Sunday, January 3, 2010

పిచ్చుకలు ఈ రోజు మిడతల దండు లాగా మా ఇంటి మీద వాలిపోయాయి.

నిన్న సాయంత్రం మా సెనగ చేలో సాయం సంధ్య కెంజాయనీ,చలచల్లనీ శీత గాలినీ,పచ్చపచ్చని పొలాల తాజాదనాన్ని తనివితీరా ఆస్వాదించి ఇంటికొచ్చానా,
 అబ్బో ! తూరుపుదిక్కునుంచి రెండు తొనలు తీసేసిన నారింజ పండులా నిగ నిగలాడిపోతూ విదియ నాటి చంద్రుడు   (31 నిండు పున్నమి రోజు కదా)
ఈ ద్రుశ్యాన్ని కళ్ళ నిండా నింపుకొని కమనీయంగా నిద్రపోయానా ,

ఉదయం లేవగానే మరో అందమైన అనుభవం నా కోసం ఎదురు చూస్తోంది.

ఇంతకుముందు ఒకటి రెండుగా వచ్చే పిచ్చుకలు ఈ రోజు మిడతల దండు లాగా మా ఇంటి మీద వాలిపోయాయి.నేను చల్లిన బియ్యం తింటూ నా కెమేరాకి చిక్కిపోయాయి.

నేను చల్లింది గుప్పెడు బియ్యమే కానీ పిచ్చికలు పంచిన సంతోషం విలువను ఖరీదు కట్టే అక్షరాలు నా దగ్గర లేవు. మీరూ చూడండి కావాలంటే.

Saturday, January 2, 2010

ఈ రోజు నేను కర్నూల్ లోని మా సెనగ సేను చూడడానికి వచ్చానోచ్!




ఈ రోజు నేను కర్నూల్ లోని మా సెనగ సేను చూడడానికి వచ్చానోచ్.
ఒక చోట పచ్చగా ఒక చోట బంగారు రంగులో మెరిసిపోతూ మా సెనగ చేను
గోధూళి వేళ, సూర్యుడు పడమటి దిక్కున,కొండ వెనక కనుమరుగవతున్న వేళ
సెనగ చేలో,పక్షుల పాటలకి కువ కువ లాడుతూ నేను
మొక్క జొన్న కంకులు ఫైరగాలికి తలలూపుతుంటే
పారవశ్యంలో మునిగి సర్వం మరచిన నేను
భాగ్యనగర శబ్ద కాలుష్యానికి దూరంగా
బంగారు సెనగాచేలో బహు సంతోషంగా నేను
నేను చెప్పేది అబద్ధమనుకుంటే ఈ చాయా చిత్రాలు చూడండోచ్!

Wednesday, December 30, 2009

శాంభవి కేసు లో మేము సాధించిన విజయం

Great news in child Sambhavi case where she was projecred as a goddess.The Chairperson Human Rights Commission  Justice Subhashan reddy  reserved judgment for 4 days but has said Usha Rani   has lied and sambhavi's rights have been violeted,she has been exploited in the name of spirituality and he also said Usha rani tried to take advantage of Potuluri veerabrahmendra swamyis supposed predictions.Ths judge also said that he will order the child to be sent to school and the collector will be asked to ensure this.

Wednesday, December 9, 2009

యాసిడ్‌ ఆయుధంగా మారిన వేళ మన కర్తవ్యమేంటి?

డిశంబరు 13 దగ్గరకొస్తోంది. ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ గుండెల్లో అలజడి.. వెన్నులోంచి జరజరాపాకి మెదడును కంపింపచేసిన ఉద్వేగం. వరంగల్‌లో స్వప్నిక, ప్రణీతల మీద యాసిడ్‌ దాడి జరిగిన రోజు. యావత్తు ఆంధ్రరాష్ట్రం నివ్వెరపోయిన రోజు. ఎన్నో స్వప్నాలతో ఇంజనీరింగు వరకు ఎదిగి, యాసిడ్‌కి బలైన స్వప్నిక గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిల్లని నయనం ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కానే కాదు. ఒక సామూహిక దు:ఖం అందర్ని కమ్ముకున్న సందర్భం. ఆనాటి అరాచక, అమానుష దాడికి సాక్షిగా తన రూపాన్ని కోల్పోయి, గుండె నిబ్బరంతో అనూషలాంటి తనలాంటి బాధితులకు ఆత్మవిశ్వాసం కల్గిస్తున్న ప్రణీత మన కళ్ళెదుట తిరుగుతూ మనకి కర్తవ్యబోధ చేస్తూనే వుంది. సభ్య సమాజం, పౌర సమాజం ఈ విషయమై ఏం చెయ్యాలో చెప్పక చెబుతూనే వుంది. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది? యాసిడ్‌ దాడులు తగ్గాయా? స్వప్నిక మీద దాడి చేసిన ముగ్గురు యువకుల్ని ఎన్‌కౌంటర్‌ చేసేసి చేతులు దులిపేసుకున్న పోలీసులు మరిన్ని యాసిడ్‌ దాడులు జరక్కుండా చర్యలేమైనా తీసుకున్నారా? ఎన్‌కౌంటర్‌లో నిందితుల్ని చంపేయడంవల్ల ఈ దాడులేమైనా తగ్గిపోయాయా? లేదు. తగ్గలేదు. మరింత పెరిగాయి. ఈ రోజు యాసిడ్‌ ప్రేమోన్మాదులకే కాదు స్త్రీల మీద దాడి చెయ్యడానికి ఆయుధంగా మారిన వైనం మనం గమనించొచ్చు.

నిన్నటికి నిన్న ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ (నిజమాబాద్‌లో) తన భార్య మీద యాసిడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రెండో పెళ్ళి చేసుకుని మొదటి భార్య మనోవర్తి అడిగినందుకు అతను ఈ దాడికి తెగబడ్డాడు. ‘రక్షకభటులే’ యాసిడ్‌ను ఆయుధంగా వాడ్డం మొదలుపెడితే స్త్రీలు రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి? వరంగల్‌ ఘటన తర్వాత మన రాష్ట్రంలో వరుసగా ఎన్నో దాడులు జరిగాయి. ఒక్క గుంటూరులోనే ఏడు యాసిడ్‌ దాడులు జరిగాయి. నిజానికి ఈ దాడులు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితమవ్వలేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13 యాసిడ్‌ దాడుల కేసులు, ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇవి రోజు రోజుకూ పెరిగే దిశలోనే వున్నాయిగాని తగ్గడం లేదు.

యాసిడ్‌ దాడి జరిగిన తర్వాత ఆ స్త్రీల పరిస్థితి గురించి, వారి మానసిక వేదన, శారీరక వైకల్యం గురించి ఎవరూ ఆలోచిస్తున్న దాఖలాలు కనపడ్డం లేదు. ఒక్కసారిగా జీవితం తల్లకిందులైపోయి, ఉన్నరూపం కోల్పోయి, కాలిన గాయాల మచ్చలే తోడుగా మిగిలిపోతున్న బాధితుల బాధాతృప్త హృదయాలకు ఊరటనందించే లేపనాలేమీ మనమివ్వడం లేదు. వారి మానసిక ఘర్షణ, షాక్‌, తీవ్రమైన వత్తిడిని గురించి పట్టించుకోవడం లేదు. ఘటన జరిగిన వెంటనే పెను సంచలనం సృష్టించి, హడావుడి చేసే ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా ఆ తర్వాత మహామౌనంలోకి జారిపోతోంది.ఘటనానంతరం బాధితురాలికి అన్ని విధాలా అండగా వుండాల్సిన ప్రభుత్వం నియమాల, నిర్లక్ష్యాల చట్రంలో ఇరుక్కు పోతుంది. ‘చట్టం తన పని’ తాను చేసుకుంటూ పోతుంది’ లాంటి చవకబారు ప్రకటనలతో కాలం గడుపుతుంది. అందువల్లనే కదా ప్రణీత దాతల దయాదాక్షిణ్యాల మీద తన వైద్యం చేయించుకోవలసి వస్తోంది. బాధితులను నూటికి నూరు శాతం ఆర్ధికంగా, సామాజికంగా, వైద్యపరంగా ఆదుకోవలసిన బాధ్యత నిర్ద్వంద్వంగా ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఆ పని చెయ్యనపుడు సభ్య సమాజం ప్రభుత్వం మీద వత్తిడి తేవాల్సిన అవసరం వుంది. రాజమండ్రిలో అనూష ప్రేమ పేరిట జరిగిన దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి, మెడ మీది నరాల్ని కోల్పోయి నిస్సహాయంగా పరాయివాళ్ళ పంచన బతుకుతున్న వైనాన్ని ఒక ఛానల్‌ ఇరవై నాలుగు గంటలపాటు చూపించినా బండబారిన మన చర్మాలు, ఘనత వహించిన ప్రభుత్వం వారి చర్మాలు ఒకింత కూడా చలించలేదు. ఇదెంత బాధాకరం? ఇదెంత దు:ఖ కారకం?

యాసిడ్‌ దాడుల నివారణ కోసం ప్రభుత్వం ఒక ముసాయిదా తయారు చేసిందని, నేడో రేపో ఆర్డినెన్స్‌ రాబోతుందని వార్తలొస్తున్నాయి. మంచిదే. స్త్రీల మీద హింసల్ని నిరోధించడానికి ఒక దాని తర్వాత ఒకటి చట్టాలు చేసుకుంటూ పోదాం. మరింత కఠినమైన శిక్షలు ప్రవేశపెట్టుకుందాం. ఎన్‌కౌంటర్లు చేసి చంపేయ్యాలని, మరణశిక్షలు వేసి వీళ్ళని ఏరెయ్యాలని కూడా చాలామంది సెలవిస్తున్నారు. కొత్త చట్టాలు తేవడం ద్వారాను, కఠినమైన శిక్షల్ని అమలు పరచడం ద్వారాను స్త్రీలపై దాడుల్ని, హింసల్ని అరికట్టలేమని చరిత్ర చెబుతూనే వుంది. కొత్త చట్టాన్ని చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అమలులో ప్రదర్శించే నిర్లక్ష్యం సంగతేంటి? గృహహింస నిరోధక చట్టం 2005, వచ్చి మూడేళ్ళయిపోయింది. ఈ చట్టం వల్ల గృహహింస తగ్గిపోయిందా? తగ్గలేదు సరి కదా ఎక్కువైంది. దీనిక్కారణం చట్టం గురించిన ప్రచారలోపం, అమలులో నిర్లక్ష్యం, జుడీషియరీ నిరాసక్తత. అమలులో చిత్తశుద్ధి లోపిస్తే ఎన్ని కొత్త చట్టాలొచ్చి లాభామేంటి??

అలాగని చట్టాలే వొద్దని అనడం లేదు. కఠినంగా శిక్షించే చట్టంతో పాటు, స్త్రీల పరంగా శిలాసదృశ్యంగా, మహాకఠినంగా మారిపోతున్న మానసిక స్థితి, దృక్పధాల మాటేంటి? కత్తులతో కుత్తుకలు కోయడం, యాసిడ్‌తో శరీరాన్ని దహించేయడం, కిరోసిన్‌ మంటల్లో కాల్చేయడంలాంటి శారీరక హింసలు, ఈటెల్లాంటి మాటలు, చర్యలతో మనసును మెలిపెట్టే, మానసికంగా కుంగదీసే మానసిక హింసల్ని అంతంచేసే చర్యలేవీ మనం చేపట్టడం లేదు. హింస స్త్రీల మనశ్శరీరాలను ఎలా ఛిద్రం చేస్తుందో తెలియచెప్పే పాఠాలని మనం తరగతి గదుల్లోగానీ, తల్లిదండ్రుల మాటల్లోగానీ వినడం లేదు. కత్తులదాడిలో మెడలు తెగి రక్తం స్రవిస్తున్న దుర్మార్గవార్తని ఓ ఛానల్‌ ”కోతల సీజన్‌” అని వ్యాఖ్యానించగలిగిందంటే మీడియా ఈ అంశమై ఎంత మొద్దుబారిపోయిందో అర్ధమౌతోంది కదా! మరి మనమేం చెయ్యాలి?

సంస్కారవంతమైన చదువులు, విలువలతో కూడిన సాహిత్యం, మానవీయ కోణాలని ఆవిష్కరించగలిగిన మీడియా, తక్షణం స్పందించే పరిపాలన, సత్వర న్యాయమివ్వగలిగిన న్యాయవ్యవస్థ ఈనాటి తక్షణావసరం. వీటన్నింటి గురించి గొంతు విప్పే సివిల్‌ సొసైటీ కావాలిప్పుడు. అన్నింటిని మించి అహరహమూ స్త్రీని అణిచివేసి, ఆమె మానవ హక్కుల్ని కాలరాస్తున్న పితృస్వామ్య భావజాలం మీద మనమందరం మన బాణాలనెక్కుపెట్టాలి. అది మాట ద్వారానా, పాట ద్వారానా, సాహిత్యం ద్వారానా, చదువు ద్వారానా, ఉద్యమం ద్వారానా, ఉక్కు లాగా చెక్కు చెదరని ఐక్య ఆచరణ ద్వారానా అన్నది ఎవరి సంస్కారాన్ని బట్టి, ఎవరి దృక్పధాల్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన సమయమిది.

Sunday, November 29, 2009

భూమిక ఆధ్వర్యంలో మహిళలపై యాసిడ్ దాడుల మీద ఒక రోజు సదస్సు

Online edition of India's National Newspaper
Sunday, Nov 29, 2009 The Hindu

‘Sure punishment works better’

Meet on prevention of acid attacks on women comes up with recommendations

Bhumika Women’s Collective and Oxfam India organise day-long meeting

The recommendations will be forwarded to Home Minister P. Sabitha Indra Reddy

HYDERABAD: Fast track courts to expedite cases, compensation to victims through the Collector within stipulated time, special fund for immediate financial help, timely treatment to the victim, cancellation of recognition to the educational institutions that do not constitute committees against sexual harassment, and laws against the gender harassment to be included in the school curriculum are some of the recommendations by the Bhumika Women’s Collective in view of the amendments proposed to the Indian Penal Code as part of the A.P. Criminal Law (Amendment) Act, 2009 to curb acid attacks on women.

The organisation, along with Oxfam India, organised a daylong meeting on ‘Prevention of acid attacks on women’ here on Saturday.

The recommendations resulted from group discussions on the proposed changes to the Act, and the modalities of care and support for survivors.

A sure punishment works better than a stringent punishment, the recommendations read.

Compensation


They also found fault with the proposed link between the compensation and the progress of the case in the court.

The recommendations will be forwarded to the Home Minister P. Sabitha Indra Reddy, said M. Satyavathi from Bhumika.

Vidya Prasad, former Secretary of Legal Services Authority, while making concluding remarks, felt that a comprehensive legislation to curb violence against women on the lines of Domestic Violence Act, with provisions for rehabilitation, and economic and employment support could work better than the proposed amendments to IPC.

Inspector General of Police (CID) S. Umapathi suggested that the recommendations, along with rehabilitation measures may be included in a government order instead of formulating a special legislation.

Fine


Amendments to the IPC propose, among others, a fine between Rs.2 lakh and Rs. 5 lakh for grievous hurt by fire, heated substance acid, or explosive substance, imprisonment of seven years or more, and immediate interim compensation to be paid to the victim.

Saturday, November 21, 2009

శాంభవి ఉండాల్సింది గుడి లో కాదు బడిలో


శాంభవిని గుడి నుంచి రక్షించి బడిలో చేర్చాలని మానవ హక్కుల కమీషన్ ని కోరిన వార్తను మీరంతా టివీల్లో,పేపర్లలో చూసే ఉంటారు. ఇవిగో ఆ ఫోటోలు

Friday, November 6, 2009

వందేళ్ళయినా వన్నెతగ్గని కొ.కు రచనలు

భూమిక November 2009

1980-81 మధ్యకాలం. నేను పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న రోజులు. దిల్‌సుక్‌నగర్‌లో రూ. 150 లకు అద్దె ఇంట్లో వుంటూ రోజూ ఓ కిలోమీటర్‌ నడిచి, బస్సు డిపోకి వచ్చి, ఓ అరగంట క్యూలో నిలబడి, ఆర్‌టిసి బస్సులో సీటు సంపాదించి ఆఫీసుకెళ్ళేదాన్ని. ఓ రోజు విశాలాంధ్ర పుస్తకాల షాపుకెళ్ళి కొ.కు పుస్తకాలు కొన్నాను. ఆ సంకలనంలోని ఓ చిన్న గల్పిక నా మీద పెను ప్రభావాన్ని చూపింది. దాని పేరేమిటో నాకిపుడు గుర్తు లేదు. అందులో ఆఫీసులకి బస్సుల మీద వెళ్లే వాళ్ళ మీద ఆయన ఇలా రాస్తారు. ”పది పదిహేను నిమిషాల బస్సు ప్రయాణానికి సీటు కోసం ఈ ఉద్యోగస్తులు అరగంట ముందొచ్చి క్యూలో నిలబడతారు. అదో అలవాటుగా చేసేస్తారు గాని, ఆ అరగంట బస్సులో నిలబడిపోదామని ఆలోచించరు. పడీ పడీ, ఇంట్లో వాళ్ళని తొందర పెట్టి వచ్చి క్యూలో నిలబడతారు. కాళ్ళు పీక్కుతున్నా క్యూలోంచి కదలరు”. ఆ గల్పికలో ఇలా అర్ధం వచ్చేట్టు వుంటుంది. ఈ చిన్న గల్పిక చదివిన తర్వాత నేను ఏ రోజూ క్యూలో నిలబడలేదు. ఆ మూసని తోసిరాజని రద్దీ బస్సుల్లో ఎక్కడంటే అక్కడ, ఆఖరికి ఫుట్‌బోర్డింగు కూడా చేసేదాన్ని. మనుష్యులు ఒక యాంత్రికతకి ఎలా అలవాటు పడిపోయారో, కొత్త దారుల్ని వెతక్కుండా ఎలా దానిలోనే కొట్టుకు పోతుంటారో ఈ బుల్లి గల్పికలో చెప్పిన కొకు రచనల్ని ఎంతో ఇష్టంగా, ప్రేమగా చదవడం మొదలుపెట్టాను. కొ.కు శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మీద ప్రత్యేక సంచిక తేవాలనే ఆలోచన మొదలైన దగ్గర నుండి ఈ గల్పిక నాకు పదే పదే గుర్తుకు రాసాగింది.
ఈ ప్రత్యేక సంచికకు బీజం పడింది శ్రీకాకుళంలో. ఆగష్టు పదహారున కేంద్ర సాహిత్య అకాడమీ, కథానిలయం సంయుక్తంగా కొ.కు రచనల మీద సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో నేను వైజాగులో వున్నాను. నాయుడుపేట నుంచి ప్రతిమ ఫోన్‌ చేసి శ్రీకాకుళం మీటింగుకి వెళుతున్నావా అని అడగడం, ఆవిషయం నాకు తెలియదని చెప్పడంతో, తనే వివరాలన్నీ చెప్పింది. శ్రీకాకుళం వెళ్ళాలనే తపన మొదలైంది. అప్పటికీి టైమ్‌ ఎనిమిది. మీటింగు 10 కి. నేనేమో ఒక అవసరమైన వ్యక్తిగత పని మీద వైజాగులో వున్నాను. ఇంకేమీ ఆలోచించలేదు. టాక్సీి తెప్పించుకుని అప్పటికప్పుడు బయలుదేరి ఆ సమావేశానికి వెళ్ళాను. సింగమనేని నారాయణగారు, కాళీపట్నం రామారావు మాస్టారు, చాగంటి తులసి ఇంకా ఎందరినో కలిసాను. రామమోహనరాయ్‌గారు ‘కొ. కు చారిత్రక దృక్పధం” మీద అద్భుతమైన ప్రసంగం చేసారు.నేను టాక్సీ మీద ఖర్చు చేసిన రెండున్న వేలు ఈ సమావేశంలో పాల్గొన్న ఆనందం ముందు ఎందుకూ కొరగానివయ్యాయి. అంతే కాదు కొ.కు మీద నేనెందుకు భూమిక ప్రత్యేక సంచిక వెయ్యకూడదు. వేసి తీరాలి అనే నిర్ణయానికి రావడం జరిగింది.
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఉదయమే శాంతసుందరిగారికి ఫోన్‌ చేసి, కొ. కు గారి ప్రత్యేక సంచిక తీసుకొద్దాం. మీరు సహసంపాదకురాలిగా బాధ్యత తీసుకుంటారా? అని అడిగిందే తడవు ఆవిడ ఒప్పుకోవడం, ప్రత్యేక సంచికకి రూపకల్పనా జరిగిపోయాయి. ఆవిడ వెంటనే రచనల సేకరణ పని మొదలు పెట్టేసారు. నిజానికి ఈ ప్రత్యేక సంచిక వెనుక కృషింతా శాంతగారిదే. అందరికీ ఫోన్‌లు చేసి మాట్లాడటం, వాళ్ళ వెంటబడి రచనలు రప్పించడం అంతా ఆవిడే చేసారు. ఆవిడ ఒప్పుకోక పోయి వుంటే అసలు ఈ ప్రత్యేక సంచిక సాధ్యమయ్యేది కాదు. ఆవిడకి ‘థాంక్స్‌’లాంటి పడికట్టు పదాలతో కృతజ్ఞతలు తెలపడం నా కిష్టం లేదు. స్నేహంలో ఇలాంటి పదాలు ఇమడవు. ఇక కొ.కు.గారి రచనలకు సంబంధించి వివిధ కోణాలు ఈ సంచికలో ఆవిషృతమయ్యాయనే నేను భావిస్తున్నాను. ఈ అన్ని కోణాలను ఒకేసారి చదివే ‘అదృష్టం’ (దీనికేదైనా ప్రత్యామ్నాయ పదం వెదకాలి) నాకు కలగడం నన్ను ఆనందోద్వేగాల్లో ముంచేసింది. వందేళ్ళ క్రితం పుట్టిన ఈ మనిషికి ఇంత విశాల దృక్పధం, శాస్త్రీయ భావజాలం అన్నింటిని మించి స్త్రీ సమస్య మీద ఇంత సంస్కారవంతమైన ఆలోచనలు ఎలా వంటబడ్డాయి? అక్టోబరు 28న అంటే నేను ఈ ఎడిటోరియల్‌ రాస్తున్న రోజుకు సరిగ్గా వందేళ్ళ ముందు ఆయన పుట్టారు.
”ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన తెలుగు సాహిత్య పరిణామం విషయంలో కొ.కు కొంత కాలం ద్రష్టగాను, ఆ తరువాత స్రష్టగాను కూడా పని చేసారు. ముఖ్యంగా రాయప్రోలు అభినవ కవితకు, కృష్ణశాస్త్రి భావకవితకు కొ.కు ద్రష్ట. శ్రీ శ్రీ కంటే కాస్త ముందు పుట్టినా కొ.కు భావ కవితా ప్రవాహంలో దూకలేదు. శ్రీ శ్రీ దూకి తిరిగి ఒడ్డుకెక్కి తన త్రోవ తాను చూసుకొంటున్న కాలందాకా కొ.కు ప్రపంచాన్ని చూస్తూ, తెలుసుకుంటూ, చదువు , ఆలోచించుకుంటూ వచ్చాడు. చలం సాహిత్యం కొ.కును ఎంతగానో ఆలోచనలకు, కలవరానికి గురి చేసింది. ” అంటుంది కాత్యాయనీ విద్మహే కొ.కు వాజ్మయ జీవితం గురించిన వ్యాసంలో.
గురజాడ, శ్రీశ్రీ, చలం, వీరేశలింగంలాంటి వారి ఆలోచనాధోరణి యువకుడైన కొ.కు మీద బలంగానే వుండింది. ఆ తరువాత దాస్‌ కాపిటల్‌ చదవడంతో కొ.కు కు మార్కి ్సస్టు ప్రాపంచిక దృక్పధం ఏర్పడడం, అభ్యుదయ రచయితల సంఘంలో భాగస్వామి కావడం జరిగాయి. ఉద్యోగాల వేటలో ఊళ్ళు తిరుగుతూ, వివిధ ఉద్యోగాలు చేయడంతో విస్తృతమైన జీవితానుభవం సంపాదించాడు. భిన్నమైన అనుభవాలను పొందాడు. ఈ అనుభవాలన్నింటిని విశ్లేషించుకుంటూ వాటినన్నింటిని తన రచనల్లో పొందుపరిచాడు. అసంఖ్యాకంగా వ్యాసాలు, కథలూ రాస్తూ పోయాడు. నిజానికి ఒక్క కవిత్వం తప్ప ఆయన రాయని ఆధునిక సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు.
ఆయన రచనల్లోని సూటిదనం, వ్యంగ్యం, నిర్మోహమాటం పాఠకుల గుండెలకు నేరుగా తాకుతాయి. మారదలుచుకున్న వాళ్ళకు చుక్కానిలాగా పనిచేస్తాయి. బండబారిన వాళ్ళకు కొరడా దెబ్బల్లా తాకుతాయి. మన సాహిత్యం అనే వ్యాసంలో ”ఆత్మగౌరవం కల జాతి తన కళలను ఎంతో అభిమానంతో చూసుకుంటుంది. మన కళల మీద మనకున్న అభిమానం చూస్తే మనకు ఆత్మగౌరవం ఏమీ లేదని స్పష్టమౌతుంది” అంటారు.
స్త్రీల మానసిక సంఘర్షణలను, ఆనాటి సమాజంలో స్త్రీలు పడుతున్న ఆగచాట్లను చాలా ఆర్తితో, గుండెలోతుల్లోంచి కొ. కు. రాయడం కన్పిస్తుంది. ‘ఆడజన్మ’ నవల్లో ”నువ్వు మా జీతం లేని నౌకరువు. నీది ఇరవై నాలుగ్గంటల నౌకరీ, శలవుల్లేవు నీకు, ఫిించను లేదు. నువ్వు చేతులు మారినా నీ నౌకరీ మారదు.” అంటారు. ఇంకోచోట ”నీకు ఆత్మజ్ఞానం లేకుండా, చదువూ విజ్ఞానమూ లేకుండా చేసి ఉంచింది దేనికనుకున్నావు. నీకు అడుగడుగునా అంకుశాలు దేనికనుకున్నావు? నిన్ను అబలగాను నీ కీర్తి లేత తమలపాకులకంటే సుకుమారంగానూ, నీ మార్గం కంటక భూయిష్టంగాను, నీ జీవితం ఒక అంతులేని అగ్ని పరీక్షగాను ఉంచింది దేనికనుకున్నావు” అంటారు కోపస్వరంతో. అలాగే సౖౖెరంధ్రి కథలో జానకి పాత్ర చిత్రణ, ఆ పాత్రను మలిచిన తీరు అమోఘం. ”నాలుగేళ్ళ భరించాను. ఇక చాలనిపించింది. ఒక రోజు చెప్పేసాను. నన్ను మీరు మెదడులేని ఆడగాడిద అనుకుంటున్నారో, ఊరందరితోను రంకు పోగల సాహసికురాలిననుకుంటున్నారో నాకు తెలియడం లేదు. నేను చిన్నతనంలో కుర్రాళ్ళతో మొగుడూ, పెళ్ళాం ఆటలు ఆడినదాన్నే” అంటూ మొగుడి ముఖంతోపాటు సమాజ ముఖాన్ని ఫెెడేల్మని తన్నినట్లు సమాధానం చెప్పింది. ‘యావజ్జీవ స్నేహం’ అనే అందమైన వాక్యాన్ని ఈ కధలోనే రాసారు.
అలాగే 1955 లో రాసిన ‘దాలిగుంటలో కుక్కలు’ ఆశయాలు వల్లిస్తూ, తనవరకు వస్తే ఆచరణలో ముఖం చాటేసే వాళ్ళ గురించిన కథ. సమ్మె చేస్తున్న ఒక కథలోని కూలీల పట్ల సానుభూతి వర్షం కురిపించి ”యజమానులను చంపినా పాపం లేదు” అంటూ రంకెలు పెట్టె మనుష్యులు, తమ బంధువుల పొలంలో పనిచేసే కూలీలు సమ్మె కడితే ”కూలీ లంజా కొడుకులు సమ్మె చేస్తున్నారు.” అంటూ విరుచుకు పడుతూ ”పోలీసుల్ని పిలిపించి, పికెటింగు చేసేవాళ్ళని మిల్లు ముందు నుంచి వెళ్ళగొట్టించి, కొత్త కూలీల్ని తెచ్చుకోలేకపోయావా” అంటూ సలహాలిస్తారు. ఒకటిన్నర పేజీల ఈ కథలో ఆశయాలకి, ఆచరణకి మధ్య వున్న అగాధాన్ని, మనుష్యులు ఎంత తేలికగా ఆశయాలు వల్లించి తనదాకా వస్తే ఎలా జారిపోతారో అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది.
చివరగా ‘ఆడ బ్రతుకే మధురం’ కధలోని ఓ పదునైన వాక్యంతో నేను ముగిస్తాను. 1947లో రాసిన ఈ చిన్న కథ ఆనాటి స్త్రీలకే కాదు ఈనాటి స్త్రీలకి కర్తవ్య బోధ చేయడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ని మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయే. ఎవరు పడతారమ్మా దెబ్బలూ, తిట్లూను.” చిన్నపిల్ల అంతరంగంలోంచి వుబికి వచ్చిన ఈ మాటలు, తిట్లూ, తన్నులూ తింటూ హింసాయుత జీవితాల్లో మగ్గుతున్న ఈనాటి స్త్రీల చెవిన పడితే ఎంత బావుండు.
ఆత్మగౌరవాన్ని ప్రోది చేసే, ఆత్మవిశ్వాసాన్ని అంతరంగం నిండా నింపే కొ.కు రచనలు ఈనాటి సమాజానికి ఎంత అవసరమో ఆయన రచనల్ని మళ్ళీ చదువుతున్నపుడు మరింతగా అర్ధమైంది. కొ.కు ప్రత్యేక సంచికను తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.
మా ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ, ఈ సంచిక రూపకల్పనలో, రచనలు సేకరణలో సహకరించిన సహసంపాదకురాలు శాంతసుందరికి అభినందనలు చెబుతూ అలాగే విరసం ప్రచురించిన సంకలనాల్లోంచి కొన్ని రచనలను పునర్ముృదించుకోవడానికి అంగీకరించిన కృష్ణాబాయిగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్‌వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రత్యేక సంచికపై స్పందించాల్సిందిగా పాఠకుల్ని అభ్యర్ధిస్తూ…

Tuesday, October 20, 2009

''బెల్‌ బజావో''-గంటకొట్టండి


కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3' నివేదిక ప్రకటించింది. ఈ రిపోర్టు వెల్లడించిన కొన్ని అంశాలు -ముఖ్యంగా దేశంలో గృహహింస బాధిత స్త్రీల సంఖ్యను చూస్తే చాలా బాధాకరంగా, ప్రమాదకరంగా వుంది. నిరక్షరాస్యత, అభివృద్ధి లేమికి ొమారుపేరైన బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. బీహార్‌లో 50 శాతం మందికి పైగా నిత్యం భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే -3 నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి. బీహార్‌లో 59 శాతం మంది కుటుంబ హింసకు గురవుతున్నారు. 19 శాతం మంది లైంగిక హింసకు బలవుతున్నారు.
మహిళలపై గృహహింసలో జాతీయ సగటు 37శాతం
ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే 14శాతం మంది భౌతిక హింస, 35 శాతం మంది లైంగిక హింసను అనుభవిస్తున్నారు.
గృహహింసలో అగ్రస్థానం బీహార్‌ అయితే అట్టడుగు స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ (6%)వుంది. నిరక్షరాస్యతకు, హింసకు దగ్గర సంబంధముందని ఈ నివేదిక పేర్కొంటూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న పురుషులలో 60శాతం మంది అక్షర జ్ఞానం లేనివారేనని తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంొటూ స్త్రీలు బతుకులు వెళ్ళదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. కోట్ల సంఖ్యలో స్త్రీలు, గృహహింసనుండి రక్షణ చట్టం వచ్చిన తరువాత కూడా హింసకు గురవ్వడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతాయె అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో అగ్రస్థానం సంపాదించిన బీహార్‌లో ఈ రోజుకీ రక్షణాధికారుల నియామకం జరగలేదు. గృహహింస చట్టం అమలు చేయమని, రక్షణాధికారులను నియమించమని ఒక న్యాయవాది శృతిసింగు పాట్నా హైకోర్ట్‌లో ప్రజా ప్రయెజనాల వ్యాజ్యం దాఖలు చెయ్యల్సి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో వుంది. వివిధ ఎన్‌.జి.వోలు ఈ చట్టం అమలు విషయమై పట్టుదలతో పనిచేయడంవల్ల పూర్తిస్థాయి రక్షణాధికారుల నియమకం జరిగింది. బాధిత స్త్రీలు వీరి ద్వారా కోర్టులో కేసులు వేయగలుగుతున్నారు. హింసాయుత జీవితాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టం గురించిన అవగాహన, చైతన్యం ఇంకా చాలా మందికి లేదు. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్నయితే తెచ్చింది కానీ ఎలాటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేపట్టి వుంటే కొంతమంది మహిళలైనా చట్ట సహాయంతో హింసాయుత బతుకుల్లోంచి బయటపడగలిగేవారు.
నిజానికి భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కన్నా గృహహింస వల్ల ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికీ హెచ్‌ఐవి నిరోధక ప్రచారం కోసం ప్రభుత్వాలు కోట్లాది రపాయలు ఖర్చు చేస్తున్నాయి. గృహహింస అంశాన్ని ప్రభుత్వం హెచ్‌ఐవి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేయల్సి వుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రచారం ప్రారంభమౌతున్న సూచనలు కన్పించడం సంతోషదాయకం. అలాంటి ఒక ప్రచారానికి సంబంధించినదే ''బెల్‌ బజావో'' కార్యక్రమం. నాకు తెలిసి మొట్ట మొదటి సారిగా కేంద్ర శిశు సంక్షేమశాఖ, బ్రేక్‌ త్ర అనే అంతర్జాతీయంగా పనిచేసే ొమానవ హక్కుల సంస్థ కలిసి బెల్‌ బజావో ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టాయి.
ఈ ప్రోగ్రామ్‌ కింద రెండు వీడియెలను వీరు రూపొందించారు. వీటి ద్వారా గృహహింస మీద మౌనంగా వుండొద్దు అని చెప్పదలిచారు. ముఖ్యంగా ఈ రెండు వీడియెలు బాలురను, పురుషులను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఒక దానిలో ఒక మొహల్లాలో క్రికెట్‌ ఆడుకుంటున్న మగపిల్లలు, ఒక ఇంట్లో భర్త తలుపులు మూసి భార్యను కొట్టడం, ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఏడ్వడం వింటారు. వెంటనే వారు ఆట ఆపేసి, ఆ ఇంటికెళ్ళి, కాలింగు బెల్‌ కొడతారు. హింసిస్తున్న భర్త బయటకొచ్చి ఏంటి అని అడుగుతారు. బాల్‌ పడింది మీ ఇంట్లో అంటారు పిల్లలు. నిజానికి బాల్‌ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. అప్పటికి ఆ ఇంట్లో హింస ఆగుతుంది. ఇంకో వీడియెలో పక్కింట్లో, భార్యను కొడుతున్న భర్త, బిగ్గరగా ఏడుస్తున్న భార్య. పక్కింటాయన లేచి వెళ్ళి బెల్‌ కొట్టి కొన్ని పాలు ఇస్తారా అని అడుగుతాడు. భర్త లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కూడా అప్పటికి తాత్కాలికంగా హింస ఆగుతుంది.
ఈ చిన్న వీడియెలు అందిస్తున్న సందేశం అద్భుతంగా వుంది. ఇంతకాలం గృహహింస అనేది వ్యక్తిగత వ్యవహారమని, బయటవాళ్ళు కల్గించుకూడదనే అపోహని ఇవి బద్దలు కొట్టాయి. ముఖ్యంగా పురుషుల్ని, మగపిల్లల్ని చైతన్యవంతం చేయడం ద్వారా గృహహంసను ఆపొచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. గృహ హింస సామాజికమైందని, ఇది వ్యక్తిగతంకాదని చెప్పడం ద్వారా సమాజం మొత్తం దీన్ని ఆపడానికి ఉద్యమించాలని చెప్పక చెప్పారు ఇందులో. ఈ సందేశాన్ని అంటే 'బెల్‌ బజావో' గంట కొట్టండి, లేదా ''మూసిన తలుపుల్ని కొట్టండి'' అంట ఒక వాహనం రూపొందించి దేశవ్యాప్త ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నమని చెప్పాలి. అందుకే నేను మీ అందర్ని కోరుతున్నాను మిత్రులారా? గృహహింసను ఆపడానికి మూసిన తలుపుల్ని తెరిపించండి. గంటకొట్టండి హింసను ఆపడంలో మీొరూ భాగస్వాములు కండి.

Wednesday, October 14, 2009

భూమిక స్నేహ హస్తం


ఈనాడు ఆదివారం లో వచ్చిన వ్యాసం.

భర్త సాధింపులు, అత్తమామల వేధింపులు, ఉద్యోగంలో ఒడుదొడుకులు...సమస్య ఏదైనా కానీ పరిష్కార దిశలో మహిళలకు ఆసరాగా నిలుస్తోంది 'భూమిక' హెల్ప్‌లైన్.

1800 425 2908


స్త్రీవాద పత్రిక 'భూమిక' నిర్వహిస్తోన్న హెల్ప్‌లైన్ నెంబర్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది టోల్‌ఫ్రీ నెంబరు. ఒక్క ఫోన్‌కాల్‌తో మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు వీరు. చదువు, ఉద్యోగం, గృహహింస, చట్టపరమైన చిక్కులు, మానసిక ఇబ్బందులు... ఇలా అన్ని రకాల సమస్యల నుంచి స్త్రీలకు విముక్తి కలిగించేందుకు ఈ హెల్ప్‌లైన్ సాయపడుతోంది.

15 ఏళ్లుగా స్త్రీ అభ్యుదయానికి అక్షరసాయం చేస్తున్న భూమిక 2006లో ఈ హెల్ప్‌లైన్‌ను వెుదలుపెట్టింది. 'చాలా మంది మహిళలు తమ సమస్యల్ని ఉత్తరాల ద్వారా భూమికకు తెలియజేసి సరైన దారి చూపమని అర్థించేవారు. అలాంటి వారికి సమాచారం లేదా పరిష్కారం దొరికే మార్గం చూపేవాళ్లం. ఎక్కువ మందిని ఆదుకోడానికి హెల్ప్‌లైనే సరైన మార్గమని భావించి ప్రారంభించాం' అని చెబుతారు భూమిక సంపాదకులు
కె.సత్యవతి. హెల్ప్‌లైన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం 'ఆక్స్‌ఫామ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది.

మాటే మంత్రం ఆమెది అత్తవారింట్లో నచ్చని పెళ్లి. భర్త లేని సమయంలో అత్తమామలు మానసికంగా శారీరకంగా హింసించేవారు. మూడేళ్లు అదే పరిస్థితి. కానీ ఒక్కసారైనా ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఓరోజు తలపై కట్టెతో కొట్టారు. రక్తం కారుతుండగా బయటకు పరుగుతీసింది. ఓ ఇంటి ముంగిట స్పృహతప్పి పడిపోయింది. ఆ సమాచారం భూమికకు అందింది... నిమిషాల్లో 108తో పాటూ ప్రొటెక్షన్ ఆఫీసర్ అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పూర్తయిన తర్వాత రక్షణ గృహంలో ఆశ్రయం కల్పించారు. కొన్నాళ్లకు అత్తమామలతోపాటు భర్తకు కౌన్సిలింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి భార్యాభర్తలు సుఖంగా జీవించడం వెుదలుపెట్టారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. కాస్త అటూ ఇటుగా ఇలాంటి నేపథ్యంతో భూమిక దృష్టికి వచ్చే కేసులు నెలలో అయిదు వరకూ ఉంటాయి.

ఆలుమగల మనస్పర్థల పరిష్కారానికీ భూమిక వేదికగా నిలుస్తోంది. తమ బాధలు పంచుకోడానికి ఎవరూ లేరని ఫోన్ చేసేవారూ, ఉన్న వాళ్లెవరూ తమని పట్టించుకోవడం లేదని చెప్పేవారూ... రోజులో పది మందైనా ఉంటారు. సమస్యను చెప్పుకోడానికీ, బాధను పంచుకోడానికీ ఓ ఆత్మీయ నేస్తం కావాలి... అది భూమిక రూపంలో వాళ్లకి దొరికింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలపాటు గొంతులో దాచుకున్న బాధ
ఒక్కసారి బయటకు వస్తుంది. 'ఫోన్ చేసినవారి మాటల్ని చాలా ఓపికతో వింటాం. ఒక్కోసారి గంటకు పైగానే మాట్లాడతారు. అయినా మేం విసుగుచెందం. అన్నీ విన్నాక సలహా లేదా సూచన చెబుతాం. తుది నిర్ణయం వారిదే. ఒక నిర్ణయానికి వచ్చాక సమస్య పరిష్కారానికి మా వంతు సాయం చేస్తాం' అని చెబుతారు భూమిక ప్రతినిధులు.

ఎల్లలు దాటి


రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి వీరికి ఫోన్‌లు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళల సమస్యల పరిష్కారానికి వీరిని ఆశ్రయించేవారు ఎక్కువ. అమెరికాలోని దక్షిణాసియా దేశాల మహిళల బాగోగులు చూసే 'మానవి' స్వచ్ఛంద సంస్థ తెలుగువారి సమస్యల పరిష్కారానికి భూమిక సాయం తీసుకుంటోంది. ఉద్యోగాల ఆశతో వెళ్లి విదేశాల్లో వోసపోయిన వారు స్వదేశం చేరుకోడానికీ వీరే దిక్కు. హెల్ప్‌లైన్ సేవలు జిల్లాలకూ విస్తరించాలనే భూమిక లక్ష్యం ఇపుడు నెరవేరింది. భూమిక స్ఫూర్తిగా ప్రభుత్వం ఇందిర క్రాంతిపథం సభ్యులచేత ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తోంది. వీరంతా భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపు పది జిల్లాల్లో ఇప్పటికే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాలకు చెందిన వారు శిక్షణలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకూ అధికారుల ఫోన్ నెంబర్లూ వారి దగ్గర సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రంలో ఏ మూలనుంచి సమస్య వినిపించినా తక్షణ పరిష్కారం కోసమే

ఈ ఏర్పాట్లు. బాధితులు ఆయా జిల్లాల్లో ఉండే మానవహక్కుల సంఘాలు, లోక్ అదాలత్, మహిళా కమిషన్ ద్వారా లబ్ధిపొందడానికీ సాయపడతారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100 మంది వరకూ భూమిక వాలంటీర్లు ఉన్నారు. వీరిలో మహిళా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలకి చెందిన వారు ఎక్కువ. న్యాయ సంబంధ సలహాల కోసం ప్రతి శనివారం న్యాయవాదితో ఫోన్‌లో ప్రత్యక్షంగా మాట్లాడే వెసులుబాటు ఇటీవల ప్రారంభించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిత్యం ఉండనే ఉంటుంది. సమస్యల వలయంలో చిక్కుకుపోయి అల్లాడే మహిళలను అందులోంచి బయటపడేలా చేయడంలో 'భూమిక' హెల్ప్‌లైన్ కీలక భూమిక వహిస్తోందనడంలో సందేహం లేదు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...