర్లో మేడం మాటలు చాలా మంచిగనిపించాయి అందరికీ. కోపంగా బయటకు పోయినోళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు.’’
‘‘ఏం చెప్పిందేంటి’’ రమేష్‌ అడిగాడు.
అన్ని ప్రశ్నలడిగినందుకు, అన్ని పనులు చేపిచ్చినందుకు క్షమించమంది. మీకు అర్థం చేయించనీకే అలా చేశాం. మాటలతో మార్పు రాదని మీరు ఆ పని చేస్తే మీకు తెలుస్తుందని చేయించాం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీకు తెలుసా మన దేశంలో గర్భం దాల్చాక ఎనీమియా… అదే పోషకాహారం తినకపోవడం వల్ల తల్లీ పిల్లలు చాలామంది చనిపోతున్నారు. గర్భం వచ్చిన మనిషికి కుటుంబం అంతా తోడుగా ఉంటేనే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. ఆమె తిండీ తిప్పల గురించి, ఆమె ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోకపోతే ఎలా చెప్పండి. ఆమెకు ఉన్నంతలో మంచి భోజనం ఏర్పాటు చెయ్యడం, క్రమం తప్పకుండా డాక్టర్‌కి చూపించడం, బరువు చెక్‌ చెయ్యడం… నిజానికి ఇవన్నీ చెయ్యడానికి అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు ఉంటారు. కానీ మీరు శ్రద్ధ చూపించి వాళ్ళను చెకప్‌లకు తీసుకెళ్తే ఆమె కూడా సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. కుటుంబంలో గర్భిణీ ఉంటే ఆమె బాగోగులను కుటుంబం మొత్తం చూసుకోవాలి. ముఖ్యంగా భర్తగా మీరు ఇంటి పనిలో, వంట పనుల్లో బాధ్యత తీసుకుంటే ఆమెకు కొంచెం రెస్ట్‌ దొరుకుతుంది. ఇవన్నీ మీతో మాట్లాడాలనే ఈ ట్రైనింగ్‌ అంటూ మేడమ్‌ చాలా విషయాలు మాట్లాడిరది.
‘‘మాకూ చెయ్యాలనే ఉంటుంది మేడం. కానీ మా అమ్మ తిడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎక్కిరిస్తారు. అదే భయం’’ అన్నాడొకాయన.
‘‘చుట్టుపక్కలందరం చెయ్యడం మొదలుపెడితే ఎవరెక్కిరిస్తారు’’ అన్నాడు మురళి.
‘‘కరెక్ట్‌, ఈ మీటింగ్‌కి ఇరవై మంది వచ్చారు. తర్వాత మీటింగ్‌కి నలభై మంది రావొచ్చు. ఇలా కదా మార్పు వచ్చేది’’ అంది మేడం.
నిజమే కదా! అనిపించింది నాకు. కమలకి అన్నింట్లో సహాయం చెయ్యాలనిపించింది. ట్రైనింగ్‌ గురించి మీకు చెప్పాలనిపించడమే నాలో మార్పు వచ్చిందనడానికి నిదర్శనం. చిన్న చిన్న పనుల్లో కమలకి సహాయం చెయ్యడం, తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం కమలకీ సంతోషంగానే ఉంది. చివర్లో మేడంని ఓ ప్రశ్న అడిగాను.
‘‘ఇలాంటి ట్రైనింగ్‌లు ఎప్పుడో మొదలుపెట్టి ఉండాల్సింది. మా అమ్మలకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మమ్మల్ని సరిగ్గా పెంచేవాళ్ళు. మా నాన్నను చూసే మేము నేర్చుకున్నాం. మా అమ్మ గర్భంతో ఉన్నప్పుడు కూడా ఆయన కొట్టేవాడు. ఒకసారి కడుపుమీద కొట్టాడట తాగొచ్చి. ఈ ట్రైనింగ్‌లో నేను చాలా నేర్చుకున్నాను. చాలా విషయాలు అర్థమయ్యాయి. నా ఫ్రెండ్స్‌ అందరికీ చెబుతాను థాంక్స్‌ మేడం’’ అని చెప్పాను అన్నాడు సుధాకర్‌.
వింటున్న ముగ్గురూ వింతగా చూసినా సుధాకర్‌ చెప్పిందంతా అర్థం చేసుకున్నారు. సాయి మోదుగాకుల్లో మళ్ళీ కల్లు నింపాడు. అతనికి ఇటీవలే పెళ్ళయింది. సుధాకర్‌తో మళ్ళీ మాట్లాడాలి అనుకున్నాడు.
‘‘అవునురా సుధాకర్‌! నువ్వు చెప్పిన కొన్ని విషయాలు బానే ఉన్నాయి. మనక్కూడా ఎవరైనా చెప్పుంటే బాగుండేది. లేకపోతే మనకెలా అర్థమౌతాయి’’ అన్నాడు.
‘‘ఔనురా! నువ్వు చెప్పిన విషయాలు నాక్కూడా మంచిగన్పించాయి. రానిస్తే ఈసారి మీటింగ్‌కి నేనూ వస్తా’’ అన్నాడు రమేష్‌.
మాటలు కొనసాగిస్తూ నలుగురూ ఇళ్ళవైపు నడవసాగారు.

Friday, July 23, 2021

నేనొక ప్రకృతి ప్రేమికురాలిని

 నేనొక ప్రకృతి ప్రేమికురాలిని

అతకంటే ముందు నేనో మనిషి ప్రేమికురాలిని
నాకు గుళ్ళతో, గుడిలోని విగ్రహాలతో పనేమీ లేదు నేను తీర్చుకోలేని కోరికలూ లేవు
చేతులు ముడిచి దణ్ణాలుపెట్టే అవసరమూ లేదు
నాకు రేపటి మీద భయం లేదు
జీవితం పట్ల అభద్రతా భావం లేదు
నేను ఎక్కడైనా సంతోషంగా బతికెయ్యగలను
అపరిమితమైన వస్తుసముదాయం మీద
అస్సలు మోజు లేదు
భద్రంగా,భయపడుతూ బతకాలనీ లేదు
స్వర్గం,నరకం,పాపం,పుణ్యం,దేవుడు,దెయ్యం
ఒట్టి పదాలే నా దృష్టిలో
నా గుండె లయ ఆగిపోతే
నా పార్ధివ శరీరం పోయేది మెడికల్ కాలేజీకే
విద్యార్ధులకుపయోగపడ్డాక ఏంచేస్తారో నాకు తెలియదు
తెలుసుకోవాలనే ఆసక్తీ లేదు
మరణానంతరం మనుష్యులు కలిసేది మట్టిలోనే
అక్కడితో బతుకుకు ఫుల్ స్టాప్
పునర్జన్మలు,ఆత్మలు తిరుగాడడాలు అంతా ఒట్టిదే
మనిషి బతుక్కి మరణమే తుది ఘట్టం
ఆ తర్వాత క్రతువులన్నీ పేరసైట్ల కోసమే
కాయ కష్టం చెయ్యని సోమరుల కోసమే
నాకిప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ గుర్తొస్తున్నాడు
"దెయ్యాలని చూసామని భ్రమపడిన వాళ్ళున్నారు కానీ
దేవుడిని చూసామని చెప్పిన వాళ్ళు ఎక్కడా లేరు
అలా చెప్పిన వాళ్ళు మానసిక రోగులైనా అయ్యుండాలి
మోసగాళ్ళైనా అయ్యుండాలి"
ఎంత నిజం,ఎంత వాస్తవం
నేను మాత్రం బిందాస్ గా
బంధాలేమీ తగిలించుకోకుండా బతికేయాలనుకుంటున్నా
బాధితుల పక్షాన మాత్రం
బతికున్నంత కాలం పనిచేస్తా
అదే నేను బతికున్నానన్న దానికి రుజువు .

నేనూ నా తాసిల్దార్ ఉద్యోగం

 #సప్తపర్ణి...3


యలమంచిలి అంటే వైజాగ్ దగ్గర యలమంచిలి అనుకునేరు.ఇది పశ్చిమ గోదావరి లో నరసాపురానికి,పాలకొల్లుకు మధ్యలో ఉండే చిన్న మండలం.బహు సుందరమైన మండలం.గోదారమ్మ లంకలతో కళకళలాడే మండలం.యలమంచిలి లంక,కనక్కాయల లంక లాంటి ఎన్నో లంకలున్నాయి.రాజమండ్రి నుండి నరసాపురం దగ్గర సముద్రం వేపు వడి వడిగా ఉరకలెత్తి వచ్చే గోదావరి సృష్టించిన లంకలు ఎంతో పచ్చగా,సౌందర్యం ఉట్టిపడుతూంటాయి.అలాంటి ఓ అందమైన మండలానికి నేను డిప్యూటి తాహసిల్దార్ ఉద్యోగం వెలగబెట్టడానికి 1996 లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళాను.
అప్పటి వరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో సూపర్నెంట్ ఉద్యోగం.అప్పటికే 18 ఏళ్ళ సర్వీస్ ఉంది. కుర్ర మితృలతో పోటీపడి గ్రూప్ 2 పరీక్ష రాసి,గెలిచి డి టి ఉద్యోగం సంపాదించాను.సంవత్సరం పాటు హైదరాబాద్ లో ట్రయినింగ్.హైదరాబాద్ లో ఉన్న మురికివాడల విశ్వరూపం చూసింది ఈ ట్రయినింగ్ సమయంలోనే. ఆ విషయాలు విడిగా రాయాలి.నగరాల మధ్యలో ఉండే ఈ బీభత్స ప్రాంతాలతో నాకు చాలా అనుభవాలున్నాయి.తప్పకుండా రాస్తాను మళ్ళొకసారి.
సరే...శిక్షణ పూర్తైంది.అప్పాయెంట్మెంట్ తీసుకుని నరసాపూర్ రైలు ఎక్కాను.మా సీతారామపురంలో మకాం పెట్టాను.ఏలూరెళ్ళి పోస్టింగ్ అడిగితే మా ఊరికి చాలా దూరంగా ఉండే మండలం లో ఇచ్చారు.కొల్లేరుకు దగ్గరాగా ఉండే మండలమది.నేనక్కడ చేరనని మా ఊరికి దగ్గరగా ఉండే మండలం లో ఇవ్వమని జాయింట్ కలక్టర్ ని అడిగాను.ఆయన నా వేపు సీరియస్ గా చూసి మీరు హైదరాబాద్ నుండి వచ్చారా అని అడిగాడు.అవునన్నాను.మనం ఎలక్షన్లో కలిసి పనిచేసాం కదా అన్నాను.ఆయన నన్ను గుర్తుపట్టాడు.యలమంచిలికి పోస్టింగ్ మార్చాడు.మా ఊరు నుండి హాయిగా నా కైనెటిక్ మీద వెళ్ళి రావొచ్చు.అలా యలమంచిలిలో నా ఉద్యోగం మొదలైంది.
మళ్ళీ మా ఊళ్ళో ఉండే ఆనందం దొరికింది.ఈ ఉద్యోగం వల్లనే గీతతో గొప్ప స్నేహం పెనవేసింది.ట్రయినింగ్లో పరిచయం.తను వరంగల్,నేను నరసాపురం... ఓ ఉత్తరం తో మొదలైన స్నేహం అబ్బో !! ఎంత గాఢమైందో.గీతకి రాసిన ఉత్తరాల్లో నా యలమంచిలి ఉద్యోగానుభవాలు నిక్షిప్తమై ఉన్నాయ్.నా ఉత్తరాల ఫైల్ తన దగ్గరే ఉండిపోయింది.
నేను నర్సాపురం వెళుతూ నా కైనెటిక్ తీసుకెళ్ళి పోయాను.ఆ బండేసుకుని ఝామ్మంటూ మా పంట కాలువ మీదుగా,పచ్చటి పొలాల్లోంచి,కొబ్బరి తోటల్లోంచి రోజూ యలమంచిలి వెళ్ళేదాన్ని.ఆ ప్రయాణం ఎంత సుందరంగా ఉండేదంటే ...అటు ఇటు వరిచేలు,గట్ల మీద కొబ్బరి చెట్లు,వొంటిని వాటేసుకునే పైర గాలి...ప్రతి రోజు చేను ఎంత ఎదిగింది,ఏ రంగుకు మారింది,పాలుపోసుకుంటున్న కంకులు,ధాన్యంగా మారుతున్న క్రమాలు దీక్షగా చూసుకుంటూ బండి మీద వెళుతుండేదాన్ని.పొలాల్లో దమ్ము చేయడం,ఆకుమళ్ళు వెయ్యడం,నాట్లేయడం,కోతలు కొయ్యడం,ధాన్యాన్ని తూర్పారపడ్డడం,సంచుల్లోకి ఎక్కించడం,మార్కెట్టుకు తీసుకెళ్ళడం...ఈ క్రమాన్ని చాలా ఇష్టంగా,ఆసక్తి గా గమనించేదాన్ని.ఆ పనుల్లోని జీవ చైతన్యం గొప్ప సంతోషాన్నిచ్చేది.
బారులుగా నడువొంచి నాట్లేసే మహిళలు,కట్టల్ని అటు ఇటు విసిరే మగవాళ్ళు అడపా తడపా వినిపించే పాటలు...ఎంత బావుంటుందో ఆ దృశ్యం.కోసిన వరి పనల్ని రోడ్ల మీదే వేసేవాళ్ళు.ఎన్నోసార్లు ఆ పనల్లోంచి పాములు నా బండికి అడ్డమొచ్చేవి.ఒక సారి తాచుపాము తోక మీంచి బండి చక్రం వెళ్ళింది.ఇంతెత్తున లేచింది.తోకతొక్కిన తాచు అంటే ఏంటో ఆ రోజు చూసాను.నాకు పాములంటే భయం లేదు.సీతారామపురం నుండి యలమంచిలి ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆశ్వాదిస్తుండేదాన్ని.
ఆఫీసులో పని గురించి ఇక్కడ రాయను.అయితే ఫీల్డ్ లోకి,విచారణల నిమిత్తం వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. చుట్టూ గోదావరి అల్లుకున్న లంకల్లోకి తరచు వెళ్ళేదాన్ని.అక్కడికి పడవల్లోనే వెళ్ళాలి.దొడ్డిపట్ల వెళ్ళి,అక్కడి నుండి పడవలో కనక్కాయల లంక వెళ్ళేదాన్ని. గోదావరికి వరదొస్తే ఈ లంకల పరిస్థితి చాలా ప్రమాదకరం.ఆ లంకల్లో రేషన్ రిజర్వ్ స్టాక్ ఉండాలి ఎప్పుడూ. వాటిని చెక్ చేస్తూ ఉండాలి.ఒక ఉధృతమైన వరదలు హటాత్తుగా వచ్చి, లంకలోకి వెళ్ళలేని పరిస్థితి వస్తే లంకలో నివసించే వారికి అందుబాటులో రేషన్ ఉంచాలి.అపుడపుడూ వెళ్ళి చెక్ చేస్తుండాలి.కనక్కాయల లంక చాలా అందంగా ఉంటుంది.
సారవంతమైన భూమి.మొక్క జొన్న,అరటి తోటలు.ముఖ్యంగా అవిశ చెట్లకి పాకించే తమలపాకు పాదులతో నిండి ఉండి,ఆకుపచ్చగా కళకళలాడుతుంటుంది.లంకలోకి వెళ్ళినప్పుడల్లా లేత కొబ్బరిబొండాలు,కాల్చిన మొక్కజొన్న పొత్తులు...భలే రుచి.దొడ్డిపట్ల పంచాయతీ ప్రెసిడెంట్ మహిళ.ఆవిడెప్పుడూ బయటకొచ్చేది కాదు.ఆమె భర్త అన్నీ చక్కబెట్టేవాడు.ఆమెతో జరిగిన సంభాషణల్లోంచి నేనో కధ రాసాను."ముందడుగు" "ఆమె కల" కధల సంపుటిలో ఉంది ఆ కధ.
నేను యలమంచిలిలో పని చేస్తున్నప్పుడే గోదావరి మీద చించినాడ దగ్గర బ్రిడ్జి పని మొదలైంది.అక్కడికెళ్ళడం,చించినాడలో ఉండే కమ్యూనిస్ట్ రాజు గారిని కలవడం ఆయనతో కలిసి మాట్లాడుతూ భోజనం చెయ్యెడం ...చాలా బావుండేది.యలమంచిలి తాహసిల్దార్ రెటైర్ అయ్యాడు.నేనే తాహసిల్దార్.
ఆ టెం లోనే సూపర్ సైక్లోన్ వచ్చింది.భంకరమైన ఆ తుపానులో చిక్కుకుని యలమంచిలి నుండి సీతారమపురం వరకు చేసిన ప్రయాణం, అదీ రిక్షాలో,ఆ పెను గాలికి బండి నడపలేక నరసాపురం నుండి రిక్షాలో బయలుదేరి చేసిన ప్రయాణం,రిక్షా అతను నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిన అనుభవం గుర్తొస్తే ఇప్పటికీ నా వొళ్ళు జల్లుమంటుంది.ఆ తుపాను తర్వాత చాలా రోజులు ఆఫీసులోనే ఉండిపోవాల్సి రావడం,కూలిపోయిన ఇళ్ళు,పడిపోయిన చెట్లు,ధ్వంశమైన తమలపాకు తోటలు,రిహాబిలిటేషన్,నష్ట పరిహారం పంచడం....చాలా రోజులు అందులో కొట్టుకుపోయాం.
ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు ఎవ్వరూ పనిచెయ్యరు.గోదావరి జిల్లాల్లో వరదలు,తుపానులు చాలా సహజం.బాధితుల్ని చేరి,కేంప్స్ ఆర్గనైజ్ చేసి,ఫుడ్ అందచేయడం చాలా ముఖ్యమైన పని.రెవెన్యూ వాళ్ళూ అద్భుతంగా చేస్తారు.బస్తాల్లో డబ్బు పట్టుకెళ్ళి తమలపాకు రైతులకు పంచిన అనుభవం ఇప్పటికీ గుర్తుంది.
అక్కడ పనిచేసినప్పుడు నాకు నచ్చని అంశం అర్ధరాత్రిళ్ళ దాకా అధికారులు పెట్టే మీటింగులు.రెండోది ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న అవినీతి, ఫ్యూడల్ మనస్తత్వాలు."పచ్చి ఫ్యూడల్" అని ఓ కవిత రాసి చాలా గొడవపడ్డాను.
నరసాపురం సబ్ కలక్టర్ తో చాలా సమస్యలొచ్చాయి.నా ఇండిపెండెంట్ మనస్తత్వం అతనికి కిట్టేది కాదు.నేను నా బండి మీద ఆయన జీప్ కి ఎదురుపడితే చాలు మీటింగుల్లో నిలబెట్టి అరిచేవాడు.జీ హుజూర్ అనడం నాకు చేతకాదుగా మరి.నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వదిలెయ్యాలనే నిర్ణయం తీసుకున్నది కూడా ఈ అంశాలవల్లనే.
వ్యక్తిగత జీవితం ఉండదు.కధలు,కాకరకాయలు,సామాజిక ఆచరణ ..వీటికి టైమే దొరకదు.నాకు భూమిక ముఖ్యం.రెవెన్యూలో కొనసాగితే భూమికలో ఏమీ చెయ్యలేను.అంతే...సర్వీస్ కమీషన్ లో ఇంకా లీన్ పీరియడ్ ఉంది.వెనక్కి వెళ్ళొచ్చు.2000 లో రెవెన్యూ లో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్వీస్ కమీషన్ కి వచ్చేసాను.
భూమిక లో మొత్తం టైం పెట్టాలని నిర్ణయించుకుని 2000 సంవత్సరం చివరిలో మొత్తం గవర్నమెంట్ ఉద్యోగానికి తిలోదకాలిచ్చేసి,వాలంటరీ రెటైర్మెంట్ తీసుకున్నాను.అయితే రెవెన్యూ ఉద్యోగం నాకు అద్భుతమైన ఎన్నో అనుభవాలను,గీత లాంటి నేస్తాన్ని,కట్టల కొద్దీ ఉత్తరాలను మిగిల్చింది.యలమంచిలి అందాలను,వెన్నెల్లో గోదారి సౌందర్యాలను,మా ఊరి ముచ్చట్లను,ఏటిగట్ల నడకల్ని,పని లో ఎదురైన అనుభవాలని పేజీలకు పేజీలు గీతకు ఉత్తరాలు రాసేదాన్ని.
మొబైల్స్ లేని బంగారు కాలం ..ఉత్తరమే ముఖ్యమైంది.గీతకు కానీ.ఇంటికి కానీ ఫోన్ చెయ్యాలంటే ఎస్టిడి బూత్ ముందు లంబాచోడా క్యూలో నిలబడి ఎంతో అపురూపం గా లాండ్లైన్ కి చేసి మాట్లాడిన అనుభవం.
మా ఊర్లో ఆ రోజుల్లో టివీలు,సీరియళ్ళు లేని రోజులు.8 గంటలకంతా ఊరంతా నిశ్శబ్దంగా నిద్రపోయే వేళ నేను ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ఎస్టిడి బూత్ కెళ్ళి గీతకి ఫోన్ చెయ్యడం,చాలా సార్లు ఇంట్లో లేకపోవడం,ఆ ఆశాభంగమంతా మర్నాడు ఉత్తరం లో ప్రబింబించేది.
హమ్మయ్య... మూడేళ్ళపాటు నన్ను మురిపించి,ఆకుపచ్చటి లోకాల్లో విహరింపచేసిన యలమంచిలికి కూడా ఓ ప్రేమలేఖ రాసేసాను.
Uma Nuthakki, స్వర్ణ కిలారి and 130 others
15 Comments
6 Shares
Like
Comment
Share

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...